Wednesday, September 7, 2011

అస్తిత్వ పోరాటం విముక్తి కోసమే - దుడ్డు ప్రభాకర్ Andhra Jyothi 09/13/2010


అస్తిత్వ పోరాటం విముక్తి కోసమే

- దుడ్డు ప్రభాకర్

రంగనాయకమ్మ అస్తిత్వాలపై తన అభిప్రాయాన్ని స్పష్టం గా ప్రకటించనందువల్ల చర్చంతా అష్టవంకర్లు తిరుగుతూవుంది. చివరకు వ్యక్తిగత దూషణలు, ఆరోపణల వరకొచ్చింది. ఆమె ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే)ను అభినందిస్తూనే అస్తిత్వ ఉద్యమాలపట్ల తనకున్న తిరస్కార స్వభావాన్ని ప్రకటించారు. అంతటితో ఆగకుండా 'అస్తిత్వాలను తిరస్కరించాలనే అంశాన్ని కూడా మీ లక్ష్యంలో చేర్చలేదంటే, మీ లక్ష్యంలో అది కూడా ఒక భాగంగా లేదంటే ఉన్నదంతా అస్తిత్వాన్ని నిలిపివుంచుకోవాలనే అర్థాన్నే ఇస్తుంది' అని వారి లక్ష్యాలకు పెడార్థం ఆపాదించారు.

ఇంకా 'అస్తిత్వాన్ని తీసివేయడం గురించి, మనుషుల మధ్య తేడాలు లేని సమాన పరిస్థితుల గురించి ఆలోచించాలనే దృష్టి కూడా మీ సభ్యులకు అందించేవిధంగా మీ లక్ష్య ప్రకటన లేద'ని విమర్శించారు. భూస్వామి అస్తిత్వం, పెట్టుబడిదారుడి అస్తి త్వం, పురుషుడి అస్తిత్వం అంటూ అసలు అస్తిత్వానికే అస్తిత్వం లేకుం డా చేసే ప్రయత్నం చేశారు.

వర్గవ్యవస్థకు సంబంధించిన భూస్వామ్య, పెట్టుబడిదారి అస్తిత్వాలను పితృస్వామిక స్వభావాన్ని సంతరించుకున్న స్త్రీ అస్తిత్వాన్ని, వర్ణవ్యవస్థకు సంబంధించిన కుల అస్తిత్వాన్ని ఒకే గాటనకట్టి పాఠకులను గందరగోళపరచారు. చర్చలో పాల్గొంటున్న రెండు శిబిరాల/వ్యక్తుల అసలు ఉద్దేశ్యాలు, లక్ష్యాలు ఏమైవుంటాయి? అనే విషయాలతోపాటు ప్రరవే గురించి కూడా ప్రజలకు అర్థమయ్యే విధం గా చర్చ జరగాల్సివుంది. కానీ అలా జరగడంలేదు.

అస్తిత్వ ఉద్యమాలకు ప్రాధాన్యతనిస్తుందని ప్రకటించుకున్న ప్రరవే, భారతదేశంలో పితృస్వామ్యం, కుల, మత, లింగ, ప్రాంత, అస్తిత్వ స్వరూప స్వభావాలతో పెనవేసుకుందని నమ్ముతున్న ప్రరవే రంగనాయకమ్మ లేవనెత్తిన అనేక ప్రశ్నలకు సమాధానం చెప్తుందని ఆశించాను. కానీ వేదిక అధ్యక్ష, కార్యదర్శులపేరున ప్రచురితమైన సుదీర్ఘ సమాధానంలో ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం లేదు.

సమాధానం చెప్పకుం డా దాటవేయడానికి కారణాలేమైనప్పటికీ ఇంత జరిగిన తర్వాత ఇది రంగనాయకమ్మ, ప్రరవేకు సంబంధించిన విషయం కాదు గాబట్టి, 'ఆ ముగ్గురు నల్గురు'కి సంబంధించిందీ కాదు గాబట్టి నా స్పందన ఇది. రంగనాయకమ్మ వ్యాఖ్యానం మొత్తంగా దళిత అస్తిత్వ ఉద్యమాలను అవమానపరచేదిగా వుంది. ఒక మహిళ అయికూడా, మహిళలమీద అనేక పుస్తకాలు, నవలలు రాసిన రచయిత, దళిత మహిళల అస్తిత్వ పోరాటాలను తిరస్కరిస్తున్నారు.

ఆమే కాదు ఈ దేశంలో పీడిత ప్రజల పక్షాన పనిచేస్తున్నామంటూ కార్మిక, కర్షక పక్షపాతులుగా బాకాలూదుకుంటున్న వామపక్షాలు కులవివక్షను నిర్మూలించాలంటున్నారు. కుల అసమానతలు నిర్మూలించటం ద్వారా కులాన్ని నిర్మూలించే మౌలిక సామాజిక దృక్పథాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. అందుకే ఆయా కులా లు, జాతులు, మతాలు, మహిళలు తమకు తాముగా హరించివేయబడుతున్న తమహక్కులకోసం ఉద్యమిస్తున్నారు.

ఈ ఉద్యమాలను కూడా మార్క్సిస్టు పీఠాధిపతులు గుర్తించడంలేదు. 'అమ్మ పెట్టదు అడుక్క తిననియ్యదు' అంటే ఇదే. అస్తిత్వ పోరాటాలను కులనిర్మూలనకై వేసే అడుగుగా గుర్తించకపోవడం రంగనాయకమ్మ దృష్టిలోపానికి నిదర్శనమైతే పిడికెడు మంది పరిధిలను, పరిమితులను, దళారీ లక్షణాలను దృష్టిలో పెట్టుకొని అస్తిత్వ పోరాటాలన్నీ అస్తిత్వ స్థిరీకరణ కోసమే ననడం దారుణం.

ఈ దేశంలో అగ్రకుల, బ్రాహ్మణీయ భూస్వామ్య శక్తులు మార్క్సిజాన్ని 70, 80 ఏళ్లుగా తమ భవనాలలో బంధించి మహా మార్క్సిస్టులుగా చెలామణి అవుతున్నారు. అందుకే మార్క్సిజం ఇంతకాలంగా మెజారిటీ శ్రామికవర్గమైన పీడిత కులాల వాడల పొలిమేరలు కూడా తాకడం లేదు. అయినప్పటికీ మార్క్సిజాన్ని చదవలేని నిరక్షరాస్యులైన, శ్రమజీవులైన దళిత, పీడిత కులాల ప్రజలు తమకు తాముగా ఉద్యమిస్తున్నారు.

వాళ్లు చేస్తుంది అస్తిత్వం కోసం పోరాటమే, కానీ ఆ పోరాటం దోపిడీవర్గంపై పోరాటంకోసం వేసే ఒక ముందడుగు కూడా. ఇన్నేళ్లుగా కాగితాల్లోనే మార్క్సిజాన్ని వల్లిస్తూ, కార్యక్రమంలో అగ్రకుల దోపిడీ వర్గాన్ని రక్షిస్తున్న అగ్రవర్ణ, అగ్రవర్గ అపర మార్క్సిస్ట్ పీఠాధిపతులకు ఏమాత్రం నిజాయితీ వున్నా శ్రామికవర్గమైన పీడిత కులాల ప్రజల ముందు మోకరిల్లి క్షమాపణలు కోరి ఆ అస్తిత్వ ఉద్యమాలను దోపిడీ వర్గంపై పోరాటంగా మలచుకోవాలి.

దళిత అస్తిత్వ ఉద్యమం అగ్రకుల దోపిడీ వర్గ బ్రాహ్మణీయ ఆధిపత్యశక్తుల నుండి విముక్తికై జరిగే పోరాటమే. దీన్ని గుర్తించకపోవడం అంటే అగ్రకుల, బ్రాహ్మణీయ, మనువాద దోపిడీని, అణచివేతను మరుగున పరచడమే. కులాన్ని మరపించి, వర్గాన్ని మెరిపించే ఈ అగ్రకుల మార్మి క మాయావాదం నుండి దళిత, బహుజనులు క్రమంగా బయటపడుతున్నారు. అందుకే అగ్రకుల మార్క్సిస్టులకు తమ పీఠాలు కదులుతాయని ఆందోళనగా వుంది. సామ్రాజ్యవాదులకు వారి ఏజెంట్లకు గుబులుపట్టుకుంది.

దళిత సమస్య పరిష్కారానికి అంబేద్కర్ చాలడు, బుద్ధుడు చాలడు, మార్క్స్ కావాలి అని 366 పేజీల గ్రంథం రాసిన రంగనాయకమ్మకు నిజానికి దళిత సమస్య ఏంటో తెలియదు. అంటరానితనమంటే ఏమి టో తెలియదు. అది ఎంత భయంకరంగా వుంటుందో కనీసం ప్రత్యక్షంగా చూసైనా వుండరని అస్తిత్వాలపై ఆమె సందేశపాఠం విన్నాక అర్థమయ్యింది. పిడుక్కి, బియ్యానికి ఒకే మంత్రం అన్నట్లు ఈమె సాంప్రదాయక మార్క్సిజాన్ని వల్లెవేస్తుంది.

ఏ మాత్రం ప్రశ్నించామా! ఇక అం తే. మార్క్సిజాన్ని వ్యతిరేకించినట్లే. మార్క్స్‌ను తిరస్కరించినట్లే. ఇదొక రకమైన బ్లాక్‌మెయిలింగ్ ధోరణి. ఆ పుస్తకంతో, ఆమెపై దేశవ్యాపితంగా దళితుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అగ్రకుల మార్క్సిస్టుల నుండి ప్రశంసల జల్లూ కురిసింది. సరిగ్గా ఆమెకు కావలసిందీ అదే. మార్క్సిజానికి దళితుల్ని ఇంకా దూరంగా నెట్టడంలో ఆమె సక్సెస్ అయ్యారు.

అంబేడ్కర్, బుద్ధుడు, మార్క్స్‌కి పోలికపెట్టి రాయడంలోనే ఆ కుట్ర వుంది. అంటరాన్ని వాళ్లని అగ్రకుల పెత్తందార్లు సమాజానికి దూరంగా నెట్టేస్తే, అస్తిత్వ ఉద్యమాలు చేస్తూ అస్తిత్వ స్థిరీకరణను కోరుకునే స్వార్థపరులుగా, మార్క్సిజానికి అడ్డంకిగా రంగనాయకమ్మ లాంటి అగ్రకుల అద్దాలు పెట్టుకున్న మార్క్సిస్టులు దళితుల్ని చులకన చేస్తున్నారు.

పేరు చివర రెడ్డి, చౌదరి, నాయుడు, వర్మ, శర్మ, శాస్త్రి లాంటివి తీసేసుకొని ఆదర్శవంతులుగా, అభ్యుదయ భావాలు కల్గినవారిగా కీర్తించబడుతున్న రంగనాయకమ్మ లాంటి వాళ్లు ఆధునిక మనువాద మాయాజాలంలో పేరు చివరన మాదిగను తగిలించుకోవడం చూసి తమ బతుకులు ఇలాగే వుండాలని మాదిగలు అనుకుంటున్నారని అనుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.

తరతరాలుగా కులం పేరుతో ద్వేషించబడుతూ, కులం చెప్పుకోవడానికే భయపడి బిక్కుబిక్కుమంటూ అగ్రకుల గద్దల మధ్య కోడిపిల్లల్లా నక్కినక్కి బతికిన జనం నేను మాదిగని, నేను మాలను, చాకలిని, మంగలిని అని చెప్పుకోవడం అగ్రకుల బ్రాహ్మణీయ సమాజంపై విసిరిన ఒక ధిక్కారపు సవాల్? మనువాదుల గుండెలపై నిలబడి వేసిన దండోరా! అది అర్థం కావాలంటే ఆయా కులాల ప్రజల గుండెల్లోకి తొంగిచూడాల్సిందే.

అది చేతగానివారికి, ఇష్టంలేనివారికి పేరు చివర కులం తగిలించుకోవడం బ్రాహ్మణత్వ సమాజానికి పట్టిన బూజు వదిలించడానికన్న విషయం అర్థం కాదు. రాజ్యాంగంలో పీడిత కులాలకు పొందుపరచబడిన హక్కుల్ని అడగడం అంటే కులాన్ని అలా గే వుంచుకొనే ప్రయత్నం కాదు. సకల సంపదల సృష్టికర్తలు, శ్రమజీవులు అయిన దళితుల్ని, ఆదివాసీలను సంపదనుండి, విద్య నుండి, అధికారం నుండి దూరం చేసిన పరాన్నభుక్కులు, దోపిడీదారుల నుండి తమకు రావాల్సిన వాటాను రాబట్టుకోవడం.

ఆర్థికంగా, సామాజికం గా, రాజకీయంగా ముందుకు నడిచే ప్రయత్నం. అదే పీడిత కులాల విముక్తికి మార్గమని దళితులు అనుకోవడంలేదు. అవి సక్రమంగా అమ లు చేయాలని పోరాడ్డం అంటే కులాలను వదులుకోలేకపోవడం కాదు. దళితుల జీవితాలలో ఆ మాత్రం మార్పుని కూడా సహించలేక నిందలు వేయడం రంగనాయకమ్మ లాంటివారికి తగదు. తరతరాలుగా కులం ద్వారా సామాజిక హోదా, గౌరవం, సంపద అనుభవిస్తున్న కొందరు స్వయం ప్రకటిత ఆదర్శవాదులు కులం పేరును సర్టిఫికేట్లలో, జనాభా లెక్కల్లో ప్రస్తావించవద్దు అంటున్నారు.

కుల ప్రస్తావనే తేవద్దు అంటున్నారు. 'కులం పేరెత్తితే చెప్పు తీసుకొని కొట్టండి' అని ప్రచారం చేస్తున్నారు. ఆ విధంగా అయితేనే కులనిర్మూలన సాధ్యం అంటున్నారు. ఈ వాదన అగ్రకుల పాలకవర్గ శక్తుల కుటిల ఎత్తుగడలకు పరాకాష్ఠ. దళిత, పీడిత కులాల ప్రజలు అగ్రకుల హిందూత్వ దాడుల నుండి తమను తాము రక్షించుకోవడానికి, తమ హక్కులు సాధించుకోవడానికి కులాల పేరుతో సమీకృతమౌతున్న ప్రస్తుత సందర్భంలో వీళ్ల ఐక్యతను సహించలేకనే ఇలాంటి వాదనలు ముందుకు తెస్తున్నారు.

రంగనాయకమ్మ దళిత మహిళ అస్తిత్వం గురించి అనేక సందేహాలు వ్యక్తంచేశారు. అనేకానేక అస్తిత్వాల కోసం దళిత మహిళ జీవితమే పోరాటంగా బతుకుతుంది. అగ్రకుల, పురుషాధిక్య, మనువాద భావజాలం కలిగిన మహిళా నాయకురాళ్లు అస్తిత్వాల గురించి తెలుసుకోవాలంటే ముందు ఏ.సి. గదుల నుండి బయటపడాలి.

గ్రామాల కెళ్లాలి. అక్కడ వెలి వాడల్లోని అంటరాని తల్లి గుండె చప్పుడు వినాలి. అప్పుడే ఏది మౌలికమో,ఏది ప్రధానమో, ఏది అప్రధానమో, ఆ తల్లి చేస్తున్న అస్తిత్వ పోరాటాలు అస్తిత్వ స్థిరీకరణ కోసమో, విముక్తి కోసమో అర్థమౌతుంది.

మనదేశంలో అగ్రకులాల మహిళలు కమ్యూనిస్టు ఉద్యమాల ద్వారా చైతన్యవంతమయ్యారు. మహిళా సంఘాలుగా ఏర్పడ్డారు.పురుషాధిక్య భావజాలానికి, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడారు. ఇప్పటిదాకా మనదేశంలో జరిగిన మహిళా ఉద్యమాలు మెజారిటీగా పితృస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగినవే. ఆ మహిళల సమస్యలే దేశంలోని మహిళలందరి సమస్యలుగా ప్రచారం జరిగింది.

18వ శతాబ్దంలో కేవలం ఒక శాతం కూడా లేని బ్రాహ్మణ మహిళల సమస్య అయిన సతీసహగమనం, బాల్యవివాహాలు, వితంతు వివాహాలు ఈ దేశంలో మహిళల ప్రధాన సమస్యలుగా వున్నాయి. వాటి గురించి మాట్లాడిన వారు, వాటి నివారణకు కృషి చేసినవారు మహనీయులుగా ప్రపంచవ్యాపితంగా కీర్తి ప్రతిష్టలందుకున్నారు. అయితే నాటి నుండి నేటి వరకు వ్యవస్థీకృతంగా కొనసాగుతున్న జోగినీ దురాచార నిర్మూలనకు కృషిచేసిన వారికి కనీసం గుర్తింపు లేకపోవడం, జోగినీ దురాచారం నేటికీ నిరాటంకంగా కొనసాగడం అత్యంత విషాదకరం.

ఈ దేశంలో పితృస్వామ్యం మనువాద పితృస్వామ్యంగా ప్రత్యేక స్వభావాన్ని సంతరించుకుందనే విషయాన్ని మహిళా ఉద్యమాలు విస్మరించాయి. అందుకే దళిత మహిళలు మహిళా ఉద్యమాలలో మమేకం కాలేకపోయారు. నేటికీ గ్రామాలలో అగ్రకులాధిపత్య శక్తులు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడంకోసం,దళిత యువకుల ఆత్మగౌరవాన్ని దెబ్బ దీయడానికి దళిత మహిళలపై అత్యాచారాలు చేయడం ఒక కార్యక్రమంగా ఎంచుకుంటున్న దుర్మార్గమైన చర్యల్ని చూస్తూనే వున్నాం.

ఖైర్లాంజి, వాకపల్లి, భల్లుగూడ సామూహిక అత్యాచారాలపై ఏ పాటి నిరసన వ్యక్తమయ్యిందో చూశాం. ఇంకోవైపు చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌కోసం ఎన్ని గొంతులు గర్జించాయో, మీడియా ఎంతగా స్పందించిందో కూడా చూశాం. కాబట్టి జనాభాలో సగభాగమైన స్త్రీలంతా ఒకటి కాదు. వాళ్ల సమస్యలూ ఒకటి కాదు.

వాటిపట్ల సమాజం స్పందిస్తున్న తీరూ ఒక్కటిగా లేదు. అందుకే ఆ స్త్రీలు వారి వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్నారు. వాటన్నిటినీ ఆహ్వానించాల్సిందే. గుర్తించాల్సిందే. ఆ అస్తిత్వాలన్నిటికీ దామాషా పద్ధతి మీద చోటు కల్పించాల్సిందే. అంతటితో ఆగిపోకుండా ఆయా సమస్యలను ప్రత్యక్షంగా అనుభవిస్తూ వాటి పరిష్కారం కోసం పోరాడుతున్న మహిళా సమూహాల్ని, ప్రధాన మహిళా ఉద్యమ స్రవంతిలో భాగం చేసుకోవాలి.

అలా కాకుంటే ఈ దేశ స్త్రీవాదం అగ్రకుల ఆదర్శ స్త్రీవాదంగా చలామణి అవుతూనే వుంటుంది. రంగనాయకమ్మ లాంటివారు పాఠాలు చెబుతూనే వుంటారు. అన్ని అస్తిత్వ పోరాటాలను సమీకృతం చేస్తూ అగ్రకుల మనువాద పితృస్వామిక భావజాలానికి వ్యతిరేకంగా పోరాడే మహిళా ఉద్యమాలకు మనవంతు సహకారాన్ని అందిద్దాం. నూరు పూలు వికసించనీ.. వేయి ఆలోచనలు సంఘర్షించనీ..

- దుడ్డు ప్రభాకర్
అధ్యక్షులు, కులనిర్మూలనా పోరాట సమితి
99595 67818

No comments:

Post a Comment