Monday, September 26, 2011

విభజన సీమాంధ్రకే మేలు -కారుమంచి కృష్ణ చైతన్య Andhra Jyothi 27/09/2011


విభజన సీమాంధ్రకే మేలు

-కారుమంచి కృష్ణ చైతన్య

'దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్' అన్న గురజాడ మాటలను మనం సరిగ్గా అర్థం చేసుకున్నామా? రాష్ట్ర విభజన అంటే మట్టి విభజనే కానీ మనుషుల విభజన కాదు కదా. ఇన్ని సంవత్సరాలుగా కలసివున్నా సఖ్యత కుదరలేదు. అందువల్ల సమైక్యతా లేదు. సఖ్యత లేని సమైక్యత ఆధిపత్యమే అవుతుంది కాని నిజమైన సమైక్యత కాదు.

పెట్టుబడిదారులకు లాభాపేక్ష తప్ప ఆత్మ గౌరవం ముఖ్యం కాదు. వారు సమైక్య మన్నా జాతీయ జెండా భుజాన వేసుకుని జాతీయ వాదమన్నా దాంట్లో వారి లాభాపేక్ష దాగి ఉంటుంది. కావున వారు విభజనను తమ స్వభావరీత్యా వ్యతిరేకిస్తారు . అయితే గత కొన్నేళ్లుగా 'జాగో-భాగో', 'మొత్తం సీమాంధ్రులు అంతా వలసవాద దోపిడీదారులు' అని, 'అడ్డమొస్తే నరుకుతామని, తరుముతామని'.. ఇలా పలురకాలుగా తెలంగాణ వాసులు తమ అయిష్టతను వ్యక్తం చేస్తున్నారు. సీమాంధ్రులను బాహాటంగా చీదరించుకొంటున్నారు.

ఇలా సీమాంధ్రుల ఆత్మగౌరవానికి సవాళ్లు విసురుతూ ఉంటే , ఏమైనా ఫరవా లేదు, మీరు తిట్టినా, కొట్టినా నిస్సిగ్గుగా ఇంకా కలిసే ఉండాల అని మనం (సామాన్య సీమాం ధ్రులు) వాదిస్తే మనకంటూ ఒక ఆత్మగౌరవం ఉన్నట్టా? లేనట్టా? ఈ సందేహం సహజంగానే కలుగుతుంది. తెలంగాణ వాళ్ళు అన్నట్టు మనమందరం ఆత్మగౌరవం లేని వాళ్ళుగా అంటే పెట్టుబడిదారులు, దోపిడీదారులు, వలసవాదులుగా మిగిలిపోవాల్సినదేనా? ఇంతకీ విభజన జరిగితే మనకొచ్చే నష్టం ఏమిటి? మనం ఆలోచించాల్సిన అవసరం లేదా? జాగ్రత్తగా ఆలోచించి, ఖచ్చితమైన ప్రతిపాదనలు ముందుంచి అది విభజనకు అంగీకరిస్తే సీమాంధ్రకు లాభమే కాని నష్టం వాటిల్లదు.

విభజన జరిగితే నదీజలాల సమస్య తలెత్త గలదని సీమాంధ్రలో అనుమానాలు ఉన్న మాట వాస్తవం. అయితే తెలంగాణ విడిపోతే సీమాంధ్రకు అసలు నీళ్ళు రావని అనడం రాజకీయం కాని వాస్తవం కాదు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు నదీ జలాలను పంచుకొంటున్నాయి. ఉదాహరణకు నైలు నదీ జలాలను పదకొండు దేశాలు వాడుకొంటున్నాయి.

మన దేశంలో గంగ, గోదావరి, నర్మద, కృష్ణ , కావేరీ నదీ జలాలను పలు రాష్ట్రాలు పంచుకుంటున్నాయి. నదీ జలాల పంపకాలపై అంతర్జాతీయ, జాతీయ చట్టాలు ఉన్నాయి. ఆ ప్రకారంగానే రేపు, కృష్ణా, గోదావరి నదీజలాలను తెలంగాణ, సీమాం ధ్రు ల మధ్య పంపకం చేయవచ్చు. అయితే ఇక్కడ సమస్యలేమీ ఉండవని అర్థం కాదు. సమస్యలు ఉంటాయి. కానీ వాటి పరిష్కారానికి మెరుగైన మార్గాలను ఎంచుకోవడంలో చాకచక్యత చూపించాలి.

ఉదాహరణకు ప్రస్తుతమున్న ట్రిబ్యునల్ వ్యవస్థ లోని లోపాలను సరిదిద్దే ఆలోచనలు చేయాలి. నదీజలాల సమస్య జాతీయ సమస్యకాబట్టి ఒక రాజ్యాంగ/ చట్ట బద్ధ జాతీయ నదీజలాల అథారిటీని పార్లమెంటు ద్వారా ఏర్పాటు చేయాలి; దానికి సంపూర్ణ అధికారాలు ఇచ్చి దేశంలోని నదుల నీటిని పంచే బాధ్యతను అప్పగించాలి. ఈ పంపకంలో రాష్ట్రాల ప్రమేయం లేకుండా చేస్తే నదీజలాల సమస్యలు తీరే అవకాశం ఉండవచ్చు. కావున వీటికి సంబంధించిన నిర్దిష్టమైన ప్రతిపాదనలు పెట్టాలి.

హైదరాబాద్ నగరం నేడు సీమాంధ్ర విద్యావంతులకు ప్రధాన మజిలీగా మారింది. ఇందులో సందేహం లేదు. విభజన జరిగితే ఈ సౌలభ్యం చేజారుతుంది అనుకోవడం ఒక అపోహ మాత్రమే. చదువుకున్న, నైపుణ్యత కలిగిన యువతకు నేటి ప్రపంచీకరణ నేపథ్యంలో మజిలీలు దేశ విదేశాలలో చాలా ఉన్నాయి. అంత మాత్రాన వాటిపై రాజకీయ ఆధిపత్యం కోరుకోవడం లేదే!

మరి ఒక్క హైదరాబాదు పైనే ఎందుకు? హైదరాబాదును మనమే (సీమాంధ్రులు) అభివృద్ధి చేసినాము అనడం కూడా రాజకీయమే కాని చారిత్రక వాస్తవం కాదు. హైదరాబాద్‌లో వివిధ రాష్ట్రాల, దేశాల వారు పెట్టుబడులు పెట్టి వారి వ్యాపారాలు వారు చేసుకున్నారు. అలాగే సీమాంధ్ర పెట్టుబడిదారులు వ్యాపారులు కూడా. విభజన జరిగితే హైదరాబాదుపై సీమాంధ్రుల రాజకీయ పెత్తనం మాత్రమే పోవచ్చు కాని వ్యాపార నష్టం జరగదు. ఎందుకంటే సీమ్రాంధ్రుల పెట్టుబడి వ్యాపారాలు కేవలం హైదరాబాదుకు పరిమితం కాలేదు.

పలు రాష్ట్రాలలో, దేశాలలో (ఒక్క సీమాంధ్రలోనే అంతగా లేవు!) నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. వాస్తవంగా ఆలోచిస్తే నేటి ప్రపంచీకరణ నేపథ్యంలో ఒక అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకున్న హైదరాబాద్‌కు ఎప్పుడూ కూడా నైపుణ్యత కలిగిన సీమాంధ్ర, ఇతర రాష్ట్రాల యువతకు కూడా మజిలీగా కొనసాగే లక్షణాలు ఉన్నాయి. అవి కనుమరుగయ్యే అవకాశాలే లేవు. పోగా కొత్త సీమాంధ్ర రాష్ట్రం ఏర్పడితే కొంగొత్త అవకాశాలు (తెలంగాణకు సాధ్యం కాని) సీమ్రాంధ్ర యువతకు మెండుగా వస్తాయి.

రాష్ట్ర విభజన జరిగితే ప్రస్తుతం హైదరాబాదు ఇతర తెలంగాణ ప్రాంతాలలో ప్రభుత్వ రంగంలో (ప్రైవేట్ రంగంలోని వారిని, కేంద్ర ప్రభుత్వరంగం వారిని, ఇతర స్వచ్ఛంద రంగాలవారిని ముట్టుకోవ డం కుదరదు) పనిచేస్తున్న సీమాంధ్ర వారినందరినీ వారి వారి ప్రాం తాలకు తరలిస్తారు అనడం ఆచరణ సాధ్యం కాదు. ఇప్పటికే అమలులో ఉన్న చట్టాల ప్రకారం వీరంతా స్థానికులు అయినారు. సీమాంధ్ర రాష్ట్ర నూతన రాజధానిని ప్రసుత్తమున్న ఏ సీమాంధ్ర నగరంలో ఏర్పాటు చేయరాదు.

ఇరు ప్రాంతాలకు అనుకూలంగా ఉండే ప్రాంతంలో నూతన రాజధాని నిర్మించాలి. తద్వారా కొత్త ప్రాంతంలో నిర్మాణ రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు ఉపాధి అవకాశాలు కూడా ఉత్పన్న మవుతాయి. ఇవన్నీ సీమాంధ్రులకే దక్కుతాయి. కొత్త రాజధానిలో కొత్త సచివాలయం, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు అవడం వల్ల మరల తెలంగాణ వారికి లేని కొంగొత్త ఉద్యోగ అవకాశాలు సీమాంధ్ర యువతకే లభ్యం కాగలవు. కొత్త రాజధాని నిర్మాణం పూర్తయ్యేవరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలి.

విభజన జరిగి కొత్త రాజధాని వస్తే దానిలో, సీమాంధ్రలోని ఇదివరకే అభివృద్ధి చెందిన నగరాలలో కొత్త పెట్టుబడులు వ్యాపారాలు మొదలయ్యే అవకాశాలు కూడా చాలా ఉండవచ్చు. అక్కడ ఏర్పడే కొత్త ప్రభుత్వ చొరవ, సంకల్పం, పనితనం, సామర్థ్యాలపై ( నిజానికి ఇవి సీమాంధ్రులు తలచుకుంటే అసాధ్యమైనవి కావు) ఇవి ఆధారపడే ఉంటాయి.

ఇవే కాకుండా తెలంగాణకు లేని ప్రకృతి వనరులతో కూడిన పొడవైనతీర ప్రాంతం సీమ్రాంధ్రకు ఉంది. ప్రపంచ అభివృద్ధి చరిత్రలో తీరప్రాంతాలు అభివృద్ధిచెందినంతగా భూపరివేష్టిత ప్రాంతాలు అభివృద్ధిచెందలేదు. ఇంతవరకు సీమాంధ్ర తీరప్రాంతం అభివృద్ధికి నోచుకోక పోవడానికి ఇక్కడి పాలకుల, పెట్టుబడిదారుల సంకల్ప లోపమే కారణం. కొత్త సీమాంధ్ర రాష్ట్ర ఏర్పాటు వీటిని అధిగమించే అవకాశాలను ఇస్తుంది.

రాయలసీమ అభివృద్ధి అంశానికి సంబంధించి ఈ ప్రాంతం ప్రస్తుత రాష్ట్ర ఇతర ప్రాంతాల కంటే వెనుక బడినది. రాజకీయంగా చూస్తే నీలం సంజీవరెడ్డి మొదలుకొని కిరణ్ కుమార్‌రెడ్డి దాకా రాష్ట్రానికి అత్యధిక ముఖ్య మంత్రులను అందించిన ప్రాంతం రాయలసీమే. ఇంతమంది దిగ్గజాలు ఉన్నా ఆ ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉండడానికి కారణం నాయకుల స్వప్రయోజనాలే. వాస్తవాలను పరిశీలిస్తే వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుకబడవేయబడ్డ ప్రాంతంగా చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ వున్న ఖనిజ సంపద ఇతర ప్రాంతాలలో లేదు. ఇక్కడ అపారమైన ఖనిజ వనరు లు, ఇనుము, యురేనియం, బంగారం, స్టెయటైటు, క్వార్జు, టన్గుస్ట ను, గ్రనేటు మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి ప్రకృతి ప్రసాదించిన వనరులే.

అయినప్పటికీ వీటిలో ఇక్కడి ప్రజల భాగస్వామ్యం, హక్కులు కోల్పోయి కేవలం ప్రయివేటు ప్రయోజనాలకే కొల్లగొట్టబడుతున్నాయి. అందువల్లనే ఇక్కడి రాజకీయ నాయకు లు అత్యంత ధనవంతులు కాగలుగుతున్నారు. ప్రజలు మాత్రం వారి భూస్వామ్య, ఫాక్షను రాజకీయాలకు బలి పశువులు అవుతున్నారు. కావున ఈ ప్రాంతం, ఇక్కడి ప్రజలు అభివృద్ధికి ఇక్కడి రాజకీయనాయకులు వారి సంకుచిత, స్వార్ధ రాజకీయాలే కారణం. ఇక్కడి ప్రజల రాజకీయ చైతన్య స్థాయి పెరిగి ఇక్కడి రాజకీయ నాయకులను, రాజకీయాలను ఎదుర్కొన్న నాడే ఈ ప్రాంతం బాగుపడగలదు.

సీమ్రాంధ్రలో సాధ్యం కాగల పైన తెలిపిన అవకాశాల గురించి ఆలోచించకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ చతురతో కూడిన ప్రతిపాదనలను ముందుంచకుండా, వాటిపైన చర్చించకుండా, కేవలం ఎప్పటికీ సఖ్యత ఒనగూరని సమైక్యరాగాలాపన చేయడం సీమాంధ్ర సామాన్యప్రజలకు (రాజకీయ నాయకులకు, పెట్టుబడిదారులకు కాదు) ఒక వృధా ప్రేలాపనే అవుతుంది.

రాష్ట్రంలోని రెండు ముఖ్య పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశం వారి వారి ఓట్ల రాజకీయాలకు, పెట్టుబడి వ్యాపారాలకే ప్రాధాన్యమిస్తున్నాయి.కాని ప్రజల చిరకాల సమస్యలకు కాదు. చివరికి 'ప్రజలే ప్రభువులు', 'అధికార వికేంద్రీకరణ', 'సుపరిపాలన' అని గంభీర ఉద్ఘాటనలు చేసే లోక్‌సత్తా కూడా సముచిత నిర్ణయం తీసుకోక పోవడం ద్వారా తన పరస్పర విరుద్ధ భావ దారిద్య్రాన్నే చాటుకున్నది.

సమస్యను తెగే దాకా లాగి ఇప్పటికే పెరిగిన ద్వేషాలను మరింతగా పెంచి పోషించడం వలన ఏ ప్రాంతానికీ ప్రయోజనాలు ఉండవు. మట్టిగా విడిపోయి మనుషులుగా ఉండాలనుకుంటే రాష్ట్ర విభజన జరగాలి. దీనితోనే ఇరు ప్రాంతాల ఆత్మగౌరవం నిలబడగలదు. అభివృద్ధి చెందగలదు. శాంతి నెలకొనగలదు అన్న సత్యాన్ని గ్రహించాలి. కావున సీమాంధ్ర ప్రజలు శాస్త్రీయంగా ఆలోచించి రాజకీయ పార్టీలకు అతీతంగా అడుగులు ముందుకు వేయాల్సిన కాలం ఆసన్న మైనది.

-కారుమంచి కృష్ణ చైతన్య (గుంటూరు)
అయ్యంగారి రాఘవశర్మ (చిత్తూరు)
(న్యూఢిల్లీలోని జెఎన్‌యు, ఢిల్లీ వర్సిటీలో పరిశోధక విద్యార్థులు)

No comments:

Post a Comment