Sunday, September 25, 2011

ద్రోహులకు చావు డప్పు by -అల్లం నారాయణ Namasethe Telangana 25/09/2011


9/24/2011 10:32:14 PM
ద్రోహులకు చావు డప్పు
‘ఏమయితది సార్! ఒకప్పుడు జీతం కోసం చేసినం సమ్మె. మస్టర్ల కోతమీద చేసినం. డిపెండెంట్ల మీద
చేసినం. వేజ్ బోర్డుల కోసం చేసినం. ఒక యూనియన్ సమ్మె అంటే మరోటి కాదనే కష్టకాలాలను
చూసినం. ఇప్పుడిక అందరిదీ ఒకే మాట. ఏమయితది సార్. సమ్మె జరుగుతది. తుపాకులు బొగ్గు
తవ్వుతయా! చూస్తం. ఉపాసముంటం. కానీ సమ్మె ఆపం. కనీ.. సార్! అప్పటికీ తెలంగాణ
ఇయ్యకపోతే సార్ ! ఈ రాజకీయ కొడుకుల మీద సెమ్మసు మర్రేస్తం!!’

ఉద్యమం గడ్డిపోచల ఆకాంక్ష./రాజకీయం తుపాకుల ఆంక్ష/ఉద్యమం పాట/ రాజకీయం రెండు నాల్కల మాట/చావుకు తెగిస్తే ఉద్యమం/ వేడుక చూసేది రాజకీయం/ చచ్చినా ఫర్వాలేదనుకునే ఆ ఒక్క క్షణం ఉద్యమం/ చావుల సంఖ్యను లెక్కించేది రాజకీయం/ ఆత్మార్పణం ఉద్యమం/ రక్త తర్పణం ఉద్యమం/ బిత్తరపోయేది రాజకీయం.
-ఎన్. గోపి


ఈ కవి సాత్వికుడు కనుక బిత్తరపోయేది రాజకీయం అన్నారు. కానీ ఉద్య మం సాత్వికంగా ఉండదు. శాంతిగానూ, హింసారహితంగానూ ఉన్నప్పటికీ ఉద్యమం రాజకీయనేతల గుండెల్లో చావు డప్పు కొట్టగలదు. పొన్నాల లక్ష్మ య్య ఇంటిముంగట, బస్వరాజు సారయ్య ఇంటిముంగట చావు డప్పు మోగిం ది. బతికి ఉన్న వాళ్లను చచ్చిన వాళ్లకింద జమకట్టడం అంత అవమానకరమైనది ఈ భూప్రపంచంల ఏదీ లేదు. బహుశా తెలంగాణ ప్రాంతంల కొందరు రాజకీయనాయకులు చచ్చినవాళ్లతో జమే అనుకుంటున్నరు జనం. చావుకు అక్కరకు రాని వాడు. బతుకుకు అక్కరకు రానివాడు. కష్టానికి లేని వాడు. కన్నీళ్లకు లేని వాడు. ఆకాంక్షకు అందని వాడు. ఆకుకు అందని వాడు. పోకకు పొందని వాడు ఇవ్వాల్టి కాంగ్రెస్ నేత. ఇవ్వాళ్టి తెలుగుదేశం నేత. చనిపోయిన వాడు చావుకు తెగించినవాడు తెలంగాణలో ఉన్నప్పుడు నువ్వు శవాలమీద పేలాలు ఏరుకునే పరమ స్వార్థపరుడివే అన్నది సారాంశం. ప్రజల్లో ఉండడం అంటే ఇవ్వాళ్ల రైలు పట్టాల మీద జెండా పాతుకుని వండుకు తినడం. ప్రజల్లో ఉండడం అంటే ఇవ్వాళ్ల రోడ్డు దిగ్బంధనం కోసం వీధి మొగదల కాపేసి కాలూ న్చి నిలబడడం. పదవులకు రాజీనామా పారే సి, రాజీనామా అమోదించినా డా? లేదా చూడకుండా జానేదేవ్ అని జన జంగల్‌ల దుంకి జై తెలంగాణ అన డం. రాజకీయం ముదిరినప్పుడు మీకే శవమూ కనబడలేదు. కన్నెప్పుడూ కుర్చీ మీదనే. ఆలోచన ఎప్పుడూ ధనం దొంతరలు పేర్చడం మీద. గోరీల మీద నిలబడి ఎన్నాళ్లు బతికి ఉండగలరు? మీ ఏసీ రూముల్లోకి ప్రవహిస్తది నెత్తుటి ధార. తెలంగాణ ఒక ముక్కలైన దేహం. అదిప్పుడు అతుక్కున్నది. బిడ్డా మాతెలంగాణ ఇవ్వక పోతే మీ గతి ఇంతే’ అని ఎడమ చేతిలో సోనియా తల, కుడి చేతిలో శ్రీధర్‌బాబు తలను ప్రదర్శిస్తుంది తెలంగాణ.

నడుముకు జగ్గాడ్డి, నాగేందర్, ముఖేష్‌గౌడ్, కిరణ్, జైపాల్‌డ్డిలను కాళ్లకింద రెండు నాల్కల, రెండు కళ్ల సిద్ధాంతి చంద్రబాబును పండేసి తొక్కుతున్నది తెలంగాణ. గౌతులచ్చన్న కోసం, ఆయన విగ్రహం కోసం దేవేందర్ గౌడ్ సభలో తండ్లాడ్తడు చంద్రబాబు. కానీ తెలంగాణ నాయకులు ధర్మ భిక్షం, వీరుడు సర్వాయి పాపన్న గుర్తుకే రాడు. హైదరాబాద్‌లో మళ్లీ గౌతులచ్చన్నదే పెట్టాలె విగ్రహం. దేవేందర్ గౌడ్‌కు అది తప్పుగా కనపడదు. కానీ తెలంగాణ ఒక ప్రాంతీయ ఉపజాతి ఆకాంక్షల సంగ్రామం. బీసీవో, ఎస్సీవో ఎవరివో ఒకరివి. తెలంగాణ ఇప్పటికి ఇప్పుడు తన ప్రాంతం గురించి తానే పలవరిస్తున్న కాలం.గౌతులచ్చన్న గొప్ప వాడైతే కావొచ్చు. కానీ హైదరాబాద్‌లో సర్వాయి పాపన్న, ధర్మభిక్షంల విగ్రహాలు కావాలె. మరెవరినీ సహించదు తెలంగాణ. ఇప్పటి తెలంగాణ ఏదీ వినదు. తెలంగాణ ఫండమెంటలిస్టులనండి. విగ్రహ విధ్వంసకులనండి. తెలంగాణ పిచ్చోళ్లనండి. తెలంగాణ నరనరాన ప్రవహిస్తున్నది. చంద్రబాబును చంకలో పెట్టుకుని తిరిగితే దీక్షా శిబిరాలూ నెత్తురోడుతాయి. ప్రజపూంత స్వేచ్ఛాజీవులు! ప్రజపూంత విముక్తి దాతలు! తెలంగాణ ప్రజపూంత త్యాగమూర్తులు!! ఎందుకు గోదావరిఖని చౌరస్తా అర్థరాత్రి ఉప్పొంగి నిలబడింది.

జీతాలు పోగొట్టుకుంటూ, ఉద్యోగాలు పోగొట్టుకుంటూ, మస్టర్లు పోగొట్టుకుంటూ కూడా ఎందుకని గోదావరిఖని శిగమూగుతున్నది. ఎందుకని శ్రీరాంపూర్, ఎందుకని ఆర్‌కేపీ వివేక్‌ను చూడ నిరాకరిస్తున్నది. ఆయన మాట విననిరాకరిస్తున్నది. కాంగ్రెస్ ఇప్పుడు ప్రజల్లో లేదు. తెలుగుదేశం ఇప్పుడు ప్రజల్లో లేదు. ‘చూడు సార్! ఇన్ని మాటలు కాదు. నేను బొగ్గు బాయిలకు హర్కీస్‌దిగ. నా సంగతి విడిచిపెట్టు. నేను గిన సింగరేణి సమ్మె మానేసి బాయిలకు దిగి జీతం తీసుకొని బతికితే నెత్తురు కూడు తిన్నట్టుంటది సార్....’ ఏడుపొస్తుందా? ఈ మాటలకు. మనుషులు చచ్చిపోతుంటే పదవులు పట్టుకుని వేలాడే వాళ్ల మీద ఇట్లాంటి వాళ్లకు గౌరవం ఏడుంటది. తెలంగాణొస్తే ఆ సింగరేణి కార్మికుడికి ఏమొస్తుందో? రాదో? చెప్పలేను. కానీ.. అదొక జాతి భక్తి. అంటుకున్నది తెలంగాణల ఒక ఉద్వేగం. అవును చనిపోయిన వాళ్ల ఆత్మలను ఆవాహన చేసుకున్నది తెలంగాణ. కానీ, ‘సారూ! ఆ కాంగ్రెసోళ్లను వెంబడిపెట్టుకుని తిరగద్దు సార్! ఆ తెలుగుదేశమోళ్లు దొంగలు సార్! చంద్రబాబు తొత్తులు. కాంగ్రెసోళ్ల తోటి ఊదుగాలది పీరి లేవది. రాజీనామాలని కిరణ్‌కుమార్‌డ్డికి బొకేలు ఇచ్చుకుంట, సెక్ర చక్రం తిప్పుకుంట, ఫైళ్లమీద సంతకాలు పెట్టుకుంట ‘కుషామతుగున్నరు కొడుకులు’ వాళ్లు మాకు చచ్చినోళ్ల కింద లెక్క సార్! నిజమే.

ఇప్పుడు తెగించిన తెలంగాణకు ఎవడు ద్రోహి. బయటివాడు సరే! ఇంటివాడు షెరికి రాడు. చేతకు రాడు. ఇగ ఇంటి ముంగట సావుడప్పు కొట్టక ఏం జేస్తది తెలంగాణ. అడ్డం పొడుగూ మాట్లాడిన వాడు అజా ఉండడు. ప్రభుత్వంల హోంమంత్రి తెలంగాణ ఆడపడుచు. నిజాం కాలేజీల పోలీసులు పోరగండ్లను పెయ్యి సందులేకుంట కొడ్తరు. ప్రజాస్వామ్యం అని చెప్పుకునే దేశంల పట్టపగలు పొన్నాల లక్ష్మయ్య ఇంటికాణ్నుంచి తీసుకుపోయి రోజంతా చిత్రహింసలు పెడ్తరు పోలీసులు. మంత్రి మన బిడ్డే. కానీ ఎందుకు సార్! ప్రశ్నలకు బదులే లేదు. ఎందుకని తెలంగాణ ఇవ్వాళ్ల లేచి నిలుచున్నది. అది సకల దోపిడీలకు వ్యతిరేకంగా ఎందుకని ఇవ్వాళ్ల సింగరేణి సమ్మె కట్టింది. ఎందుకని ఎన్జీవో, అధికారి, ఆటోవాలా, బస్సుడ్రైవర్, కాంట్రా క్టు కార్మికుడు, ఉద్యోగి సమ్మె కట్టిండు. ప్రభుత్వం కుట్రలు చేస్తుంటుంది. తెలంగాణ మంత్రులు దామోదర రాజనరసింహ, ముఖేష్‌గౌడ్, దానం నాగేందర్‌లు ముందు కుట్రలో భాగస్వాములవుతరు. ఉల్టా బెదిరింపు.

మీకు జీతాలు రావు. ఎస్మా బెడ్తం. పెట్టుకో.. ఎస్మా గిస్మా జాన్తానై. నిజానికి ఒక శవయాత్ర చాలదా! చచ్చిపోవడానికి. స్వంత ఊళ్లో శవాన్ని ఊరేగించి కాలబెట్టినందుకు కలవరపడ్డడంట జైపాల్‌డ్డి. పేరుకు కేంద్రమంత్రి. విలువ సున్నా. నడివీధిలో నిలబడి జై తెలంగాణ అనేవాడి ముందు కేంద్రమంత్రి జైపాల్ ఉన్నా లేనోనితో సమా నం. ఉద్యమం నిజానికి గడ్డిపోచల ఆకాంక్ష. తెలంగాణ కాంగ్రెస్ నేతల స్వభా వం ఏమిటి? ఎందుకని వాళ్లు పదవులను పట్టుకొని వేల్లాడుతున్నరు. ఏ బానిస మనస్తత్వం, ఏ పరాధీన మనస్తత్వం, ఏ ఎంగిలి ఎముకలు ఏరుకునే మనస్తత్వం వారిని ప్రజలకు కాకుండా చేస్తున్నది? అమెరికాకు, వరల్డ్ బ్యాంకు కు, అంతర్జాతీయ పెట్టుబడికి ప్రధాని మన్‌మోహన్‌సింగ్ బానిస. త్రీజీలు కలర్ కలలై కాలసర్పాలై కాటేస్తున్నవి. అంతర్జాతీయ పెట్టుబడిని శాసిస్తున్న సీమాం ధ్ర పెట్టుబడిదారులకు నల్లారి కిరణ్‌కుమార్‌డ్డి ప్రభుత్వం బానిస. ఆ బానిసకు తెలంగాణ మంత్రులు బానిసలు. అర్థబలాలు, అంగబలాలు, భవనాల కాంట్రాక్టులు, పతారలు నిలుస్తాయా? గడ్డిపోచలు కావొచ్చు ఉద్యమకారులు. కానీ ఇప్పుడొక పేగు బంధం. ఇప్పుడొక పురిపేనిన తాడు బంధం తెలంగాణను కట్టి ఉంచిన ఉక్కు బంధం. ఉడుం పట్టు. ఎవరూ అడగలేదు. కాంగ్రెస్ ను ఏడేండ్ల క్రింద గులాబీ కండువాలు కప్పుకొని తిరగమని. ఓటు అయినంక బోడ మల్లయ్యయింది తెలంగాణ.

ఎవరూ అడగలేదు రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ మాట వినపడాలని. అన్నింటికి మించిన ద్రోహం డిసెంబర్ 9. ప్రకటించిన సభలు అత్యున్నత చట్టసభలు ప్రకటించినవాళ్లు కాంగ్రెస్‌వాళ్లు. ఏది తెలంగాణ. గడికోసారి మాట మాట్లాడడం కాదు. దీక్ష చేసుడు కాదు. ఏది తెలంగాణ. ఎవరు ద్రోహం చేశారు. అసెంబ్లీలో తీర్మానం పెడితే ఆమోదించుకుందామని సవాల్ చేసిన చంద్రబాబు డిసెంబర్ ఏడున అన్న మాటలను పదిన ఎందుకు మింగిండు. అంత అమాయకమైందా? తెలంగాణ. ఇగ ఏం జెయ్యాలె తెలంగాణ. ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఎరుక. రాజకీయం రెండు నాల్కల మాట. పూటకోతీరు. కానీ.. తెలంగాణ రాలేదు. నిండు జీవునాలు బలివితర్దిమీద నిండు ప్రాణాలు ఏడునూర్ల ప్రాణాలు. పన్నెండు రోజులుగా సమ్మె. చక్రం కదలదు. ఫైలు కదలదు. బస్సు లేదు. ఆటోలేదు. రైలు లేదు. వైద్యుడు మందులివ్వడు. క్షురకుడు క్షవరం చెయ్యడు. రజకుడు బట్టలుతకడు. ఇంగేమి జెయ్యాలె తెలంగాణ. అయినా మీ అద్దాల మేడల్లో కులాసాగా దిలాసాగా పదవులు పట్టుకుని ఊగులాడ్తున్న కాంగ్రెస్ పెద్దలారా! మంత్రులారా! ఎమ్మెల్యేల్లారా! ఒక్కటంటే ఒక్క విన్నపం. రెండు నాల్కలు వద్దు. రెండు మాట లు వద్దు.

రెండు కళ్లు వద్దు. తెలంగాణ వద్దనుకుంటే అదే చెప్పండి. కానీ తెలం గాణ తెస్తమని మోసం చెయ్యకండి. మిమ్మప్నూవరూ తెలంగాణ సంగతి మాట్లాడమని అడగడం లేదు. చావుడప్పులు మోగించినప్పుడు, బొమ్మలను గాడిద ల మీద, కుక్కల మీద ఊరేగించినప్పుడు, తలలు ఫ్లెక్సీలో ప్రదర్శించినప్పు డు, శవయావూతలను శాస్త్రోక్తంగా జరిపి దిష్టిబొమ్మలు తగులబెట్టినప్పుడు మీరు మాకు లేరు. నిలు ఒక ఉద్యమం ఎగిసినప్పుడు మీరు మాకు ప్రాసంగికులు కారు. మీకు కాలం చెల్లింది. ఇచ్చేదో? తెచ్చేదో? చచ్చేదో? ఏదో ఒకటి. ఉంటరా? తేల్చుకుంటరా? ఒకే నాలుకతో మాట్లాడండి. ఆ మాట మీద నిలబడండి. లేదా! కాలగర్భంలో కలిసిపోండన్నదే తెలంగాణ ఇప్పటి నినాదం. నిజం అదే. రాజకీయం ఏమార్చిన ఒక కపట నాటకం. కానీ ఉద్యమం సజీ వం. తెలంగాణకు పోరు తప్ప మరి దారే లేదు. చరిత్ర మీవేపు చూస్తున్నది. తెలంగాణ చరివూతలో భాగమవుతారో? పెంటకుప్పల మీదకు పతనమవుతారో? మీ ఇష్టం. ‘ఏమయితది సార్! ఒకప్పుడు జీతం కోసం చేసినం సమ్మె.

మస్టర్ల కోతమీద చేసినం. డిపెండెంట్ల మీద చేసినం. వేజ్ బోర్డుల కోసం చేసినం. ఒక యూనియన్ సమ్మె అంటే మరోటి కాదనే కష్టకాలాలను చూసినం. ఇప్పుడిక అందరిదీ ఒకే మాట. ఏమయితది సార్. సమ్మె జరుగుతది. తుపాకులు బొగ్గు తవ్వుతయా! చూస్తం. ఉపాసముంటం. కానీ సమ్మె ఆపం. కనీ.. సార్! అప్పటికీ తెలంగాణ ఇయ్యకపోతే సార్ ! ఈ రాజకీయ కొడుకుల మీద సెమ్మసు మర్రేస్తం!!’ ఇది గోదావరిఖనిలో ఒక సింగరేణి కార్మికుని మాట. అదీ సంగతి.. అంతంలేని సంగతి. చరిత్ర ఎదురుచూస్తున్నది.
-అల్లం నారాయణ

--




No comments:

Post a Comment