Thursday, September 29, 2011

ఇది ప్రజాస్వామ్యమేనా? By పొ.హరగోపాల్ Namasethe Telangana 30/09/2011

ఇది ప్రజాస్వామ్యమేనా?
మూడు వారాలుగా లక్షలాదిమంది తెలంగాణ పౌరులు, భిన్న రంగాలకు చెందినవాళ్లు-విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్మికులు, ప్రభుత్వోద్యోగులు, రైతులు, గ్రామీణ ప్రాంత పేదలు, కాంట్రాక్టు ఉద్యోగులు-నిజానికి సమస్త రంగాల నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రాజీ లేకుండా పోరాడుతున్నారు. దేశంలో రెండు మూడు దశాబ్దాలుగా ప్రయోగించిన శాంతియుత పద్ధతులన్నింటిని ఉపయోగిస్తున్నారు. నాకు తెలిసి దేశంలో ఇంత శాంతియుత పోరాటాలు చాలా అరుదుగా జరిగాయి. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాల య విద్యార్థులతో పాటు తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల కాలేజీ విద్యార్థులు పాటించిన అసాధారణ సంయమనం, పరిణతి నమ్మశక్యంకాని స్థాయిలో ఉన్నాయి. దీనికి రాజకీయనాయకులకు, ఉద్యమకారులకు, ఉద్యమ నాయకులకు అభినందనలు చెప్పవలసిందే.

ఇంత శాంతియుత ఉధృత ఉద్యమానికి ఏ స్థాయిలో కూడా స్పందించని రెండు ప్రధాన రాజకీయ పార్టీలను, అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని, అన్నిటికి మించి బాధ్యతారహితమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఏమనాలో, ఎలా అర్థం చేసుకోవాలో, ఏం అంచనా వేయాలో అర్థం కావడం లేదు. ఈ మొత్తం ప్రక్రియను చూస్తుంటే.. ఇప్పుడు మనం పాలకులు చెప్పే అతిపెద్ద ఉదార ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామా? లేక ఒక ‘ప్రజాస్వామిక భ్రాంతి’లో బతుకుతున్నామా? అనే ఒక మౌలిక ప్రశ్న అడగవలసిన సమయం, సందర్భం ఇది.


మావోయిస్టు ఉద్యమం గురించి మాట్లాడుతూ గత వారం కేంద్ర హోం మంత్రి చిదంబరం ‘మీరు మీ ఆయుధాలను, మీ సిద్ధాంతాలను వదలవలసిన అవసరం లేదు. కేవ లం హింసను ఆపండి’ అని ఒక సూచన చేశాడు. మావోయిస్టులు ‘మాది హింస కాదు ఇది ప్రతిహింస’ అని వాళ్ల పోరాటం ప్రారంభమైన నాటి నుంచి నాలుగు దశాబ్దాలుగా చెపుతూనే ఉన్నారు. హింస, ప్రతిహింస వలయాన్ని దాటి అసలు ఈ హింసకు మూల కారణా లు సామాజికార్థిక నిర్మాణంలో ఎక్కడ ఉన్నాయో వెతకవలసిన అవసరం చరివూతకు ఉంటుంది. చిదంబరం లాంటి వ్యక్తులకు, ఫిలాసఫి చదవకపోవడం వలన చారివూతక స్పృహలేకపోవడం వల్ల సందర్భంతో సంబం ధం లేకుండా మాట్లాడుతుంటారు. అంతేకాక ఉద్యమకారులు ప్రధాన జన జీవన స్రవంతిలో కలిసి శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, ఎన్నికలలో పోటీచేసి రాజ్యాధికారంలోకి రావచ్చు గదా అని హోంమినిస్టరే కాదు చాలా మంది మధ్యతరగతి విద్యావంతులు, మేధావులు మాట్లాడుతుంటారు. ఈ వాదనలను ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఉద్యమ అనుభ వం నుంచి పరీక్షించవలసిన అవసరముంది.


చిదంబరం గారు 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీల సమావేశం తర్వాత, దాదాపు అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్రానికి మద్దతు తెలిపిన తర్వాత, అసెంబ్లీలో తీర్మానం పెట్టండి మేం మద్దతు ఇస్తాం అని చంద్రబాబు స్వయంగా ప్రకటించిన తర్వాత ఈ ప్రకటన చేశారు. బహుశా ప్రజాస్వామ్య వ్యవస్థలో 9 డిసెంబర్ ప్రకటన ఒక శాంతియుత ఉద్యమ విజయంగా భావించిన తరుణంలో రాజకీయ పార్టీలు ప్లేటు ఫిరాయించాయి. దీంట్లో కాంగ్రె స్ పార్టీని ప్రధానంగా తప్పుపట్టాలి. కేంద్రంలో అధికారంలో ఉండి ప్రభుత్వం తరఫున తమ హోం మంత్రి ప్రకటన చేసే దాకా ఆగి మరునాడే ‘మా ప్రాంత ప్రజల ఆకాంక్ష మేం సరిగా అంచనా వేయలేకపోయాం’ అని రాత్రికి రాత్రే జ్ఞానోదయం అయినట్టు మాట్లాడిన ఆంధ్ర ప్రాంత నేతలను ప్రజావూపతినిధులు అని మనం పరిగణించవచ్చా? అలాగే మరో ప్రాంతం నుంచి ఒత్తిడి వచ్చింది కాబట్టి తాను చేసిన ప్రకటనను పునఃపరిశీలించవలసి వచ్చింది అని మాట మార్చిన చిదంబరంను కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మనం ఎలా అర్థం చేసుకోవాలి.

సమస్య జటిలం అయిందని ఒక న్యాయమూర్తితో కమిటీ వేస్తే, ఒక అవాస్తవ, అసందర్భ, అస్పష్ట రిపోర్టు ఇచ్చిన వారి గురించి మనం ఏం అనుకోవాలి? చిదంబరం, కేంద్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, కమిటీలు, కమిషన్‌లు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉత్పన్నమైన ఒక సమస్యకు శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కారం కనుక్కునే బదులు వాళ్లే సమస్యలో భాగమైతే సమస్యలకు పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుంది.


వ్యవస్థలు, సంస్థలు, వ్యక్తులు తమ పాత్ర తాము నిర్వహించనప్పుడు ఆ మొత్తం వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం పోతుంది. విశ్వసనీయత కోల్పోయిన రాజకీయ వ్యవస్థ చట్టబద్ధమైన అధికారాన్ని చలాయించే నైతిక అర్హతను కోల్పోతుంది. అలా కోల్పోయినందువల్లే ప్రజలు ప్రత్యక్ష చర్యలకు పూనుకుంటారు. అన్ని సామాజిక, రాజకీయ ఉద్యమాలకు మూలం ఇదే. మావోయిస్టు పార్టీ లేదా ఇతర విప్లవ ఉద్యమాలు ‘ఇప్పుడున్న వ్యవస్థలో ప్రజల సమస్యలకు, వైరుధ్యాలకు పరిష్కారమార్గాలు లేవు కనుక మొత్తం వ్యవస్థకు శస్త్ర చికిత్స చేయవలసిందే’ అని అంటున్నాయి. అలాకాదు వ్యవస్థలో పరిష్కారాలు లభిస్తాయి అని అన్ని పార్లమెంటరీ రాజకీయ పార్టీలు వాదిస్తున్నాయి. మరి ఇలాంటప్పుడు తెలంగాణ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో వివరించవలసిన బాధ్యత ఆయా రాజకీయ పార్టీల మీద ఉంది.


రాజకీయ పార్టీలు తెలంగాణ సమస్యను పరిష్కరించలేకపోవడం, ప్రజా ఉద్యమాలను ప్రజల ఆకాంక్షలను గుర్తించలేకపోవడం ఎంత పెద్ద ప్రజాస్వామ్య విషాదమో ఊహిస్తేనే అందోళన కలుగుతుంది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఇప్పుడు వచ్చింది కాదు. దీనికి దశాబ్దాల చరిత్ర ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రతిగా ఆంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమం ప్రారంభించారు. సమైక్య ఉద్యమానికి మొదటి నాయకుడు ఒక కంపెనీ యజమాని. కంపెనీలు పెట్టుకొని కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న వారు ప్రజావూపతినిధులుగా ఎలా రూపాంతరం చెందుతారన్నది కూడా ప్రజాస్వామ్యానికి ప్రశ్నే. తమ సొంత ప్రయోజనాలు, లాభాల వేటలో ఉండేవారు తమ స్వప్రయోజనాన్ని, ప్రజా ప్రయోజనాన్ని ఎలా విడదీసి ప్రవర్తిస్తారో కనుగొనడం చిదంబర రహస్యమే. ప్రజా రాజకీయాలలోకి వచ్చేవాళ్లు సమష్టి ప్రయోజనం కొరకు పనిచేస్తారు అనే భూమిక ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు. తమ స్వప్రయోజనాన్ని, సమష్టి ప్రయోజనాన్ని కలిపి సమష్టి పేరు మీద లాభాలు చేసుకునే వారు ప్రజాస్వామ్య సంస్కృతికి దోహదం చేయగలరా! అనే ఒక సవాలు సమాజం ఎదుర్కొంటున్నది.

కంపెనీ యజమానులు హైదరాబాద్ నగరంలో విపరీతంగా పెట్టుబడులు పెట్టారు.కోటాను కోట్లు లాభాలు గడించారు. అలాం టి ప్రజా ప్రతినిధులు ప్రజల కొరకా, నిధుల కొరకా అనే ప్రశ్న కూడా వస్తుం ది. ఆంధ్రప్రాంతంలో ‘సమైక్యత’ గురించి ఆలోచించే వారు కొంత మంది ఉండవచ్చు. నిజాయితీగా ఆలోచించే వాళ్లూ ఉండవచ్చు. వాళ్ల గొంతు ఎక్కడా వినపడడం లేదు. అలాంటి వాళ్లు తప్పక తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని గురించి ఆలోచిస్తారు. సానుభూతితో పరిష్కరించాలని ఒత్తిడి పెడతారు. తమ ప్రయోజనాలు కొన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కాని కంపెనీ యజమానులు తెలు గు ప్రజల సమైక్యత గురించి మాట్లాడితే వాళ్ల అభివూపాయాలను ప్రజాభివూపాయం అని అనుకునే అమాయకపు స్థితిలో ప్రజలు లేకపోవడం యజమానుల ‘దురదృష్టం’.


తెలంగాణ ఉద్యమం కేసీఆర్ కుటుంబం నడుపుతున్నదనో, కొందరు రాజకీయ నిరుద్యోగుల వ్యూహమనో అంటున్న వాళ్లు మూడువారాలుగా లక్షలాది సంఖ్యలో కదులుతున్న జనాన్ని చూసైనా అలా వాదించడం మానుకోవాలి. ఉద్యమాలు ప్రారంభించిన వాళ్ల కు తమ రాజకీయ కారణాలుండవచ్చు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఆ స్థాయిలన్నీ దాటిపోయింది. ఇది ప్రజా ఉద్యమమని గుర్తించడం మొదట చేయవలసిన పని. ఇంత విస్తృతస్థాయిలో ప్రజలు కదిలినప్పుడు బలమైన ప్రజా ఆకాంక్షను గుర్తించకపోతే అది ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు. ప్రజావూపతినిధులు పట్టించుకోనప్పుడు ప్రజలే ప్రత్యక్ష చర్యకు పూనుకున్నప్పుడు దాన్ని గౌరవించే సంస్కృతి లేకపోతే ఆ వ్యవస్థకు భవిష్యత్తు ఉంటుందని విశ్వసించలేము.


ఈ ఉద్యమాన్ని అణచివేయగలమని పాలకులు భావిస్తున్నట్లున్నారు. విచ్ఛలవిడిగా ప్రవర్తించే పోలీసులను మనం నాలుగు దశాబ్దాలుగా ఉద్యమాల అణచివేత పేర తయారు చేసుకొని ఉన్నాం. ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం పోలీస్ శాఖకు లెక్కలేనన్ని నిధులు సమకూర్చింది. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ బలగాల మీద ఆధారపడి ఉండడమే, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కాదనడానికి సాక్ష్యం. ఇది ప్రజాపాలన కాదని అతి సామాన్యుడికి అర్థమైపోయింది. ప్రజల బాగు కొరకు, సమాజ మార్పు కొరకు, భారత రాజ్యాంగం వాగ్దానం చేసిన సమసమాజ నిర్మాణం కొరకు పోరాడుతున్న ప్రజలపై ఇంత బలవూపయోగం అవసరం ఏమిటో ఏలిన వారే చెప్పాలి.

శాంతియుత తెలంగాణ భగ్గుమంటే ఎవరు బాధ్యులు? ఇంత శాంతియుత ఉద్యమానికి స్పందించని పాలకులు ప్రజలకు ఏం సందేశమిస్తున్నారో ఆలోచించాలి. ప్రజలు చరిత్ర నిర్మాతలు. తెలంగాణ చరివూతను ఇలా మార్చుకోలేకపోతే ఎలా మార్చుకోవాలో వాళ్లే నిర్ణయించుకుంటారు. ఇక తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్యంలో శాంతియుత పద్ధతుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు అని మళ్లీ మాట్లాడే చారివూతక అవకాశం మిగలదని పాలకులు అర్థం చేసుకోవాలి.
పొ.హరగోపాల్

No comments:

Post a Comment