Thursday, October 20, 2011

ఎన్.ఎచ్.సెవెన్-జోడేఘాట్ బాట By -వరవరరావు Namasethe telangana Dated 21/10/2011

ఎన్.ఎచ్.సెవెన్-జోడేఘాట్ బాట
ఎన్.ఎచ్.సెవెన్-నోరు తిరిగిన వాళ్లు ఇట్లాగే పిలుస్తారు. తిరగని వాళ్లు సామాన్య గోండు ప్రజానీకం ఈ ‘జాతీయ రహదారి’ని చూసి కూడా ఉండరు గనుక వాళ్లు జోడేఘాట్ బాట గురించి, అడవి దారుల గురిం చి తప్ప దాని గురించి ఏమీ చెప్పలేకపోవచ్చు. చెప్పినా ఈ రాజమార్గం నిర్మా ణ సందర్భంగా తమ నిర్వాసిత హృదయవిదారక గాథలే చెప్పవచ్చు.
కాని మన బోటి వాళ్లకు ఈ ఫోర్‌లేన్ రోడ్డు మీద ప్రయాణం ఎంత హాయి గా ఉంటుందని..హంసతూలికా తల్పం మీద తేలిపోతున్నట్లు. హంసలంటూ ఉంటే ఆ తూలికాతల్పం కోసమే ఎన్ని పీకలు తెగి హంసలు హింసకు బలి అయిపోవాలో-ఆ శయ్య మీద ఉన్నపుడు మనకెట్లా తెలుస్తుంది. బైపాస్ రోడ్లు-ఎక్కడా అందమైన పల్లెటూర్ల బోర్డులే తప్ప (అందమైనవి పల్లెటూర్లు గాదు సైన్‌బోర్డులు) ఏ ఒక్క ఊరు తగలదు. కవులమైతే ఎన్. గోపీ వలె కలవరపడతాం.

ఇదివరకు పల్లెల గుండెల్లోంచి వెళ్లేవాళ్లం
గతుకుల రోడ్లయినా అవి మట్టి స్పందనల్లా ఉండేవి
పొలిమేరలు దగ్గరవగానే
గాలి..మనుష్యుల ఊపిరిలా పరిమళించేది
చాయ్ తాగిన గుడిసె హోటళ్లూ
ఒక్క ఆవలింతలో..అలసటను ఊదేసి
ఊరినంతా పీల్చుకునేవాళ్లం/ఇంత గొప్ప అనుభవం
ఒక్క బైపాస్ రోడ్డుతోదూరమైంది
రక్త ప్రసారానికి/అడ్డొస్తే గదా బైపాస్!
కాని ఇది రక్త బంధాలను తప్పుకపోయే స్పీడ్ రేస్..
ఎక్కడికి? ఢిల్లీకి. పల్లెల్నించి కాదు. పల్లెల్ని మినహాయించి.
కలపాల్సిన రోడ్లు/ఇప్పుడు చీలిన పాశాలవుతున్నాయి
మనుష్యుల్ని వదిలేసి/ఇంత వేగంగా ఎక్కడికి?
కేంద్రీకరించిన అధికారం దగ్గరికి. అక్కడి నుంచి ఒక దురూహ దాహంతో శ్రీనగర్ దాకా సైన్యం వెళ్లి దురాక్షికమించనూవచ్చు. అయినా అక్కడి దాకా పోయే అధికారం ఆకాశంలోనే ఎగురుతున్నది. పార్లమెంట్‌లో బిల్లు పెట్టాల్సిన ప్రజా ప్రతినిధులకు ఈ జాతీయ రహదారి కూడా నామోషియే. అంతర్జాతీయ విమానాక్షిశయాలు తప్ప నిరాక్షిశయుల సంగతి పట్టదు.ఆర్మూరు దాటిన దగ్గర్నించీ ఆదిలాబాద్ మార్గం మరీ ఆశ్చర్యమేసింది. నిర్మల్ ఘాట్‌రోడ్ ఏది? కొండలను తవ్వేసి బండలను పిండేసి, ఆదివాసుల నెత్తుర్లే కంకరగా ఈ రోడ్డు వేశారా! పొచ్చెర్ల జలపా తం సైన్ బోర్డు దగ్గరి నుంచి స్పష్టంగా చూశాను. వృక్షాల మొదళ్లు మిగిలి ఉన్నాయి. పొచ్చెలు, బొబ్బెలు నరికేసిన గోండుల మొండి దేహాల వలె.మన సుఖం మనుషులకెంత కష్టం. అయితే మనమెవరం? మన ప్రయాణమెక్కడికి? జోడేఘాట్‌కు. కొము రం భీం నుంచి స్ఫూర్తి పొందడానికి. ఆదిలాబాద్ కలెక్ట ర్ చౌరస్తా పజల చౌరస్తా కాదది-జిల్లా అధికారిది) లో ఈ నెలలోనే కొమురం భీం విగ్రహం పెట్టారు. కొమురం అంటే సొగసయినవాడు అని అర్థం. భీం అంటే చెప్పనక్కర్లేదు కదా. ఆయన చేతిలో తుపాకి కూడ ఉంది. కొమురం భీం ‘బస్ట్’ మాత్రమే అయితే ఆయన అంతిమంగా ఎంచుకున్న పోరాట మార్గం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శాంతియుతంగా పోరాడుతున్న వాళ్లకు సరియైన స్ఫూర్తినిస్తుందో లేదోనని అనుకున్నట్టున్నారు. ఆయన నిలు సాయుధ విగ్రహం పెట్టారు. కొమురం భీం స్ఫూర్తి ఏమిటి? ‘మా ఊళ్లో మా రాజ్యం’.

అడవిలో తాము పోడు చేసుకున్న భూముల్ని జాగీర్దార్లు ఆక్రమించుకున్న దగ్గర్నించి- విన్నపాలు, మహజర్లు, న్యాయస్థానాలు, జంగ్లాతు వాళ్ల నుంచి అవ్వల్ తాలూకాదార్ దాకా నైజాం దాకా కాళ్లరిగేలా తిరిగే ప్రయత్నాలు - అన్నీ అయిపోయి మళ్లీ నేల మీదికే వచ్చి ఆత్మరక్షణ కోసం దాడినెదుర్కొని కేసయి జైలుపాలు కాకుండా తప్పించుకొని పారిపోయి అస్సాం తేయాకు తోటల్లో తోటి కార్మికుల కష్టాలను, సంఘటిత చెతన్యం చూసి అడవిపుత్రులలో పీడనకు, దోపిడీకి, ప్రతిఘటనకు పోరాటానికి ఎల్లలు లేవని తెలుసుకొని తిరిగివచ్చి పన్నెం గూళ్లల్లో తన ప్రజల్ని కూడగట్టి నైజాంతో,ఆయనకు అండగా నిలిచిన బ్రిటిష్ వాళ్లతో సాయుధంగా పోరాడిన యోధుడు. ఆయన ఏ ఒక్క పోరాట రూపాన్నీ వదిలిపెట్టలేదు. తమ పోడు భూముల్ని ఆక్రమించుకున్న వాళ్లతో మొదలుకొన్ని అన్ని స్థాయిల్లో నైజాం దాకా చర్చలు జరిపాడు. సహాయం చేసిన వకీలును, పత్రికా సంపాదకుణ్ని నిరంతరం సంప్రదించాడు. ప్రతి సందర్భంలోనూ తన ప్రజల్ని సమీకరించి సమావేశపరిచి తాను జరిపిన చర్చలన్నీ వివరించాడు. 2010 జనవరి 5 వలె, 2011 అక్టోబర్ మొదటివారం వలె ప్రభుత్వంతో, కాంగ్రెస్ పెద్దలతో ఏం మంతనాలు జరిగాయో చెప్పకుం డా దాచలేదు. తన ప్రజలకు సంబంధించినంత వరకు చర్చలూ పారదర్శకంగానే చేశాడు. వాళ్ల అమోదంతోనూ, అండతోనూ పోరాటం చేశాడు. ఈ క్రమమంతా ఆయన గ్రహించిందల్లా, తనతో ఉన్న పీడిత, పోరాట ప్రజల అవగాహనకు తెచ్చిందల్లా భూమి మీద అధికారం రావాలంటే రాజ్యం మీద అధికారం రావాలి అని.


పన్నెండూళ్లే కావచ్చు కాని ఆ ఊళ్లపై అక్కడి ప్రజల కు అధికారం కావాలి. భీం కుటుంబ సభ్యులందరికీ వాళ్లు దున్నుకునే భూమి పట్టా చేస్తానని ఆశ చూపింది ప్రభుత్వం. ప్రజలందరి తరఫున మాట్లాడవద్దన్నది మంత్రి పదవులు, తాయిలాలు తీసుకుని న్యాయమెన తెలంగాణ ప్రజల పోరాటానికి ద్రోహం చేస్తున్న రాజకీయ నాయకుల వలె ఆయన రాజీ పడలేదు. ఆఖరి శ్వాస దాకా పోరాడి అమరుడయ్యాడు. ఓడిపోయాడు. కాని లొంగిపోలేదు. కాని మన భూమి, మన నీళ్లు, మన వనర్లు, మన పాలన మనకు అంటే ఏమిటో డ్బై ఏళ్ల క్రితమే స్పష్టమెన దార్శనికత ఇచ్చిపోయాడు. పోరాటం ఎందుకో చెప్పాడు. ఎట్టా చేయాలో చెప్పాడు. ఎక్కడ చేయాలో చెప్పాడు. శత్రు పసిగట్టాడు. మిత్రులందర్నీ కూడగట్టాడు. ప్రజల మీద ఆధారపడ్డాడు. ప్రజల మధ్య నిలిచి, ప్రజల్ని సాయుధుల్ని చేసి పోరాడాడు.
ఉట్నూరూ, జైనూరు, బాచేఝరి, హట్టి, జోడేఘాట్ -1940 సెప్టెంబర్ 1న నేలకొరిగాడు. అక్కడ ఒక రాయి. ఒక కర్ర పాతి గోండులు, కోలాము లు, ఏరధానులు, ఏరమేశులు పీడిత, పోరాట ప్రజలందరూ తలుచుకుంటున్నారు. ఈ గడచిన పున్నమి అక్టోబర్ 11న ఆయన వర్ధంతి. ఆయన సంస్మరణ. భీం స్ఫూర్తి ఏమిటి? స్వపరిపాలన, రాజీలేని పోరాటం, పోరాట కొనసాగింపు. పాలకుర్తి ఐలమ్మ పొలంమడిలోని పంట ఆమె ఒడిలోకి చేర డం. బందగీ భూమి కోసం చేసిన న్యాయపోరాటం, దొడ్డి కొమురయ్య దొర ల అణచివేతకు వ్యతిరేకంగా చేసిన రైతుకూలీ పోరాటం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, మూడువేల గ్రామాల్లో పది లక్షల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని ప్రజలు అనుభవించిన బీజ ప్రాయమెన అధికారం .అదీ కొమురం భీం స్ఫూర్తి అంటే నాయకత్వం చేసిన ద్రోహం కాదు.
నక్సల్బరీలో సంతాల్ ఆదివాసులు అందుకున్న కొమురం భీం స్ఫూర్తి మన భూమి మనకు దక్కాలంటే మనకు రాజ్యాధికారం దక్కాలన్న దార్శనికతను ఇచ్చింది. కొమురం భీం పోరాటం వలెనే అది శ్రీకాకుళంలో సెట్‌బ్యాక్‌కు గురయినా జగిత్యాల, సిరిసిల్లాల నుంచి అది జైత్రయావూతయే.

మళ్లీ ఒకసారి ప్రజలు ‘ఊరు మనది, వాడ మనది, దొర ఏందిరో, దొర పెత్తనమేందిరో’-అని బండెడ్లు ఒకటై ఎగబడిన స్ఫూర్తి. కొమురం భీం డ్బై ఏళ్లు పయనించి, నక్సల్బరీ నుంచి, వైనాడు దాకా పయనించి, తెలంగాణ అడవు ల నుంచి మళ్లా తెలంగాణ మైదానాలకు పయనించి 1981లో మళ్లా తన ఇంద్ర చేరుకున్నాడు. ఎంతో నెత్తురు ధారపోశాడు. తోట రాముని తొడ కు కాటా తగిలిందని పరధాను, పరమేసు పసరు పోసి కట్టుకట్టారు. ఇంద్ర శ్యాం, సాహు, గజ్జెల గంగారాం, జంగు దాదా కావడానికన్నా ముందే కొమురం భీం పెద్ది శంకర్ అయి పేరొంది అడవుల్లో ప్రవేశించాడు. అంతే.. తిరిగి వెనక్కు చూడలేదు. ముప్ఫై ఏళ్లుగా దేశానికి స్వపరిపాలన అంటే ఏమి టో, ప్రజల అభివృద్ధి నమూనా అంటే ఏమిటో, జల్, జంగల్, జమీన్ మీద ప్రజల సాధికారత అంటే ఏమిటో జనతన సర్కార్ ద్వారా ఇవ్వాళ దండకారణ్యలో ఆచరించి చూపుతున్నాడు. నూట ఏభై ఏళ్ల కిందటి కానూసిద్ధూల నాయకత్వంలోని సంతాల్ పోరాటం ఇవ్వాళ కానూ సిద్ధూల మిలీషియా నాయకత్వంలో జంగల్ మహల్ పోరాటమైంది. బిర్సా ముండా పోరాటం, రాంచీ బిర్సా ముండా జెల్లో ఉరికంబం మీద నిలిచిన జీతన్ మరాండీ కళా స్పందన సాంస్కృతిక ఆచరణలో ప్రతిఫలిస్తున్నది. అల్లూరి సీతారామరాజు, ద్వారబంధాల చంద్రయ్య మొదలు వెంపటాపు సత్యం వరకు మన్నెం, శ్రీకాకుళాల్లో సాగిన పోరాటం సోంపేట నుంచి నారాయణపట్నం వరకు కంపెనీ చట్టాల్ని, అడవి చట్టాల్ని ధిక్కరించి తమ భూముల్ని, హక్కుల్ని కాపాడుకున్న పోరాటాలుగా సాగుతున్నది.
వందేళ్ల క్రితం గూండాదర్ భూంకాల్ ఇవ్వాళ దండకారణ్యంలో భూకంపాన్ని సృష్టిస్తున్నది. గ్రీన్‌హంట్ ఆపరేషన్ పేరుతో ప్రజల మీద రాజ్యం ప్రకటించిన యుద్ధాన్ని నిలువరిస్తున్నది. ఇదంతా జిందాల్, ఎస్సార్, టాటా, పోస్కో, వేదాంత ఏ బడా కంపెనీ అయినా కావచ్చు, ఏ బహుళజాతి కంపె నీ అయినా కావచ్చు అడవిలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్న పోరాటం. అర్ధసైనిక బలగాలను, సైన్యాన్ని ప్రాణాలొడ్డి మట్టికరిపిస్తున్న పోరాటం. గ్రామరాజ్యాల నాయకత్వంలో గ్రామాభివృద్ధి సాధించుకుంటున్న పోరాటం. ఆకాశంలోనేకాదు, అడవిలోనూ సగమైన మహిళలు పాల్గొంటున్న పోరా టం. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రాన్ని ధిక్కరిస్తున్న పోరాటం. అంటే జల్ జంగిల్ జమీన్ కోసం ప్రభుత్వాలకు, కంపెనీలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం. దాని పాలకులయిన భూస్వామ్య, పెట్టుబడిదారీ పెత్తందారీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం. ఇది సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం. ఢిల్లీ రాజమార్గాన్ని పల్లెల కాలిబాటలు ప్రశ్నిస్తున్న పోరాటం.

మనం తెలంగాణలో కొమురం భీం స్ఫూర్తితో ఏం కోరుకుంటున్నాం. మన తెలంగాణలో మనం మన భూములు, మన వనర్లు, మన చదువులు, మన కొలువులు, మన భాష, మన సంస్కృతి, మన ఆత్మగౌరవం మనకు దక్కే స్వపరిపాలన కోరుకుంటున్నాం. అందుకోసం మనం సమ్మక్క సారలక్కలు మొదలు బందగీ, ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, మొండ్రాయి, మొగ్దుం మొహియుద్దీన్, నల్లా నర్సింహులు, గొల్ల ఎలమంద, సూర్యపేట రాములమ్మలలో జాక్‌లు రాళ్లు, బైరాన్‌పెల్లి ప్రజలు పోరాడిన స్ఫూర్తినే గ్రహిస్తున్నా మా? ఇంద్ర గోండులు ఏమడిగారు. అప్పటికింకా తమ చంద్రవంశపు గోండ్వానా రాజ్యాన్ని రాంజీ గోండు పాలించి, ఇంగ్లిష్ వారితో పోరాడి ఉరికంభమెక్కిన రాంజీ గోండుల రాజ్యాన్ని మళ్లా సాధించుకుంటామని ప్రకటించలేదు. ఇంద్ర మారణకాండలో చిందిన రక్తంతో మాత్రం మళ్లీ రగల్ జెండాను ఎత్తుకున్నారు. ఇంద్ర సంఘటన నాటికి గోండులు, కోలాము లు, తాము పోడు చేసుకున్న భూములపై తమకు పట్టాలివ్వాలన్నారు. తాము పండించే పత్తి, పోగాకు, మిర్చిలకు గిట్టుబాటు ధరలు కావాలన్నా రు. వలసవచ్చే ఆదివాసేతరులు, తప్పుడు తూకాలతో, మోసపు కొలతలతో తమ అడవి సంపదలు కొని మోసం చేయొద్దన్నారు. గిరిజన రైతు కూలీ సంఘాలు పెట్టుకొని 1981 ఏప్రిల్ 20న సభ తలపెట్టారు. ప్రభుత్వం సహించలేకపోయింది.
ముప్ఫై ఏళ్లలో అడవి ఎంత పలచబడిపోయింది! కాలిబాటలు తారు రోడ్లయినవి. ఇరవై శాతం ఆదివాసేతరులు వలసవచ్చి తిష్ఠ వేశారు. దళారీలు కోటీశ్వరులయ్యారు. అన్ని పార్టీల ఎం.ఎల్.ఎ.లు, ఎం.పి.లు రిజర్వ్ స్థానా ల్లో గెలిచిన వాళ్లతో సహా అగ్రవర్ణ, అగ్రవర్గ పెత్తందార్లతోపాటు అడవి సంపదను దోచుకునే, అదివాసులకు వచ్చే రాజ్యాంగ, చట్టపరమెన హక్కుల్ని హరించే వారయ్యారు. చివరకు డిటిఎఫ్ నుంచి ఎదిగి ఆదివాసీ నాయకుడైన ఎం.ఎల్.ఎ. కూడ తొండ ముదిరి ఊసర కొమురం భీం ఆశయ సాధన మళ్లా ముందుకొచ్చింది.

ఆదివాసుల్లో కూడా వర్గీకరణ జరగాలనే ప్రజాస్వామిక డిమాండ్ ముందుకు వచ్చింది. తెలంగాణలో స్వపరిపాలన అంటే ఆదిలాబాద్ జిల్లా లో గోండుల, కోలాముల నాయకత్వంలో జరగాల్సిన ప్రజాస్వామిక పోరాటమేనని కొమురం భీం గుర్తు చేసుకున్నాడు.ఉట్నూరు, జైనూరు, బాచేఝరీ, హట్టెల మీదుగా జోడేఘాట్ బాట రోడ్డు కాని రోడ్డు. అది రాజమార్గం కాదు. అందుకే అక్కడ కొమురం భీం నేలకొరిగిన చోట కొము రం భీంను స్మరించుకుంటామంటే మావోయిస్టులు మందుపాతరలు పెట్టారు వెళ్లొద్దని కలెక్టర్‌ను, ఎం.ఎల్.ఎ.ల ను, అధికారులను, రాజకీయ నాయకులను పోలీసులు వారించారు. అధికారం హట్టెలోనే లాంఛనం పూర్తి చేసుకున్నది. ఆదివాసులు జోడేఘాట్‌లో కొమురం భీంను స్మరించుకున్నారు.
మరి మందుపాతర ఎక్కడున్నట్లు? జైనూరు మార్చనాయి వెపు పోతే పెదవాగు ఉన్నది. పెదవాగు మీద మూడు వందల కోట్ల రూపాయలతో కొమురం భీం ప్రాజెక్టు కట్టారు. అదీ ప్రభుత్వం పెట్టిన మందుపాతర. కాంట్రాక్టర్లు పెట్టిన మందుపాతర. ఇరవై ముప్ఫై గోండు గ్రామాలు మునిగిపోయాయి. వేలాది మంది నిర్వాసితులయ్యారు. మరి ఆ నీళ్లు ఎక్కడికి పోయాయో, పోతున్నాయో ఆసిఫాబాద్ వెళ్లి అధికారాన్ని అడగాల్సిందే.

కుంతాల జలపాతం శకుంతల కుంతలాలు ఆరబోసుకున్న జలపాతమని చెప్తారు. మూడు వైపులా దట్టమెన అభయారణ్యాలు. అంత లోతుకు జలపాతం దూకుతున్న సుడిగుండాల దగ్గరికి వెళ్లి చూస్తే రాళ్లమీద ప్రభుత్వ సర్వే చిహ్నాలు. జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కోసం, ఇనుప రజం తవ్వకాల కోసం, గ్రానైటు రాయి తవ్వకాల కోసం ప్రయత్నాలు. ఆ కోండల్లో ఒక సొరంగం ఉంది. వర్షాలు పుష్కలంగా కురిసిన ఈ సమయంలో ఆ సొరంగంలో ఒక శివలింగం ఉందని, శివరాత్రి రోజు ఆ సొరంగంలోకి వెళ్లి పది మంది పూజలు చేసేంత స్థలం ఉందని ఎవరైనా చెప్తే నమ్మలేం. నిర్మల్ చిత్రాలకు ఉపయోగించే కర్ర, రంగులు అక్కడి చెట్లల్లో దొరుకుతాయి. అది ఆదివాసీ సంస్కృతికి, కళలకు, సౌందర్యారాధనకు కాణాచిగా ఉన్న ప్రాంతం. అది రేపు హై సెక్యూరిటీ హైడెల్ ప్రాజెక్టు కానున్నది. ఎవరికోసం? ఏ గోండు గూడాల్లో చీకట్లను పారదోలడం కోసం.
నిర్మల్‌లో ప్రజలు కొమురం భీం స్ఫూర్తి చాలదన్నట్లు, గోండులతో పాటు, బడుగు వర్గాలను కూడా కూడగట్టడానికి సర్వాయి పాపని పోరాట స్ఫూర్తికి కూడా రూపమిచ్చారు. ఇవ్వాళ ట్యాంకుబండు మీద కూడా కొమురం భీం విగ్రహం పెట్టాలని తెలంగాణ ముక్తకం అడుగుతున్నది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీదనే ఎన్.ఎచ్. సెవెన్ మొదలవుతుంది. జోడేఘాట్‌లో నేలకొరిగిన చోటు నుంచి పునరుత్థానం చెంది, ఒళ్లు విరుచుకొని, గుండెలుప్పొంగించి జిల్లా కేంద్రం అదిలాబాద్‌కు వచ్చి తుపాకి అందుకొన్న కొమురం భీం నిలు విగ్రహం ట్యాంక్‌బండ్ దాకా వీరవిహారం చేస్తూ వస్తుందో, జోడేఘాట్ బాట ఢిల్లీ రాజమార్గాన్ని జయిస్తుందో? ఇదంతా విగ్రహరాధనేనా? పోరాట స్ఫూర్తియా? అన్నదే నాలుగు కోట్ల ప్రజల ప్రశ్న. నాయకులకు అర్థమయ్యే భాషలో అడగాలంటే మిలియన్ డాలర్ల ప్రశ్న.
-వరవరరావు

No comments:

Post a Comment