Wednesday, November 16, 2011

ఆదివాసుల అంతానికే పోలవరం - వట్టం నారాయణ దొర, జంజర రమేష్‌బాబు

'ఆదివాసులకు స్వీయ నిర్ణయ హక్కు ఉంది' - ఐక్యరాజ్యసమితి ఆదివాసీ హక్కుల ప్రకటన... పోలవరం కదిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా చర్చోపచర్చలు చెలరేగుతున్నాయి. లాలూచీ నిరూపిస్తామని ఒకరంటే దమ్ముంటే నిరూపించమని మరొకరు, ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేస్తే సకలజనుల సమ్మెను ఆపినందుకు నజరానా అని మరికొందరు, త్వరలో పని మొదలవుతుందని ప్రభుత్వం ప్రకటిస్తే న్యాయపోరాటమని కాంట్రాక్టర్లు... వెరసి విషయమంతా అవినీతి, అర్హత అనర్హతల కేంద్రంగానే కొనసాగుతున్నది. అయితే పోలవరం (ఇందిరా సాగర్) ప్రాజెక్టు అంతకే పరిమితం కాదు. ఇందులో మానవహక్కులున్నాయి. ఆదివాసీ హక్కులున్నాయి. అభివృద్ధి రాజకీయాలున్నాయి. వాటి పేరిట జరిగే విధ్వంసాలున్నాయి. బహుళజాతి సంస్థల ప్రయోజనాలున్నాయి. ప్రశ్నార్థకమవుతున్న ప్రజాస్వామ్య విలువలున్నాయి.

కేంద్ర జలవనరుల శాఖ 1986లో తయారుచేసిన 'గోదావరి సుజల సాగర డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్' ప్రకారం ఇది ఒక బహుళార్థక సాధక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 7.21 లక్షల ఎకరాలకు సాగునీరు, విశాఖ పట్టణం స్టీల్ ప్లాంట్, పారిశ్రామిక సంస్థల అవసరాలకు 23.44 టిఎంసీలు, కృష్ణానదికి 84.8 టిఎంసీల నీటి మళ్లింపు 600 గ్రామాలకు తాగునీరే కాకుండా 960 మెగావాట్ల సామర్ధ్యంతో విద్యుత్ ఉత్పత్తి ఇంకా అనేకానేక పథకాలతో సుమారు 2,665 కోట్ల పెట్టుబడితో (నేడు 17వేల కోట్లకు పైగా) 36 లక్షల క్యూసెక్కుల ప్రవాహ అంచనాతో పోలవరం, దేవీపట్టణాల మధ్య నిర్మించ తలపెట్టారు.

ఈ ప్రాజెక్టు కారణంగా ఖమ్మం జిల్లాలోని వి.ఆర్.పురం మండలంలో 45 గ్రామాలు, కూనవరం మండలంలో 48 గ్రామాలు, చింతూర్లో 17 గ్రామాలు, భద్రాచలంలో 13 గ్రామాలు, బూర్గంపాడులో 9 గ్రామాలు, కుకునూరులో 34 గ్రామాలు, వేలేరుపాడులో 39 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. అలాగే పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలో 29 గ్రామాలు, తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో 42 గ్రామాలు, ఒరిస్సా, చత్తీస్‌గఢ్‌లలో వరుసగా 7 గ్రామాలు, 10 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి.

సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) అంచనా ప్రకారం ఈ ప్రాజెక్టు వలన 276 గ్రామాల(వాస్తవంగా 350 గ్రామాలు)లోని రెండు లక్షల మంది (నేడు మూడు లక్షలు) ప్రజలు, అందులో రెండు లక్షల మంది ఆదివాసీలు నిర్వాసిత్వానికి, దాదాపు లక్ష ఎకరాల భూమి, 637 చ.కి.మీ విస్తీర్ణంలో షెడ్యూల్డ్ ప్రాంతం, దాదాపు ఎనిమిది వేల హెక్టార్ల రిజర్వు ఫారెస్ట్ జలసమాధికి గురవుతున్నాయి.

అంతేకాక పేరంతాలపల్లి, శ్రీరామగిరి, భద్రాచలం లాంటి పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాలు, ఆదివాసుల నిత్యజీవితంలో ఆహారంగా ఉపయోగపడే దుంపలు, కాయలు, గడ్డలు, వేలాది ఔషధ మొక్కలు, ఆహారంగానే కాదు ఆదాయాన్నిచ్చే ఊరుమ్మడి చింతచెట్లు, తాటిచెట్లు, తాము దైవంగా భావించే ఇప్పచెట్లు (ఇప్పపూవు, సారా, వంటనూనె), ఈతచెట్లు, వెదురు, కలప, జిగురు, కోట్లాది రూపాయల వ్యాపారం అయిన బీడీ ఆకు, భూమిలోని అత్యంత విలువైన ఖనిజ వనరులు జంతుజాలం... అన్నీ కనుమరుగు కానున్నాయి.

దేశంలోనే అత్యంత విధ్వసంకర అసమాన అభివృద్ధికి నమూనా అయిన పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు చట్టపరంగా ఎటువంటి అనుమతులు లభించకపోయినా (కేవలం పేపర్ వర్క్ చేసుకోవచ్చని ఏప్రిల్ 25, 2007న సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది) నిర్మించాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే! ఈ దేశ రాజ్యాంగం ఆదివాసులకు ఎన్నో విధాలైన హక్కులు, రక్షణలు కల్పించింది.

ఐక్యరాజ్యసమితి ఆదివాసీ హక్కుల ప్రకటనలో పేర్కొన్న - ఆదివాసులకు స్వీయనిర్ణయంలో భాగంగా వారి వ్యవహారాల విషయంలో స్వయంప్రతిపత్తి లేదా స్వయంపాలనా హక్కు ఉంది (ఆర్టికల్ 4). ఆదివాసీ హక్కులకు భంగం కలుగజేసే విధానాలు, శాసనాలు అమలు చేసేముందు ప్రభుత్వం ఆదివాసీలతో సంప్రదింపులు జరిపి అనుమతి పొందాలి (ఆర్టికల్19). ప్రజాభీష్టం, ఆదివాసుల అనుమతి లేకుండా ఆదివాసీ ప్రాంతాలలో ఎటువంటి మిలిటరీ కార్యక్రమాలను నిర్వహించరాదు (ఆర్టికల్ 30). ఇలాంటి అంశాలకు లోబడి ఉంటానని భారతదేశం ప్రకటించింది.

భూముల పరాయీకరణను నిరోధించేందుకు 1/70 చట్టం, అటవీ సంరక్షణ చట్టం-1980, పర్యావరణ పరిరక్షణం చట్టం -1986, షెడ్యూల్డ్ ప్రాంతాల పంచాయితీరాజ్ చట్టం (పెసా)-1996, అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 లాంటి పలు చట్టాలను రూపొందించింది. వీటి ద్వారా గ్రామసభలకు అత్యున్నత అధికారాలు సంక్రమించాయి.

మరి ఏ గ్రామ సభ అనుమతితో ఇంత దుర్మార్గమైన ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రభుత్వం సాహసిస్తుందో తెలుపగలదా? ఒక్క అనుమతినైనా ప్రభుత్వం చట్టానికి లోబడి సంపాదించిందా? సైట్ క్లియరెన్స్ 19 సెప్టెంబర్ 2005 నాడు అనుమతి పొందినప్పటి నుండి పెట్టుబడులకు 25 ఫిబ్రవరి 2009న, 26 డిసెంబర్ 2009 (తెలంగాణ ఉద్యమం శిఖరాగ్ర స్థాయిలో ఉన్నపుడు)న అటవీశాఖ అనుమతులు పొందినప్పటి వరకూ అన్నీ వివిధ ప్రభుత్వ విభాగాలు ఇచ్చినవే కదా?

ఇప్పటికే రెండు పంటలు పండిస్తున్న కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలకు మూడో పంటకు నీరందివ్వడానికి, బహుళజాతి కంపెనీల, కాంట్రాక్టర్ల కమిషన్లకు లొంగి ఆదివాసీ ప్రాంతాలను, ప్రజలను జలసమాధి చేయడానికి వ్యతిరేకంగా ముంపు ప్రాంతాలలో తీవ్రమైన ఉద్యమాలు ఎగిసాయి. తమ సాంప్రదాయ ఆయుధాలైన విల్లంబులు, బాణాలు, గొడ్డళ్లతో నిరసన తెలిపారు. 'పోలవరం ప్రాజెక్టు గురించి సర్వే చేయడానికి వచ్చే అధికారులకు ప్రవేశం నిషిద్ధం' అని పోస్టర్లు, బ్యానర్లు ప్రతి గూడెంలో పెట్టారు. వేలాదిమంది ఆదివాసీలు ర్యాలీలు, ధర్నాలు, భారీ బహిరంగ సభల ద్వారా సమరభేరి మోగించారు.

హక్కుల సంఘాలు, ఆదివాసీ, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, సామాజిక, పర్యావరణ వేత్తలు, మేధావులు అంరదూ పోలవరం ప్రాజెక్టును ప్రజావ్యతిరేక ప్రాజెక్టుగా అభివర్ణిస్తూ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసారు. అయినా ప్రభుత్వం లెక్కచేయకుండా పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూనే ఉంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం కాలువల తవ్వకానికి సుమారు 3,500 కోట్లను కాంట్రాక్టర్ల దోసిట్లో పోసింది. ఉద్యమ ప్రాంతాల్లో 144 సెక్షన్లు, అరెస్టులు, కాల్పులతో భయోత్పాతాలు సృష్టిస్తోంది. గత కొంతకాలంగా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతోంది.

రేపో మాపో రాష్ట్రం ప్రకటిస్తారేమోననే ఊహాగానాలు వినబడుతున్నాయి. ఈ తరుణంలో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రభుత్వం, కాంట్రాక్టర్లు కుమ్మక్కై, తమ ప్రాంతానికి సిరులు పండించే పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసుకొనే కుట్రలో భాగంగానే రెండవదశ టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టారు. 4,717 విలువైన నిర్మాణ పనులను చేజిక్కించుకోడానికి ఏడు స్థానిక, దేశీయ, విదేశీ సంస్థలు పోటీపడ్డాయి. ప్రాధమిక స్థాయిలోనే మూడు కంపెనీలు అనర్హతకు గురికాగా, ప్రాంతీయ (తెలంగాణ) సంస్థ 'స్యు-పేటల్-ఎఎమ్మార్ వెంచర్' 12.61 శాతం తక్కువకు మోసపూరితంగా టెండర్లను కోట్ చేసి పొందింది.

ప్రభుత్వం ప్రమాణాల ప్రకారం నిర్దేశించిన విలువగల పనులు చేయకున్నా, తప్పుడు అనుభవ సర్టిఫికేట్‌ను సమర్పించి మోసపూరితంగా టెండర్లు పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక పార్టీపై మరొక పార్టీ పోటీపడి దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన, వనరుల పరిరక్షణపై నేడు అన్ని పార్టీలు ప్రగల్భాలు పలుకుతున్నాయి. కానీ ఏ ఒక్క పార్టీ పోలవరం ప్రాజెక్టును నిలిపివేయాలని ఖచ్చితంగా మాట్లాడకపోగా కేవలం టెండర్ల రద్దు గురించే చర్చ చేయడం దేనికి సూచన? నష్టపోతున్నది నోరులేని ఆదివాసులనేగా ఈ చులకన? ఇది కేవలం టెండర్లకు, అవినీతికి మాత్రమే సంబంధించిన అంశం కాదు.

ముందే అనుకున్నట్లు ఇది లక్షలాది మంది ఆదివాసుల జీవన్మరణ సమస్య. భారత రాజ్యాంగం కల్పించిన గౌరవంగా జీవించే హక్కు సమస్య. ప్రజాస్వామిక విలుల సమస్య. అందుకే అభివృద్ధిని ఎవరు ఎలా నిర్వచిస్తున్నారో స్పష్టం కావలసి ఉంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన పట్టణాలు, నగరాలకు మరింత సౌకర్యాలను కల్పించడానికి రోడ్లు, కరెంట్, తాగునీరు, విద్య వైద్యం లాంటి కనీస సౌకర్యాలు కూడా లేని ఆదివాసీ ప్రాంతాలు, ప్రజలు ఎందుకు బలికావాలో పాలకులు సమాధానమివ్వవలసి ఉంది.

వలస పాలనా కాలం నాటి చట్టాలకు మెరుగులుదిద్దుతూ భారతదేశం నయావలస దేశంగా మారి కోట్లాదిమంది ప్రజలను నిర్వాసితులను చేసే విధానాలను ప్రజాస్వామికవాదులు ప్రశ్నించవలసి ఉంది. ఇంత హఠాత్తుగా ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వాలు పడుతున్న ఆరాటం వెనుక కారణం వారి కాళ్ళ కింద ఉన్న లక్షల కోట్ల సంపదే కదా!

ఇప్పటికే ఆదివాసీ సమాజం అల్లకల్లోలంగా ఉన్నది. లక్షలాది మంది ఆదివాసీలు ప్రభుత్వాలు సృష్టించిన 'వారి వేలితోనే వారి కన్నును పొడిపించే' సిద్ధాంతంతో నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు. తాగడానికి మంచినీరు, జ్వరమొస్తే మందుబిళ్ల దొరకనంత దయనీయస్థితిలో బతుకుతున్నారు. ఆఖరికి నగరవాసుల మానసికోల్లాసానికి ఉపయోగపడే 'జూ'లోని జంతువుల పట్ల చూపే శ్రద్ధ మాపైన లేదెందుకని నిలదీస్తున్నారు. ఇప్పుడు పోలవరం పేరు మీద నిర్వాసితుల్ని చేస్తే నగరాలలో 'ఆదివాసీ ప్రదర్శన శాల'లో తప్ప మరోవిధంగా బ్రతకలేమని ఆందోళన చెందుతున్నారు.

అందుకే ఆదివాసీ జాతి అంతానికి కారణమయ్యే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అందరూ నిర్ద్వందంగా వ్యతిరేకించాలి. భారత రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులు రక్షణలను అమలు చేసేలా ప్రభుత్వాలపై ఒత్తిచేయాలి. 'అడవిపై హక్కు ఆదివాసులదే కానీ ప్రభుత్వాలది కాదు' అని నినదిద్దాం. ఆదివాసీ ఉద్యమాలకు దన్నుగా నిలబడడం నాగరిక సమాజాల నైతిక బాధ్యతగా గుర్తిద్దాం. రద్దు చేయవలసింది టెండర్లను కాదు పోలవరం ప్రాజెక్టునని డిమాండ్ చేద్దాం. ప్రతిదానికి ఒక ఆరంభం ఉన్నట్లే అంతం కూడా ఉంటుంది. కదిలిన పోలవరం జల్, జంగల్, జమీన్ కొరకు పోరాడిన కొమరం భీమ్ స్ఫూర్తితో ఢిల్లీని తప్పక కదిలిస్తుంది.

- వట్టం నారాయణ దొర, జంజర రమేష్‌బాబు
కన్వీనర్, కో కన్వీనర్, పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక పోరాట వేదిక Andhra Jyothi News Paper Dated 17/11/2011

No comments:

Post a Comment