Saturday, February 4, 2012

దళితుల ఐక్యత విచ్ఛిన్నానికే..విగ్రహాల విధ్వంసం


దోపిడీ, కుట్ర, కుతంత్రం, వైరుధ్యాలు, విధ్వంసాలు మొదలైనవన్నీ వర్గ ప్రయోజనాల కోసం ఏర్పడ్డ మేధో జనీత ప్రక్రియలే. వ్యక్తివాదం సమష్టివాదంగా మారే క్రమంలో శక్తి జనీతాల్లో ఉన్న వ్యత్యాసాలను శూన్యత్వానికి నెట్టివేసే కుట్రలను అమలు చేస్తారు దోపిడీదారులు.తమ భద్రమైన జీవితానికి బాటలు వేసుకుంటూ జీవన గమనాన్ని గతి తప్పిస్తూ గందరగోళపరుస్తూ ఉంటారు. ఆధిపత్య కుల వర్గాలు దీనిలో భాగంగానే ఈ విగ్రహాల విధ్వంసం చేస్తున్నారు. ఈ విగ్రహాల విధ్వసం వెనుక ఉన్న కుట్రలలో మూడు కారణాలు గోచరిస్తాయి. 1. ఎస్సీ, ఎస్టీలని అణచివేసి అగ్రవర్ణ ఆధిపత్యాన్ని వ్యవస్థీకరించుకోవాలన్న ఆలోచన. 2.తెలంగాణ ఉద్యమాన్ని పునరుజ్జీవనం కాకుండా ఆలోచనలను మళ్లించడం. 3.అమెరికా సామ్రాజ్యవాద కుట్రలకు తలొగ్గి ప్రైవేటీకరణను విస్తృతంగా అమలుపరిచే క్రమంలో సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టి సమష్టివాదాన్ని వ్యక్తివాదానికి మరల్చడం, సమానత్వ భావనకు సమాధి కట్టడం. అనేక కులాలుగా విభజితమై ఉన్న భారతదేశ వ్యవస్థలో విగ్రహాలకు ప్రముఖ స్థానం ఉన్నది. విగ్రహాలు ఒక భావజాలానికి ప్రతీకలు. ఒక ఐడెంటిటీని స్ఫూరింపజేస్తాయి.చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. 

సమాజాభివృద్ధికి దోహద పడుతూ ఉంటాయి.దళితుడిగా పుట్టినందుకు అంబేద్కర్‌ను జాతీయ చిహ్నం కాకుండా చూడటంలోనే నాయకుల కపటత్వం, అగ్రకుల స్వభావం కనిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీలను అంటరానివారిగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచడంలోనే ఆ జాతులలో శూన్యత్వం ఏర్పడుతుంది. దళిత బహుజనులు తమను తాము నూన్యతా భావంలోకి నెట్టుకునే పరిస్థితి కలుగుతుంది. ఈ ఎత్తుగడ విగ్రహాల విధ్వంసంలో కనపడుతున్నది. రాజ్యాంగ రక్షణలతో పాటు అంబేద్కర్ దళితులకు పోరాటాన్ని నేర్పారు. ఈ పోరాట వారసత్వంలోంచి.. తమ జాతి హక్కులను కాపాడుకోవడానికి కావలసిన శక్తి యుక్తులు ఆ జాతులకు ఉన్నాయనే విషయాన్ని అగ్రవర్ణాల వారు తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యంలో విధ్వంసానికి తావులేదు. కానీ పాలక వర్గాలలో ఉన్న అగ్రవర్ణాల వారు విధ్వంసాన్ని ప్రోత్సహిస్తూ తమ కుట్రలను అమలు జరుపుతున్నారు. సమాఖ్య వ్యవస్థలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆయా ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్రాల ఏర్పాటు జరుగుతూనే ఉంది. ఒక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మాత్రమే దానికి భిన్నంగా జరుగుతున్నది. తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రా వ్యాపారులు స్థిర వ్యాపారాన్ని ఏర్పరుచుకుని విస్తృత పరుచుకునే క్రమంలో ప్రజాందోళనలను నిర్వీర్య పరుస్తున్నారు. 

కేంద్రంతో ఆంధ్రవూపాంత వ్యాపారులు రాజకీయ ఒప్పందాలు చేసుకున్నారు. రాజ్యాంగ సంక్షోభం దిశగా పయనిస్తున్న సకల జనుల సమ్మె క్రమం రాజకీయ పార్టీల నాయకుల మధ్య సందిగ్ధత తెచ్చింది. రాజకీయ చదరంగంలో వేస్తున్న ఎత్తులు పై ఎత్తులు గందరగోళం మధ్య సకల జనుల సమ్మె విరమింప చేయడం జరిగింది. ఆంధ్ర నాయకుల ఎత్తుగడలు ఫలించాయి. తెలంగాణ ప్రజల ఆకాంక్షపై రాజకీయ దాడి మొదలైంది. అది చంద్రబాబు పర్యటనతో మొదలై, కాంగ్రెస్ పార్టీ అధికార స్థిరీకరణలో భాగంగా విస్తరణ తదనంతరం విగ్రహాల ధ్వంసంతో కొనసాగుతున్నది. ఇది రాజకీయ కుట్ర. తెలంగాణ అంశం ప్రధాన భూమికగా జరుగుతున్న ఉద్యమంపై నీళ్లు జల్లడానికి రాజకీయ చదరంగంలో వేస్తున్న పావులలో విగ్రహాల విధ్వంసం ఒకటి. అదే విధంగా దళితుల చైతన్యాన్ని కూడా అంచనా వేయడం అగ్రవర్ణాలకు అవసరం. ఎందుకంటే దళితవాదం, ప్రాంతీయ వాదం సమూహవాదాలలో భాగంగానే చూస్తున్నారు. ఈ విధంగా ఒక్క దెబ్బతో రెండు వాదాలు దెబ్బతింటాయి. ఇది ఆంధ్ర ప్రాంత అగ్రవర్ణ రాజకీయ నాయకుల కుట్ర. భారత సమాజం కుల వ్యవస్థ అవడం వలన విశాల ప్రజా క్షేత్రం అనేక చిన్న చిన్న కుల కమతాలుగా ఏర్పడడం వల్ల ప్రజల ప్రయోజనాలు ముందు కు వచ్చినప్పుడు వారిని విభజించే కుట్రలు ముందుకు వచ్చాయి. వీటిలో భాగంగానే విగ్రహాల విధ్వంసం జరుగుతోంది. 

దీనితో తెలంగాణ కోసం సంఘటితంగా ముందుండి పోరాడుతున్న దళిత బహుజనులను తెలంగాణ ఉద్యమం నుంచి దూరం చేసి తద్వారా తెలంగాణ ఉద్యమాన్ని బలహీన పర్చడం లక్ష్యంగా ఈ కుట్రలు జరుగుతున్నాయి. ఈ సీమాంధ్ర దోపిడీ దారు ల విభజించు పాలించు కుట్రలను దళిత బహుజనులు అర్థం చేసుకుంటున్నారు. సీమాంధ్ర పాలకుల కుట్రలను ఓడిస్తారు. తమ జాతి విముక్తి కోసం దళిత బహుజనులు పోరాడుతూనే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడుతారు. తమ జాతి ప్రతీకలైన అంబేద్కర్ విగ్రహ విధ్వంసకుల పునాదులను పెకిలిస్తారు. అంబేద్కర్‌ను ఈ దేశ సర్వజనుల విముక్తి పథానికి వెలుగు కాగడాగా ఎత్తి పడతారు. 
-జూలూరు కిషnu 
Namasete Telangana News Paper Dated 05/02/2012

No comments:

Post a Comment