Thursday, October 31, 2013

తండా నుండి లండన్ దాకా By ప్రొఫెసర్ భంగ్యా భూక్యా జీవితంలోని కొన్ని సంఘటనలే ఈ వారం అనుభవం.


Published at: 01-11-2013 07:00 AM
 
1 
 
0 
 
0 
 
 

అడుగడుగునా పడదోసే పాము పడగలే ఉన్నా, మునుముందుకే సాగిపోయిన వాడు భంగ్యా భూక్యా. తండాలో జన్మించి తిండికోసం విలవిల్లాడే స్థితి నుంచి ఇంటర్నేషనల్ ఫెలోషిప్‌తో లండన్‌లో పిహెచ్.డి చేసే దాకా ఆయన జీవితం ఒక అగ్ని సరస్సులాగే సాగింది. నిజాం పాలనలో లంబాడీల జీవితాలపౖౖెన ఆయన సమర్పించిన సిద్ధాంత గ్రంథం 'సబ్జుగేటెడ్ నోమాడ్స్' ఎన్నో యూనివర్సిటీల సిలబస్‌లో విధిగా చదవాల్సిన పుస్తకం అయ్యింది. ఆ పుస్తకం తెలుగుతో సహా పలు భాషల్లోకి అనువాదం కూడా అయ్యింది. ప్రస్తుతం 'ద ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ'లోని సోషల్ ఎక్స్‌క్లూషన్ స్టడీస్ విభాగపు అధిపతిగా ఉన్న ప్రొఫెసర్ భంగ్యా భూక్యా జీవితంలోని కొన్ని సంఘటనలే ఈ వారం అనుభవం.
నాకు ముగ్గురు అక్కలు, ఒక అన్న. నేను చివరి వాణ్ని. నేను స్కూలుకు వెళ్లడమన్నది యాదృచ్ఛికమే. ఖమ్మం జిల్లాలోని బండమీది తండ మా ఊరు. మాకు ఓ పది గొర్రెలు, ఓ ఐదారు పశువులు ఉండేవి. నేనూ, మా అక్క కలిసి మా ఊరి పక్కనున్న ఒక చిన్న కుంటలో వాటిని మేపుతూ గడిపే వాళ్లం. నాకన్నా ముందు ఓ ముగ్గురు మా తండా నుంచి స్కూలుకు వె ళ్లే వారు. ఆ రోజుల్లో స్కూళ్లలో మధ్యాహ్నం వేళ ఉప్మా పెట్టేవాళ్లు. వీళ్లు అక్కడ తిని, ఇంటికీ కొంత తీసుకు వచ్చేవారు. నాకు కొంచెం పెట్టమని అడిగితే వాళ్లు పెట్టేవాళ్లు కాదు. నాకు కోపం వచ్చింది. అయినా వాళ్లు పెట్టేదేమిటి? నేనే స్కూల్లో చేరుతా అనుకున్నాను. అలా కేవలం ఉప్మా కోసమని నేను స్కూల్లో చేరాను. అయితే క్రమక్రమంగా చదువు మీద నాకు బాగా మక్కువ పెరుగుతూ వచ్చింది. ఆ రోజుల్లో మా ప్రాంతంలో మార్క్సిస్టు పార్టీ రాజకీయాలే బలంగా ఉండేవి. అందుకే ఆ రోజుల్లో నా మీద ఆ ప్రభావం కొంత ఉండేది.
నాలుగో తరగతి దాకా మా పక్క ఊళ్లలోనే నా చదువు సాగింది. ఆ తరువాత సుబ్లేడు గ్రామంలోని గిరిజన సంక్షేమ హాస్టల్‌లో సీటు రావడంతో 5వ తరగతి నుంచి అక్కడ చేరిపోయా. అది మా ఊరి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే హాస్టలంటే ఒకటే హాల్. ఆ హాల్‌లో 120 మంది విద్యార్థులం ఉండేవాళ్లం. బాగా ఇరుకుగా ఉండడమే కాకుండా భోజనం చాలా దారుణంగా ఉండేది. అన్నంలోకి రోజూ చారు తప్ప మరేమీ ఉండేది కాదు. రెండు రూపాయల కిలో బియ్యమే హాస్టల్‌కు సరఫరా అయ్యేవి. అన్నంలో ఎప్పుడూ తెల్లతెల్లని పురుగులు ఉండేవి. చారు పోశాక ఆ పురుగులు పైకి తేలేవి. తేలిన పురుగుల్ని తీసేసి ఆ భోజనం తినేవాళ్లం. దీనికి తోడు దాదాపు అందరికీ నిలువెల్లా గజ్జి సమస్య ఉండేది. ఇవన్నీ కాక అక్కడ ఉండే సుబ్బారెడ్డి అనే టీచర్ నన్ను కులం పేరుతో చాలా అసహ్యంగా తిట్టేవాడు. భరించలేక ఇక చదువొద్దు ఏమీ వద్దనుకుని మా ఊరికి వెళ్లిపోవాలనుకున్నా. ఒకసారి వెళ్లిపోయాను కూడా. అయితే మా అమ్మ నచ్చచెప్పి మళ్లీ తీసుకు వచ్చి స్కూల్లో వదిలేసి పోయింది.
చంపేస్తాడనుకున్నా
ఎనిమిదో తరగతిలో దాదాపు అందరూ ప్యాంట్ వేసుకునేవారు. చెప్పులు కూడా ఉండేవి. నాకు మాత్రం ప్యాంట్లు గానీ, చెప్పులు గానీ లేవు. ఎంతో కోరికగా ఉన్నా వీలు కాక నిక్కర్ల మీదే స్కూలుకు వెళ్లేవాణ్ని. అప్పుడు దసరా సెలవులు వచ్చాయి. సెలవుల్లో ప్రతిసారీ పెసరకాయలు తెంపడానికి, వేరుశెనగ కాయలు పెరకడానికి వెళుతుండేవాణ్ని. ఈసారి కూడా ఆ పనుల్లోకి వెళ్లి ఎలాగైనా ప్యాంటు, షర్ట్ కొనుక్కోవాలని గట్టిగా అనుకున్నా. వాటికోసం ఆ రోజుల్లో 70 రూపాయలైనా కావాలి. అందుకోసం సెలవులు అయిపోయాక కూడా ఓ ఐదు రోజులు పని చేసి వచ్చిన డబ్బులతో ప్యాంట్ షర్ట్, స్లిప్పర్స్ కొనుక్కున్నాను. పది మైళ్ల దూరంలో ఉన్న సుబ్లేడుకు నడిచే వెళ్లాలి కాబట్టి, కొత్త బట్టలు వేసుకుని నేరుగా స్కూలుకు బయల్దేరాను. వెళ్లేసరికి ప్రార్థన అయిపోయింది. ఫస్ట్ పీరియడ్ సుబ్బారెడ్డిదే కాబట్టి ఆయన క్లాసు తీసుకుంటున్నాడు. మామూలుగానే హీనాతిహీనంగా తిడుతూ, అతి చిన్నకారణాలకే ఒళ్లు హూనమయ్యేలా కొట్టేవాడు. ఏనాడూ ఆయన నన్ను నా పేరుతో పిలవలేదు. 'అరే ఓ లంబాడి... కొడుకా' లాంటి బూతులే.

ఐదు రోజులు స్కూలుకు రాకపోవడం, ఆ వచ్చిన రోజు కూడా కాస్త ఆలస్యంగా రావడం అతని కోపానికి ఆజ్యం పోశాయేమో! క్లాసులోకి అడుగు పెట్టగానే కర్ర తీసుకుని కొట్టడం మొదలెట్టాడు. కొడుతూనే ఉన్నాడు. కొడుతూనే ఉన్నాడు. క్లాసులో అందరూ ఉన్నారు. నేను దెబ్బలు తప్పించుకోవడానికి బెంచీల మధ్యలోంచి అటూ ఇటూ పరుగులు తీస్తున్నాను. ఆయన నన్ను వెంటాడి వెంటాడి కొడుతూనే ఉన్నాడు. ఒక కర్ర విరిగిపోతే మరో కర్ర, అలా నాలుగు కర్రలు విరిగిపోయాయి. అరగంట పాటు ఆ దుర్మార్గం కొనసాగుతూనే ఉంది. ఆ రోజు నేను చనిపోతాననే అనుకున్నా. ఈ చదువింక మనతో కాదనుకుని మా ఊరికి వెళ్లిపోవాలనుకున్నా. ఆ మాట హాస్టల్ వార్డన్‌కు కూడా చెప్పేశా. కానీ, హాస్టల్ వర్కర్సంతా నామీద ప్రేమతో నన్ను వారించారు. ఎలాగో గుండె చిక్క బట్టుకుని ఉండిపోయాను. పాఠాలు చెప్పే పంతుళ్లు స్కూలుకు ఆవల విద్యార్థుల జీవితమేమిటన్నది కొంతైనా ఆలోచించాలి కదా! ఆనాడు నా ఒంటి మీద పడిన దెబ్బల బాధ ఈ నాటికీ తాజాగానే ఉంది. కుంగదీసే గాయాల్ని కూదా నిచ్చెనగా చేసుకుని పైకెక్కిపోవాలేమో మాలాంటివాళ్లం! ఇన్నిన్ని అవమానాల్ని భరించే శక్తి ఉంటే తప్ప ఒక పేద వాడు ముందుకు సాగడం సాధ్యం కాకపోతే ఎలా?
ఏమిటా బంధం?
మా ప్రాంతంలో బలంగా ఉన్న లెఫ్టిస్ట్ పార్టీల ప్రభావం నా మీద బాగానే ఉందని చెప్పా కదా. ఇది సామాజిక విషయాల మీదికి నా దృష్టి మళ్లేలా చేసింది. నేను మంచి మార్కులతో పాసైనా సామాజిక శాస్త్రాలు చదవాలన్న నిర్ణయానికి రావడానికి ఆ ప్రభావమే కారణం. ఖమ్మంలోని సిద్దారెడ్డి కాలేజ్‌లో హెచ్.ఇ.సి. గ్రూపుతో ఇంటర్‌లో జాయినయ్యాను. ఆ ఈ రెండేళ్ల కాలం నా జీవితంలో చాలా కీలకమైనది. మా ఊరికి ఖమ్మం 30 కి.మీ. మా ఊరి నుంచి ఒకే ఒక్క ట్రిప్ బస్సు వెళ్లేది. దానివ్లల ఖమ్మంలోనే ఉండటం తప్పనిసరి అయ్యింది. అందుకే ముగ్గురు మిత్రులం కలిసి ఒక రూము తీసుకున్నాం. నెలకు ఒక్కొకరికీ తక్కువలో తక్కువ 100 రూపాయల ఖర్చు వచ్చేది. అయితే మా కాలేజీ లెక్చరర్‌లు పూనాటి వెంకటేశ్వరరావు గారు, సీతారాంగారు ఆర్థికంగా మేమందరం ఇబ్బందుల్లో ఉన్నామన్న విషయాన్ని పసిగట్టారు. ఇద్దరూ కలిసి ఒక రోజు మా రూముకు వచ్చి, మా పరిస్థితుల్ని మరింత క్షుణ్ణంగా తెలుసుకుని, ఇక నుంచి ఆర్థికంగా ఎంతో కొంత సాయం చేస్తాం అంటూ హామీ ఇచ్చారు.

సీతారాం గారు ఆర్థిక సహాయం అందించలేకపోయినా గొప్ప నైతిక బలాన్ని నాలో నింపేవారు. ఇచ్చిన మాట మేరకు ఎప్పుడూ ఏదో రకంగా సాయం అందచేస్తూ వచ్చారు. వీటి వల్ల మాకొక మానసిక స్థిమితత్వం ఏర్పడింది. వారు ఆ సాయానికి పూనుకోకపోతే, నిజంగా చదువుకు సంబంధించి మా అధ్యాయం అక్కడితో ముగిసిపోయేది. ఇంటర్ అయిపోగానే డిగ్రీ కోసం రెసిడెన్షియల్ కాలేజ్‌లో చేరడం మేలని ఆయనే దరఖాస్తులు తెప్పించారు. ఎంట్రన్స్ రాశాను. కర్నూలులోని సిల్వర్‌జూబ్లీ రెసిడెన్షియల్ కాలేజ్‌లో బి.ఏ.లో సీటు వచ్చింది. సీతారాంగారు నాతో పాటే కర్నూలు వచ్చి, కాలేజ్ అడ్మిషన్, హాస్టల్ అడ్మిషన్ అయ్యాకే వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోతుంటే పైకి కనిపించని నా కన్నీళ్లు నా నిలువెల్లా ప్రవహించడం మొదలెట్టాయి. నేనెవరు? వీళ్లెవరు? నాకోసం ఇంత చేయడం ఏమిటి? కళ్లల్లో కారం చల్లే సుబ్బారెడ్డి లాంటి టీచర్లు ఉన్న ఈ సమాజంలో వెంకటేశ్వరరావు గారు, సీతారాం గారి లాంటి వాళ్లు లేకపోతే సమాజం మీద నమ్మకమేముంటుంది? నా నె త్తిన పాలు పోసి, నా జీవితంలో అమృతం నింపిన వాళ్లు వారు. ఆ రోజుల్ని, వారు చేసిన సాయాన్ని తలుచుకుంటే ఈ రోజుక్కూడా నా కళ్లు చెమ్మగిల్లుతాయి.
వర్గం కాదు కులమే
ఎం.ఏ (చరిత్ర) కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకుంటే నాకు సీటు వచ్చింది. కాకపోతే, డిగ్రీ దాకా తెలుగు మాధ్యమమే చదువుకున్న మాకు ఇంగ్లీషు సంభాషణ కష్టంగా ఉండేది. అదో ఇబ్బంది. దీనికి తోడు మేమంతా పాత దుస్తులు, స్లిప్పర్స్ వేసుకుని తిరుగుతుంటే చూసేవాళ్లంతా మా భాష మీద, మా దుస్తుల మీద జోకులు వేసేవారు. ఎంత పట్టించుకోకుండా ఉందామనుకున్నా వారి మాటలు ఎంతో కొంత ఆత్మన్యూనతా భావానికి గురిచేసేవి. ప్రారంభంలో ట్రైబల్ స్టూడెంట్స్ ఆరుగురు ఉన్నా ఈ పరిస్థితులు తట్టుకోలేక వాళ్లల్లో ముగ్గురు వెళ్లిపోయారు. మెల్లమెల్లగా ఎస్‌సి, ఎస్‌టి వాళ్లంతా ఒక గ్రూపుగా, అగ్రకులాల వారంతా ఒక గ్రూపుగా విడిపోవడం జరిగింది. కుల ప్రాతిపదికన స్నేహాలు ఏర్పడటం అన్నది బాధాకరంగా ఉండేది. ఆంధ్రాప్రాంతం నుంచి వచ్చిన దళిత విద్యార్థులు తాము దళితులమని చెప్పుకునే వాళ్లు. ఒకసారి బాపట్ల నుంచి సుధాకర్, నాగభూషణం అనే ఇద్దరు దళిత విద్యార్థులు వచ్చి పి.జి.లో చేరితే వారిని కూడా ఇతరులు అలాగే అవమానించడం మొదలెట్టారు. వీళ్లు తిరగబడటంతో విషయం పరస్పర భౌతిక దాడుల దాకా వెళ్లింది. ఆ తరువాత దళిత విద్యార్థులంతా సంఘటితం కావడం మొదలెట్టారు. అప్పటిదాకా మార్క్సిజం భావజాలంతో ఉన్న నేను అంబేద్కరిజం వైపు మొగ్గు చూపాను. సమాజంలో ఉన్నవి వర్గ సమస్యలు కాదు, కుల సమస్యలేనన్న భావన నాలో బలపడింది. ఈ స్థితిలోనే యూనివర్సిటీలో తొలిసారిగా అంబేద్కర్ అసోసియేషన్ ఊపిరిపోసుకుంది. దాని సంస్థాపక సభ్యుల్లో నేనొకడ్ని. అప్పటిదాకా చౌదర్లమని చెప్పుకుంటూ బతికిన విద్యార్థులంతా తాము దళితులమనే నిజాన్ని బహిర్గతం చేశారు.

తరాలు మారితేనేమిటి?
ఎం.ఏ అయిపోగానే ఎం.ఫిల్‌లో చేరాను. ఎం.ఫిల్ థీసిస్ సమర్పించక ముందే నాకు ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. అప్పుడే దసరా సెలవులు రావడంతో నేను మా ఊరికి వెళ్లాను. మాతో మొదట్నించి ఎంతో సాన్నిహిత్యం ఉన్న ప్రభాకర రెడ్డి అనే ఆయనతో ఈ శుభవార్త చెబుదామని మా కజిన్‌తో క లిసి వారింటికి వెళ్లాను. అతను పది ఫెయిలవడంతో చదువు అంతటితో ఆపేసి కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ ఉండేవాడు. వాళ్లదో పెద్ద బంగళా. నేను వాళ్ల ఇంటికి వెళ్లడం అదే మొదటిసారి. నేను వెళ్లినప్పుడు ప్రభాకరరెడ్డ్ది ఇంట్లోనే మంచం మీద కూర్చుని ఉన్నాడు. వాళ్ల అమ్మానాన్నా అక్కడే ఉన్నారు. వెళ్లి విషయం చెప్పాను. 20 నిమిషాల పాటు నన్ను నిలబెట్టి మాట్లాడాడే తప్ప కూర్చోమనలేదు. ఇంక ఉండలేక తిరిగి వచ్చేశాను. బయట ఎంతో ఆత్మీయంగా ఉండే అతను ఆ సమయాన అలా ఎందుకు చేశాడా? అన్న ఆలోచనల్లో పడ్డాను. ఆ రాత్రంతా నాకు నిద్రే పట్టలేదు. ఉద్యోగం వచ్చిన సంతోషమే లేకుండా పోయింది నాకు. ఏమీ చదువుకోని మా నాన్న పట్ల వ్యవహరించిన తీరుకు, చదువుకుని ఒక స్థాయికి వచ్చిన నా పట్ల వ్యవహరించిన తీరుకు పెద్ద తేడా లేదనిపించింది. సమాజంలో ఉన్నది కుల సమస్యే అని అంతకు ముందే ఏర్పడిన భావన ఆ సంఘటనతో మరింత బలపడింది. క్లాసు లేదు. కులమే ఉంది అనే భావన నాలో పాదుకుపోవడానికి ఈ అనుభవం బాగా దోహదం చేసింది.

వచ్చిన దారిని మర్చిపోతామా?
పి.హెచ్‌డి కోసం నేను లండన్ వెళ్లాను. అక్కడే ఉద్యోగం వచ్చే అవకాశాలున్నాయి, చేస్తావా అని మా గైడ్ అడిగారు. కాని నేను నా దేశానికి తిరిగి వెళ్లిపోవాలనుకుంటున్నట్లు చెప్పాను. నా శక్తి మేరకు మా గిరిజనులకు ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను, అందుకే ఏం చేసినా ఇండియాలోనే చేస్తానని చెప్పాను. ఆయన ఎంతో సంతోషించారు. ఎంత ఎత్తుకు ఎదిగినా దాటి వచ్చిన లోయల్ని మరిచిపోకూడదని నేన నుకుంటాను. ఈనాటికీ అడుగడుగునా ఎన్నో అవమానాల్ని ఎదుర్కొంటూ దుర్భరమైన జీవితం గడుపుతున్న వారికి ఆసరా అందించడం కన్నా గొప్ప పని ఏముంటుంది? నా కృషి వెనుక ఒక ఉన్నత స్థానాన్ని అందుకోవాలన్న ఆశ కన్నా, లంబాడాలకు ఎదురవుతున్న అవమానాలకు అడ్డుకట్ట వేయాలన్న కసి ఉంది. పాజిటివ్ కసి సమాజానికి మంచే చేస్తుందన్న సత్యాన్ని నా జీవితమే నాకు నేర్పింది.

హీనాతిహీనంగా తిడుతూ, అతి చిన్నకారణాలకే ఒళ్లు హూనమయ్యేలా కొట్టేవాడు. ఏనాడూ ఆయన నన్ను నా పేరుతో పిలవలేదు. 'అరే ఓ లంబాడి... కొడుకా' లాంటి బూతులే తిట్టేవాడు.
-బమ్మెర
ఫోటోలు: నవీన్

Navya, Andhra Jyothi Telugu News Paper Dated: 1/11/2013 

విభజనతోనే ముస్లింల వికాసం By -మహమ్మద్ అజ్గర్‌అలీ

ఆధునిక ఆంధ్రవూపదేశ్‌లో 1950 తరువాత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే కొన్ని విచిత్ర అంశాలు కన్పిస్తాయి. 1953, 1969,1972 లలో విభజనను పూర్తిగా సమర్ధించిన వారు, 2013లో విభజన ప్రకటన వచ్చిన తరువాత సీమాంధ్ర ప్రాంత వాసులు సమైక్యతా వాదులుగా మారారు! నిజంగా ఇది వారి హృదయాలలోంచి వచ్చిందేనా? సీమాంవూధలోని అన్నీ వర్గాల ప్రజలు సమైక్య వాదాన్ని సమర్థిస్తున్నారా? అయితే ఇరుప్రాంతాల్లోని ముస్లింలు ఏం కోరుకుం టున్నారు? వారి చారిత్రక,జీవన పరిస్థితులేమిటి?

రాష్ట్ర జనాభాలో ముస్లింల జనాభా దాదాపు 13శాతం వరకు ఉంది. తెలంగాణ ప్రాంతంలో ముస్లింలు, కోస్తా ప్రాంతం కన్నా అధికంగానే ఉన్నారు. హైదరాబాద్‌లో 40శాతానికి పైగా ముస్లిం జనాభా ఉంది. పాతబస్తీలో 90శాతం వరకు ముస్లింలున్నారు. అన్ని తెలంగాణ జిల్లాల్లో కూడా ముస్లింలు గణనీయంగా ఉన్నా రు. కానీ తెలంగాణ ఉద్యమంలో వీరి పాత్ర స్వల్పంగానే కనిపిస్తుంది. ఎంఐఎం తెలంగాణ ఏర్పాటును వ్యతేరేకించింది. రాష్ట్రం విడిపోరాదని, విడిపోతే ‘రాయల తెలంగాణ’ ఏర్పాటు చేయాలని కోరింది. ఎట్టి పరిస్థితులలోనూ హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ఒప్పుకోమన్నా రు. ఉద్యమానికి మూలస్తంభంగా పరిగణించే టీఆర్‌ఎస్‌లో కూడా ముస్లిం నాయకులు వేళ్లమీద లెక్కించే సంఖ్యలోనే ఉన్నా రు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ నిలబెట్టిన ముస్లిం అభ్యర్థి పరాజయం పొందాడు. తెలంగాణ ఏర్పడితే నక్సలిజం పెరుగుతుందని, బీజేపీ ప్రాబ ల్యం పెరుగుతుందనే ప్రచారం కూడా జరిగింది. బీజేపీ అగ్ర నాయకులు సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్‌సింగ్, నరేంద్ర మోడి మొదలగు వారు తెలంగాణలో పర్యటించారు. తెలంగాణకు మద్దతు ప్రకటించారు. మొత్తం మీద పరిశీలిస్తే తెలంగాణ ఉద్యమంలో ముస్లింల పాత్ర స్వల్పంగానే ఉన్నదని చెప్పవచ్చు. ముస్లిం విద్యాధికులు తెలంగాణ ఏర్పాటును ఆమోదించినా, ముస్లిం సామాన్య ప్రజలలో తెలంగాణవాదం మిగతా వర్గాల ప్రజలతో పోలిస్తే అంతగా లేదు.
ddre21

ఇక సీమాంధ్ర ప్రాంతానికి వస్తే.. ముస్లింల జనాభా 5-6శాతం కన్నా ఎక్కువ లేదు. వీరిలో 95శాతం మంది చేతి వృత్తుల మీద ఆధారపడిన వారు. అక్షరాస్యత అధికంగా లేదు. రాయలసీమ ప్రాతం, దక్షిణ కోస్తాలో ముస్లింలు కొంత ఎక్కువగా కన్పిస్తారు. గోదావరి జిల్లాలలో, ఉత్తరాంధ్రలో అతి స్వల్పం. కానీ సమైక్య ఉద్య మంలో వీరి పాత్ర అధికంగా ఉంది. ముఖ్యంగా రాయలసీమలోని అన్నీ జిల్లాలలోనూ, గుంటూర్,కృష్ణ జిల్లా, విశాఖపట్నంలో జరిగే ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. మసీదులలో, ముస్లిం జమాత్‌లలో, రోడ్ల మీద నమాజులు చదువుతున్నారు. దువా చేస్తున్నారు. ముస్లిం మతపెద్దలు, శాసన సభ్యులు నిరసన ప్రదర్శనలలో పాల్గొంటున్నారు.రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని కోరుతున్నారు. సాధారణంగా కాంగ్రెస్ పార్టీకి ‘ఓట్ బ్యాంక్’ గా పరిగణించబడే వీరు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు నిర్వహించే నిరసన ప్రదర్శనలలో అదికంగా కన్పిస్తున్నారు. ముస్లిం స్త్రీలు, పురుషులు, విద్యార్థులు, విద్యార్థినులు నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. కింది తరగతి, ఉన్నత తరగతి అనే తేడా లేకుండా, అన్నీ వర్గాలవారు, అన్నీ వృత్తులకు చెందిన ముస్లింలు పాల్గొంటున్నారు.

ముస్లింల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన వివిధ కమిటీల నివేదికల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింల సామాజిక,ఆర్థిక, విద్యా, ఉద్యోగ స్థితిగతులు ఎస్సీ, ఎస్టీ, బీసీల కన్నా దారుణంగా ఉన్నాయి. ముస్లింలలో ఉన్నత విద్యావంతులు, వృత్తి నిపుణుల సంఖ్య అత్యంత స్వల్పంగా ఉంది, రాష్ట్ర సర్వీసులలోని ముస్లిం ఉద్యోగస్తుల సంఖ్య 1-3శాతం కన్నా తక్కువగా ఉంది. ముస్లింలకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించటానికి రాష్ట్రంలో అనేక అడ్డంకులను ఎదుర్కొనవలసి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో కోర్టు స్టే పైనే రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. ముస్లింలలో కూడా అందరికీ రిజర్వేషన్లు లేవు. కొన్ని వర్గాల వారికి మాత్రమే రిజర్వేషన్లు వర్తింప చేస్తున్నారు. పఠాన్, సయ్యద్‌లకు రిజర్వేషన్లు లేవు. షేక్‌లకు మాత్రమే ఉన్నాయి. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేష న్లు ఉన్నా, సచార్ కమిటీ, రంగనాథ మిశ్రా కమిటీ సూచనల మేరకు కేంద్ర సర్వీసులలో ఇంకా రేజర్వేషన్లు కల్పించబడలేదు. పోలీసు,పారామిలిటరీ, మిలిటరీ దళాలలో ముస్లింల సంఖ్య పెరగడంలేదు. పైగా ఇటీవల జరిపిన సర్వేలో రక్షణ దళాల లో వీరి సంఖ్య గత పదేళ్లలో తగ్గింది.

ఆంధ్ర ప్రదేశ్‌లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించటానికి జరిగిన ఉద్యమాలను, ఆందోళనలను పరిశీలిస్తే..,ఆ ఆందోళనలలో సీమాంవూధలోని ముస్లిం జనసమూహం నిర్వహించిన పాత్ర చాలా తక్కువ. కానీ ప్రస్తుత సమైక్యతా ఉద్యమంలో కాస్త ఎక్కువగానే పాల్గొంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, ఇతర నగరాలలోని ముస్లింలు రిజర్వేషన్ల కోసం ముఖ్యంగా అర్బన్ ప్రాంతాలలోని ముస్లిం విద్యాధికులు రిజర్వేషన్ల కోసం పోరాడారు. తమ జీవనం, అభివృద్ధి, చదువు, ఉద్యోగాలు, తమ భవిష్యత్తో ముడిపడిన రిజర్వేషన్ల కన్నా, సీమాంధ్ర ముస్లింలకు సమైక్య ఉద్యమంలో ఏం కనిపిస్తున్నదో అంతుపట్టడం లేదు.
విభజన జరిగితే రాయలసీమ ఎక్కువగా నష్టపోతుందని, నీటి కొరత ఏర్పడుతుందని,ఉద్యోగావకాశాలు తగ్గుతాయని భ్రమపడుతున్నారు. కానీ కోస్తా ముస్లిం లు ఏ కారణాలతో ఉద్యమిస్తున్నారో అర్థం కావటం లేదు. రాష్ట్రం విడిపోతే ముస్లిం లకు వచ్చే నష్టాలు ఏంటి అనేది ఒక ప్రశ్న?

విభజన జరిగినా కోస్తా ముస్లింలకు వచ్చే నష్టం లేదు. నీటి కొరత ఏర్పడదని, ఉన్న ప్రాజెక్టులకు నికర జలాల విషయంలో ఎటువంటి తేడా ఉండదని నీతిపారుదల నిపుణులు చెబుతున్నారు. సమస్యలు వస్తే తీర్చటానికి నిపుణుల కమిటీలు ఉన్నాయి కదా అంటున్నారు. ఉద్యోగాల విషయంలో హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభు త్య ఉద్యోగాలు చేయటానికి జోనల్ విధానం అడ్డు వస్తుంది. 610 జీవో కింద ఉన్నవారే వెనకకు వస్తున్నారు. కేంద్ర ఉద్యోగాలలో, విద్యాలయాలలో అందరికీ సమా న అవకాశాలు ఉంటాయి. ఇక ప్రైవేట్ ఉద్యోగాల విషయానికి వస్తే.. ఆర్హతలు ఉంటే హైదరాబాద్‌లో మిగతా వారికన్నా ముస్లింలకే ఆధిక అవకాశాలున్నాయి. భాష, సంస్కృతి, ప్రయోజనాన్ని అధికంగా పొం దవచ్చు. ఇతరులకన్నా మిన్నగా ముస్లిం లు ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరం లేదు. హైదరాబాద్‌లో ముస్లింలకు ప్రయోజనాలు లేవనుకున్నా నష్టాలు మాత్రం లేవు.

రాష్ట్ర విభజన జరిగి, రాజధాని కర్నూల్ వచ్చినా, విజయవాడ-గుంటూరు మధ్య వచ్చినా,ఒంగోలుకు వచ్చినా ముస్లింలకే ఆధిక ప్రయోజనం. ఆ ప్రాంతాలలో వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో 50కిలోమీటర్ల మేర ముస్లింల జన సంఖ్య అధికంగా ఉంటుంది.ఆ ప్రాంత జనసంఖ్యలో దాదాపు 15-20 శాతం ఉంది. రాష్ట్ర విభజనతో ముస్లింల భూములు, ఆస్తుల విలువలు పెరుగుతాయి. వ్యాపారాలు, చిన్న, చేతి వృత్తుల పరిక్షిశమలు, ఆటోనగర్, పౌండ్రీ లు అభివృద్ధి చెం దుతాయి. పిల్లలకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. శాసన సభలో కూడా ముస్లింల ప్రాతినిధ్యం పెరుగుతుంది. ముస్లింలచే స్థాపించబడి, నడపబడుతున్న ఉన్నత విద్యాలయాలు, వృత్తి విద్యా కళాశాల లు, మదరసాలు వృద్ధిచెందుతాయి. ప్రస్తుతమున్న సమైక్య ఆంధ్రప్రదేశ్ కన్నా.. రేపు విడిగా ఏర్పడే సీమాంధ్ర, తెలంగాణలో వీరి అభివృద్ధి నిజంగా తగ్గుతుందా, లేదా విభజన ద్వారా ఆధిక ప్రయోజనం కలుగుతుందా అనేది కాలమే సమాధానం చెబుతుంది.
ఈమధ్యనే ఒక మేధావి అన్నట్లు మతం ఒకటైనా, ఉర్దూ, తెలుగు-ఉర్దూ మాట్లా డే తెలంగాణ ముస్లింలకు, ఉర్దూ, తెలుగు-ఇంగ్లిష్ మాట్లాడే ఆంధ్ర ముస్లింలకు విభజన, సమైక్యతల మధ్య సరియైన అవగాహన రాలేదా? తమది కాని సమైక్య ఉద్యమంలో ఎందుకు పాల్గొంటున్నారో ఇప్పటికైనా ఆలోచిస్తే మంచిది. విభజన తోనే ముస్లింలు అభివృద్ధి చెందుతారని గుర్తెరగాలి.
Namasete Telangana Telugu News Paper Dated: 31/10/2013 

Wednesday, October 30, 2013

విభజన, విశ్వవిద్యాలయాలు - పులికొండ సుబ్బాచారి

రాష్ట్ర విభజనకు సంబంధించి రాజకీయ విషయాలు చెప్పే వ్యాసం కాదిది. రాష్ట్ర విభజన చేసిన తర్వాత వచ్చే చిక్కుముళ్ళలో చాలా గట్టిచిక్కుముడి విశ్వవిద్యాలయాలకు చెందిన పరిపాలనకు సంబంధించినది. ప్రభుత్వోద్యోగులు రెండు ప్రాంతాలలో ఉండేవారు వారి వారి స్వంత ప్రాంతాలకు వెళ్ళడానికి వారికి అవకాశాలు కల్పిస్తుంది ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రవిభజన ఉద్యమానికి ఉన్న చాలా గట్టి కారణాలలో ఉద్యోగాల అవకాశాలు తెలంగాణలో ఉన్న ఉద్యోగులకు రావలసిన వాటిని కూడా ఇతర ప్రాంతాల వారు తన్నుకుపోయారనేది ఒకటి. అంతే కాదు ఇక్కడ ఉన్న ఖాళీ పోస్టులకు వాటికి అవసరమైన క్రమపద్ధతిలో భర్తీ చేయకుండా డెప్యుటేషన్ పైనే వేరే ప్రాంతాలవారిని తీసుకువచ్చి పనిచేయిస్తున్నారనే విషయం మరొకటి. వీరి భర్తీ గురించి లేదా ఉద్యోగాల నియామకాలలో జరిగిన అన్యాయాల గురించి చర్చ ఇక్కడ ఉద్దేశం కాదు. దానికి వేరే వేదికలున్నాయి.
కానీ ఇక్కడ చర్చించవలసిన ముఖ్యవిషయాలు వేరే ఉన్నాయి. ఉమ్మడిగా ఉన్న ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుని విభజన తర్వాత వాటిని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు చేసి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తీర్చవచ్చు. కానీ విశ్వవిద్యాలయాలు ప్రత్యక్షంగా ప్రభుత్వ పరిపాలనలో కాక స్వతంత్ర ప్రతిపత్తి కలిగి పరిపాలన సాగిస్తున్నాయి. నిధులు ఇవ్వడం ఉపాధ్యక్షులను నియమించడం తప్ప ప్రభుత్వం విశ్వవిద్యాలయ పరిపాలనలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోదు. ఈ పరిస్థితిలో రాష్ట్రంలో ఇరు ప్రాంతాలలో ఉన్న ఉద్యోగులు ఆయా ప్రాంతాలకు చెందినవారు కాక వేరేప్రాంతాల వారి పరిస్థితి ఏమిటి. వారు స్వంత ప్రాంతాలకు పోవాలంటే ఎలాంటి నిర్ణయాలు ఉమ్మడి ప్రభుత్వం తీసుకోవాలి. రాష్ట్రం విడిపోయాక ఇరు ప్రాంతాల్లో ఉన్న విశ్వవిద్యాలయాల ఉద్యోగులు వారి ప్రాంతం వెళ్ళి అక్కడున్న విశ్వవిద్యాలయాల్లో పనిచేయడానికి ప్రత్యేక నిర్ణయాలు తీసుకొని చట్టాలు చేయాల్సి ఉంటుంది. మన రాష్ట్రం మొత్తానికి సంబంధించిన విశ్వవిద్యాలయాల చట్టం ఒకటి ఉంది. అంతే కాదు ద్రావిడ విశ్వవిద్యాలయం మరికొన్ని ఇతర విశ్వవిద్యాలయాలకు ప్రత్యేక చట్టాలున్నాయి. వీటి దృష్ట్యా ఉమ్మడి రాష్ట్రం స్థాయిలోనే వాటి వాటి ఉద్యోగుల ప్రాంతాల మార్పిడికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది.
మన రాష్ట్రం మొత్తంలో 35 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిలో 27 విశ్వవిద్యాలయాలు ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలో ఉన్నాయి. కాగా 3 విశ్వవిద్యాలయాలు (హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఇఫ్లూ విశ్వవిద్యాలయం, మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం) కేంద్రీయ విశ్వవిద్యాలయాలు. ఇవి కేంద్ర ప్రభుత్వానికి చెందినవి కాబట్టి మన రాష్ట్రానికొచ్చిన ఇబ్బంది లేదు. ఇక ఈ 30 కాక 5 డీమ్డ్ విశ్వవిద్యాలయాలున్నాయి. (ఇవి. సత్యసాయి ఉన్నత విద్యాసంస్థ, ఎన్.ఐ.టి. వరంగల్, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి, ట్రిపుల్ ఐటి హైదరాబాద్, గీతమ్ విశ్వవిద్యాలయం) వీటి ఉద్యోగుల పరిస్థితిని కూడా ఆయా సంస్థలు పరిష్కరించుకోవచ్చు.ప్రైవేటువి కాక మిగతావాటిలో ఎన్.ఐ.టి. కేంద్ర ప్రభుత్వానికి చెందినది కాబట్టి దానితోనూ సమస్య లేదు.
పైన చెప్పిన రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న 27 విశ్వవిద్యాలయాలు కొన్ని తెలంగాణ ప్రాంతంలోనూ కొన్ని కోస్తా ప్రాంతంలో మరికొన్ని రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి. ఈ 27 విశ్వవిద్యాలయాల్లో ఎక్కువ ఆయా ప్రాంతమే లోకల్ హోదా ఉండే విశ్వవిద్యాలయాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధి దాని చుట్టూ ఉన్న జిల్లాలు అక్కడి విద్యార్థులే దానికి లోకల్ అవుతారు. మిగతా వారు దానికి నాన్ లోకల్ అవుతారు. అలాగే ఆంధ్రా యూనివర్సిటీకి రాయలసీమ ప్రాంత యూనివర్సిటీలకు లోకల్ నాన్ లోకల్ ఉంటుంది. ఇక్కడి ఉద్యోగుల నియామకం ఈ ప్రాంతాల వారికే ఇవ్వడం సాధారణంగా జరుగుతుంది. కానీ వేరు వేరు కారణాల రీత్యా ఈ విశ్వవిద్యాలయాల్లో వేరే ప్రాంతాల వారు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా కాక రాష్ట్రం మొత్తం లోకల్‌గా ఉండే రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు కొన్ని ఉన్నాయి.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ద్రావిడ విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఇవి 5 రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాలు. వీటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం లోకల్ అవుతుంది. విద్యార్థుల ప్రవేశాలలో రాష్ట్రం మొత్తం లోకల్ అవుతుంది. ఆరు సూత్రాల పథకం ప్రకారం రాష్ట్రస్థాయి కార్యాలయాలు ప్రభుత్వ సంస్థలు అన్నింటిలో ఉద్యోగాలలో 48 శాతం తెలంగాణ ప్రాంతం వారికి మిగతా 52 శాతం సీమాంధ్ర ప్రాంతాల వారికి ఇవ్వవలసి ఉంది. కానీ అలా జరగలేదు. తెలుగు విశ్వవిద్యాలయంలో (హైదరాబాదులో ఉన్నదానితో సహా) సుమారు 15 నుంచి 20 శాతం వరకే తెలంగాణ వారుండగా 80 శాతం పైగా సీమాంధ్ర ప్రాంతాల వారున్నారు. ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఎనిమిది శాతంలోపే బోధన, బోధనేతర సిబ్బంది తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. ఇక మిగతా విశ్వవిద్యాలయాల్లో ఇంతకన్నా తక్కువమంది తెలంగాణ ప్రాంతం వారుండడాన్ని గమనించవచ్చు. రాష్ట్ర విభజన దాకా తెచ్చిన సమస్యలలో ఈ సమస్య చాలా గట్టిది. ఆరు సూత్రాల పథకం, 610 జీవో చిత్తశుద్ధితో సరిగ్గా అమలు చేసి ఉంటే బహుశా ఈ సమస్య వచ్చి ఉండేది కాదు.
కాగా రాష్ట్ర విభజన తర్వాత ఆయా ప్రాంతాల్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఉన్న వారు వారి స్వంత ప్రాంతాలలోని విశ్వవిద్యాలయాలకు వెళ్ళడానికి ఉమ్మడి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు వర్తించినట్లుగా ఈ విశ్వవిద్యాలయాల్లోని ఉద్యోగులకు వర్తించదు. విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల కోసం తిరిగి ప్రత్యేకంగా చట్టం చేసుకోవలసి ఉంటుంది. అంతేకాదు విడిపోయిన రాష్ట్రాలు రెండూ అవగాహన ఒప్పందాలు చేసుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి కొంత మంది ఆంధ్ర ప్రాంత విశ్వవిద్యాలయానికి పోవాలన్నా, ఎస్.వి. యూనివర్సిటీ తిరుపతి నుంచి ఉస్మానియాకు రావాలన్నా ఆ ప్రాంతాల విశ్వవిద్యాలయాల వారు వారికి ఉద్యోగకల్పన చేయవలసి ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా చట్టాలు చేయాలి. యూనివర్సిటీ ఆక్టులు ప్రత్యేకంగా చేసుకొని వాటిలో ఈ ఉద్యోగకల్పన గురించి అవసరమైన అధికరణాలు చేసుకోవాలి. అంతేకాదు దీనికన్నా గట్టి చిక్కుసమస్య ఏమిటంటే, కొన్ని ప్రాంతాల విశ్వవిద్యాలయాల్లో ఉండే కొన్ని శాఖలు ఇతర ప్రాంతాల విశ్వవిద్యాలయంలో ఉండకపోవచ్చు. ఉదాహరణకు ఉస్మానియా విశ్వవిద్యాలయం రష్యన్ డిపార్ట్‌మెంట్ ఉంది. అక్కడి ఉద్యోగి రాయలసీమకు వెళ్ళాలనుకుంటాడు. అక్కడి విశ్వవిద్యాలయంలో ఈ డిపార్ట్‌మెంట్ ఉండదు. అప్పుడు ఆ ఉద్యోగి పరిస్థితి ఏమిటి? అతనికి అవసరమైన పోస్టును ఎలా కల్పించాలి? దీనికోసం ఉమ్మడి రాష్ట్రమే ఆ సంఖ్యలో వారి వారి పోస్టులను ఒక ప్రత్యేక చట్టం ద్వారా వేరే ప్రాంతాల్లో ఉన్న విశ్వవిద్యాలయానికి బదిలీ చేయవలసి ఉంటుంది.
కొన్ని వేలమంది కాకపోయినా ఇలా రెండు రాష్ట్రాల్లో ఉన్న బోధనా ఉద్యోగులు బోధనేతర ఉద్యోగులు కొన్ని వందలమందైనా వేరు వేరు ప్రాంతాల వారున్నారు. ఉమ్మడి ప్రభుత్వ స్థాయిలోనే వారి వారి వివరాలు సేకరించి వారి మార్పిడిపైన ఆయా ఉద్యోగుల అంగీకారాన్ని నిర్ణయాలను తీసుకోవాలి. పైన చెప్పిన పద్ధతిలో ఉమ్మడి ప్రభుత్వ స్థాయిలోనే కొన్ని నిర్ణయాలు జరగాలి. విభజించిన రెండు రాష్ట్రాల్లోని ఆయా ప్రభుత్వాలు, ఉద్యోగుల మార్పిడి తర్వాత పెన్షన్ చెల్లింపు విషయాల్లో చట్టాలు చేసుకోవలసి ఉంటుంది. లేకుంటే కొన్ని వందల మంది విశ్వవిద్యాలయాల బోధన బోధనేతర ఉద్యోగులు కుటుంబాలు ప్రాంతాలు మారాలనుకున్నా మారినా వచ్చే చిక్కు సమస్యలు చాలా దారుణంగా ఉంటాయి. పెన్షన్ల విషయాలు తేలకుంటే కుటుంబాలు రోడ్డున పడవలసి ఉంటుంది.
ఈ దృష్ట్యా ఉమ్మడి రాష్ట్రంలోని అత్యున్నత అధికారులు, ఆయా విశ్వవిద్యాలయాల ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి దీనికి అవసరమైన చర్యలు ఇప్పుడే తీసుకోవాలి. విస్తృతంగా చర్చలు చేసి చాలా ముందు చూపుతో వ్యవహరించాలి. అందుకోసం ఒక అత్యున్నత స్థాయి కమిటీ వేసి విభజన ప్రక్రియ సందర్భంలోనే విశ్వవిద్యాలయాల ఉద్యోగుల సమస్య పరిష్కరించాలి.
- పులికొండ సుబ్బాచారి
(రచయిత ద్రావిడ విశ్వవిద్యాలయంలో సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్. హెడ్‌గా, సోషల్ సైన్స్ డీన్‌గా, డీన్ అకడమిక్ అఫైర్స్‌గా, చీఫ్ వార్డెన్‌గా పనిచేసిన విస్తృత పరిపాలనానుభవం ఉన్న ఆచార్యుడు, ప్రముఖ పరిశోధకుడు, రచయిత)

Andhra Jyothi Telugu News Paper Dated: 31/10/2013 

Sunday, October 27, 2013

కర్షక మథనం (''చదువుకోగానే సరిపోతుందా... ఉద్యోగం రావద్దూ'') By డాక్టర్‌ నాగరాజు అసిలేటి


apr -   Mon, 28 Oct 2013, IST
మనమంతా హైటెక్స్‌ను చూసి ముచ్చట పడటమే కాదు పల్లెల్లో, గ్రామాల్లో, గూడేల్లో ఉన్న లోటెక్స్‌ను కూడా చూడగలగాలి. అప్పుడే వాళ్ల కష్టాలు, కన్నీళ్లు అర్థమవుతాయి. శాస్త్ర, సాంకేతిక రంగాలు నానాటికి మనిషి కంటే వేగంగా వృద్ధి చెందుతుంటే, దాన్ని అందుకోలేక, అందించేవారు లేక అవస్థ పడుతున్నవారు ఎందరో. అలా అవస్థ పడేవారిలో పేర్కొనదగ్గ వర్గం రైతులు. తగిన వసతులు, వనరులు, సౌకర్యాలు లేకపోయినా సేద్యాన్నే నమ్మి వరదలతోనే కాదు, చీడలతోనే కాదు, జీవితంతో కూడా పోరాడిన ఓ సాధారణ రైతు గాథను తెలుసుకుందాం.
గూడెంలోకి వేగంగా వచ్చిన కారు వెంకయ్య ఇంటిముందు ఆగింది. అందులోంచి ఆరుగురు ఆజానుబాహువుల వంటివారు దిగారు. వారు చూడటానికి కుస్తీపోటీల కోసం దేహాన్ని పెంచారేమోనన్నట్లు ఉన్నారు. వాళ్లను చూడగానే వెంకయ్య పై కండువా సర్దుకుంటూ వణుకుతూ ఇంటిలో నుంచి వెళ్లి వాళ్లముందు నిలబడ్డాడు.
వారి మధ్య జరుగుతున్నది మామూలు సంభాషణ కాదు. కొన్ని హెచ్చరింపులు, ఇంకొన్ని బెదిరింపులు అనే సంగతి చూసినవారికి ఇట్టే అర్థమవుతుంది.
కిటికీలోంచి ఆ దృశ్యాన్ని చూస్తున్న మంగమ్మకు ఆ ఆరుగురూ అప్పుడప్పుడూ వెంకయ్య మీదకు చేతులు లేపడం, వేళ్లతో హెచ్చరిం చడం మామూలే. కనుక విషయాన్ని పసిగట్టడానికి ఎంతో సమయం పట్టలేదు. వెంకయ్య వాళ్లకేదో నచ్చజెప్పి అప్పటికి పంపించేసి ఇంట్లోకి వచ్చాడు. అతడి ఆందోళన, భయాలను గుర్తించిన మంగమ్మ ''ఎవరయ్యా ఆళ్లు? నిన్ను తలో మాటా ఇట్టమొచ్చినట్టు మాట్టాడుతుంటే నువ్వు బొత్తిగా నోరు మెదపవే?'' అంది.
ఎవరో కాదే అప్పులోళ్ళు. ఏటా పొలానికని, పిల్లల చదువులకని తెచ్చిన రుణం, దానికి వడ్డీ కలిపి ఆరు లచ్చలయిందట. ఎప్పుడు కడతావని అడగటానికొచ్చారు'' అన్నాఉడ.
అందుకామె ''మరి నువ్వేమన్నావ్‌?'' అంది.
''ఏమంటాను.. త్వరలోనే తీరుత్తానని చెప్పాను..'' అన్నాడు.
వెంకయ్యలో ఆందోళన ఏ మాత్రం తగ్గలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ కంగారు, ఆదుర్దా, భయం ఇంకా ఎక్కువవుతున్నాయి.
ఇంతలో మళ్లిd వ్యవసాయం పనులు రానే వచ్చాయి. విత్తనాలు, నాట్లు, ఎరువులు, కోతలు, నూర్పిళ్లకు మళ్లిd అప్పు తేనే తెచ్చాడు. ఒకపక్క ఆరు లక్షల అప్పు అలాగే వుంది. మళ్లిd అప్పు తెచ్చాడు. పంట చేతికొచ్చింది.
ఎంతో కొంత అప్పు తీర్చొచ్చు అనుకునే లోపు మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు ప్రకృతి భీభత్సం సృష్టించడంతో ఆ గూడెమంతా జలమయమైపోయింది. దాంతో వెంకయ్య గుండె జారినంత పనై గత అనుభవాల పాఠాలను నెమరు వేసుకొని మెల్లగా తేరుకున్నాడు. అతడికిలాంటి విషాదాలు కొత్తేమీ కాదు. ఎప్పుడూ జరిగే తంతే. పంట చేతికొస్తుందని ఆశ పడటం. అందుకోసం అప్పు చేయడం, ఆ అప్పు తీరకపోగా, పంట పండకపోవడమో లేదా పండిన పంట వరదకు బలైపోవడమో జరిగి ఇంకా, ఇంకా అప్పుల్లో కూరుకుపోతుంటాడు.
పోనీ కలిసిరావడంలేదని వ్యవసాయాన్ని వదిలించుకుంటాడా అంటే అదీ చేయడు. ''తాతల నాటి నుండీ సేద్యమే మా వృత్తి'' అంటాడు.
వెంకయ్యకు ఈ మధ్య సరిగా నిద్రపట్టడం లేదు. తిండి సహించడం లేదు. మనిషి బాగా చిక్కిపోయి పాడైనట్లు స్పష్టంగా కనబడుతున్నాడు.
పక్క గూడెంలో ఓ ఆసామి అప్పు ఇస్తానని చెప్పి రమ్మంటే దాన్ని పుచ్చుకునేందుకు వెళుతున్నాడు వెంకయ్య.
దారిలో ఆ గూడేనికే చెందిన చదువుకున్న యువకుడు కనిపించి పలకరించాడు.
దాంతో వెంకయ్య తనఅప్పులగోలంతా ఏకరువు పెట్టాడు. చివరగా ''మీరు బాగా సదివి ప్రయోజకులు అవ్వాలి. మంచి ఉద్యోగాలు సంపాదించాలి'' అన్నాడు.
అంతా విన్న యువకుడు ''చదువుకోగానే సరిపోతుందా... ఉద్యోగం రావద్దూ'' అంటూ తన నిరుద్యోగ సమస్యను వెంకయ్య ముందు మొరపెట్టుకున్నాడు.
''ఎంత చదివినా ఏం ప్రయోజనం, ఎన్ని డిగ్రీలు సంపాదించినా ఏం లాభం, ఉద్యోగాలు రావాలంటే లంచాలివ్వాలి. లంచాలిచ్చి ఉద్యోగం సంపాదించే స్తోమత మా దగ్గర లేదు. చూస్తే నీదీ నాదీ ఒకే సమస్యలా ఉంది. మన సమస్యకు కారణం డబ్బు. మనకు లేనిది డబ్బు. కావలసింది డబ్బే. ఆ డబ్బును సునాయాసంగా సంపాదించడానికి పేపరులో ఒక ప్రకటన చూసా! నీకు ఇష్టమైతే, వస్తానంటే నిన్ను తీసికెళ్తా.. నేను వెళ్తున్నా..'' అంటూ తను చూసిన ప్రకటన గురించి చెప్పాడు.
''ఏంటయ్యా?'' అర్థంగాక విడమర్చి చెప్పమన్నట్టు అడిగాడు వెంకయ్య.
''పట్నంలో ఓ కోటీశ్వరుడికి కిడ్నీల అవసరం ఉందట. దాతలు కావాలని కోరుతున్నారు. మనం గనుక కిడ్నీ ఇస్తే పది లక్షలు కళ్ల చూడొచ్చు'' అన్నాడు యువకుడు.
అందుకు వెంకయ్య ''ఎన్నాళ్లు వ్యవసాయం పని చేసి పది లక్షలు సంపాదించగలం? పైగా మొన్న వచ్చినోళ్లు ఈసారి కచ్చితంగా అప్పు చెల్లించకపోతే నా మీద అఘాయిత్యం చేస్తారు. కాబట్టి వాళ్ల బారి నుండి తప్పించుకోవాలన్నా, పది లచ్చలు సంపాదించాలన్నా నువ్వు చెప్తోన్న ఈ దారి తప్ప మరో గతి లేదనిపిస్తోంది. కచ్చితంగా యల్దాం.. ఆలస్యం చేయొద్దు.. ఎల్లుండే యల్దామా?'' అన్నాడు.
అలా వాళ్ళిద్దరూ పట్టణానికి వెళ్లడానికి నిర్ణయించుకున్న తర్వాత అప్పుకోసం బయల్దేరిన వెంకయ్య వెనుదిరిగి తన ఇంటికి వెళ్ళాడు. అలాగే ఉద్యోగ వేటకు వెళ్లాల్సిన యువకుడు అది ఆపేసి ఇంటికి చేరుకున్నాడు.
వెంకయ్య, భార్య మంగమ్మతో ''ఎల్లుండి పట్నం యల్తున్నాం, సంచిలో బట్టలు సర్దు.. ఓ జమీందారు దగ్గర పని వుంది.. పెద్ద మొత్తమే ముట్టచెబుతాడంట'' అన్నాడు.
వెంకయ్యకు నిద్రలో కూడా పట్నం వెళ్తున్నట్లు, డబ్బులు సంపాదించినట్లు కలలు వచ్చాయి.
నిర్ణయించుకున్న రోజు రానే వచ్చింది. యువకుడు, వెంకయ్య కలిసి పట్నానికి బయల్దేరారు. కోటీశ్వరుడిని కలుసుకున్నారు. అన్ని విషయాలూ మాట్లాడుకున్నారు. ముగ్గురూ కలిసి ఓ పెద్ద హాస్పిటల్‌కు చేరుకున్నారు. కిడ్నీస్‌ మ్యాచ్‌ అవడంతో ఆపరేషన్లు జరిగాయి.
యువకుడిది, వెంకయ్యది చెరో కిడ్నీ తీసి కోటీశ్వరుడికి అమర్చారు డాక్టర్లు. కోటీశ్వరుడు ఇస్తానన్న సొమ్ము చెరో పది లక్షలు వారికిచ్చాడు.
కొన్ని రోజుల తరువాత నిస్సత్తువుగా, బలహీనంగా ఊరికి బయల్దేరారు. పైకి ఏమీ తేడా కనబడకపోయినా లోపల శుష్కించుకుపోయిన శరీరాలతో యువకుడు, వెంకయ్య వారి వారి ఇళ్లకు చేరారు.
పొరుగూరిలో పని వుందంటూ వెళ్లొచ్చిన వెంకయ్యను భార్య మంగమ్మ ఆప్యాయంగా ''ఏమయ్యా బాగుండావా? యాలకి తిండి పెట్టాడా లేదా ఆ జమిందారు? అట్టా అయిపోయావేంటి?'' అని పలకరించింది.
''తానానికి నీళ్లెడతా.. తానం చేద్దువుగాని పద'' అంది.
స్నానం చేసేందుకు వెళ్లడానికి చొక్కా విప్పిన వెంకయ్యను చూసి మంగమ్మ నిశ్చేష్టురాలైపోయి విలపిస్తూ ''ఏంటయ్యా అది?'' అని అడిగింది.
అందుకు వెంకయ్య ''ఏమీ లేదే.. జమిందారుకు కిడ్నీ ఇచ్చా, పది లచ్చలు ఇచ్చాడు. మనం ఏళ్ల తరబడి సేద్యం చేసినా ఎన్నేళ్లకి పది లచ్చలు కూడబెడతామో తెలీదు. అవసరానికి కిడ్నీ ఇచ్చి ఒక్క చెనంలో లచ్చలు సంపాయించా... ఇదేదో బాగుంది.. పగలంతా పొలం పనులతో కొట్టుకు చచ్చేకంటే అవయవాలు అమ్ముకోవడమే నయంలా వుంది. పొలంలో ఒడ్లు పండినట్టు పేదోళ్ల ఒంటో కిడ్నీలు, ఊపిరితిత్తులు, గుండె.. పదేపదే పుట్టుకొస్తే బాగుండు.. మనలాంటి పేదోల్లంతా బేషుగ్గా బతికేయొచ్చు'' అన్నాడు వెంకయ్య తన నీరసాన్ని ఎంతమాత్రం బయటపెట్టకుండా.
మంగమ్మకు జరిగింది చాలా పెద్ద ఘోరమని అర్థంకానేలేదు.
ఇక అప్పుల బెంగ లేదంటూ వెంకయ్య సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
భోజనం చేసి కబుర్లు చెప్పుకుంటూ వెంకయ్య, మంగమ్మ నిద్రలోకి జారుకున్నారు.
యథాప్రకారం పొద్దున్నే లేచిన మంగమ్మ, ''ఏమయ్యా... వెలుగురేకలొస్తున్నాయి.. లేవవా?'' అంది.
ఉహూ వెంకయ్య లేవనేలేదు.


Andhra Prabha Telugu News Paper Dated: 28/10/2013 


Saturday, October 26, 2013

సీమాంధ్ర అగ్రకుల కురుక్షేత్రం By ఉ.సా,


విభజన ప్రక్రియ వేగవంతం
ఇంకా పరిరిస్తామంటున్న నేతలు 
ఓటు బ్యాంకు కోసమే సమైక్యవాదం 
అభద్రతాభావం అగ్రకుల పాలక వర్గాలకే! 
బడుగు వర్గాలను అణచివేసే ఎత్తుగడ 
స్వయం కృషితోనే బడుగులకు అధికారం 

ఓ పెద్ద భాషా రాష్ట్రంగా 1956లో అవతరించిన ఆంధ్ర ప్రదేశ్‌ 56 ఏళ్ల తర్వాత తెలంగాణ, ఆంధ్ర అనే రెండు చిన్నరాష్ట్రాలుగా విభజితం కాబోతోంది. విభజన ప్రక్రియని నిరోధించి సమైక్యాంధ్రను పరిరక్షించి తీరుతాం అంటూ సమైక్యాంధ్ర పరిరక్షకభటులు అశోక్‌బాబు, కిరణ్‌బాబు, జగన్‌బాబు, చంద్రబాబులు పునరుద్ఘాటిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీర్మానం, యుపిఎ క్యాబినెట్‌ నోట్‌, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు, విభజన విధి విధానాలపై మంత్రిత్వ శాఖల కార్యదర్శుల కసరత్తు, విభజన బిల్లు రూపకల్పన వంటి చర్యలతో విభజన ప్రక్రియ వేగవంతమవుతూనే ఉంది. కనుక సమైక్యాంధ్ర రక్షకభటుల మేకపోతు గాంభీర్యం ఎలాఉన్నా, ఆచరణలో వారు విభజన పరిణామాన్ని నివారించలేకపోతున్నారన్నది నిజం. ఈ సంగతి సామా న్యాంధ్రుల కంటే ఈ సోకాల్డ్‌ సమైక్యాంధ్రవాదులకే బాగాతెలుసు. ప్రత్యేకతెలంగాణ రాష్ట్రఏర్పాటు అనివార్యమని తెలిసే, తెలంగాణపోతే పోయిందని సీమాం ధ్రపై రాజకీయ ఆధిపత్యం కోసం వారు పడుతున్న పాట్లని, పన్నుతున్న ఎత్తుగడల్ని పరిశీలించి చూస్తే అసలు సంగతి బయటపడుతుంది. అయినా ఇంకా సమైక్యాంధ్రని పరిరక్షిస్తామని సీమాంధ్ర సామాన్యాంధ్రుల్ని మభ్యప్టెటంలో మరుగు పడిన మర్మం ఏమిటన్నదే పసిగట్టాల్సిన ముఖ్యాంశం. రాష్ట్ర విభజన అనివార్యమైతే జరిగే పరిణామం ఏమిటో పరిశీలిస్తే ఈ మర్మాన్ని పసిగట్టేందుకు ఆధారం దొరుకుతుంది. ప్రత్యేక తెలంగాణరాష్ట్రం ఏర్పడితే వెంటనే ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా రాయలసీమాంధ్రప్రాంతం దానంతటదే మరో రాష్ట్రంగా ఏర్పడుతుంది. అంటే సీమాంధ్ర ప్రాంతానికి తెలంగాణ ప్రాంతంతో ఉన్న భౌగోళిక ప్రాదేశిక సంబంధం తెగిపోయి తెలంగాణ ప్రాంతం తెలంగాణ వారి స్వపరిపాలనాధికారం క్రిందికి పోతుంది. 

విశాలాంధ్రలో వలసాంధ్ర పెట్టుబడిదారీ, పెత్తందారీ పాలనకి తెరపడిపోతుంది. ఆ రకంగా తమ అక్రమఆస్తులకు, వలసాధిపత్యానికి భత్రలేని అభద్రతా భావాన్నే సామాన్యాంధ్రుల అభద్రతా భావంగా చిత్రిస్తున్నారు. తమ స్వప్రయోజనాలకోసం తెలంగాణని అడ్డుకోవడాన్నే సామాన్యాంధ్ర ప్రజల ప్రయోజనాల పరిరక్షణగా చిత్రిస్తున్నారు. పాలకవర్గాల భావననే ప్రజల సమైక్య భావనగా చలామణి చేస్తున్నారు. భౌగోళిక ప్రాదేశిక సంబంధంతో పాటు సీమాంధ్ర కమ్మ, రెడ్డి అగ్రకులాధిపత్య శక్తులకు- తెలంగాణలోని వెలమ, రెడ్డి అగ్రకులాధిపత్య శక్తులకు అగ్రకుల సామాజిక సంబంధం కూడా తెగిపోయి, అగ్రకులాధిపత్య సంఘటితశక్తి అసంఘటితశక్తిగా మారి శక్తిహీనమవుతుంది. నిజానికి ఈ పరిణామంలో ఇమిడి ఉన్న భాషా ప్రయుక్త, ప్రాదేశిక అంశాలకంటే అగ్రకులాధిక్య సామాజికాంశమే వారికి కీలకాంశం. ఈ అంశమే సమైక్యాంధ్ర పరిరక్షణలో మరుగుపరచిన అసలుమర్మం. కానీ ఇప్పుడు జరుగుతున్న చర్చనంతా భాషా ప్రయుక్త, ప్రాదేశిక అంశాలకే పరిమితం చేస్తున్నారు. అలా చేయటంలో కూడా వారి పన్నాగం ఉంది.
‘ఒకే జాతి, ఒకే భాష, ఒకే రాష్ట్రం’ అంటూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వారు ఎక్కుపెట్టిన సమైక్యాంధ్ర నినాదానికి డబుల్‌ ఎఫెక్ట్‌ ఉంది. 

ఒకవైపు అది విభజన పరిణామాన్ని నివారించే ఎత్తుగడగా పనిచేస్తుంది. మరోవైపు రాష్ట్ర విభజన నివారించలేని అనివార్య పరిణామం అని తెలిసినా, ఆ నిజాన్ని కప్పి పుచ్చి తమ స్వప్రయోజనాల కోసం విభజన వ్యతిరేక సెంటిమెంట్‌తో కూడిన సమైక్యాంధ్ర భావోద్వేగాన్ని రగిలిస్తుంది. ఆ భావోద్వేగాన్ని కాంగ్రెస్‌ వ్యతిరేక, సోనియా వ్యతిరేక రాజకీయ ఎత్తుగడగా మలచుకుంటారు. విభజనకి కారణమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రఏర్పాటును వ్యతిరేకించే నెపంతో, తెలంగాణ ప్రాంతానికి వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి సీమాంధ్రప్రాంతాన్ని ఓట్‌బ్యాంక్‌జోన్‌గా మార్చుకునే ఎత్తుగడగా ఉపయోగపడుతుంది. ఈ సీమాంధ్ర ప్రాంతీయతత్వం ముసుగులో రాయలసీమ రెడ్డి సామాజిక వర్గానికి- కోస్తాంధ్ర కమ్మ సామాజిక వర్గానికి మధ్య రగులుతున్న అగ్రకులాధిపత్య పోటీని మరుగుపరచే అవకాశం లభిస్తుంది. 

ఇరువర్గాలు కలిసి ఎస్‌.సి, ఎస్‌.టి, బిసి మైనార్టీ బడుగువర్గాలను అణచివేసే అగ్రకుల యత్నాన్ని కప్పిపుచ్చటానికి తోడ్పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌ పెద్ద రాష్ట్రం, తెలంగాణ- ఆంధ్ర చిన్నరాష్ట్రాలుగా విడిపోవడంవలన తెలంగాణ ఆంధ్ర అగ్రకుల సామాజికశక్తులకు మధ్యఉన్న అగ్రకులాధిపత్య సంఘటిత సామాజిక సంబంధం అసంఘటితంగా మారిన సామాజిక పరిణామాన్ని బడుగువర్గ చిన్నకులాల సాధికారతకి ఉపయోగపడకుండా పక్కదారి పట్టించే పన్నాగానికి తోడ్పడుతుంది. ఈ పన్నాగమే సమైక్య సీమాంధ్ర ప్రాంతీయతత్వ సామాజిక మర్మం.అందుకే తెలంగాణ ఉద్యమం ‘తొలికోడి కూత’ లాంటిదని, తెలంగాణ వ్యతిరేక, సీమాంధ్ర సమైక్యాంధ్ర ఉద్యమం కీ ఇస్తే మోగే ‘అలారం మోత’ లాంటిదని అంబేడ్కరిస్టు కవి మిత్రుడు కోయి కోటేశ్వరరావు వ్యాఖ్యానించాల్సి వచ్చింది. అప్పుడు 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌, తెలుగుదేశం, కమ్మ, రెడ్డి అగ్రకుల సామాజిక వర్గాలు తెలంగాణ సెంటిమెంట్‌ని ఓట్‌బ్యాంక్‌ ఎత్తుగడగా వాడుకొని ఏరుదాటి తెప్పతగలేసి పరవంచనకి పాల్పడిప్పుడు వారికి ఈ సమైక్యాంధ్ర సెంటిమెంట్‌ గుర్తుకురాలేదు. ఇప్పుడు సమైక్యాంధ్ర సెంటిమెంట్‌తో సీమాంధ్ర ప్రాంతీయ తత్వాన్ని ఓట్‌బ్యాంక్‌ ఎత్తుగడగా మలుచుకొని ఆత్మవంచనకి పాల్పడుతున్నప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ గుర్తుకు రావడంలేదు. 

ఎక్కడైనా ఎప్పుడైనా ఈ అగ్రకులాధిపత్య పాలవకర్గ శక్తులకు అధికారమే పరమావధి తప్ప, ప్రత్యేక తెలంగాణ సెంటిమెంట్‌ పట్ల గాని, సీమాంధ్ర సమైక్యాంధ్ర సెంటిమెంట్‌ పట్ల గాని వారికి ఎలాంటి కమిట్‌మెంట్‌ లేదు.
అందుకే తాము తెలంగాణ సెంటిమెంట్‌ని గౌరవిస్తామని, తాము తెలంగాణ ఇచ్చేవాళ్లం కాదు, ఇస్తే అడ్డుకొనే వాళ్లం కాదని ఆనాడు చిలకపలుకులు పలికిన వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన రాగానే ప్లేటు ఫిరాయించారు. ఇరు ప్రాంతాల సమన్యాయం అంటూ సన్నాయి నొక్కులు నొక్కి చివరికి సీమాంధ్రలో సమైక్యాంధ్ర సమరశంఖం పూరించి, సీమాంధ్రకి తానే ఏకైక పొలిటికల్‌ హీరోగా మారాలని చూస్తున్నాడు. ఆముసుగులో రెడ్డి సామాజికవర్గాన్ని సమీకరిస్తూ అగ్రకులాధిపత్యాన్ని నెలకొల్పుకుంటు న్నాడు. అదే సమయంలో తన ప్రత్యర్ధి అయిన కమ్మ సామాజికవర్గ ఆధిపత్యాన్ని, ఆ వర్గానికి కొమ్ముగాసే తెలుగుదేశాన్ని దెబ్బతీయాలని చూస్తున్నాడు. తెలంగాణరాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తెలుగుదేశం లేఖ ఇవ్వడం వల్లే రాష్ట్ర విభజన జరుగుతోందని దుమ్మెత్తిపోస్తూ ఆత్మస్తుతి పరనిందలకి పాల్పడుతున్నాడు. మరోవైపు ఈఅగ్రకులాధిపత్య సీమాంధ్ర రాజకీయకురుక్షేత్రంలో తానెక్కడ వెనుకబడి పోతానో అని బెంబేలెత్తుతున్న టిడిపి అధినేత చంద్రబాబు పోటీ దీక్షలతో, పోటీయాత్రలతో జగన్‌తో పోటీపడుతున్నాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటువల్ల సీమాంధ్ర ప్రాంత ప్రజలకు ఎదురయ్యే సమస్యల్ని పట్టించుకోకుండా, సమన్యాయం పాటించకుండా రాజకీయ లబ్ధి కోసం ఏకపక్ష నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం తెలుగుజాతి ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని సీమాంధ్రప్రజల్లో తెలంగాణ వ్యతిరేకతను, కాంగ్రెస్‌ వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న తెలుగుదేశాన్ని సర్వనాశనం చేయడం కోసమే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఈ ఘాతుకానికి పాల్పడిందనిచెప్పి ‘సోనియా క్విట్‌ ఇండియా’ అంటూ నినదించారు సీమాంధ్ర ప్రజల్లో పెల్లుబుకుతున్న కాంగ్రెస్‌ వ్యతిరేకతను వైసిపి సొమ్ము చేసుకోకుండా అడ్డుకట్ట వేయడంకోసం కాంగ్రెస్‌కి- వైసిపికి మధ్య మ్యాచ్‌ఫిక్సింగ్‌ జరిగిందని ఎండగడుతున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌ తన సొంత పార్టీని సైతం ఫణంగా పెట్టి దత్తపుత్రుడైన జగన్‌ని దరి జేర్చుకుందని చాటింపు వేస్తున్నాడు. 
తెలంగాణ ఏర్పాటు నిర్ణయంపట్ల సీమాంధ్రలో పెల్లుబుకుతున్న కాంగ్రెస్‌ వ్యతిరేకత కాంగ్రెస్‌కి రాజకీయంగా నష్టంచేసే పరిస్థితి తలెత్తిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పునరాలోచనలో పడేది. గతంలో లాగా రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిపోయేది. కానీ తెలంగాణ అనుకూల ఓటుతో తెరాసని, తెలంగాణ వ్యతిరేక ఓటుతో వైసిపిని దరి జేర్చుకునే ఎత్తుగడలతో కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కి పాల్పడింది గనుకనే ఆ భరోసాతో రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతం చేస్తోందని వారి గుట్టును రట్టు చేస్తున్నాడు. రాష్ట్ర విభజన వేగవంతం చేయటానికి కాంగ్రెస్‌కి సహకరించి, సిబిఐ కేసునుండి బయటపడటానికి కాంగ్రెస్‌ సహకారం తీసుకొనే పరస్పర సహకార ఒప్పందం కుదుర్చుకున్న వైసిపి అవకాశవాదం, సమైక్యావాదం ముసుగులో విభజన వాదమేనని ఎండగడుతున్నాడు. 

ఆ రకంగా పరోక్షంగా సమైక్యాంధ్ర పరిరక్షణలో తనకు తానే సాటి తప్ప జగన్‌లాంటి వాళ్లు తనకు పోటీ రాలేరని చాటి చెపుతున్నాడు. అయినా ఎందుకైనా మంచిదని రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యాన్ని తట్టుకోవడంకోసం, రెడ్డి సామాజికవర్గం సమీకరణను అడ్డుకోవడంకోసం కాంగ్రెస్‌లోని కాపు సామాజికవర్గాన్ని తమవైపు తిప్పుకోవటం ద్వారా పై చేయి సాధించే ఎదురు ఎత్తుగడ వేశాడు. కాపు సామాజికవర్గానికి చెందిన చిరంజీవి సోదరులు నాగబాబు, పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ తెలుగుదేశం తీర్థం పుచ్చుకోబోతున్నారని తమ మీడియాద్వారా పుకార్లు పుట్టించారు. తమని సంప్రదించకుండా ఊహాగానాలతో తమపై ఇలాంటి తప్పుడు కథనాలు ప్రసారాలు చేయడం అనైతికంఅని వారు బహిరంగంగా ఖండించాల్సి వచ్చింది. కానీ చాపక్రింద నీరు లాగా ఆ ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. అందుకు కారణం లేకపోలేదు. సీమాంధ్ర ప్రాంతంలోని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రెడ్డి సామాజికవర్గం వారంతా, కాంగ్రెస్‌ అధిష్ఠాన దత్తపుత్రుడైన జగన్‌మోహన్‌ రెడ్డి పార్టీలోకి ప్లేటు పిరాయిస్తున్నారు. అనంతపురంలో అనంత వెంకటరామిరెడ్డి, కడపలో అదినారా యణరెడ్డి వంటివారు ఇప్పటికే వైసిపిలోకి ఫిరాయించారు. 

ఇంకా అనేకమంది అదే బాట పట్టేట్టున్నారు. అలాగే కాంగ్రెస్‌లోని కమ్మ సామాజికవర్గం ప్రతినిధి రాయ పాటి సాంబశివరావు వంటివారు కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశంలో చేరడానికి లేదా మరో పార్టీ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అదే వర్గానికి చెందిన లగడపాటి వంటివారు జగన్‌తో కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ సంగతి బాహాటంగా బయట పెడుతూ కాంగ్రెస్‌ ఆ దత్తపుత్రుడిపై ఆధారపడితే తమ భవిష్యత్తేమిటి అని నిలదీస్తున్నారు. ఆ రకంగా సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీలోని కమ్మ, రెడ్డి సామాజికవర్గాలు వైసిపిలోకో, తెలుగుదేశంలోకో ఫిరాయిస్తే ఇక కాంగ్రెస్‌లో మిగిలేది కోనసీమ కళింగ సీమలకు చెందిన కాపు- తూర్పు కాపు సామాజిక వర్గాలే. సీమాంధ్రలో కాంగ్రెస్‌ పట్ల పెల్లుబికుతున్న వ్యతిరేకత వల్ల నష్టపోయేది కూడా ఆ సామాజికవర్గాలే. కనుక ఆ వర్గాన్ని తెలుగుదేశం వైపు తిప్పుకుంటే కమ్మ- కాపు సామాజికవర్గాల కలయిక వల్ల పల్నాటి సీమ, కోనసీమ, కళింగసీమ ప్రాంతాల్లో కోస్తాంధ్ర అంతటా తెలుగుదేశం తిరుగులేని శక్తిగా మారుతుంది. జగన్‌వర్గం, రెడ్డివర్గం వైసిపిని కేవలం రాయలసీమకు పరిమితంచేసి ఏకాకినిచేస్తే సీమాంధ్రలో అధికారం తెలుగుదేశం కైవసమవుతుంది.

ఇలా కమ్మ రెడ్డి, కురు పాండవుల మధ్య ఓ వైపు అంతర్గత అగ్రకులాధిపత్య కుల కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుండగా మరోవైపు కురు పాండవులేకమై నూరు+ అయిదు= నూట అయిదై, బడుగువర్గ కులాల ప్రతినిధులపై మూకుమ్మడి దాడులకు పాల్పడుతున్నారు. ఉత్తరాంధ్ర కళింగ సీమలో పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ విద్యాసంస్థలపై, ఆస్తులపై విధ్వంసక దారులకు పాల్పడ్డారు. ఆ ప్రాంతంలో బొత్సను రాజకీయంగా అప్రతిష్ఠపాలు చేయడం కోసం శాంతిభద్రతల సమస్యను సృష్టించి కర్ఫ్యూ విధించే పరిస్థితి కల్పించారు. అందుకు వారిపై ఆగ్రహించిన బొత్స సత్యనారాయణ 4, 8 శాతం కంటే మించిలేని కమ్మ రెడ్డి సామాజికవర్గాలే ఎల్లకాలం రాజ్యమేలాలా, చిన్న రాష్ట్రాల్లో అయినా బడుగువర్గ చిన్న కులాలు సాధికారత సాధించటాన్ని వారు సహించలేరా అని బహిరంగంగానే తన అక్కసు వెళ్లగక్కారు. కోనసీమలో దళిత సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్‌ ఎంపి హర్షకుమార్‌ విద్యాసంస్థలపై, ఆస్తులపై విధ్వంసక దాడులకు పాల్పడ్డారు. పల్నాటిసీమలో మరో దళిత సామాజికవర్గ ప్రతినిధి రాష్ట్ర మంత్రి డొక్కా మాణిక్య రావుపై, ఆయన ఇంటిపై భౌతికదాడలుకు దిగారు. అదే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రెడ్డి సామాజికవర్గానికి చెందిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో అధిష్ఠాన ఆదేశానికి కట్టుబడి ఉంటామని నిర్ణయం జరిగినా ఆయనపై ఎక్కడా ఈగ వాలలేదు. అలాగే కమ్మ సామాజికవర్గానికి చెందిన పురంధేశ్వరి విజయవాడ నడిబొడ్డున అధిష్ఠాన నిర్ణయాన్ని సమర్ధిస్తూ సమావేశం జరిపినా సమైక్యవాదు లెవరూ ఆమెని పల్లెత్తుమాట అనలేదు. 

నన్నపనేని రాజకుమారి తెలుగుదేశం అయినా, పురంధరేశ్వరి కాంగ్రెస్‌ అయినా- పార్టీలకతీతంగా వారిరువురూ లగడపాటి కమ్మ సామాజికవర్గానికి చెందినవారు కనుక బెజవాడలో వారికి బ్రహ్మరథం పట్టారు. ఇదంతా గమనిస్తే చిన్న రాష్ట్రాల ఏర్పాటు చిన్న కులాల సాధికారతకి తోడ్పడుతుందని డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ చెప్పిన జోస్యాన్ని బడుగువర్గాల వారు గ్రహించనీయకుండా చేయడం కోసమే ఈ అగ్రకుల సామాజికాంశాన్ని చర్చకు రానీయకుండా జాగ్రపడుతున్నారు. సమైక్యాంధ్ర పేరిట సీమాంధ్ర ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి ఆ ముసుగులో సాగుతున్న అగ్రకుల కురుక్షేత్ర సంగ్రామాన్ని కప్పిపుచ్చాలని చూస్తున్నారు. ఇంతజరుగుతున్నా బడుగువర్గ అంబేడ్కరిస్టులు ఈ పన్నాగాన్ని పసిగట్టి ఎండగట్టడంలో విఫలమైనారు. ఎలాంటి స్వయంకృషి లేకుండా, ఈ సావకాశాన్ని సకాలంలో సద్వినియోగంచేసుకొనే క్రియాశీలకపాత్ర లేకుండా- చిన్నరాష్ట్రాల ఏర్పాటు దానికదే చిన్నకులాలను అందలమెక్కించదు. కాకపోతే అగ్రకులాధిపత్య శక్తుల దయాదాక్షిణ్యాలపై పూర్తిగా ఆధారపడి ఉండే ఆశ్రీతవాద దుస్థితిలో కొంతమార్పు తెచ్చి, స్వయంశక్తితో స్వతంత్రశక్తిగా మారి సాధికారత సాధించే సావకాశం లభిస్తుంది.

ఈ నేపథ్యంనుంచి చూసినప్పుడు విశాలాంధ్రలో అయినా, విభజనాంధ్రలో అయినా, తెలంగాణ- ఆంధ్ర విలీనంలో అయినా, అలీనంలో అయినా భౌగోళిక ప్రాదేశిక అంశంతో సామాజికఅంశం కూడా ముడిపడి ఉంటుందని ఆనాడే చాటిచెప్పిన అంబేడ్కర్‌ సమగ్ర దృక్పథాన్ని ఆకళింపు చేసుకోకపోతే ఈ చారిత్రక సదావకాశాన్నికూడా సద్వినియోగం చేసుకోలేం. పైగా చిన్నరాష్ట్రాల్లోకూడా పెద్ద కులాలే పాగా వేసే పరిస్థితి పునరావృతమవుతుంది. ఆశ్రీతవాద అవకాశవాద కుహనా సామాజిక న్యాయ దళారీ శక్తులే దండుగట్టి అగ్రకుల శక్తులకు అండదండలందిస్తాయి. ఇదే ఇప్పుడు నడుస్తున్న వర్తమాన చరిత్ర. ఈ చరిత్రను తిరగరాయకుండా, మరో చరిత్రను సృష్టించలేమని ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది.

Suryaa Telugu News Paper Dated: 27/10/2013 

Friday, October 25, 2013

పేదల పక్షపాతి (ఎస్‌.ఆర్‌. శంకరన్‌) --హరినాథ్ సిలువేరు


ఓ మంచి ఆలోచన లక్షలాది మందిని కదిలిస్తుంది. లక్షలాది మంది కదిలిక సమాజాన్ని సమూలంగా మారుస్తుంది- అన్న పేదల పక్షపాతి, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి దివంగత మాజీ ఐ.ఎ.ఎస్‌. అధికారి ఎస్‌.ఆర్‌. శంకరన్‌ మాటలు అక్షరసత్యాలు. తన మంచి ఆలోచనలతో ఒక ఐ.ఎ.ఎస్‌. అధికారిగా ఆంధ్రప్రదేశ్‌, త్రిపుర రాష్ట్రాల్లో పేదల కోసం సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి వాటిని అమలు చేయడం ద్వారా రెండు రాష్ట్రాల్లోని లక్షలాది మంది ప్రజలు సంక్షేమఫలాలు సద్వినియోగం చేసుకున్నారు. తమ జీవితాలను వెలుగు దారిలో ప్రయాణింపచేస్తున్నారు. 
శంకరన్‌ తమిళనాడులో ఒక మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో 1934 అక్టోబర్‌ 22న జన్మించి మద్రాస్‌ లయోలా కళాశాలలో హైయర్‌ సెకండరీ పూర్తి చేసి 1954లో అదే కళాశాలో డిగ్రీ పొంది 1957లో ఇండియన్‌ అడిమినిస్ట్రేటివ్‌ సర్వీస్‌కి ఎంపిక అయ్యారు. 1992 అక్టోబర్‌లో పదవీ విరమణచేసి 2010 అక్టోబర్‌ 7న కోట్లాది మంది పేదలకు దూరమయ్యారు. తన 76 సంవత్సారాల జీవితకాలంలో దాదాపు 43 సంవత్సరాల పాటు పేదల సంక్షేమం కోసమే పాటు పడ్డారు. 

1959లో కర్నూలు జిల్లా నంద్యాలలో సబ్‌ కలెక్టర్‌గా అధికారిక జీవితాన్ని ప్రారంభించిన శంకరన్‌ నెల్లూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా, తదుపరి అదే జిల్లాకు కలెక్టర్‌గా, రెండు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ శాఖ సెక్రెటరిగా, ప్రిన్సిపల్‌ సెక్రెటరిగా, త్రిపుర రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానే కాకుండా జాతీయ స్థాయిలో గ్రామీణాభివృద్ధి శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. దేశ చరిత్రలో బహుశా శంకరన్‌ వంటి అధికారిని అరుదుగానే చూడగలం. ఒక అగ్రవర్ణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి బడుగు, బలహీన వర్గాల ప్రజలకోసం పరితపించారంటే, అందుకు కారణం ఉన్నతధికారిగా క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేసి గ్రామాల్లో దుర్భర జీవితాలు గడపుతున్న ప్రజల కష్టాలే కావచ్చు. శంకరన్‌ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు, 1970 లో ఊరురా తిరుగుతూ దొరల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర అనేక సంవత్సరాలుగా వెట్టి చాకిరీ చేస్తున్న దళిత, గిరిజన ప్రజలను కలిసి వారి హక్కుల గురించి వివరించి చైతన్యపరచారు. వెట్టిచాకిరి వ్యవస్థ నుండి తమను విడిపించాలని ప్రభుత్వంపై నిరుపేద ప్రజల చేత దండయాత్ర చేయించిన వ్యక్తి శంకరన్‌. 

నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్న శంకరన్‌ వంటి అధికారులకు తన ప్రభుత్వంలో అధికారిగా కొనపాగే హక్కు లేదని- తన అహంకారాన్ని బయట పెట్టారు. కాని శంకరన్‌ తన దైన శైలిలో, పేదల పక్షాన నిలబడలేని ఈ ప్రభుత్వంలో ఉద్యోగానికి కొన్ని నెలలపాటు దీర్ఘకాలిక సెలవు పెట్టారు. అప్పటికే శంకరన్‌ పేరు దేశం నాలుగుమూలల వ్యాపించింది. నాటి త్రిపుర ముఖ్యమంత్రి నృపేన్‌ చక్రవర్తి, పేదల సంక్షేమం పోరాటం చేస్తున్న శంకరన్‌ను తమ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించుకున్నారు. ఇద్దరు పేదల సంక్షేమం వైవు ఆలోచించే వ్యక్తులు కావడం వల్ల త్రిపుర రాష్ట్ర అభివృద్ధికి ఢోకా లేకుండా పోయింది. దాదాపు 6 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పేదల సంక్షేమం వైపు నడిపించగలిగారు. ఇద్దరూ అనేక గిరిజన గ్రామాలల్లో ప్రవేశించి అక్కడి ప్రజల బాగోగులు తెలుసుకున్న వ్యక్తులు. ప్రజల కష్టాలను రూపు మాపేందుకు సంక్షేమ పథకాలు ప్రవేశట్టారు. 
ఆంధ్రప్రదేశ్‌లో 1984లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు యన్‌.టి. రామారావు ముఖ్యమంత్రి అయిన తరువాత, శంకరన్‌ను ఆహ్వానించి తన ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమించుకున్నారు. త్రిపుర రాష్ట్రంలో తన అనుభవాల దృష్ట్యా నాటి నుండి మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. 

రాజ్యంగంలోని అర్టికల్‌ 14 ప్రకారం, ప్రతి పౌరునికి తిండి, బట్ట, ఇల్లు- ప్రతి విద్యార్ధికి విద్య అందిచాల్సిన భాధ్యత ప్రభుత్వాలది. పేదవర్గాల పిల్లలు సరైన పోషకాహారం, తిండి లేక పిట్టల్లా రాలిపోతున్న రోజులవి. దానిని గమనించి శంకరన్‌ సంక్షేమ విద్యాలయాల స్థాపనకు శ్రీకారంట్టారు. దళిత గిరిజన విద్యార్ధులకు1984లో సంక్షేమ పాఠశాలలు ఏర్పాటుచేశారు. ఫలితంగా నేడు రాష్ట్రంలో 292 సాంఘిక సంక్షేమ బాల బాలికల పాఠశాలలు, కళాశాలలు ఉండగా, వాటిలో సుమారు లక్ష డెబె్భై వేల మంది విద్యార్ధులు, 5 వేల మంది టీచర్లు, వెయ్యి మందికి పైగా సిబ్బందితో అవి కళకళాలాడతున్నాయంటే అది శంకరన్‌ కృషే. విద్యార్ధులకు వసతి గృహాలతో పాటు సిబ్బందికికూడా వసతి గృహలను ఏర్పాటు చేయించారు. నేడు సంక్షేమ విద్యాలయాలు, కార్పొరేట్ల స్థాయిలో ఇంగ్లీష్‌ మీడియం విద్యను అందిస్తున్నాయి. సంక్షేమ, గిరిజన విద్యాలయాల్లో చదివిన విద్యార్ధులు ఎంతో మంది ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖలో అధికారులుగా ఉన్నారు. 
శంకరన్‌ తన కార్యలయానికే పరిమితం కాలేదు. ప్రభుత్వ పథకాలు ఏ మేరకు ప్రజలకు అందుతున్నాయో స్వయంగా చూసి తెలుసుకునేవారు. 

తన అధికారులతో తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని గుర్తేడు గ్రామంలో గిరిజన సంక్షేమ పాఠశాలను సందర్శించడానికి వెళ్ళిన సందర్భంలో శంకరన్‌తో సహా దాదాపు 11 మంది అధికారులను మావోయిస్టులు నిర్బంధించారు. ఆ తరువాత 12 రోజులకు విడుదల చేశారు. అయినా ఏనాడూ శంకరన్‌ వెనుకంజ వేయలేదు. ఇప్పటికీ రాష్రంలో అమలవుతున్న నిరుపేదలకు భూపంపిణి, ఇల్లు లేని వారికి ఇల్లు, బ్యాంకుల రుణాలు, కూలీలకు కనీస వేతనాలు, అణగారిన వర్గాల పిల్లలకు ఉచిత విద్య, వితంతు పెన్షన్లు, ఎస్‌.సి, ఎస్‌.టి సబ్‌ ప్లాన్‌ అమలు, ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ వంటి సంక్షేమ పథకాలకు పునాది శంకరన్‌ కృషే. శంకరన్‌ సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు, వెట్టిచాకిరి వ్యవస్థలో మగ్గుతున్న దళిత గిరిజనులను విముక్తి చేయాలని, ఎస్‌.సి లపై జరుగుతున్న దాడులను అత్యాచారాలుగా చూడాలని ప్రతిపాదించారు. ఆ ఫలితంగానే 1985లో కారంచేడు సంఘటనలో దళితులపై దాడిచేసిన వారిపై అట్రాసిటి కేసు నమోదు అయ్యింది. 

ఈ సంఘటనతో యన్‌.టి. రామారావు చిక్కుల్లో పడి, శంకరన్‌ను పదవికి దూరం పెట్టి కొన్ని నెలలపాటు పోస్టింగ్‌ ఇవ్వలేదు. 1990లో శంకరన్‌ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖలో కార్యదర్శిగా నియమితులయ్యారు. అక్కడ కూడా అణగారిన వర్గాల కోసమే శ్రమించారు. పంచాయతి, మున్సిపాలిటి ఎన్నికలల్లో ఎస్‌.సి, ఎస్‌.టి, బి.సి రిజర్వేషన్లు అమలయ్యే విధంగా శ్రమించారు. దాని ఫలితమే 1992 లో 73 వ సవరణను అమలు చేయడం ద్వారా నేడు అణగారిన వర్గాల ప్రజలు ప్రజా ప్రతినిధులుగా ఉన్నారు. శంకరన్‌ 1992 అక్టోబర్‌లో ప్రభుత్వ అధికారిగా పదవీ విరమణ చేసినా, తన కృషిని విడిచి పెట్టలేదు. హైదరాబద్‌ నగరం నడిబోడ్డులోని పంజాగుట్టలో ఒక అపార్ట్‌మెంట్‌లో ఆయన ఇల్లు ఎంతో సాదా సీదాగా ఉండేది. సాఫాయి కర్మచారి ఉద్యమానికి ముఖ్య నాయకుల్లో ఒకరుగా, వారి హక్కుల సాధనకోసం దేశ వాప్తంగా ఉద్యమాన్ని వ్యాపింపచేసిన వ్యక్తి. తనకు వచ్చే పెన్షన్‌ డబ్బును దళిత విద్యార్ధుల పైచదువుల కోసం వెచ్చించేవారు. వీధిబాలలు, వికలాంగులకు ఆశ్రమాలు నడిపే స్వచ్ఛంద సంస్థలకు సహాయం చేసేవారు.

హైద్రాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ల్లో ఎస్‌.సి, ఎస్‌.టి.లకు చదువుకునే అవకాశం లేకపోతే, కేంద్ర సామాజికన్యాయ మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడి రిజర్వేషన్లు అమలు చేయించారు. శంకరన్‌ అటు మావోయిస్టులకు, ఇటు ప్రభుత్వానికి మధ్య 2004లో జరిగిన శాంతిచర్చల్లో ప్రధాన సమన్యయకర్తగా వ్యవహించారు. చర్చలు సఫలం కాకాపోవడంతో మానసికంగా కృంగిపోయారు. 
శంకరన్‌ నిరంతరం పేదప్రజల అభివృద్ధికి చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మ భూషణ్‌ అవార్డుకు ఎంపికచేసింది. కాని సన్మానాలకు దూరంగా ఉండే శంకరన్‌ సున్నితంగా తిరస్కరించారు. ఆయన మరణించిన తరువాత ప్రభుత్వమే అధికారికంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేసింది. ఈనాటి ఐ.ఎ.ఎస్‌, ఐ.పి.ఎస్‌, ఐ.ఎస్‌.ఎస్‌ అధికారులకు ఆయన ఒక ఆదర్శం కావాలి. శంకరన్‌ చేయించిన సంక్షేమ పథకాలను విద్యార్ధులు సద్వినియోగం చేసుకొని ప్రజలకు సేవ చేయగలగాలి. వ్యక్తి గత అభివృద్ధిని కోరుకుంటూ తన చుట్టు ఉన్న పదిమందికి లబ్ధి చేకుర్చేలా వ్యవహరించినప్పుడే శంకరన్‌ ఆశయాలను కొనసాగించినవారమవుతాము. సాంఘిక సంక్షేమ శాఖలో కార్యదర్శిగా పనిచేసిన శంకరన్‌ జయంతి వేడుకలను ప్రస్తుత సాంఘిక సంక్షేమ కార్యదర్శి డా ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ స్వారోస్‌ అధ్వర్యంలో అక్టోబర్‌ 25న నిర్వహించడం, ఆయన ఆశయాలను కొనసాగించడమే.

Suryaa Telugu News Paper Dated: 26/10/2013 

Tuesday, October 22, 2013

అభ్యుదయ పాలనా జ్ఞాని - జానమద్ది హనుమచ్ఛాస్త్రి

తెలుగు సూర్యుడుగా పేరు గడించిన తెల్లదొర సిపి బ్రౌన్ స్మృతి చిహ్నంగా కడపలో నిర్మించిన బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రాన్ని చూసేందుకు సామాన్య పాఠకులు, పరిశోధకులే కాక సాహిత్యాభిమానులైన ఉన్నతాధికారులు కూడా వస్తుంటారు. వారు బ్రౌన్ పట్ల ఎంతో గౌరవభావం కలిగినవారు. 1993 డిసెంబర్ 21న పుస్తక ప్రేమి అయిన ఒక ఐఎస్ అధికారి, అతనితోపాటు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి కెఎస్ఆర్ మూర్తి బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఆ సంస్థ కార్యదర్శిగా వారికి గ్రంథాలయంలోని కొన్ని అరుదైన పుస్తకాలను, ప్రముఖుల రాత ప్రతులను చూపాను. అభినందనలందుకొన్నాను. వారు కొంతకాలం నెల్లూరు జిల్లా కలెక్టరుగా సంచలనాత్మక నిర్ణయాలకు, ప్రజాహిత పనులకు పేరు గాంచిన వారని తెలుసుకొన్నాను. ఆయన చాల నిరాడంబరుడు. ఏది పాలన అంటే, నిరుపేదల ఆలన పాలన అని నిరూపించిన అరుదైన ఐ ఏ ఎస్ అధికారి యస్. ఆర్. శంకరన్.
తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని సరిగళత్తూర్ గ్రామంలో 1934 అకోటబర్ 22న మధ్యతరగతి కుటుంబంలో శంకరన్ జన్మించారు. 1957 ఐఎఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి ప్రజల మన్ననలతో పాటు ప్రభుత్వ యంత్రాంగంలోని ప్రధాన అధికారుల, మంత్రుల ఆదరాభిమానాలను అందుకొన్న అరుదైన అధికారి శంకరన్. ప్రజల కలెక్టర్‌గా పేరు గాంచిన ఆయన నెలలో సగం రోజులు ప్రజల్లోకి వెళ్లి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలితాలందుతున్నాయో లేదో కనుగొని, వారి తృప్తిని గమనించిన 'సంక్షేమ భాస్కరుడు' శంకరన్. సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా, బడుగు వర్గాలవారు గిరిజనులు, దళితులు మున్నగు అడుగు వర్గాల వారు సుఖసంతోషాలతో జీవించాలనీ ఉదాత్త ఆశయం కలవాడు. జోగినీ వ్యవస్థ నిర్మూలన కోసం ప్రత్యేకంగా చట్టం చేయించడం, సూవర్టుపురం మాజీ నేరస్థులకు పునరావాసం కల్పించుటలో శంకరన్ కృషి చిరస్మరణీయం. బ్రాహ్మణుడుగా పుట్టినా, బ్రాహ్మణీకంలోని ఛాందసత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించి మానవులందరూ సమానులేనని, మాటల్లో కాక, చేతల్లో చూపిన కార్యశీలి శంకరన్.
ప్రభుత్వ వాహనాలను, స్వంత పనులకు వినియోగించటం ఏ మాత్రం సహించని నిజాయితీపరుడు. నెల్లూరు కలెక్టర్‌గా వున్నప్పుడు, నెల్లూరు పట్టణంలోని మార్కెట్ వద్ద ప్రభుత్వ వాహనాలుండటం ఆయన గమనించారు. తమ వెంటనున్న బంట్రోతు ద్వారా, ప్రభుత్వ వాహనాల డ్రైవర్లను పిలిపించారు. ఇక్కడ వాహనాలెందుకున్నాయని ప్రశ్నించారు. అధికారుల భార్యలు మార్కెట్‌కు వచ్చారని చెప్పారు. వెంటనే ఆ వాహనాలను కలెక్టర్ ఆఫీసుకు చేర్చమని ఆదేశించారు.కలెక్టర్ బంగళా చాల విశాలంగా వుండేది. మహిళా కళాశాలకు తగిన వసతులు లేవని తెలుసుకొని ఆ బంగళాను ప్రభుత్వ మహిళా కళాశాలకు ఇచ్చివేశారు. తోటి అధికారి ఒకరు 'ఇదేం సార్' అని అడిగినపుడు, 'ఇంత పెద్ద బంగళా ఒక్కరి నివాస స్థానమే కావడం అన్యాయం కదా? అన్న ఉదార చరితుడు శంకరన్.
ఆయన వ్యక్తిగత జీవితం ఆశ్చర్యకరం. అరచేతుల దాకా చొక్కా, మామూలు ప్యాంట్, కాళ్లకు సాదా చెప్పులు. బిళ్ల బంట్రోతు లేకపోతే ఆయనను కలెక్టరుగా తెలుసుకోవటం కష్టం. ప్రజలు ఆయనను, ఐఎఎస్ గాంధి అనేవారు. సిబిఎస్ వెంకటరమణ, ఐఎఎస్ అధికారి. తన వ్యక్తిగత పనుల కారణంగా గుంటూరు వెళ్లి, తెలిసిన వారింట్లో వున్నపుడు, ఒక గ్రామీణ వ్యక్తి శంకరన్ గురించి చెబుతూ ఆయన 'ఒక రుషి' అన్నాడు.అధికారికంగా ఏ హోదాలో ఉన్నా శంకరన్ తనదైన ముద్ర వేసేవారు 1957లో ఐఎఎస్ ఉద్యోగిగా చేరిన నాటి నుంచి 1992లో పదవీ విరమణ చేసేవరకు సామాన్య ప్రజల హక్కులు ఎస్ఎస్‌టి కమీషన్, అటవీ హక్కుల కమీషన్ మొదలగు సంస్థల కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవారు. నిరంతరం బడుగుల సంక్షేమాన్ని గురించి ఆలోచించేవారు.
శంకరన్ త్రిపుర రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వెళ్లారు. విమానం దిగి, ఒక రిక్షా మాట్లాడుకొని సర్క్యూట్ హౌస్ చేరారు. శంకరన్ గారికి స్వాగతం చెప్పడానికి ఎప్పుడో వచ్చిన అధికారులు శంకరన్ గారిని గుర్తించనందుకు తమ పొరపాటును మన్నించమన్నారు.నక్సలైట్లతో ప్రభుత్వం చర్చలు జరుపునట్లు కృషి చేశారు. ఒకమారు నక్సలైట్లచే కిడ్నాప్ కావడం జరిగింది. వారు శంకరన్ సేవలను విని సగౌరవంగా వారి నివాసానికి చేర్చారు.ఆయనకు సొంత ఇల్లు లేదు. అద్దె ఇల్లు కూడా అవసరాలకు తగినంతగా చిన్నది.
నేల మీద చాప పరచుకొని ఆఫీసు ఫైళ్లను చకచకా పరిశీలించేవారు. జీవితాంతం బ్రహ్మచారిగానే వుండేవారు.కవి, రచయిత కోయి కోటేశ్వరరావు శంకరన్ గురించి మాట్లాడుతూ 'జీ.వో.ల్లో నిదురపోతున్న సంక్షేమాన్ని జీవితాల్లోకి బట్వాడా చేసిన అభ్యుదయ పాలనా జ్ఞాని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'పద్మ భూషణ్' ప్రశస్తిని తిరస్కరించిన నిష్కామ జీవి శంకరన్. బడుగు వర్గాల ప్రజల గుండెల లబ్‌డబ్ ధ్వనుల్ని జీవితాంతం పరిశీలించిన వారు శంకరన్' అని కొనియాడారు. శ్రీశైలం దేవస్థానం దర్శనం చేసుకొని వచ్చిన శంకరన్‌ను మిత్రులు దేవుని ఏమని వేడుకొన్నారు అని ప్రశ్నించినపుడు బీద ప్రజలను చల్లగా చూడమని వేడుకొన్నాను అన్నారు.బ్రతికినంత కాలం ప్రజా సంక్షేమానికి అంకితమైన శంకరన్ 2010 అక్టోబర్ 7న కాలగతి చెందారు.
- జానమద్ది హనుమచ్ఛాస్త్రి
(నేడు శంకరన్ జయంతి)

Andhra Jyothi Telugu News Paper Dated: 22/10/2013 

నిరాడంబరతకు నిలువుటద్దం (ఎస్.ఆర్.శంకరన్) By చెట్టుపల్లి మల్లిఖార్జున్


సమాజంలో అట్టడుగు వర్గాలైన పేదలు, దళితులు, అదివాసీల పట్ల అపారమైన ప్రేమతో, ఈ దేశం బాగుపడాలనే తపనతో అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలలను ఎస్సీ, ఎస్టీ ప్రజలకు అందించిన ఘనత ఎస్.ఆర్. శంకరన్‌దే! రాష్ట్రంలో సాంఘిక, సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ వసతిగృహాలు, గురుకుల పాఠశాలలు, స్కాలర్‌షిప్పులు, గిరిజన హక్కులు, నక్సలైట్ ఉద్యమం అనగానే మనకు గుర్తుకు వచ్చే పేరు ఎస్.ఆర్.శంకరన్.
దేశ చరివూతలో ఉన్నతాధికారుల్లో శంకరన్ లాంటి మానవతావాదులు అరుదు. ఆయన నిజాయితీకి మారుపేరుగా నిలిచారు. పేద ప్రజలకు ఆయన చేసిన మేలు దళితులు, గిరిజనులు ఎప్పటికీ మరువలేరు. సమాజ మార్పు కోసం ఆయన వేసిన అడుగులు అందరికీ ఆదర్శం. శంకరన్ నిజాయితీ గల ఐ.ఎ.ఎస్.అధికారిగా భూ సమస్యల విషయంలో పేదలకు అనుకూల విధానాలు రూపొందించి వాటిని చిత్తశుద్ధితో అమలు చేశారు. మావోయిస్టులతో రాష్ర్ట ప్రభుత్వం చర్చలు జరపడంలో ఆయనే ముఖ్య పాత్ర పోషించారు. రాజ్యాంగంలో పొందు పరచబడిన ‘సంక్షేమ భావన’ను ఆచరణలో చూపిన వ్యక్తి. ‘సంక్షేమం’ అన్న భావానికి దేశవ్యాప్తంగా గుర్తింపును, మన రాష్ట్రానికి ఈ విషయంలో ప్రత్యేకతను సంతరించిపెట్టిన వారు ఎస్.ఆర్. శంకరన్.

శంకరన్ తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు సమీపంలోని సిరిగలత్తూరు గ్రామం లో 1934 అక్టోబర్ 22న జన్మించారు, ఎస్.ఆర్. శంకరన్ పూర్తి పేరు సిరిగలత్తూర్ రామనాధన్ శంకరన్. శంకరన్ తండ్రి రైల్వేగార్డుగా పనిచేసేవారు. తండ్రి ఉద్యోగరీత్యా వివిధ రాష్ట్రాలకు బదిలీ అయి వెలుతుండటంతో ఆయన చదువు వివిధ ప్రాంతాలలో కొనసాగింది. మద్రాసు లయోలా కళాశాలలో బి.కాం(ఆనర్స్) చదివారు. మధురైలోని కళాశాలలో కొంతకాలం కామర్స్ లెక్చరర్‌గా పనిచేశారు. శంకరన్ కేంద్ర పబ్లి క్ సర్వీస్ కమిషన్ రాసి 1957ఐఏఎస్ బ్యాచ్‌కు ఎంపికై నంద్యాల సబ్ కలెక్టర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. కొద్దికాలం ఫారెస్ట్ ఎన్విరాన్‌మెంట్ డిపార్ట్‌మెంట్లకు కార్యదర్శిగా పనిచేశారు. ఆర్ధిక శాఖలో డిప్యూటీ సెక్రటరీగాను, ఈ శాఖలోనే ప్లానింగ్ కార్యదర్శిగాను పనిచేశారు. న్యూఢిల్లీలో గ్రామీణాభివృద్ధి శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. బీహార్ కోల్‌మైన్స్ అధికారిగా కొంతకాలం ఉన్నారు. సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శిగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు.

ఎస్.ఆర్.శంకరన్ కంటే ముందు ‘సాంఘిక సంక్షేమశాఖ’ అనేది లేబర్, ఎంప్లాయిమెంట్ శాఖలో మిళితమై ఉండేది. దాన్ని ప్రత్యేక శాఖగా చేసిన ఘనత శంకరన్ గారిదే. అంతేకాదు ఎన్టీఆర్ ముఖ్యమంవూతిగా ఉండగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలంన్నింటినీ కలిపి ఒకే భవనంలో వాటి కార్యాలయాలను ఏర్పాటు చేసింది శంకరన్ గారే. నేటి ‘దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్’ నిర్మాణానికి రూపురేఖలు దిద్దింది కూడా ఆయనే. సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలల రూపకల్పనకు, దేశంలో సివిల్ సర్వీసెస్ సాధించుటకు ‘ఆంధ్రవూపదేశ్ స్టడీసర్కిల్’ ఏర్పాటుకు కృషి చేసింది శంకరన్‌గారే. వృత్తి విద్యాకోర్సులలో చదివే ఎస్సీ,ఎస్టీ విద్యార్థులందరికీ (ఆదాయ పరిమితిని విధించి) ఉచిత హాస్టల్ వసతి, ఉపకార వేతనాలు అందజేసే ప్రక్రియను ప్రారంభించిందీ ఆయనే. సాంఘీక సంక్షేమశాఖ కార్యదర్శిగా ఉండగా హాస్టల్స్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఎస్సీ, ఎస్టీ విద్యార్థిని చేర్చుకోవాలని ఆదేశాలు జారీచేశారు. విద్యార్థుల సంఖ్య అనుకున్నదానికంటే ఎక్కువ కావడంతో హాస్టల్స్ నిర్వహణకు బడ్జెట్ సరిపోలేదు. దీంతో ప్రభుత్వ అనుమతి లేకున్నా ఖర్చుపెట్టారు. అందుకు ఆర్థికశాఖ కార్యదర్శి బి.పి.ఆర్.విఠల్ అభ్యంతరం తెలిపారు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి పేషీకి వెళ్ళింది. అప్పుడు వి.గోవిందరాజన్ ముఖ్యమంత్రి చెన్నాడ్డికి కార్యదర్శిగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీలకు శంకరన్ చేసిన సేవల ఫలితంగానే ఈ వర్గాల ప్రజలు ఇందిరా కాంగ్రెస్‌కు ఓట్లు వేసి గెలిపించారని ముఖ్యమంత్రి గ్రహించారు. శంకరన్ ప్రతిపాదనలను,ఆదేశాలను,ఆచరణను సమర్ధించారు.

శంకరన్ గారికి కార్మిక,ఉపాధి, సాం ఘిక సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖలంటే బాగా ఇష్టం. ఈ శాఖల ద్వారా ప్రజలకు చేరువకావచ్చునని, ఎక్కువ సేవ చేసే అవకాశం ఉంటుందని భావించేవారు. ఈ శాఖల అధికారిగా ఆయన దళిత బడుగు, బలహీన వర్గాలకు సేవచేసి వారి ఆదరాభిమానాలను చూరగొన్నారు. శంకరన్ నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన 18 నెలల కాలంలో పేద వర్గాలకు అధిక సేవలందించారు. ఆ తర్వాత వీరిని ఆదర్శంగా తీసుకొని కె.రాజు, ఐఏఎస్, కలెక్టరుగా ఈ జిల్లా పేదప్రజలకు ఎస్సీ,ఎస్టీ,బీసీ వర్గాలకు సేవచేశారు. శంకరన్ ఈ జిల్లాకు కలెక్టరుగా పనిచేసిన కాలాన్ని జిల్లా ప్రజలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. పేదలకు వందలాది ఎకరాల భూమిని ఆయన పంచిపెట్టారు. ‘కపూక్టర్’ అన్న పదవికి గౌరవం తీసుకువచ్చారు. జిల్లాలోని సగం గ్రామాలను స్వయంగా అధికార బృందంతో సందర్శించారు. ప్రజల వద్దకు పాలన అంటే ఎలా ఉంటుందో ఆచరణలో చూపారు. వీరి సేవలకు గుర్తింపుగా నెల్లూరు జిల్లాలో శంకరపురం, శంకరన్ నగర్‌లు అనేకం వున్నాయి.
ddr3

శంకరన్ సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా ఉన్న సమయంలో లేక్ వ్యూ గెస్ట్‌హౌస్‌లో ఉండేవారు. సచివాలయానికి నడిచివచ్చేవారు. ఒకరోజు గేటువద్ద ‘పాస్’ చూపమని సెక్యూరిటీ అధికారి అడిగారు. ‘నేను శంకరన్ నయ్యా’అన్నారు. ఖంగుతిన్న సెక్యూరిటీ అధికారి క్షమించమని చెప్పి సెల్యూట్ చేసి పంపించారు. శంకరన్ అతనిని తన విధిని సక్రమంగా నిర్వహిస్తున్నందుకు అభినందించారు. అప్పటి నుంచీ ఆయన ఎంట్రీ పాసును తీసి పెట్టుకున్నారు. శంకరన్ సచివాలయానికి ఉదయాన్నే తొమ్మిదన్నరలోగా చేరుకునేవారు. రాత్రి ఎనిమిది గంటల వరకు పనిచేసేవారుపజల సమస్యలనుచిత్తశుద్ధితో పరిష్కరించేవారు.
శంకరన్ మెదక్ జిల్లా ‘ఖానాపూర్’లో వెట్టిచాకిరి చేస్తున్న కార్మికులను సమావేశపరిచి వారికి వెట్టిచాకిరి నుంచి ఎట్లా విముక్తి కావాలో శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసి బోధించారు. ఫలితంగా భూస్వాముల వద్ద పనిచేసే జీతగాళ్ళంతా తిరుగుబాటు చేశారు. వాళ్ళలో డాక్టర్ చెన్నాడ్డి బంధువుల వద్ద పనిచేసేవాళ్లూ ఉన్నారు. అప్పుడు ముఖ్యమంవూతిగా ఉన్న చెన్నాడ్డికి వారంతా ఫిర్యాదు చేసి, తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి శంకరన్ గారిని పిలిచి మందలించబోయారు. తాను చట్టవూపకారమే పనిచేస్తున్నానని కరాఖండిగా చెప్పారు.చెన్నాడ్డితో వెట్టిచాకిరి నిర్మూలన అంశంపై విభేదించిన శంకరన్ గారిని త్రిపుర ప్రభుత్వం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని స్వీకరించమని కోరింది. అప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నృపేన్ చక్రవర్తి. ఆయన కూడా శంకరన్ వలె అవివాహితుడు. శంకరన్ గారికి పాలన విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆ రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. త్రిపురలో శంకరన్ ప్రభుత్వ అతిథి గృహంలో ఉండేవారు. ప్రజలు నేరుగా కలిసి తమ సమస్యలు చెప్పుకునేవారు.

బీహార్ రాష్ర్టంలో కోల్‌మైన్స్ అధికారిగా ఉన్నప్పుడు బొగ్గు గునుల్లోకి వర్షం నీళ్లు ప్రవహించాయి. దీనివల్ల అనేక మంది బొగ్గుగని కార్మికులు ప్రాణాలు పొగొట్టుకున్నారు. తమ వారిని పోగొట్టుకున్న ఒక ముసలి అవ్వ శంకరన్ గారిని పట్టుకొని బోరున విలపించింది. ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన ఈ ఘటనలో శంకరన్ గారి స్పందన, ఆయన పనివిధానం బాధితులను ఆకట్టుకుంది.
శంకరన్ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా, కాకి మాధవరావు డైరెక్టర్‌గా ఉన్న కాలంలో ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధికి కావలసిన చర్యల్ని చేపట్టడానికి రాష్ట్రస్థాయిలో వారం రోజుల పాటు ఎల్‌బీ స్టేడియంలో జరిగిన మహాసభలో చేసిన తీర్మానాలను జీవోల రూపంలో తీసుకు వచ్చారు. ఈ ఘనత ఎస్.ఆర్.శంకరన్ గారిదే. వాటిని ఒక పుస్తక రూపంలో ప్రచురించారు. 1955 పౌర హక్కుల పరిరక్షణ చట్టం కూడా దీనిలో చేర్చారు. 1976-77లో 136 మెమోలు, జీవోలు వెలువడ్డాయి. వీటిలో హౌసింగ్ బోర్డు ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్లు, బోగస్ కుల ధృవీకరణ పత్రాలు సమర్పించిన వారిపై చర్యలు, జిల్లా స్థాయిలో ఎస్సీ, ఎస్టీ సెల్‌ల ఏర్పాటు, కులాంతర వివాహితులకు రక్షణ, అగ్రవర్ణ కాలనీలలో దళితుల ఇళ్ల నిర్మాణం, మురికివాడల్లో నివసించేవారికి ప్రత్యామ్నాయ గృహ వసతి, భూ పంపిణీ మొదలైనవి ఉన్నాయి. జీవితాంతం శంకరన్ గారు బడుగు బలహీన వర్గాలకు చేసిన మేలు, రాజ్యాంగ పరంగా సంక్రమింప చేసిన హక్కులు మరువరానివి. ఐఏఎస్ అధికారిగా అత్యున్నత పదవులు చేపట్టినా నిరాడంబరంగా జీవించిన ప్రజల మనిషి శంకరన్. జీవితాంతం ఉన్నత మానవీయ విలువల కోసం పోరాడిన శంకరన్ ఎందరికో స్ఫూర్తి.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అకడమిక్ కన్సప్టూంట్
పాలమూరు యూనివర్సిటీ
(నేడు ఎస్.ఆర్. శంకరన్ 79వ జయంతి)

Published in Namasete Telangana Telugu News Paper Dated : 22/10/2013