Sunday, October 26, 2014

హైందవ పునాదులపై ఇండియా - డాక్టర్‌ భంగ్యా భూక్యా



పెరి ఆండర్‌సన్‌ రచించిన ది ఇండియన్‌ ఐడియాలజీ గత రెండు సంవత్సరాలుగా ఇండియన్‌ మేధావి వర్గంలో పెద్ద దుమారాన్నే లేపింది. ఈ వర్గం తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌ అనువదించి ప్రజలకు పరిచయం చేయటం చాలా సంతోషం. ఇండియాను బ్రిటిష్‌ పాలకులే డిస్కవరీ చేశారన్న ఆండర్‌సన్‌ వాదనతో నేను వ్యక్తిగతంగా ఏకీభవించను. కానీ అతను లేవనెత్తిన అనేక వాదనలు, ప్రశ్నలు భారత దేశంలోని వాస్తవాలను ఎత్తి చూపుతున్నాయి. ఎందుకు అత నితో ఏకీభవించనంటే ఇండియాను డిస్కవరి చేసింది హిందూ మేధావి వర్గం. రాజారామ మోహన్‌ రాయ్‌ దగ్గర నుంచి జవహర్‌లాల్‌ నెహ్రూ వరకు ఆంగ్ల విద్యను వంటబట్టించుకున్న తరం ఇండియాను డిస్కవరీ చేయటమే పనిగా పెట్టుకొని వేదకాలం నుంచి నేటి వరకు ఇండియాలో దాగి వున్న హిందూత్వాన్ని వెలికి తీశారు. ఇది ఇండియాను ఒక అప్రకటిత హిందూ దేశంగా తీర్చిదిద్దింది.
ఈ పుస్తకం ప్రధానంగా చెప్పేదేమంటే ప్రతి రాజకీయ పార్టీ సిద్ధాంత రాద్ధాంతాలకు అతీతంగా హైందవ సాంస్కృతిక పునాదుల మీద నిర్మించబడి ఆ సంస్కృతిని బలోపేతం చేసింది. అదే విధంగా సనాతన వాదులు, ప్రగతిశీలవాదులన్న తేడాలేకుండా ప్రతి హిందువూ ఇండియన్‌ హైందవ ధర్మరక్షణకే పాటు పడ్డాడు, పడతాడూ కూడా. ఆందుకే ఆ రోజు వల్లబ్‌ భాయ్‌ పటేల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ను కాంగ్రెస్‌ పార్టీలో విలీనం కావాలని కోరాడు. ఇప్పుడు ఆరు వందల అడుగుల ఎత్తు పటేల్‌ విగ్రహాన్ని (స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ) నిర్మించటానికి నరేంద్ర మోదీ తాపత్రయపడుతున్నారు. అంటే దేశంలోని ఐక్యత విషయం ప్రక్కన పెడితే, కాంగ్రెసుకి, బీజేపీకి హిందూత్వ విషయానికి వచ్చినప్పుడు ఎటువంటి తేడా లేదు. కాంగ్రెస్‌ లౌకికవాదానికి ఈ దేశం మోసపోయిందని ఈ పుస్తకం బలంగా చెబుతుంది. అంతేకాదు, కాంగ్రెస్‌ దాని నాయకులు గాంధీ, నెహ్రూలు చేసిన మోసాలు ఇన్నీ అన్నీ కావని ఈ పుస్తకం రూఢి చేస్తుంది.
సాధారణంగా వలసవాదానికి వ్యతిరేకంగా జరిగిన అధ్య యనాన్ని మనం జాతీయ ఉద్యమంలాగా భావిస్తాము. మన అగ్రకుల చరిత్రకారులు దీన్ని ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజా ఉద్యమంగా అభివర్ణించారు. అయితే ఈ ఉద్య మం హైందవ ధర్మరక్షణకే జరిగిందన్న విషయం మనకు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుంది. గాంధీకి స్వరాజ్‌ మతపరంగా ఒక తప్పనిసరి ఆవశ్యకత. రాజకీయ రూపం అనేది దీనిని ముందుకు తీసుకెళ్ళే సాధనం తప్ప మరొకటికాదు. మతాన్ని రాజకీయాలతో జోడించి ఉద్యమాన్ని నిర్మించటం గాంధీ ప్రత్యేకత. ఈ క్రమంలో హైందవ మత ఉద్ధరణం ప్రధానాంశం కావటం చూస్తాము. రాజకీయ స్వేచ్ఛ రెండవ అంశం కావటం చూస్తాము. వాస్తవంగా గాంధీ చేసిన రాజకీయ ఉద్యమాలు ఏవీ కచ్చితమైన ఫలితాలను సాధించకుండానే ముగుస్తాయి. అట్టహాసంగా మొదలుపెట్టిన సహాయనిరాకరణ ఉద్యమం చౌరిచౌరాలో జరిగిన హింసాత్మక సంఘటనతో అర్థాంతరంగానే ముగుస్తూంది. కానీ అసలు కారణం హింసకాదు. ఈ ఉద్యమం కొద్ది రోజు ల్లోనే ప్రజా ఉద్యమంగా మారింది. బ్రిటిష్‌ పాలన కంటే ప్రజా విప్లవమే ప్రమాదకరమని భావించి సహాయ నిరాకరణోద్యమాన్ని ముగిస్తారు. అప్పటికి ఇండియా హిందువైజేషన్‌ కాకపోవటం కూడా ఒక ప్రధాన కారణం. దండి సత్యాగ్రహం ఒక ఢిఫెన్సివ్‌ ఆట. క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రజల నుంచి వచ్చింది. ఇందులో గాంధీ ప్రమేయం అంతంత మాత్రమే. గాంధీ రాజకీయ ఉద్యమాల్లో విజయం సాధించలేదు. కానీ హైందవ మత విషయంలో విజయాన్ని సాధించారు.
గాంధీ తన ప్రజా జీవితం మొత్తాన్ని హిందూ ధర్మరక్షణ కోసమే వెచ్చించ్చారని ఈ పుస్తకం రూఢీ చేస్తుంది. వ్యక్తిగత, ప్రజా జీవితం రెండూ మత మౌఢ్యంలోనే నడిచాయి. గాంధీ బ్రహ్మచర్యం కూడా హిందువులం మైలపడతామన్న భయం నుంచి రూపు దిద్దుకుంది. వ్యక్తిగత స్థాయిలో అన్ని మతాలు సమానమని నమ్మిన, రాజకీయ స్థాయిలో మాత్రం హిందూ మతం, ఇస్లాం మతం కంటే కాస్త ఎక్కువ అని నమ్మేవారు. ఒక ముస్లిం యువతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న తన కుమారునికి అది ‘ధర్మ విరుద్ధం’ అని హెచ్చరించారు. రాజకీయాల్ని పక్కనబెట్టి ఈ పెళ్లి కాకుండాచూశారు.
గాంధీ లౌకిక వాదంలో హిందూత్వం దాగి ఉందని ముస్లింలు చాలా కొద్దికాలంలోనే కనిపెట్టారు. నాటకీయంగా జరిగిన ఖిలాఫత్‌ ఉద్యమం తరువాత గాంధీ ముస్లింలను వదిలివేశారు. ఆనాటి నుంచి అత్యధిక శాతం ముస్లింలు ఆయనను ఎప్పుడూ నమ్మలేదు. లౌకిక వాదానికి ప్రతీకగా ఉన్న మహమ్మదలీ జిన్నా కూడా గాంధీ హిందూత్వ రాజకీయాలకు విసిగిపోయి కాంగ్రెస్‌ నుంచి బైటికి వచ్చేశారు. నిష్పక్షపాతి అయిన మోతీలాల్‌ నెహ్రూ కాంగ్రెస్‌ పార్టీ కచ్చితంగా హిందూ పార్టీయే అనడం గమనించదగ్గ విషయం. ఈ హైందవ రాజకీయాలే దేశ విభజనకు దారితీశాయి. కానీ చరిత్రలో దేశ విభజనకు జిన్నాను దోషిగా నిలబెట్టారు.
కాంగ్రెస్‌ పార్టీయే పాకిస్థాన్‌ స్థాపనకు నాంది పలికింది. జిన్నా భారత దేశంలో ఒకటి కాదు, రెండు దేశాలున్నాయని 1940లో ప్రకటించారు. ఆ రెండు దేశాలు సహజీవనం చేసేందుకు భారత స్వాతంత్య్రం వీలుకల్పించాలి, ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో వారికి స్వయంప్రతిపత్తినీ, సార్వభౌమాధికారాన్ని ఇవ్వాలన్నారు. అంటే జిన్నా ప్రత్యేక దేశం కావాలని కోరలేదు. ముస్లింలకు స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకున్నారు. ఈ విషయాన్ని గందరగోళం చేసి కాంగ్రెస్‌ పార్టీ పాకిస్థాన్‌ ప్రతిపాదనను జిన్నాకు అంటగట్టింది. దే శ విభజన బ్రిటిష్‌ ప్రభుత్వానికి కూడా ఇష్టం లేదు. క్యాబెనెట్‌ మిషన్‌ ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్న ప్రాం తాలన్నీ స్వయం పాలనాధికారంతో ఉండే విధంగా ప్లాన్‌ రూపొందించింది. కానీ అది నెహ్రూకు రుచించలేదు. ముస్లింలకు ప్రత్యేక స్వయంప్రతిపత్తి, ఇవ్వడం కంటే దేశ విభజనే మేలని నెహ్రూ భావించారు.
విచిత్రమేమంటే, కాంగ్రెస్‌, ముస్లిం లీగ్‌ దేశ విభజన గురించి మాట్లాడుతున్నప్పుడు జిన్నా మాత్రం అఖండ భారత దేశంలో సంకీర్ణ ప్రభుత ్వం గురించి కలలు కనేవారు. భారత దేశంలో ఆంక్ష లు లేని సంపూర్ణ అధికారంతో కూడిన బలమైన కేంద్ర ప్రభుత్వం కావాలని నెహ్రూ కోరుకున్నారు. అది విభజనతోనే సాధ్యపడుతుందని భావించారు. చివరకు ఈస్ట్‌ బెంగాల్‌ని కూడా జిన్నా కోరుకోలేదు కానీ, ఈ ప్రాంతం ఇండియాతో ఉంటే కోల్‌కతాలో ముస్లింల ప్రాబల్యం పెరుగుతుందని పాకిస్థాన్‌కు అంటకట్టారు. రేపటి భారత్‌లో హిందువుల ఆధిపత్యమే పునాదిగా దేశవిభజన జరిగిందన్న విషయాన్ని ఇక్కడ గుర్తించాలి.
గాంధీ, నెహ్రూల కుల రాజకీయాల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరంలేదు. కుల రాజకీయాలు కాంగ్రెస్‌ పుట్టకలోనే ఉన్నాయి. గాంధీ ప్రకారం అంటరానితనానికి కులానికి మధ్య ఎలాంటి సంబంధమూ లేదు. కానీ అంబేద్కర్‌ కులసమస్యను లేవనెత్తినప్పుడు అగ్రకుల హిందువులంతా ఏకమై అతని ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. గాంధీ దృష్టిలో అంటరానితనం పాపమే కావచ్చు కానీ, అది ఆమరణ దీక్ష చేయాల్సినంత నైతిక సమస్య కాదు. కానీ అంటరాని వాళ్లకి ప్రత్యేక నియోజకవర్గాలు మంజూరు చేయటం మాత్రం ఆయనదృష్టిలో చాలా తీవ్రమైన సమస్య వాటికి వ్యతిరేకంగా ఆయన తన జీవితాన్నే పణంగా పెట్టడానికి సిద్ధం. అగ్రకుల హిందువుల ఒత్తిడికి, గాంధీ బ్లాక్‌మెయిలింగ్‌కు పూనా ఒప్పందం సమయంలో లొంగి పోయినందుకు అంబేద్కర్‌ తను చనిపోయేవరకు బాధపడ్డారు.
వలసవాద వ్యతిరేక ఉద్యమ రూపంలో హిందూయిజం, అగ్రకుల తత్వం బలంగా తన ఆధిపత్యాన్ని సాధించుకుంది. అందుకే స్వతంత్ర భారతంలో మత మైనార్టీలు, అణగారిన కులాలు, ఆదిమ జాతులు భయంకరమైన అణచివేతకు, దోపిడీకి గురవుతున్నాయి. రాజ్యాంగంలో లౌకిక వాదాన్ని లిఖించుకున్నారు, కానీ రాజ్యాంగంలో హిందువులకు తప్ప మరే మతస్థులకు రక్షణ లేదు. హిందూ అణగారిన కులాలకు రిజర్వేషన్‌ కల్పిస్తే మతం అడ్డురాదు. కానీ ముస్లిం, క్రిష్టియన్‌ మతాల్లోని పేదలకు రిజర్వేషన్‌ కల్పిస్తే మతం అడ్డువస్తుంది. అంటే హిందూ మత రక్షణ మన రాజ్యాంగంలో బహిరంగంగానే దాగి ఉంది. ఎందుకు ఒక్క ముస్లిం కూడా ఇండియన్‌ రక్షణ పరిశోధన సంస్థల్లో లేరు? కానీ నేపాల్‌కు చెందిన గూర్ఖాలు ఆర్మీలో ఉండవచ్చు. ఎందుకు కాశ్మీరులోని ముస్లింల మీద, ఈశాన్య రాషా్ట్రల్లోని క్రిష్టియన్‌ ఆదివాసుల మీద నిరంతరం నరమేధం నడుస్తుంది? ఎందుకు ఈ దేశ దళితుల మీద దాడులు జరుగుతున్నాయి? ఈ దేశ అగ్రకుల మేధావి వర్గం ఎందుకు ఈ హింస గురించి మాట్లాడదని ఈ పుస్తకం ప్రశ్నిస్తుంది.
- డాక్టర్‌ భంగ్యా భూక్యా
యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌
Andhra Jyothi Telugu News Paper Dated: 26/10/2014 

Wednesday, October 15, 2014

ఈ తరం దళిత సాహిత్యానికి ఆద్యుడు కుసుమ ధర్మన్న By డాక్టర్‌ కత్తి పద్మారావు


Posted on: Wed 15 Oct 00:58:14.626015 2014

                 సాహిత్యం బలహీనతను పెంచకూడదు. సాహిత్యం మార్పుకు దోహదం కావాల్సిఉంది. ఒక్కొక్కపాట ఒక జాతికి మేల్కొలుపుగా నిలిచింది. పాట కొన్నిసార్లు ఉద్యమాల నుంచి పుడుతుంది. కొన్ని సార్లు జీవితం నుంచి పుడుతుంది. పాట కొన్ని సార్లు ప్రేమ నుంచి పుడుతుంది. పాట తిరుగుబాటు బావుటా అవుతుంది. పాటలు మాటల మూటలేకాదు, అవి జీవితాన్ని సంచలన భరితం చేస్తాయి కూడా.
                 స్వాతంత్య్రోద్యమ కాలంలో తెలుగు నేలను ఒక ఊపు ఊపిన దళిత కవి కుసుమ ధర్మన్న. మాకొద్దీ తెల్లదొరతనం అని ఒక పక్క మోగుతుంటే కుసుమ ధర్మన్న మా కొద్దీ నల్లదొరతనమని ఈ నల్లదొరలను నిలవేశాడు. సామాజిక ఆధిపత్యం ఉన్న కులాలకు రాజ్యాధికారం వస్తే దోచుకోవడం తప్ప మరొకటి ఉండదని నిగ్గు తేల్చాడు. జాతీయోద్యమం కాలంలో ఉన్న భూస్వామ్య, కులాధిపత్య, అస్పృస్యతలతో నలిగిపోతున్న దళితుల దుర్భర జీవితానికి తన పాటలతో అద్దం పట్టిన మహాకవి. కుసుమ ధర్మన్న లయాత్మకమైన తన పాటల్లో తెలుగు సామాజిక జీవనాన్ని దృశ్యీకరించాడు. ఇప్పటికీ గ్రామాల్లోని పెత్తందారీతనం గుట్టును బట్టబయలు చేశాడు. గుర్రం జాషువా కవికి, బోయి భీమ్మన్నకు స్ఫూర్తినిచ్చాడు. మహాకవి కుసుమ ధర్మన్న తన పాటల్లో తెలుగు పదాలు జాలెలు పోశాడు. పదాల్లో వాస్తవాలను, పదాల్లో ఆగ్రహాన్ని, పదాల్లో బతుకుని, పదాల్లో పెత్తందార్ల స్వభావాన్ని ఎండగట్టాడు.
పన్నెండు మాసాలు పాలేరుతనమున్న /పస్తులుబడుచు బతు కాలండి/ఆలి కూలీజేసి తీరాలండి/పిల్లగాడూ పశువుల గాయాలండి ి/పగలు రేయీ పాటుపడ్డానండి/కట్ట గుడ్డా-గూడూ గిట్టదండి/రోగమొస్తే ఆనగ దప్పదండి/అప్పు తీరదీ చిత్రమేమండి/ఈ నిప్పుపైనిక మేము నిలువలేమో తండ్రి/మాకొద్దీ నల్లదొరతనము /దేవ-కనికారము లేక కడుపుమాడ్చే రండి/మాకొద్దీ నల్లదొరతనము-బాబు /మాకొద్దీ నల్లదొరతనము-దేవ/పదిమంది తోపాటు పరువు గలుగకయున్న/మాకొద్దీ నల్ల దొరతనము/పాడిపంటలు మేము కూడబెడితె వారు/కూర్చోని తింటామంటారు/నాములిచ్చి నట్టేట ముంచేరు/యెంచి అప్పునప్పు బెంచుతారు /చెంపగొట్టి కంపలాగు తారు/కోర్టుకెక్కించి కుంగదీసేరు/చీలదీసి కులము చెరుపుతారు/దేవ కూడు గుడ్డ కొంప లేకుండ జేసేరు/మాకొద్దీ నల్లదొర తనము/మాలా మాదిగలంటే మండిపడిపోతారు/ఊరి వెలుపనున్న పూరిగుడిసెలె గాని/బారి కొంపలు మాకు లేవు/గాలి వెలుగు సుంత తొంగిరాదు/ సారమైన కూర కూడు లేదు/కోరికట్ట కోక పంచలేదు/నల్లపూస పుస్తె నగదు లేదు/ దున్ని తినగ పొలము దొడ్డిలేదు/దేశమందారికి మేము చేదు/మా దారిద్రియము జూడ దయపుట్టగారాదు.
                 ఈ పాటలో ధిక్కార స్వరముంది. సమాజ నిజ స్వభావం ఉంది. ఇందులో వాడిన పదజాలం పన్నెండు మాసాలు, పాలేరుతనం, పస్తులు, ఆలికూలి, పిల్లగాడు, గిట్టదు, ఆనగ, నిప్పుపై, పాడిపంటలు, నాము, నట్టేట, చెంపగొట్టి, చీలదీసి కులము, గాలి, వెలుగు, సుంత తొంగిరాదు, సారమైన కూడు కూడలేదు. నల్లపూస పుస్తే నగదు లేదు. దారిద్య్రము, దయాపుట్టగరాదు. ఇందులోని పదాలు, వాక్యాలు మనల్ని కదిలిస్తాయి. సామాజిక జీవన వాస్తవాలను చారిత్రక గతిలో నుంచి చూపిస్తాయి. తెలుగు సామాజిక చరిత్రను ఆనాటి నుంచి ఈనాటి వరకు అర్థం చేసుకొనాలన్నపుడు ఈ పాట నేర్చుకోవడం తప్పనిసరి. దీన్ని బుర్ర కథల్లోను, జెముకుల కథలోనూ కూడా పాడతారు. శృతిబద్ధమైన లయనిబద్ధతే కాక ప్రశ్న, నిలవేయడం, నిజాన్ని చెప్పడం, జీవనగాథను హృదయార్ద్రంగా పాడటం ఇందులోని గొప్పతనం. కరుణరస ప్రధానమైన ఈ పాటలో ద్వితీయార్ధంలో ఎంతో తిరుగుబాటు కూడా ఉంది. సామాజిక విప్లవ నినాదంగా ముందుకు నడిచిన ఈ పాట గుండె నిప్పును మండిస్తుంది. ఒక జాతిని అంటరానివాడుగా చేసి తమకు జీతగాళ్ళుగా, పాలేరులుగా మార్చుకొని వారి శ్రమకు అంటులేకుండా దోచుకొని వారిని అంటరానివారుగావించిన వైనం ఆ పాటలోనే చూడండి.
ఒంటినిండ గుడ్డెందు కంటారు/గోచిగుడ్డ కర్రే గోటంటారు/చుట్టు గుడిసె చాలా సుఖమంటారు/గంజికూడే గుంజు బలమం టారు/దేవ-నోరులేదని మమ్ము దూరాన గెంటేరు/ఆకలిచిచ్చూచేత అడలి చచ్చినగాని /యన్న సత్రము మాకులేదు/నోరుయెండి దోరిన నీరు లేదు/కుడువ పూటకూళ్ళు గానరావు/యెక్క బండి వక్కటైనరాదు/మొక్క దేవుడొక్కడైన లేడు/శ్రమను దీర్చ సత్రమొకటి లేదు/భ్రమలు దీర తాగ బావి లేదు/మేము మనుషులనూ మాట మరచిపోయారండి/మాలమాలని చాలా తూలనాడి మమ్ము/ అంటరాదని గెంటుతారు /ఆసుపత్రి మందుల డుగుతారు /మాల మందూలు చాలా తాగేరు/మాల చనుబాలు మందుకడిగేరు /మాలపొత్తులేక మసలలేరు/మామేలు మెప్పుపొంది మేకై తిరుగుతారు /కుక్క నక్కలకంటె తక్కువగా జూచి/నిక్క తక్కి నిగుడుతారు /సాని ప్రక్కజేర సాగుతారు /కుష్టురోగి సరస కూర్చుంటారు/కుక్క కోతిని కోరి పెంచేరు/పిల్లి పిట్టాల ప్రేమించుతారు /పందిగున్నాల బాధింపరారు/కాకి నీటిని తాకనిస్తారు/మమ్ము దరికి చేరునీరు దడదడ తిట్టేరు.
            ఈ రెండో భాగంలో పాట పాటగానే గాక పశ్న్రలు వెల్లువలా పొంగాయి. పాటలో నాటకీయత, సమాజాన్ని నిలవేసిన తిరుగుబాటు తత్వం, నిజమైన స్వాతంత్య్ర నినాదం మనకు కనిపిస్తుంది. ఈనాడు ఈ పరిస్థితి కోస్తా ఆంధ్రాలో ఎన్నో ఉద్యమాల వల్ల మారినా, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో, రాయలసీమలో కొనసాగుతూనే ఉంది. ఒక కవి వెయ్యి పేజీల్లోని సామాజిక చరిత్రను ఒక పాట ద్వారా మనకు చెప్పాడు. పాట పాడుతున్నప్పుడు కనుకొలకునుల్లో నీరు తిరిగి పీడిస్తున్నవాడు కూడా ఇది తప్పే అనే మార్పుకు గురికావాల్సి ఉంది. ఎందరో భూస్వాముల, కులస్వాముల పిల్లలు ఇలాంటి సాహిత్యం వల్లే మారారు. సాహిత్యం బలహీనతను పెంచకూడదు. సాహిత్యం మార్పుకు దోహదం కావాల్సిఉంది. ఒక్కొక్కపాట ఒక జాతికి మేల్కొలుపుగా నిలిచింది. పాట కొన్నిసార్లు ఉద్యమాల నుంచి పుడుతుంది. కొన్ని సార్లు జీవితం నుంచి పుడుతుంది. పాట కొన్ని సార్లు ప్రేమ నుంచి పుడుతుంది. పాట తిరుగుబాటు బావుటా అవుతుంది. పాటలు మాటల మూటలేకాదు, అవి జీవితాన్ని సంచలన భరితం చేస్తాయి కూడా. పాటలో లాలిత్వం ఎంత ఉందో ధిక్కారం అంతే ఉంది. పాట తేనెల ఊట,దానికి కొంచెం రాగశుద్ధి, భావశుద్ధి కలిగిస్తే అది మెదడును, హృదయాన్ని ఒకేసారి కదిలిస్తుందనటంలో సందేహంలేదు. దళిత పాట తెలుగు సాహిత్యానికి ధికార స్వరాన్నిచ్చింది. కుసుమ ధర్మన్న ఈ తరం దళిత కవిత్వానికి ఆద్యుడు. ఆయన పాట ఒక ఉద్యమం. ఉద్యమాల్లో నుంచి వచ్చిన పాటలు, కవితలు సమాజాన్ని ఉత్తేజపరచటమే కాక చారిత్రక మలుపుకు మైలురాళ్ళుగా నిలుస్తాయి. జాతీయోద్యమ కాలంలో వర్గాధిపత్యాన్ని ఎదిరించే వాళ్ళు, కులాధిపత్యాన్ని ఎదిరించే వాళ్ళు తమ గొంతుల్ని, తమ అస్దిత్వాల్ని ఆనాడే ప్రకటించారు. కులాధిపత్యం, మతోన్మాదం, వర్గాధిపత్యం పునాదులన్నీ ఒక పాదులోనే ఉండడం వల్ల ఎదిరించే శక్తులు కూడా మిత్రత్వానే కలిగి ఉన్నాయి. కుసుమ ధర్మన్న దళిత అస్తిత్వ సాహిత్యాన్ని జాతీయోద్యమ కాలంలో ఉక్కు కంఠంతో వినిపించినవాడు. ఈనాటి దళిత కవులకు స్ఫూరి కుసుమ ధర్మన్న.

(వ్యాసకర్త సామాజిక ఉద్యమ నేత)

Prajashakti Telugu News Paper Dated : 15/10/2014 

Monday, October 6, 2014

బహుజన గీతాకారుడు - డాక్టర్‌ కోయి కోటేశ్వరరావు

ఉన్నతమైన రాజకీయ దృక్పథం, సునిశితమైన కళాత్మక నైపుణ్యాల సమన్వయంలో నుంచే ఉత్తమ రచన ఆవిర్భవిస్తుందంటాడు మావో. వ్యంగ్యం అత్యంత శక్తివంతమైనది. హేళనతో కూడిన హాస్యంతో; పదునైన వ్యంగ్యంతో శత్రువును చీల్చి చెండాడవచ్చునంటాడు అంబేద్కర్‌. మావో, అంబేద్కర్ల అభిప్రాయాలకు అక్షరదర్పణం తెరేష్‌ కవిత్వం. ఈ విధమైన రాజకీయ ఎరుకతో, వ్యంగ్య శైలితో శత్రువు ఆయువుపట్టును పసిగట్టి తదనుగుణంగా యుద్ధం చేయటం తెరేష్‌బాబుకు చద్దికూటితో పెట్టిన విద్య.
పైడి తెరేష్‌బాబు విశాలమైన ప్రాపంచిక దృక్పథం కలిగిన కవి. అందుకే దళితవాదం దగ్గరే ఆగిపోకుండా, ఆత్మబంధువుల అస్తిత్వ ఉద్యమాలకు కొత్త ఊపిరులూదాడు.
మట్టి నవ్వితే పరమాన్నం
నిప్పు నవ్వితే వెలుతురు
నీరు నవ్వితే చైతన్యం
నింగి నవ్వితే తొలకరి
గాలి నవ్వితే ఊపిరి


ఈ పంచ నవ్వుల పరమార్థాలను కలగలిపి ఒకచోట రాశి పోస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ‘పైడి’ సాహిత్యంలా ఉంటుంది. నిద్రను నిట్టనిలువునా నరికే వైతాళిక గానం ఎలా ఉంటుంది? వేటగాడి గుండె జారిపోయే సింహనాదం ఎలా ఉంటుంది? నాలుగు పడగల హైందవ నాగరాజు కోరలు పీకే పౌరుషం ఎలా ఉంటుంది? సామ్రాజ్యవాదం పొగరణిచే సాహసం ఎలా ఉంటుంది? గొడ్లు కాసే పిలగాడి పిల్లంగోవి రాగం ఎలా ఉంటుంది? అన్నింటికీ మించి అంబేద్కర్‌ పల్లవైన పాటకు ఆపకుండా చిందేస్తే ఎలా ఉంటుంది? అమ్మతోడు తెరేష్‌బాబు కవిత్వంలా ఉంటుంది. సమకాలీన తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యామ్నాయ భావవిస్ఫోటనం పైడి తెరేష్‌బాబు. అక్షరాలను చండ్ర నిప్పు కణికల్లా మార్చి, మాటలను మర ఫిరంగుల్లా పేల్చి, కవితా వాక్యాల్ని కరెంటు తీగల్లా తీర్చి, నడుస్తున్న కాలం నరాల్లోకి పిడికెడు కొత్త కాంతిని ప్రసరించిన అసాధారణ ప్రతిభా సంపన్నుడు తెరేష్‌బాబు. దళిత సాహిత్యంలో కసిత్వం తప్ప కవిత్వం లేదని సోకాల్డు విమర్శకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నప్పుడు, దళిత కవులకు వచన కవిత్వమెందుకని ఘనత వహించిన కవిపుంగవులు నోరుపారేసుకుంటున్నప్పుడు, రెప్పపాటులోనే ‘దళితవాదం’పై సవాలక్ష దాడులు జరుగుతున్నప్పుడు ఈ సంక్లిష్ట సందర్భంలో తెరేష్‌ బాబు సరైన జవాబుగా నిలబడ్డాడు. ‘రాత మాకు కొత్తకాదు/ మీరు పలకల బావుల్లో బలపాల కప్పలైనపుడు/ మేం నేలతల్లి గుండెల మీద పైరు పద్యాలమయ్యాం/ మీరు విజ్ఞాన సముద్రాల్లో కాగితప్పడవలైనపుడు/ మేం కర్మాగారపు నెన్నొసట లోహలిపులమయ్యాం/ మా కడుపుల్లో పడ్డాక కదా అక్షరం అగ్నిపునీతమయ్యింది.’’ (నిశాని) అంటూ ‘పైడి’ దళిత పులిలా గాండ్రించి, సాంద్రతరమైన, తాత్విక సమన్వితమైన కవిత్వానికి సంకేతంగా భాసిల్లాడు. సంగీత, సాహిత్య కళా రంగాల్లోను, టి.వి. రేడియో వంటి దృశ్యశ్రవణ మాధ్యమాల్లోను తెరేష్‌బాబు పట్టిందల్లా బంగారమయింది. కవిత, కథ, నాటకం, పాట, గజల్‌ వంటి ప్రక్రియల్లో ఆయన రాసింది రత్నమయింది. ‘నీ చేతికి ఆయుధాన్నివ్వడం కోసం రాలేదు నేను/ నువ్వే ఒక మహా ఆయుధానివన్న స్పృహను నీచేతిలో పెట్టడానికొచ్చాను’ అని తెలుగు పాఠకుడి చేతిలో చేయివేసి బాస చేసిన తెరేష్‌బాబు మహత్తరమైన ఆ బాధ్యతను విజయవంతంగా నెరవేర్చి మూడు దశాబ్దాల తన సాహితీ ప్రస్థానాన్ని ముగించుకొని సెప్టెంబర్‌ 29 సాయంత్రం నేలతల్లి గుండెల్లో కలిసిపోయాడు. కవన నక్షత్రమై గగనమెక్కాడు. పైడి తెరేష్‌బాబు జీవిత సాహిత్య గ్రంథపుటలను తిరగేస్తే కొండంత స్ఫూర్తి కలుగుతుంది.
గాయకుడైన తండ్రి శాంతయ్య ప్రేరణతో, ఒంగోలు కళావాతావరణ ప్రభావంతో బాల్యంలోనే సంగీత సాధనచేసి 14 సంవత్సరాల వయస్సులోనే తెరేష్‌బాబు తబలిస్టుగా పేరు ప్రఖ్యాతులందుకున్నాడు. సాంఘీక, పౌరాణిక నాటకాలకు, పాటకచేరీలకు వాద్య సహకారమందిస్తూ ఆ చిరుసంపాదనతో తన నిరుపేద కుటుంబానికి అండదండలందించాడు. డా. ధారా రామనాథ శాసి్త్ర, పింగళి పాండురంగారావు లాంటి సాహితీవేత్తల ప్రోత్సాహంలో, వర్ధమాన సమితి, ఎఱ్ఱన పీఠం లాంటి సాహిత్య సంస్థల వెలుగు జాడ ల్లో తెరేష్‌బాబు తన సృజనాత్మక ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నాడు. పైడిశ్రీ కలం పేరుతో ఇబ్బడి ముబ్బడిగా రచనలు చేస్తూ కవిగా, నాటక కర్తగా, ప్రయోక్తగా తెరేష్‌బాబు అతి చిన్నవయస్సులోనే ఎంతో పరిణితి సాధించి ఉద్దండ పండితోత్తములకు గుండెల్లో గుబులు పుట్టించాడు. 
‘చీకటి శక్తుల పతనం కోసం/ చేస్తున్నా ఇదిగో శరసంధానం/ ఈ చైతన్య యాగంలో అయితే కాని ప్రాణం పతనం’ అంటూ తన సృజన లక్ష్యాన్ని ప్రకటిస్తూ తెరేష్‌బాబు శరసంధానం (1985) కవితా సంపుటి వెలువరించి ‘పెన్ను’ తిరిగిన సాహితీవేత్తల ప్రశంసలందుకున్నాడు. ‘సముజ్జ్వల కాంతిమతి’, ‘చిరంతన గీతికాస్మృతి’, ‘ఊహావిరచిత రసానందకృతి’, నిశాంత ధీనిధా, ‘గ్రీష్మ నిక్షిప్తాంగ ఘర్మధార’; చక్రడోలా విహారం, తరళ పరి మళ కిరణం లాంటి సంస్కృత సమాస భూయిష్ఠ పద ప్రయోగ శైలి ‘శరసంధానం’ కవి త్వంలో ఆద్యంతం తొణికిసలాడుతుంది. కారంచేడు, చుండూరు సంఘటనల అనంతరం ఆంధ్ర రాష్ట్రంలో వెల్లువెత్తిన ఆత్మగౌరవ పోరాటాలతో దళితవాద చైతన్యం దశ దిశలా వ్యాపించింది. దళిత సాహిత్య ఉధృతి వేగవంతమయింది. ఈ నేపథ్యంలో పైడిశ్రీ సాహిత్య ప్రస్థానం ఒక గుణాత్మకమైన మలుపు తిరిగింది. అప్పటి వరకూ శ్రీశ్రీ శాబ్దిక మహేంద్ర జాలంలో, తిలక్‌ అనుభూతివాదంలో మునిగితేలుతున్న పైడిశ్రీ జనరల్‌ సాహిత్య ఒరవడిని విడిచిపెట్టి నిర్దిష్టమైన ఎరుకతో తన సామాజిక అస్తిత్వ మూలాల ను తడుముకోవటం ప్రారంభించాడు. లౌకిక వాస్తవాల్ని అలౌకిక స్వప్నాలుగా వక్రీకరించే సాహిత్య నైజాన్ని తెరేష్‌ బాబు సమూలంగా తిరస్కరించాడు.
ఇలాంటి తిరస్కారంతో, ధిక్కారంతోనే ఆయన నిశాని అనే సంచలనాత్మక కవిత రాశాడు. మద్దూరి నగేష్‌ బాబు, జి. లక్ష్మీనరసయ్య (వరదయ్య) ఖాజా లాంటి తాత్విక బంధువులతో కలిసి తెరేష్‌బాబు వెలువరించిన ‘నిశాని’ కవిత దళితవాద చర్చోపచర్చలకు కేంద్రబిందువై వర్త మాన సాహిత్యాన్ని కదిపి కుదిపివేసింది. 
కేవలం దళిత కవిత్వంలోనే కాకుండా మొత్తం వచన కవిత్వంలోనే తెరేష్‌బాబు అల్పపీడనం (1996) సంకలనం విశిష్టమైనదని విమర్శకులు అంగీకరించారు. ‘అల్పపీడనం’లోని ‘ఏడుకట్ల సవారి’; ‘బండి చక్రం మీద ఈగ’ లాంటి కవితల ద్వారా తెరేష్‌బాబు దళిత ఉద్యమ నిశ్శబ్దాన్ని ఎత్తిచూపాడు. ‘శస్త్ర చికిత్స చేయడం ఉద్యమం/ కాకుల్ని కొట్టి గద్దలకేసే ఫార్మూలాల్ని ధ్వంసం చేయడం ఉద్యమం’ అంటూ ఉద్యమానికి కొత్త భాష్యం చెప్పాడు. అందరిలాగా గాయాన్ని ఫోటో తీయడం ఈ కవికి చేతకాదు. కష్టపడైనా సరే గాయాన్ని ఎక్స్‌రే తీస్తాడు. అందుకే ‘అల్పపీడనం’లో గాయం తాలూకూ చీమూ నెత్తురులు కనిపించవు. గాయానికి కారణమైన వ్యవస్థ స్వరూప స్వభావాలను పాఠకుడి మనసుపై కవి స్పష్టంగా ముద్రిస్తాడు. తద్వారా పాఠకుడు దేన్ని ఎటాక్‌ చేయాలో తెరేష్‌బాబు సూచిస్తాడు. ‘ఐదోతనం’; ‘కుక్క కరిచిన వార్త’, ‘మట్టి బలపం’ వంటి కవితల్లో తెరేష్‌ స్ర్తీవాద చైతన్యాన్ని అద్భుతంగా కవిత్వీకరించాడు. ‘వాడి తొడల తీట సద్దుమణగటానికి/ కావల్సింది కండరాల చీలిక మాత్రమే’ అంటూ సజ్జెలగూడెం మాదేవమ్మపై జరిగిన అత్యాచారాన్ని రెండు మాటల్లో తెరేష్‌ బాబు ప్రతిభావంతంగా ఆవిష్కరించాడు. ‘పొద్దుపొడవటం ఆలస్యం/ వంటిళ్ళ మీద వర్షించి ఆహార పంటలౌతూ/ పొద్దు గూకటం ఆలస్యం కండరపు నాగేళ్ళు దిగమింగి కడుపు పంటలౌతూ’ అని స్ర్తీలెదుర్కొంటున్న రోజువారి హింసను అక్షరాల్లో తర్జుమా చేశారు. ఉత్పత్తిని, పునరుత్పత్తిని ఇంత ఆర్ద్రంగా కవిత్వీకరించిన దాఖలాలు స్ర్తీవాద సాహిత్యంలో లేవు.
పైడి తెరేష్‌బాబు అత్యుత్తమ ప్రయోగవాది. క్యాసెట్‌ రూపంలో ఆయన వెలువరించిన ‘హిందూ మహాసముద్రం’ తెలుగు దీర్ఘకవితల్లో అగ్రభాగాన నిలుస్తుంది. ‘దళిత సాంస్కృతిక రాజకీయ చైతన్యం పురివిప్పిన తరువాత వచ్చిన మొత్తం కవిత్వంలో ఈ శ్రవ్య కవిత అత్యుత్తమన శ్రేణికి చెందిందనవచ్చు. ఒక కవిత్వపరంగానే కాదు, చారిత్రక అవగాహన సాంస్కృతిక స్పహ విషయంలో కూడా ‘హిందూ మహాసముద్రం’ క్లాసిక్‌ లక్షణాలను సంతరించుకుంది’ అని యస్‌. రామకృష్ణ చెప్పిన మాట అక్షరాలా నిజం. ‘కుహనా సమైక్యతను పాడే సముద్రం నోట్లో కాండ్రించి ఉమ్మడానికి ఇంకా సందేహిస్తారే! ఇది పచ్చి దగా కోరు సముద్రం’ అంటూ హిందూ సామ్రాజ్యవాదంపై తెరేష్‌బాబు నిప్పులు కురిపించాడు. ‘యుద్ధం కన్నా యుద్ధ భయం దుర్భరం/ సైనిక దాడి కన్నా సాంస్కృతిక దాడి ప్రమాదకరం’ అంటూ ప్రపంచీకరణ ప్రభంజనంలో కొట్టుకుపోతున్న గొర్రెల మందల్ని హెచ్చరించాడు తెరేష్‌బాబు. ఒక్క కేబుల్‌ కనెక్షన్‌ ద్వారా అణువణువునూ ఆక్రమిస్తున్న పాలవన్నె విషం పట్ల జాగ్రత్త వహించమని హితవు పలుకుతాడు పైడి. అస్తిత్వ ఉద్యమాల ఉమ్మడి చైతన్యానికి అడ్డుకట్టవేస్తున్న హిందూ సామ్రాజ్యవాదం అమెరికన్‌ సామ్రాజ్యవాదాల పెను ప్రమాదాల తీరుతెన్నుల్ని ‘నాలుగో ప్రపంచం’ కవితా సంకలనం ద్వారా తెరేష్‌బాబు శిల్పసుందరంగా చాటిచెప్పాడు.
పైడి తెరేష్‌బాబు విశాలమైన ప్రాపంచిక దృక్పథం కలిగిన కవి. అందుకే దళితవాదం దగ్గరే ఆగిపోకుండా, ఆత్మబంధువుల అస్తిత్వ ఉద్యమాలకు కొత్త ఊపిరులూదాడు. ప్రాణ స్నేహితుడిలా ప్రజాస్వామ్య పోరాటాలతో కరచాలనం చేశాడు. తెలంగాణ, దండో రా ఉద్యమాలకు మనసారా సంఘీభావం ప్రకటించాడు. ‘ఏకపక్ష దోపిడీకి ఏకైక సూత్రం/ కలిసి ఉంటే కలదు సుఖం/ దగాపడ్డ బిడ్డలకు తారక మంత్రం/ వేరుపడితే ప్రగతి సులభం’ (కావడి కుండలు) అంటూ సమైక్యవాద కుట్రల్ని త్రోసిరాజని, తెలంగాణ ప్రజల జీవనపోరాట సారాంశాన్ని నాలుగు పాదాల్లో ఉదాత్తంగా సూత్రీకరించాడు పైడి. అంతేకాకుండా ‘కుండల్లా విడిపోదాం, కావడి బద్దల్లా కలిసుందాం’ అనే చారిత్రాత్మక నినాదంతో తెలంగాణ సంఘీభావ కవిత్వానికి ఆమోదయోగ్యమైన నిర్వచనాన్ని అందించాడు. ఉన్నతమైన రాజకీయ దృక్పథం సునిశితమైన కళాత్మక నైపుణ్యాల సమన్వయంలో నుంచే ఉత్తమ రచన ఆవిర్భవిస్తుందంటాడు మావో. వ్యంగ్యం అత్యంత శక్తివంతమైనది. హేళనతో కూడిన హాస్యంతో; పదునైన వ్యంగ్యంతో శత్రువును చీల్చి చెండాడవచ్చునంటాడు డా. అంబేద్కర్‌. మావో, అంబేద్కర్ల అభిప్రాయాలకు అక్షరదర్పణం తెరేష్‌ కవిత్వం. ఈ విధమైన రాజకీయ ఎరుకతో, వ్యంగ్య శైలితో శత్రువు ఆయువుపట్టును పసిగట్టి/ తదనుగుణంగా యుద్ధం చేయటం తెరేష్‌బాబుకు చద్దికూటితో పెట్టిన విద్య. జానపద గీతాల్లోని మౌఖిక ఛందోరీతులను తన కవితా నిర్మాణ పద్యాలతో మేళవించి సందర్భానుసారంగా తెరేష్‌బాబు వచన కవితా ప్రక్రియకు కొత్త నడకలు నేర్పాడు. ఒక్కొక్కసారి గజల్‌ నడకలను, ముక్తపదగ్రస్త శైలిని గమ్మత్తుగా సమన్వయపరిచి అపూర్వమైన రచనా శైలితో పాఠకుల్ని వశపరుచుకుంటాడు పైడి తెరేష్‌బాబు. అందుకే ఈ కవితా వీరబాహుడి శైలి సిరాల్లోకి ఇంకిపోకుండా, ఆపాదమస్తకం సిరల్లోకి ధమనుల్లోకి చొచ్చుకుపోతుంది. ‘చీకట్ల కత్తెరలో గొంతుక చిత్రంగా తెగిపోయినా/ నాకేమి కానట్టు/ నాదేమి పోనట్టు/ నవ్వుతూనే చేస్తాను నవగీతాలాపన’ అని సగర్వంగా ప్రకటించిన పైడి మృత్యువుతో పోరాడుతూ కూడా నిన్న మొన్న చుండూరు తీర్పుకు వ్యతిరేకంగా నేతిబీరకాయ లాంటి న్యాయస్థానాలపై అక్షరాల పిడుగులు కురిపించాడు. వార్తలకు, భక్తికి, సంగీతానికి, పర్యావరణానికి ఉన్నట్టే సాహిత్యానికి కూడా ఒక ప్రత్యేక చానల్‌ నెలకొల్పిన వాళ్ళే 21వ శతాబ్దపు వైతాళికులని దార్శనిక దృష్టితో పిలుపునిచ్చాడు. అందుకోసం పరితపించాడు. అందుకే పైడి తెరేష్‌బాబు 21వ శతాబ్దపు వైతాళికుడు. సాహిత్యంలో విజేతగా అందరి మన్ననలందుకున్న తెరేష్‌బాబు మద్యానికి బానిసయ్యాడు. ప్రమాదకరమైన ఈ మద్య బానిసత్వం నుండి దళిత బహుజన కవులు బయటపడకపోతే జాతి తీవ్రంగా నష్టపోతుంది. 
- డాక్టర్‌ కోయి కోటేశ్వరరావు
9440480274

Andhra Jyothi Telugu News Paper Dated : 06/10/2014