Friday, May 31, 2013

అమ్మహస్తం-రిక్తహస్తమేనా..? పిట్టల రవి

  Thu, 30 May 2013, IST  

పథకాల 'మాటున' ప్రజలను మాయ చేస్తే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని అమ్మహస్తం మరోసారి నిరూపించింది. మార్కెట్‌ ధరల కంటే తక్కువకే అందిస్తున్న తొమ్మిది రకాల సరుకులతోనే పేదల కడుపులు నిండిపోతాయంటూ పాలకులు సెలవిస్తుంటే అరకొర సరఫరా, నాసిరకం, పురుగులున్న సరుకులను అంటగడుతున్నారని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
ఆకలితో అలమటించే పేద ప్రజల ఆకలి తీర్చటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కలల పథకంగా పురుడుపోసుకున్న అమ్మహస్తం రిక్తహస్తంగా మారింది. ఓట్ల సాధన వేటలో ప్రభుత్వం చేతిలో ఆయుధంగా మారి అమ్మహస్తం అస్తవ్యస్తంగా తయారైంది. పేదల పాలిటి అమృతహస్తమని ప్రచారం చేస్తోంది. తొమ్మిది రకాల నిత్యావసర వస్తువుల సరఫరా పథకం అంటూ ప్రభుత్వం ఊదరగొడుతోంది. ప్రజలకు ఉపయోగపడే పథకాలు తెస్తే స్వాగతించాల్సిందే. కానీ పథకాల 'మాటున' ప్రజలను మాయ చేస్తే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని అమ్మహస్తం మరోసారి నిరూపించింది. మార్కెట్‌ ధరల కంటే తక్కువకే అందిస్తున్న తొమ్మిది రకాల సరుకులతోనే పేదల కడుపులు నిండిపోతాయంటూ పాలకులు సెలవిస్తుంటే అరకొర సరఫరా, నాసిరకం, పురుగులున్న సరుకులను అంటగడుతున్నారని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ప్రజలపై పథకాల మత్తుజల్లి ఓట్లను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్‌ పాలకులు తెగబడ్డారనే విషయం స్పష్టమైంది. పేదల కడుపు నింపే పేరుతో అవినీతిపరుల బొజ్జలు నింపేందుకు పథకం ఉపయోగపడుతుందనే విమర్శలు వస్తున్నాయి.
ప్రభుత్వ వాదనల్లో నిజమెంత ..?
'ముందుంది మరింత మంచికాలం' అనే నినాదంతో పథకాల పరంపరను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి మరో పథకాన్ని ప్రజలపై వదిలారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ పేదలకు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకునేందుకే అమ్మహస్తం వరం లాగా ప్రవేశపెట్టామని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. 2013 ఏప్రిల్‌ 11 ఉగాది పండుగ నాడు ఆర్భాటంగా ప్రారంభించింది. రాష్ట్రంలోని 2.25 కోట్ల మంది తెల్లరేషన్‌కార్డుదారులు ఈ పథకం ద్వారా కందిపప్పు, చింతపండు, కారం, పసుపు, ఉప్పు, పంచదార, పామాయిల్‌, గోధుమలు, గోధుమ పిండి వంటి తొమ్మిది రకాల వస్తువులు మార్కెట్‌లో రూ.292 ధర పలుకుతుంటే ప్రభుత్వం కేవలం రూ.185 కే అందిస్తూ ప్రజలపై రూ.107 భారం తగ్గిస్తున్నామంటోంది. దీని కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.660 కోట్లు కేటాయించారు. నిర్వహణలో వైఫల్యం, పథకంలో డొల్లతనం వల్ల ఆచరణలో ముందడుగు పడటం లేదు. ప్రచారంలో చూపుతున్న శ్రద్ధ అమలులో లేకపోవటం వల్ల ప్రజల్లో అభాసుపాలు అవుతోంది. ఈ పథకంతో ఎంతో కొంత ఉపయోగం జరుగుతుందని ఆశతో ఎదురుచూసిన వారికి నిరాశే మిగిలింది. ఇది జనాన్ని ఉద్ధరించేది కాదని, ఎన్నికల ఎర అనే విషయం అర్థమైంది.
వీటితోనే పేదల కడుపునిండేనా...
ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా ఇప్పటి వరకూ బియ్యం, పంచదార, గోధుమలు, కిరోసిన్‌ పంపిణీ చేస్తున్నారు. వీటికి మరికొన్ని కలిపి అమ్మహస్తం ప్రకటించారు. నెలకు అర కేజీ చింతపండు, అరకేజీ పంచదార, కేజీ కందిపప్పు, వందగ్రాముల పసుపు, పావు కేజీ కారం, కేజీ ఉప్పు, కేజీ పామాయిల్‌, కేజీ గోధుమ పిండి, కేజీ గోధుమలు సరఫరా చేసి పేదోడి ఆకలి తీరుస్తామని చెప్పటం విడ్డూరంగా ఉంది. అంతేకాదు ఆచరణలో సాధ్యం కాదనే విషయం తెలిసి కూడా పథకాన్ని వల్లెవేస్తూ వంచనకు పాల్పడుతోంది. నలుగురు సభ్యులు గల ఒక కుటుంబానికి ప్రభుత్వం రూ.185కు ఇచ్చే పై సరుకులు 8-10 రోజులకు మాత్రమే సరిపోతాయి. మరి మిగతా 20 రోజుల పరిస్థితి ఏమిటి..? అంటే 20 రోజుల తిండి కోసం అధిక ధరలు చెల్లించి మార్కెట్‌లో కొనక తప్పదు. దీనివల్ల ప్రజలపై విపరీతమైన ధరల భారం పడి సామాన్యుడు కుదేలవుతున్నాడు. అంతేకాక మన బియ్యం పేరుతో మనిషికి నెలకు 4 కేజీల చొప్పున ఇస్తున్న బియ్యంతోనే నెలంతా తినగలడా..? అంటే అరకొరగా ఇస్తున్న సరుకులతో నెలంతా బ్రతకటం సాధ్యంకాదు. అయినా పాలకులు అమ్మహస్తంతో గోరంత చేస్తూ కొండంత చేస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారు. పథకాన్ని సక్రమంగా అమలుచేస్తున్నారా అంటే అదీ లేదు. ఇప్పటికీ చాలా చోట్ల 4-6 రకాలను మాత్రమే సరఫరా చేసి చేతులు దులుపుకుంటున్నారు. నాసిరకం, ఎంతో కాలంగా నిల్వ ఉండి పురుగులు పట్టి పాడైపోయిన వాటిని ఇచ్చి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. నాణ్యత లోపించిన సరుకులను అంటగడుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల చైతన్యనగర్‌కు చెందిన సత్యమ్మకు అమ్మహస్తం సరుకుల్లో చనిపోయి మురుగుడు వాసన వస్తున్న పిచ్చుక వచ్చిందంటే ఈ పథకం ఎలా అమలవుతోందో అర్థమవుతుంది. అప్పులు చేసి మరీ డి.డిలు కట్టిన రేషన్‌ షాప్‌ డీలర్లకు తొమ్మిది రకాలు ఇవ్వకపోవటంతో ఇక్కట్లకు గురవుతున్నారు.
ధరల భారానికి కారణం ఎవరు..?
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతుండటం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి మొసలి కన్నీరు కారుస్తున్నారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే ఒక కథ అతికినట్లు సరిపోతుంది. మన జేబుకొట్టి మనకే అందులోంచి కొంత సాయం చేసినట్లుంది ప్రభుత్వం తీరు. ప్రపంచబ్యాంకు దర్శకత్వంలో పరిపాలన చేస్తూ కార్పొరేట్‌ కంపెనీలకు మేలు చేకూర్చుతూ ప్రజలపై భారాలు మోపుతోంది. దేశంలోని వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేసి విదేశాల నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి కల్పించారు. అడ్డూ అదుపూ లేకుండా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచటం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కాయి. ధరలు పెంచేది, పెరుగుతున్నాయని బాధపడేదీ ప్రభుత్వమే. మార్కెట్‌ శక్తులకు ప్రజల సొమ్మును దోచిపెడుతున్న పాలకులు ధరలు తగ్గించకుండా ప్రజలకు తాత్కాలికంగా తాయిలాలు ప్రకటిస్తూ పథకాలను వెదజల్లుతున్నారు. ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకే అమ్మహస్తంలాంటి పథకాలు ప్రవేశపెడుతున్నారని ప్రజలకు అర్థమవుతోంది. అందుకే పాలకుల పాచికలకు లొంగకుండా ఎదురుతిరుగుతున్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. 
-పిట్టల రవి
  
Prajashakti Telugu News Paper Dated : 30/5/2013 

వికలాంగుల హక్కుల గొంతుక హెలెన్‌ కెల్లర్‌ --- పి రాజశేఖర్‌

   Sat, 1 Jun 2013, IST  

  • నేడు హెలెన్‌ కెల్లర్‌ 25వ వర్ధంతి
జీవితం నిత్యం సమ స్యలతో స్వా గతం పలు కుతున్నా, అంధత్వం అడ్డుతగిలినా, మూగ, చెవిటితనంతో కృంగిపోలేదు. అధైర్యపడకుండా, నిరాశ చెందకుండా అవరోధాలను అధిగ మించారు. లక్ష్యాలను సాధించి చిమ్మ చీకటిలో సైతం వెలుగును చూడగలిగే ధైర్యం, మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం మనిషి ఉన్నతికి స్ఫూర్తి అని ప్రపంచానికి చాటి చెప్పారు హెలెన్‌ కెల్లర్‌. ఆమె వికలాంగుల హక్కుల సాధనకు జీవితాన్ని అర్పించిన గొప్ప త్యాగశీలి. 'ఇన్‌ హర్‌ స్టోరీ'కి ఉత్తమ డాక్యుమెంటరీగా 1955లో అకాడమీ అవార్డు వచ్చింది. వైకల్యం శాపం కాదు. సవాల్‌గా తీసుకోవాలని వికలాంగులను వారి హక్కుల పట్ల చైతన్యపరచేందుకు, వారిలో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, ప్రేరణ కల్పించేందుకు 39 దేశాలు పర్యటించారు. ప్రగతిశీల భావాలతో అమెరికన్‌ సోషలిస్టు పార్టీలో చేరి వికలాంగులతోపాటు బాలల, మహిళల, కార్మికవర్గం హక్కులు, సంక్షేమంపై ఉపన్యాసాలు, అనేక పుస్తకాలు, వ్యాసాలు రాశారు. ఆమె రాసిన 12 పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ముద్రించబడ్డాయి. వికలాంగుల హక్కుల పరిరక్షణకే పునరంకితమైన హెలెన్‌ కెల్లర్‌ అవివాహితగానే ఉండిపోయారు.
హెలెన్‌ కిల్లర్‌ 1880 జూన్‌ 27న ఆర్థర్‌ హెచ్‌ కెల్లర్‌, కేథరీన్‌ ఆడమ్స్‌ కెల్లర్‌ దంపతులకు అమెరి కాలోని అలబామాలో తుస్కుంబియాలో జన్మించారు. 19 నెలల వయస్సులో విపరీతమైన అనారోగ్యం మూలంగా చూపును, వినికడిని కోల్పోయారు. అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ సలహా మేరకు ఆమె పెర్కిన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది బ్లైండ్‌లో చేర్చారు. అక్కడ సల్లివాన్‌ అనే ఉపాధ్యాయురాలి వద్ద అనేక పదాలను తాకడం, వాసన ద్వారా నేర్చుకొని 1890 నాటికి చదవడం, రాయడం నేర్చుకున్నారు. 1900లో రాడ్‌క్లిఫ్‌ కళాశాలలో చేరి బ్యాచిలర్స్‌ డిగ్రీ పొందారు. 1902లో 'ది స్టోరీ ఆఫ్‌ మై లైఫ్‌' అనే పుస్తకాన్ని వ్రాశారు. టెంపుల్‌ యూనివర్శిటీ, హార్వర్డ్‌ యూనివర్శిటీ, స్కాట్లాండ్‌లోని గ్లాస్గో, జర్మనీలోని బెర్లిన్‌, భారత్‌లోని ఢిల్లీ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్‌ పొందారు. ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్కాట్లాండ్‌ గౌరవ ఫెలోగా కూడా ఉన్నారు. ఉపాధ్యాయురాలైన సల్లివాన్‌ ఇంట్లోనే ఉంటూ అభ్యుదయ భావాలవైపు, సోషలిస్టు ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. వికలాంగులతోపాటు మహిళల, కార్మిక ఉద్యమాలను నిర్మించారు. 1924లో అమెరికాను పౌండేషన్‌ ఫర్‌ ది బ్లైండ్‌ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా పర్యటించి అంధుల సంక్షేమం కోసం కోట్లాది డాలర్లు సేకరించారు. ది మిరాకల్‌ కంటిన్యూ అనే హాలీవుడ్‌ సినిమాలో నటించి హెలికాప్టర్‌, గుర్రం నడపడం తెలియ కపోయిన షూటింగ్‌ సమయంలో సాహసవంతంగా వాటిని నడిపి వచ్చిన డబ్బును అమెరికా పౌండేషన్‌ ఫర్‌ ది బ్లైండ్‌కు ఇచ్చారు. 1933లో నేషనల్‌ లైబ్రరీ ఫర్‌ బ్లైండ్‌కు అధ్యక్షురాలిగా ఎంపికై అనేక పుస్తకాలు బ్రెయిలీ బాషలోకి ప్రింట్‌ చేయించారు. ఆమె రచించిన పుస్తకాలు ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం. హెలెన్‌ కెల్లర్‌ 1903 నుంచి 1965 వరకూ ఉన్న అమెరికా అధ్యక్షులందరికీ అంధులు, వికలాంగులు, మహిళలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి లేఖలు వ్రాశారు. అమెరికా అధ్యక్షులందరూ సమా ధానాలు పంపేవారు. ఆమె చార్లీచాప్లిన్‌, మార్క్‌ ట్విన్‌, గ్రాహంబెల్‌, నెహ్రూ, డేవిడ్‌సన్‌, విలియం జేమ్స్‌, తదితర నాయకులతో స్నేహం చేశారు. వారితో వికలాంగులు, సోషలిజంపై చర్చించేవారు. 1964లో అమెరికా అధ్యక్షుడు జాన్సన్‌ తమ దేశ ముద్దుబిడ్డగా హెలెన్‌ కెల్లర్‌ను ప్రకటించి ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ప్రీడం అత్యున్నత పురస్కారం అందించారు. ఆమె ఇంకా అనేక అవార్డులు అందుకున్నారు. వికలాంగుల జీవితాల్లో వెలుగును ప్రసాదించడమే కాక ప్రపంచ మార్పు కోసం 80 సంవత్సరాల వయస్సులో కూడా రోజుకు 10 గంటలు సామాజికాంశాల్లో పాల్గొనేవారు. వికలాంగులకు చేసిన సేవకు గుర్తింపుగా ప్రపంచ దేశాలు విద్యాసంస్థలకు, ప్రాంతాలకు ఆమె పేరు పెట్టాయి. 1988 జూన్‌ 1న నిద్రలోనే ప్రపంచాన్ని వీడిన హెలెన్‌ అవరోధాలు ఎన్ని ఉన్నా వాటిని మించిన అవకాలుంటాయని చాటిచెప్పారు. ప్రపంచంలో అత్యుత్తమమైన వాటిని కంటి చూపుతో ఆస్వాదించకపోయినా హృదయంలో వాటి అనుభూతులను పొందవచ్చునని నిరూపించారు. ఈ విశ్వం ఉన్నంత వరకూ వికలాంగులకే కాకుండా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి ప్రదాత. ఈ సమాజానికి ఒక గొప్ప రోల్‌ మాడల్‌. వికలాంగుల హక్కుల గొంతుక హెలెన్‌ కెల్లర్‌.
-పి రాజశేఖర్‌
  
Prajashakti Telugu News Paper Dated : 1/6/2013

రేపటి రాజ్యం బహుజనులదే ----- అరూరి సుధాకర్ బహుజన ఇంటలెక్చువల్ కలెక్టివ్


రాబోయే సార్వత్రక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మనువాద పార్టీలు కుప్పిగంతులేస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను కేవలం ఓటర్లుగా మాత్రమే చూస్తున్నారు. బహుజనుల అభిప్రాయాలకు ఎలాంటి విలువ లేదని ఈ అగ్ర కులాలు భావిస్తున్నాయి. మనువాద నాయకులు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు సంపాదిస్తున్నారని కంచ ఐలయ్య వంటి మేధావులు సైతం ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలను తెలంగాణ పీడిత కులాల ప్రజలు నమ్మరని వీళ్ళ విశ్వాసం. కేసీఆర్ కుటుంబం దోపిడీ గురించి ఆ పార్టీ బహిష్కృతుడు రఘునందన్ ఆరోపణలు చేశారు.

కేసీఆర్ ఉద్యమం పేరుతో డబ్బు దండుకుంటున్నాడని ఒక్కసారి కూడా బీజేపీ నాయకులు విమర్శించలేదు. టీఆర్ఎస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి మరిన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని ఆ పార్టీ ఆరాటపడుతుంది. బీజేపీ, టీఆర్ఎస్ ఉమ్మడిగా అభ్యర్థులను నిలపాలని, ఆ అభ్యర్థులను కూడా పొలిటికల్ జాక్ ఆధ్వర్యంలో నియమించిన కమిటీ నిర్ణయించాలని మేచినేని కిషన్‌రావు సూచిస్తున్నారు. తెలంగాణ ఏర్పడితే ఈ ప్రాంతాన్ని వేదమయం చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. కాబట్టి, టీఆర్ఎస్ సిద్ధాంతం కూడా బీజేపీకి భిన్నమైందేమీ కాదని ఆయన భావన.
తెలంగాణ ఉద్యమం బీజేపీ చేతిలోకి వెళ్తే తన ఆటలు సాగవని కేసీఆర్ ఒంటరి పోరుకు సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్‌కు లేదా బీజేపీకి చేయి చాపాలనే తాపత్రయమే తప్ప నిజాలు చెప్పే అలవాటు కేసీఆర్‌కు గానీ, జాక్ చైర్మన్ కోదండరామ్‌కు గానీ, వీళ్లిద్దరికీ వంతపాడే దళిత నాయకులకు గానీ లేదు.

తెలంగాణ రాష్ట్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని బహెన్ మాయావతి డిమాండ్ చేశారు. పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ను విభజించి మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని ఆమె కోరుతున్నారు. ఆమె అధికారం కోల్పోయాక కూడా అదే వైఖరికి కట్టుబడి ఉన్నారు. అధికారమే పరమావధిగా వ్యవహరించే మనువాద పార్టీలు తెలంగాణ ఇస్తాయన్న హామీ ఏమీ లేదు. కానీ బహుజన రాజ్యాధికారం కోసం సుదీర్ఘ కాలంగా పోరాడుతున్న బీఎస్పీ అధినేత మాయావతి నాయకత్వంలో తెలంగాణ ఏర్పాటు చేయడం మాత్రం ఖాయం. ఈ విషయాన్ని ప్రజలకు అర్థ కాకుండా చేసేందుకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీలు అన్ని రకాలుగా వేషాలూ వేస్తున్నాయి.
తెలంగాణ కోరుతున్న బహుజనులను నిస్సహాయులను చేయాలని అన్ని పార్టీలూ చూస్తున్నాయి. నిన్నటి వరకు నెల రోజుల్లో తెలంగాణ వస్తుందనీ, కేంద్రం నాతో సంప్రదింపులు జరుపుతుందని బుకాయించిన కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదు కాబట్టి దాన్ని ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిస్తున్నారు. తెలంగాణలోని వివిధ వృత్తి కులాలు, మాదిగ, మాల కులాలంతా తెలంగాణ కోసం అన్ని రకాల నిరసనలు చేపట్టినప్పుడు దాన్ని నీరుగార్చింది కేసీఆర్, జాక్ నాయకత్వం కాదా? తెలంగాణ ఉద్యమానికి దాదాపు అన్ని వర్గాలు దూరమైపోయాయి. ముఖ్యంగా ముస్లింలు, దళితులు, గిరిజనులు చాలా త్వరగా నిజం తెలుసుకున్నారు. బీసీల్లో చాలా వరకు టీఆర్ఎస్ పట్ల విముఖంగా ఉన్నారు. కొంత మంది బీసీ నాయకులు, కవులు తప్ప ఆత్మాభిమానం మెండుగా ఉన్న బీసీ కులాలేవీ ఉద్యమం పేరుతో జరిగే మోసాన్ని సహించే పరిస్థితిలో లేవు.

2009 నుంచి కొనసాగుతున్న మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ముస్లింల మీద దాడి జరగని సంవత్సరమే లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలే తెలంగాణాలో నూటికి తొంభై ఐదు మంది ఉన్నారని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళదే అధికారమని కేసీఆర్ దళిత నాయకుడిలాగా మాట్లాడుతున్నారు. అయితే ముస్లిం మైనారిటీలపై కొంతకాలంగా జరుగుతున్న దాడులతో సహా రాష్ట్ర వ్యాప్తంగా దళిత, బహుజనులపై అగ్రవర్ణ దాడులను ఆయన ఇంతవరకు ఖండించనేలేదు. ఒక్క తెలంగాణ తప్ప మరేది పట్టని తప్పుడు చైతనాన్ని ఈ ఉద్యమ నేతలు రగిలించారు. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలకు స్పందించే స్ప్పహను తెలంగాణ ఉద్యమం తొలగించిందా? తెలంగాణ ప్రాంతంలో ఎన్నో త్యాగాలతో నిర్మాణం చేసుకున్న ప్రత్యామ్నాయ ఉద్యమాలను అగ్రకుల నాయకత్వం ధ్వంసం చేసింది.

జాతీయ స్థాయిలో సోనియా గాంధీ, నరేంద్రమోడీ లను ఓడించి మాయావతి బహుజనులను అధికారంలోకి తీసుకు రావ డం ఖాయం. తెలంగాణ లక్ష్యం కోసం ప్రాణ త్యాగం చేసినవారిలో బహుజనుల పిల్లలే అధికం. మాయావతి మాత్రమే బహుజన తెలంగాణ ఏర్పాటు చేయగలదని బహుజనులు నమ్ముతున్నారు. మాయావతిని ప్రజల్లోకి రానివ్వకుండా జాక్ పేరుతో తెలంగాణ ప్రాంతాన్ని కాషాయ తీవ్రవాదులకు అప్పజెప్పాలని కోదండరామ్ ప్రయత్నిస్తే వారు గుణపాఠం చెబుతారు.


Andhra Jyothi Telugu News Paper Dated : 31/5/2013

Wednesday, May 29, 2013

జోగిని వ్యవస్థ అంతమయ్యేదెప్పుడు? ----దుర్గం శ్రీనివాస్





భారతీయ సమాజం స్త్రీని ఆదిశక్తిగా, ధన, ధాన్య, దైర్య, సంపదలక్ష్మి గా కొలుస్తున్నది. పురాణాల్లో ఇతిహసాల్లో స్త్రీ శక్తి గురించి ఎన్నో సాహసగాథలను పలు విధాలుగా పేర్కొన్నారు. ఇన్ని రూపాలుగా కొలిచే స్త్రీని ఇదే సమాజంలో మరో రూపంలో మాంసపు ముద్దగా, భోగ వస్తువుగా కూడా చూస్తున్నది.ఈ క్రమంలోనే అణగారిన, అట్టడుగు కులాలకు చెందిన స్త్రీలను భూస్వా మ్య,పెత్తందారులు లైంగిక వాంఛను తీర్చే సాధనంగా, ఆట వస్తువుగా మార్చారు. దీనికి సజీవ సాక్ష్యమే ‘జోగిని వ్యవస్థ’.
భారత సమాజంలో ఉన్న సామాజిక రుగ్మతల్లో జోగిని వ్యవస్థ అతి హేయమై నది. బూర్జువా, భూస్వాముల ‘కోరిక’లను తీర్చేందుకు జోగినీ వ్యవస్థను ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగేలా చేస్తున్నారు. దీంట్లో భాగంగానే దళిత, గిరిజన స్త్రీలను కామ వాంఛను తీర్చేందుకు వ్యభిచారులుగా చేస్తున్నారు. ఈ వ్యవస్థను అణగారిన దళిత, గిరిజన స్త్రీలకే పరిమితమయ్యేట్లు చేసి సమాజంలోని ఆధిపత్య కులాలు, వర్గాలు రూపొందించాయి. ఆది నుంచి ఊరికి దూరంగా, అంటరానివారిగా వెలివేశారు. జోగిని వ్యవస్థ మన రాష్ట్రంలో మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, రంగాడ్డి, కరీంనగర్, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఇప్పటికీ జోగిని, దేవదాసీ, బసివి, మాతం గి అనే పేర్లతో కొనసాగుతున్నది. 

పేర్లు ఏవైనా రూపం, స్వరూపం ఒక్కటే. గ్రామాల్లో భూస్వాముల కామవాంఛను తీర్చేందుకు వీరిని ఒక వస్తువుగా,సాధనంగా వాడుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8వేల మంది జోగిని, దేవదాసీ, బసివి, మాతంగులు ఉంటారని ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం తెలుస్తున్నది. ఈ వ్యవస్థ అనాదిగా వస్తున్న ఆచారమని అణగారిన కులాలకు అగ్రకుల పెత్తందారులు ఆపాదించారు. కానీ దీని నేపథ్యం చూస్తే..చరిత్రలో వేర్వేరు సామాజిక కారణాలతో ఉద్భవించిందని చెప్పవచ్చు. ప్రఖ్యాత రచయిత తాపి ధర్మారావు రాసిన ఎన్నో రచనలో స్త్రీ స్వేచ్ఛ గురించి ప్రస్తావించారు. వీటిలోనే దేవదాసీ వ్యవస్థను కూడా ఆయన రాసిన ‘దేవాలయాలపై బూతు బొమ్మపూందుకు’ అనే పుస్తకంలో ప్రస్తావించారు. పూర్వం దేవదాసీలు దేవుని సేవకులుగా మాత్రమే ఉండేవారు.

వీరి నివాసం దేవాలయాల్లోనే ఉండేది. వీరి వృత్తి వ్యభిచారం. వీరితో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వచ్చే విటులు (అప్పట్లో రాజవంశీకులు, జమీందారులు) నేరుగా దేవాలయానికే వచ్చే వారు. అక్కడే దేవదాసీలు వ్యభిచార వృత్తిని అందరి అంగీకారంతో చేసేవారు. వారు ఇచ్చిన డబ్బు, కానుకలను తాము నమ్ముకున్న దేవుడి హుండిలో సగభాగం వేసే వారని చలం తన రచనల్లో ప్రస్తావించారు. ఈ విధంగా దేవదాసీ వ్యవస్థ ను అప్పటి రాచరిక వ్యవస్థగానీ, భూస్వాములుగానీ ప్రోత్సహించారని, వీరందరూ దేవుడి పేరుతో వ్యభిచారం చేసేవారని తెలుస్తోంది. దేవదాసీ వ్యవస్థకు మూలం తాపీ ధర్మా రావు స్పష్టంగా చెప్పారు. దేవాలయాల్లోనే దేవదాసీలు వ్యభిచారం చేశారు కాబట్టి దేవాలయాల్లో బూతుబొమ్మలను అప్పటి రాజులు వేయించారని ఆయన వాదన. దీనిపై రకరకాల అభివూపాయాలున్నాయి. కానీ ఇదే వ్యవస్థ ఆధునీక కాలంలో రకరకాల పేర్లతో కొనసాగుతున్నది. దీనికి అనవాళ్లుగా మహబూబ్‌నగర్ జిల్లాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ జిల్లాలో జోగిని పేరుతో కొనసాగుతున్నది. దళిత, గిరిజన, కురుమ కులాల్లోని స్త్రీలను జోగినీలుగా మారుస్తుంటారు. ఏదైన కుటుంబంలో మగపిల్లలు పుట్టకపోవడంతో వారసత్వం లేదని సంబంధిత కుటుంబంలోని పెద్ద కూతురు లేదా అందరికంటే చిన్న కూతురును జోగినీగా మారుస్తారు. ఈమెను ఆ కుటుంబంలో వరుసకు మేనమామ సంబంధమున్న వారితోగానీ, లేదా వారు కొలిచే ఇష్టానుదైవం సన్నిదిలోగానీ తాళిబొట్టు కట్టించి పెళ్లి జరిపిస్తారు. సంబంధిత జోగినీకి ఆ దేవునితో పెళ్లి జరిగినట్లుగా కుల పెద్దలు నిర్దారిస్తారు. వారసత్వం కోసం జోగినీగా మార్చినందుకు సదరు గ్రామంలోని భూస్వామ్య, పెత్తందారి వర్గాలు వ్యభిచారిగా ముద్ర వేయడం జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఊట్కూర్, నారాయణపేట, మక్తల్, దన్వాడ, ఆత్మకూర్, మాగనూరు, కొడంగల్, కోస్గి, దేవరకద్ర, అలంపూర్, గద్వాల, గట్టు, దరూర్ మండలాల్లో దళిత, గిరిజన, కురుమ కుటుంబాల్లో జోగినీ వ్యవస్థ కొనసాగుతున్నది. ఈ వ్యవస్థను నిర్మూలించడానికి రాష్ట్ర ప్రభుత్వం 1988 సంవత్సరంలో జోగినీ నిషేధ చట్టాన్ని రూపొందించింది. కానీ ఈ చట్టం కేవలం కాగితాలకే పరిమితమైంది. అంతేకానీ జోగినీ, దేవాదాసీ, బసవి, మాతంగి జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. 

జోగినీ పిల్లలకు తండ్రి ఎవరో తెలియని పరిస్థితి. దీంతో జోగిని పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలంటే ఇబ్బందులు పడాల్సిందే. నేటి విద్యా వ్యవస్థలో పిల్లలను పాఠశాలల్లో చేర్పించేటప్పుడు తండ్రి పేరును తప్పకుండా నమోదు చేయాలనే నిబంధన విధించింది. జోగినీ పిల్లలు అనేక ఇబ్బందులు ఎదు ర్కోవాల్సి వస్తున్నది. 

కొన్ని సందర్భాల్లో సదరు స్త్రీలకు ఇష్టం లేకున్నా బలవంతంగా జోగినులుగా మారుస్తున్నారు. కాదని ఎదిరిస్తే భూస్వామ్య, పెత్తందారులు దాడులకు పాల్పడడం, ఊళ్లో నుంచి వెలివేయడంలాంటి దౌర్జన్యాలు చేస్తున్నారు. 

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 65 ఏళ్లు గడిచినా సామాజిక రుగ్మతలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పేందుకు జోగినీ వ్యవస్థ నిదర్శనం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోగిని నిషేధ చట్టం చేసి చేతులు దులుపుకున్నాయి.వారి ఉద్ధ రణకని కమిటీలు, కమిషన్లు వేశాయి.అలాగే ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ కూడా వేసింది. ఈ కమిషన్ కూడా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించింది. జోగినీలకు పునరావాసం కల్పించేందుకు ప్రభు త్వం ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేయాలని, వారి పిల్లలకు ఉచిత విద్య, వైద్యం అందించాలని పేర్కొంది. కానీ రాష్ట్రంలో ఇప్పటి వరకూ జోగినీ, బసివి, దేవాదాసీ, మాతంగీల అరకొర సహాయం కూడా అందలేదు. వీరి జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా ఎలాంటి చర్యలు ప్రభుత్వం చేపట్టలేదు. మహబూబ్‌నగర్ జిల్లాలో 500 మంది జోగినీలకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ప్రతి ఒక్కరికీ ఐదువేల రూపాయల చొప్పున రుణాలను మంజూరు చేశారు. ఒక్కో ఎకరం భూమి కూడా ఇచ్చారు. ఎక్కడో ఊరికి దూరంగా ఎందుకూ పనికిరాని పోరంబోకు భూములను కట్టబెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. కొన్ని ప్రాంతాల్లో సంక్షేమహాస్టళ్లల్లో పిల్లలను చేర్పించి చదివించారు. కానీ ఉన్నత చదువులకు వెళ్లే పరిస్థితి లేక అయా గ్రామాల్లో వ్యవసాయ కూలీలుగా మారినవారే ఎక్కువగా ఉన్నారు. జోగిని వ్యవస్థను నిషేధిస్తామని గొప్పలు చెప్పే స్వచ్ఛందసంస్థలు లబ్ధి పొందాయి. జోగిని వ్యవస్థను భూతద్దంలో చూపించి విదేశాల నుంచి కోట్లాది నిధులను తమ సంస్థల ఖాతాల్లోకి జమ చేసుకున్న స్వచ్ఛంద సంస్థలు చేసింది శూన్యమనే చెప్పాలి. నిధులు తెచ్చుకున్న స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు కోటీశ్వరులయ్యారు. కానీ జోగినుల దయనీయ పరిస్థితిలో ఏ మార్పూ లేదు. రాలేదు. జోగిని, బసివి, దేవాదాసీ, మాతంగి వ్యవస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక సమస్యగా గుర్తించాలి. దాని నిర్మూలనకు చిత్తశుద్ధిగా కృషి చేయాలి. జోగినులకు చేయూత నిచ్చేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక విధానాన్ని రూపొందించాలి. 

అలాగే సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం సాధించేందుకు ప్రభుత్వాలు సంక్షే మ పథకాలను ప్రవేశపెట్టాల్సిన అవసరమున్నది. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లో జోగినీలకు ప్రత్యేక నిధులను కేటాయించాలి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో ప్రత్యేక నిధులను కేటాయించాలి. జోగినీ నిషేధ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి, చట్టాన్ని అతిక్షికమించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. జోగినీల కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించాలి. సామాజిక, జీవిత భద్రత కింద పింఛన్లు, జీవితబీమా వంటి సౌకర్యాలను ప్రభుత్వమే విధిగా అమలు చేయా లి. జోగినీల జీవన విధానంలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి. అప్పుడే దేవదాసీల జీవితాల్లో వెలుగులు నిండుతాయి. 

-దుర్గం శ్రీనివాస్
స్కాలర్ (జర్నలిజం), ఉస్మానియా యూనివర్శి

Namasete Telangana Telugu News Paper Dated : 30/5/2013

పెడదోవలో విద్యార్థి నేతలు ----- ఇనప ఉపేందర్ (ఇఫ్లూ), కోట రాజేశ్ (ఓయూ) పరిశోధక విద్యార్థులు



ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలో యావత్ దేశ ప్రజానీకాన్ని తనవైపు తిప్పుకున్న ఘన చరిత్ర ఉస్మానియా విశ్వవిద్యాలయంకు ఉన్నది. విద్యార్థి జేఏసీ నాయకుల రాజకీయ చేరిక మరొకసారి ఒక చారిత్రక చర్యకు అవకాశాన్నిచ్చింది. ఈ నేపథ్యంలో అటు యావత్ తెలంగాణలో, ఇటు ప్రత్యేకించి ఉస్మానియా యూనివర్సిటీలోనూ జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గత మూడు సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర దిశగా సాగుతున్న మలిదశ ఉద్యమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులే నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఉద్యమ గమనంలో జైలు జీవితాలు, వందల సంఖ్యలో కేసులు, లాఠీ దెబ్బలు, రబ్బరు బులెట్ ఫైరింగులు, థర్డ్ డిగ్రీ చిత్రహింసలను సైతం ఎదుర్కొని వెన్ను చూపని వీరోచిత పోరాటాన్ని నిర్వహించారు.

తెలంగాణ మట్టి బిడ్డల స్వప్నమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసే నిజమైన ఉద్యమకారులుగా ఓయూ విద్యార్థులు ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేశారు.

తెలంగాణ పట్ల టీఆర్ఎస్‌తో సహా అన్ని రాజకీయ పార్టీల అవకాశవాద విధానాల్ని ఎండగడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చే ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా తెలంగాణ విద్యార్థి జేఏసీని ఏర్పాటు చేశారు. విద్యార్థి జేఏసీ ఇచ్చిన పిలుపులే యావత్ తెలంగాణ ఉద్యమ కార్యాచరణగా కొనసాగింది. ఈ ఉద్యమ ప్రభావంతోనే కేంద్రం డిసెంబర్ 9న తెలంగాణను ప్రకటించటం జరిగింది. విద్యార్థుల పాదయాత్రలో భాగంగా తెలంగాణలో పల్లె పల్లె తిరుగుతున్నప్పుడు అక్కడి ప్రజలు ఉస్మానియా విద్యార్థుల పాదాలను పాలతో కడిగి నీరాజనాలు పలికారు. వృద్ధులు సైతం వారి కొంగుల్లో దాచుకున్న ఫించన్ డబ్బులను విద్యార్థులకు ఇచ్చి 'రాజకీయ పార్టీల బద్మాష్‌గాళ్లను మేము నమ్మం బిడ్డా... వస్తే గిస్తే తెలంగాణ మీతోటే రావాల, మీరే నిజమైన నాయకుల'ని దీవించారు. తెలంగాణ ప్రాంత ఆత్మగౌరవాన్ని సమున్నతంగా నిలబెట్టడం కోసం ప్రజా బాహుళ్యాన్ని ఉరకలు వేయిస్తూ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించి తెలంగాణ ఉద్యమంలో చారిత్రక బాధ్యతను నిర్వర్తించారు.

ఇంతటి చారిత్రక పాత్ర పోషించిన విద్యార్థి నాయకత్వం నుంచి కొందరు వారి స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ పదవుల వ్యామోహంతో నాయకులకు అమ్ముడుపోతున్న స్థితి యావత్ తెలంగాణ ప్రజల ఆశల మీద నీళ్ళు చల్లినట్లయ్యింది. నాడు 'చలో అసెంబ్లీ' అని నినదించిన నాయకత్వం, నేడు ఎమ్మెల్యే సీట్లకై రాజకీయ పార్టీల ఆఫీసులకు 'చలో' అంటున్నారు. రాజీనామా ప్రమాణాలను ఆత్మత్యాగం చేసిన వారి శవాలపై చేయి ంచిన విద్యార్థి నాయకులే అవే పదవుల కోసం వెంపర్లాడుతున్నారు. వీరు గతంలో సమరశీల పోరాటాలతోనే తెలంగాణ వస్తుంది తప్ప, ఎన్నికల లాబీయింగులతో తెలంగాణ రాదని చెప్పినవారే. ఈ నయవంచకుల తీరు ను గమనిస్తే 1969 తెలంగాణ ఉద్యమ విద్రోహ వారసత్వానికి వారసులు ఇలాంటి వారేనని చెప్పక తప్పదు.
తెలంగాణ రాష్ట్ర డిమాండును నిర్వీర్యం చేయడానికి ఉద్యమ కేంద్రమైన ఉస్మానియావైపు పాలకవర్గ పార్టీలు చూస్తూండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. గత 60 సంవత్సరాల కాలంలో చవిచూసిన చేదు అనుభవాల నేపథ్యంలో తెలంగాణ ప్రజలు తమకు జరిగిన, ఇంకా జరుగుతున్న అన్యాయాల గురించి ఆందోళన చెందుతూనే ఉన్నారు. ఈ ఆందోళనను అదుపుచేసి అసలు సిసలైన తెలంగాణ గొంతును సమష్టి పోరాటాల ద్వారా బయటి ప్రపంచానికి వినిపించాల్సిన గురుతర బాధ్యత ఉస్మానియా విద్యార్థి నాయకత్వంపై ఉంది. 1969 తెలంగాణ ఉద్యమంలో నక్సల్‌బరీ ప్రభావం ఉన్నప్పటికీ అంతర్లీనంగానే ఉన్నది. అంతర్లీనం నుంచి అంతర్భాగమయ్యే గుణాత్మక పరిణామ దశలోనే 1969 తెలంగాణ ఉద్యమం ద్రోహానికి గురయ్యింది. విశాల మద్దతు ఉన్న ఒక ప్రజాస్వామిక డిమాండ్ అనేక ఒడిదుడుకులకు లోనైనప్పటికీ ప్రజా క్షేత్రంలో సుదీర్ఘకాలం నిలిచి వుండటం ఈ ఉద్యమానికి ఉన్న ఒక ప్రత్యేకత. తెలంగాణ ఆకాంక్ష మరుగునపడిన ప్రతిసారీ, ఆ ఉద్యమ జ్వాలను ఆరనివ్వకుండా కాపాడుతున్నది తెలంగాణ ప్రజలే.

1969 ఉద్యమాన్ని గుణపాఠంగా తీసుకొని మరోసారి తెలంగాణకు ద్రోహం తలపెట్టే అన్ని రాజకీయ పార్టీలకు సమష్టి ఉద్యమాలతో సమాధానం చెప్పే ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలి. విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో రాజకీయ పార్టీల మనుగడే ప్రశ్నార్థకమని భావించిన పార్టీలన్నీ ఏకమై విద్యార్థి ఉద్యమాన్ని నిలువునా చీల్చిన చేదు అనుభవాన్ని మరువరాదు. ఏ ప్రజలైతే మనపై ఆశలతో కాళ్ళుకడిగి గుండెలకు హత్తుకున్నారో వారి కన్నీళ్ళు తుడిచే చారిత్రక బాధ్యతను నిర్వర్తించాలి. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, కొమరం భీం, బందగి వారసులుగా చరిత్రలో నిలిచిపోతారా? రాజకీయ నాయకులకు పావులుగా ఉపయోగపడి చరిత్రహీనులౌతారా మీరే తేల్చుకోండి. ఇలా మోసపోయిన ప్రతిసారీ దగాపడిన ప్రజలను అక్కున చేర్చుకొని ఉద్యమ గుణపాఠాలను నెమరువేయించి ప్రజల పక్షాన ప్రజా ఉద్యమాలతో మమేకమైనవారే నిజమైన తెలంగాణ ఉద్యమకారులు.
- ఇనప ఉపేందర్ (ఇఫ్లూ),
కోట రాజేశ్ (ఓయూ)
పరిశోధక విద్యార్థులు
Andhra Jyothi Telugu News Paper Dated : 30/5/2013

Monday, May 27, 2013

దళిత దిక్కార కవి కలేకూరి ప్రసాద్ --- గిన్నారపు ఆదినారాయణ పరిశోధక విద్యార్ధి



               “ త్రేతాయుగంలో నేను శంభూకున్ని
                               ఇరయై రెండేళ్ళ క్రితం నా పేరు కంచికచర్ల కోటేశు
                               నా జన్మ స్థలం కీల వేన్మ ణి,కారంచేడు,నేరుకొండ
                               ఇప్పుడు కరుడుగట్టిన భూ స్వామ్య క్రౌర్యం
                               నా గుండెల మీద నాగేటి కర్రులతో పచ్చబోడిసిన పేరు చుండూరు
                               ఇక చుండూరు నామవాచకం కాదు సర్వనామం
                                ......................................................................
                               అవమానాలకు,అత్యాచారాలకు, మానబంగాలకు,చిత్రహింసలకు గురై
                                పిడికెడు ఆత్మ గౌరవం కోసం తలేత్తిన వాణ్ణి ”


                                                           అంటూ దళితుల ఆత్మగౌరవం కోసం దళితుల పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ దళితుల పక్షాన నిలబడి తన కంఠ  ధ్వని వినిపించిన వ్యక్తి కలేకూరి.నాటి కంచికచర్ల నుండి నేటి లక్ష్మి పేట  వరకు దళిత ఉద్యమాల్లో ప్రధాన పాత్ర వహిస్తూ వృతి,ప్రవృతి ని  దళిత ఉద్యమం,దళిత సాహిత్యం గా ఎంచుకొని సామ్రాజ్య వాద శక్తులకు ,హిందూ మతోన్మాదులకు  వ్యతిరేకంగా  పోరాటం చేస్తూ దళిత దిక్కార కవిగా,ప్రజా గాయకునిగా ,రచయితగా,అనువాదకుడిగా అంటరానివారికి అండగా నిలిచి యువక,శబరి,సంఘ మిత్ర,నవత వంటి కలం పేర్లతో మన ముందుకు పరిచయమై వ్యక్తి కలేకూరి ప్రసాద్.

                                                     ఈయన అక్టోబర్ 23 1962 కృష్ణా  జిల్లా కంచికచర్ల గ్రామంలో  లలిత సరోజినీ, శ్రీనివాస్ రావు దంపతులకు జన్మించారు.తల్లి దండ్రులు ఉపాధ్యాయులు కావడం వల్ల కలేకూరి ప్రసాద్ తెలివైనవాడుగా ఎదిగాడు. తన ప్రాథమిక విద్య కంచికచర్ల ఏలూరు లో,ఇంటర్ ఏ . సి కాలేజీ గుంటూరు లో పూర్తిచేసి,డిగ్రి చదువుతున్న రోజుల్లోనే రాడికల్ విద్యార్ధి సంఘం లో పని చేసి రాజకీయాలవైపు ఆకర్షితుడయ్యాడు. ఉపాధ్యాయుడిగా తమ వారసత్వాన్ని కొనసాగిస్తాడనుకున్న  తల్లిదండ్రులు వారి ఆలోచనకు భిన్నంగా సమాజాన్ని చదివి సమాజ మార్పును కోరుకుని విప్లవ పార్టీలకు వెళ్ళడం జరిగింది. తన ప్రతిబా శక్తి ద్వారా విప్లవ పార్టీ లో ఉంటూనే సమాజంలో జరుగుతున్న  విషయాలను తెలుసుకుంటూ పాటల రూపంలో కవిత్వం ద్వారా ప్రతి విషయం పై స్పందించి  తన కళా ప్రతిభ ను బయట పెట్టేవాడు.


                                               కలేకూరి ప్రసాద్ అంటే సామాన్య ప్రజలందరికి తెలుసో తెలియదో కాని ఈయన రాసిన “కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా” అనే పాట మాత్రం  తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు.ఇది ప్రజల్లో ప్రాచుర్యం పొందాకే శ్రీ రాములయ్య సినిమా లో పెట్టడం వల్ల  ప్రజలకు మరింత దగ్గరైంది. 1987 లో పీపుల్స్ వార్ పార్టీ నుంచి బయటి వచ్చాక వరకట్నం వ వేదింపులు చూసి రాసిన పాట ఇది.అలాగే “భూమికి పచ్చాని రంగేసినట్టు”అను  పాట రైతు ఆత్మహత్యల గురించి ప్రజల హృదయాల్ని పిండినది. 1991 విరసం నుండి కూడా తప్పుకున్నాడు. “విరసం భావజాలం పరంగా మొదట మార్క్సిజమే ఏకైక మార్గం అని నమ్మా ,అంబేద్కర్ ను చదివాక ,అంబేద్కర్ సిద్ధాంతం ఆసరా లేనిదే ఈ దేశంలో దళిత బహుజన విముక్తి సాధించలేమన్న స్పష్టమైన దృక్పథం తో కలేకూరి ముందుకు సాగాడు”.( డా.కోయి కోటేశ్వర రావు బహుజన కెరటాలు డిసెంబర్ 2012 పేజి నెం 24 ) తర్వాత అనేక దళిత ఉద్యమాల్లో పాల్గొని దళితుల పక్షాన నిలిచాడు.

                                             సమాజాన్ని చాల దగ్గరి నుండి వీక్షిచిన విహంగి కలేకూరి.ప్రతి చిన్న సమస్యపై  స్పందించి అనేక మంది యువకులకు యువక గా మార్గదర్శి అయి, దళిత సాహిత్యానికి దిశా నిర్దేశం చేశాడు. “దళిత సాహిత్యం” అను పేరుతోలఘు గ్రంథం వెలువరిచి అనేక విషయాలను తెలిపాడు.కేవలం తెలుగు భాష నే కాకుండా ఇతర భాషలు నేర్చుకొని అనువాద రచనలు కూడా చేశాడు. స్వామిధర్మ తీర్ధ రాసిన (Histori of hindu imperialism) ను “హిందూ సామ్రాజ్య వాద చరిత్ర”(1998) గా, అరుందతి రాయ్ రాసిన( End of the Imagination )ను  “ఊహలు సైతం అంతమయ్యే వేళ” (1998), కిషోర్ శాంతాబాయి కాళే ఆత్మకథ (Against all adds )  “ఎదురీత” (2001) గా అలాగే యూదుల పై జరుగుతున్న నాజి దురాగతాలను ప్రిమొ లివి రాసిన ఖైది నెంబర్ 174517 (2003) ఇలా ఇంగ్లీష్ భాషలో ఉన్న రచనలను తెలుగు లో ఏలాంటి వాక్య నిర్మాణం లో  ఇబ్బంది కలగకుండా అద్భుతం గా రాశారు. తెలుగు రచనలతో దళిత ప్రజలను చైతన్య పరుస్తూ దళిత ఉద్యమాల్లో ప్రధాన పాత్ర వహిస్తూ,దళిత ఉద్యమాల పైన ఆత్మ విమర్శ చేసుకోవాలని ఎటువంటి సంకోచం లేకుండా ప్రకటించిన వ్యక్తి కలేకూరి ప్రసాద్.


                                                         దళితులు అన్ని రంగాల్లో ముందుండాలి అని ఉద్యమాలు చేస్తూ, కవిగా, రచయితగా, విమర్శకునిగా గొప్ప పరిశోధకుడిగా ఉంటూ సామాజికంగా,ఆర్ధికంగా,రాజకీయంగా సైతం ఎదగాలని రాజకీయంగా కూడా ఎదుగుతనే దళితులకు అన్ని  రకాలుగా చైతన్య వంతులవుతారని 1994 లో నందిగామ నియోజక వర్గం నుండి బహుజన సమాజ్ పార్టీ నుండి పోటి చేయడం జరిగింది.తర్వాత దళిత సాహిత్యాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలని యువ కవులకు,రచయితలకు దైర్యాన్ని చేకూర్చి అనేక సలహాలు సూచనలు ఇచ్చి ప్రోత్సహించేవాడు. దళిత రాజ్యం, దళిత కిరణాలు,అరుణాతార,ఏకలవ్య,చూపు,బహుజన కెరటాలు వంటి పత్రికల్లో వర్తమాన కాలం లోదళితుల పై  జరుగుతున్న ప్రతి విషయం పై స్పందించి అనేక వ్యాసాలు రాసి ఎందరో మేధావుల మెదళ్ళకు పదును పెట్టెవాడు.ముఖ్యంగా అంబేద్కర్ ఆలోచన విధానాలను ఎక్కువగా చెప్పేవాడు. “దళిత ఉద్యమాలకి,దళిత సాహిత్యానికీ అంబేడ్కరిజమే అసలైన మార్గం అంటూ అంబేద్కర్ ని అటు దళిత ఉద్యమాలకి,దళిత సాహిత్యానికి నాయకుడంటాడు”.(డా.పి కేశవకుమార్  బహుజన కెరటాలు డిసెంబర్ 2012 పేజి నెంబర్ 33 ) డర్బన్ లో జాతి వివక్ష పై  జరిగిన అంతర్జాతీయ సదస్సు లో పాల్గొని భారత దేశంలో కుల సమస్యలు ఎలా ఉన్నాయి అనే అంశం పై మాట్లాడి అనేక మంది గొప్ప వారిచే ప్రశంసలు అందుకున్నారు.


                                          మన రాష్ట్రం లో ముఖ్యంగా దళితుల్లో మాదిగ దండోరా,మాల మహానాడు ద్వారా  కొంత అనైక్యత  ఏర్పడింది.దండోరా ఉద్యమాన్ని సమర్దిస్తూ ,ఒక మాల వ్యక్తి గా కవి గా,రచయితగా ,ఒక మేథావి గా మాల కులస్థులు దండోరా ఉధ్యమాన్ని సమర్దించాలని తన భాద్యతగా  గుర్తిస్తూ, అలాగే మాదిగ దండోరా న్యాయకత్వం కూడా మాలల వల్లనే తమకు అన్యాయం జరిగిందని మాల కులస్తులే కారణమన్న అభిప్రాయం సరైంది కాదని చెప్పే ప్రయత్నం చేశాడు.అగ్రకులాల వారు దళితులైన మాల,మాదిగలను ఆధారం చేసుకొని మాల వారిపై మాదిగ వారిని రెచ్చగొట్టి,మాదిగ వారిపై మాల వారిని రెచ్చగోట్టి వారి అవసరాలను తీర్చుకొని దళితులను చీల్చే ప్రయత్నం చేస్తారు అని,ఆఫ్రిక దేశాల్లో ఈస్థితిని పాలక వర్గాలు ఇప్పటికి కొనసాగిస్తున్నాయి అని ఇది అందరు గమనించగలరు అని చెప్పి ఇరువురికి సూచనలు చేసిన వ్యక్తి కలేకూరి ప్రసాద్.   ఈ రోజు (17-05-2013)  మాన నుండి దూరం కావడం మన దురదృష్టం .
                                                                                            
                      

                                                                                                                         గిన్నారపు ఆదినారాయణ
                                                                                                                                 పరిశోధక విద్యార్ధి
                                                                                                                  హైదరాబాదు విశ్వవిద్యాలయం 
                                                                                                                                     గచ్చిబౌలి 

                                                                                                                                     9949532456 
SURYA TELUGU NEWS PAPER DATED : 27/5/2013

పేదల ఆకలి కేకలకు అంతమెప్పుడు? ----సుంచు అశోకే


రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షం, వామపక్షాలన్నీ రైతుల పక్షమేనని చెబుతుంటాయి. కానీ రైతు సమస్యలపై ఏ పక్షం చిత్తశుద్ధిగా పనిచేసిన, ఉద్యమించిన దాఖలాలు లేవు. రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యమవుతున్నా మొక్కుబడి ఖండనలే తప్పా ఆచరణాత్మకంగా చేసింది శూన్యం. మరోవైపు చుక్కలంటుతున్న ధరలతో పేద ప్రజల పక్షం తాము ఉన్నామని ఏ రాజకీయ పార్టీ ముందుకు రావడంలేదు. రైతు ప్రయోజనాలు కాపాడటం ఎంత ముఖ్యమో.. ఒక్కపూట కూడా కడుపు నిండా తిండిలేని పేద జనం బాధలుకూడా అంతే ముఖ్యమని రాజకీయ పార్టీలు గుర్తెరగాల్సిన బాధ్యత ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది. ‘పాడి పంట లు పొంగిపొర్లే దారిలో నువు పాటు పడవోయి, తిండి కలిగితేనే కండకలదోయి- కండ కల వాడే మనిషోయి’అని గురజాడ అప్పారావు వంద సంవత్సరాల క్రితమే చెప్పాడు. కానీ మన పాలకులకు మాత్రం పేద ప్రజల ఆకలి కేకలు ఏ మాత్రం పట్ట వు. పౌరులు ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత ఆహారం తీసుకోవాలనే దానిపై ప్రభు త్వం ఏర్పాటు చేసిన ‘జాతీయ పోషక ఆహార సంస్థ’ ఒక నివేదికను విడుదల చేసిం ది. ఒక మోస్తరు కష్టం చేసే పురుషుడు రోజుకు 480 గ్రాములు, స్త్రీ అయితే 360 గ్రాముల ఆహారం తీసుకోవాలని సూచించింది. ఈ లెక్కన ఇద్దరు వ్యక్తులకు కలిపి నెలకు 25 కిలోల 200 గ్రాముల బియ్యం అవసరం అవుతాయి. అదే కాయకష్టం చేసే వారికి పురుషునికి 690 గ్రాములు, స్త్రీకి 480 గ్రామలు చొప్పున తీసుకోవాలి. అంటే నెలకు 35 కిలోల 100 గ్రాముల బియ్యం అవసరం పడుతుంది. అయితే మన ప్రభుత్వాలు ఒక్కో మనిషికి రేషన్‌షాపు ద్వారా ఒక్కొక్కరికి నాలుగు కిలోల బియ్యాన్ని మాత్రమే ఇస్తున్నది. నాలుగు కిలోల బియ్యం ఒక్క మనిషికి నెలంతా సరిపోను గాసం అవుతుందా? అంటే ఒక వ్యక్తికి నెలంతా సరిపోను గాసం కావాలంటే దాదాపు 15 కిలోల బియ్యం అవసరమవుతాయి. ప్రభుత్వం మాత్రం నాలుగు కిలోల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నది. మిగతా బియ్యం కోసం పేద ప్రజలకు 30 నుంచి 40 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. రేషన్‌షాపు ద్వారా దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు భూమిలేని పేదవాడికి నాలుగు కిలోల బియ్యం ఇచ్చి మీ బతుకు ఇంతేనని సరిపెట్టుకోమని చెబుతున్న ది.అదే వందలాది ఎకరాల భూములున్న ధనవంతులకు మాత్రం బ్యాంక్ రుణాల మాఫీతో వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. అయితే మన రాష్ట్రంలో వామ పక్షాలు అధికారంలోకి రాకున్నా.. ఏదో ఒక పార్టీ అధికారంలోకి రావడానికి మాత్రం వాటి శక్తియుక్తులను ఉపయోగిస్తుంటాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు.. టీడీపీ ప్రతిపక్ష పాత్ర పొషిస్తుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూర్చుంటున్నది. కుర్చీల స్థానాలు మాత్రమే మారుతున్నాయి. ప్రభుత్వ విధానాల్లో ఏ మార్పు ఉండటం లేదు. రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేస్తుంటాయి. అందులో ఎన్ని అమలు అవుతాయంటే చెప్పడం కష్టమే. అధికార పీఠాన్ని ఎక్కడమే లక్ష్యంగా చేసిన వాగ్దానాలన్నీ నీటి మీది రాతలుగానే మిగిలిపోతున్న తీరు నేటి రాజకీయాలది. 

ఈ క్రమంలో ఎవరి వర్గం ప్రయోజనాలు వారు నెరవేర్చుకుంటున్నారు. రాజకీ య పార్టీలు ఇచ్చే హామీలు ఏ వర్గం ప్రయోజనాలను కాపాడటానికి ఇస్తున్నాయనేది గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎవరు అధికారంలోకి వచ్చినా ధనవంతుల ప్రయోజనాల కోసమే హామీలు ఇస్తున్నాయి. కానీ సెంటు భూమిలేని పేద, దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ ప్రజలను విస్మరిస్తున్నాయి. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి కిరణ్‌కుమార్‌డ్డి వరకు పేద ప్రజలకు నెలంతా సరిపోను గాసం ఇవ్వాలనే ఆలోచన రాకపోవడం దురదృష్టకరం. అయితే ఎన్టీఆర్ రేషన్‌షాపుల ద్వారా ఇచ్చే బియ్యాన్ని రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి కొంత వరకు మేలు చేశాడని చెప్పుకోవచ్చు. అయితే ఎన్టీఆర్ ప్రభుత్వం కూడా నెలంతా సరిపోను గాసం ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా నేటి వరకు పేద ప్రజల ఆహారం విషయంలో ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఏ ముఖ్యమంత్రి కూడా పేద ప్రజలకు ఇచ్చే బియ్యాన్ని పెంచలేకపోయారు. ఇప్పటి వరకు రాజ్యమేలుతున్న పాలకులు పేద ప్రజల తిండి గురించి ఆలోచించకపోవడం విచారకరం. నాయకులు తమ, తమ వర్గం కడుపులు నింపుకోవడానికే ప్రయత్నిస్తున్నారు కానీ, ఆర్థకాలితో పేద ప్రజలు జీవిస్తుంటే పట్టించుకునే వారే కరువయ్యారు.మట్టిలో మట్టయి, భూమి కడుపును చీల్చి బంగారు పంటలు తీసిన శ్రమ జీవులు బుక్క బువ్వకు దూరమవుతున్నారు. ఆకలి, దు:ఖంతో కోట్లాదిమంది పేద ప్రజలు జీవిస్తున్నారు. పేద ప్రజలకు కడుపు నిండా తిండిపెట్టలేని పాలకులు చరివూతలో కొట్టుకుపోయా రు. నాలుగు మెతుకులు కంచంలో రాలి, ఐదు వేళ్లు నోట్లోకి పోయిననాడే పేదవాడి కంట్లో వెలుగు రేఖ పొడుస్తుంది. లేదంటే బతుకంతా దినదిన గండంగా గడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత కరెంటు ఇస్తామని 2004 ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే ఉచి త కరెంటు ఫైల్‌పై సంతకం చేసిన విషయం తెలిసిందే. ఇపుడొక నాయకుడు అధికారాంలోకి రాగానే రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తామని అంటున్నాడు. అదే భూమిలేని పేదలకు.. ఒక్కరికి రేషన్ ద్వారా ఇస్తున్న నాలుగు కిలోల బియ్యాన్ని పెంచుతామని, నెలకు సరిపడా 15 కిలోల బియ్యం ఇస్తామని మాత్రం ఎవరూ చెప్పడంలేదు. అయితే ఇక్కడ వామపక్షాల కోసం కూడా కొంత చెప్పుకోవాలి. ఎర్రజెండా పార్టీలు కూడా భూస్వాముల ప్రయోజనాల కోసమే ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతున్నాయి. రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, ఎరువుల ధరలు పెంచవద్దని ఆందోళనలు చెపడుతాయి. ఇక్కడ చిత్రమేమిటంటే ఎర్రజెండా పార్టీలు చేసే ఆందోళనకు జెండాలు పట్టి జై కొట్టేది భూములులేని పేద ప్రజలే. ఈ వామపక్షాలు మాత్రం పేద వూపజలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని ఒక్కొక్కరికి 15 కిలోల వరకు పెంచాలని ధర్నాలు, ఆందోళనలు చేసిన పాపాన పోలేదు. 

రాష్ట్రంలో 32 లక్షల రైతుల పంపుసెట్లకు ఉచిత విద్యుత్ ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 7 వేల 117 కోట్లు ఖర్చు చేస్తున్నది. అదే 7 కోట్ల 50 లక్షలున్న పేద ప్రజ ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌షాపుల ద్వారా ఇస్తున్నా రూపాయి కిలో బియ్యాని కి ఖర్చు చేస్తున్నది కేవలం 3వేల 231 కోట్లు మాత్రమే. భూములున్న రైతుల పట్ల ఉన్న ప్రేమ, భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల పేద ప్రజల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టంగా అర్థమవుతున్నది. 7 కోట్ల 50 లక్షలున్న పేద ప్రజల కోసం రేషను షాపుల ద్వారా అందిస్తున్న బియ్యానికి పౌర సరఫరాల శాఖకు ప్రభుత్వం బడ్జెట్‌లో ఇంకో 10వేల కోట్లు అదనంగా కేటాయిస్తే ఇద్దరున్న కుటుంబానికి 30 కిలోల బియ్యం, 4గురు ఉన్న కుటుంబానికి 60 కిలోల బియ్యం ఇవ్వడానికి సాధ్యపడుతుందని సామాజిక ఉద్యమ నేతలు అంటున్నారు. 32 లక్షల రైతుల పంపుసెట్లకు అందిస్తున్న ఉచిత విద్యుత్ కోసం 7 వేల 117 కోట్లు సబ్సిడీ ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, 7కోట్ల 50 లక్షల మందికి కోసం అందిస్తున్న బియ్యం కోసం 14వేల కోట్లు కేటాయించడం ఎందుకు సాధ్యం కాదు? దీంతో పేద ల పట్ల ప్రభుత్వానిది కేవలం సవతి తల్లి ప్రేమ అనే అర్థమవుతున్నది. పాలకులు ఏ వర్గాల నుంచి వస్తారో.. ఆ వర్గ ప్రయోజనాలను నేరవేర్చుకుంటారని, మిగిలిన పేద వర్గాలను పట్టించుకోరని అర్థమవుతున్నది.రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఈ రాజకీయ పక్షాలు ఎవరి ప్రయోజనాల కోసమున్నాయో గుర్తించాలి. జాతీయ పోషక ఆహార సంస్థ ( ఎన్‌ఐఎన్) ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రతి వ్యక్తికి కడుపు నిండా తిండి కోసం పేదలంతా ఉద్యమించాలి. ప్రతి కుంటుంబానికి కనీసం 40 కిలోల బియ్యం ఇవ్వాలనే డిమాండ్‌తో ఉద్యమించాలి. జాతీయ పోషకాహార సంస్థ చెప్పిన దాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమే. ఆ దిశగా అడుగులు వేసే క్రమంలోనే ‘ఆ కలి కేకల పోరుయాత్ర’ సాగుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అణగారిన సామాజిక వర్గాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ఏ వర్గానికి ఆ వర్గం తమ సామాజిక వర్గాల ప్రయోజనాల కోసం, ఆత్మగౌరవం కోసం,రాజ్యాధికారంలో వాటా కోసం పోరాడుతూనే ఉమ్మడి సమస్యల కోసం ఐక్యంగా ఉద్యమించాలి. రేషన్ బియ్యం పెంపు మొదలు, వృద్ధాప్య ఫించన్లు, వికలాంగుల ఫించన్లు, నిరుద్యోగ భృతి లాంటి సామాజిక ప్రయోజన పథకాలను పోరాడి సాధించుకోవాలి. వీటి సాధన కోసం కుల, మతాలకతీతంగా అణగారిన, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలన్నీ ఏకమై ముందుకు సాగాలి. పాలక వర్గాల మెడలు వంచి ఆర్థిక ప్రయోజనాలను సాధించుకోవాలి. తద్వారా మరో అడుగు ముందుకేసి రాజ్యాధికారం సాధించే దిశగా సాగిపోవాలి. 

-సుంచు అశోకే

Namasete Telangana Telugu News Paper Dated : 27/5/2013

Saturday, May 18, 2013

ధిక్కార పతాక కలేకూరి - కలేకూరి ప్రసాద్ ----పైడి తెరేష్ బాబు



  'నేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీ
వేలఏళ్ళ క్రితం ఈ గడ్డ మీదనే చంపబడ్డాను'
-కలేకూరి ప్రసాద్
తనెవరో, తన మూలాలేమిటో గుర్తించిన ఒక మూలవాసి చేసిన సాధికార ప్రకటన ఇది. పిడికెడు ఆత్మ గౌరవం కోసం, తనదైన జీవితం కోసం మరణం గొంతు మీద కాలేసి నిలదీసిన వైనమిది. ఒక విధంగా సాహసమే. ఔను కలేకూరి ప్రసాద్ నిజంగా సాహసి. చావు అతన్ని చూసి జడుసుకుంది తప్ప చావుకు అతనెప్పుడూ భయపడలేదు. పోయినట్టున్నాడేమో అని అనిపించడం, అంతలోనే బతికి ఉన్నాన్రా అని కబురు పెట్టడం అయిదారుసార్లు చేశాడు. అందుకే అతడు పోయాడని వార్త అందాక కూడా వెంటనే నమ్మబుద్ధి కాలేదు. అంబులెన్స్‌లో బాడీని ఒంగోలు నుంచి కంచికచర్ల తీసుకొస్తున్నారని తెలిశాక నమ్మక తప్పలేదు. గమ్మత్తేమిటంటే అతని శరీరంలో అతనెప్పుడూ లేడు. శరీరానికి అతీతుడు కలేకూరి ప్రసాద్. ఫార్మాలిటీస్‌తో పన్లేకుండా ప్రపంచాన్ని బిగియారా కౌగింలించుకున్న పిచ్చి ప్రేమికుడు. ఒకళ్ళ సంగతేమోగానీ నాకు అతడట్లాగే కనిపించాడు.
పుట్టింది కృష్ణా జిల్లా కంచికచర్లలో కావచ్చు. ఉద్యమరూపంలో దేశమంతా పరుచుకుపోయాడు. ఆత్మ గౌరవనినాదమై అంతర్జాతీయ వేదికపై (డర్బన్ సదస్సు) మారు మ్రోగాడు. కాలంతోపాటు ప్రవహిస్తూ, మలుపు మలుపునా కవిగా కార్యకర్తగా నాయకుడిగా, గాయకుడిగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా, పాత్రికేయుడుగా, మధుపాత్రికేయుడుగా, ప్రేమికుడిగా, కాముకుడిగా, సాయుధుడుగా, నిరాయుధుడుగా ఒక కొత్త రూపాన్ని ఆవిష్కరించుకుంటూ పోయిన బహురూపి. సిద్ధాంతపరంగా విప్లవవాదిగా మొదలై దళితవాదిగా కొనసాగాడు. మార్క్సిజాన్ని అంబేద్కరిజాన్ని రెండు కళ్ళు చేసుకుని దృష్టికోణాన్ని విస్తరించుకున్నాడు. విప్లవోద్యమంలోని అపసవ్యతల్ని ప్రశ్నించాడే తప్ప విప్లవ సిద్ధాంతాన్ని తప్పుపట్టలేదు. ఉద్యమాలను నిర్మించి పాలకుల డైనింగ్ టేబుళ్ళ మీద పరవడాన్ని నిలదీశాడు.
ఉద్యమ జీవితం ఆరంభించాక ప్రతి సంఘటనకు స్పందించాడు కలేకూరి. కారంచేడు దళితుల మారణకాండ తర్వాత ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమానికి అతడు మరికొందరి సాయంతో రాసి ప్రదర్శించిన ఒగ్గు కథ ఉద్యమానికి ముఖచిత్రం అయింది. ఆ తర్వాత చుండూరు, వేంపెంటలలో జరిగిన దళితుల నిరసనగా అక్షరాల్ని అగ్నిశరాలుగా చేసి సంధించాడు. చలపతి విజయవర్ధనంల ఉరిశిక్షలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అతని మాటలు పాటలు వీధి వీధినా మారుమ్రోగాయి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రాజెక్ట్ డైరెక్టర్ (మహబూబ్‌నగర్)గా, సాక్షి హ్యూమన్ రైట్స్ వాచ్ సంచాలకుడుగా, ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు సలహాదారుడుగా ఎన్నో పాత్రలు నిర్వహించాడు. ఎక్కడా కుదురుగా నిలవకపోవడం అతని ప్రత్యేకత. అందుక్కారణం ఉంది. ప్రధానంగా అతను స్వేచ్ఛావాది అరాచక వాది. ఒక మూసలో ఇమిడేరకం కాదు. బంధాలకు, అనుబంధాలకు, సంకెళ్ళకు, ప్రేమలకు, పెళ్లిళ్లకు, స్నేహాలకు, దేహాలకు చిక్కినట్టే చిక్కి లిప్తపాటులో తప్పించుకుపోగల అపర పాపియాన్. అందుకే ప్రపంచం అతన్ని ప్రేమగా కౌగిలించుకు మరీ వెలివేసింది. అయినాసరే ప్రపంచాన్ని సవాలు చేయడం ఆపలేదతను.
'మీకు చేతనైతే
నా శవాన్ని ఈ దేశం ముఖ చిత్రంగా ముద్రించండి
చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాప్తిస్తాను
ఒక పెనుమంటల పెనుగులాటనై
మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను'
-పైడి తెరేష్ బాబు  


Andhra Jyothi Telugu News Paper Dated : 19/5/2013

పాటకు పత్రహరితం కలేకూరి -డాక్టర్ చెరుకు సుధాకర్



‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వు’ కోసం, ‘చుండూరు గుండె గాయం’ సర్వనామం చేసుకున్న ఓ దళితుని కోసం, ఎంత వెతుక్కున్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా ఇంకా చేతికి ‘దక్కని పిడికెడు ఆత్మగౌరవం’ కోసం, ‘చోళీకే పీచే’ బరు కన్నీటి కథల కోసం, సామాజిక, రాజకీయార్థిక వికా సం కోసం వేయిన్నొక్క అద్భుత తెలుగు అనువాదాలు చేసి తానే ఒక చర్చ అయి, పరుగెత్తి పరుగెత్తి డస్సిపోయి మృత్యువు ఒడిలో నిండా యాభై ఏండ్లు నిండకముందే వాలిపోయాడు. ఒంగోలు ఆస్పవూతిలో మన మిత్రుడు, సాహితీవేత్త, దళిత ఆత్మగౌరవ పతాక, అలుపెరగని నిత్యనూతన సాహితీ ‘యువక’ కలేకూరి ప్రసాద్.

1964 అక్టోబర్ 25న కృష్ణా జిల్లా కంచికచర్లలో జన్మించాడు ప్రసాద్. విద్యాధికులు, ఉపాధ్యాయులైన లలితా సరోజిని, శ్రీనివాసరావుల సంతానం. మార్క్సిజం ప్రభావంతో అనేక ఉద్యమాలు నడిచే కంచికచర్ల గడ్డపైన దళితుడు కోటేశు సజీవ దహ నం చేయబడినాడు. అంబేద్కర్ శ్రమించి నిలబెట్టిన ఎస్సీ రిజర్వేషన్లతో విద్య-ఉద్యోగ అవకాశాలు పెరిగినా, ఆత్మగౌరవం కోసం ఒక్క అడుగు ముందుకు వేసినా ‘కో గుర్తు చేస్తుం ది. చిన్నతనంలోనే కలేకూరి ప్రసాద్‌కు నిత్యం కాటేసే మనువాదమని అర్థమయింది.
విద్యార్థి ఉద్యమాల్లో ఎగుస్తున్న విప్లవ కెరటాలకు కేరింతలు కొడుతున్న కుర్రకారుకు, తాను సై అంటూ జై కొట్టిన ప్రసాద్, విప్లవ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా నిలదొక్కుకునే ప్రయత్నంలో రాడికల్ అయ్యాడు. పీపుల్స్‌వార్ ప్రభావంతో నూనూ గు మీసాల వయస్సులో ఒక చేత్తో ఉద్యమం, మరో చేత్తో సాహి తీసాధన చేస్తూ విప్లవ రచయితల సంఘంలో భాగమై విస్తృతసాహితీ అధ్యయనం కొనసాగించాడు.

పాట, కవిత, కథానిక, వ్యాసం ఏదైనా తాను నమ్మిన ప్రాపంచిక దృక్పథంలోనే కొనసాగిన కలేకూరి ప్రసాద్‌కు వరుసగా జరిగిన నీరుకొండ, కారంచేడు, చుండూరు సంఘటనలు ఒక్క కుదుపు కుదిపాయి. ఎక్క డో తమిళనాడులో దళితులపై జరిగిన దాడికి అనేక రెట్ల పైశాచికత్వంతో తాను పుట్టిన కంచికచర్లలోనే కోటేశ్‌ను మరో దాడి బలిగొన్నది. వాటి కొనసాగింపుగా వేట కొడవల్ల వెంటాడే హత్య లు. గోనె సంచుల్లో కుక్కిన దళితుల శవాలు ప్రసాద్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. దళితవాడల్లోని చర్చీల్లో క్రీస్తును స్తుతిస్తూ ఉన్న పాటల పల్లవి ‘ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్త మే... ప్రభువా! నీ వాక్కుకై వేచియుంటిని-నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా!’.. అనేదాని బాణితోనే ‘కుమిలిపోయినా, నలిగిపోయినా-చుండూరు గుండెల గాయం దళితా! సాగుతు న్న సైనిక శపథం... దళితా! ఆవేదనంతా పోరాట సెగలై ఊరూ రా చుండూరు మండుతుందిలే! దళిత వీరులే చలిచీమల దండై కడతేర్చులే ‘కోడే త్రాచులన్-దళితా!’ అన్న పాట కట్టి లక్షల గొంతులతో తెలుగు నేలంతా పాడుకునేలా చేసినవాడు కలేకూరి ప్రసాద్.
చుండూరు ‘రక్తక్షేత్రం’ దాటి ప్రసాద్ ఆ పాట ధర్మక్షేవూతమైన ప్రతి పల్లెను తాకింది. 

భారతదేశంలో విప్లవమంటే మార్క్సిస్టు తాత్వికతలో మాత్రమే లేదు. అంబేద్కర్, ఫూలే పూర్తి చేయని దళిత, బహుజన ఆత్మగౌరవ పోరాట బాటలో కూడా ఉందని ఒక్క కుదుపులో వందలాదిమందిని కారంచేడు, చుండూరుకు తీసుకు వచ్చిం ది ఈ పరిణామమే. ‘దళిత పులులమ్మా! కారంచేడులో కలెబడి నిలబడి గెలిచి తీరిన దళిత పులులమ్మ’ అన్న గద్దర్ పాట ‘చుండూరు గుండెల గాయం’ అన్న ప్రసాద్ పాట గుంటూరును వొరుసుకొని, అమరావతిని ముద్దాడి, కృష్ణమ్మకు గొంతు కూర్చి, నల్లగొండ వాడపల్లి ఒడ్డును దాటి పది జిల్లాల తెలంగాణకు పరివ్యాపితమైంది. అదే సమయంలో ‘యువక’గా ఆయన రాసిన అనేక పాటలు తెలుగు సాహిత్యంలోనే కొత్త ఊపును తీసుకొచ్చాయి.

తొలినాళ్లలో విరసం పతాక ప్రారంభ పాట పల్లవి, పరిటాల శ్రీరాములు జీవిత పోరాట కథకు దగ్గరగా తీసిన ‘శ్రీరాములయ్య’ తర్వాత వచ్చిన ఇతర సినిమాల్లో ‘యువక’ పాటలు జనంలో ప్రాచుర్యం పొందాయి. ‘భూమికి పచ్చని రంగేసినట్లు’ అని యువక రైతు శ్రమ గురించి, కంట్రిబ్యూషన్ గురించి రాసిన పాట ఒక రొమాంటిక్ ట్యాగ్ కూడా అయ్యింది. ప్రసాద్ నిత్య అధ్యయనశీలి. చేగువేరాను చదువుతాడు. లాటిన్ అమెరికన్, ఆఫ్రికన్ సాహిత్యం చదువుతాడు. మహాశ్వేతాదేవిని చదువుతాడు. పాల్ రాబ్సన్, పాబ్లో నెరూడాలని తెలుగు నేల నల్లరేగళ్లలో, తెలంగాణ ఎర్రనేలల్లో రూపు కట్టాలని ఉబలాటపడుతాడు. ఎక్కడా స్థిరంగా నిలువనీయని అత్యుత్సాహం. ఏదో జరిగిపోవాలనే ‘సహజ’ యువకత్వం ప్రసాద్‌ను కవిగా, గాయకునిగా, పాటగాడిగా, యుద్ధంలో పాల్గొన్న విప్లవకారుడిగా పరుగుపెట్టించాయి. 

ఎంత ఉత్సాహంగా ముందుకు ఆయన వ్యక్తిగత కారణాలైనా కావొచ్చు, నడుస్తున్న ఉద్యమంల్లో వచ్చిన మార్పులు కావొచ్చు, కలేకూరి ప్రసాద్ ఎక్కడో నిరుత్సాహానికి గురయ్యా డు. తెలియని బాధని అధిగమించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు విఫలమయి మద్యం ఆధిపత్య స్థాయిలోకి చేరిం ది. రెండు సంవత్సరాల క్రితం నల్గొండలో ఒక సాహిత్య సభకు వచ్చినప్పుడు ప్రసాద్‌ను పోల్చుకోలేకపోయాను. కూర్చోబెట్టి ఎంతో సముదాయించి, కొన్ని అత్యవసరమైన వైద్యసేవలు చేసి పంపించిన తర్వాత ఇంతలోనే మరణవార్త వినాల్సి వచ్చింది. భూమికి పచ్చని రంగేసిన ప్రసాద్ తన జీవితానికి వేయలేకపోయాడు. ఆ పాటలోని చిత్రకారుడు కాన్వాస్ మీద పత్రహరితం ఒలకబోసినంత పలువరింత ఉన్న పాట రాసిన ప్రసాద్, జీవన పత్రహరితాన్ని కాపాడుకోలేక, రోజు రోజుకు ఎండిపోయి ఆరబెట్టిన చెక్కపొట్టులా రాలిపోవడం నన్ను కలచివేస్తున్నది. ‘నిఘా’ పేరు తో పత్రిక నడిపిన కలేకూరి ప్రసాద్‌ను ఇంత పెద్ద సాహితీ కుటుంబ ‘నిఘా’ ఏమీ రక్షించలేకపోయింది.

‘పిల్లలు ఎలా నేర్చుకుంటారు? అనే అనువాద పుస్తకంలో పిల్లలమనస్తత్వం-పెద్దల మార్గదర్శకం-అసమాన వేగవంత గ్రాహక తత్వం గురించి అనేక విషయాలు తెలుగు చదువరుల కు పరిచయం చేసిన కలేకూరి నేర్చుకున్న, కూర్చుకున్న అసమాన జ్ఞానం మోస్తున్న శరీరమే పెద్ద ధర్మ సాధనమని విస్మరించి మనందరిని నిండా యాభై పూర్తికాక ముందే వదలి విషాదంలో ముంచిండు. 

తెలుగు సాహిత్యంలో గొప్పగా రాస్తున్న వాళ్లు, ప్రపంచాన్ని గొప్పగా గీస్తున్న వాళ్లు, తెలంగాణ ఉద్యమాన్ని, నడుస్తున్న ప్రజ ల పోరాటాలను గొప్పగా పాడుతున్న వాళ్లు, ప్రపం చ సాహిత్యాన్ని నిత్యం తెలుగులో అక్షరబద్ధం చేస్తున్న వాళ్లు అందరూ కలేకూరి జీవితం నుంచి గుణపాఠం నేర్చుకుంటే.. మన మధ్యే వందల సాహితీమూర్తుల్ని చాలాకాలం సజీవంగా నిలుపుకోగలుగుతాం.


టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యు


Namasete Telangana Telugu News Paper Dated : 19/5/2013

Monday, May 13, 2013

బిసి కోటా చారిత్రక అవసరం ---కదిరె కృష్ణ,



హక్కుల పరిరక్షణకు రాజ్యాంగం హామీ 
కులాల ప్రాతినిధ్యం నిర్వీర్యం 
అగ్ర కులాల కుట్రే కారణం 
బీజాలు వేసింది గాంధీయే! 
రిజర్వేషన్లకోసం చందాపురి ర్యాలీ 
తమిళనాడులో పెరియార్‌ ఉద్యమం 
3 వేల బిసి కులాలను గుర్తించిన కలేల్కర్‌ 
కలేల్కర్‌ నివేదిక బుట్ట దాఖలు 
జనతా హయాంలో మండల్‌ కమిషన్‌ 
కోటాలు విద్య, ఉద్యోగ రంగాలకే పరిమితం 

ఇండియా బహుళ జాతుల/ కులాల సహజీవన సమ్మేళనం. 6,700 పైచిలుకు కులాలు మరెన్నో జాతులు ఇక్కడ ఉన్నాయి. ఈ జాతులు, కులాల హక్కుల పరిరక్షణకు భారత రాజ్యాంగం హామీ ఇచ్చింది. ప్రజా స్వామ్యం, మరీ ముఖ్యంగా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి. కానీ భారత ప్రజాస్వామ్య, పాలక పక్షాలు, భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను, కులాల ప్రాతినిధ్యాన్ని నిర్వీర్యం చేశాయి. వాటి అమలులో ఘోరంగా విఫలమైనాయి. 

ఇటు రాజ్యాంగాన్ని అటు ప్రజాస్వామ్యాన్ని వైఫల్యం చెందించడంలో అగ్ర కులాల పాత్ర చాలా కీలకమైనది. స్వార్ధ, కుట్ర పూరిత బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలం ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది. భారత రాజ్యాంగానికి బదులు దేశంలో మనుధర్మ శాస్త్రం అమలౌతూంది. ప్రజాస్వామ్యానికి బదులు రాజరికం రాజ్యమేలు తోంది. అందుకు తాజా (63 సంవత్సరాల గణతంత్ర ప్రజాస్వామ్య చరిత్ర) ఉదాహరణగా భారత రాజ్యాంగంలోని 340 ఆర్టికల్‌ నిలిచింది. ఈ ఆర్టికల్‌ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించి వారిని ఆ వైకల్యం నుండి విముక్తి చేసేందుకు ఒక కమిషన్‌ వేయాల్సిందిగా ఉత్తర్వు (ఆర్డర్‌) జారీ చేసింది. వెనుకబడిన తరగతుల వెనుకబాటుతనాన్ని, పేదరికాన్ని పోగొట్టడం ద్వారా, అందుకు కారణమైన కుల నిర్మూలనకు పునాదులు వేయడమే దీని ఉద్దేశ్యం.

అందుకు రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన రూపకల్పన చేసేందుకు ఉద్దేశించినదే ఈ ఆర్టికల్‌. 63 సంవత్సరాలుగా ఈ ఆర్టికల్‌ నిస్తేజంగా, నిర్వీర్యంగా, వివాదాస్పదంగా మారి ఓ మూలన పడిఉంది. పాలకపక్షాల కుల స్వభావానికి, కుట్ర కుతంత్రాలకు నిదర్శనంగా నిలిచింది. 52 శాతంగా (ప్రభుత్వ లెక్కల ప్రకారం) ఉన్న బిసి కులాల అభివృద్ధిని, అధికారాన్ని తిరస్కరించి వారిని బానిసలుగా కొనసాగించేందుకు, ఈ ఆర్టికల్‌ను అమలు చేయకుండా వాయిదాల మీద వాయిదాలతో ప్రభుత్వాలు పబ్బం గడుపుతున్నాయి. 

వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి రాజ్యాంగంలో పొందుపరచవలసిన రిజర్వేషన్‌ హామీలను (నాటి పాలక కాంగ్రెస్‌ ఆర్టికల్‌ 340లో చెప్పిన బిసి కమిషన్‌ను నియమించకుండా, కొంతకాలం అమలు చేయకుండా, మరికొంతకాలం వాయిదా వేయడం ద్వారా) నీరు గార్చాలని నిర్ణయించుకుంది. నిజానికి బిసిలను వివిధ పార్టీలకు గులాంగిరి చేసే ఆట వస్తువులుగా మార్చేందుకు బీజాలు వేసింది జాతిపిత మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీయే. లండన్‌లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌లు- అంబేడ్కర్‌ను అంటరాని కులాల ప్రతినిధిగా పరిమితం చేయడం, భారత రాజ్యాంగ పరిషత్‌లో ఒక్క బిసి సభ్యుడుకూడా నియామకం కాకుండా జాగ్రత్త పడడం, గాంధీ పన్నిన కుట్ర.

దాని పర్యవసారమే నేటికి సంచారజాతులుగా భిక్షుక వృత్తిలో కొట్టు మిట్టాడుతున్న బిసి కులాల దైన్య స్థితి. ఈ వైపరీత్యాలన్నీ బిసిలు గాంధీని తమ నాయకుడిగా, విముక్తి దాతగా ఎన్నుకోవడం వల్లనే జరిగాయి. తదనంతరం డా బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు రిజర్వేషన్లు కల్పించి రాజ్యాంగ బద్ధం చేసిన తర్వాత బిసి రిజర్వేషన్ల ముసాయిదా బిల్లును రాజ్యాంగ పరిషత్‌ ముందుకు తెచ్చినప్పుడు వల్లభ భాయ్‌ పటేల్‌ (ఉక్కు మనిషి) ‘ఎస్సీ, ఎస్టీలకు వెనుకబడిన వర్గాల ప్రాతిపదికనే రిజర్వేషన్లు (ప్రాతినిధ్యం) కల్పించాం. మళ్ళా ఈ వెనుకబడిన తరగతులు (బిసిలు) ఎవ్వరు?’ అంటూ ప్రశ్నించాడు.

దానికి అంబేడ్కర్‌ అగ్రకులాల కుట్రలో భాగంగా సంధించిన ఆ ప్రశ్నలోని అంతరార్ధం గ్రహించి- ఎస్సీ, ఎస్టీలు కాక మిగిలిన వెనుకబడిన వారిని ఒబిసి లుగా గుర్తించాడు. ఆ ఒబిసిలు ఏఏ కులాలో గుర్తించడానికి 340 ఆర్టికల్‌ను రాజ్యాంగంలో పొందుపరిచాడు. ఆనాడు పటేల్‌ వేసిన కొర్రీ నేటికీ బిసి రిజర్వేషన్లను సాధించ కుండా అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తున్నది. ఈ సమస్య నాటి నుండి నేటి వరకు కాష్ఠంలా కాలుతూనే ఉంది. 

తదనంతరం న్యాయశాఖా మంత్రిగా డా అంబేడ్కర్‌ రాజీనామా చేస్తూ, తన రాజీనామాకు కారణాలు నాలుగింటిని పేర్కొంటూ- అందులో బిసిలను గుర్తించడానికి కమిషన్‌ను వేయడం లేదనే కారణాన్ని బలంగా ఎత్తి చూపాడు. ఈ క్రమంలో మళ్ళీ బిసి రిజర్వేషన్ల అంశం వెలుగు లోకివచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ బిసి నాయకుడు ఆర్‌.ఎల్‌. చందాపురి నాయకత్వంలో డా అంబేడ్కర్‌ సహా పాట్నా నుండి ఢిల్లీ వరకు బిసి రిజర్వేషన్లు కోరుతూ పెద్ద ఎత్తున ఒక ప్రదర్శన (ర్యాలీ) నిర్వహించారు. అటు తమిళనాడులో పెరియార్‌ రామస్వామి నాయకర్‌ బిసి రిజర్వేషన్ల కోసం పాలక పక్షాల కళ్ళు బయర్లుకమ్మేలా వేలాది మందితో ఒక ఉద్యమాన్ని ప్రారంభించాడు.

ఈ నేపథ్యంలో ఊపిరాడని పాలక కాంగ్రెస్‌ నెహ్రూ ప్రభుత్వం 29 జూలై 1953లో కాకా కలేల్కర్‌ అనే బ్రాహ్మణుడి అధ్యక్షతన బిసి కమిషన్‌ వేసింది. దేశ వ్యాప్తంగా వెనుకబడిన తరగతుల స్థితిగతులను అధ్యయనం చేసిన కాకా కలేల్కర్‌ కమిషన్‌ దాదాపు 3,000 కులాలను బిసి కులాలుగా గుర్తించి. వారి తరతరాల వెనుకబాటు తనానికి అంటరాని తనం, కుల వివక్ష (సామాజిక వెనుకబాటుతనం) కారణమని తేల్చి చెప్పింది. ఈ వెనుకబాటు తనాన్ని తుడిచివేసేందుకు అన్ని రంగాలలో రిజర్వేషన్ల కల్పనను ప్రతిపాదించింది. 1955 మార్చి 30వ తేదీన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. 
తాము అనుకున్న అంచనాలను తారుమారు చేసిన బిసి కులాల వాస్తవ జీవన దౌర్బల్యం అగ్ర కుల పాలక పక్షాల మనస్సును కదిలించలేకపోయింది.

బిసిల రిజర్వేషన్ల ఆవశ్యకతను చాటిచెప్తున్న కలేల్కర్‌ కమిషన్‌ రిపోర్టును బుట్టదాఖలు చేసే కుట్రను నెహ్రూ తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. అనుకున్నదే తడవుగా కాకా కలేల్కర్‌ను పార్లమెంటులోని సెంట్రల్‌ హాలుకు పిలిపించి తీవ్రంగా మందలించడమేకాక, తను సమర్పించిన నివేదక పట్ల తనకే విశ్వాసం లేదని ఒక రిపోర్టు ఇవ్వవలసిందిగా ఆదేశించాడు. దీనితో కథ మొదటికి వచ్చింది. ఇంత జరుగుతున్నా ప్రశ్నించగలిగే బిసి నాయకత్వం నాటి పార్లమెంటులో లేకపోవడం విచారకరం.

50 శాతానికి పైగా ఉన్న బిసి కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం అంటే చట్ట సభలలో రిజర్వేషన్‌ కల్పిస్తే ఇంకెప్పటికీ అగ్రకులాలు పాలక పక్షంగా ఉండలేవన్న నిజాన్ని నెహ్రూ భరించలేకే ఇంతటి పనికి పూనుకున్నాడు. బిసి రిజర్వేషన్లను అమలు చేయవద్దని, కలేల్కర్‌ కమిషన్‌ను పెడచెవిన పెట్టాలంటూ కాంగ్రెస్‌ పాలిత వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రు లకు రహస్య ఉత్తరాలు (ఆర్డర్‌) రాసి మరోసారి మూలిగే నక్కమీద తాటికాయ పడ్డ చందంగా బిసి రిజర్వేషన్ల చరిత్రను తల్లక్రిందులు చేశాడు. 

ఆ తరువాత 1979జనవరి 1న జనతా ప్రభుత్వం ప్రముఖ పార్లమెంటేరియన్‌ బి.పి. మండల్‌ అధ్యక్షతన ఒక కమిషన్‌ను నియమించింది. డిసెంబర్‌ 1989 లో ఆ కమిషన్‌ తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో బిసి వెనుకబాటు తనాన్ని, రిజర్వేషన్ల ప్రాముఖ్యతను మరొక్కసారి బలపరిచింది. కానీ పార్లమెంటులో చట్టం చేసే ధైర్యం నాటి జనతా ప్రభుత్వానికి లేకపోయింది. అందుకు కారణం, పాలక పక్షాలుగా, ప్రభుత్వాధి నేతలుగా బ్రాహ్మణ- అగ్రకులాలు ఉండడమేనని ఇప్పటికీ బహుజన వర్గాలు గ్రహించలేకపోతున్నాయి.

అగ్రకులాల కుట్రలకు బలవుతూ, వారికి ఓటు బ్యాంకుగా మారిన దుస్థితిని మార్చేందుకు ప్రయత్నించకపోవడం చైతన్య రాహిత్యమే అవుతుంది. బిసి రిజర్వేషన్ల డిమాండ్‌ను మరొక్కసారి బి.ఎస్‌.పి. పార్టీ ముందుకు తెచ్చింది. ‘గద్దె దిగుతావా? మండల్‌ రిపోర్టు అమలు చేస్తావా? అన్న కాన్షిరామ్‌ నినాదం దేశమంతటా ప్రతిధ్వనించింది. మండల్‌ కమిషన్‌ రిపోర్టును అమలు చేస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన వి.పి. సింగ్‌ ప్రభుత్వం విద్యా, ఉద్యోగ రంగాలలో మాత్రమే రిజర్వేషన్లను అమలు చేయగలిగింది. కానీ రాజ్యాధికారానికి వ్యవస్థా నిర్మాణానికి, ధర్మ పరివర్తనకు, కుల నిర్మూలనకు దారులు వేసే చట్టసభలలో రిజర్వేషన్ల గురించిన అంశాన్ని మాత్రం మరుగున పడేసింది. ఈ ప్రభుత్వాల పరిస్థితి చూస్తే నోటితో హర్షించి నొసటితో వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తుంది.

ఈ రకంగా బిసిలకు రాజకీయ రిజర్వేషన్‌లు లేకపోవడం మూలంగా అధికారం, వనరులు, డబ్బుపైన ఆధిపత్యం అగ్ర కులాలను శాశ్వత పాలక పక్షాలుగా మార్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క దామోదరం సంజీవయ్య (2 సంవత్సరాలు) తప్ప మిగిలిన పాలకులంతా మైనారిటీ జనాభా కలిగిన రెడ్డి (10), కమ్మ (3), బ్రాహ్మణ (1), వైశ్య (1) కులస్థులే. ఈ రాష్ట్రాన్ని సుమారు 40 సంవత్సరాలు రెడ్లు, 20 సంవత్సరాలు కమ్మ- ఇతర అగ్రకులాలు పరిపాలించాయి. కేంద్రంలో గత 63 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న కులాలు అగ్రకుల బ్రాహ్మణ వర్గాలే.

50 శాతంగా ఉన్న బిసి కులస్థులలో ఏ ఒక్కరినీ, ఏ పార్టీకి చెందినవారైనా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా చేసే అవకాశం దరిదాపుల్లో కనిపించడం లేదు. ఈ పరిస్థితికి కారణం బిసివర్గాల్లో చైతన్యం లోపించడమే. మైనారీటీ జనాభా కలిగిన కులాలకి/ జాతులకి చట్ట సభలలో ప్రాతినిధ్యాన్ని కల్పించేందుకు జర్మనీ, బొలీవియా, వెనుజుల, న్యూజిలాండ్‌, స్కాటిష్‌, హంగరీ, అమెరికా వంటి దేశాల్లో ప్రత్యేక ఎన్నికల విధానం అమలులో ఉంది. యూరప్‌లోని 21 దేశాలలో కనీస జనాభా కలిగిన జాతులకు కూడా చట్ట సభలలో ప్రాతినిధ్యం కల్పించే ఎన్నికల విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. కానీ భారతదేశ ఎన్నికల విధానంలో అలాంటి వెసులుబాటు ఏదీ లేకపోవడం వల్ల బిసిల్లో, ఎస్సీల్లో అనేక కులాలు నేటికీ అసెంబ్లీ లేదా పార్లమెంటు గుమ్మం ఎక్క లేకపోతున్నాయి.

‘రాజ్యాధికారం పొందలేని జాతులు/ కులాలు చరిత్రలో అంతరిస్తా’యని మాన్యశ్రీ కాన్షీ రామ్‌ చెప్పినట్టు, బిసిల రాజ్యాధికారం అసాధ్యమైనప్పుడు అది తప్పక జరిగి తీరుతుంది. ఒకవైపు బిసిలకు చట్ట సభలలో ప్రాతినిధ్యం లేకుండా చేయడం, చట్ట సభలలో ఎస్సీ కులాలకు ఉన్న ప్రాతినిధ్య సౌకర్యం- ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగేంతగా లేకుండా పోవడం- అగ్ర కులాల విజయానికి దోహదం చేస్తుంది. 5 శాతం మించిన రెడ్లు 90 కి మందికిపైగా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. 52 శాతానికి మించిన బిసి కులాల ఎమ్మెల్యేలు 50 శాతానికి మించిలేరు.

ఇది ఆధిపత్య వర్గాల రాజకీయ దోపిడీ కాక మరేమవుతుంది? అగ్ర కులాల ఆధిపత్యం ధ్వంసం కావాలంటే బిసి కులాల చైతన్యం వారిని రాజ్యాధికారం వైపు నడిపించాలి. బిసి కులాల్లో చైతన్యం- ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థగా రూపాంతరం చెందకపోతే అగ్రకులాల అరాచకం కలకాలం కొససాగుతుంది.
కుల నిర్మూలనకు కిటికీలను, తలుపులను మూసేస్తుంది. మహాత్మా జ్యోతిరావ్‌ పూలే, రాజశ్రీ సాహూజీ మహరాజ్‌, పెరియార్‌, డా అంబేడ్కర్‌ కలలుగన్న- అణగారిన వర్గాలకు రాజ్యాధికారం, ప్రబుద్ధ భారత్‌ నిర్మాణం సాకారం కావాలి. బిసిలను చైతన్యవంతం చేసి, ఐకమత్యంగా పోరాడి రాజ్యాధికారానికి స్వయంగా దారులు వేసుకోవాలి.


Surya Telugu News Paper Dated : 13/5/2013

Sunday, May 12, 2013

దళిత సమస్యల్లో కార్యాచరణకే ప్రాధాన్యత ---తమ్మినేని వీరభద్రం


  Sun, 12 May 2013, IST  

దళితుల విషయంలో ఈ చట్టంగానీ, రిజర్వేషన్లుగానీ కొన్ని సౌకర్యాలో, కొద్ది సంపదలో ఇవ్వచ్చేమోగానీ మూల సమస్య మాత్రం పరిష్కారం కాదు. సాటి పౌరులందరితో సమానత్వం సాధించటం, ఆత్మగౌరవంతో జీవించటం అనేది అతిముఖ్య విషయం. ఇందుకు కులవివక్షను, కులాన్ని నిర్మూలించే ఉద్యమాలూ, కార్యక్రమాలూ, కృషీ ఎంత ఎక్కువగా సాగించగలిగితే అంత వేగంగా లక్ష్యానికి దగ్గరవుతాము. మన రాష్ట్రంలో ఆ ఉద్యమాలు ఇంకా జరగాల్సినంత విస్తృతంగా, ఉధృతంగా జరగటం లేదు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టంలో ఇంకా కొన్ని లొసుగులూ, లోపాలూ ఉన్నా మొత్తంగా చూస్తే ఇది అందరూ హర్షించాల్సిన, ఆహ్వానించాల్సిన శాసనం. ఎన్నో ఏళ్ళుగా ఈ చట్టం కోసం రాష్ట్రంలో జరిగిన కృషీ, పోరాటాలూ ఈ విధంగా ఫలించాయని చెప్పవచ్చు.
అయితే ముఖ్యమంత్రి ఈ చట్టం తానే తెచ్చానని (కనీసం కాంగ్రెస్‌ పార్టీ కూడా కాదట), ప్రతిపక్షాలన్నీ దీన్ని వ్యతిరేకించాయని 'నోటి గద్దరితనం' ప్రదర్శిస్తున్నారు. ఇటీవల రాజమండ్రి సభలో 'దళిత బంధు' అనే బిరుదు కూడా ఇప్పించుకున్నారు. మన ముఖ్యమంత్రికి దళితులపై అంత ప్రేమ నిజంగానే ఉంటే ఇతర సమస్యలన్నీ అలా ఉంచినా, కనీసం రాష్ట్రంలో ఎస్‌సి కమిషన్‌కు ఏళ్ళ తరబడి ఛైర్మన్‌ లేకుండా ఉంటాడా? దళితుల సమస్యల పరిష్కారానికి కొంతైనా ఉపకరించే అలాంటి ముఖ్యమైన పదవికి ఇన్నేళ్లూ ఎవరినీ ఎందుకని నియమించలేదు? ఈ కమిషన్‌కు మొదటి ఛైర్మన్‌గా ఉన్న జస్టిస్‌ పున్నయ్య తరువాత ఒక కాంగ్రెస్‌వాదిని ఛైర్మన్‌గా నియమించారు. ఆయన 2009 ఎన్నికల్లో పోటీ చేయటంతో ఏర్పడిన ఖాళీని ఇక ఇంతవరకూ పూరించనే లేదు. పోనీ కావాలనుకుంటే మరో కాంగ్రెస్‌ మనిషినే మళ్లీ నియమించుకోవచ్చు కదా? ఆ మాత్రం సరుకున్న మనిషి కాంగ్రెస్‌లో లేడని ముఖ్యమంత్రి అభిప్రాయమా? తెనాలిలో దళిత మహిళపై అఘాయిత్యం జరిగితే, లక్ష్మింపేటలో దళితులను ఊచకోత కోస్తే, ఎక్కడి నుంచో జాతీయ కమిషన్‌ వాళ్లు రావాల్సి వచ్చింది కదా? అదే మన కమిషన్‌కు ఛైర్మన్‌ ఉంటే ఇలాంటి ఘటనలపై స్పందించే అవకాశం ఉండేది కాదా? ఈ మాత్రం ఇంగితం లేని మన ప్రభుత్వమూ, ముఖ్యమంత్రి 'దళిత బంధు' లవుతారా? లేక అలాంటి హక్కులు దళితులకు దక్కటం సహించలేని అగ్రకుల మద్దతుదార్లవుతారా?
ముఖ్యమంత్రి వాచాలత్వం ఎలా ఉన్నా 'మా కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఈ చట్టం తెచ్చిందనటం వాస్తవమే కదా?' అని ఈ మధ్య ఓ కాంగ్రెస్‌ మిత్రుడు నన్ను ప్రశ్నించారు. ఇలాంటిదే ఒక సందర్భం నేను శాసనసభ్యుడిగా ఉన్నపుడు సభలోనే నాకు ఎదురైంది. ఆరోజు మన రాష్ట్రంలో వచ్చిన వివిధ భూ చట్టాల గురించి నేను సభలో ఉపన్యసిస్తూ.. 'ఈ చట్టాలన్నీ ప్రజా పోరాటాల వల్లే వచ్చాయని' నేనన్న మాటకు కాంగ్రెస్‌ సభ్యులు ఒక్కుమ్మడిగా అడ్డు తగిలారు. 'కాదు, కాదు.. ఈ చట్టాలన్నీ మా కాంగ్రెస్‌ ప్రభుత్వాలే తెచ్చాయి' అన్నారు. అపుడు నేనడిగాను ... మరి మన దేశానికి స్వాతంత్య్రం తెచ్చిందెవరు? .. అని. కాంగ్రెస్‌ బల్లల వైపు నుంచి 'మా కాంగ్రెస్సే కదా' అని సమాధానం వచ్చింది. అపుడు నేనేమన్నానంటే .. 'అదెలా కుదురుతుంది? కాంగ్రెస్సో, కమ్యూనిస్టులో.. గాంధీయో, ఒక సుందరయ్యో, అల్లూరి సీతారామరాజో, భగత్‌ సింగో వీళ్లంతా స్వాతంత్య్రం కోసం పోరాడిన వాళ్లు తప్ప ఇచ్చిన వాళ్లు కాదు గదా? స్వాతంత్య్రం ఇచ్చిన వాళ్లంటే .. మరి మీ లెక్క ప్రకారం బ్రిటిష్‌వాళ్లు అవుతారు గదా? అలా కాదంటే 'స్వాతంత్య్రం రావటానికి పోరాడిన వాళ్లే కారణంగా ఎలా అయితే చెబుతామో, అలాగే భూ చట్టాల కోసం జరిగిన పోరాటాలే ఆ చట్టాలు రావటానికి కారణం అని చెప్పటం సరైంది కాదా?' అని ప్రశ్నించే సరికి కాంగ్రెస్‌ పెద్దలందరికీ నోళ్లుమూతబడిపోయాయి. ఎక్కడివాళ్లు అక్కడ కూర్చుండిపోయారు. అందువల్ల ఎవరు ఎన్ని వాదాలు చేసినా, వాక్చాతుర్యాలు ప్రదర్శించినా ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ చట్టం కోసం అనేక సంవత్సరాలుగా సిపియం, ఇతర వామపక్షాలు, దళిత సంఘాలు, ఇతర ప్రజాస్వామికవాదులు సాగించిన కృషి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ విషయంలో ప్రత్యేక చొరవ ప్రదర్శించిన వాడిగా సిపియం కార్యదర్శి రాఘవులును అనేక మంది ప్రముఖులు ప్రశంసిస్తుంటారు కూడా. ఈ పోరాటాలకు విశాలమైన మద్దతు కూడా లభించిన మాట కూడా నిజం. మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా వివిధ సందర్భాలలో తమ సంఘీభావం (ఇలాంటి చట్టం వారికి ఇష్టమున్నా, లేకపోయినా) ప్రకటించాయి. అలాగే చివరి రోజులలో కాంగ్రెస్‌లోనే ఉన్న దళిత మంత్రులంతా - ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహ ప్రభృతులు కూడా ఈ ఉద్యమ డిమాండ్‌ పట్ల సానుకూలత ప్రదర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఈ ఒత్తిడి అంతా పనిచేసిన మాట వాస్తవం. ఆ విధంగా ఈ చట్ట సాధనలో అనేక మంది తమ, తమ పాత్రలు పోషించారనే చెప్పాలి.
అలాగే ఈ చట్టానికి పాత చరిత్ర కూడా జోడించాల్సి ఉంటుంది. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఉండగా కుల వివక్ష రాష్ట్రంలో ఏ మోతాదులో ఉందో కెవిపియస్‌ రాష్ట్రమంతా సర్వే చేసింది. ఎన్నెన్ని వికృత రూపాలలో ఇంకా వివక్ష సాగుతోందో సోదాహరణంగా నిరూపించింది. మరింత లోతైన అధ్యయనం కోసం కమిషన్‌ వేయాలని ప్రభుత్వంపై అనేక రూపాల్లో ఒత్తిడి చేసిన ఫలితంగా 'పున్నయ్య కమిషన్‌' ఏర్పడింది. ఆయన అపార కృషితో వివక్ష విరాట్‌ స్వరూపం వెలుగులోకొచ్చింది. ఆ తర్వాత మరిన్ని పోరాటాలతో కమిషన్‌ ఏర్పడి ఆ పున్నయ్యగారే ఛైర్మన్‌గా నియమించబడ్డారు. ఆ తర్వాత జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌లో నిధులు ఎస్‌సి, ఎస్‌టిలకు కేటాయింపు జరపాలనే నిబంధనను అమలు జరపకపోవటంపై ఉద్యమం కేంద్రీకరించబడింది. ఆ నిధులు రకరకాలుగా ఎలా దుర్వినియోగం జరిగాయో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నిబంధనలకు బదులుగా ఆ నిధుల ఖర్చు అనివార్యం చేసే విధంగా చట్టం కావాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. ఈ చట్ట సాధనకు అన్ని జిల్లాలలోనూ, రాష్ట్ర రాజధానిలోనూ ఎన్నో పోరాటాలు కెవిపియస్‌, సిపియం, వామపక్షాల ఆధ్వర్యంలో దళిత సంఘాల సహకారంతో జరిగాయి. అన్ని సంఘాల ఐక్య కార్యాచరణకు కాకి మాధవరావు లాంటి ప్రముఖుడు నాయకత్వం వహించారు. ఈ పోరాటంలో భాగంగానే ఖమ్మం జిల్లాలో 76 రోజుల 'దళితవాడల సైకిల్‌ యాత్ర' జరిపాము. ఆ యాత్రను మాధవరావుగారే సైకిలు తొక్కి ప్రారంభించారు. నేడు ఈ చరిత్రంతా చెరిపేసి పుణ్యం అంతా తమ ఖాతాలోనే వేసుకోవాలని ఎవరు అనుకున్నా అది వృథా ప్రయాసే అవుతుంది. అందువల్ల ఈ చట్టానికి తల్లెవరు? తండ్రెవరు? అనే పంచాయితీ కంటే దాని ఆలనా, పాలనా చూడటానికి ప్రభుత్వ పెద్దలు శ్రద్ధ చూపితే బావుంటుంది. అంటే ఆ చట్టం అమలులో తమ చిత్తశుద్ధిని చూపిస్తే బావుంటుంది.
ఇక 'ఇల్లు అలకగానే పండుగ కాద'న్నట్లు ఈ చట్టం రాగానే బడ్జెట్లలో కేటాయింపులన్నీ సక్రమంగానే జరిగిపోతాయని, ఆ నిధుల ఖర్చుతో ఇక దళిత పేటలు వెలిగిపోతాయనీ ఎవరైనా అనుకుంటే అది అత్యాశే అవుతుంది. ఎందుకంటే అంటరానితనం నేరం అనే చట్టం వచ్చి చాలా ఏళ్లయింది. అయినా ఇప్పటికీ ఆ దురాచారం విస్తృత ప్రాంతంలో కొనసాగుతూనే ఉంది. ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టం, వరకట్న నిషేధం లాంటి చట్టాలున్నప్పటికీ వాటి అమలు ఎలా ఉందో కూడా మనందరికీ తెలుసు. ఇలాంటివే ఇంకెన్నో చట్టాలు అమలుకు నోచుకోవటం లేదు. అందువల్ల పాలక వర్గాలు తమ ఇష్టపూర్తిగా, తమ లాభాల కోసం తెచ్చే చట్టాలను అమలు జరిపినంత వేగంగా, నమ్మకంగా ఇలాంటి చట్టాలను (ప్రజల ఒత్తిడి వల్ల తప్పనిసరై తెచ్చినవి) అమలు జరపవనేది మనకు చరిత్ర చెబుతున్న సత్యం. అందువల్ల సబ్‌ప్లాన్‌ చట్టం సాధించటానికి పోరాడిన శక్తులన్నీ దాని అమలు కోసం కూడా నిరంతరం శ్రమించాల్సి ఉంటుందనటంలో ఎలాంటి సందేహానికీ ఆస్కారం లేదు.
అలాగే ఈ చట్టంగానీ, రిజర్వేషన్లుగానీ దళితుల విషయంలో కొన్ని సౌకర్యాలో, కొద్ది సంపదలో ఇవ్వచ్చేమోగానీ మూల సమస్య మాత్రం పరిష్కారం కాదు. సాటి పౌరులందరితో సమానత్వం సాధించటం, ఆత్మగౌరవంతో జీవించటం అనేది అతిముఖ్య విషయం. ఇందుకు కులవివక్షను, కులాన్ని నిర్మూలించే ఉద్యమాలూ, కార్యక్రమాలూ, కృషీ ఎంత ఎక్కువగా సాగించగలిగితే అంత వేగంగా లక్ష్యానికి దగ్గరవుతాము. మన రాష్ట్రంలో ఆ ఉద్యమాలు ఇంకా జరగాల్సినంత విస్తృతంగా, ఉధృతంగా జరగటం లేదు. అందుకు బహుశా మూడు కారణాలున్నాయనిపిస్తోంది.
మొదటిదేమంటే అంటరానితనమూ, కులవివక్షా కేవలం దళితులు బాధపడే సమస్యగానూ, దాని పరిష్కారం అంటే వారిని ఉద్ధరించటం కోసం మాత్రమే అన్నట్లుగా చూడబడుతోంది. అలా చూడటం ఈ సమస్యలో ఒక పరిమిత కోణం మాత్రమే అవుతుంది. అంటరానితనం, కులవివక్ష పోవాలనటం దళితుల కోసం మాత్రమే కాదు. వారిపై జాలితోనో, మానవత్వంతోనో మాత్రమే కాదు. ఈ సమస్యను అలా పరిమితం చేయటం సరైంది కూడా కాదు. ఈ సమస్య మన దేశ నాగరికతకు, ఆధునికతకు సంబంధించిన విషయంగా కూడా చూడాలి. మనం నాగరిక దేశంగా ప్రపంచం ముందు నిలవాలంటే, అంతకంటే మించి మన ఉత్పత్తిలో అగ్రదేశాల సరసకు చేరాలంటే మన పౌరులందరూ సమాన గౌరవం పొందగలగాలి. ముఖ్యంగా 'శ్రమ' గౌరవించబడాలి. ఉత్పత్తిదారులైన శ్రామికులు ఆ స్థితి నుంచి స్ఫూర్తిని పొందాలి. మన దేశ శ్రామికులలో అత్యధికులైన దళితులను అంటరాని వారుగా, తక్కువ కులం వారుగా హీనంగా చూసినంత కాలం, శ్రమ అంటే బ్రతుకు తెరువు కోసం చేసే నీచమైన పనిగా భావించినంత కాలం మన దేశం ఆ స్థానాన్ని పొందటం అసాధ్యమే కాదు, అసంభవం కూడా. అందువల్ల ఈ సమస్య దళితుల సమస్య మాత్రమే కానే కాదు. కొందరు దళిత నాయకులు భావిస్తున్నట్లుగా దళితుల సమస్యలపై దళితులే పోరాడాలి అనుకోవటం కూడా ఎలా తప్పో ఈ అవగాహనలోంచి మనం చూడాలి. అందువల్ల ఈ సమస్య దేశాభివృద్ధికి సంబంధించిన ముఖ్య సమస్యగా మనం గ్రహించాల్సి ఉంటుంది.
రెండవదేమంటే ఈ సమస్య ప్రాధాన్యత గుర్తించిన వారు కూడా 'పండిత' చర్చలకు పరిమితం కావటం, ఆచరణకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవటం ఒక ముఖ్య ఆటంకంగా మారింది. అలా కాకుండా 'ఆచరణ'కు ప్రాధాన్యత ఇవ్వటం నేటి అవసరంగా ఉంది. అంటరానితనం, కులవివక్ష, కుల నిర్మూలన సమస్య వచ్చేప్పటికి కులం ముఖ్యమైందా? వర్గం ముఖ్యమైందా? దేనిపై ముందు పోరాడాలి? కులం మూలం ఎక్కడుంది? మతంలో ఉందా లేక ఇంకెక్కడైనా ఉందా? మతం పోకుండా కులం పోతుందా? ఏది మూలం? ఈ సమస్యలపై ఎవరేం చెప్పారు? కులం పోకుండా వివక్షత పోతుందా? ఇలాంటి ప్రశ్నలన్నింటిపైనా ఏళ్ళ తరబడి చర్చలు, వాదవివాదాలు సాగుతూ వస్తున్నాయి. ఈ చర్చ సాగించటంలో తప్పేమీ లేదు. పైగా ఇలాంటి చర్చ కూడా సమస్యలపై సరైన అవగాహన కోసం తప్పకుండా అవసరమే. అయితే చర్చోపచర్చలకే పరిమితం కావటం, ఆచరణకు తగు ప్రాధాన్యత ఇవ్వకపోవటం ప్రధాన లోపంగా ఉంది. ఏది ముందైనా, వెనకైనా ఆ చర్చల మంచిచెడుల సంగతెలా ఉన్నా, అంటరానితనం, కులవివక్ష యొక్క వివిధ దుష్ట రూపాలు తక్షణం ఎదిరించి పోరాడాల్సిన ఆచరణాత్మక సమస్యలుగా ఉన్నాయనే దాంట్లో ఎవరికీ సందేహం ఉండనక్కర్లేదు. అయినపుడు ఆ సమస్యలపైనే ఉమ్మడిగా కార్యక్రమాలు, కార్యాచరణలు, పోరాటాలు సాగించటానికి ఇబ్బందేమి ఉంటుంది? ఇది ఈ ఉద్యమ శ్రేయోభిలాషులందరూ తప్పకుండా తక్షణమే దృష్టి పెట్టాల్సిన అంశం కాదా?
ఇక మూడో విషయమేమంటే ఈ సమస్యలపై అంతో, ఇంతో ఆచరణ సాగిస్తున్న దళిత సంఘాలూ, కమ్యూనిస్టులూ పరస్పరం అనుమానంతో చూసుకోవటం, విమర్శించుకోవటం జరుగుతోంది. కమ్యూనిస్టులు కొన్ని కార్యక్రమాలు చేస్తే కూడా 'వీరికి ఇపుడు గుర్తొచ్చాయా? ఇప్పటిదాకా ఏం చేశారు. ఇపుడైనా దేనికోసం చేస్తున్నారు? లాంటి విమర్శలు కూడా కొన్ని ముందుకు రావటం మనం చూస్తున్నాం. దళితులను అస్తమానం వేధించే శక్తుల గురించి పల్లెత్తు మాట అనకుండా కమ్యూనిస్టులు ఇంకా సరిగా ఎందుకు చేయలేదు? అనే లాంటి విమర్శలు ఎవరికి మేలు చేస్తాయో మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల దళితులు, గిరిజనుల కోసం మరింత చురుకైన కార్యాచరణ కార్యరూపం దాల్చాలంటే ఈ సంఘాల మధ్య, కమ్యూనిస్టు పార్టీల మధ్య మరింత సయోధ్య అవసరం. రాజకీయ విషయాల్లో, ఇంకా ఇతర కొన్ని సమస్యలు, డిమాండ్ల విషయాలలో వీరి మధ్య సఖ్యత అప్పుడే సాధ్యమైనా, కాకపోయినా అంగీకరించిన సమస్యల్లోనయినా ముఖ్యంగా దళితుల ఆత్మగౌరవ సమస్యగానూ, మన దేశ అభ్యున్నతికి ఆటంకంగా తయారైన పరమ జాఢ్యంగానూ పరిణమించిన కుల సమస్యపై, వివక్షతా సమస్యలపై ఐక్యంగా ఉద్యమించటానికి ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన పనిలేదు. ఈ ఐక్యత సాధించగలిగితే వివిధ సమస్యలపై పాలకుల మెడలు వంచగలిగే శక్తి పెరుగుతుంది. ఇందువల్ల రాష్ట్రంలో శ్రామికుల ఉద్యమంలో ముఖ్యమైన మలుపు సంభవిస్తుంది. అణగారిన బతుకుల్లో కాంతిరేఖ కనిపిస్తుంది. రాష్ట్రంలో ఇందుకు సత్వరమే చొరవ చూపబడుతుందని ఆశిద్దాం. 
-తమ్మినేని వీరభద్రం
  

Prajashakti Telugu News Paper Dated : 12/5/2013