Wednesday, February 29, 2012

మావోయిజానికి మూలం ఉపాధి రహిత ప్రగతి--పాతూరి వెంకటేశ్వర్ రావు


- ‘అభివృద్ధి’కి అవినీతి జబ్బు 
- అణచివేత ఒక్కటే మిగిలిన ఆయుధం 
- సంపన్నులు- పేదల మధ్య అగాథం 
- మనది ఉపాధి రహిత అభివృద్ధే 
- దారిద్య్ర రేఖకు దిగువన 41 శాతం మంది 
- హింసతో మావోయిస్టులు ప్రజలకు దూరం 
- అవినీతి, దోపిడీతో ప్రభుత్వమూ దూరం 

moist-movent
తుపాకీతోనే రాజ్యాధికారాన్ని సాధిస్తామంటున్నారు మావోయిస్టులు. తుపాకీతోనే వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలిస్తామంటోంది ప్రభుత్వం. కానీ ఈ ఇరు పక్షాల మధ్యా ఎంతో మంది ప్రజానీకం నలిగిపోతున్నారు. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ గతంలో ప్రసంగిస్తూ ఉగ్రవాదం కంటె నక్సలిజమే ప్రమాదకరం, అందుకే నక్సలిజం నిర్మూలనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయా రాష్ట్రాల డీజీపీలను ఆదేశించారు. హోం మంత్రి చిదంబరం కూడా ఉగ్రవాద దాడుల్లో 26 మంది చనిపోతే, నక్సలైట్ల దాడుల్లో 297 మంది చనిపోయారు కాబట్టి ఉగ్రవాదుల కంటె నక్సలైట్లే ప్రమాదకారులని చెప్పారు. అంతేకాదు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలకు ప్రభుత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లిన మాట కూడా నిజం అంటూ మన్మోహన్‌ సింగ్‌ ఆ వాస్తవాన్ని కూడా అంగీకరించారు. 



అయితే, మావోయిస్టుల సమస్య పరిష్కారం కోసం రెండేళ్ళ క్రితంనాటి ‘అభివృద్ధి, అణచివేత’ విధానం అనే పాత పాటే పాడారు ప్రధాని. కానీ అభివృద్ధి, అణచివేత అనే జోడు గుర్రాల రథం మాత్రం నేటికీ గమ్యం దరిదాపుల్లోకి చేరలేకపోయింది. కారణం? అభివృద్ధి అనే అశ్వానికి అవినీతి జబ్బు సోకి పడకేసింది. కాబట్టి అభివృద్ధి అశ్వానికి సోకిన అవినీతి జబ్బును నయం చేసుకోకుండా, అణచివేత అశ్వాన్ని ఎంత అదలించినా ఆ రథం గమ్యం చేరుకోదు గాక చేరుకోలేదన్న వాస్తవాన్ని మన పాలకులు ఎప్పటికి గ్రహిస్తారు? 
నేడు మన దేశం అసమానాభివృద్ధిలో దూసుకు పోతున్నది. ఒకవైపు ప్రపంచ సంపన్నుల జాబితాలో 1.73 కోట్ల సంపన్నులతో రెండవ స్థానానికి ఎగబాకింది. అదే సమయంలో సగటు మానవాభివృద్ధిలో 177 దేశాల జాబితాలో మన దేశం 128వ స్థానానికి దిగజారిందనీ, దేశ జనాభాల్లో 77 శాతం మంది ప్రజలు రూ. 20 నుంచి రూ. 100 లోపు ఆదాయంతో బతుకులీడుస్తున్నారని, సంపన్నులు- పేదల మధ్య అగాథాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయనీ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 



అంతేకాదు, ఈ నాటి మన అభివృద్ధిని ఉపాధి రహిత అభివృద్ధిగా విశ్లేషిస్తున్నారు ఆర్ధిక నిపుణులు. ప్రపంచీకరణకు ముందు మన దేశ ఆర్ధికాభివృద్ధి రేటు 4 శాతంగా ఉన్నప్పుడు, ఉపాధి వృద్ధి రేటు 2 శాతంగా ఉండేది. కానీ ప్రపంచీకరణ తర్వాత మన దేశ ఆర్ధిక వృద్ధి రేటు 8 శాతం పెరిగితే, ఉపాధి రేటు మాత్రం 1 శాతం కంటె తక్కువకు పడిపోయింది. మనది ఉపాధి రహిత అభివృద్ధి అనేందకు ఇదే నిదర్శనం. అందువల్లనే దేశంలోని జనాభాలో 41 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉండిపోయారు. ఈ వాస్తవాన్ని ప్రపంచ బ్యాంకు నివేదికే ప్రకటించింది. 



మన దేశంలో ముఖ్యంగా ప్రపంచీకరణ తర్వాత కార్పొరేట్‌ సంస్థలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ యంత్రాంగం అవినీతి త్రిభుజంగా మారి దేశ సంపదను కొల్లగొడుతున్నారు. అవినీతి అనంతంగా పెరిగిపోయింది. ఫలితంగా అభివృద్ధి ఫలాలు పేద, బడుగు, బలహీన వర్గాలవారికి అందకుండా పోతున్నాయి. సంక్షేమ పథకాలలో 10 శాతం సైతం అర్హులకు దక్కడం లేదు. ఈ కారణంగా పేదలలో ప్రభుత్వాల పట్ల అవిశ్వాసం, అసహనం పెరిగిపోతున్నాయి. ధనంతో అధికారం, అధికారంతో ధనార్జన అనే ఒక విషవలయంగా మారింది మన దేశంలో రాజకీయం. అందుకే నేడు దేశం వేల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణాలలో పూర్తిగా మునిగి తేలుతున్నది. 



ప్రపంచీకరణ తర్వాత బహుళజాతి సంస్థలకు తలుపులు బార్లా తెరిచిన మన ప్రభుత్వం ప్రతి అంశాన్నీ వ్యాపారంగా మార్చివేసింది. వైద్యం, విద్య వంటి మానవతా రంగాలనుంచి కూడా తప్పుకుని వాటిని కార్పొరేట్‌ సంస్థలకు అప్పగిస్తున్నది. రైతులకు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులపై సబ్సిడీలు తొలగించింది ప్రభుత్వం. ప్రత్యేక ఆర్ధిక మండళ్ళ పేరిట ఆంధ్ర, ఒడిషా, చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ వంటి చోట్ల లక్షలాది ఎకరాల సాగు భూముల్ని, అటవీ భూముల్ని పరిశ్రమలు, విద్యుత్‌ ప్రాజెక్టులు, గనుల తవ్వకాలకోసం స్వాధీనం చేసుకుని ప్రైవేట్‌ సంస్థలకు కట్టబెడుతోంది. ఆదివాసుల్ని వారి భూముల్నించి, నివాసాలనుంచి తరమివేసే ప్రయత్నాలు చేస్తున్నది. సల్వాజుడుం, ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ వంటి మార్గాలలో అణచివేత చర్యలు చేపట్టింది. ఈ కీలక పరిణామాలవల్లనే బడుగు, బలహీన వర్గాల నిరుపేద, ఆదివాసీ ప్రజలు ప్రభుత్వం పట్ల విరక్తిని, మావోయిస్టులపట్ల ఆసక్తిని పెంచుకుంటున్నారు. 



అవిద్య, నిరుద్యోగం, అనారోగ్యం వంటి సమస్యలు సామాన్య ప్రజానీకాన్ని పట్టి పీడిస్తున్నాయి. బంజరు భూముల సమస్య, దేవాదాయ భూముల్ని పేదలు కాకుండా పెత్తందార్లే నామమాత్రపు కౌలుతో అనుభవించడం, సంపన్నులు అధిక వడ్డీలకు అప్పులిచ్చి పేదల్ని పీల్చి పిప్పి చేయడం, అధిక ధరల భారం, ఏడాదిలో కొద్ది రోజులే పనులు దొరికి ఆ తర్వాత ఉపాధి లేకపోవడం, శ్రామికుల శ్రమకు తగ్గ ప్రతిఫలం అందకపోవడం, అతివృష్టి, అనావృష్టి వల్ల కలిగే సమస్యలు, రేషన్‌కార్డులు తదితర పత్రాలకు కూడా లంచాలు ఇచ్చుకోవలసి రావడం వంటి సమస్యలు ప్రజల్ని సతమతం చేస్తున్నాయి. ఇంకా అంటరానితనం, పెత్తందారీ దౌర్జన్యం, బడుగు బలహీన వర్గాల పేద మహిళలపై అత్యాచారాలు, పోలీసు స్టేషన్లలో సామాన్యుల మొర వినేవారు లేకపోవడం వంటి పరిస్థితులన్నీ పేదలు మావోయిస్టులవైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్నాయి. 



అన్నల భయం వల్లనే మారుమూల ప్రాంతాల్లోకూడా ప్రభుత్వోద్యోగులు పని చేస్తున్నారనే అభిప్రాయమూ ఆయా ప్రాంతాల్లో నెలకొంది. అదే తీవ్రవాదుల పట్ల ప్రజా మద్దతుగా మారుతోంది. తుపాకీ ద్వారా రాజ్యాధికార సాధన గానీ, వామపక్ష తీవ్రవాద నిర్మూలన గానీ సాధ్యం కాదని దాదాపు 1970 నుంచి తుపాకీ సంస్కృతిలో మునిగి తేలుతున్న నక్సలైట్లు గాని, పాలకులు గాని ఏమాత్రం పురోగతిని సాధించలేదు. తుపాకీ సంస్కృతి వల్ల మావోయిస్టు ఉద్యమం ఎంతో మంది గొప్ప మేధావులను, నాయకులను, కార్యకర్తలను కోల్పోయింది. నాయకత్వ స్థాయిలోని వారు ఎందరో జైళ్ళలో మగ్గుతున్నారు. 32 మంది సభ్యులతో నిండుగా ఉండాల్సిన మావోయిస్టుల పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీలు 7గురు సభ్యులతో వెలవెలబోయాయి. పరదేశీనాయుడు, వ్యాస్‌, ఉమేష్‌ చంద్ర వంటి సమర్ధులు మెరికల్లాంటి అధికారులతో సహా ఎంతోమందిని పోలీసుయంత్రాంగం కోల్పోయింది. 



మల్హరరావు, మాధవరెడ్డి, శ్రీపాదరావు, రాగ్యానాయక్‌, మాగుంట సుబ్బరామిరెడ్డి వంటి రాజకీయ నేతలను ప్రభుత్వం కోల్పోయింది. ఈ ఉందంతాలన్నింటినీ మననం చేసుకుంటే- ఇటు మావోయిస్టులు, అటు ప్రభుత్వం కూడా ఇదంతా కాలం చెల్లిన వృథా విధ్వంసకాండ అని, ఈ విధానం ఎవరినీ లక్ష్యం దరిదాపులకు చేరనివ్వని అప్రయోజనకర విధానమన్న నగ్న సత్యాన్ని తప్పక దర్శించగలుగుతారు. 
వామపక్ష తీవ్రవాదానికి తావు లేకుండా చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే, దాని ఉనికికి ఆధారంగా ఉంటున్న ఆర్ధిక, సాంఘిక అసమానతల నిర్మూలనకు తక్షణం నడుం బిగించాలి. సరళీకృత ఆర్ధిక విధానాల ద్వారా అసమాన అభివృద్ధి దిశగా కాక, అభివృద్ధి ఫలాలు అందరికీ అందజేసేందుకు శ్రమించాలి. 



అవినీతి సమూల నిర్మూలనకు శ్రమించాలి. అందరికీ కూడు, గుడ్డ, వైద్యం, విద్య సమకూర్చే మానవతా దృక్పథం నుంచి ప్రభుత్వం వైదొలగరాదు. భూసంస్కరణలు చేపట్టాలి. ఉపాధి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలి. దేవాలయ భూములను పేదలకు కౌలుకు అందించే చర్యలు చేపట్టాలి. కౌలు రైతులకు రుణసౌకర్యం కల్పించాలి. ఆదివాసీలు, గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి. పోలీస్‌ స్టేషన్లు, న్యాయస్థానాలలో సామాన్యులకు తమ సమస్యల్ని పరిష్కరించుకునే అవకాశాలు కల్పించాలి. దేశ ప్రగతి ఫలాలు ప్రజలందరికీ అందజేయాలి. అప్పుడు తీవ్రవాద విస్తృతికి అవకాశాలు సన్నగిల్లుతాయి. 


venkateshwara
ఏ సమాజానికైనా ప్రేమ, అభిమానం, త్యాగం వంటి మానవతా విలువలే పునాదులు కావాలి. ఉద్యమకారులు తమ ఆశయం, సిద్ధాంతం, విధానాల ద్వారా ప్రజాభిమానాన్ని చురగొని వారిని సంఘటిత పరచడం ద్వారా మాత్రమే విప్లవాలు విజయవంతమవుతాయి. హింసాయుత పద్ధతులు, ప్రత్యర్ధుల భౌతిక నిర్మూలన ద్వారా ప్రపంచంలో ఏ విప్లవమూ విజయవంతం కాలేదని ఆధునిక ప్రపంచ చరిత్ర చాటి చెబుతున్నది. ప్రజామద్దతు లేకుండా చేసేవి విప్లవ కార్యక్రమాలనిపించుకోవు. అరాచకాలుగానే అపకీర్తిని మూటగట్టుకుంటాయి. అరాచకాల ద్వారా మావోయిస్టులు ప్రజాభిమానాన్ని పోగొట్టుకుంటూ ఉంటే- అవినీతి, అక్రమాలు, దోపిడీ, పీడన ద్వారా ప్రభుత్వమూ ప్రజలకు దూరమవుతున్నది. పాలకులైనా, వామపక్ష తీవ్రవాదులైనా గుర్తించవలసిన వాస్తవం- మన సమాజాన్ని ప్రస్తుత పరిస్థితులనుంచి కూడా సామ్యవాదం వైపు మళ్ళించడం సాధ్యమే. అయితే ఆ లక్ష్య సాధనకు నిరంతర శ్రమ, సుదీర్ఘ ప్రణాళికలతో కూడిన ప్రయోజనాత్మకమైన విలువైన త్యాగాలు అవసరం.
Surya Telugu News Paper Dated : 01/03/2012 

Tuesday, February 28, 2012

చారిత్రాత్మకం --సంపాదకీయం

చారిత్రాత్మకం 

భారత కార్మికవర్గం కొత్త చరిత్రను సృష్టించింది. రాజకీయ అభిప్రాయాలను, అనుబంధాలను పక్కన బెట్టి ఒక్కతాటిపై నిలిచింది. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది కార్మికులు, ఉద్యోగులు సార్వత్రిక సమ్మె జెండాను ఎత్తిపట్టి దృఢంగా నిలిచారు. ఫలితంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు స్తంభించాయి. పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. బ్యాంకింగ్‌, ఎల్‌ఐసి కార్యక్రమాలు నిలిచిపోయాయి. పలు రాష్ట్రాల్లో రవాణారంగానిదీ ఇదే పరిస్థితి. సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి, ఉద్యోగ, కార్మికసంఘాల్లో చీలికను తీసుకురావడానికి పాలకవర్గాలు చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. కార్మికవర్గంపై కత్తికట్టి సమ్మెను విచ్ఛినం చేయడానికి సర్కారీ గూండాలతో హత్యారాజకీయాలకు దిగిన పశ్చిమబెంగాల్‌లోనూ సమ్మెకు మంచి స్పందన లభించింది. సమ్మె ప్రచారంలో నిమగమైన ఇద్దరు సిపిఎం నేతలను బహిరంగంగా హత్యచేయడం, పెద్ద సంఖ్యలో అరెస్టులు చేయడం ద్వారా కార్మికవర్గాన్ని భయోత్పాతానికి గురిచేయాలన్న తృణమూల్‌ కుతంత్రం సంఘటిత శక్తిముందు విఫలమైంది. బెదిరింపులు,హుంకరింపులతో అక్కడక్కడా కొన్ని రాష్ట్ర బస్సు సర్వీసులను, తృణమూల్‌ గూండాల పహరాతో కొన్ని వాణిజ్యసంస్థలను బెంగాల్‌ ప్రభుత్వం తెరిపించుకోగలిగింది. కేరళ, ఒడిశా, త్రిపుర రాష్ట్రాల్లో సమ్మె నూరుశాతం విజయవంతమైంది. మెట్రోపాలిటన్‌ నగరాలైన ఢిల్లీ, ముంబయి, చెన్నైలలోనూ సమ్మె ప్రభావం గణనీయంగా ఉంది. అన్ని ప్రభుత్వ, ప్రభుత్వరంగ కార్యాలయాలు మూతపడ్డాయి. దేశ ఆర్థిక రాజధానియైన ముంబయిలో బ్యాంకింగ్‌ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. రిజర్వుబ్యాంకు ఆఫ్‌ ఇండియా క్లియరింగ్‌హౌస్‌కు తాళాలు పడటంతో ప్రైవేటు, విదేశీ బ్యాంకులు సైతం కార్యకలాపాలను నిలిపేసుకోవాల్సివచ్చింది. అనేక రాష్ట్రాల్లో పౌర రవాణా వ్యవస్థపైనా సమ్మె ప్రభావం పడింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ , ప్రైవేటు రంగసంస్థలు, పరిశ్రమలు మూతపడ్డాయి. అంగన్‌వాడీలతో సహా అసంఘటిత రంగ కార్మికులు సమ్మె బాట పట్టారు. రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. సమ్మెకు మద్దతుగా రాష్ట్రంలో వామపక్షపార్టీలు ఇచ్చిన బంద్‌ పిలుపునకు మంచి స్పందన లభించింది. పలు ప్రాంతాల్లో వాణిజ్యసంస్థలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. సాధారణ ప్రజానీకం నుండి సంఘీభావం వ్యక్తమైంది. బంద్‌లో భాగంగా రాష్ట్ర రాజధానిలో శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తున్న వామపక్షపార్టీల నాయకులను అరెస్ట్‌ చేయడం ద్వారా రాష్ట్ర కాంగ్రెస్‌ సర్కారు తన సహజ పెట్టుబడిదారీ, సంస్కరణల అనుకూల, కార్మిక ప్రజావ్యతిరేక వైఖరిని నగంగా బయటపెట్టుకుంది. రాష్ట్రంలో సమ్మె, బంద్‌ల సందర్భంగా ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా చోటుచేసుకోలేదు. కార్మిక, ఉద్యోగ సంఘాలతో పాటు వామపక్షపార్టీల నాయకులు, కార్యకర్తలు అత్యంత క్రమశిక్షణతో వ్యవహరించారు. అత్యంత శాంతియుతంగా సమ్మె, బంద్‌ జరుగుతుండటంతో ఓర్వలేకే సర్కారు ఈ అరెస్టులకు తెగబడింది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఐఎన్‌టియుసి, భారతీయ జనతా పార్టీకి చెందిన బిఎంఎస్‌లతో సహా 11 కేంద్ర కార్మిక సంఘాలు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక్కతాటిపైకి వచ్చి సమ్మెకు పిలుపివ్వడంతో పాటు, పాలకవర్గాలు అనుసరిస్తున్న సరళీకరణ ఆర్థిక విధానాలపై ప్రజానీకంలో పెల్లుబుకుతున్న ఆగ్రహం ఈ సమ్మెద్వారా వ్యక్తమైంది. అంతరాలను పెంచుతూ సంపదను కొందరి వద్దే కేంద్రీకృతం చేసే పెట్టుబడిదారీ విధానంపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చెలరేగుతున్న ఆగ్రహజ్వాలల సెగలు మనదేశాన్నీ తాకుతున్నాయి. సర్కారీ అభివృద్ధి లెక్కలు ఎలా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పెరుగుతున్న అంతరాలు ప్రజల ఆలోచనకు పదును పెడుతున్నాయి. అందుకే సార్వత్రిక సమ్మెలోనూ ఆ తరహా డిమాండ్లే ప్రధానంగా ముందుకొచ్చాయి. అధికధరలను అరికట్టాలి, ఫ్యూచర్‌ ట్రేడింగ్‌ను నిషేధించాలి, ప్రజాపంపిణీ వ్యవస్థను సార్వత్రికం చేయాలి వంటి డిమాండ్లు దేశ వ్యాప్తంగా సాధారణ ప్రజానీకాన్ని ప్రతిరోజూ సతమతం చేస్తున్న సమస్యలపై ఎక్కుపెట్టినవి! మిగిలిన డిమాండ్లు కూడ ఏ ఒక్క కార్మికరంగానికో, ఉద్యోగ రంగానికో సంబంధించినవి కావు. మరో మాటలో చెప్పాలంటే దేశ సార్వభౌమత్వ, స్వావలంబన పరిరక్షణకు ఈ డిమాండ్లే భవిష్యత్తులో కీలకంగా మారనున్నాయి. ఈ వాస్తవాన్ని గుర్తించారు కనుకే దేశవ్యాప్తంగా ప్రజానీకం సమ్మెకు పట్టం కట్టింది. కొత్త చరిత్రను సృష్టించింది. కేంద్రప్రభుత్వంతో పాటు, పాలకవర్గాలు ఈ పరిస్థితిని ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ప్రపంచీకరణ ముసుగులో సంపదను కొందరికే పరిమితం చేసి అత్యధికుల బతుకులను ఛిద్రం చేసే విధానాలకు స్వస్తిపలకాలి. దేశభవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విధానాల రూపకల్పన చేయాలి. సాధారణ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేయాలి. దీనికి భిన్నంగా జరిగితే గడిచిన రెండు దశాబ్దాల కాలంలో 13 సార్వత్రిక సమ్మెలను నిర్వహించి, 14వ సమ్మెనూ విజయవంతం చేసిన దేశ కార్మికవర్గం మరో చరిత్రను సృష్టించడానికి సిద్ధం కావడం అనివార్యంగా మారుతుంది.
Prajashakti News Paper Dated 29/02/2012

ప్రతిష్టంభనలో పెట్టుబడిదారీ వ్యవస్థ---ప్రభాత్‌ పట్నాయక్‌

ప్రతిష్టంభనలో పెట్టుబడిదారీ వ్యవస్థ

గ్రీస్‌లో చోటుచేసు కుంటున్న పరిణామాలు సమకాలీన ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో పేరుకుపోయిన రుగ్మతల్లో ఒక లక్షణం మాత్రమే. పెట్టుబడిదారీ వ్యవస్థలోని రుగ్మతలను సవివరంగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక ఆర్థిక వ్యవస్థగా పెట్టుబడిదారీ వ్యవస్థలో కొన్ని మౌలిక లక్షణాలను లోతుగా అధ్యయనం చేయాలి. పెట్టుబడిదారీ వ్యవస్థలో పెద్దయెత్తున ఒక చోట పోగుపడుతున్న సంపదలో అధిక భాగం ప్రత్యక్షంగా భౌతిక ఆస్తుల రూపంలో ఉండదు. అది పరోక్షంగా భౌతిక ఆస్తుల మీద కెయిమ్స్‌ రూపంలో అనగా డబ్బు, ద్రవ్య ఆస్తుల రూపంలో ఉంటుంది. ఈ పరోక్ష క్లెయిమ్స్‌లో కూడా అనేక దొంతరలు ఉంటాయి. ఒక కర్మాగారం, లేదా భవనం వంటి భౌతిక ఆస్తులపై సంపద కలిగిన వ్యక్తి క్లెయిమ్‌ మీద క్లెయిమ్‌. క్లెయిమ్‌ మీద క్లెయిమ్‌ ఇలా అనేక క్లెయిమ్స్‌ చేస్తుంటాడు. ఈ అన్ని క్లెయిమ్స్‌కు ఒక నిర్దిష్ట విలువ ఉంటుంది. ఈ విలువే అంతిమంగా ప్రాధాన్యత సంతరించు కుంటుంది. అయితే విలువ నిలకడగా ఉండదు, ఎప్పటికప్పుడు మారుతుం టుంది. సరుకుల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. మారేది వాటి విలువలే. అస్థిత్వంలేని బుడగలు (అవి పేలిపోవడాలు) ఈ క్లెయిమ్స్‌ చూపుతుంటాయి. డాట్‌కామ్‌ బబుల్‌, హౌసింగ్‌ బబుల్‌, ఆ తరువాత కుప్పకూలడాలు వంటి పదాల గురించి మనం తరచూ ప్రస్తావిస్తూ ఉంటాం. ఇవి సరకుల ద్రవ్య విలువకు సంబంధించిన అన్ని రకాల క్లెయిమ్స్‌పైనా ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితి పెట్టుబడిదారీ వ్యవస్థలో మరింత అధికంగా ఉంటాయి. అటువంటి పతనాలను ఎలా నిరోధించగలుగుతాం? సరుకులకు సంబంధించి ద్రవ్య విలువను ఎలా నిలకడగా ఉంచగలుగుతాం?
ఏ దేశంలోనైనా వస్తువులకు సంబంధించి ద్రవ్య విలువ ప్రభుత్వ ఆదుపాజ్ఞలకు లోబడి ఉంటుందని భావించడం పొరపాటు. విలువలేని కాగితం ముక్కలు వస్తువులను కొనగలుగుతున్నాయి. దాని మీద ఉన్న ప్రభుత్వ చిహ్నమే ఆ కాగితం ముక్కలకు అంతటి విలువను ఆపాదిస్తోంది. ఈ కాగితాల రూపంలోనే ప్రభుత్వం పన్నులను వసూలు చేస్తోంది. గాడి తప్పిన ద్రవ్యోల్బణం పరిస్థితిని మనం విశ్లేషించాలి. ద్రవ్యోల్బణం కారణంగా ద్రవ్యానికి వస్తు రూపంలో విలువ తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో డబ్బు కలిగి ఉండాలని గానీ, ద్రవ్య ప్రాబల్యం గల ఆస్తులు కలిగి ఉండాలని గానీ ఏ ప్రభుత్వం తన పౌరులను ఆదేశించలేదు. అది మన వ్యవస్థల్లోని అంతర్గత లోపం. నగదు వేతనాలు ఒక నిర్ణీత కాలంలో స్థిరంగా ఉంటాయి. నిదానంగా మాత్రమే పెరుగుతాయి. ఏ ఆర్థికవ్యవస్థలోనైనా ద్రవ్య విలువ ఈ అంశంపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఒక వస్తువు విలువ దానికోసం వినియోగించిన కార్మిక శక్తిపై ఆధారపడి ఉంటుంది.
పెట్టుబడిదారీ వ్యవస్థలో పూర్తి స్థాయి
ఉద్యోగావకాశాలు అసాధ్యం
రిజర్వు కార్మిక సైన్యాన్ని ఏర్పాటుచేసుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ధరలు పెరిగినపుడు వేతనాలు పెంచమని కార్మిక సంఘాలు ఒత్తిడి తీసుకురాకుండా వాటిని బలహీనపరచడం ఈ రిజర్వ్‌ సైన్యం నిర్వహించే పాత్ర. పెట్టుబడిదారీ వ్యవస్థలో పూర్తి స్థాయిలో ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు. పెట్టుబడిదారీ వ్యవస్థలో పూర్తి స్థాయి ఉద్యోగావకాశాలను ద్రవ్య విలువతో పోల్చడం సాధ్యం కాదు.
అయితే, నగదు వేతనాలు అంటే కార్మిక శక్తి విలువ ప్రతి దేశంలో ఒకే విధంగా ఉన్నంతమాత్రాన సరిపోదు. ఒక దేశంలో కార్మిక శక్తి వినియోగం ఆ దేశంలో అమలులో ఉన్న వేతనాల రేటు (మారకపు రేటుకు అనుగుణంగా) డాలరు ధరకు సరుకులను ఉత్పత్తి చేస్తే ఆ డాలరు ప్రాతిపదికపైనే ఆ సరుకులను విక్రయించాల్సి ఉంటుంది. అయితే ఆ సరుకులను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోతే ఆ దేశంలో ఆ ఆస్తుల యాజమాన్య హక్కులు పొందినవారు వ్యాకులత చెందుతారు. వారు ఉత్పత్తి చేసిన వస్తువులపై ఆస్తుల విలువ ఆధారపడి ఉంటుంది. అయితే సరుకులు అమ్ముడుపోకపోతే అంతర్జాతీయంగా ఎటువంటి విలువ ఉండదు. ఇలా అమ్ముడుపోని వస్తువులు, అంటే నగదు రూపంలో మార్చుకోవడానికి వీలులేని వస్తువులు ద్రవ్యంతో సమానం కాలేవు.
ఒక దేశంలో ఫైనాన్షియల్‌ ఆస్తులపై హక్కులు గలవారు ఆ హక్కులు గలిగి ఉండటంపై ప్రతిబంధకాలను ఎదుర్కొంటుంటే (ఇటువంటి సందర్భాల్లో వారికి మిగిలి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం సరుకులను విక్రయించకుండా తమ వద్దే ఉంచుకోవడం), లేదా తమ హక్కులను ఒక దేశం నుండి మరొక దేశానికి బదిలీ చేసుకోగలిగితే, అంటే, పెట్టుబడులను స్వేచ్ఛగా ప్రపంచంలోని దేశాల మధ్య బదిలీ చేసుకోవడానికి అవకాశముంటే, ఏ దేశంలోనైనా నగదు రూపంలో చెల్లించే వేతనాలు స్థిరంగా ఉండటమే కాదు, వాటికి ఒక కచ్చితమైన స్థాయి కూడా ఉండాలి. ఆ స్థాయి మారకపు విలువకు అనుగుణంగా ఉండాలి. ఈ మారకపు రేటు అంతర్జాతీయంగా సరితూగే విధంగా ఉండాలి.
ఇక్కడ ఒక విషయం గమనించాలి. అంతర్జాతీయ పోటీతత్వం అనే పదానికి పెద్దగా విలువ లేదు. ఒక వస్తువును పరిగణనలోకి తీసుకుంటే ఒక దేశం అంతర్జాతీయ పోటీకీ సరి తూగేదిగా ఉండవచ్చు. అయితే ఆ దేశంలో ఉత్పత్తి అయిన సరుకులు అంతర్జాతీయంగా అమ్ముడుపోకపోవచ్చు. అందుకు అనేక కారణాలుంటాయి. ఆ వస్తువు మీద ఇష్టం లేకకావచ్చు లేక ఆ వస్తువు గురించి తెలియకపోవడం వల్ల కావచ్చు. అందువల్ల ఒక దేశంలోని ఆస్తులపై హక్కును ప్రకటించుకునే వ్యక్తులు చెల్లింపుల పరిస్థితిని ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు. వేతన ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ వారు ఇతర దేశాలకు తరలివెళ్లేందుకు ఆసక్తి చూపుతారు.
ఏదైనా ఒక దేశం చెల్లింపుల సమతుల్య పరిస్థితి ఆ దేశం తీసుకునే చర్యలపైనే పూర్తిగా ఆధారపడి ఉండదు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది. మొత్తం డిమాండ్‌ పడిపోయిందంటే, కొన్ని దేశాల ఉత్పత్తులకు డిమాండ్‌ పడిపోయిందని అర్థం చేసుకోవాలి. అంతర్జాతీయ పోటీతత్వానికీ, దీనికీ సంబంధం లేదు. అయితే ఇక్కడ చెల్లింపుల సమతుల్య పరిస్థితి ఎదురవుతుంది. ఉదాహరణకు, అమెరికా ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గిస్తే ఒక వస్తువుకు ప్రపంచ డిమాండ్‌ తగ్గుతుందని భావిద్దాం. ఇందువల్ల అమెరికాలో కొంతమంది అధికారులు తమ ఉద్యోగాలు కోల్పోతారు. లేదా వారి ఆదాయం తగ్గిపోతుంది. వారు తమ సెలవులను గ్రీస్‌ దేశంలో ఉల్లాసంగా గడిపేందుకు వెళితే, వారు పెట్టే ఖర్చు గ్రీస్‌ చెల్లింపుల పరిస్థితిని మరింత జటిలం చేస్తుంది. దీనికీ, గ్రీస్‌ అంతర్జాతీయ పోటీకి సరితూగడానికీ ఎటువంటి సంబంధం ఉండదు. పోటీతత్వమే చెల్లింపుల పరిస్థితిని నిర్ణయిస్తుందనే ప్రధాన స్రవంతి ఆర్థిక సిద్ధాంతం పూర్తిగా తప్పుల తడక అనే చెప్పాలి. గ్రీస్‌లో పెట్టుబడులు విదేశాలకు తరలిపోకుండా చూసేందుకై గ్రీస్‌ ప్రభుత్వం తమ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ తగ్గేందుకు చర్యలు తీసుకోవాలి. తద్వారా దిగుమతులపై ఆధార పడాల్సిన పరిస్థితి ఆ దేశానికి ఉండబోదు. ఫలితంగా, చెల్లింపుల సమస్య తీవ్రత తగ్గుతుంది. గ్రీస్‌లో పెట్టుబడిదారులు దీనినే డిమాండ్‌ చేస్తు న్నారు. అయితే ఇందువల్ల గ్రీస్‌ ప్రజలపై అనివార్యంగా భారాలు పెరుగుతాయి. ఇప్పటికే గ్రీస్‌లో ఉత్పత్తి అయ్యే వస్తువులకు ప్రపంచదేశాల్లో డిమాండ్‌ తగ్గిపోయింది. ఈ చర్య వల్ల నిరుద్యోగం పెరిగి, వినియోగం పడిపోయే అవకాశాలున్నాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభం కూడా తీవ్రమయ్యే అవకాశం ఉంది.
కార్మికుల సంఖ్యను తగ్గించడం
ఈ ఉదాహరణలో గ్రీస్‌ ముందు మరో రెండు ప్రత్యామ్నాయాలున్నాయి. మారకపు రేటుపై ప్రభావం చూపకుండా నగదు వేతనాలను తగ్గించడం ఇందులో ఒకటి. ఇందువల్ల ఇతర దేశాలతో పోలిస్తే గ్రీస్‌లో వస్తువుల ధరలు తక్కువగా ఉంటాయి. చెల్లింపుల పరిస్థితి కూడా మెరుగుపడవచ్చు. అయితే, నగదు వేతనాల్లో తగ్గుదల కంటే సరుకుల ధరలు ఎక్కువగా తగ్గుతాయి. కార్మికుల సంఖ్యను తగ్గించడం వల్ల కూడా ఇదే ఫలితం సంభవిస్తుంది. మారకపు రేటును తగ్గించడం మరో మార్గం. అయితే ప్రస్తుత పరిస్థితిలో గ్రీస్‌లో ఇది సాధ్యం కాదు. గ్రీస్‌ తనకంటూ ప్రత్యేకంగా కరెన్సీ లేని దేశం, యూరోపియన్‌ దేశాల ఉమ్మడి కరెన్సీగా యూరో ఉంది. మారకపు రేటు తగ్గించాలంటే వేతనాలను కూడా తగ్గించాల్సి ఉంటుంది. డిమాండ్‌ పెరగకపోతే గ్రీస్‌ నేడు ఎదుర్కొంటున్న పరిస్థితినే అనేక ఇతర దేశాలు ఎదుర్కొంటాయి. ఏతావాతా, మారకపు రేటును తగ్గించడం వల్ల అదే పరిస్థితిలో ఉన్న ఇతర దేశాలు అందుకు ప్రతీకార చర్యలు తీసుకునే అవకాశం ఉంది. చెల్లింపుల పరిస్థితిలో మిగులు ఉన్న దేశాలు కూడా నిరుద్యోగం, మాంద్యం ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. అవి కూడా తమ మార్కెట్లను కోల్పోవడం ఇష్టం లేక ప్రతీకార చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది. స్థూలంగా, విదేశీ మారక రేటు తగ్గించడం అంటే, పొరుగువాడిని దేబిరించడమే. ప్రపంచం మాంద్యం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఇటువంటి చర్య తీసుకుంటే, అది ఇతర దేశాలతో శత్రుత్వాన్ని కొనితెచ్చుకోవడమే కాగలదు.
పెట్టుబడి, ముఖ్యంగా ఫైనాన్స్‌ స్వేచ్ఛగా ఏ ప్రాంతానికైనా మళ్లే అవకాశం ఉండే ప్రపంచంలో ఆరంభంలో డిమాండ్‌ తగ్గితే, పొదుపు చర్యల ద్వారా దానిని భూతద్దంలో పెట్టి చూపడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రతి ప్రభుత్వం చేసేది పొదుపు చర్యలను ప్రవేశపెట్టడమే. దేశీయ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి. నేడు గ్రీస్‌లో మనం ఇదే పరిస్థితిని చూస్తున్నాం. అక్కడ సంక్షోభం పేరుతో ప్రభుత్వం పొదుపు చర్యలను ప్రవేశపెడుతోంది. ఇందులో రెండు అంశాలను గమనించాలి. ఫైనాన్స్‌ క్యాపిటల్‌ ప్రయోజనాల కోసమే పొదుపు చర్యలను ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వం తీసుకునే పొదుపు చర్య, దిగజారిపోయే కార్మికుల స్థితిగతులు పెట్టుబడిదారీ వ్యవస్థ సామర్ధ్యాన్నే ప్రశ్నిస్తున్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక నిర్దిష్ట ప్రణాళికకు అనుగుణంగా రూపొందిన వ్యవస్థ కాదు. అది దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా స్వచ్ఛందంగా రూపొందిన ఒక వ్యవస్థ. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే, అసలు ప్రపంచ యుద్ధాలు వచ్చి ఉండేవి కావు.
ఇక రెండో అంశం, పూర్తిగా సాంకేతిక పరమైంది. గ్రీస్‌ స్వతంత్రంగా ఒక కేంద్రీయ బ్యాంకు కలిగి ఉంటే ప్రభుత్వం ఆ బ్యాంకు నుండే రుణాలు చేసి ఉండేది. విదేశీ బ్యాంకులకు రుణపడే సమస్య ఉత్పన్నమై ఉండేది కాదు. పొదుపు చర్యలను ప్రకటించాల్సిన పరిస్థితీ తలెత్తేది కాదు. చెల్లింపుల పరిస్థితి కారణంగానే దేశ రుణ సమస్య తలెత్తింది. అనేక దేశాల పరిస్థితి కూడా ఇదే. ప్రభుత్వం విదేశీ బ్యాంకుల నుండి కాకుండా కేంద్ర బ్యాంకు నుండి రుణం స్వీకరించి ఉంటే, గ్రీస్‌ తన చెల్లింపుల పరిస్థితిని ఎదుర్కొనేందుకు విదేశాల నుండి రుణం సేకరించేందుకు అవకాశం ఉండేది. దిగుమతులు తగ్గుతున్నా, ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గించుకోకపోవడం వల్ల చెల్లింపుల పరిస్థితి ఏర్పడి ఉండేది. ప్రభుత్వం చేసే రుణం దీంతో సమానంగా ఉండేది. దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అదనంగా కరెన్సీ ముద్రించడంతో సమస్య పరిష్కారమై ఉండేది..
-ప్రభాత్‌ పట్నాయక్‌
Prajashakti News Paper Dated 29/2/2012

Monday, February 27, 2012

హైమన్‌డార్ఫ్ అనుబంధం



మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ వోన్ ఫ్యూరర్ హైమ న్‌డార్ఫ్‌కు గిరిజన సంప్రదాయాల ప్రకారం, అంతి మ సంస్కారాలు జరిపించడానికి ఆయన కుమారుడు నికోలస్ తదితరులు ఆదిలాబాద్ జిల్లా, జైనూర్ మండలం మార్లవాయి గ్రామానికి రావడం స్థానిక గిరిజనులతో ఆయనకున్న అను బంధానికి నిదర్శనం. నిజాం కాలంలో సతీమణి ఎలిజబెత్‌తో కల్సి హైమన్‌డార్ఫ్ ఆదివాసీ జీవితాలను అధ్యయనం చేసేం దుకు ఆదిలాబాద్ జిల్లా మారుమూల పల్లెలో 1941లో అడుగుపెట్టారు. అక్కడే ఒక గుడిసెలో ఏళ్ళ తరబడి వుండిపోయారు. ఆయన గిరిజన సమస్యలపై తీసుకున్న చొరవ వల్ల, నాటి నిజాం ప్రభుత్వం హైమన్‌డార్ఫ్‌ను రాష్ట్ర గిరిజన, వెనుకబడిన వర్గాల సంక్షేమశాఖ సలహాదారుడిగా ఎంపిక చేసింది. ఆయన ఆదివా సుల జీవితాలను, సమస్యలను అధ్యయనం చేస్తూ వారి ప్రేమా భిమానాలను చూరగొన్నా రు.
గోండుల,చెంచులపై అధ్యయనం హైమన్‌డార్ఫ్‌కు ప్రధాన అంశంగా మారింది. ఆయన ప్రయాణం చేసిన గిరిజన ప్రాంతాలు చాలావరకు అంత కు ముందు ఎవరూ వెళ్లనివే! అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపక వృత్తిని కూడా కొంతకాలం చేశారు. హైమన్‌డార్ఫ్ చొరవతోనే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మానవ పరిణామ శాస్త్ర విభాగాన్ని ఏర్పాటయింది. ఆ శాఖలో మొదటి బ్యాచ్ విద్యార్థిగా చదివిన వారు వరంగల్ వాసి పి. కమలా మనోహరరావు.ఆ తరు వాత కాలంలో ఆయన ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ ప్రథ మ డైరెక్టర్‌గా పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖలో భాగంగా షెడ్యూల్డ్ తెగల- వర్గాల సంక్షేమానికి ప్రత్యేక విభాగాన్ని ఆరంభించడానికి కూడా హైమన్‌డార్ఫ్ కారకులు. ఆ శాఖలో ట్రయినీ నిర్వాహకుడిగా పనిచేసేందుకు కమలా మనోహర్ రావును హైమన్‌డార్ఫ్ ఎంపిక చేశారు. కమ లా మనోహరరావు ప్రథమ గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా (1966లో ఆ శాఖ ఏర్పడినప్పుడు) బాధ్యతలు స్వీకరించి 1975లో పదవీ విరమణ చేసిందాకా ఆ శాఖలోనే పనిచేశారు. 

పాలనా సంస్కరణల కమిషన్ వేసినప్పుడు కమలా మనో హర్ రావు చేసిన సూచనలు విలువైనవి. ఆయన నివేదిక హైమన్‌డార్ఫ్ ప్రశంసలను అందుకున్నది. ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన సంక్షే మ పాలనా విధానాన్ని క్రమబద్ధం చేయడానికి కమలా మనోహరరావు ఏక గవాక్ష పద్ధతిని సూచించారు. హైమన్‌డార్ఫ్ స్వదస్తూరీతో కమలా మనోహరరావుకు ఈ నివేదిక విషయంలో సుదీర్ఘమైన ఉత్తరం రాశారు.ఆ నివేదిక తయారుచేసినందుకు కమలా మనోహరరావును అభినందించారాయన. గిరిజన ప్రాంతాలలో విప్లవాత్మకమైన మార్పులకు సంబంధించి మనోహర రావు చేసిన విశ్లేషణలను హైమన్‌డార్ఫ్ పొగిడారు. ఆ నివేదికలో గిరిజన ప్రాంతాలలో ప్రాజెక్ట్ అధికారి ఏర్పాటుకు సంబంధించిన అంశం కూడా వుంది. కలెక్టర్‌తో సమానమైన అధికారిక హోదాకల ప్రాజెక్ట్ అధికారి నియామకం ఆవశ్యకతను హైమన్‌డార్ఫ్ గట్టిగా సమర్థించారు. గిరిజన సహకార సంస్థ పనితీరుకు సంబంధించి, స్వతంత్ర ప్రతిపత్తిగల గిరిజన సాంస్కృతిక పరిశోధనా శిక్షణా సంస్థ ఏర్పాటు గురించి, సచివాలయ స్థాయిలో షెడ్యూల్డ్ ప్రాంతాల వ్యవహారంలో పాలనాపరమైన మార్పుల గురించి ఆ నివేదికలో పేర్కొన్న అంశాలన్నీ హైమన్‌డార్ఫ్ అభినందనలందుకున్నాయి.

సాంఘిక సంక్షేమ శాఖలో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి న షెడ్యూల్డ్ తెగల- వర్గాల విభాగాన్ని పటిష్టం చేయడానికి హైమన్‌డార్ఫ్ తన శిష్యుడు, కమలా మనోహరరావును ఎంపిక చేసుకున్నారు. ఆ కలయిక ఫలితంగానే వరంగల్ జిల్లా లో హైదరాబాద్ గిరిజన ప్రాంతాల నియంవూతణ చట్టం 1949 అమలుకు నోచుకుంది. దరిమిలా హైమన్‌డార్ఫ్ సూచనతో, వారిరువురి కృషి ఫలితంగా, సాంఘిక సంక్షేమ శాఖ నుంచి గిరిజన సంక్షేమ శాఖను వేరు చేయడం జరిగింది. దానికి డైరెక్టర్‌గా కమలా మనోహర రావును ఎంపిక చేసింది ప్రభుత్వం. ఏ ప్రాంతంలోనైతే హేమెన్‌డార్ఫ్ ఆయన సతీమణి ఎలిజబెత్‌తో కలిసి, గిరిజనుల సంక్షేమం కొరకు ఏళ్ల తరబడి కృషి చేశా రో, అవే పరిసరాలలో, వారిద్దరినీ శాశ్వతంగా గుర్తుంచుకునేందుకు జ్ఞాపక చిహ్నాలను ఏర్పాటుచేయడం అభినందించాల్సిన విషయం. ఇప్పుడు, ఇన్నేళ్లకు మళ్లా ఆ ప్రాంతానికి ఆయన కుమారుడు, మనుమడు వచ్చి వారికి నివాళులర్పించడం విశేషం.

-వనం జ్వాలా నరసింహారా
Namasete Telangana News Paper Dated 28/02/2012 

Are we ready for spiritual democracy?--Kancha Iilaiah




Sunday, February 26, 2012

ఆదివాసీల ఆప్తుడు బియ్యాల


ఆదివాసీల ఆత్మబంధువుగా, మలిదశ తెలంగాణ పోరాటానికి మార్గదర్శిగా నిలిచిన ప్రొఫెసర్ జనార్దన్‌రావు తెలంగాణ సకల జనుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు. ఆది నుంచీ ఆదర్శ భావాలతో మెలిగిన ఆయన జీవితం, తొలి అనుబంధం ఆదివాసులతోనే. మలి అనుబంధం తెలంగాణ కోసం సాగింది. ఆయన వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామంలో బియ్యాల కిషన్‌రావు, అంజనమ్మ దంపతులకు 1955 అక్టోబర్ 12 న జన్మించారు. బాల్యంలోనే జనార్దన్‌రావు కుటుంబం కొత్తగూడెం మండలంలోని ఏజన్సీ ఓటాయి గ్రామానికి వలస వెళ్ళింది. అందుకే ఆయన ఓటాయి వాసిగానే సుపరిచితుడు. పేద కుటుంబం. కష్ట నష్టాలు చదువుకు అడ్డం కాదంటూ తన పొరుగు గ్రామమైన సాధిడ్డిపల్లిలోని ఆశ్రమ గిరిజన పాఠశాలలో ఏడో తరగతి వర కు చదువుకున్నారు. పదవ తరగతి నర్సంపేటలో చదివారు. అలాగే ఇంటర్ విద్య గోదావరిఖనిలో, డిగ్రీ హన్మకొండ ఎల్బీ కళాశాలలో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంఏ)కాకతీయ యూనివర్సిటీలో కొనసాగింది. 

చిన్ననాటి నుంచి తను ఏజెన్సీ గ్రామంలో నివసించడం మూలాన, ఆదివాసీలతో ఏర్పడిన అనుబంధంతో వారి సంప్రదాయ వారసత్వ జీవన విధానమును ఆకళింపు చేసుకున్నారు. మరోపక్క ఏజెన్సీ భూములు, అటవీ వనరులు పరాయికరణ చెందడంపై ఆవేదన చెందారు. ఎలాంటి చైతన్యం లేని ఆదివాసీలకు చెందిన భూములు 1960లోపే 4 శాతం వలస గిరిజనేతర గూండాలు, పెత్తందార్లకు అన్యాక్షికాంతమయ్యాయి. ఆ దశలో ఆదివాసీల భూ సమస్యలు, స్వయం పాలన ఉద్యమాలపై పరిశోధన చేసి వారి సంక్షేమానికి తోడ్పాలనే సంకల్పంతో ఎంతో కృషి చేశారు. బియ్యాల 193లో కాకతీయ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినివూస్టేషన్ విభాగంలో పార్ట్‌టైం ఆధ్యాపకుడుగా చేరారు. ఆదివాసులపై లోతైన పరిశోధనలకు పూనుకున్నారు. ఆయన ‘గిరిజన భూముల పరాయికరణ’ అనే అంశంపై పరిశోధన చేసి 195లో పీహెచ్‌డీ పట్టా పొందారు. తదనంతరం 1990 నుంచి అసిస్టెంట్ ప్రొఫసర్‌గా, ప్రొఫెసర్‌గా పనిచేస్తూ 1993 నుంచి 1995 వరకు ఆంధ్రవూపదేశ్‌లో ఆదివాసీ ఉద్యమాలు, 1/70 చట్టం, ఏజెన్సీ ప్రాంత గ్రామీణ సమస్యలపై దృష్టిపెడుతూ.. ఆదివాసులపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందిన తొలి గిరిజనేతర వ్యక్తి జనార్దన్ రా వే కావడం విశేషం.

బియ్యాల జనార్దన్‌రావు సామాజిక స్పృహతో 62 జాతీయ సెమినార్‌లలో పరిశోధనా పత్రాలు సమర్పించారు. అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాలలో జరిగిన 11 అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొన్నారు. 
‘మట్టిపూలు’,‘ఆదివాసీ సమాజం-సమస్యలు’, ‘ఆదివాసులు-స్వ యంపాలన’, ‘భారతదేశంలో ప్రభుత్వం-భూస్వామ్య రైతులు’ అనే పుస్తకాలను, 42 వ్యాసాలను ప్రచురించారు. 1993-95 మధ్యకాలంలో ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్’ న్యూఢిల్లీ పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా ఎంపికయ్యారు. ఆయన వివిధ జాతీయ స్థాయి పరిశోధనా ఆధ్యయన కమిటీలలో సభ్యులుగా ఉంటూ, జర్మనీ సామాజిక శాస్త్రవేత్తల సహకారంతో ‘మూడవ ప్రపంచ దేశాల పాలనా వ్యవస్థ - అభివృద్ధి’, గ్రామీణ గిరిజన సమాజాల ఆధ్యయనం, దేశీయ వనరుల వినియోగం, వలసవాద సమకాలీన ప్రభుత్వ విధానాల విశ్లేషణ వంటి వాటిపై తన పరిశోధనా దృష్టిని సారించారు. 

2001 కాలంలో కాకతీయ యూనివర్సిటీలోని పబ్లిక్ అడ్మినివూస్టేషన్ విభాగంలో జనార్దన్‌రావు ‘డీన్’ గా నియమితులయ్యారు. బియ్యాల మలిదశ ‘తెలంగాణ’ ఉద్యమానికి తొలి సిద్ధాంతకర్తగా భూమిక పోషించారు. తెలంగాణలో జరుగుతున్న వివక్ష, అణచివేతల గురించి అనేక రచనలు చేశారు. అదేకాలంలో ప్రొఫెసర్ జయశంకర్‌తో కలిసి అమెరికాలో జరిగిన ‘తానా’ సభల్లో పాల్గొని ఆంధ్రవూపదేశ్‌లో అభివృద్ధి అసమానతలు, ప్రాంతీయ అసమానతలపై ప్రసంగించి తెలంగాణ ఉద్యమానికి అంత ర్జాతీయంగా సమ్మతిని కూడ గట్టారు. సమైక్య రాష్ట్రంలో ‘నీళ్లు- నిధులు- నియామకాలు’ పంపిణీల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని మొదటిసారిగా లేవనెత్తిన ఘనత జనార్దన్‌రావుకే దక్కుతుంది. సమైక్యపాలనలో తెలంగాణకు ఇచ్చిన హామీలు, చేసుకున్న ఒప్పందాలు, ఎట్లా ఉల్లంఘించ బడ్డాయో ఎండగడుతూ.. విద్యార్థులు, మేధావుల్లో ప్రచారం చేయడంలో ప్రొఫెసర్ జనార్దన్‌రావు ప్రధాన భూమికను నిర్వహించారు. జనార్ధన్‌రావు ఒకరు తెలంగాణ కోరితే రాష్ట్రం ఏర్పడుతుందా? అన్న ప్రశ్నలను సైతం సంధించుకుని తన సహచరి ప్రొఫెసర్ రేవతి తోడ్పాటుతో ముందడుగు వేశారు. ఉద్యమాచరణలో ముందున్నారు. మూడు తరాల ప్రతినిధి కాళోజీ, ప్రొఫెసర్ జయశంకర్‌లతో సమ ఉజ్జీగా నిలిచి వారితో కలిసి ఉద్యమంలో పనిచేశారు. 2001లో ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ ఉద్యమ పార్టీ ఆవిర్భావంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కేసీఆర్‌తో కలిసి పార్టీ మేనిఫెస్టోను రూపొందించడంలో పాలుపంచుకున్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి విషయంలో, ప్రజాపరిపాలన, శాంతిభవూదతల విషయంలోనూ ప్రభుత్వానికి ఆయన పలు సూచనలు చేశారు. 1999 లో కన్నాబిరాన్, ఎస్‌ఆర్ శంకరన్ తదితరులతో కలిసి ప్రభుత్వం నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలనే ఎజెండా ముందుకు తెచ్చారు. ఆదివాసీలను చైతన్య వంతులను చేస్తూ ఆదివాసీ ఉద్యమంతోపాటుగా, తెలంగాణ ఉద్యమానికి జనార్దన్‌రావు ఎనలేని సేవలు చేశారు. బియ్యాల జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం తపన పడ్డారు. గిరిజనుల స్వయం పాలన కోసం రాజరికపు వ్యవస్థపై వీరోచితంగా పోరాడి నేలకొరిగిన ‘సమ్మక్క- సారలమ్మ’ జాతర జరుగుతున్న సమయంలో ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్‌రావు 2002 ఫిబ్రవరి 27న ప్రకృతి ఒడిలో చేరిపోయారు. జనార్ధన్‌రావు ఉద్యమ స్ఫూర్తి ఆదివాసీ గిరిజనుల గుండెల్లోనూ,మలిదశ తెలంగాణ ఉద్య మంలోనూ సజీవంగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా, ఉద్యమ కార్యకర్తగా, యావత్ తెలంగాణ ప్రజల మదిలో అనుక్షణం మెదులుతూనే ఉంటారు. మార్గదర్శకత్వం వహిస్తూనే ఉంటారు. ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్‌రావు ఆశయమైన ఆదివాసులకు స్వయం పాలన, తెలంగాణ రాష్ట్రసాధనకోసం ఆయన మిత్రులుగా, అభిమానులుగా పోరాడు దాం.అదే ఆయనకు మనం అర్పించే ఘనమైన నివాళి! 
- గుమ్మడి లక్ష్మీనారాయణ
ఆదివాసీ రచయితల సంఘం
(నేడు.. ప్రొఫెసర్. జనార్దన్‌రావు పదవ వర్ధంతి.
Namasete Telangana News Paper Dated 27/02/2012 

నిద్రపో, హైమన్‌డార్ఫ్!


ఆదివాసుల జీవితాలపై చెరగని ముద్ర వేసిన గొప్ప గిరిజన అధ్యయన వేత్త హైమన్‌డార్ఫ్ చితా భస్మాన్ని ఆయన కుమారుడు లచ్చు పటేల్ ఆదిలాబాద్ జిల్లాలోని మార్లవాయి గ్రామానికి తీసుకు రావడం, స్థానిక గిరిజనులు సమాధి చేయడం ఉద్వేగభరిత సన్నివేశం. తెలంగాణ గడ్డతో జీవితం పెనవేసుకున్న అంతర్జాతీయ స్థాయి ప్రముఖుల్లో హైమన్‌డార్ఫ్ ఒకరు. తెలంగాణ సమాజ స్మృతి ఫలకంపై హైమన్‌డార్ఫ్ స్థానం చెక్కుచెదరనిది. పరిశోధనకే పరిమితమై పోకుండా,గిరిజనుల శ్రేయోభివృద్ధికి పాటుపడిన మహనీయుడు హైమన్‌డార్ఫ్.ఈశాన్య ప్రాంత గిరిజనులపై మొదట అధ్యయనం సాగించిన హైమన్‌డార్ఫ్ ఆ తరువాత తెలంగాణకు వచ్చారు. మధ్యలో నేపాల్ వెళ్ళి కూడా అధ్యయనాలు జరిపారు. దాదాపు డజను గిరిజన జాతులపై ఆయన పరిశోధన సాగింది. ఈ పరిశోధన ఎంత విస్తారమైనదైనా ఆయనకు జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చింది మాత్రం తెలంగాణలోని - నాటి హైదరాబాద్ రాజ్యంలోని - గిరిజనుల మధ్య సాగించిన కృషి. 

ఇరవయవ శతాబ్ది ద్వితీయార్ధం ప్రారంభానికి ముందే గిరిజనుల అధ్యయనం కొత్త పుంతలు తొక్కినప్పుడు దానిని అందిపుచ్చుకుని మరింత ముందుకు తీసుకుపోయిన ఘనత హైమన్‌డార్ఫ్‌ది. భారత దేశం పట్ల ఆసక్తి గల హైమన్‌డార్ఫ్‌కు ఆగ్నేయాసియా గిరిజనుల జాతులపై అధ్యయనానికి ఆద్యుడైన గెల్డెర్న్ స్ఫూర్తినిచ్చారు. ఆనాడు గిరిజన అధ్యయన విధానాలను మలుపు తిప్పిన పరిశోధకుడిగా మొదట బ్రానిస్లా్ మాలినోవ్‌స్కీని చెప్పుకోవాలె. గిరిజనుల అధ్యయనం గదిలో కూర్చుండి జరిపేది కాదని, ఎవరిపైనైతే అధ్యయనం సాగిస్తున్నామో, వారి మధ్య చేరి రోజువారీ జీవన శైలిని క్షేత్ర స్థాయిలో పరిశీలించాలనేవాడు మాలినోవ్‌స్కీ. ఆయనది అనుభవైక అధ్యయనం. హైమన్‌డార్ఫ్ ఈ మాలినోవ్‌స్కీ బోధనలు వినడానికే అమెరికా నుంచి లండన్‌కు మకాం మార్చాడు. హైమన్‌డార్ఫ్ క్షేత్ర పర్యటనలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. అధ్యయనం చేస్తున్నప్పుడు ఆ గిరిజనుల భాష నేర్చుకోని తీరాలని భావించారాయన. 

గిరిజనుల పట్ల అనురాగం, పరిశోధన పట్ల ఆపేక్ష, అందుకు తగిన శ్రమైక జీవనం, కఠిన క్రమశిక్షణ హైమన్‌డార్ఫ్‌ను ఉన్నత స్థాయి పరిశోధకునిగా, మహోన్నత మానవునిగా నిలబెట్టాయి. ఆయన ప్రచురించింది తన పరిశోధనలో కొంత భాగమే. వేల కొద్ది పేజీల క్షేత్ర పర్యటన నోట్స్. గిరిజన సంస్కృతిని శాశ్వతంగా నమోదు చేసే వేలకొద్ది ఫోటోలు. చిత్రీకరణలు, చేసిన మాటలు, సేకరించిన అనేక గిరిజన కళా ఖండాలు- ఆయన చెప్పదలుచుకున్నది, ప్రపంచానికి వినిపించాలంటే- వీటన్నిటిపై అనేక అధ్యయనాలు జరగాలె. గిరిజన సమాజాల తాత్విక భావజాలాన్ని కూడా ఆయన మూటకట్టి పెట్టాడు. హైమన్‌డార్ఫ్ కొంతకాలం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బోధన సాగించి లండన్‌లోని ప్రాచ్య, ఆఫ్రికా అధ్యయన సంస్థలో చేరారు. ఆయన పరిశోధనలన్నీ అక్కడే భద్రంగా ఉన్నాయి.

హైమన్‌డార్ఫ్ పరిశోధన, సేవ తెలంగాణతో విచివూతమైన రీతిలో ముడిపడింది. ఆయన భారతదేశంలో అధ్యయనానికి వచ్చినప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. జర్మనీ పాస్‌పోర్టుతో ఇక్కడికి రావడంతో, ఆయనను నిర్బంధించాల్సి ఉంది. కానీ బ్రిటిష్ అధికారులు ఈ పరిశోధకుడిని నిర్బంధించకుండా హైదరాబాద్ రాజ్యానికి పరిమితం చేశారు. అయితే అనుమతి లభించగానే నేపాల్ వెళ్ళి అక్కడ అధ్యయనాలు సాగించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే నిజాం ప్రభుత్వం హైమన్‌డార్ఫ్‌ను పిలిపించి గిరిజనుల, వెనుకబడిన తరగతుల సలహాదారుగా నియమించింది. అప్పటికే గోండుల తిరుగుబాటు వచ్చినందున, ఇక్కడి గిరిజనులపై అధ్యయనం చేసి, అభివృద్ధి చర్యలు సూచించే బాధ్యత హైమన్‌డార్ఫ్‌కు నిజాం ప్రభుత్వం అప్పగించింది. గిరిజనుల సంస్కృతిని, జీవన విధానాన్ని పరిరక్షిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడే విధానాలు రూపొందించడం హైమన్‌డార్ఫ్ ఆదిలాబాద్ జిల్లాలో చేసిన చూపిన గొప్ప ప్రయోగం. కేస్లాపూర్ జాతర సందర్భంగా గిరిజనుల వద్దకే ప్రభుత్వం వెళ్ళడమనేది వినూత్న సూచన. 1943లోనే నిజాం కాలంలో గిరిజనుల విద్యా బోధనా పథకాన్ని రూపొందించి బలమైన పునాది వేశారు. గోండు భాషలోనే విద్యాబోధన సాగించే గోండు ఉపాధ్యాయులను, గోండు ఉద్యోగులను తయారు చేయడానికి శిక్షణా కేంద్రాన్ని, దాదాపు వంద పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఆనాడు మొదటి తరం గోండు విద్యావంతులు, ఉద్యోగస్థులు రూపొందారు! 

హైమన్‌డార్ఫ్ గిరిజనులపై అధ్యయనాన్ని సాగిస్తున్న సమయంలోనే తన సహ కార్యకర్త ఎలిజబెత్‌ను వివాహం చేసుకున్నారు. గిరిజనులు ఆమెను ప్రేమగా బెట్టీ అని పిలుచుకునేవారు. తెలంగాణలో పరిశోధన అనంతరం హైమన్‌డార్ఫ్ దంపతులు లండన్‌లో గడిపారు. అయినా ఇక్కడి గిరిజనులతో వారి అనుబంధం పెనవేసుకునే ఉన్నది. 1969 ఉద్యమం నాడే తెలంగాణ ఏర్పడి ఉంటే, మళ్ళీ హైమన్‌డార్ఫ్ దంపతులను సాదరంగా ఆహ్వానించి సేవలు ఉపయోగించుకునేవారం. కానీ తెలంగాణ క్షోభిస్తున్న సమయంలో, బెట్టీ హైదరాబాద్‌లో మరణించారు. ఈ దంపతులు ఒకప్పుడు గడిపిన ఆదిలాబాద్ జిల్లాలోని మార్లవాయి గ్రామం వద్దనే ఆమెను సమాధి చేశారు. హైమన్‌డార్ఫ్ బతికి ఉన్నప్పుడే ఆయన కోరిన ప్రకారం భార్య సమాధి పక్కన ఆయన సమాధి కూడా నిర్మించి పెట్టారు. భార్య మరణించిన తరువాత ఆయన క్రమంగా కుంగి కృశించారు. క్షేత్ర పర్యటనల్లో కఠోర శ్రమతో పరిశోధనలు చేసిన హైమన్‌డార్ఫ్ 1995లో శాశ్వతంగా విశ్రాంతి తీసుకున్నారు. ఇన్నాళ్ళకు ఆయన చితా భస్మం ఆదిలాబాద్ గిరిజనుల మధ్యకు చేరింది. ఏ గిరిజనుల ఆప్యాయతను చూరగొని అన్యోన్యంగా గడిపారో వారి మధ్యనే హైమన్‌డార్ఫ్ దంపతులు శాశ్వత నిద్రకు ఉపక్షికమించారు. ఆ గిరిజనులే హైమన్‌డార్ఫ్ దంపతులకు గుండెల్లో గూడు కట్టి జోకొడుతున్నారు.
Namasete Telangana News Paper Dated : 27/02/2012   (Sampadakiyam )

Saturday, February 25, 2012

మానవీయ వృత్తి 'నర్సింగ్' - ఎం. హేమలత సరోజిని


'మానవసేవే మాధవ సేవ' స్ఫూర్తితో సాగే విశిష్టమైన వృత్తే నర్సింగ్. కారు చీకటిలో కరుణామయ చూపులతో దారిచూపే వెలుగును చేతబట్టిన సేవామూర్తులు నర్సింగ్‌కు ప్రతీకలుగా మదిలో మెదులుతారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో నర్సింగ్ వృత్తి చాలా పురాతనమైనది, ప్రశస్థమైనది. ఆరోగ్యం, స్వస్థతలకు సంబంధించిన అంశాలన్నిటితో వ్యవహరించడంలో నర్సింగ్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మానవ ప్రాణి ఉనికిలోకి వచ్చిన నాటి నుంచి నర్సింగ్ వృత్తి కొనసాగుతోంది. యుద్ధాలు, అంటువ్యాధులు ప్రబలిన సందర్భాల్లో బాధితులకు శుశ్రూష చేసి, ప్రజలకు సేవలందించడంలో ఆశ్రమాలు, ఆరామాలు పడుతున్న శ్రమలో కీలక పాత్ర పోషిస్తున్నది నర్సులే. 

కొన్ని శతాబ్దాలుగా సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆరోగ్య సేవా రంగం, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ స్పృహలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ రంగంలో పనిచేసేందుకు సేవా భావం, నైపుణ్యాలు మాత్రమే చాలదు. వాటితోపాటు ఆ వృత్తికి సంబంధించిన నైతిక వర్తన, విధివిధానాలున్న నర్సింగ్ కోడ్‌ను కూడా నేర్చుకోవడం అవసరం. దాంతో నర్సింగ్ శిక్షణ కోసం ఇతర వృత్తుల కంటె భిన్నంగా దీనికి ప్రత్యేకమైన బోధన, శిక్షణ అవసరం అవుతుంది. 

మానవజాతికి వైద్య సహాయం, సేవ అందించే లక్ష్యంతో ఈ వృత్తి నడుస్తుంది. అన్ని తరాలు, కుటుంబాలు, గ్రూపులు, మతస్థులు, ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు, రోగులకు స్వతంత్ర, సహకార సంరక్షణ అందించడంతో నర్సింగ్ ముడిపడి ఉంటుంది. సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం, అందుకు ప్రోత్సహించడం వంటి విధులను కూడా నర్సింగ్ నిర్వహిస్తుంది. ఆరోగ్య విధాన రూపకల్పనలో పాల్గొనడమే కాక, రోగ నివారణ, పరిశోధన, ఆరోగ్య వ్వవస్థల నిర్వహణ, సంబంధిత విద్య వంటి కార్యకలాపాలు కూడా నర్సింగ్ కీలక విధులుగా ఉంటాయి. 

గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నేటి నర్సులు మరిన్ని బాధ్యతలను, ప్రత్యేక కర్తవ్యాలను నిర్వహించవలసి ఉంటుంది. కెరీర్ కోసం ప్రయత్నిస్తున్న యువతీ యువకులకు నర్సింగ్‌లో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. రోజు రోజుకు పురోగమిస్తున్న భారతీయ వైద్య ఆరోగ్య సంరక్షణ రంగం యువతకు మంచి భవిష్యత్‌ను అందించే పరిస్థితులు ఉన్నాయి. 

సేవ, విజ్ఞానము, ఉపాధి మార్గము అన్న మూడు అంశాలు నర్సింగ్ వృత్తి ఎంపికలో ఉన్నాయి. జాతీయ ఆరోగ్య సంరక్షణ రంగం, ఆరోగ్య వికాసాలకు నర్సింగ్ ఒక మూల స్తంభంగా పనిచేస్తుంది. ఒక వ్యక్తి మానవుల పాలిట దైవసమానమైన వ్యక్తిగా ఈ వృత్తి ద్వారా గుర్తింపు లభిస్తుంది. రోగులు స్వస్థతపొంది ఆరోగ్యవంతులుగా మారేందుకు నర్సుల సహాయం కోసం ఎల్లప్పుడూ ఎదురుచూస్తుంటారు. 

నర్సింగ్ వృత్తి ద్వారా అనేక లాభాలున్నాయి. ఒక నర్సు తన కార్యాచరణ ద్వారా అనునిత్యం ప్రజా జీవితాలలో నిజమైన భిన్నత్వానికి నిదర్శనంగా నిలుస్తారు. నర్సింగ్ వృత్తిని ఎంచుకున్న వ్యక్తులు రోగులకే కాకుండా తనకు, తన కుటుంబానికి, తన ప్రాంతీయలకు తన జ్ఞానాన్ని, అనుభవాన్ని పంచేందుకు వీలుంటుంది. నర్సింగ్ వృత్తిలో పదోన్నతి, ఉద్యోగ భద్రత, పనివేళల అనుకూలత వగైరాలకు అవకాశం మెండుగా ఉంది. ఉన్నత విద్యను అభ్యసించగలిగిన చాలా మంది నర్సులు మేనేజర్స్, విద్యావంతులు, పరిశోధకులు, నర్స్ ప్రాక్టీషనర్స్, క్లీనికల్ నర్స్ స్పెషలిస్టులు వగైరాలుగా మరింత స్వతంత్రంగా వ్యహరించగలిగే అవకాశం ఉంది. 

సహకారం, స్వతంత్రత రెండు అంశాలతో కూడిన వృత్తి ఇది. హాస్పిటల్ నర్సింగ్, కమ్యూనిటీ నర్సింగ్, స్కూల్ నర్సింగ్, మెడికల్ అసిస్టెన్స్ వగైరా వైవిధ్యభరిత రంగాలలో నర్సింగ్ వృత్తి ఉంది. ఉన్నత విద్యాప్రమాణాలు, శిక్షణ అర్హతలు, నైపుణ్యంగల నర్సులకు విస్తృతమైన కేరీర్ అవకాశాలున్నాయి. మరే ఇతర వృత్తులలోనూ ఇంతటి వెసులుబాటు, ఆత్మ సంతృప్తి, ఉద్యోగ భద్రత ఉండదు. 

నిరంతరం సవాళ్ళతో, ఆకర్షణీయ వేతనంతో కూడిన ఉపాధి కోసం వెతుకులాడే వారికి నర్సింగ్ వృత్తి ఒక మంచి మజిలీ. నూటికి నూరు శాతం ఉద్యోగ భద్రత ఉండడమే కాకుండా పట్టుదల, దృఢ నిశ్చయంతో చక్కటి సవాళ్ళతో కూడిన కేరీర్‌గా నర్సింగ్ ప్రసిద్ధి చెందింది. బహుళ అవకాశాలున్న ఏకైక వృత్తి ఇది. స్త్రీ వృత్తులకు సంబంధించిన నర్సింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయమైన జీతాలతో కూడిన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇతరులకు సహకరించాలన్న జిజ్ఞాస, ఇతరుల బాధలు, రుగ్మతల పట్ల సానుభూతి ఉండి ఆ రంగంలో ఉపాధి కోసం అన్వేషించే యువతీ యువకులకు నర్సింగ్ చక్కటి వృత్తిగా నిలుస్తుంది. 

నర్సింగ్ అనేది కేవలం స్త్రీలకు మాత్రమే ప్రత్యేకించిన వృత్తి కాదు. అనేక మంది పురుష నర్సులు అంకితభావంతో, తాదాత్మ్యంతో ఈ రంగంలో పనిచేస్తున్నారు. మనకు సాధారణ విషయంగా కనపడే దాతృత్వం ఇతరులకు అత్యంత విలువైనదిగా ఉంటుంది. మీరు దయాళువు అయినట్లయితే, సంరక్షించే స్వభావాన్ని కలిగి ఉన్నట్లయితే, మీ కెరీర్ ద్వారా ఇతరులను ప్రభావితం చేసి, వారి మన్ననలను పొందాలనుకున్నట్లయితే నర్సింగ్‌ను మించిన మంచి వృత్తి వేరొకటి ఉండదు. వైద్య రంగంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందినప్పటికీ వ్యక్తి కేంద్రిత ఆరోగ్య సమగ్ర సంరక్షణ ఇప్పటికీ అవసరం కాబట్టి నర్సింగ్ వృత్తికి ఎల్లవేళలా డిమాండ్ ఉంది. 

రాబోయే రోజుల్లో దేశం వైద్య, ఆరోగ్య రంగంలో విశేషమైన ప్రగతిని సాధించబోతోంది. మెడికల్ టూరిజంకు మన దేశం ఒక ప్రపంచ కేంద్రంగా అవ తరించనుంది. ఈ నేప థ ్యంలో వైద్య సంరక్షణలో నిపుణుల అవసరం బాగా పెరగనుంది. 

- ఎం. హేమలత సరోజిని
ప్రిన్సిపాల్, ఈశ్వరీబాయి మెమోరియల్
కాలేజ్ ఆఫ్ నర్సింగ్
Andhra Jyothi News Paper Dated : 26/02/2012 

'సపాత్ర దానం' సక్రమమేనా? - డా. డి.ఎల్. విద్య


మా ఎదురింట్లో ఉండే 80 ఏళ్ళ లాయరుగారు చనిపోయారు. సువర్ణదానం, గోదానం, భూదానం, అన్నదానం, ఆఖరికి ఆయన పోయిన నెల లోపలే కన్యాదానం కూడా చేసేస్తున్నారని అందరూ మెచ్చుకుంటూ చెప్పుకున్నారు. 'సపాత్ర దానం' (జనవరి 22, ఆంధ్రజ్యోతి) అన్న జాహ్నవి శీర్షిక చూసి, నేను విన్న పై దానాల్లాంటివన్నీ అపాత్ర దానాలు, వేరే ఏవో నిజమైన దానాలు ఉన్నాయి, వాటి గురించి కాబోలు చెబుతున్నారనుకున్నాను. పైవన్నీ, అందులోకీ కన్యాదానం (ఓ కన్యను, జీవంలేని వస్తువులా, నోరులేని, ఆలోచన లే ని జంతువులా దానం చెయ్యడం) తప్పుడు దానాలూ, అపాత్ర దానా లే కదా మరి! అలాంటి వాటి మీద విమర్శ, సరయిన దానాలేం టో చెప్పే విజ్ఞానం ఉంటాయేమోనన్న ఆత్రుతతో ఆ వ్యాసం చదివాను. 

కానీ జాహ్నవి చెప్పిన సపాత్ర దానాలేమిటంటే.. 1.ఉద్యోగం చేసి, జీతం తీసుకుంటామా! దాన్ని జీతం తీసుకోవడం అనుకోకూడదు -దానం పుచ్చుకోవడం అనుకోవాలి; 2. సబ్బులో, జబ్బులొచ్చి మం దులో, డబ్బులిచ్చి కొనుక్కుంటామా! దాన్ని కొనుక్కోవడం కాదు. దానం పుచ్చుకోవడం అనుకోవాలి. ఈ రెండూ సపాత్ర దానాలు. సపాత్ర దానానికి ఉండవలసిన ముఖ్యమైన మూడు లక్షణాలూ వీటికి ఉన్నాయని కూడా వివరించేరు జాహ్నవి. 3.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అపాత్ర దానాలన్నారు. ఆయన చెప్పిన అపాత్ర దానం విషయం పక్కన పెడదాం, ఆ సపాత్ర దానాలని, దానాలని ఒప్పుకోగలమా? 

"సామ్యవాద, కమ్యూనిస్టు విధానాల్లోని జాతీయీకరణ, పన్నుల రూపంలో దొంగిలించిన, బలవంతంగా వసూలు చేసిన సొమ్మును 'సంక్షేమ పథకాల' రూపంలో పంచిపెట్టడం దానం కాదు, నిజమైన దానం ప్రభుత్వేతర (ప్రైవేటు) వ్యక్తులు, వారి పెట్టుబడుల ద్వారా మాత్రమే సాధ్యం'' అన్నారు జాహ్నవి. సామ్యవాద, కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రకారం అన్ని పరిశ్రమల్నీ, భూముల్నీ జాతీయీకరణ చెయ్యడం జరిగితే, సొంత ఆస్తి అనేది ఉండదు. సొంత ఆస్తినే నిర్మూలించినప్పుడు ఆస్తుల మీద పన్నులూ ఉండవు. ఆస్తుల్ని పెంచుకునే అవకాశమూ ఉండదు, అవసరమూ ఉండదు. కమ్యూనిజంలో పన్నుల విధానమే రద్దయిపోతుంది. 

పన్నుల రూపంలో దొంగిలించి, బలవంతంగా వసూలు చేసి సంక్షేమ పథకాల రూపంలో పెట్టడం ఎలా జరుగుతుంది? ప్రభుత్వం, ప్రభుత్వేతరులూ అంటూ లేదు, రెండూ ఒకటే. 'సార్వత్రక వయోజన ఓటింగు' ఉండడం వల్ల అలా కనిపిస్తోంది. దాన్ని తీసేసి, పెట్టబడిదారులకు మాత్రమే 'ఓటు హక్కు' మిగిలిస్తే, ఆ భ్రమ తొలిగిపోతుంది. ప్రభుత్వం అంటే పెట్టుబడిదారుల ప్రతినిధులే అన్నది స్పష్టం అవుతుంది. జాహ్నవి ఆశించినది నిజమౌతుంది. అప్పుడు కార్మికులకీ, వినియోగదారులకీ, పెట్టుబడిదారులు పనిచేయించుకొని జీతాలిచ్చి, డబ్బులు తీసుకుని సరుకులు ఇచ్చి 'సపాత్రదానాలు' చేస్తూ ఉండవచ్చు. 

కానీ సామాన్య ప్రజల ఓటింగు హక్కు తీసెయ్యడం జరగదు. భూస్వామ్య వ్యవస్థ పోయి బూర్జువా వ్యవస్థ వచ్చే విప్లవాలన్నిటిలో, కార్మికుల, కర్షకుల పాత్ర అనన్య సామాన్యం. వాళ్ళ సహాయం లేకుండా ఉంటే బూర్జువా ప్రభుత్వాలు ఏర్పడగలిగేవి కావు. ఆ తర్వాత కూడా శ్రామికులు చేసిన ఎన్నో పోరాటాల వల్లే, ఈ 'సార్వత్రక వయోజన ఓటింగు హక్కు' వచ్చింది. దీని వల్ల ఒరిగే ప్రయోజనం ఎంత కొంచెమైనా సరే, దీన్ని కూడా తీసేసి స్వచ్ఛమైన బూర్జువా తత్వంతో పాలిద్దామనుకుంటే, అది చరిత్రని వెనక్కి మళ్ళించడం అవుతుంది, అది జరగదు. 

'సంపాదన, పొదుపు, పెట్టుబడి, ప్రైవేటు యాజమాన్యంలో ఉత్ప త్తి సాధనాలు-ఇదే ధర్మ మార్గం, సపాత్ర దానం' అంటారు జాహ్నవి. సంపాదించి, కడుపు కట్టుకుని పొదుపు చేసి, ఆ పెట్టుబడితో చిన్న కంపెనీ పెట్టేడనుకోండి ఎవడైనా ఓ సామాన్య ఉద్యోగి. కంపెనీ పెట్టడంతోనే సరిపోదు, పని వాళ్ళని పెట్టుకోవాలి. వాళ్ళకి జీతాలు మాత్రమే ఇవ్వాలి. అదనపు విలువని తను లాక్కోవాలి. అలా చెయ్యకపోతే పెట్టబడి వృద్ధి చెందదు. పెట్టుబడి పెట్టిన నాటి నుంచే అతడు పెట్టుబడిదారుడు అయిపోతాడు, అంటే పీడించేవాడు అయిపోతాడు. 

అప్పట్నుంచీ అతను ఇంక ఏ పనీ చెయ్యనక్కరలేదు. తన అవసరా లూ, విలాసాలూ అన్నీ శ్రామికుల శ్రమ వల్లే తీరుతాయి. శ్రామికుల శ్రమనే తను దోచేస్తూ, ఇంకా 'సపాత్రదానం' అనడం ఏంటి? కానీ ఇలా ఎప్పుడూ జరగదు. దోపిడీకి గురయ్యే శ్రామికులెవరూ, వారి అవసరాలే తీరక కృశించిపోతారు తప్ప, పెట్టుబడులు పెట్టే స్థాయికి రారు. 

"ఒక మనిషిని, దానం ఆశించకుండా సశక్తుడిగా చెయ్యడమే మహోత్కృష్టమైన దానం' అన్నారు జాహ్నవి. దానం ఆశించకుండా సశక్తుడిగా అవడం ఎప్పుడు జరుగుతుంది? చెయ్యడానికి పని దొరికి, పనికి తగ్గ ప్రతిఫలం దొరికినప్పుడు. పని చేసేరు=ప్రతిఫలం దక్కింది. దానం అనే శేషం ఎక్కడ్నుంచి వచ్చింది? దానం ఆశించకపోతే, దానం పట్టే ఖర్మం లేకపోతే మహోత్కృష్టమైన దానం వస్తుందా?! 

జాహ్నవి చెప్పిన నిజమైన దాతృత్వానికి ఉండే మూడు ప్రధాన లక్షణాలు: 1. 'మొదటిది ఒక విలువైన వస్తువు యొక్క యాజమాన్యం దాత చేతినుంచి గ్రహీత చేతికి మారాలి'. సమాధానం-శ్రామికుడు శ్రమించి వస్తువులు తయారు చేస్తాడు. ఇతని చేతి నుంచి ఆ వస్తువులపై అధికారం పెట్టుబడిదారుడి చేతిలోకి పోతుంది. 2. 'ఇచ్చిన వస్తువు లేదా సంపద ఇచ్చేవాడి సొంతమై ఉండాలి'. సమాధానం- భూగోళాన్ని ఏ మానవుడు సృష్టించలేదు. భూమిపైన వనరుల్నీ ఎవరూ సృష్టించలేదు. భూమి మీది సహజ వనరులతో శ్రమించడం వల్లే వస్తువులు తయారవుతాయి. శ్రమనే ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతుంది. 

'శ్రమ' శ్రామికుడి సొం తం. పెట్టుబడిదారుడికి శ్రామికుడు సమర్పిస్తున్నది తన సొంతం. 3. 'ముఖ్యమైన మూడో లక్షణం, దానం గుప్తమైనదై ఉండాలి'. సమాధానం- శ్రామికుడు తన శ్రమను పెట్టుబడిదారుడికి ఇ స్తాడు. పెట్టుబడిదారుడు శ్రామికుడికి తిరిగి ఏమీ ఇవ్వడు. ఏ పె ట్టుబడి దారుడూ తాను ఏమీ ఇవ్వకుండానే శ్రామికుడి శ్రమ ఫలా న్ని లాక్కుంటున్నాననే స్పృహతో ఉండడు. అంచేత శ్రామికుడు చే సే ఈ దానం 'గుప్త దానమే'!. దానానికి ఉండవలసిన మూడు లక్షణాలూ, ముఖ్యమైన మూడో లక్షణంతో సహా నెరవేరాయి. శ్రామికుడు దాత, పెట్టుబడిదారుడు గ్రహీత. ఎవరు ఎవరికి దానం చేస్తున్నారో జాహ్నవికి అర్థం అవుతోందా? ఒప్పుకుంటారా? 

శ్రమతో తయారయిన ఒక వస్తువు, శ్రమతోటే తయారయిన మరో వస్తువుతో మారుతుంది. పెట్టుబడిదారుడు ఏ శ్రమ చెయ్యడు. (ఒకవేళ ఏ చిన్న శ్రమ అయినా చేసిన దానికి పొందవలసిన దానికంటె చెప్పలేనంత ఎక్కువ ప్రతిఫలం పొందుతాడు) అతని దగ్గర మారకానికి ఏమీ లేదు, పుచ్చుకోవడం తప్ప. అసలు సిసలైన దాన గ్రహీత పెట్టుబడిదారుడే! 'విలువగల యంత్ర పరికరాలు, పనిముట్లు, ఉత్పత్తికి దోహదపడి, అందరికీ మేలు చేస్తాయి. నిజమైన దాన ధర్మాలకు మూడు లక్షణాలు దీనిలో ఉన్నాయి' అంటారు జాహ్నవి. 

విలువ గల యంత్ర పరికరాలు, పనిముట్లూ ఉత్పత్తికి దోహదపడి, అందరికీ మేలు చెయ్యడం జరిగేది కమ్యూనిస్టు ఆర్థిక వ్యవస్థలోనే. అలా కాని దాన్లో, అవి, శ్రామికుడు పెట్టుబడిదారుడికి చేసే గుప్త దానాలయిపోతాయి. తాము ఇలా గుప్త దానాలు చేస్తున్నామన్న సంగతి పాపం శ్రామికులకి కూడా ఇంకా తెలియదు. కమ్యూనిస్టు వ్యవస్థలో 'దానం' అన్న ప్రసక్తి లేదు. 

ఆర్థికవేత్త కీన్స్ తన 'దేశ స్వయం సమృద్ధత' అన్న వ్యాసంలో, 'అంతర్జాతీయ విపణి నుంచి కొంతయినా తప్పుకోవడం, విజ్ఞానం అందించిన జీవితాన్ని మనోహరంగానూ ఉపయుక్తంగానూ మలచుకోవడానికి అవసరం' అన్న విషయం మీదే దృష్టి పెట్టేడు. 'మనపై మనమే యజమానులం' అవడానికి, 'భావిలో ఆదర్శవంతమైన, స్నేహమయమైన ప్రజారాజ్యాన్ని స్థాపించడానికి - మనకి ఇష్టమైన ప్రయోగాలు చేసుకోవడానికి', అంతర్జాతీయ వ్యాపార సంబంధాల్ని సూక్ష్మీకరించుకోవాలి కానీ విస్తృతపరచుకోకూడదు'' అని ఆశించేడు. "ఈ వాస్తవాలు మార్క్స్ ప్రతిపాదించిన 'అదనపు విలువ' సిద్ధాంతానికి సమాధానం చెబుతాయని' జాహ్నవి అన్నారు. 

జాహ్నవి చెప్పిన ఏ విషయాలైనా మార్క్స్ ప్రతిపాదించిన 'అదనపు విలువ' సిద్ధాంతాన్ని సమర్ధిస్తాయే తప్ప సమాధానం చెప్పగలిగేవి కాదు. జాహ్నవి దోపిడీని సమర్థిస్తున్నారు. 'దోపిడికి' సమాధానం మార్క్స్ ప్రతిపాదించిన 'అదనపు విలువ' సిద్ధాంతం. 'పెట్టుబడిదారుడు పొందే 15 శాతం కూడా వినియోగదారులకే చెందుతుంది'. జాహ్నవి కూడా మార్క్స్ ప్రతిపాదించిన 'అదనపు విలువ' సిద్ధాంతాన్ని ఒప్పుకుంటున్నట్టే కనబడుతోంది! కానీ, చిన్న సవరణ, 'వినియోగదారులకే చెందుతుంది' అని కాదు, 'శ్రామికులకే చెందుతుంది'. వినియోగదారులంటే పెట్టుబడిదారులు కూడా వచ్చేస్తారు. 

పెట్టుబడిదారులు తినే ప్రతి గింజా శ్రామికులదే. 'కాకపోతే ఆ పెట్టుబడిదారుడి పొదుపు, పెట్టుబడి, యంత్రాలు లేని నాడు, అదనపు ఉత్పత్తే జరగదని, అప్పుడు ఈ అదనపు ఉత్ప త్తి ఎవరికి చెందాలనే ప్రశ్నే ఉదయించదని గ్రహించాలి'. ఇంకా గ్రహించాలి - అసలు పెట్టుబడి కూడా శ్రామికులదేనని,యంత్రా లు కూడా శ్రామికులు తయారు చేసినవేనని, శ్రామికుల హస్తం పడందే యంత్రాలు కదలవనీ జాహ్నవి గ్రహించాలి. పెట్టుబడి, పెట్టుబడిదారులూ లేకపోయిన రోజున శ్రామికవర్గ ప్రభుత్వం ఏర్పడుతుంది. వాళ్ళు పని చెయ్యరు. కాబట్టి అడవుల్లోకి పోయి కందమూలాలు తింటూ బ్రతక గలిగినన్నాళ్ళు బ్రతుకుతారు. 

పెట్టుబడులన్నీ ఉత్పత్తి సాధనాలుగా, శ్రామికులందరూ ఉత్పత్తి దారులుగా, అదనపు ఉత్పతి,్త సంక్షోభాలు సృష్టించే గుణంలేని 'సమాజ నిధి'గా (సంచిత శ్రమ) మారుతాయి. పెట్టుబడిదారుడి 'కోడి, కుంపటి' లేనంత మాత్రాన తెల్లారడం ఆగదు. కాలచక్రమూ ఆగిపోదు. ఉత్పత్తీ ఆగిపోదు. 'దోపిడీ సంబంధాలు' పోయి, సమాన త్వ సుహృద్భావం వస్తుంది. 'శ్రామిక శాస్త్రమైన' కార్లమార్క్స్ రా సిన 'దాస్ కేపిటల్'ని, శ్రామికులందరూ జాహ్నవి చెప్పేవన్నీ త ప్పులని నిర్ద్వంద్వంగా గ్రహించగలగడానికి చదవాలి. అంతకన్నా ముందు రంగనాయకమ్మ రాసిన 'కేపిటల్ పరిచయం' చదవాలి. 

జాహ్నవి ఏదో ఉద్యోగం చేసి వేతనం తీసుకుంటూ, వినియోగదారుడుగా ప్రతినిత్యం ఏవో ఒకటి కొంటూ, సపాత్ర దానాలు పట్టి పట్టి చేతులు అరగ్గొట్టుకొని ఉంటారు. ఆ దానాలు పట్టడం ఎలాగూ మానలేరు, ఇలాంటి రాతలైనా రాయడం మానేస్తే చేతులు అరగడం తగ్గుతుంది.
- డా. డి.ఎల్. విద్య 

అసిస్టెంట్ ప్రొఫెసర్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కాకినాడ
Andhra Jyothi News Paper Dated : 26/02/2012

రాబోయే తెలంగాణలో! -సుజాత సూరేపల్లి


రేపు రాబోయే తెలంగాణలో జరిగే పరిణామాలు తలచుకుంటే ఒళ్ళు ఒక్కసారిగా జలదరిస్తుంది. చిన్న ఉదాహరణ: కరీంనగర్‌కి సంవత్సరం క్రితం ఉద్యోగ రీత్యా రావడం జరిగింది. వస్తూనే మల్లా రెడ్డి, ఇతర స్థానిక రాజకీయ నాయకులు నన్ను, ప్రొఫెసర్ రేవతిని పిలిచారు. అక్కడ మహిళలు అందరూ ఏకగ్రీవంగా నన్ను ప్రతినిధిగా ఎన్నుకున్నారు. బహుశా ఒక్కటే ఒక రీజన్- నాకు ఉద్యమాలతో సంబంధం ఉండడం. నేను ఏ రాజకీయ పార్టీలో లేకపోవడం అనుకుంటా.. ఐతే ఒక రాజకీయ పార్టీకి చెందిన ఒకరిద్దరు మాత్రం వెంటనే అభ్యంతరం చెప్పడం జరిగింది. నేను ఈ జిల్లాకి చెందిన దానిని కాదు కాబట్టి నాయకత్వంలో ఉండడానికి వీలులేదు అని. ఐతే దానికి అందరు అంగీకరించలేదు. 

సరే, అక్కడి నుంచి గ్రానైట్ మైనింగ్ మీద ఇక్కడ ఉన్న ఉద్యమకారులతో కలిసి ప్రయాణం మొదలుపెట్టాము. ఇదివరకు ఉన్న భూనిర్వాసిత ఐక్యవేదిక నుంచి తెలంగాణ భూమి రక్షణ సంఘంగా ఏర్పడి, కేవలం సహజ వనరుల హక్కుల కోసం పనిచేద్దామని నిర్ణయించాము. ఇక్కడ మిత్రులతోటి, వారి ఆలోచనల తోటి కలిపి ఏర్పడిన ఉద్యమ వేదిక. ఒక సంవత్సర కాలంలో చాలా పనులు చేశాము. ప్రజలను చైతన్యపరచడం, ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకుపోవడం, కోర్టులు, జైళ్ళకి తిరగడం కూడ అయింది. వేల కరపత్రాలు ఎన్నో గ్రామాలలో పంచడం చివరికి ఒక ఉద్యమ రూపం తీసుకుంది. 

ఐతే ఇక్కడ ఉన్న ఇతర సంఘాల వాళ్ళు, తీవ్రమైన దుష్ప్రచారం మొదలుపెట్టారు. నేను వచ్చినంక వారి ఉనికికి దెబ్బ తగిలిందని, వారి వారి సంఘాలలో ఉన్న నాయకులు అందరు ఇందులో భాగస్వాములై వారిని పనిచేయకుం డా చేసానని ముందుగా వచ్చిన ఆరోపణ. నిజానికి ప్రతి మీటింగ్ కూడ కొన్ని వందల మెసేజ్‌లు, ఫోన్‌లు చేయడం, పత్రికా ప్రకటనలు ఇవ్వడం జరిగింది. చివరికి బ్లాగ్ కూడ పెట్టి సమాచారం అందులో ఉంచడం కూడా జరుగుతుంది. ఆరోపణలేమీ పట్టించుకోకుండా ముందుకు పోతూనే ఉన్నాము. ఈ క్రమంలో మల్యాల మండలం మేడంపల్లిలో మహిళలు క్వారీ పై దాడి చేసారని ఊరందరినీ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. 

హుటాహుటిన పోయి అందరు నాయకులకి చెప్పి మొత్తానికి చాలామందిపై కేసులు రాకుండా చూడగలిగాము. అయినా ముగ్గురు నలుగురు జైలు పాలు అయ్యారు. ఆరా తీస్తే అధికార పార్టీకి చెందిన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు (మంత్రిపదవిలో ఉన్నారు) ఈ కుట్రలో భాగస్వామి అని తెలిసింది. వెంటనే నిరసనగా హక్కుల సంఘాలు కలిసి ఆ ఊరివారికి మద్దతు తెలుపుదామని అనుకున్నాము. మాకంటే ముందుగానే స్థానిక పోలీస్‌వారు బయటి వ్యక్తులు ఈ ఊరికి ఎవరు వచ్చినా మిమ్మల్ని అందరిని నక్సలైట్ల పేరుతో జైలులో పెడతాం అని బెదిరించారు. 

అక్కడి ప్రజలు రహస్యంగా ఈ వార్త అందించి ఎవరి ఇళ్ళలో వాళ్ళు భయంగా దాక్కున్నారు. ఇక లోపట ఉన్నవాళ్ళని విడిపిద్దామని డిఎస్‌పితో మాట్లాడి, లాయర్లతో మాట్లాడి ఎన్నో కష్టాలు పడినాము. కొందరు క్వారీ యజమానులు మమ్మల్ని రానీయకుండా వాళ్ళే బెయిల్‌పై విడుదల చేయించి, మేము కొన్ని కోట్లు వారివద్ద తీసుకున్నామని, ప్రజలని మధ్యలోవదిలివేశామని ప్రచారం మొదలుపెట్టారు. ఈ విషయం కూడ అక్కడి ప్రజలే చెప్పారు. అయినా వెనక్కి తగ్గకుండా మా పనులు మేము అవిశ్రాంతంగాచేస్తూనే ఉన్నాము. 

ఈ అపవాదులు మాకు కొత్త కాదు. అయినా, అతి దగ్గర మిత్రులు, ఉద్యమ నాయకులు కూడ నమ్ముతుండడంతో నిజంగా బాధవేస్తుంది. అసలు ఏ ఆధారంగా ఒక ఆరోపణని నమ్ముతూ ప్రచారం చేస్తారు? కనీసం మమ్మల్ని అడిగి తేల్చుకోవాల్సిన బాధ్యత కూడ లేకుండా, విచిత్రంగా ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ మధ్య కాలంలో మరొక నిందారోపణ. నేను ఎమ్మెల్యే పదవికో లేక ఎంపి పదవి కోసమో పనిచేస్తున్నానని. అసలు రాజకీయాలలో నిలబడాలంటే ఇవన్ని అవసరమా? 

ఇంతవరకు ఒక్క పైసా కూడా బయటి నుంచి తీసుకోకుండా, జీతంలోంచి ఖర్చు పెడుతూ, అప్పు లు చేస్తూ, కుటుంబాలకి దూరంగా ఉంటూ, వ్యక్తిగత జీవితాలని మరిచిపోయి చేస్తూన్న పనికి ఇది ఒక బహుమతా? ఈ మధ్య కాలంలో ఇక అప్పులని భరించలేక ఒక పెద్ద మనిషిని కరపత్రాలకి బిల్లు చెల్లించమని అడిగాము. అది కూడా డైరెక్ట్‌గానే. ఇది నిజంగా శీల పరీక్ష లాగానే ఉంటుంది నిజమైన కార్యకర్తకి. నిజంగా ఉద్యమాలలో భాగస్వామ్యం ఉన్నవారు, నిజాయితీగా మాట్లాడేవాళ్ళు ఇట్లా అనరు. కేవలం ఆ పనులు చేసేవాళ్ళే నమ్ముతారు అని తెలిసినా కూడా. ప్రపంచం అంతా వారిలాగే ఉంటుంది అనుకుంటే ఎట్లా? 

నిన్నటికి నిన్న ప్రాణహిత-చేవెళ్ల ప్రజాభిప్రాయ సేకరణలో మేము ఎం తో కష్టపడి విషయాలు సేకరించి, గ్రామాలు తిరుగుతూ ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకొని, ఇంజనీర్ల దగ్గర కూర్చుని టెక్నికల్ విషయాలు నేర్చుకొని ముందుకెళ్తున్నాం. ఇక్కడ ఉన్న మా కుమారస్వామి, మాకు పెద్ద చీఫ్ ఇంజనీర్ మా సంఘంలో సభ్యుడు. జగన్‌మోహన్‌గారు భీష్మ పితాజీ ఎన్నో గంటలూ, రోజులు , రాత్రులు, పగళ్ళు ప్రతి విషయాన్ని చర్చిస్తాము. 

అట్లనే మా మార్వాడీ సుదర్శను మాకు ఒక సైనికుడి లాంటివాడు. దుర్వాస రెడ్డి అందరినీ ఒక తాటికి తీసుకు వచ్చే మేధావి. పెంటయ్య సార్ పెద్ద మనిషి తరహాలో ఉంటారు. వీరందరూ కూడా స్థానికులే. కన్వీనర్‌గా మాత్రం నేను బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా కుమార్ లాంటి వాళ్ళ ప్రోద్భలంతో అందరం దీనిపై పని చేద్దామని నిర్ణయించుకొని మా అభిప్రాయాలను పబ్లిక్ హియరింగ్‌లో చెప్పడం జరిగింది. ఒక్క పార్టీ నాయకుడికి కూడా ఇన్ని విషయాలు తెలుసనీ మేము అనుకోవడం లేదు. అందరు మేము చెప్పిన విషయాలపై సానుకూలంగానే స్పందించారు. 

ఐతే ఒక్క ఎమ్మెల్యే మాత్రం ఒక ప్రశ్న వేసినందుకు వ్యక్తిగత దూషణకి దిగి, తన అనుచరవర్గాన్ని నా మీదకి పంపి, నానా రభస చేసారు.. అందరి సమక్షంలోనే. మిగిలిన నాయకులు ఒక సినిమాగా చూస్తూ ఉండిపోయారు. తరువాత కొందరు ప్రజలు వత్తిడి చేయడంతో ఖండించారు. అసలు నేను చేసిన తప్పు ఏమిటో నాతో సహా, అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు మాట్లాడరా? ప్రశ్నించరా? ఆయన మొదట చెప్పిన అభ్యంతరం నాది ఈ జిల్లా కాదని, నేను రైతుని కాదని, పాఠాలు తప్ప ఇంకో పని నేను చేయకూడదని ఆయన బాణీలో చెప్పారు. 

మరి ఎవరు ఏ పనిచేయాలో ఆయన సెలవివ్వలేదు. ఈ తతంగం అంతా చూస్తు న్న మీడియా మాత్రం కనీసం రిపోర్ట్ చేయలేదు. ఒకరో ఇద్దరో ఉన్నది కాస్తా రాసారు. రెండో రోజు ప్రజాసంఘాల నిరసనకి పత్రికలూ రాయక తప్పలేదు. అంటే మీడియాకి, ప్రతనిధులకి, పార్టీలకి ఒక న్యాయ కోణం కాని, జెండర్ కోణం కాని ఉన్నాయా అని ప్రశ్న వేసుకోవాలి. ఇక్కడ కులం దృష్టిలోంచి చూడడం కాదు, ఒక మహిళగా, బేలగా కూడ కాదు సమస్య. ఎవరు మాట్లాడాలన్నదే అసలు సంగతి. ఈ దేశంలో మహిళలు ధైర్యంగా ముందుకు రావాలంటే ఎంత కష్టపడాలో కూడ దృష్టిలో ఉంచుకోవాలి. 

అంతో ఇంతో చదువుకొన్న నా పరిస్తితే ఈ విధంగా ఉంటే మరి మామూ లు మనుషులు, ఆడవాళ్ళ పరిస్తితి? ఇక్కడ జరిగిన సంఘటన తెలంగాణ లో, ఇక్కడి ప్రజాప్రతినిధుల సమక్షంలో, ఇక్కడి వనరుల కోసం, ఇక్కడి వ్యక్తులు ప్రశ్నించారు. ఫలానా ఆయన దళిత ఎమ్మెల్యే కాబట్టి నేను కాని, ఎవరు కాని మాట్లాడొద్దని ఎన్నో అభ్యర్థనలు. న్యాయంకోసం మాట్లాడని వారు నాయకులు ఎట్లా అవుతారు? 

పోలేపల్లి ప్రజలు నాకు ఇంటిపేరు నిచ్చారు. నన్ను ఒక సొంత బిడ్డగా చూసుకున్నారు. ఇక్కడ కూడా అనేక సంఘాలు, వ్యక్తులు కులాలకి, మతాలకి అతీతంగా మద్దతునిచ్చారు. ప్రజల మద్దతు లేనిదే మేము ఎక్కడ పనిచేయలేము. మా మిత్రులు, సహోపాధ్యాయులు అంటున్నారు: రాబోయే తెలంగాణలో కాబోయే విజయవాడలు, గుంటూర్లు ఎన్నో.. అన్నిటికి సిద్ధం కండి అని. అవునా, నిజమేనా మిత్రులారా? కలలుగన్న తెలంగాణలో కన్నీళ్ళే మిగలనున్నాయా? 

-సుజాత సూరేపల్లి
Andhra Jyothi News Paper Dated : 11/05/2011