Thursday, May 31, 2012

మార్క్సిజమ్@యెటకారమ్.కామ్--- డా. ఎం.ఎఫ్. గోపీనాథ్



అణచివేయబడ్డ కుల, వర్గాలకు అంబేద్కరిజం - మార్క్సిజం అనేవి రెండు ఆయుధాలు. ఆ ఆయుధాల్ని ఈ దేశంలోని దళిత జాతులు ఏ విధంగా ఉపయోగించుకోవాలో తేల్చుకోవాల్సిన కీలకమైన అంశం. అంబేద్కరిజం వద్దనే మూస మార్క్సిస్టులకు, మార్క్సిజం వద్దనే అవకాశవాదులకు రంగనాయకమ్మ లాంటి వారి దగ్గరే ఆశ్రయం దొరుకుతుంది. 

"All that I know is that I am not a Marxist." - Karl Henrich Marx మహనీయులకు, మహోన్నత తత్వవేత్తలకు తమ పరిమితుల్ని వినయంగా ఒప్పుకోవటం అనేది ఒక సలక్షణం. తను ప్రతిపాదించిన సిద్ధాంతం 'సమగ్రమైన ప్రాపంచిక దృక్పథం' అని కూడా మార్క్స్ చెప్పుకోలేదు. కానీ మార్క్సిజాన్ని ఒక సైన్స్‌గా కాకుండా మతగ్రంథంగా భావించే నకిలీ మార్క్సిస్టులు కొందరు అన్నీ వేదాల్లోనే ఉన్నాయంటున్న మత మౌఢ్యుల వలె అన్నీ మార్క్సిజంలోనే ఉన్నాయంటున్నారు. ఆ కోవకు చెందినవారు రంగనాయకమ్మ. సింపుల్ లాజిక్ ఏమిటంటే మార్క్సిజంలోనే అన్నీ ఉంటే, లెనినిజం ఎందుకు? మార్క్సిజమ్-లెనినిజంలోనే అంతా ఉంటే మావోయిజం ఎందుకు? మార్క్సిజం- లెనినిజం- మావోయిజం అనే ప్రాపంచిక దృక్పథాలు సర్వవేళలా, సర్వావ్యవస్థల్లో సకల దేశాలకు సమగ్ర సిద్ధాంతాలైౖతే అవి బైబిల్/ఖురాన్/భగవద్గీత మాత్రమే అవుతాయి. సైన్స్ కాదు. 

'అస్తవ్యస్త సంస్కర్తలు' (ఆంధ్రజ్యోతి, మే 15) వ్యాసంలో బుద్ధుడిని, అంబేద్కర్‌ని, సత్యమూర్తిని దేనికీ పనికిరానివాళ్లుగా మన ముందు నిలబెట్టే ప్రయత్నం చేశారు రంగనాయకమ్మ. కె.జి.సత్యమూర్తి మరణం తర్వాత ఆ మహా విప్లవకవి పట్ల తెలుగునాట సామాజిక విప్లవశ్రేణుల స్పందన చూసి ఆమె అలా స్పందించారు. తాను రాసిన 'దళిత సమస్య పరిష్కారానికి బుద్ధుడు చాలడు, అంబేద్కర్ చాలడు, మార్క్స్ కావాలి' అనే పుస్తకంలోని చర్చను చీల్చి చెండాడిన సత్యమూర్తిని 'తెలివిలేనివాడిగా' నిలబెట్టాలనుకున్నారు. ఈ వృత్తి విప్లవ రచయిత్రి ఆ విధంగా స్పందించకుంటేనే ఆశ్చర్యపోవాలి. రంగనాయకమ్మకు వ్యంగ్యం, వెటకారం పట్ల ఉన్న ప్రేమ, గురి సిద్ధాంత చర్చపట్ల ఉండదు. 

ఈ విషయాన్ని ఆమె రాసిన 'రామాయణ విషవృక్షం' నుంచి మొన్నటి 'అస్తవ్యస్త సంస్కర్తలు' వరకు ఒకే మూస పద్ధతిలో అదే బాణిలో కొనసాగించారు. పిల్లలకు చెప్పే పొడుపు కథల్లా ఆమె రచనల్లో (అంధకారంలో.... తప్ప) వ్యంగ్యం, వెటకారం మిటకరిస్తూ ఉంటాయి. ఆమె దృష్టిలో సిపిఐ నుంచి మావోయిస్టుల వరకూ ఎవ్వరూ మార్క్సిజాన్ని తనలాగా అర్థం చేసుకోలేదు. ఇక చేసుకోలేరని కూడా ఆమె దృఢంగా నమ్ముతారు. నమ్మకాలకు, విశ్వాసాలకు మార్క్సిజం అనే సైన్స్ వ్యతిరేకమని వారు ఊహించరు. వర్తమాన మార్క్సిజానికి తానే సోల్ డిస్ట్రిబ్యూటర్‌గా, పేటెంట్ హక్కుదారుగా ఉండాలని ఆ విధంగా గుర్తించబడాలని, పోరాట రహిత మార్క్సిస్టుగా మిగిలిపోవాలని కోరుకుంటూ ఉంటారు. 

అదొక మానసిక పరిస్థితి. పడక్కుర్చీ పాండిత్యం. ప్రజా ఉద్యమాల్లో పోరాటాల్లో పాల్గొన్న అనుభవం ఉంటే రంగనాయకమ్మకు ఇలాంటి మానసిక స్థితి దాపురించేది కాదు. మొండి వైఖరిని ప్రదర్శించేవారు కాదు. 2010 అక్టోబర్, నవంబర్ మాసాల్లో నేను రాసిన 'దళిత మేధావులు - వామపక్ష మేధావులు' వ్యాసంలో నేను, ఇప్పటి వరకు చేతబడి, బాణామతి తదితర క్షుద్ర విద్యలకు ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలు కారణమని హేతువాదుల నిజనిర్ధారణ రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. కాని చేతబడి అనేది అక్షరం, మంత్రం స్వచ్ఛంగా పలకలేని నిరక్షరాస్యులైన శ్రామిక కులాలు (ఎస్సీ, ఎస్టీ, బీసీలు) ఎలా చేస్తారు? అధర్వణ వేదం చదువుకున్న పురోహితులు కదా మంత్రాలు స్వచ్ఛంగా పలకగలిగేది? కానీ ఈ దేశ చరిత్రలో ఏ ఒక్క పురోహితుడినైనా చేతబడి చేశారని పళ్లూడగొట్టిన దాఖలాలు ఉన్నాయా? చేతబడికి ఆస్తి తగాదాలకు అధికార ధిక్కారాలకు అవినాభావ సంబంధం ఉన్నాయని రాశాను. 

ఖైతాపూర్‌లో మాదిగ వెంకటయ్య తన భూమిని ఆర్టీసీ డ్రైవర్ రెడ్డి కబ్జా చేయబోగా అడ్డుకున్నాడు. అందుకు ఆగ్రహించిన రెడ్డి మాదిగ వెంకటయ్యను, అతని మిత్రుణ్ణి చేతబడి చేశారని పుకారు పుట్టించి, ఆ ఇద్దరినీ సజీవ దహనం చేయించాడు. ఈ విషయాన్నే నేను ఉదహరించినప్పుడు రంగనాయకమ్మ 'సజీవ దహనం చేసినవాళ్లు మీ ఎస్సీ, బీసీలే కదా!' అని రాశారు. ఏ మార్క్సిజమ్ ప్రకారం ఆమె అలా స్పందంచారో ఆమెకే తెలియాలి. అత్తలు కోడళ్లను హింసిస్తారన్నప్పుడు, కిరోసిన్ పోసి, గ్యాస్ లీక్ చేసి తగలపెడతారన్నప్పుడు సాధారణ ప్రజలు అనుకునే స్త్రీకి స్త్రీయే శత్రువు అని కూడా రంగనాయకమ్మ సెలవిస్తారా? లేదా పురుషాధిక్య సమాజం వేసే వెర్రివేషాలను హిందూ విషసంస్కృతిలో భాగంగా చూస్తారా? 

తన 'అస్తవ్యస్త' వ్యాసంలో రంగనాయకమ్మ ఇలా రాశారు. 
1. మార్క్సిజాన్ని ఎవరికిష్టమైనట్లు మార్చేసి దాన్ని దేశీయ మార్క్సిజంగానో జాతీయ మార్క్సిజంగానో చేయాలని ప్రయత్నించే... అని రాశారు. పెట్టుబడిదారీ దేశాల్లోని వర్గ సంబంధాలకు, వైరుధ్యాలకు వ్యవసాయక దేశమైన చైనాలోని వర్గ సంబంధాలకు, వైరుధ్యాలకు తేడా గమనించే, మావో చైనా సమాజాన్ని 5 కేటగిరీల కింద విభజించి ఏఏ సమూహాలు విప్లవానుకూలం? ఏయే సమూహాలు విప్లవ వ్యతిరేకులు? ఏయే సమూహాలు తటస్తులు? అని విశ్లేషించి, మార్క్సిజాన్ని చైనా నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించి విప్లవ పోరాటాన్ని జయప్రదంగా నడిపించారు. అదే విధంగా ఇండియాలోని దోపిడీ కులాలు ఏవి? దోపిడీకి గురయ్యే కులాలు ఏవి? అని విశ్లేషించటం మార్క్సిజం ప్రకారం నేరమౌతుందా? కులాల పుట్టుక, కొనసాగింపుకు గల కారణాలను మొట్టమొదట డా.బి.ఆర్. అంబేద్కర్ వెలికి తీసి ప్రపంచంలో ఎక్కడా లేని ఈ సంక్లిష్ట సామాజిక వ్యవస్థకు కారణం బ్రాహ్మణిజం, హిందూ మత గ్రంథాలు అని తేల్చారు. బ్రాహ్మణిజాన్ని, ఈ హిందూ మత గ్రంథాలను నిషేధిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదన్నారు. ఇందులో రంగనాయకమ్మకు అభ్యంతరం ఎందుకుండాలి? 

2. అంబేద్కర్ ప్రతిపాదించిన కుల నిర్మూలనా సిద్ధాంతం వర్గ నిర్మూలనా సిద్ధాంతానికి వ్యతిరేకమైందా? కుల నిర్మూలనా సిద్ధాంతం కుల నిర్మూలనకు ఉపయోగపడదని, దానికి ప్రత్యామ్నాయంగా కులాంతర వివాహాల్ని పరిష్కార మార్గాలుగా చూపుతున్నారు రంగనాయకమ్మ అండ్ కో. అందుకుగాను "100 కులాంతర వివాహాల్ని పరిశీలించి అవి ఏ కారణాల వల్ల జరిగాయో ఆ కారణాల్ని పట్టుకోవాలి. కులాంతర వివాహాలు నిరభ్యంతరంగా జరగటానికి ఏ పరిస్థితులు అవసరమో వాటిని సమాజం నిండా ఏర్పరిచే మార్గమే కులాల రద్దుకు శాశ్వత పరిష్కారం అవదూ?'' అని రాసి "కుల నిర్మూలనకు ఒక మహత్తర చికిత్సను ప్రతిపాదిస్తున్నారు.'' కులాల పుట్టుకకు శ్రమ విభజనే కారణమని చెప్తూ, శ్రమదోపిడీ పోతే 'కులసమస్య' తీరుతుందని ఇప్పటి వరకూ చెప్తున్న మనువాద మార్క్సిస్టు మాయావాదానికి వంతగా రంగనాయకమ్మ కొత్త సిద్ధాంతంతో తానే రాసిన 'బలిపీఠాన్ని' బద్దలు కొట్ట ప్రయత్నిస్తున్నారు. కులాంతర వివాహాల మంత్రాలతో 'కులం' చింతకాయలు రాల్తాయని ఉపదేశిస్తున్నారు రంగనాయకమ్మ. 

3. "భారతదేశపు శ్రామిక వర్గంలో ప్రధాన భాగమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర బృందాల్ని శ్రమ దోపిడీ నుంచి బయటపడమని ప్రేమతో చెప్పే సిద్ధాంతం వైపు మొహాలు తిప్పకపోవడమే అసలైన ఆశ్చర్యం.'' - శహబాష్! ఈనాటికి ఎస్సీ, ఎస్టీ, బీసీలు శ్రామికవర్గంలో ప్రధాన భాగం అని ఒప్పుకుంటున్నారు రంగనాయకమ్మ! ఈ కులాల సమూహాలు 'మొహం' తిప్పకపోతేనే మహత్తర తెలంగాణ సాయుధ పోరాటం నడిచిందా? 1969 వసంత మేఘ గర్జన ఉరిమిందా? ఈనాటి దండకారణ్య ఉద్యమాన్ని ఈ కుల సమూహాలు లేకుండా కేవలం నూటికి 10 మంది కూడా లేని దోపిడీ కులాలు నిర్మిస్తున్నాయా? ఈ పోరాటాల్ని రంగనాయకమ్మ లేక వారు రాసుకుంటూ పోతూ, అమ్ముకుంటూ పోయిన పుస్తకాలు చేసాయా? 

ఇక బుద్ధుణ్ణి తీసుకుంటే - "అది అష్టాంగ మార్గం. అది అన్నిటికీ నిరుపయోగం'' అని సెలవిచ్చారు. కానీ త్రిపిటకాల సారాంశంలో టూకీగా 1. మానవ సమాజంలో దు:ఖానికి కారణం భిన్న ప్రయోజనాల మధ్య ఘర్షణ. 

2. సంపద మీద వ్యక్తిగత ఆధిపత్యం మరో వర్గానికి దు:ఖాన్ని (దోపిడీకి గురవటం) కల్గిస్తుంది.

3. ఈ దు:ఖానికి గల కారణాన్ని నిర్మూలించడం ద్వారా దు:ఖాన్ని పోగొట్టడం సంఘ శ్రేయస్సుకు అవసరం.

4. మనుష్యులందరూ సమానులే!

5. మతానికి దేవు ణ్ణి కేంద్రంగా చేయటం తప్పు.

6. సత్యం కోసం, న్యాయం కోసం కాకపోతే యుద్ధం చేయటం తప్పు.

7. ఏదీ శాశ్వతం కాదు. ప్రతిదీ మా ర్పుకు లోనవుతుంది.

8. మనిషిని కొలవటానికి ప్రతిభ తప్ప పుట్టుక ప్రమాణం కాదు.

9. ముఖ్యమైనది ఉన్నత ఆదర్శాలు తప్ప ఉన్నత కులం కాదు. ఇవీ 2500 సంవత్సరాలకు పూర్వం బుద్ధుడు బోధించిన విషయాలు. పైన పేర్కొన్న బుద్ధుని బోధనల్లో ఆక్షేపించవలసింది ఏముంది? హింస ఒక 'క్రీడ్'గా కాకుండా ఒక 'నీడ్'గా మాత్రమే ఉం డాలన్నాడు బుద్ధుడు. రాజ్యం ఉంటే హింస అనివార్యం. మాక్స్ స్టిన్న ర్ అన్నట్లు ప్రజాస్వామ్యంలో నేరస్తుణ్ణి రాజ్యం ఉరితీస్తే అది చట్టం. అదే పని వ్యక్తి చేస్తే నేరమౌతుంది. అందుకే హింసారహిత మానవ సమాజాన్ని బుద్ధుడు ఆకాంక్షించాడు. రాజ్యమే అంతరించిపోవాలన్నాడు మార్క్స్. మరి బుద్ధుడికి, మార్క్స్‌కు వైరుధ్యమెక్కడ? శ్రామిక వర్గ నియంతృత్వం శాశ్వతంగా ఉండటం క్షేమం కాదన్నాడు అంబేద్కర్. శ్రామికవర్గ నియంతృత్వమే కాదు ఏ నియంతృత్వమూ రాజ్యమూలేని సమాజాన్ని ఆకాంక్షించాడు మార్క్స్. ఈవిషయాల్ని రంగనాయకమ్మ గమనిస్తే అనవసరమైన వివాదాల్లోకి పోనక్కరలేదు. 



1930-40 సంవత్సరాల్లో రంగనాయకమ్మ మేధోపూర్వీకులు (ఇ.ఎం.ఎస్., డాంగే) సమకాలీకులు (బిపిన్‌చంద్ర, అరుణ్‌శౌరి) అం బేద్కర్‌ను చీలిక ఉద్యమకారుడని, డేంజరస్ బ్రిటిష్ ఏజెంటనీ ఆడిపోసుకున్నారు. కానీ ఆనాడే అంబేద్కర్ సోషలిస్టులకు ఇచ్చిన సలహా ఏమంటే ఈ దేశంలో మీరు ఏ దిక్కుకు నిలబడి చూసినా మీకెదురుగా కులభూతం దారికడ్డంగా నిలబడి ఉంటుంది. అట్టి కులభూతాన్ని సం హరించకుండా సోషలిజాన్ని నిర్మించలేరన్నారు. 

ఈ సలహా ఇచ్చి ఇప్పటికి 77 సంవత్సరాలు. ఈ 77 సంవత్సరాల్లో సోషలిజం స్థాపన లో ఎంత దూరం వచ్చారు? సెలిన్ హారిసన్ అనే రాజకీయ విశ్లేషకు డు (మోస్ట్ డేంజరస్ డికేడ్స్ పుస్తక రచయిత) 1960ల్లోనే 'భారతీ య వాస్తవాలకు వ్యతిరేక దిశలో దేశ కమ్యూనిస్టు నాయకత్వం శరవేగంతో పరుగెత్తుతుంది'' అన్నారు. అందుకే 1920ల్లో ప్రారంభమైన చైనా క మ్యూనిస్టు పార్టీ అక్కడి సామాజిక వాస్తవాలకు అనుగుణంగా మార్క్సి జాన్ని ఉపయోగించుకుని 27 సంవత్సరాల్లో విప్లవాన్ని జయప్రదం చేస్తే, మనదేశంలో ఇప్పటికీ ఎక్కడున్నామో అందరికీ తెలిసిన విషయమే. 

ఆధునిక ప్రపంచ చరిత్రలో 19వ శతాబ్దంలోను, అంతకు ముందు కూడా వచ్చిన వివిధ సంస్కరణోద్యమాల గర్భం నుంచే 20వ శతాబ్దపు విప్లవాలు పుట్టాయనడానికి అనేక చారిత్రక రుజువులున్నాయి. మనదేశానికి సంబంధించినంతవరకు అణచివేయబడ్డ కులాల చైతన్య ఉద్యమాలు, దోపిడీ కుల వ్యతిరేక ఉద్యమాలు, విప్లవ రాజకీయ సిద్ధాంత ప్రాతిపదికన ఏర్పడలేదనేది వాస్తవం. అయినప్పటికీ వర్గ స్పృహగల రాజకీయ ఉద్యమాలను నిర్మించటానికి కుల నిర్మూలనోద్యమాలు ఆటంకం కాకపోగా పునాదిగా ఉపయోగపడతాయనటానికి అనేక ఉదాహరణలున్నాయి. 

వాటిని అర్థం చేసుకోవటానికి ఆ ప్రజా సమూహాన్ని వర్గ పోరాటాల్లోకి ఆహ్వానించటానికి కులాల అస్తిత్వాన్ని గుర్తించ నిరాకరించే మనువాద విధేయులైన మార్క్సిస్టుల దగ్గర ఎజెండా ఏది? దీన్నే అదునుగా తీసుకున్న దళిత మేధావులు కొందరు రంగనాయకమ్మలాగే మాకు మార్క్సిజం వద్దు, అంబేద్కరిజం చాలు - అంటున్నారు. వీళ్లెందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు? కమ్యూనిస్టు పార్టీల్లో పనిచేసి, ఆ పార్టీల్లోని అగ్రకుల నాయకత్వం యొక్క దాష్టీకాన్ని ఎదుర్కోలేక బయటకు వచ్చిన వీళ్లు మార్క్సిజానికి - ఆయా పార్టీల నాయకత్వానికి మధ్య ఉన్న తేడాను గుర్తించలేకపోతున్నారు. మార్క్సిజం అనేది పీడిత జాతుల విముక్తి కొరకు రూపొందించబడ్డ తాత్విక సిద్ధాంతం అన్న విషయం గ్రహించలేకపోతున్నారు. కారణాలు అనేకం. కానీ వాస్తవం ఏమంటే... దగ్గర దారిలో వర్గ రాజకీయాలకు దూరంగా, ఉన్న వ్యవస్థలోనే జూనియర్ పార్టనర్స్‌గా కుదురుకుందామనే ఆలోచన వీళ్లల్లో ప్రబలంగా ఉంది. 

అందుకే అంబేద్కర్‌ను అడ్డంగా పెట్టుకుంటున్నారు. వీళ్లు ఆచరణాత్మక రాజకీయాల పేరిట వర్గేతర రాజకీయాల్ని, కులసంకర రాజకీయాల్ని ఆశ్రయిస్తున్నారు. ఇది గాంధీ వారసత్వమేగాని అంబేద్కరిజం కాదు. అణచివేయబడ్డ కుల, వర్గాలకు అంబేద్కరిజం-మార్క్సిజం అనేవి రెండు ఆయుధాలు. ఆ ఆయుధాల్ని ఈ దేశంలోని దళిత జాతులు ఏ విధం గా ఉపయోగించుకోవాలో తేల్చుకోవాల్సిన కీలకమైన అంశం. అంబేద్కరిజం వద్దనే మూసమార్క్సిస్టులకు, మార్క్సిజం వద్దనే అవకాశవాదులకు రంగనాయకమ్మ లాంటి వారి దగ్గరే ఆశ్రయం దొరుకుతుంది.
- డా. ఎం.ఎఫ్. గోపీనాథ్
మేనేజింగ్ డైరెక్టర్,
ఫూలే- అంబేద్కర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్

Andhra Jyothi News Paper Dated : 01.06.2012 

Wednesday, May 30, 2012

నూతన కమిటీ పేదరికాన్ని సరిగ్గా నిర్వచిస్తుందాం?



కళ్లకు కనిపించే వాస్తవమే కాదు, పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, నిపుణుల అంచనాలు ప్రణాళికా సంఘం, ప్రభుత్వం చెప్పే పేదరిక అంచనాలకన్నా చాలా ఎక్కువగా ఉన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయినా ప్రభుత్వం తన తప్పుడు లెక్కలనే కొనసాగిస్తూ వస్తున్నది. అలాంటి అంచనాల పట్ల తాజాగా పెద్ద ఎత్తున వ్యక్తమయిన నిరసన ఫలితంగా కొత్తగా ఓ కమిటీని ప్రభుత్వం నియమించక తప్పలేదు. ఈ కమిటీ అయినా తన పనిని సక్రమంగా నెరవేరుస్తుందా అన్న విషయాన్ని వేచిచూడాలి.
పేదరికాన్ని నిర్వచించేందుకు ఇటీవల ప్రభుత్వం నూతనంగా ఒక నిపుణుల కమిటీని నియమించింది. కొద్ది నెలల క్రితం ప్రణాళికా సంఘం పేదరిక రేఖ గురించి సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌ పట్ల ప్రజల్లోనూ, నిపుణుల్లోనూ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం కావడంతో ఇప్పుడు కొత్తగా కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధాని ఆర్థిక సలహా మండలి అధ్యక్షులు సి రంగరాజన్‌ నేతృత్వంలోని ఈ కమిటీలో మరో నలుగురు సభ్యులుంటారు. ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ మహేంద్రదేవ్‌, సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీకి చెందిన కె సుందరం, మహేష్‌ వ్యాస్‌, ప్రణాళికా సంఘం మాజీ సలహాదారు కెఎల్‌ దత్తా ఈ కమిటీలోని ఇతర సభ్యులు. ఇలాంటి హేమాహేమీలతో ఏర్పడిన ఈ కమిటీ తన పనిని సమర్థవంతంగా నిర్వహించి వాస్తవానికి అద్దం పడుతుందని ఆశించవచ్చు. అయితే గతంలో పేదరిక రేఖను నిర్ణయించిన వారు కూడ ఎంతో పేరు ప్రఖ్యాతులున్నవారే. అయినా పేదరికానికి వారు రూపొందించిన కొలబద్దలు, వాటి ఆధారంగా వేసిన అంచనాలు ఏ మాత్రం విశ్వసనీయంగా లేవని రుజువయింది.


1970వ దశకం తొలి సంవత్సరాల నుంచి భారత దేశంలో పేదరిక అంచనాలు తయారవుతూ వస్తున్నాయి. వీటి ప్రకారం దేశంలో పేదరిక రేఖకు దిగువన ఉన్న జనాభా 1973లో 54.9 శాతం నుంచి 1978లో 51.8 శాతానికి, 1983లో 44.5 శాతానికి, 1987లో 38.9 శాతానికి, 1993లో 36 శాతానికి, 2004-05లో 25.7 శాతానికి తగ్గుతూ వచ్చిందని ప్రభుత్వం చెబుతున్నది. కానీ కళ్లకు కనిపించే వాస్తవాలకూ, ఈ లెక్కలకూ ఏ మాత్రం పొసగడం లేదన్నది ప్రతి ఒక్కరి అభిప్రాయం. అయినా నిపుణులు మాత్రం ఏవేవో సిద్ధాంతాలను, సూత్రాలను వల్లెవేస్తూ పేదరికం తగ్గుతూ వస్తున్నదని అంటున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం వాటినే ప్రాతిపదికగా తీసుకుంటున్నది.
పేదరికానికి కొలబద్దలను నిర్ణయించే కమిటీలను కూడా ప్రభుత్వం సకాలంలో నియమించడం లేదు. వారు చేసిన సిఫార్సులను సైతం వెనువెంటనే అమల్లో పెట్టడం లేదు. ఉదాహరణకు 1979లో పేదరిక రేఖను నిర్ణయించిన ప్రభుత్వం, 1993లో కానీ లక్డావాలా కమిటీని నియమించలేదు. ఆ కమిటీ చేసిన సిఫార్సుల ప్రకారం పేదరికాన్ని అంచనాగట్టేందుకు టెండూల్కర్‌ కమిటీని దశాబ్దం దాటిన తర్వాత 2005 చివరలో నియమించింది. ఆ కమిటీ 2009లో తన నివేదికను సమర్పించింది. ఆ సిఫార్సులను 2011లో ప్రభుత్వం ఆమోదించింది.
ఓ మనిషి బ్రతకడానికి కనీసం ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం అవసరం అవుతుంది అని లక్డావాలా కమిటీ అంచనా వేసింది. పట్టణ ప్రాంతాలలో అయితే 2,400 కిలో కేలరీల శక్తిని, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 2,100 కిలో కేలరీల శక్తిని కనీసం అందించే ఆదాయమున్న ప్రతి ఒక్కరూ పేదరిక రేఖకు ఎగువన ఉన్న వారిగానే లక్డావాలా కమిటీ నిర్థారించింది. ఆ తర్వాత ఈ ఆదాయాన్ని ధరల సూచీ ఆధారంగా పెంచుతూ వస్తున్నారు. టెండూల్కర్‌ కమిటీ కూడా ఇదే విధంగా 2004-05 కు పేదరిక రేఖను నిర్ణయించింది. దాన్ని ప్రాతిపదికగా తీసుకునే పట్టణ ప్రాంతాలలో పారిశ్రామిక కార్మికుల వినియోగ ధరల సూచీ ప్రకారం, గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కార్మికుల వినియోగ ధరల సూచీ ప్రకారం పేదరిక రేఖను సవరించామని ప్రణాళికా సంఘం వైస్‌ ఛైర్మన్‌ అహ్లూవాలియా చెప్పుకొచ్చారు. ఆ విధంగా గ్రామీణ ప్రాంతాలలో కనీసం రోజుకు రూ.26, పట్టణ ప్రాంతాలలో రూ.32 ఆదాయం లభించే వారిని పేదరిక రేఖకు ఎగువన ఉన్నవారిగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ప్రణాళికా సంఘం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. కాని ఇలాంటి బూటకపు పేదరిక రేఖ పట్ల అన్ని వైపుల నుంచీ పెద్దఎత్తున నిరసన వ్యక్తమైంది. దీనితో ఈ లెక్కలు తీసిన పద్ధతిని సమర్థించుకుంటూనే, వీటిని పేదరిక రేఖకు ఎగువన ఎందరు ఉన్నారు, దిగువన ఎందరు ఉన్నారు అని అంచనా వేయడానికి మాత్రమే వినియోగించుకుంటామని, వీటిని సంక్షేమ పథకాల అమలులో ప్రాతిపదికగా తీసుకోబోమని అహ్లూవాలియా వివరణ ఇచ్చారు.
పేదరికంపై ప్రభుత్వ అధికారిక అంచనాలకు, అనేక మంది స్వతంత్ర నిపుణుల అంచనాలకు అసలు పోలికే ఉండటం లేదు. జాతీయ శాంపుల్‌ సర్వేలాంటి వాటి ఆధారంగా వేసే లెక్కలు సైతం పేదరికం ప్రభుత్వం అంచనాల కన్నా చాలా ఎక్కువగా ఉన్నదని చెబుతున్నాయి. తాజా జాతీయ శాంపుల్‌ ప్రకారం పేద ప్రజలు మొత్తం జనాభాలో 77 శాతం ఉంటారు. దేశం మొత్తం మీద కేవలం 23.5 కోట్ల మంది మాత్రమే కనీస ఆదాయాన్ని పొందుతున్నారు. 83.5 కోట్ల మందికి సహాయం అవసరమవుతుంది. 2010 మానవాభివృద్ధి నివేదిక ప్రకారం సైతం భారత దేశంలో పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు 55.4 శాతం. బీహారులో అయితే అత్యధికంగా 61.4 శాతం కుటుంబాలు పేదరిక రేఖకు దిగువన ఉన్నాయి.


మనవాళ్లు పదేపదే వల్లించే ప్రపంచబ్యాంకు భారత దేశంలో పేదరికంపై వేసిన అంచనాలు చూస్తే మరింత ఆశ్చర్యం కలుగుతుంది. 2005 నాటికి రోజుకు 1.25 డాలర్ల కన్నా తక్కువ ఆదాయం లభించే వారిని ప్రపంచబ్యాంకు పేదలుగా పరిగణిస్తుంది. దీని ప్రకారం భారతదేశంలో పేదరిక రేఖకు దిగువన ఉన్నవారి సంఖ్య 1981లో 42.05 కోట్లు, 1990లో 43.55 కోట్లు, 2005లో 45.58 కోట్లు ఉంది. 2005కు ప్రణాళికా సంఘం అంచనా వేసిన పేదల సంఖ్య 30.2 కోట్ల కంటే ఇది చాలా ఎక్కువ. జనాభాలో పేదల శాతం తగ్గుతూ వస్తున్నదని ప్రపంచబ్యాంకు గుర్తించింది. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం పేదల శాతం 1981లో 51.3 శాతం నుంచి 1990లో 51.3 శాతానికి, 2005లో 41.6 శాతానికి తగ్గుతూ వచ్చింది. అయితే ఈ తగ్గుదల రేటు అంతకంతకూ తగ్గుతూ వస్తున్న విషయాన్ని కూడా ప్రపంచబ్యాంకు గమనించింది.
ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) లెక్కలయితే ప్రభుత్వానికి మరీ ఆశాభంగం కలిగిస్తాయి. ఆసియాలో సగటు ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని ఎడిబి రోజుకు 1.35 డాలర్లను కనీస ఆదాయంగా నిర్ణయించింది. దీని ప్రకారం 2005లో భారత దేశంలో పేదల సంఖ్య 62 నుంచి 74 కోట్ల వరకూ ఉంటుందని ఎడిబి అంచనా. ఆసియాలో ఒక్క నేపాల్‌ తర్వాత పేదల శాతం అత్యధికంగా ఉన్న రెండవ దేశంగా భారత్‌ను ఎడిబి గుర్తించింది. నేపాల్‌లో పేదల శాతం 55.8 శాతం కాగా, భారత్‌లో 54.8 శాతం, బంగ్లాదేశ్‌లో 42.9 శాతం, కంబోడియాలో 36.9 శాతం, భూటాన్‌లో 31.8 శాతం, ఫిలిప్పైన్స్‌లో 29.5 శాతం, పాకిస్తాన్‌లో 24.9 శాతం, ఇండోనేషియాలో 24.1 శాతం, వియత్నాంలో 16 శాతం, శ్రీలంకలో 9.9 శాతం పేదలున్నట్లు ఎడిబి గుర్తించింది. చైనా మాత్రం ఈ జాబితాలో చోటుచేసుకోలేదు. ఎడిబి అంచనాల ప్రకారం భారత దేశం యుఎన్‌డిపి లక్ష్యంగా పెట్టినట్లు 2015 నాటికల్లా 1990 నాటి పేదరికంలో సగాన్ని తగ్గించాలంటే, ఏడాదికి 2 శాతం చొప్పున పేదల శాతం తగ్గాల్సి ఉంటుంది. ప్రస్తుత ధోరణి చూస్తే అలా తగ్గడం అసాధ్యమనిపిస్తుంది. ఒకవేళ అలా తగ్గిందని అనుకున్నా పేదలు అప్పటికీ 32 శాతంగా ఉంటారు.


కళ్లకు కనిపించే వాస్తవమే కాదు, పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, నిపుణుల అంచనాలు ప్రణాళికా సంఘం, ప్రభుత్వం చెప్పే పేదరిక అంచనాలకన్నా చాలా ఎక్కువగా ఉన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయినా ప్రభుత్వం తన తప్పుడు లెక్కలనే కొనసాగిస్తూ వస్తున్నది. అలాంటి అంచనాల పట్ల తాజాగా పెద్ద ఎత్తున వ్యక్తమయిన నిరసన ఫలితంగా కొత్తగా ఓ కమిటీని ప్రభుత్వం నియమించక తప్పలేదు. ఈ కమిటీ అయినా తన పనిని సక్రమంగా నెరవేరుస్తుందా అన్న విషయాన్ని వేచిచూడాలి. పేదరికాన్ని అంచనా వేసేటప్పుడు కేవలం వినియోగ వ్యయాన్నే కాకుండా, ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని కమిటీ ఛైర్మన్‌ రంగరాజన్‌ చెబుతున్నారు. బతకడానికి అవసరమయ్యే కనీస ఆహారం మాత్రమే కాకుండా, గృహ సదుపాయం, విద్య, ఆరోగ్యం, తదితర అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలని ఎప్పటి నుంచో పలువురు నిపుణులు చెబుతూ వస్తున్నారు. అయినా ప్రభుత్వం పేదరికాన్ని తగ్గించి చూపడంలో భాగంగా ఇలాంటి విస్తృతమైన విధంగా పేదరికాన్ని అంచనా గట్టేందుకు పూనుకోవడం లేదు.


నూతన కమిటీ ఏర్పాటును ప్రకటించే సమయంలో కేంద్ర ప్రణాళికా సహాయమంత్రి అశ్వనీ కుమార్‌ మాటలు గమనిస్తే అలాంటి ఆశలకు తావుండదేమో అనిపిస్తుంది. పేదరికాన్ని అంచనా కట్టే పద్ధతులను మార్చుకోవాలని చెబుతూనే, అలాంటి పరిస్థితికి దారితీసిన పరిస్థితుల గురించి ఆయన చెప్పిన ధోరణి ఎగతాళి చేసేట్లుగా ఉంది తప్ప చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించదు. 'నేడు పేదరికం పట్ల ప్రజల అవగాహనలోనే పెద్ద మార్పు వచ్చింది. ఇరవై పైసలు పెట్టి పోస్టు కార్డు రాసే బదులు మొబైల్‌ ఫోన్లను వినియోగిస్తున్నాము. ప్రతి ఒక్కరూ రీబాక్‌ జోళ్లు ధరిస్తున్నారు. సైకిళ్లకు బదులు స్కూటర్లపై ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు సమస్య రోటీ, కపడా, మకాన్‌ కాదు, రీబాక్‌లు, కమిటీలు' అని ఆయన మాట్లాడుతున్నాడంటే ప్రభుత్వం పేదల పట్ల ఎంత చిన్నచూపుతో ఉందో అర్థం చేసుకోవచ్చు.
-గుడిపూడి విజయరావు
Prajashakti News Paper Dated : 30/05/2012 

పాలమూరు - పరకాల-ఎక్కడికి---హరగోపాల్



పాలమూరుకు పరకాలకు చాలాతేడా ఉంది. పాలమూరు జిల్లా చాలా చాలా వెనుకబడినజిల్లా. చైతన్యస్థాయి ఎదగవలసిన జిల్లా. వలస లు, కరువులతో బాధపడుతున్న ప్రాంతమిది. అదికాక ముస్లింలసంఖ్య కూడా ఎక్కువే. ఇవన్నీ పరకాలకు వర్తించవు. అయినా తెలంగాణ పాలక వర్గాలు, బలమైన సామాజికవర్గాలు, కులాలు కాంగ్రెస్, తెలుగుదేశంతో విసిగిపోయిన నాయకత్వం ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నది. జగన్‌మోహన్‌డ్డిని తెలంగాణలోకి రానిస్తే ఆయనను అంగీకరించడానికి చాలామంది తెలంగాణ నాయకులు సిద్ధంగా ఉన్నారు. జగన్‌మోహన్‌డ్డి వ్యక్తిత్వం ఎలాంటిది? ఇంత సంపద ఎలా కూడబెట్టుకున్నాడు? ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు?ఇవన్నీ తెలంగాణలోని బలమైన సామాజిక వర్గాన్ని ఆందోళనకు గురిచేయడం లేదు. తెలంగాణ భవిష్యత్తు ఏమిటి? వస్తే ఎవరైనా తెస్తే ముఖ్యమంత్రి పదవికి, సంపద కూడబెట్టుకోవడానికి అవకాశాలు పెరగొచ్చు. 

ఉమ్మడి రాష్ట్రంగా కొనసాగితే ఇప్పుడు రాజశేఖర్‌డ్డి, చంద్రబాబు కల్పించిన అధికారంలో వాటాకు, ఆస్తులు పెంచుకోవడానికి మార్గాలు బాగానే ఉన్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం, ప్రపంచబ్యాంకు నుంచి వచ్చిన సబ్ కాంట్రాక్టులు, తెలుగులో చెప్పాలంటే ఉప ఉప కాంట్రాక్టులు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో వాటాలు, మద్యం నుంచి ధారావాహికంగా వచ్చే డబ్బు.. ఇదీ బాగానే ఉంది. ఒకరకంగా బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఇది జాతీయ పార్టీ, అధికారంలోకి ఎప్పుడైనా రావచ్చు. మతతత్వం గురిం చి మాట్లాడితే మంచిదే కదా. మతం ద్వారా పేదవాళ్లను మభ్యపెట్టవచ్చు. మనుషులను విభజించవచ్చు. గుజరాత్ లాంటి ‘సమర్థవంతమైన’ పాలన రావచ్చు. నరేంవూదమోడి లాంటి ముఖ్యమంత్రి మనలో ఎవరైనా కావ చ్చు. ఇలా ఆలోచనా సరళి. అందుకే తెలంగాణ ప్రాంతం విషయంలో బీజేపీ చాలా ధీమాగా ఉంది. తెలంగాణ ప్రజలకు ఇది ఒక అగ్ని పరీక్ష.

మిగతా అన్ని పార్టీలు బాగున్నాయా? బీజేపీ ఒక్క పార్టే తక్కువా అని అడగవచ్చు.నిజానికి చాలా వేగంగా బీజేపీలో ముందుకుపోతూ ఎదుగుతున్న యువ నాయకుడు కిషన్‌డ్డి.ఆయన మర్యాదకైనా తన ‘పాదయాత్ర’ ప్రారంభించే ముందు నాక్కూడా ఫోన్ చేశాడు. తెలంగాణ కోసమే కదా అని నేను మర్యాద పూర్వకంగానే మాట్లాడాను. కానీ ఆయన శైలి, మాటలు, దృక్ప థం తెలంగాణ ప్రజల మనస్తత్వానికి కాని చారివూతక స్పృహకు కాని ఎక్కడా పొంతన కుదరదు. ఆయన వెంకయ్యనాయుడు శిష్యుడు. ఎందుకు ఆయన సుష్మా స్వరాజ్‌ను అభిమానించొచ్చు కదా. వెంకయ్యనాయుడు తెలంగాణ కోసం ఏం మాట్లాడాడో నాకు తెలియదు కాని సుష్మా స్వరాజ్ తెలంగాణ గురించి పార్లమెంటులో బాగానే మాట్లాడింది. రెండు ఆయన నరేంవూదమోడీ ప్రధా ని కావాలన్నాడు. నాకు భయమేసింది.

తెలంగాణలో పుట్టి పెరిగిన వ్యక్తి నరేంవూదమోడిని అభిమానించడం నమ్మరాని విషయం. సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లో, యశ్వంత్‌సిన్హానో, జశ్వంత్‌సింగ్ ఇంతమంది ఉండగా ఈయన వేలాదిమంది ముస్లింలను ఊచకోత కోసిన గుజరాత్ ముఖ్యమంవూతిని ఎందుకు సమర్థిస్తున్నాడు? అంటే గోద్రా సంగతి ఏమిటి అని అడగడం తప్ప వేరే జవాబులేదు. గోద్రా దుర్మార్గంలో పాల్గొన్న వాళ్ళను శిక్షించండి, కాని ఒకరు నేరం చేస్తే ఇంకా తల్లి గర్భం నుంచి బయటికి కూడా రాని అమాయకపు శిశువుకు ఎందుకు శిక్ష! గోద్రా అంటే ఎక్కడున్నదో తెలియని అమాయకపు ముస్లిం మహిళల పట్ల ఎందుకు అంత అరాచకత్వం? నిజానికి గుజరాత్ ఘటనల తర్వాత మనిషి మీద, మానవత్వం మీదే అనుమానమొచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ దేశ జాతీయ మీడియా, ఇంగ్లిషు చానెల్స్ నరేంవూదమోడికి విపరీతమైన ప్రచారం కల్పిస్తున్నాయి. 

నరేంవూదమోడి కేరళలో కమ్యూనిస్టుపార్టీ హింసను ఖండించడమే కాక, హింసకు ప్రజాస్వామ్యంలో స్థానంలేదు అని అంటే ఏ మా త్రం సిగ్గులేని మీడియా దానికి ప్రచారం కల్పించింది. కానీ ఒక్కడు కూడా గుజరాత్ హింసాకాండ సంగతి ఏంటి అని అడగలేదు. ఈ మొత్తం ప్రక్రియను గమనించకుండా, తెలంగాణలో ఎదుగుతున్న ఒక బీజేపీ నాయకుడు మోడిని సమర్థించడం తెలంగాణ ప్రజాస్వామ్య సంస్కృతికి అంగీకారంకాదు, కాకూడదు. అందుకే తెలంగాణ జేఏసీ కోదండరాం, సింగిడి రచయితలు స్పష్టంగానే బీజేపీ రాజకీయాలకు దూరమవుతున్నారు. నిజానికి సంయమనంతో మాట్లాడుతున్న సీహెచ్.విద్యాసాగర్‌రావు, బండారు దత్తావూతేయలు ఎందుకు అగ్రనాయకులుగా అంగీకరించడడం లేదో అర్థంకాదు. నిజానికి ఇద్దరూ కేంద్ర కేబినేట్‌లో పనిచేసిన నాయకులే. 

ఇక ఇంకొక ముఖ్య అంశానికి వస్తే, పాలమూరు ఎన్నికల నుంచి ముస్లింలను విమర్శిస్తూ రజాకార్ల నుంచి ప్రస్తావించారు. ఇప్పుడు రజాకార్ల ప్రస్తావన ఎందుకు అని మనం అడగవచ్చు? దానికి మించి బందగీ, షోయబుల్లాఖాన్‌ల త్యాగాలను గుర్తుచేసుకోవచ్చు.ఇంకా చరివూతలోకి వెనక్కి వెళ్ళాలంటే తుర్రెబాజ్‌ఖాన్ సహసాన్ని గురించి మాట్లాడవచ్చు.కలియుగ దైవమని భావించే వెంక సహచరి అని ప్రచారంలో ఉండే బీబీనాంచారి గురించి మాట్లాడొచ్చు. తెలంగాణలోని పీర్ల పండుగ గురించి మాట్లాడవచ్చు. ముస్లింల గురించే మాట్లాడాలంటే ఇదంతా తెలంగాణ వారసత్వమే కదా, దాని మీదే మాట్లాడొచ్చు కదా, అయితే పరకాలలో మాట్లాడుతూ ‘రజాకార్ల గురించి మాట్లాడడమే మతతత్వమయితే నేను మతతత్వవాది’ నే అని కిషన్‌డ్డి అన్నారు. రజాకార్ల దురాగతాల గురించి, దుర్మార్గాల గురించి నాకు తెలిసినంత కిషన్‌డ్డికి తెలిసే అవకాశం లేదు. ఊళ్లో కాసీం రజ్వీని మా గ్రామస్తులు చంపారు. అయితే మా గ్రామం కాసీం రజ్వీని చం పింది. తుర్రెబాజ్‌ఖాన్‌కు రక్షణ కల్పించింది. రజాకార్లను గుర్తుపెట్టుకొని ఇతర త్యాగాలు చేసిన ముస్లింలను గుర్తుపెట్టుకోకపోవడం మతతత్వం.

ఇంతకు ముందు రాసిన వ్యాసంలో నేను ప్రస్తావించిన అంశాల గురించి కిషన్‌డ్డి ఆలోచించాలి. చరివూతను చెప్పేటప్పుడు సమక్షిగంగా చెప్పాలి. రజాకార్ల చేసిన దుర్మార్గం గుజరాత్‌లో దుర్మార్గం, సల్వాజడుం దుర్మార్గాలతో పోల్చవచ్చు. రజాకార్ల పేరు వింటేనే మా అమ్మ కొంత భయంగా మాట్లాడేది ఇంట్లో ఎక్కువ అల్లరి చేసే తన కొడుకును రజాకార్ అని పిలిచేది. వాళ్ళు హిందూ స్త్రీ పట్ల చేసిన తప్పు లు క్షమించరానివే, వాటిని తప్పక గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పుడూ పునరావృత్తం కాకుం డా చూసుకోవాలి. కాని వాళ్లకు రక్షణ కల్పించి, గడీలలో వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించి సహకారం చేసిన హిందూ భూస్వాముల గురిం చి ఎందుకు మాట్లాడడం లేదు. వాళ్లకు వ్యతిరేకంగా సహసంగా పోరాడిన ఆనాటి కమ్యూనిస్టుపార్టీని ఎందుకు అభినందించడం లేదు? వాళ్ళ దుర్మార్గాలకు బలైన కమ్యూనిస్టు కార్యకర్తల గురించి పరకాలలో ఎందుకు మాట్లాడడం లేదన్నదే ప్రశ్న.

తెలంగాణలో బీజేపీ పార్టీ నిలదొక్కుకోవాలంటే గుజరాత్ నమూనా పనికిరాదు. ఆది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ విషయం బీజేపీలో చాలా చురుకుగా పనిచేసి మధ్యంతరంగా చనిపోయిన మహబూబ్‌నగర్ ఝాన్సీ తో నేను ప్రస్తావించేవాణ్ణి. ఆమె ఎప్పుడూ నే ను ఆ విషయాలు, మతతత్వ రాజకీయాలు ప్రస్తావించలేదు కదా అనేది. నిజం కూడా ఆమె చాలా ఆవేశంగా తెలంగాణకు గడిచిన అన్యాయాన్ని గురించి మాట్లాడేది. ఇంతకుముందే ఇతర వ్యాసాల్లో ప్రస్తావించిన అంశాలను మళ్లీ ప్రస్తావించవలసిన అవసరం ఏర్పడింది. పాలమూ రు జిల్లాలో కోస్గి దగ్గర ఒక గ్రామంలో వలసల గురించి అధ్యయనం చేయడానికి వెళ్ళి, వాళ్ళ గ్రామంలో అట్టడుగున ఉండే అతిపేద ఐదు కుటుంబాలు ఏవి అని అడిగితే పేదరికంలో కూరుకుపోయిన ఆ గ్రామ దళితులు ఒక ముస్లిం కుటుంబాన్ని చూపించారు. 

అలాగే మా నాన్న గంటల తరబడి పూజ చేసేవాడు. మత విశ్వాసాలు చాలా బలంగా ఉన్నవాడు. కాని మా గ్రామంలో ఉండే ముస్లింలందరూ ఆయనను అభిమానించేవారు. ఆయన చనిపోయిన రోజువాళ్ళే దుకాణాలను మూయించారు. ఆయనకు చేసే కర్మకాండ ఖర్చు కొంత భరిస్తామని ఒక ముస్లిం అబ్బాయి చాలా పట్టుపట్టాడు. అంతేకాదు గుజరాత్ మానవ హననం తర్వాత సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దాదాపు 14 గంటలు జరిగిన మీటింగ్‌లో ప్రతి తెలంగాణ వ్యక్తి కన్నీ ళ్లు పెట్టుకున్నాడు. కొందరు బోరుమని ఏడ్చారు. ఇది తెలంగాణ విశిష్ట సంస్కృ తి. ఈ సంస్కృతిని విస్మరించి, ఇంత మానవీయ విలువలను విధ్వంసం చేసే ఏ ప్రయత్నాన్నైనా తెలంగాణ ప్రజలు తిప్పికొడతారు. కొట్టాలి కూడా.

పొఫెసర్ జి. హరగోపా
Namasete Telangana News Paper  Dated : 31/05/2012 

సిబిఐ దర్యాప్తుల్లో దళిత కోణం ---కత్తి పద్మారావు,



నిజానికి సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రులు తెలంగాణకే కాదు సీమాంధ్ర దళిత బహుజనులకు పెద్ద ఎత్తున సామాజిక ద్రోహం చేశారు. వీరి అక్రమాల వల్లనే తెలంగాణ డిమాండ్ కూడా ముందుకు వచ్చింది. అగ్రకుల రాజ్యాధికార స్వభావాన్ని దళిత బహుజనులు అర్థం చేసుకోవల్సిన అవసరం వుంది. ఆర్థిక నేరాలు, రాజకీయ హత్యలు, అబద్ధ ప్రచారాలతో ఇప్పుడు నడుపుతున్న కార్పొరేట్ రాజకీయాల స్వభావాన్ని అర్థం చేసుకోవల్సిన చారిత్రక సందర్భం ఇది. 


కేంద్ర నేర పరిశోధక సంస్థ (సిబిఐ) దేశవ్యాప్తంగా తన కార్యక్రమాలు ముమ్మరం చేసింది. అధికారంలో ఉన్న పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తుందనే అపప్రథ ఈ సంస్థపై ఉన్నది. అయితే వివిధ కుంభకోణాల్లో మాజీ కేంద్ర మంత్రులు రాజా (డిఎంకె), సురేశ్ కల్మాడీ (కాంగ్రెస్), కరుణానిధి తనయ కనిమొళిని అరెస్ట్ చేయడం వల్ల సిబిఐ కొంత పారదర్శకత కూడా చూపిస్తూనే వెళుతుందనక తప్పదు. 



దళిత బహుజనులు కరుణాశీలురు. సహజంగానే ఎవ్వరు అరెస్ట్ అయినా వారు సానుభూతి చూపుతారు; అయితే తమ భూములు, సంపదలను దోచుకున్న వారు అరెస్టయినప్పుడు, శిక్షలకు గురయినప్పుడు కూడా జాలిపడడం ఆశ్చర్యం. నిజమే, చంద్రబాబు లాంటి వాళ్ళు ఎందరో ఇంకా నేర పరిశోధనకు గురికావలసివుంది. దాని కోసం కూడా చిత్తశుద్ధితో అందరూ కృషిచేయాలి. సుప్రీంకోర్టులో ఈ విషయం పెండింగ్‌లో ఉంది. ఒక దళిత మంత్రి చేసిన ఆరోపణల మూలంగా సిబిఐ నాలుగు రోజుల క్రితం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేసింది. ఆయన అక్రమార్జన వ్యవహారాలను రాజకీయ కోణం నుంచి కాకుండా నిష్పక్షపాతంగా సిబిఐ కోణం నుంచి దళిత బహుజనులు చూడాల్సిన సందర్భం ఇది. ఒకవేళ ఇటువంటి నేరపరిశోధనలే లేకపోతే దేశసంపద ఏమౌతుందో కూడా ఆలోచించాల్సివుంది. అందరికీ చెందాల్సిన సంపద కొందరి గుత్తస్వామ్యం కావడం రాజ్యాంగ విరుద్ధం అనే విషయాన్ని కూడా అవగాహన చేసుకోవాలి. 



వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి మీద భాతర శిక్షా స్మృతి సెక్షన్ 120 బి. రెడ్ విత్ 480, 409, 468, 471; అవినీతి నిరోధక చట్టంసెక్షన్ 13 (2) రెడ్ విత్ (13) 1 సి.డి. కింద కేసులను సిబిఐ నమోదు చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే పి.శంకర్‌రావు 2011 ఆగస్టులో రాసిన ఒక ఉత్తరం మేరకు జగన్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణపై రాష్ట్ర హైకోర్టు విచారణకు ఆదేశించింది. ఆ విచారణలో భాగంగానే సిబిఐ తన దృష్టిని జగన్‌పై కేంద్రీకరించింది. 



2004 మార్చి చివరినాటికి రూ.11 లక్షల ఆదాయం ఉన్న జగన్ నేడు రూ.43వేల కోట్ల ఆస్తులకు అధిపతి. ఇదెలా సాధ్యమయింది? జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలోని వేలాది ఎకరాల భూములు బహుళజాతి కంపెనీలకు, దేశీయ పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేసి తన కుమారుడి పరిశ్రమల్లోకి దొడ్డి దోవన ధనాన్ని ప్రవహింప జేశారు. జగన్ కంపెనీల్లో భారీ ప్రీమియంతో వారు పెట్టుబడులు పెట్టారని సిబిఐ తన పరిశీలనలో నిగ్గు తేల్చింది. హెటిరో గ్రూప్, ఇండియా సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, పొట్లూరి వరప్రసాద్, నిమ్మగడ్డ ప్రసాద్, పెన్నా గ్రూప్, ల్యాంకో గ్రూప్, సజ్జల గ్రూప్ తదితరులు రూ.250 నుంచి రూ.1140 వరకు ప్రీమియంతో జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని సిబిఐ గుర్తించింది. 



వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశ్రిత పక్షపాతానికి ఒడికట్టారు, కొందరు పారిశ్రామిక వేత్తలతో కుమ్మక్కై దేశ సంపదనే అమ్మడానికి చూశారు. ఇదంతా ఆయనొక పథకం ప్రకారమే చేశారు. దేశ సంపదను కుదువ పెట్టడానికి ఆయన ఎన్నుకున్న పారిశ్రామికవేత్తలందరూ అక్రమార్జనలో గజగండులే. జగన్‌కు ముందు అరెస్ట్ అయిన నిమ్మగడ్డ ప్రసాద్ విషయానికి వస్తే ఈ విధమైన దోపిడీలో అతనికి చాలా ప్రావీణ్యం వున్నట్టు కనబడుతుంది. పన్నెండు సంవత్సరాలకు ముందు ఆయన ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ మాత్రమే. ఎంతో నష్టాలకు గురైన ఔషధ సంస్థ హెరెన్ డ్రగ్స్‌ను కొనుగోలు చేసి మ్యాట్రిక్స్ లేబోరేటరీస్ అని పేరు మర్చారు. 



2007లో అమెరికన్ ఔషధ సంస్థ 'మిలన్'కు మ్యాట్రిక్స్ లేబోరేటరీస్‌ను అమ్మడం ద్వారా రూ.570 కోట్లు సంపాదించారు. మారిషస్‌కు సంబంధించిన కొన్ని సంస్థల ద్వారా రూ.864.4 కోట్ల డబ్బును జగన్ మీడియా సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు సిబిఐ ఆరోపిస్తుంది. ఆ తరువాత కొంత వాటా అమ్మిన తరువాత కూడా రూ.505 కోట్ల మేరకు ప్రసాద్ పెట్టుబడులు యింకా ఆ మీడియా సంస్థలో మిగిలే వున్నాయి. నిమ్మగడ్డ ప్రసాద్ ప్రారంభించిన గిల్ క్రిస్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ఫా విల్లాస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ఫా ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్‌లు జగన్‌కు చెందిన సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టాయని సిబిఐ భావిస్తుంది. 



ఈ పరిశోధన చేసే కొద్దీ దేశీయ వనరులు అమ్మడానికి మంత్రిమండలిని మొత్తాన్ని ప్రభావితం జేసి అక్రమంగా 26 జీ.ఓ.లు, వైఎస్ రాజశేఖర రెడ్డి తన మంత్రులపై వొత్తిడితో జారీ చేయించారని అర్థమవుతుంది. ఈ వ్యవహారంలో మోపిదేవి వెంకట రమణ, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణ వంటి మంత్రులందరికీ ప్రమేయముంది. ఇప్పటికే మోపిదేవిని సిబిఐ అరెస్టు చేసింది. ఈ ప్రక్రియలో బలమైన రెడ్డి మంత్రులు నెవ్వరినీ రాజశేఖరరెడ్డి పెట్టుకోలేదు. కాపులు, ఎస్సీ, బీసీ మంత్రులే ఎక్కువగా ఇందులో ఇరికించబడ్డారు. ఇద్దరు మహిళా మంత్రులను ఇరికించారు. 



'వాన్ పిక్' ప్రాజెక్టులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు ధారాదత్తం చేసిన భూముల్లో ఎస్సీ, బీసీ రైతులే ఎక్కువగా ఉన్నారు. నిజానికి ఈ విషయాలపై ఎవరు అరెస్టవుతున్నారు? కేసులు ఎవరి మీద జరుగుతున్నాయి? అనే దాని మీద కంటే దేశ సంపద ఎలా ఈ అవినీతి రాజకీయవేత్తల వల్ల కొల్లగొట్ట బడుతుంది? దేశం ఎలా తాకట్టులోకి వెళుతుంది? అనే విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎస్సీ బీసీ మంత్రులు కమ్మ, రెడ్డి ఆధిపత్యంలో నేరానికి గురౌతున్నారని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కమ్మా రెడ్డి పెట్టుబడిదారీ రాజకీయ దోపిడీ యుద్ధం అయినప్పటికీ కూడా రెండు వర్గాల వల్ల నష్టపోతున్నది దళిత బహుజనులే అని గుర్తించాలి. 



920 కిలోమీటర్ల సముద్ర తీరం కలిగిన కోస్తా తీర ప్రాంత వాసులైన బెస్తలు, యాదవులు, దళితులు, అగ్ర కులాలకు చెందిన కొందరు రైతులు కూడా ఈ మోసపూరితమైన చర్యల వల్ల తమ జీవన వ్యవస్థను కోల్పోయారు. 2007లో ప్రపంచ స్థాయిలో ఒక నౌకాశ్రయాన్ని, పారిశ్రామికవాడను నిర్మిస్తామని వాన్‌పిక్ ప్రాజెక్టును వ్యూహాత్మకంగా ప్రారంభించారు. మొదట ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, యుఏఇ లోని రస్-అల్-ఖైమా సంస్థకు మధ్య ఒప్పందం కుదిరింది. రస్-ఆల్-ఖైమా ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ యుఏఇ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించింది. ఈ ఒప్పందం కుదిరిన వెంటనే ఆ ప్రాజెక్టులో 49 శాతం ఈక్విటీతో భారతీయ భాగస్వామిగా ఎమ్ఈహెచ్‌పీఎల్ చేరింది. 



గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కారిడార్‌లను, ఓడరేవులను నిజాంపట్నం నౌకాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించి బదలాయించే పద్ధతిని ఈ సంస్థలు చేపట్టాల్సివుంది. ఈ సంస్థ నిజానికి మొత్తం 'వాన్ పిక్' ప్రాజెక్టును ఎంఇహెచ్‌పిఎల్ - ప్రక్రియల సంయుక్త సంస్థ అయిన వాన్‌పిక్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (విపిపిఎల్) అభివృద్ధి చేయాల్సి ఉంది. కాగా ప్రసాద్ ఇంతలో తన చెప్పుచేతల్లో ఉండేలా 'వాన్ పిక్ ప్రాజెక్ట్ లిమిటెడ్' పేరిట సమాంతరంగా మరో సంస్థను సృష్టించారు. 'వాన్ పిక్' ప్రాజెక్టు పేరుతో ఆ కొత్త సంస్థ ఇప్పటిదాకా దాదాపు 13 వేల ఎకరాల భూమిని చేజిక్కించుకుంది. 



నిమ్మగడ్డ ప్రసాద్ ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో భూములు అపహరించి ఏ విధమైన నిర్మాణాలు చేయకపోవడం వల్ల దళిత బహుజన రైతులు అటు ఉద్యోగాలు లేక, ఇటు ఆ పరిశ్రమల ద్వారా వచ్చే ఉపాధి లేక దిక్కులేని వారయ్యారు. దీని వలన పదిమంది పారిశ్రామిక వేత్తలు, పదిమంది రాజకీయవేత్తలు బాగుపడితే ప్రయోజనం ఏమిటి? ఇందుకేనా ఇంగ్లీషు వాళ్ళ మీద మనం పోరాడి స్వాతంత్య్రం తెచ్చుకొంది? డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగంలో దేశసంపదను గూర్చి, సహజ వనరుల సంరక్షణ గూర్చి తెలిపిన అంశాలు మృగ్యమవ్వాల్సిందేనా? ఇక దళిత బహుజనులు ఆలోచించాల్సిన విషయం. 



కోస్తా తీర ప్రాంతంలో అనేక భూముల్ని వివిధ కంపెనీలకు ప్రభుత్వాలు ధారాదత్తం చేయడం సబబేనా? విశాఖపట్నంలో ఫార్మా సిటీకి 2,143 ఎకరాల భూమిని కేటాయించిన విషయంలో రాంకీ సంస్థ రూ.113.74 కోట్లు ఆయాచిత ప్రయోజనం పొందడం అందుకుగాను జగతి పబ్లికేషన్స్‌కు రూ.10 కోట్లు వచ్చి చేరడం వంటివి చూస్తే స్వప్రయోజనం కోసం వివిధ పెట్టుబడిదారీ సంస్థల్ని పెంచి పోషించి, అక్రమ లావాదేవీలకు పెద్ద పీట వేసి, చిన్న చిన్న సంక్షేమ పథకాలతో పెద్ద ప్రచారాన్ని చేసుకున్న రాజశేఖరరెడ్డి బండారం మరింత బయటకు వస్తుంది. అయితే రాజశేఖరరెడ్డి మరణాన్ని ఒక సెంటిమెంటుగా చూస్తున్న దళిత బహుజనులు అసలు మొత్తం వ్యవస్థలోనే దళిత బహుజనులు జీవించే హక్కు రద్దయ్యే ప్రమాదం వుందని, ఇది చాలా ప్రమాదకరంగా మారుతుందనే విషయం 2004-05లో యిచ్చిన సెజ్‌లను చూస్తే మనకు అర్థమౌతుంది. 



2004-05 నుంచి సెజ్‌ల కోసం 80వేల ఎకరాలను సేకరించింది. దీనితో సంబంధం లేకుండా ప్రభుత్వం మరో 30 వేల ఎకరాలను సేకరించింది. ఇందులో 70 వేల ఎకరాలను ఐదు సెజ్‌ల కోసం సేకరించారు. దానిలోంచి 50వేల ఎకరాలను కేవలం వాన్‌పిక్, కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి, లేపాక్షి నాలెడ్జ్ హబ్, సత్యవేడు సెజ్, కృష్ణ పట్నం ఇన్‌ఫ్రా సెజ్‌కు అప్పగించారు. 



ఈ సెజ్‌ల మూలంగా మొత్తంగా నష్టపోయింది దళిత బహుజన రైతులే. మూలవాసుల్ని దెబ్బతీసే ఈ చర్యలను కేవలం రాజకీయంగా చూడటానికి వీలులేదు. ఆంధ్రుల ఆర్థిక సామాజిక సంస్కృతి అంతా భూమి, నీరు, ఖనిజ సంపద, అడవుల మీద ఆధారపడి వుంది. సముద్రతీరాన్ని ఎస్సీ, బీసీలు అడవులను ఎస్సీ, ఎస్టీలు ఆధారం చేసుకొని బతుకుతున్నారు. వారికి మూలాధారమైన సంపదను కార్పొరేట్ సంస్థలకు, మల్టీనేషనల్ కంపెనీలకు అమ్ముకుంటూ వారిని మధ్యతరగతిగా మారుస్తామని, కాలనీలను కట్టిస్తామని పరిశ్రమలు నిర్మించి ఉద్యోగ వసతి కల్పిస్తామని బూటకపు మాటలు చెప్పారు; 



పెట్టుబడుదారులకు అనుకూలంగా జీ.ఓ.లను విడుదల జేస్తూ సామాజిక ఆర్థిక దోపిడీకి గురౌతున్న ప్రతి అంశం మీద వ్యక్తులకతీతంగా నేర పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ భూములను తిరిగి ప్రజలకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించాలి. నిజానికి ఈ దోపిడీకి బీజం మన రాష్ట్రంలో చాలాకాలం క్రితమే పడింది. అందుకు కారకుడైన ముఖ్యమంత్రి ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన చంద్రబాబు. 2002లో రాంకీ సంస్థకి 3,148 ఎకరాలను చంద్రబాబు అప్పగించిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. దళిత బహుజనులకు న్యాయం జరగడం ఆయనకు ఇష్టంలేని విషయం. 



దాదాపుగా నిరాస్తిపరుడైన ఈ వ్యక్తి మూడు దశాబ్దాలలో అపర కుబేరుడు ఎ లా అయ్యారు? పిసిసి ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయ ణ ఆనాడు వైఎస్‌కు ఆంతరంగికుడు. దళిత బహుజనుల సంపద కుదువపెట్టడంలో తన నాయకుడికి తోడునడిచిన వాడే. చంద్రబాబు పాలనలో కమ్మ వారిలో నయా పెట్టుబడిదారీ వర్గం స్థిరపడింది. ఈ అంశాలు కూడా సిబిఐ ద్వారా బయటకు రావాల్సివుంది. నేరపరిశోధనా సంస్థలు రాజకీయ ప్రాబల్యాలకు, అధికారాలకు గురికాకుండా తప్పక స్వతంత్ర ప్రతిపత్తిని సంపాదించవల్సివుంది. 



లోక్‌పాల్ బిల్లులో ఈ అంశం కూడా పరిశీలనలో ఉంది. ఎవరు ప్రభుత్వంలోఉంటే సిబిఐ వారికి అనుకూలంగా ప్రవర్తిస్తుందనే వాదనలు ఉన్నాయి. ఒక కులాధిపతి తీర్పును కప్పిపుచ్చడానికి ఒక మీడియా, మరో కులాధిపతిని కాపాడడానికి మరొక మీడియా ప్రయత్నిస్తున్న సందర్భంలో నిర్ధారితాంశాలు పాక్షికంగానే ప్రజల్లోకి వెళుతున్నాయి. నిజానికి సీమాంధ్ర నుంచి పాలించిన ముఖ్యమంత్రులు తెలంగాణకే కాదు సీమాంధ్ర దళిత బహుజనులకు పెద్ద ఎత్తున సామాజిక ద్రోహం చేశారు. అవి సెంటిమెంట్స్‌తో మాఫీ చెందే విషయాలు కాదు. 



ఆంధ్రప్రదేశ్ ఈనాడు అవినీతికి అడ్డాగా మారిపోయింది. వీరి అక్రమాల వల్లనే తెలంగాణ డిమాండ్ కూడా ముందుకు వచ్చింది. అగ్రకుల రాజ్యాధికార స్వభావాన్ని దళిత బహుజనులు అర్థం చేసుకోవల్సిన అవసరంవుంది. ఆర్థిక నేరాలు, రాజకీయ హత్యలు, అబద్ధప్రచారాలతో ఇప్పుడు నడుపుతున్న కార్పొరేట్ రాజకీయాల స్వభావాన్ని అర్థం చేసుకోవల్సిన చారిత్రక సందర్భం ఇది. అమాయకత్వం వల్ల, బలవంతుల వల్ల ఈ రాజకీయ దోపిడీదారుల వల్ల నష్టపోయినవారు ఎక్కువ మంది బడుగులే. అనంతపురం జిల్లాలోని లేపాక్షి నాలెడ్జి హబ్ కోసం, చిలమత్తూరు మండలంలో 16,608 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. 



అందులో 3,330 దళిత బహుజన కుటుంబాల 8800 ఎకరాలు భూములను తక్కువ రేట్లకు బలవంతంగా ప్రభుత్వాధికారులు ఉపయోగించుకున్నారు. ఈ బోర్డర్ జిల్లా నుంచి ఎందరో దళిత బహుజనులు జీనవోపాధి లేక వలసపోయారు. ఓబుళాపురం మైనింగ్‌లో బిపి ఆచార్య అక్రమాలకు అంతులేదు. గచ్చిబౌలిలో అత్యంత ఖరీదైన 258 ఎకరాల భూమిని కారు చౌకకు కొన్న ఎమ్మార్ ప్రాపర్టీస్ చదరపు గజం 40వేల రూపాయలు చొప్పున అమ్మింది. ఈ ప్రక్రియల కథకు అంతులేదు. రాజకీయనాయకులు ప్రభుత్వాధికారులు దేశసంపదను ఇలా దోపిడీచేస్తూ పోతూ దళిత బహుజనులు జీవించే హక్కును కాలరాస్తున్నారు. మరో స్వాతంత్య్రం కోసం ప్రజలు పోరుచేసే పరిస్థితులు మన ముందుకు వస్తున్నాయి. 



ఈ పరిస్థితుల్లో అగ్రకుల రాజ్యాధికార దోపిడీ పరిస్థితులను అర్థం చేసుకొని ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కోసం అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగాన్ని, రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల్ని సూత్రాల్ని రక్షించుకోవడం కోసం దళిత బహుజనులు పోరాడవలసిన చారిత్రక పరిస్థితి ముందుకు వచ్చింది. అన్ని వైరుధ్యాలు, అన్ని పోరాటాలను దళిత బహుజనులను సామాజిక ఆర్థిక, రాజకీయ పరిణామ దృష్టితో చూడడమే అంబేద్కర్ వాదం. ఇది కమ్మారెడ్డి రాజకీయ దోపిడీ శకం. దీనికి చరమ గీతం పాడాల్సింది దళిత బహుజనులే.
- డా. కత్తి పద్మారావు

Andhra Jyothi News Paper Dated : 31/05/2012

Sunday, May 27, 2012

బహుజనశాస్త్రం ఆది భారతీయులు దళితులే! ---కత్తి పద్మారావు,



Pictures talangana patrika telangana culture telangana politics telangana cinema

హిందూ సాంప్రదాయవాదులు, ఆధ్యాత్మిక వాదులు ఇటీవల బౌద్ధం కూడ హిందూమతంలో భాగమేనని వాదిస్తున్నారు. అంతేగాక సంస్కృత భాష హిందూ మతం సొత్తుగా భావిస్తున్నారు. ఇవి రెండూ వక్రీకరణతో కూడుకొన్నవే. వేదాలను ఆధారం చేసుకొని వచ్చిన వైదిక మతమే పరిణామంలో బ్రాహ్మణ మతంగాను, హిందూమతంగాను పిలవబడుతున్నది. ఇవి పర్యాయ పదాలుగానే వాడుబడుతున్నాయి. వేదాల్లోని పురుషసూక్తం 10వ మండలం చాతుర్వర్ణాన్ని ప్రతిపాదించింది. ఈ చాతుర్వర్ణేతురులే పంచమ వర్ణులుగా పేర్కొనబడ్డరు. ఈ శ్లోకాన్ని మనుస్మ ృతి విస్త ృతం చేసి వర్ణ వ్యవస్థకు సంబంధించిన దినచర్యను, కార్యక్షికమాన్ని ప్రకటించింది. వేదాల్లో అంతకుముందు మూలవాసుల మాతృస్వామ్య విధానం మీద, నీటి సంస్కృతి మీద దాడి జరిగింది. వేదాలు పితృస్వామికమైనవి. అందులో స్త్రీఅణచివేత, పితృస్వామిక అణచివేత ప్రముఖమైన అంశాలు.

వేదాలు భారతీయ మైనవి కావని మన చరివూతకారులందరూ అంగీకరించారు. దీనిని కోశాంబి, రోమిల్లా థాపర్, ఎల్.భాషం నిర్ధారించారు. సామాజిక చరివూతకారులు ఫూలే, అంబేద్కర్‌లు సంప్రమాణంగా నిరూపించారు. ఆర్యులు మధ్యాసియా నుంచి వలస వచ్చిన జాతులు. వారు మొదట సంచార జాతులు. వారు వాఙ్మయంతో పాటు ఆయుధాన్ని నమ్మారు. వారి దేవుళ్ళు, దేవతలు ఆయుధదారులు. వారిది వ్యాప్తి సంస్క ృతి, ఆయుధ సంస్క ృతి. సుదీర్ఘకాలం మూల జాతులతో వారు ఆధిపత్యం కోసం పోరాడారు. వారికి ఆధీనులైన వారిని శూద్రులన్నారు. వారిని ఎదిరించి పోరాడి ఓడిన వారిని బహిష్కరించి అస్పృశ్యులన్నారు. ఆదిభారతీయులకు అస్ప ృశ్య భావన లేదు. భారతదేశానికి ఆర్యులు రాక ముందు ‘అస్పృ శ్యత’ అనే శబ్దం కాని, ‘అస్పృశ్యత అనేభావన కాని భారతదేశంలో లేదు. వింధ్యాపర్వతాల ఇవతల దక్షిణాపథంలోకి ఈ బ్రాహ్మణాధిపత్య భావాలు రావడనికి చాలాకాలం పట్టింది.

ఆర్యులకు అనార్యులకు జరిగిన యుద్ధ క్రమం లో ఆర్యులు దేశీయ ప్రజల నుంచే ఎంతో మౌఖిక విద్య నేర్చుకొన్నారు. ఆ నేర్చుకున్న వాటిని వారు వేదాల్లో ప్రత్యర్థుల వాదాలుగా ఉటంకించారు. దేశీయమైన భావనను జలసంస్క ృతిని, సమతా మార్గాలను ఆధిపత్య వైదికార్య బ్రాహ్మణ వర్గం ధ్వంసం చేయడానికి ప్రయత్నించింది. దేశీ య నాయకులను, పోరాట యోధులను చంపడానికి ‘నిప్పు’ను ప్రధానం చేసి యజ్ఞయాగాలు నిర్వహించారు. యజ్ఞయాగాలంటే.. దేశీయోత్పత్తులైన నవధాన్యాలను, నేతిని అగ్నిలో పోసి తగులబెట్టి దేశీయ ప్రజలను ఆహారానికి దూరం చేయడమే. ఆహార ధాన్యాలనే గాక, జంతువులను వధించడమేగాక చివరకు నరబలి వరకు వారు కొనసాగించారు. దీన్ని ఎదుర్కోవడానికి మూలవాసుల నుంచి దేశీయ పండితులు సంస్కృ తాన్ని అధ్యయనం చేసి చార్వాకులు, లోకాయతులుగా ముందుకు వచ్చి ‘నాస్తిమృత్యోరగోచరః’ మృత్యువు తరువాత ఏమీ లేదని ప్రకటించగలిగారు.

‘భస్మీ భూతస్య దేహస్య పునరాగమనంకుతః’ భస్మమైన దేహము తిరిగి రాదు అని ప్రకటించారు. మొదటి ఆర్యరాజ్యాన్ని ధర్మరాజు స్థాపించాడు. ధర్మరాజు మొద ట వురి తీసింది చార్వాకులనే అనేది మనం అర్థం చేసుకోవాల్సివుంది.

మన దర్శనాల్లో మొదటి దర్శనం ‘చార్వాక దర్శనం’ రెండవది జైన దర్శనం. మూడవది నిరీశ్వర సాంఖ్యం,నాల్గవది నిరీశ్వర వైశేషికం, ఐదవది నిరీశ్వర బౌద్ధం, నిరీశ్వర న్యాయదర్శనం ఆరవది. ఈ షడ్ దర్శనాలు దేవుడు లేడని చెబుతున్నాయి. చైతన్యం కంటే ముందటిది పదార్థం. పదార్థం నుంచే చైతన్యం జనించింది. దేవుడు అభూత కల్పన అని వాదించాయి. తరువాత వాటి ముందు ఈశ్వరుణ్ణి చేర్చడం జరిగింది. ఎమ్.ఎన్.రాయ్ తన‘మెటీరియలిజం’ గ్రంథంలో విస్తృ తంగా ఈ విషయాన్ని చర్చించారు. తరువాత బ్రాహ్మణులు ఆయాతాత్విక శాఖ ల్లో జొరబడి మళ్ళీ పదార్థాన్ని సృష్టించడనికి ఏదో ఒక శక్తి ఉండి ఉంటుంది. ఆ శక్తే ప్రపంచాన్ని సృష్టించడమే కాకుండా, ప్రతి జీవికి జనన, మరణ గతులను వారి పూర్వ జన్మలను బట్టి నిర్ణయిస్తుంది. మనిషి నిమిత్త మాత్రుడు. అతడు ఈ సృష్టికి మూలమైన బ్రహ్మ అతడు సృష్టించిన గ్రహగతులను బట్టే వర్తిస్తాడు.

అతడిదేమిలేదు అని నిర్ణయించారు. దీనిపై తాత్విక చర్చ జరిగింది. ఉపనిషత్తులు, దర్శనాలు ఈ తాత్విక చర్చను మౌఖిక దశలో సత్యాసత్య నిరూపణ కోసం చేశా యి. లిఖిత దశకు వచ్చేసరికి అంతా ఈశ్వరమయం చేయడానికి ప్రయత్నం చేశా రు. నిజానికి బ్రాహ్మణ పండితులంతా ధర్మాన్ని, నీతిని మూలవాసుల దగ్గరే నేర్చుకున్నారు. దేశీయ విద్యలువీరి దగ్గరే నేర్చుకున్నారు. బుద్ధుడు తన సంఘవాదాన్ని, అనాత్మవాదాన్ని మూలవాసుల దగ్గరే నేర్చుకున్నాడు. ఆది భారతీయు లు గొప్ప తాత్వికులు. వారిది నిరీశ్వర సాంఖ్యం. ‘కపిల’ అంటే ‘నల్లనిది’ అని అర్థం. ఆ నల్ల తల్లిపాలు తాగి తత్వం చెప్పిన వాడే కపిలుడు. అతడే నిరీశ్వరసాంఖ్యాన్ని బోధించాడు. ఆ శాఖీయుల దగ్గరే బుద్ధుడు తన ‘నిరీశ్వర’ వాదాన్ని అధ్యయనం చేశాడు. ఆయుధ విద్యలో గొప్ప వారైన ఏకలవ్యుడైనా, బలరాముడైనా, వాలి అయినా దేశీయ సంస్కృతిలో జనించిన ఆదిమవాసుల వారసులే.

కాని వీరి జీవిత విధానానికి, ఆది భారతీయుల జీవిత విధానానికి స్పష్టమైన వైరుధ్యం వుంది. బ్రాహ్మణవాదం వ్యక్తివాదం, పితృస్వామ్య జీవనం, ఇతరుల ను అర్ధించడం బ్రాహ్మణవాదంలో తప్పులేదు. ఆదిభారతీయులది సంఘవా దం. ఇతరులను అడగకుండ తమ శ్రమ మీద తామే జీవించడనికి వారు ప్రయత్నిస్తారు. ఈ ప్రభావం ఆధునిక విద్య తరువాత బ్రాహ్మణ కుటుంబాల మీద పడింది. వారు వ్యక్తివాదం నుంచి కొందరు సామాజిక వాదానికి పరివర్తితం చెందుతున్నారుబాహ్మణ స్త్రీలు దళితులను వివాహంఆడినంత, బ్రాహ్మణ పురుషులు దళిత స్త్రీలను పెళ్లి చేసుకోలేకపోయారు. కారణం బ్రాహ్మణ స్త్రీ స్వేచ్ఛ కోసం పోరాటంలో వుంది. దళితులు స్వేచ్ఛకోసం పోరాటంలో వున్నారు. మానవులందరూ ఒక్కటే అని చెప్పింది దళితులే. ఈ వాదానికి అగ్రవర్ణాల్లో వున్న బుద్ధుడు ముందు ఆకర్షితుడయ్యాడు. దాన్ని పెద్ద ఉద్యమంగా తెచ్చాడు. బ్రాహ్మణులు అందులో చేరారు.

కొందరు వ్యక్తి వాదాన్ని బౌద్ధంలో చొప్పించడనికి ప్రయత్నించారు. బౌద్ధం పాళి నుంచి మగధ నుంచి, పైశాచి భాషలను సంస్క ృ తంలోకి తెచ్చింది బ్రాహ్మణుల నుంచి వచ్చిన ఆచార్యులే. అయితే మళ్లీ దానిలో ‘వర్ణవాద’ పితృస్వామ్య భావజాలాన్ని చొప్పించారు. అంబేద్కర్ వచ్చి మళ్ళీమూలవాసుల నుంచి బుద్ధుడు నేర్చుకొన్న సమతా బౌద్ధాన్ని ‘బుద్ధ అండ్ దమ్మ’ పేరుతో బయటకు తెచ్చాడు. ఈమధ్యలో ఇస్లాం, క్రైస్తవంలోకి ముందు దళితులు వెళ్ళాక తర్వాత, బ్రాహ్మణులు సవర్ణులు అందులో ప్రవేశించి పితృస్వామ్య వ్యక్తి వాదాలను భారతీయ ఇస్లాంలోను, భారతీయ క్రైస్తవంలోను ప్రవేశపెట్టారు. దళితులు ప్రతి బ్రాహ్మణేతరవాదాన్ని ‘సంఘవాదంగా’ మలచాలని చూస్తారు. బ్రాహ్మణులు ప్రతి బ్రాహ్మణేతర వాదాన్ని బ్రాహ్మణీకరించాలని చూస్తారు. ఆదిభారతీయులదే అసలు భారతదేశంఅని వారికి తెలుసు. వీర వైష్ణవ, వీర శైవ ఉద్యమాలను దళితుల కోసమే సృష్టించారు. పల్లెల్లోకి జొరబడ్డారు. కాని బ్రాహ్మణులు పల్లెల్లో నిలబడలేకపోయారు.

వారి వ్యక్తి వాదానికి వీరి సామూహిక వాదానికి యుద్ధమే జరిగింది. మార్క్సిజం భారతదేశానికి వచ్చినపుడు కార్మిక వర్గంగా దళితులే ఆహ్వానించారు. మార్క్సిస్టు అధ్యయనపరులుగా అనువాదకులుగా వచ్చిన బ్రాహ్మణులు ప్రధానమైన కుల వైరుధ్యం నుంచి తప్పించి ఆర్థిక వాదం గా దాన్ని కుదించ చూశారు. అప్పుడూ అంబేద్కర్ తన కుల నిర్మూలనా గ్రంథం తో ఎదుర్కొన్నాడు. అంబేద్కర్ ప్రభావాన్ని గాంధీ గుర్తించాడు. దాన్ని అడ్డుకోవడనికి ‘వర్ణ సిద్ధాంతాన్ని’ మళ్ళీ ముందుకు తెచ్చాడు. ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వడంలో తప్పు లేదని, దళితుల ప్రత్యేక రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బకొట్టడనికి ఎరవాడ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. కాంగ్రెస్‌ను బ్రాహ్మణవాద అనుసరణ సంస్థగా మార్చాడు. ఒక ప్రాంతంలోమైనారిటీలుగా వున్న హిందువుల రక్షణార్థం బయలుదేరిన ఆర్‌ఎస్‌ఎస్ భారతదేశం విడిపోయిన తరువాత ఇండియాలో మెజారిటీవాదంగా చెలామణి అవుతున్నది. మెజారిటీ ప్రజలైన దళితులు ఆదివాసీలు లేకుం డా హిందూ రాజకీయ వాదం బలపడదు కాబట్టి, ఇప్పుడు దళితుల మత మార్పిడులను ఎదిరిస్తున్నారు.

దళితులు చార్వాకులుగా, సాంఖ్యకులు గా, బౌద్ధమత వాదులుగా, భక్తి ఉద్యమకర్తలుగా, వీరశైవులుగా, ముస్లిం, క్రైస్తవ స్వీకర్తలుగా తమపై రుద్దిన కళంకాన్ని తుడుచుకొని తమకు తాము నిలబడడానికి హిందూ బ్రాహ్మణవాదానికి ప్రత్యామ్నాయాలను రూపొందిస్తూ వస్తున్నారు. దళితులు తమ తాత్విక సిద్ధాంత బలంతో జీవన విధానాలతోవూబాహ్మణుల మీదే కాక మిగిలిన త్రివర్ణాల మీద కూడ తమ ప్రభావం వేయగలుగుతున్నారు. స్వాతంవూత్యానంతరం రాజ్యాంగ సూత్రాలకు అనువైన కులాలుగా ఎస్సీ, ఎస్టీలు మారిన తరువాత సామాజిక జీవనంలోకి ప్రవేశించాక ప్రేమ, కరుణ, ప్రజ్ఞ వారి నుంచి ప్రధాన స్రవంతికి ప్రవహించడం ప్రారంభించాయి. నీతి, వ్యక్తిత్వం, శ్రమ, మానవత్వం ఒకరి నుంచి ఒకరు నేర్చుకునే సందర్భంలో దళితులు తమ జీవనవిధానం ద్వారా ఇతరులకు మార్గదర్శకులవుతూ వస్తున్నారు. బ్రాహ్మణులు అంబేద్కర్‌ను నిర్లక్ష్యం చేసి ఆయన రాజ్యాంగ సూత్రాలను నోటికి వల్లించి రాజ్యాంగ నిపుణులుగా ప్రసిద్ధి చెందుతున్నారు.

వారి వేదాలు, మనుస్మ ృతులు వారికి అన్నం పెట్టవని తెలుసుకొని అంబేద్కర్ వ్యక్తిత్వంలోని పరిశోధన, రాత, విశ్లేషణ, ప్రతివాదం వైపు ఆకర్షితులయ్యారు. బీసీలు మండల్ కమిషన్ రిపోర్టు వచ్చిన తరువాత దళితులు తమ మిత్రులుగాభావించి వారి నుంచి పోరాట స్ఫూర్తిని అందుకొని సామాజిక, రాజకీయ హక్కుల పోరాట ఉద్యమంలో దళితులతోచేయి కలుపుతున్నారు. 
చార్వాకుల దగ్గర నుంచి నేటి వరకు అన్ని సిద్ధాంతాలని, తత్వాలని, దళితులు ప్రభావితం చేస్తున్నారు. దళితులు మానవతావాదంవైపు, సంఘవాదంవైపు, ఆత్మగౌరవపోరాటం వైపు అందరూ ఆకర్షితులవుతున్నారు. ఇది బ్రాహ్మణ వాద ఓటమికి దళితవాద విజయానికి ఒక నిర్మాణ యుగం. కారంచేడు అన్ని పార్టీలు, ఉద్యమాల ఎజెండాలోకి కుల నిర్మూలన అంశాన్ని తీసుకురాగలిగింది. సామాజిక, సాంస్క ృతిక పునర్జీవనోద్యమానికి కుల, మత బేధాలు లేవు. శాస్త్రీయ దృక్పథం ఒక్కటే మార్గం. ఆదిభారతీయులే భారతీయ పునర్నిర్మాణానికి నిజమైన వారసులు.

Namasete Telangana News Paper Dated : 27/05/2012 


Monday, May 21, 2012

దళితోద్యమ వేగుచుక్క---సంగిశెట్టి శ్రీనివాసు



భారతదేశ దళితోద్యమంలోనే వేగుచుక్క భాగ్యడ్డి వర్మ. 1906లో హైదరాబాద్ కేంద్రంగా ‘జగన్మివూతమండలి’ స్థాపించి దళితజాతి చైతన్యానికి పాదులు వేసిండు. ఇదే 1913 నాటికి మాన్యసంఘంగా మారింది. అంబేద్కర్ కన్నా ముందు భారతదేశం గర్వించతగ్గ దళిత నాయకుడు. లక్నో, అలహాబాద్, కలకత్తా తదితర ప్రాంతాల్లో జరిగే సభలకు ముఖ్యఅతిథిగా హాజరై తన ఉపన్యాసాల ద్వారా దళితోద్యమ కార్యకర్తలను చైతన్య పరిచిండు. భారతదేశంతో పాటు ఆంధ్రవూపాంతంలో కూడా దళితోద్యమాలకు దారులు వేసిండు. వినూత్న రీతిలో ఆయన తీసుకొచ్చిన చెతన్యం భవిష్యత్తరాలను తీర్చిదిద్దింది. దళితుల కోసం ప్రత్యేక పాఠశాలలు స్థాపించి, నిర్వహించాడు. భాగ్యనగర్, ఆదిహిందూ పత్రికలకు సంపాదకత్వం వహించి అనేక రచనలు చేసిండు. 1911లో దేవదాసీ (జోగిని) నిర్మూలన సంఘాన్ని, 1912లో స్వస్తిదళ్ స్వచ్ఛంద సేవాసంస్థను ఏర్పాటుచేసి ప్రజాహిత కార్యక్షికమాలు చేపట్టిండు. రెడ్‌క్రాస్ సొసైటీ మాదిరిగా నడిచిన ఈ సంస్థ హైదరాబాద్‌లో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు అనా థ శవాలను తొలగించి, నగరాన్ని పరిశువూభంగా ఉంచినందుకు గాను నిజాం ప్రభుత్వం ప్రత్యేకంగా అభినందించిం ది. సేవా పతకాలను అందజేసింది.

అనేక సంస్థలు స్థాపించి ఇటు అనంతపురం నుంచి అటు అమలాపురం వర కు, లక్నో నుంచి ఔరంగాబాద్ వరకు (హైదరాబాద్, తెలంగాణ సరేసరి) ఆయన అనేక సభల్లో సభాధ్యక్షుడిగా, ముఖ్యఅతిథిగా హాజరయ్యిండు. ఆయన విజయవాడ వస్తుండని తెలియడంతో దళితులు బలవంతంగా ఎక్కడ దుర్గ గుడిలో ప్రవేశిస్తారో అన్న భయంతో పూజారులు గుడిని మూసేశారంటే ఆయన ప్రభావం అర్థమవుతుంది. అంతెందుకు ఉన్నవ లక్ష్మినారాయణ రాసిన మాలపల్లి నవలకు స్ఫూర్తి భాగ్యడ్డి వర్మ. అందులో హీరో భాగ్యడ్డి వర్మే. తాము పంచములం కాము ఈ దేశ మూలవాసులం, ఆదిహిందువులం (మతానికి సంబంధం లేదు) అని నినదించిండు. విజయవాడలో మొదట పంచమ మహాసభ అని ప్రారంభించి సాయంవూతానికి అది ఆదిహిందూ మహా జనసభగా మారేలా చేసిండు. ఈ విజయవాడ సభనే మొత్తం తెలుగునాట దళిత చెతన్యానికి పునాదులు వేసింది. 

ప్రస్తుత ఆంధ్రవూపదేశ్ అంతటిలో మొట్టమొదటిసారిగా దళితుల సంఘటిత సమావేశం 1917 నవంబర్ 4,5,6 తేదీల్లో విజయవాడలో జరిగింది. ఈ సభకు ఆంధ్రవూపాంతంలోని అన్ని జిల్లాల నాయకులు పాల్గొన్నారు. సమావేశానికి హైదరాబాద్ నుంచి వచ్చిన భాగ్యడ్డి వర్మ అధ్యక్షత వహించాడు. ఇందులో భాగ్యడ్డి వర్మతో పాటు హైదరాబాద్, తెలంగాణ జిల్లాలకు చెందిన దళిత కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. మొదట ఈ సభను ప్రథమ ప్రాంతీయ పంచమ మహాసభ పేరిట విజయవాడ టౌన్ హాల్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. సంప్రదాయ వాదుల ఒత్తిడికి తలొగ్గి అధికారులు టౌన్‌హాల్‌లో సభను నిర్వహించడానికి అనుమతి నిరాకరించారు. దీంతో మైలవరం రాజాకు చెందిన డ్రామా హాల్‌లో సభ జరుపుకున్నారు. అయితే సాయంత్రం అయ్యే సరికి తాము పంచములం కాము ఆది హిందువులం ‘ఈదేశ మూలవాసులం అని ఉద్ఘాటిస్తూ సమావేశం పేరును ప్రథమ ఆది హిందూ మహాజన సభ పేరిట జరుపుకున్నారు. అందుకు ప్రధాన కారణం భాగ్యడ్డి వర్మ తన ప్రసంగంలో పంచములు అని ఏ శాస్త్రంలోనూ లేదు. ఆత్మన్యూనతతో కాదు మనం ఈ దేశ మూలవాసులుగా ఆత్మగౌరవంతో బతకాలని పిలుపునిచ్చాడు. ఈ మేరకు సభలో ఒక తీర్మానం కూడా చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ తీర్మానాన్ని గౌరవిస్తూ పంచమ పదాన్ని తొలగిస్తూ 25 మార్చి 1922లో 817 జీవోను విడుదల చేసింది. ఈ సమావేశంలో ఆదిహిందువులకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించారు. దళిత విద్యార్థులకు అందరితోపాటు చదువుకునే అవకాశం కల్పించాలని, మాల, మాదిగ పల్లెల్లోనే పాఠశాలలను ఏర్పాటు చేయాలని, తాగునీటి వసతి కల్పించాలని కూడా తీర్మానాలు చేశారు. 

ఈ చారివూతాత్మక సభ ఏర్పాటుకు గూడూరు రామచంవూదరావు, చుండ్రు వెంకయ్య తదితరులు పూనుకున్నారు. ఈ సమావేశంలోనే పశ్చిమగోదావరి జిల్లా పిప్పరకు చెందిన మంగిపూడి వెంకటశర్మ రాసిన నిరుద్ధ భారతం పుస్తకం విడుదల చేశారు. ఈ సమావేశం తెలుగునేలపై దళితోద్యమాలపై వేసిన ప్రభావం అత్యంత ప్రభావశీలమైనది. మూడ్రోజుల పాటు ఈ సమావేశాలు జరగ్గా ఆ మూడు రోజులు విజయవాడలోని దుర్గ గుడి తలుపులు మూసి ఉంచారు. సమావేశానికి హాజరైన దళితులు దుర్గగుడిలోకి చొచ్చుకువచ్చే అవకాశం ఉందని ఏకంగా గుడినే మూసేశారు. ఈ సమావేశం వల్ల ప్రభావితుడెన ఉన్నవ లక్ష్మినారాయణ మాలపల్లి నవల రాసిండు. ఈనవల్లో హీరో భాగ్యడ్డి వర్మే. అలాగే కుసుమ ధర్మన్న (1900‘1946) కూడా మా కొద్ది నల్లదొరతనము అనే కవితా పుస్తకాన్ని 1921లో అచ్చేశాడు. విజయవాడ సభ స్ఫూర్తితో వరుసగా ఆంధ్రవూపాంతంలోని వివిధ ప్రాంతాల్లో సమావేశాలు జరిగాయి. 

ఒక వైపు నిరంతరం సభలు సమావేశాలు అంటూ వివిధ ప్రాంతాలు తిరుగుతూనే తాను పుట్టి పెరిగిన హైదరాబాద్‌లోని దళిత బస్తీల్లో మద్యపానం వల్ల కలిగే నష్టాలను బు‘రకథలు, హరికథల ద్వారా ప్రచారం చేసేవాడు. ఈ నాటకం చూడ్డానికి వచ్చే ప్రేక్షకులకు వాటి ప్రదర్శన కన్నా ముందూ తన ఉపన్యాసాల ద్వారా వారిలో చెతన్యం తీసుకురావడానికి ప్రయత్నించేవాడు. బస్తీల్లోని ప్రజల్లో తాగుడు మాన్పించేందుకు ఆయన ఒక వినూత్న ప్రయోగాన్ని చేసి సఫలీకృతుడయ్యాడు. రోజూ ఎక్కడో ఒక దగ్గర బస్తీల్లోని కూలీలు పని చేసుకునేవారు. ఐదారు కుటుంబాలు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసే ఒక ప్రదేశానికి వెళ్ళి ప్రతి కుటుంబం రోజూ తమకు వచ్చే ఆరణాల కూలీలో ఒక అణా మాకు చందాగా ఇవ్వాలని కోరాడు. కూలీలు మొదట కొంత తటపటాయించినా భాగ్యడ్డి వర్మ వారిని ఒప్పించి తలా ఒక అణా పైసని వారి నుంచి వసూలు చేసిండు. ఇలా నెల రోజులు వరుసగా వసూలు చేసి ఆ డబ్బుతో 31వ రోజు ఒక తులం బంగారం కొని వాటితో పుస్తెలు చేయించి చిన్న సమావేశం ఏర్పాటు చేసి అందులో తాళి కట్టించేవాడు. దీంతో అణా పైసలు తక్కువ కావడంతో వారు ఆమేరకు కల్లు, సారాయి తాగడం మానేయడమే గాకుండా నెల రోజు ల తర్వాత తులం బంగారం దక్కించుకుండ్రు. ఇలాంటి కార్యక్షికమాలు భాగ్యడ్డి వర్మ హైదరాబాద్, సికింవూదాబాద్‌లోని అనేక బస్తీల్లో విజయవంతంగా నిర్వహించిండు. 

దళితుల అవస్థలకు అవిద్యే ప్రధాన కారణమని భావించి విద్యారంగంలో ఆయన చిరస్మరణీయమైన కృషి చేసిండు. హైదరాబాద్‌లోని గణేశ్‌మల్ సింఘ్వీ, వామన నాయక్ లాం టి వితరణ శీలుర ప్రోత్సాహంతో తానే వివి ధ ప్రదేశా ల్లో దళిత బాల, బాలికల కోసం పాఠశాలలు నెలకొల్పిండు. ఈ దశలో ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదన మేరకు వాటిని సవ్యంగా నడిపించే షరతుమీద పాఠశాలల నిర్వహణ బాధ్యతను భాగ్యడ్డి వర్మ నిజాం ప్రభుత్వానికి అప్పజెప్పిండు. ఆ పాఠశాలలే పష్తక్వామ్ పాఠశాలలుగా ప్రసిద్ధి. భాగ్యడ్డి వర్మ ఆర్యసమాజ్, బ్రహ్మసమాజ్ అన్నింట్లో పాలు పంచుకొని అవి ఏవి దళితులకు గౌరవాన్ని ఇచ్చేవి కావు అని భావించి చివరికి బుద్ధిజం పట్ల మక్కువ చూపిండు. దాన్నే ఆచరించిండు. ప్రతి యేటా పెద్ద ఎత్తున బుద్ధ జయంతిని పండుగ వాతావరణంలో నిర్వహించేవాడు. చివరికి తన కొడుక్కు గౌతమ్ అని పేరు పెట్టుకుండు. 

తెలుగునాట దళితోద్యమానికి దారులు వేసి వేగుచుక్కై వెలిగిన భాగ్యడ్డి వర్మ గురించి ఏ తరగతి పాఠ్యపుస్తకంలోనూ సమాచారం లేదు. ఆంధ్రవూపాంతంలో డజనుకు పైగా వార్షిక సభలకు అధ్యక్షుడుగా హాజరై అనేకమంది అనుచరుల్ని సంపాదించికున్నాడు. అయినప్పటికీ అటు ఆంధ్రవూపాంతంలోనూ, ఇటు హైదరాబాద్‌లోనూ ఒక్క విగ్రహమూ లేదు. వచ్చే సంవత్సరం భాగ్యడ్డి వర్మ 125వ జయంతి. ఆ సందర్భంగానెనా దళితులు, సామాజిక కార్యకర్తలు పూనుకొని ఆయనపై పోస్టల్ స్టాంప్ వచ్చే విధంగా, ట్యాంక్‌బండ్‌తో పాటు హైదరాబాద్‌లోని కూడలి ప్రదేశంలో ఆయన విగ్రహాన్ని నిలబెట్టాలి. అంతేగాదు అందుబాటులో లేకుండాపోయిన ఆయన నడిపిన పత్రికలు భాగ్యనగర్, ఆదిహిందూలను సేకరించి వాటిల్లోని ఆయన రచనలను సంకలనాలుగా అచ్చేయించాల్సిన అవసరముంది. ఇదే ఆ మహానాయకుడికి మనమిచ్చే నివాళి.


సంగిశెట్టి శ్రీనివాసు 

నమస్తే తెలంగాణా న్యూస్ పేపర్ 22/05/2012 

వివేకం కోల్పోయిన భారత్! - యాన్ మిర్డాల్



విదేశాంగ మంత్రి కారల్ బిల్ట్‌కు,
ఇది వ్యక్తిగత లేఖ కాదు; స్వీడన్ విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్న మీకు ఈ లేఖ రాస్తున్నాను. ఇటువంటి లేఖలు 'సమాచార స్వేచ్ఛా చట్టం'అనే ఆంగ్ల భాషా అభివ్యక్తి పరిధిలోకి రావు. అయితే బహిరంగంగా ఉన్న లేదా ఉండాల్సిన సమాచారమే ఈ లేఖలో ఉన్నందున, దీన్ని భారత్‌లో ప్రచురింప చేస్తున్నాను. ఇటువంటి సందర్భాలలో గున్నార్ మిర్డాల్ చేసినట్టే నేనూ చేస్తున్నాను; ఈ లేఖను నేరుగా ఇంగ్లీష్‌లో రాస్తున్నాను. 

భారత పార్లమెంటు ఎగువ సభలో హోంశాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ నా గురించి చేసిన ప్రసంగం పూర్తి పాఠం ప్రతిని న్యూఢిల్లీలోని మన రాయబారి కార్యాలయం సంపాదించి ఉంటుందని భావిస్తున్నాను. కేవలం వార్తా పత్రికలలో వెలువడిన వార్తలు, వ్యాసాలపైనే పూర్తిగా ఆధారపడకుండా ఉండేందుకై నాకు ఆ ప్రసంగానికి సంబంధించిన యథాతథ పాఠం అవసరమున్నది. మన రాయబారి కార్యాలయం ఆ ప్రసంగ పాఠం ప్రతిని నాకు పంపగలదని ఆశిస్తున్నాను. ఆ ప్రసంగంపై వెలువడిన వార్త చివరి వాక్యంలో మంత్రి జితేంద్ర సింగ్ ఇలా చెప్పినట్టు ఉటంకించారు: 'పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నది. అటువంటి విషయాలను సంబంధిత దేశాలతో యథావిధిగా దౌత్యస్థాయిలో చర్చిస్తాము'. అంటే దీనర్థం భారత ప్రభుత్వం నా విషయమై మన రాయబారి కార్యాలయంతో సంప్రదించిందనేనా? 

భారత్‌లో నా కొత్త పుస్తకం 'రెడ్ స్టార్ ఓవర్ ఇండియా' (భారత్‌పై అరుణతార) విడుదల సందర్భంగా ఆ దేశానికి వెళ్ళేందుకు నేను వీసాకు దరఖాస్తు చేశాను; (చాలా వ్యయభరితమైన) వీసా ఒక నెలరోజుల పాటు ఉండేందుకు గాను జారీ అయింది. వీసా కోసం చేసిన దరఖాస్తుకు, నా స్వీడిష్ ప్రచురణ కర్త (స్టాక్‌హోమ్‌లోని లియోపార్డ్) లిఖితపూర్వకంగా ఇచ్చిన ఆర్థిక పరమైన హామీని, కోల్‌కతాలోని నా భారతీయ ప్రచురణ కర్త (సేతు ప్రకాశన్), ది కోల్‌కతా బుక్ ఫెయిర్ నిర్వాహకులు పంపిన ఆహ్వాన పత్రాలను కూడా జత పరిచాను. 

కోల్‌కతాకు వెళ్ళిన తరువాత, నేను ఎక్కడ బస చేసేది, భారత్‌లో ఎక్కడెక్కడ బహిరంగ సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నదీ అధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుండాలని నా ప్రచురణకర్తను ఆదేశించారు. ఆయన ఆ ఆదేశాన్ని పాటించారు. కోల్‌కతా, హైదరాబాద్, లూధియానా, ఢిల్లీలలో వివిధ సంస్థలు నిర్వహించిన వివిధ సమావేశాలలో నా పుస్తకావిష్కరణ జరిగింది. ఆ సభలలో నేను చెప్పిన మాటలన్నీ మీడియాలో ప్రచురితమయ్యాయి; ఇంటర్నెట్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. 

ఈ ఏడాది జనవరి/ ఫిబ్రవరిలో భారత్‌లో నా పర్యటన గురించి రాజ్యసభలో హోం శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ చెప్పిన విషయాలు, మే 20న హోంశాఖ ప్రతినిధి ఇరా జోషి చెప్పిన విషయాలు యథార్థాలు కావు. మరో విధంగా చెప్పాలంటే అవి, రాజకీయ కారణాలతో 'నేను చెప్పని విషయాలు'. మరి భారత ప్రభుత్వ ప్రతినిధులు ఇలా అవాస్తవాలు చెప్పడం వెనుక ఉన్న రాజకీయ కారణాలు ఏమిటి? ఆ కారణాలను అర్థం చేసుకోవడానికి కోల్‌కతా నుంచి వెలువడే 'ద టెలిగ్రాఫ్' ఆంగ్ల దినపత్రిక మే 18 సంచికను చదవాలి. 

పిసి మెయిల్ బాక్స్‌లో మావోయిస్ట్ స్పామ్
నిషిత్ ధోలాభాయి

న్యూఢిల్లీ, మే 17 : ఫ్యాక్స్‌లు పనిచేయనప్పుడు విదేశాల నుంచి హోం మంత్రి ఇ-మెయిల్‌పై మెరుపు యుద్ధం చేయాలి. ఒక క్రియాశీల కార్యకర్త, మావోయిస్టు సానుభూతిపరుడిని విడుదల చేయాలని కోరుతూ పి. చిదంబరం ఇ-మెయిల్‌కు పాశ్చాత్య దేశాల నుంచి పెద్ద ఎత్తున మెసేజ్‌లు వస్తున్నాయి. పూర్తిగా 'స్థానిక'మైన ఒక అంశంపై విదేశీయుల్లో ఇంత ఆసక్తి ఏమిటనే కుతూహలాన్ని రెచ్చగొట్టింది'. భారతీయ వ్యవహారాలపై అంతర్జాతీయ సమాజంలో పెరుగుతోన్న శ్రద్ధ, అవగాహన భారత ప్రభుత్వాన్ని అంతకంతకూ కలవరపరుస్తుందనేది స్పష్టం. 

భారత ప్రజలతో అంతర్జాతీయ సంఘీభావం అవసరం గురించి గత ఏడాది జూన్ 12న లండన్‌లో అరుంధతీ రాయ్, నేనూ మాట్లాడాము. భారతదేశానికి సంబంధించిన వార్తలను అడ్డుకోవడంపై మేమిరువురమూ మాట్లాడాము. భారత్‌లో చా లా తీవ్ర స్థాయిలో జరుగుతోన్న చర్చలూ, సంవాదాలూ మన పాశ్చాత్య దేశాలలోని మీడియాలో ప్రతిబింబించడం లేదు. ఇలా జరగడం (రెండో ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటిష్ వలస పాలకులు అమలు పరచినట్టుగా) భారత ప్రభుత్వం అధికారికంగా అమలుపరుస్తోన్న సెన్సార్‌షిప్ కారణంగా కాదు. ఇది మన మీడియాలోని ఎడిటోరియల్ సిబ్బంది అనుసరిస్తున్న సెన్సార్ విధానం, భారత్‌లోని మన కరస్పాండెంట్స్ సొంత సెన్పార్‌షిప్ వల్లే భారత్ గురించిన వార్తలు ఇక్కడ నిరోధింపబడుతున్నాయి. 

ఇందులో కొత్త విషయమేమీ లేదు. భారత్ గురించిన ('క్విట్ ఇండియా' ఉద్యమం, జాతి మేధంతో సమానమైన బెంగాల్ కరువు, 'భారత జాతీయ సైన్యం' గురించి కూడా) వార్తలను తటస్థ స్వీడన్‌లో ఎలా అణగదొక్కారనే విషయమై ఇటీవల 'ఓరియెంటల్ సొసైటీ' (స్వీడన్) వార్షిక సంచికలో రాశాను. అప్పటి విషయాలను గుర్తుచేసుకొనేందుకు మీరు వయస్సులో చాలా చిన్న వారు కనుక రాబోయే ఆ వార్షిక సంచికలో నేను రాసిన విషయాలను చదవండి (జూలై 20 కుట్ర గురించి స్వీడన్‌లోని అమెరికా, సోవియట్ యూనియన్ సైనిక ప్రతినిధులకు తెలియజేసే బాధ్యతను మా నాన్నగారికి అప్పగించేందుకు ఆదమ్ వాన్ ట్రాట్ జు సోల్జ్ మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఎలా తలుపులు తెరిచిందీ కూడా రాశాను. 

ఈ విషయాలన్నీ విదేశాంగ శాఖ ఫైళ్లలో ఉన్నాయి. జూలై 20 కుట్రకు అవసరమైన సహాయాన్ని అందించడానికి మిత్రరాజ్యాలు ఎందుకు తిరస్కరించాయో మీకు తెలుసు. అయితే ఆదమ్ వాన్ ట్రాట్ జు సోల్జ్ ఆ పనిలో సఫలమై వుంటే అతనిపై (సుభాష్ చంద్ర బోస్ ఇండియా నుంచి పరారైనప్పుడు భారత్‌లో బ్రిటిష్ వలసపాలకులు చేసినట్టుగానే) బ్రిటిష్ గూఢచార సంస్థ ఎమ్ 16 ఒక 'కాంట్రాక్ట్ 'ను ఎందుకు కుదుర్చుకుందన్న విషయాన్ని మీరు ఆలోచించి ఉండివుండకపోవచ్చు). 

మన పాశ్చాత్య దేశాలన్నిటిలోను భారత ప్రజల పోరాటాల పట్ల సంఘీభావం పెరుగుతుండడంతో ఆ దేశాన్ని గూర్చిన సమాచార ప్రవాహం కూడా పెరుగుతోంది. మీరు, కాకపోతే కనీసం మన రాయబారి కార్యాలయమైనా indiensolidaritet.orgను ఫాలో అవుతుండాలని సూచిస్తున్నాను. ఒక విశాల ప్రాతిపదికన, భావజాలాల పరంగాగాని, మరే దురభిమానాలకుగానీ తావు లేకుండా భారత్ గురించి వార్తలను (అంతర్జాతీయ స్థాయిలో కూడా అటువంటి దృక్పథం అవసరంపై వివిధ సభ్యుల మధ్య నిష్పాక్షికంగా జరుగుతున్న చర్చలను కూడా) నివేదిస్తున్న వెబ్‌సైట్ అది. 

యాభై సంవత్సరాల క్రితం వియత్నాం ప్రజల పోరాటానికి సంఘీభావం తెలుపడానికి జరిగిన కృషి, 1950ల్లో అధికారిక మీడియాలో ప్రబలంగా ఉన్న అమెరికా అనుకూల వైఖరిని, ఇరవై సంవత్సరాల తరువాత నిష్పాక్షిక, ఉదారవాద విధానాలకు అనుకూలంగా ఎలా మార్చివేసిందో అది మీకు గుర్తుకు తెస్తుంది (బాగా ప్రాచుర్యమున్నdsgens nyheter లాంటి దినపత్రికల వైఖరి ఎలా మారిందో గుర్తుకు తెచ్చుకోండి. వియత్నాం ప్రజల పోరాటాలకు సంబంధించిన సమాచారాన్ని పరివ్యాప్తం చేసే కృషి, ఆ సమాచారాన్ని అందించే 'బులెటిన్'లను ప్రభుత్వ ఆధ్వర్యంలోని సారా దుకాణాల వెలుపల విక్రయించడం మొదలైన చైతన్యశీల కార్యకలాపాలు అంతిమంగా స్వీడిష్ విదేశాంగ విధానాన్ని కూడా మార్చివేసిన వైనాన్ని గుర్తు తెచ్చుకోండి). 

న్యూఢిల్లీలోని మన రాయబారి కార్యాలయంలోని ఉద్యోగులెవరూ నాకు తెలియదు. నేను చాలా వృద్ధుడిని; ఆ దౌత్య సిబ్బంది తమ తాతయ్యగా భావించదగ్గ వయస్సులో ఉన్న వ్యక్తిని. అయితే వారూ స్వీడిష్ మీడియా కరస్పాండెంట్స్ వైఖరులలో చాలావరకు పాలు పంచుకొంటున్న వారేనన్నది నా భయం. అలా కాకుండా మన దౌత్య సిబ్బంది ఒక విశాల, దూరదృష్టితో కూడిన వైఖరిని అనుసరిస్తే మన దేశానికి చాలా మేలు జరుగుతుంది. భారతదేశంలో, ఆ దేశ ప్రజల పోరాటాల గురించిన సమాచారం చాలా వుంది. 

నియంతృత్వ కాలంలో చిలీ లేదా సోవియట్ యూనియన్ వంటిది కాదు భారత్! నాకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వ ప్రస్తుత ప్రతిస్పందన సాధారణమైనదే అయినా నిర్హేతుకమైనది. తమ చర్యల, నిర్ణయాల పూర్వాపరాల పట్ల సమగ్ర అవగాహనతో అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నప్పుడు జాతీయ ప్రభుత్వాల ప్రతిస్పందన ఎలా ఉంటుందో ప్రస్తుత సందర్భంలో నా విషయమై భారత ప్రభుత్వ ప్రతిస్పందన కూడా అలానే ఉన్నది. అయితే ఒక విధంగా తీవ్ర కలవరపాటును సూచిస్తున్న భారత ప్రభుత్వ ప్రవర్తనకు మరో కారణం కూడా ఉంది. 

దీన్ని మన రాయబారి కార్యాలయం జాగ్రత్తగా గమనించగలదని ఆశిస్తున్నాను. ముప్పై సంవత్సరాల క్రితం నేను రాసిన దాన్ని మీరు చదివితే అప్పటికి, ఇప్పటికి భారత ప్రజల పోరాటం తీరుతెన్నులు మారిపోతున్నాయని మీకు అర్థమవుతుంది. మూడు దశాబ్దాల క్రితం నక్సల్ బరి, తెలంగాణ పోరాటాలు, ఇతర ప్రజా తిరుగుబాట్లతో స్ఫూర్తి పొందిన 'వామపక్ష' రాజకీయ ఉద్యమాలు పూర్తిగా చీలిపోయివున్నాయి. మరిన్ని చీలికలతో వాటి మధ్య అనైక్యత మరింతగా పెరిగిపోయేట్టుగా కన్పించేది. 

మరి ఇప్పటి పరిస్థితి పూర్తిగా భిన్న మైనది. ప్రధాన 'మావోయిస్ట్' పార్టీలు, గ్రూపులు సమై క్య అఖిల భారత పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్) నేర్పాటు చేశాయి. అంతేకాదు సైద్ధాంతిక విభేదాలు, వైరుధ్యాలు ఉన్నప్పటికీ ఇతర విప్లవ గ్రూపులు కూడా మావోయిస్ట్ పార్టీతో భారత ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఏకీభావం కలిగివున్నాయి. సామాజిక వైరుధ్యాలకు అతీతంగా విద్యార్థులలో అత్యధిక వర్గాలవారు, 'మధ్యతరగతి ప్రజలు' ప్రజాస్వామిక, సామాజిక మార్పులను డిమాండ్ చేస్తున్నారు. 

ఒక నిర్దిష్ట ఉదాహరణ చెపుతాను. హైదరాబాద్‌లో 1980 నుంచి తెలిసిన పాత స్నేహితులను కలుసుకున్నాను. అప్పట్లో మేము ఆంధ్రప్రదేశ్‌లో సాయుధ దళాలను అనుసరిస్తూ అజ్ఞాత జీవితంలోకి వెళ్లినప్పుడు 'ఆంక్షలు విధించిన ప్రాంతాలలో' ఆ విప్లవ కార్యకర్తల ఇళ్ళలో నివసించాము. ఇప్పుడా ప్రాంతాలు చట్టబద్ధమైనవి. ఇప్పుడు వారు ఎన్నికలలో పాల్గొంటున్నారు. వారికీ, మావోయిస్ట్ పార్టీ వారికీ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయి; ఇరు వర్గాల మధ్య గొప్ప సైద్ధాంతిక చర్చ జరుగుతుంది. 

అయితే వారు పరస్పర శత్రువులు కారు. మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతితో నేను చేసిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలన్నిటినీ ఎలా చర్చించాడో మీరు చూడవచ్చు. (నా భారతీయ స్నేహితులకు నేను ఏదో ఒక విషయమై 'సలహా' ఇచ్చానన్న భావన చాలా అజ్ఞానపూరితమైనది; అంతే కాదు అది ఏ మాత్రం'ఫన్నీ'గా కూడా లేదు!) (సిపిఐకి చెందిన అత్యధిక వర్గాల వారిలో కూడా ఇదే పరిస్థితి. 

నా పుస్తకం గురించి, భారత్‌తో నా పని గురించి బాగా ఎక్కువగా రాసింది యూరోప్‌లో అత్యధిక సంఖ్యలో అమ్ముడుపోయే దినపత్రిక"neues deutschland' కావడం యాదృచ్ఛికమేమీ కాదు) ఎందుకని? గతంలో, అంటే సోవియట్ యూనియన్ అంతిమ కాలంలో నేను ఆ దినపత్రికలో పనిచేశాను. అప్పుడు భారత్‌తో నా సంబంధాల గురించి మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు యూరోప్‌లో ఆ పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం"neues deutschland'తో సన్నిహిత సంబంధాలు ఉన్న జర్మనీలోని "linkeకు సిపిఐతో పార్టీ సంబంధాలు ఉన్నాయి. 

భారత్‌లో నేను పర్యటించకుండా నిషేధం విధించాలని భారత ప్రభు త్వం యోచించడం గొప్ప ప్రాధాన్యమున్న విషయం కాదు. ఇంతకు ముం దు ఇతర ప్రభుత్వాలు కూడా నాపై నిషేధం విధించాయి (మాస్కో నన్ను ఏమిని పిలిచేదో గుర్తు చేసుకోండి!). మీరు విదేశాంగ శాఖ ఫైళ్ళను చూసినట్టయితే అమెరికా 1944 (వైసిఎల్ కాంగ్రెస్‌లో ప్రసంగించడంతో అమెరి కాలో ప్రవేశించకుండా నాపై ఆంక్షలు విధించారు) నుంచి నాపై అప్పుడప్పుడూ నిషేధం విధిస్తూనే వుందని అర్థమవుతుంది. నిషేధం విధించినప్పుడు నన్ను అధికారికంగా ఆహ్వానించింది కూడా. ఇప్పుడు నా వయస్సు 85 సంవత్సరాలు. 

భారత ప్రభుత్వం నాపై నిషేధం విధిస్తే దాన్ని ఎత్తి వేయడానికి నా మిగిలివున్న జీవితకాలం కంటే ఎక్కువ వ్యవధినే తీసుకోవచ్చు. అయితే అదేమంత గొప్ప ప్రాధాన్యమున్న విషయం కాదు. ముఖ్యమైన విషయమేమిటంటే విదేశాంగ శాఖలోని దక్షిణాసియా విభాగంలో పనిచేసే మీ అధికారులు స్వీడిష్ మీడియా ప్రస్తుతం అనుసరిస్తోన్నటు వం టి సంకుచిత వైఖరితో కాకుండా విశాల దృక్పథంతో భారత ప్రజల పోరాటాన్ని చూసేలా చేయడం. స్వీడన్ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దౌత్యఅధికారుల దృక్పథంలో మార్పువచ్చేలా మీరు చూడాలి. 

- యాన్ మిర్డాల్
మే 20, 2012
భారత్‌లో ప్రవేశించకుండా తనపై నిషేధం విధించాలని భారత ప్రభుత్వం యోచిస్తున్నట్టు వార్తలు వెలువడిన నేపథ్యంలో ప్రముఖ స్వీడిష్ రచయిత, పాత్రికేయుడు, సామ్యవాద చింతకుడు, భారత మిత్రుడు యాన్ మిర్డాల్ తమ దేశ విదేశాంగ మంత్రికి రాసిన లేఖ పూర్తి పాఠమిది.
Andhra Jyothi News Paper Dated : 22/05/2012 

ఉద్యమానికి పరకాల సవాళ్లు - సుజాత సూరేపల్లి



రాష్ట్రంలో ఉప ఎన్నికల వరస చూస్తే ఈ పాలనా రంగం, ఎన్నికల ప్రక్రియ, రాజకీయ ఎత్తుగడలపై ఏవగింపుని, అసహ్యాన్ని కలిగించక మానవు. అటు సీమాంధ్ర ప్రాంతంలో జగన్ వర్సెస్ అధిష్ఠానం పోటీ నడుస్తోంది. నాయకుల గొడవ ఏదైనా కాని నేడు ఐఏఎస్‌లు, ఐఆర్ఎస్‌లు, పెద్ద పెద్ద గనులను మింగిన ఘనులు కూడా ఊచలు లెక్కబెడుతున్నారు. ఏలిన వారికి కోపం వస్తే కాని పెద్ద పెద్ద తిమింగలాలు బయటపడేటట్టు లేవు. ఇంక ఇక్కడ తెలంగాణలో జరిగే పరకాల ఎన్నికల వ్యూహాలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. 

ప్రాణాలకు తెగించి, ఎదిరించి సాధించిన ప్రజాస్వామ్యం పక్కన పగలబడి నవ్వుతోంది. ఎన్నికలు! ఉప ఎన్నికలు! ఉద్యమాల పేరుతో రాజీనామాలు. నాయకుల మీద ప్రేమతో, ఏదో ఒక అజెండాతో చేసేవి కూడా రాజీనామాలే. ఇంక తెలంగాణ విషయానికొస్తే, తెలంగాణ కావాలంటే రాజీనామా, వద్దంటే కూడా రాజీనామా అస్త్రమే. ఎన్ని పాపాలు చేసయినా సరే, ఒక్కసారి రాజీనామా చేస్తే పవిత్ర తెలంగాణ బాప్టిజం తీసుకున్నట్టే. ఒక్క వేటుతో అన్ని గొంతులు నొక్కేయొచ్చు. జై తెలంగాణ అంటే వందకు వంద మార్కులు. ఎవరు ఎన్ని మోసాలు, నేరాలు చేసినా, వెన్నుపోటు పొడిచినా 'మాఫీ!' మాఫ్! 

ఇంక మహబూబ్‌నగర్‌లో టిఆర్ఎస్‌కి కోలుకోలేని దెబ్బ తగిలిందనడంలో సందేహం లేదు. ముస్లిం సోదరుల తెల్లటోపీలు పెట్టుకొని ఓల్డ్‌సిటీలో హలీం, బిర్యానీ తిని, నాలుగు ఉర్దూ మాటలు చెప్పినంత వీజీ కాదు ముస్లిం సమాజాన్ని బోల్తా కొట్టించడం అని ఈ పాటికి అర్థం అయ్యుంటుంది. అంతే కాకుండా మైనారిటీల పట్ల వివక్షతపై ప్రజాసంఘాల, లౌకికవాదుల మండిపాటు చూసి ఖంగు తిన్నారు పెద్ద పెద్ద నాయకులు. ఒక్క సీటు ఓడిపోతే ఓడిపోయారు కానీ, అసలైన రంగులు చూసే అవకాశం కలిగింది. 

మళ్లీ జీవితంలో మోసపోకుండా ఒక గుణపాఠం. సెంటిమెంట్, ఎమోషన్ మీద కట్టిన భవంతుల పునాదులు ఎక్కడో కదిలినట్లు, ఆకాశంలో, అరచేతిలో స్వర్గం చూపించినట్టు తెలంగాణని చూపించి సొమ్ముచేసుకున్న వోట్లు వెక్కిరిస్తున్నట్టు తెలంగాణ పార్టీలు భావించడం సమంజసమే. రాజకీయ పదవులకు, ఊకదంపుడు ఉపన్యాసాలకు పేరుగాంచి, ఉర్రూతలూగించిన 'కారు బొమ్మ'కి కారు మబ్బులు కమ్ముకుంటున్నాయి. 

అంతో ఇంతో జాక్‌ని అడ్డం పెట్టుకొని నడిపిస్తున్న ఉద్యమం కాస్త అటకెక్కే పరిస్థితి దాపురించింది. జాక్ అనగా ప్రజల ఆకాంక్ష, ప్రజా ఉద్యమ ఐక్య వేదిక. అటు ప్రజలను ఇటు రాజకీయ పార్టీలను సమన్వయ పరిచేది నిజమైతే, ఇవాళ రాజకీయ పార్టీలు జాక్‌ని దూరం పెడుతున్నారు. అంటే ప్రజలను దూరం పెడుతున్నట్టే అర్థం చేసుకోవాలి. వోటు రాజకీయాల ముందు ప్రజలు, ఉద్యమాలు, పిచ్చివారి పానాలు ఏపాటి? టిఆర్ఎస్‌కి ఉన్న బలం అంతా జాక్‌కి పోతుందేమో అని ముందు జాగ్రత్త చర్యగా ఆ పార్టీ నాయకులు ఆలోచించడంతో పాటు జగన్‌నే గెలిపిద్దాం అని మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తూ, పైకి పరకాల ఎన్నికల గురించి ఆచితూచి మాట్లాడడం నేటి పరిస్థితిలో తప్పకుండా సాహసమే. ఇప్పటివరకు ఇక్కడ ఉన్న పార్టీలన్నింటితో జత కట్టడం అయిపోయింది, 

ఇంక మిగిలింది జగన్ పార్టీ మాత్రమే. వారు ఏ ప్రాంతం వారు ఐతేనేమి, డీల్ మంచిగుండాలే! ఇప్పుడు సచ్చిపోయిన వాళ్ళు ఎనిమిది వందలే కదా, ఇంకొన్ని వందలు పోయినా మనకు పెద్ద లెక్కలోకి రావు. ప్రజల ప్రాణాలు ఇవ్వాళ చాలా చీప్. మహబూబ్‌నగర్‌లో ఒకవైపు తెలంగాణ అమ్మ కట్నం త్యాగం చేసిందని పెళ్ళికి వెళ్ళిన నాయకులకి, మరోవైపు ప్రాణం తీసుకున్న మరొక బిడ్డ దగ్గరకి పోవడానికి మనసొప్పలే. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి అని ఆలోచిస్తున్న అన్ని కుల, వర్గాల శ్రేణులు ఈ దగా కోరు పార్టీల నైజాన్ని పసిగట్టడంలో విఫలమౌతున్నాయి. 

రెండు రోజుల క్రితం వరంగల్‌లో తెలంగాణ వనరుల పరిరక్షణ సదస్సు జరిగింది. ఒకవైపు తరలిపోతున్న నదులు, గుట్టలు, మైనింగ్ గురించి వక్తలు మాట్లాడుతుంటే, మరోవైపు అన్ని హోటళ్లు, ఇళ్లు రకరకాల పార్టీలతో నిండి ఉన్నాయని, అందరు రాజకీయ నాయకులు వారి వారి బలగాలతో మొహరించి ఉన్నట్టు మిత్రులు చెప్పుకొచ్చారు. వీరికి ప్రజా సమస్యలు ఏవీ పట్టవు. అందులో ముఖ్యంగా భూమి, నీళ్ళు అనే విషయాలు అసలు పట్టవు. 

అసలు పరకాల ఎన్నికల మీద అత్యుత్సాహం చూపించడానికి ముఖ్య కారణాలు 1. మహబూబ్‌నగర్‌లో టిఆర్ఎస్ ఓడిపోవడం పోతే పోయింది కాని బిజెపి గెలవడం, ముస్లింలతో నానా చీవాట్లు తినడం. 2. కొండా సురేఖ అనే స్వచ్ఛమైన తెలంగాణ మహిళ పోటీ చేయడం, ఆమెను ముందు నిలబెట్టి వైఎస్సార్ పార్టీ నాయకుడు జగన్ తెలంగాణలో ఎంట్రీ ఇవ్వడానికి జరుపుతున్న ప్రయత్నాలు. 3. బిజెపి రెట్టించిన ఉత్సాహంతో మేము సైతం అంటూ పోటీచేసి తీరుతాం అనడం. 4. టిడిపి నేతలు ఊరూరా తిరుగుతూ తమ బలాన్ని కూడా నిరూపిస్తామని వెనుకంజ వేయకపోవడం. 5. ఇంకా తెలంగాణ కోసం రాజీనామా చేసిన నళినీ, విద్యార్థులు, కవులు, కళాకారులు, ఇతరులు అనేకులు ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి నిర్ణయించుకోవడం. 6. తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం నెత్తిన మోస్తున్న జాక్ ఎటూ చెప్పలేక ఒకవైపు మదనపడుతూ, టిఆర్ఎస్ బహిరంగంగానే బహిష్కరిస్తున్నా కూడా నోరు మెదపలేని స్థితిలో ఉండడం. 

ఇవి కాకుండా ఇంకా ఇతర కారణాలు ఎన్ని ఉన్నా, పరకాల ఎన్నికలు కొన్ని నిజాలని నిగ్గు తేలుస్తున్నాయి. ఇక్కడ ఎన్నికలు అంటే జయలలిత లాగా ఇంటికొక కలర్ టీవీలు వంటి ఖరీదైన సౌకర్యాలు కల్పించకపోయినా కూడా కనీసం ప్రజలు అనుభవిస్తున్న బాధలు కూడా వినే స్థితిలో లేరు. అందరూ తెలంగాణ వాదులే, తెచ్చేది, ఇచ్చేది కూడా అన్ని పార్టీలే. అధిష్ఠానం మాత్రం నిమ్మళంగా తెలంగాణ తగలబడుతుంటే ఫిడేల్ వాయిస్తున్నట్టుంది. ఇంతకీ ఇంతమందిలో ప్రజలు ఎవరిని గెలిపించాలి? ఈ ఒక్క సీటుతో నిజమైన తెలంగాణ ఎవరిని గెలిపిస్తే వస్తుంది. ఇదే మాట మహబూబ్‌నగర్‌లో, మొన్న జరిగిన ఉప ఎన్నికలలో కూడా చెప్పినారు కదా? సామాన్యుడికి ప్రశ్నలు తప్ప ఇంక మిగిలింది ఏమీలేదు. 

ప్రజలు ఇంకా గొర్రెలు అనుకుంటున్న రాజకీయ పార్టీల వైఖరి చూస్తే జాలేస్తుంది. కెసిఆర్ బిజెపి మీద వ్యాఖ్యలు చూస్తుంటే ముక్కున వేలువేసుకోవాల్సిందే. ఆయనకి ఇవ్వాళ బిజెపి మతతత్వ పార్టీ అని జ్ఞానోదయం అయింది. అందులో నుంచి వచ్చిన నరేంద్రని తీసుకున్నపుడు కానీ, హార్డ్‌కోర్ బిజెపి నాయకురాలు విజయశాంతిని తీసుకున్నపుడు కాని, మొన్నటిదాకా చెట్టాపట్టాలేసుకొని, పార్టీల కండువాలు మార్చుకొని వారిని గెలిపించమని తిరిగినపుడు గుర్తుకు రాలేదు. జాక్‌ని సృష్టించినపుడు లేని ఆంక్షలు అన్ని ఇపుడు జాక్ మీద గుమ్మరిస్తున్నారు. 

మహబూబ్‌నగర్ ఓటమికి కేవలం జాక్, కోదండరాం మాత్రమే బాధ్యులు అన్ని చెప్పుకొస్తున్నారు. వీరి పార్టీ ఏమిచేసింది అని ఎవరూ అడగకూడదు అని ముందు జాగ్రత్త పడుతున్నారేమో. తెలంగాణలో మాకు లేరు సాటి అనుకుని నిమ్మలంగా ఉన్న పార్టీకి కంట్లో నలుసులాగా తయారయింది బిజెపి. అసలే జాతీయ పార్టీ, ఇంకా బిజెపి కనుక గెలిస్తే మాకు మనుగడ లేదని తెలుసుకున్నట్టు వారి చర్యలే చెబుతున్నాయి. మహబూబ్‌నగర్‌లో ముస్లింలు ఉన్నారు కనుక ముస్లిం కార్డ్ వాడారు, ఇక్కడ బీసీలు ఉన్నారు కనుక బీసీ కార్డ్ వాడాలే. ఏ పార్టీ అయినా కూడా ఇదే సూత్రం అనుకరించాలే. అదే రాజకీయ నంబర్ గేమ్. కులాల, మతాల గుప్పిట్లో ఎన్నికలను చుట్టగట్టి నడిపిస్తున్నా రాజకీయాలు, కుల సమీకరణలో బిజీ అయిపోయారు. 

అసలు వీరికి కుల రహిత సమాజం గురించి మాట్లాడే అర్హత ఉందా? అసలు తెలంగాణ తేవడానికి ఈ లెక్కలకి ఏమిటి సంబంధం? ఇన్నేళ్ల స్వతంత్రం తరువాత కూడా మన లెక్కలు మారవా? ఫూలే, జగ్జీవన్‌రామ్, అంబేద్కర్ జన్మదినాలు జరుపుకుంటున్న వారు ఈ కుల సమీకరణాలను చూసి ఏమి సమాధానం చెబుతారు? ఎవరు లౌకిక వాదులు? అసలు జాక్ ఏర్పడినప్పుడు ఎంతోమంది, సంఘాలుగా, వ్యక్తిగతంగా పార్టీలకు అతీతంగా ఉండమని కోరితే పెడచెవిన పెట్టారు. 

ఇపుడు రాజకీయ నాయకులకు సంతృప్తిని ఇవ్వలేక అసహాయస్థితిలో ఉంది జాక్. ప్రజా ఉద్యమాలు వేరు, రాజకీయ పార్టీల ఉద్యమాలు వేరు అని ఇప్పుడు కొత్త పాఠాలు నేర్చుకోవాలేమో. ఇక్కడ కులం, మతం పునాదుల మీద లేని పార్టీ ఏది? ఉన్న పార్టీలను మనం దరిదాపుల్లో కూడా రానివ్వం కదా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను నిర్ణయించేది కూడా అగ్రకుల శక్తులే, పార్టీలే. 

తెలంగాణ అనుకుంటూనే ఇంత మంది నిలబడడం తెలంగాణకు ద్రోహం చేయడమే. ఇపుడు పరకాలలో నిజానికి టిఆర్ఎస్, బిజెపి నిలబడి సాధించేది ఏమీ లేదు. అక్కడ నిలబడే కంటే ముందు ఎవరు ఏవిధంగా తెలంగాణను తీసుకొస్తారు అన్న విషయం స్పష్టంగా, సూటిగా చెప్పాలి. మేము గెలిస్తే వస్తాం, తెలంగాణ తెస్తాం అనే డైలాగ్ చాలా అరిగిపోయిన రికార్డ్. ప్రజలను స్వచ్ఛందంగా తమకు కావలసిన వ్యక్తిని ఎన్నుకొనే పరిస్థితి కల్పించనంత కాలం ఈ రాజకీయాలు మారవు. ఉత్తర తెలంగాణ, ఆ మాటకొస్తే తెలంగాణ అంతా దోపిడీకి గురి అవుతున్నది. దీనిని మాట్లాడకుండా కేవలం వోటు కోసం మాత్రమే మాట్లాడితే ప్రజలకు ఒరిగే ప్రయోజనం లేదు. ఉద్యోగాలు, చివరికి కూలి పని కోసం కూడా ప్రజలు తన్నులాడుతున్నారు. 

ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా పార్టీల అజెండాని పక్కనపెట్టి ప్రజా సమస్యల మీద పోరాటం చెయ్యట్లేదు. ఇవాళ పార్టీలు పుట్టినదే తమ మనుగడ కోసం సమాజంలోని అసమానతలను పెంచి పోషిస్తున్న అన్ని రాజకీయ పార్టీలను కనీసం తెలంగాణ మొత్తంగా బహిష్కరించాలి. గత దశాబ్ద కాలంగా తెలంగాణ ప్రజలు నాయకుల కపట చిత్రాలు చూసి అలిసిపోయారు. ఈ కుట్రల ముసుగులో ఇంకా ఎక్కువ రోజులు రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకోలేవు. తెలంగాణ రాని తీసుకురాని పరకాలలో ఎవరో ఒకరిని, ఉద్యమకారులని గెలిపించడం న్యాయం. ఇప్పుడు ఉన్న పార్టీలలో మనుషులు ఎలాంటి వాళ్ళో అందరికీ అర్థం అయింది. ఇప్పుడు కనీసం నిబద్ధత కొలమానంగా ఉన్న వాళ్ళ కోసం వెతకడంలో తప్పులేదు. 

- సుజాత సూరేపల్లి
Andhra Jyothi News Paper Dated : 22/05/2012