Friday, February 28, 2014

నాకూ సంబురం లేదు- కంచ ఐలయ్య


Published at: 01-03-2014 07:30 AM
 
3 
 
3 
 
0 
 
 

దేశానికి స్వాతంత్య్రం వచ్చిననాడు గాంధీ, అంబేద్కర్, నెహ్రూ ఎవరూ గుర్రాలు, ఒంటెల్ని ఎక్కి ఊరేగి సంబురాలు జరుపలేదు. ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో ఫ్యూఢలిజం ఎంత పూనకంతో ఎగిరిందో మనమంతా చూశాం. ప్రజలు కోరుకునే నాయకులెవరూ ఇటువంటి సంబురాలు చెయ్యరు. కనుకనే తెలంగాణ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది.
ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది. తెలంగాణలో పై వర్గాలు సంబురాలు చేసుకుంటుంటే, సీమాంధ్ర ప్రాం తాల్లో పై వర్గాల్లో విషాదం కనిపిస్తుంది. నేను తెలంగాణ వాణ్ణి. చిన్నప్పటినాటి చదువురీత్యా తెలుగు వాణ్ణి, భారతీయుడిని. ఈ ప్రక్రియ అంతటితో నాకు సంబురపడాలనే తపన కలుగలేదు. కొంతమంది అంటున్నట్లు తెలుగు ప్రజలు విడిపోయినందుకు కాదు. నేను తెలుగువాదిని కాదు, ఆంగ్ల భాషా అభివృద్ధి వాదిని.
రాష్ట్రాలు విడిపోవడం, రెండు దేశాల మధ్య సంఘర్షణ వాతావరణాన్ని ఇరు పక్కల సృష్టించడానికి నేను వ్యతిరేకం. శారీరక పోరాటాల కంటే రెండు ప్రాంతాల మధ్య ఒక మానసిక పోరాటం జరగడం, ప్రజాస్వామిక వాతావరణం దెబ్బతిని, ప్రజల మధ్య ద్వేషాలు పెరుగడం... ఈ క్రమంలో జరిగిన పెద్ద నష్టం. నష్టాన్ని పూడ్చడానికి మానవత్వం కీలకమౌతుంది.

ఇరుపక్షాల్లో ఇది ప్రజలందరి పోరాటం అని చెప్పినప్పటికీ రెండు ప్రాంతాల ఆధిపత్య వర్గాలు, కులాలు ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయి. ఒక ప్రాంతపు ఫ్యూఢల్ శక్తులు, మరో ప్రాంతపు పెట్టుబడి ఆధిపత్య శక్తులు గత మూడేళ్లుగా బాహాబాహీకి దిగాయి. ఈ నరాల యుద్ధం టీవీల్లో జరిగింది. అది అన్ని ప్రాంతాల శ్రమ జీవుల్ని, ముఖ్యంగా దళితుల్ని, ఆదివాసుల్ని, వెనుకబడిన తరగతుల వారిని గందరగోళపర్చింది. చివరికి బిల్లు రెండుసభల్లో అదే మానసిక యుద్ధ వాతావరణంలో పాసవ్వడంతో పరిస్థితి భీకర మానసిక ఉప్పెన ఆగిపోయి ఒక పక్క కొంత సంబురాలు, మరోపక్క కొంత ఓటమి ఓదార్పుల్లో ప్రజలున్నారు. ఈ స్థితిలో 1956 నుంచి 2014 నాటి ఈ ప్రజలు సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు లాభనష్టాలు మరో కోణం నుంచి అంచనా వేయాలి.
1956 ముందు తెలంగాణ గ్రామాల్లో పాఠశాలలు లేవు. ఇక్కడి భూస్వామ్య శక్తులు సైతం ఆధునిక విద్య లేక బడులే బందీఖానాలనే స్థితిలో ఉన్నారు. సీమాంధ్ర ప్రాం తంలో బ్రిటిష్ వలసవాదం, క్రిస్టియన్ మిషనరీలు విద్యను ఆదర్శవంతమైందిగా, ఆంగ్ల విద్యను అవకాశాల పట్టుకొమ్మగా ప్రచారం చేశారు. ఆ విలువలు గ్రామ స్థాయి వరకు పాకివున్నాయి. ఆనాడు రాష్ట్రం సమైక్యతను సంతరించుకోకపోతే తెలంగాణలోని భూస్వామ్య పాలక వర్గాలు దాని అభివృద్ధిని ఆకాంక్షించే వారే కాదు. రాజకీయ పాలకులే కాక అటునుంచి హైదరాబాదుకొచ్చిన బ్యూరాక్రటిక్ శక్తులు విద్యాకాంక్ష కొంత ప్రయోజనం ఒనగూర్చింది.
సమైక్యరాష్ట్ర అభివృద్ధి క్రమంలో కమ్మ మైగ్రెంట్స్ (ఎక్కువగా క్రైస్తవ మైగ్రెంట్స్) ఈ ప్రాంతం వచ్చి సెటిల్ అయ్యారు. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వీరి ప్రభావం వ్యవసాయం ఆధునికత మీద, అంటరానితనాన్ని తగ్గించడంలో విద్యా వ్యాప్తిని పెంచడంలో చాలా వుంది. ఇక్కడి కరుడుకట్టిన రెడ్డి, వెలమ భూస్వామ్య సంస్కృతికి, క్రైస్తవ కమ్మల సంస్కృతికి చాలా తేడా ఉం డేది, ఉన్నది. ఉదాహరణకు చెన్నరావుపేట మండలంలోని తిమ్మారావు గ్రామసంస్కృతి పరిశీలిస్తే ఈనాటికీ తేడాతెలుస్తుంది. ఆ గ్రామ ప్రభావం మొత్తం తాలూకా మీద పడిందంటే అతిశయోక్తికాదు. ఇన్ని పోరాటాలు, ఒడిదుడుకుల మధ్య కూడా విద్యారంగం తెలంగాణలో ఈ స్థాయికైనా ఎదిగిందంటే సమైక్యత ఫలితమని చెప్పక తప్పదు.
విద్యారంగం, ఆధునిక వ్యవసాయం, పట్టణ సంస్కృతి, తిండి, బట్ట వంటి వాటిలో ముందంజలో ఉన్న వారి ప్రభావం వెనుకబడిన వారిమీద పడుతుంది. తెలంగాణ భూస్వాములకు విద్యలో పోటీపడాలనే ఆలోచన సమైక్యతలో వచ్చిందే. అయితే ఇక్కడి భూస్వామ్య వర్గంలో ఈనాటికీ సాంఘిక సంస్కరణ లేదు. అందుకే వీళ్ళు 'తెలంగాణ పునర్నిర్మాణ'మంటే ఇక్కడి నుంచి విద్యారంగాన్ని, జీవన విధానాన్ని, ఆంగ్లేయ విద్యను మళ్ళీ వెనక్కి తీసుకుపోవడమా అనే అనుమానం నాకైతే ఉన్నది.
గత నాలుగేళ్ళు తెలంగాణలోని మూడు అగ్ర కులాలు సంపూర్ణ ఐక్యతను సాధించాయి. ఇక్కడి భూస్వామ్య వర్గానికి ఒక రాజకీయపార్టీ వచ్చింది. సంఘ సంస్కరణతో ముడివడని ఏ రాజకీయ ఉద్యమమైనా అగ్రకుల ఆధిపత్యాన్నే పెంచుతుంది.
రాజకీయ రంగంలో సమైక్యత వలనే జరిగిన కొన్ని కీలక మార్పులున్నాయి. అందులో ముఖ్యమైనవి పటేల్, పట్వారీల రద్దు. అవి రద్దు చేసిన రోజుల్లో ఎన్.టి.రామారావు పాలన మీద ఇక్కడి రెడ్డి, వెలమ, బ్రాహ్మణులు ఎంత కోపంగా ఉన్నారో మనకు తెలుసు. దీనికి తోడు తాలూకాలను రద్దుచేసి మండలాలను ఏర్పర్చడం. ఇది కూడా ఇక్కడి భూస్వామ్య ఆధిపత్యం మీద పెద్దదెబ్బ తీసింది. ఈ వ్యవస్థ ఎన్నికల రంగంలోకి ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చిపెట్టింది. ఈ వ్యవస్థను పునర్నిర్మాణం పేరుతో ముందుకు తీసుకెళ్తారో, వెనక్కి తీసుకెళ్తారో తెలియదు. తెలంగాణలో ఇప్పుడు మాత్రం భూస్వాములను ప్రశ్నించే చైతన్యం జీరోస్థాయికి చేరుకొని వున్నది. ఇది టీఆర్ఎస్ ఘనత. తెలంగాణ భూస్వాములు ఆ పార్టీకి చాలాకాలం విధేయులుగా ఉంటారు. అది కాంగ్రెస్‌లో విలీనమైనా ఆ శక్తులదే పైచేయి.

దళిత బహుజన చైతన్యం 1985లో కారంచేడు సంఘటన తరువాత ఒకరూపం దిద్దుకుని తెలంగాణజిల్లాల్లోకి పాకింది కూడా ఆంధ్ర జిల్లాల్లో పుట్టిపెరిగిన అంబేద్కరిజం వల్లనే. నాలాటి వాళ్ళకెంతో మందికి బొజ్జా తారకం, కత్తి పద్మారావు, జెబీ రాజు వంటివారి నుంచి అంబేద్కరిజంపై పాఠాలు నేర్చుకునే అవకాశం దొరికింది. ఇది సమైక్య రాష్ట్రమై ఉండకపోతే ఆ బంధమేర్పడేది కాదు. ఆ తరువాత వచ్చిన మాదిగ దండోరా చుట్టూ ఏర్పడిన పెద్ద సంస్కరణ చైతన్యం సమైక్యరాష్ట్రంలో వచ్చింది. కృష్ణ మాదిగ తెలంగాణవాడైనా, ఆ చైతన్యం పునాదులు ఒంగోలులో పడ్డాయి.
అంతకంటే ముఖ్యంగా వాళ్ళు తమ తమ పేరు మార్పిడి, మాదిగ వాడల్లో ఆత్మగౌరవ పాఠాలు నేర్చుకున్న విలువలు అటు నుంచి ఇటు దిగుమతి అయినవే. టీడీపీ ఓట్ల రాజకీయం కోసమే అయినా రిజర్వేషన్ వర్గీకరణ వచ్చాక దాన్ని అమలు చేయించుకునే ఉద్యమం రాష్ట్రాన్ని ఊపేసింది. దానికి 2009డిసెంబర్ ప్రకటన తరువాత తెలంగాణ ఇస్తామని కేంద్రం ప్రకటించిన అనంతరం వచ్చిన ఉద్యమానికి చాలా పోలిక ఉన్నది. అయితే మాదిగ దండోరా ఉద్యమానికి బలమైన సాంఘిక సంస్కరణ లక్షణమున్నది.. ఒకప్పుడు కమ్మ క్రిస్టియన్లు మైగ్రెంట్స్‌గా వచ్చి తెలంగాణలో మార్పు తెచ్చినట్లే మాదిగ దండోరా ఉద్యమంలో బలమైన భూమికను పోషించింది క్రిస్టియన్ మాదిగలు.
నాకు తెలిసి తెలంగాణలో ఒక్క భాగ్యరెడ్డివర్మ ఉద్యమంలో -అదీ సంస్కృతీకరించబడ్డ రూపంలో తప్ప కులాలను కదలించిన ఉద్యమాలు పుట్టలేదు. అందుకుకారణం తెలంగాణ భూస్వాముల్లో సంఘ సంస్కర్తలు ఎదక్కపోవడం. ఆ రకంగా మాదిగ దండోరాతో వచ్చిన చైతన్యం అనన్యసామాన్యమైంది. దానితో రాష్ట్రంలోని మాలలు కొంత ఇబ్బంది పడ్డప్పటికీ అది తెలంగాణ జిల్లాల్ని, గ్రామాల్ని ఏ ఉద్యమం చెయ్యనంత మార్పుకు గురిచేసింది.

రాష్ట్రాలు విడిపోయాక రాష్ట్రాల అభివృద్ధికి విద్యారంగం మూలం. దీన్ని గత పదేళ్లుగా తెలంగాణ ప్రాంతంలో కుప్పకూల్చారు. రాష్ట్ర సాధన రాజకీయరంగానికి వదిలివేయకుండా విద్యారంగం బాధ్యతగా చిత్రీకరించారు. అందువల్లే విద్యార్థులు, ఉపాధ్యాయులు రోజూ రోడ్ల మీద ఉన్నారు. దీనివల్ల రేపు అధికారంలో ఉండే ఫ్యూఢల్ శక్తులకు పెద్దగా నష్టం ఉండదు. కానీ తెలంగాణ ప్రాంతపు దళిత బహుజన వర్గాల్లో ఒక బలమైన బ్యూరాక్రటిక్ క్లాస్ రూపొందదు. జీతం తీసుకునే ఉద్యోగులు మాత్రమే కాదు, ప్రతినిత్యం పనితనాన్ని, జ్ఞానాన్ని పెంచుకుంటూ వ్యవస్థ సమర్థతను పెంచే ఉద్యోగ వ్యవస్థ ఏర్పడాలి. దానికి బ్యూరాక్రటిక్ డిసిప్లిన్ చాలా అవసరం. అది అభివృద్ధి కావాలంటే పాలక వర్గం దూరదృష్టికలదిగా తయారవ్వాలి.
గత అరవై ఏళ్ల నుంచి తెలంగాణ ఫ్యూఢల్ వ్యవస్థ ఎందుకు బలహీన పడలేదు? పెట్టుబడిదారీ వర్గం ఎందుకు ఏర్పడలేదు? మున్ము ందు ఏర్పడ్డా దాని కుల వర్గ స్వభావం ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు కీలకమైనవి. ఇంతకాలం ప్రతి దానికి ఆంధ్రులను తిట్టిన శక్తులకు ఇక్కడ అభివృద్ధి కాముక మేధావివర్గాన్ని డెవలప్‌చేసే వ్యవస్థలు రూపొందకపోతే తెలంగాణ ఇంకా వెనక్కిపోతుంది అని తెలుసు.
ఇక్కడి అగ్రకుల రాజకీయ శక్తులు తెలుగుదేశం అధికారంలో ఉన్న కాలాన్నంతా తీవ్రంగా ద్వేషించుకున్నాయి. ఆ కాలంలో కింది కుల ప్రాతినిధ్యం కాస్తా పెరిగింది. ఇప్పుడంతే కసితో ఎస్.సి., ఎస్.టి.లను ముఖ్యంగా బీసీలను అణగదొక్కాలనే శక్తులు తెలంగాణ ఉద్యమకాలమంతా బలపడ్డాయి. అగ్రకుల ఆధిపత్యాన్ని అడ్డుకోగలిగే కింది కులరాజకీయ శక్తులు ఎదుగలేదు. మీడియా కూడా వాటిని ఎదగనివ్వకుండా జాగ్రత్తపడుతున్నది. మీడియా తల్చుకుంటే నాయకుల్ని ఎలా తయారు చెయ్యగలదో కేజ్రీవాల్ ఎదుగుదల మంచి ఉదాహరణ.

అగ్రకుల నాయకత్వం వైరుద్ధ్యాల్లో ఉన్నప్పుడు దళిత బహుజన నాయకత్వం ఎదగడం కొంత సులభం. ఆ స్థితి కోస్తాంధ్రలో కాంగ్రెస్ పార్టీ చుట్టూ కొంత కనబడుతంది. అక్కడి ప్రాంతీయ పార్టీలు ముగ్గురు అగ్రకుల నాయకుల చేతుల్లో ఉండడంతో కాంగ్రెసు కిందికులాల మీద ఆధారపడక తప్పదు. కానీ తెలంగాణలో పరిస్థితి అది కాదు. టీడీపీ కూడా ఒక బీసీనో, ఎస్.సి.నో బలమైన నాయకుడుగా ఎదుగనిచ్చే పరిస్థితి కనబడటం లేదు. ముందు ముందు వాళ్ల అవసరాలరీత్యా సీమాంధ్ర ప్రాంత నాయకులు కూడా, తెలంగాణ అగ్ర కులాలతో గూడుపుఠాణీ చేసే అవకాశమే ఎక్కువ ఉన్నది.
టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో చేరకుండా ఉంటే రాష్ట్రం సాధించిన ప్రతిష్ఠను ఒక్క అగ్రకులం మూటకట్టుకొని మిగతా రెండు అగ్రకులాలను (రెడ్డి, బ్రాహ్మణ) తాబేదార్ల ద్వారా బుజ్జగించి కింది కులాలను తొక్కేసి ఆ ప్రక్రియకు పునర్‌నిర్మాణం అని పేరు పెట్టే అవకాశం లేకపోలేదు. అది కాంగ్రెస్‌లో విలీనమైతే పరిస్థితి కొంత వేరుగా ఉంటుంది.
రాష్ట్రం ఏర్పడ్డాకే సామాజిక న్యాయం గురించి మాట్లాడాలి అన్న మేధావులు కొత్త రాష్ట్రంలో కుటుంబ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశం లేకపోలేదు. దిక్కులేని శక్తులు కమ్యూనిస్టుల మీదనో, విప్లవకారుల మీదనో ఆధారపడే అవకాశం లేదు. ఆ శక్తులన్నీ 'జై తెలంగాణ' జెండాలు మోసి కనిపించకుండా పోయాయి. కొద్దో, గొప్పో ఉన్నవి అగ్రకులాల అనుబంధంతో ఉన్నాయి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిననాడు కూడా గాంధీ, అంబేద్కర్, నెహ్రూ ఎవరూ గుర్రాలు, ఒంటెల్ని ఎక్కి ఊరేగి సంబురాలు జరుపలేదు. కానీ ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో ఫ్యూఢలిజం ఎంత పూనకంతో ఎగిరిందో మనమంతా చూశాం. ప్రజలు కోరుకునే నాయకులెవరూ ఇటువంటి సంబురాలు చెయ్యరు. కనుకనే తెలంగాణ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. సీమాంధ్ర ప్రజల్లో ముఖ్యంగా శ్రమ జీవుల్లో, బరువు బాధ ఉంటే, రెండు రాష్ట్రాల్లోని వారంతా కలిసి కష్టాలు పంచుకుందామని చెప్పాల్పిన అవసరం ఎంతైనా ఉన్నది.
- కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త

Andhra Jyothi Telugu News Paper Dated: 01/03/2014 

Wednesday, February 26, 2014

ఎస్సీలకు బాసటగా కాంగ్రెస్ - కొప్పుల రాజు, విశ్రాంత ఐఏఎస్ అధికారి; చైర్మన్ ఏఐసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్




1 
 
1 
 
0 

 



చిటికెన వేలు అందిస్తే చాలు, చిటారుకొమ్మనందుకోగల చేవ సామర్థ్యం తెలివితేటలు కలవారు ఎస్.సి.లు. అటువంటి ఎస్సీలు శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, శ్రమ దోపిడీకి గురై ఇప్పటికీ చెప్పనలవికాని కష్టాలు పడుతున్నారు. డాక్టర్ అంబేద్కర్ సారథ్యంలో భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు, ఇందిరాగాంధీ 20 సూత్రాల కార్యక్రమం వంటి మహా సంకల్పాలు ఎస్.సి.ల జీవితాల్లో తీసుకువచ్చిన వెలుగు గణనీయమైనదే. అయినా ఇప్పటికీ మెజారిటీ ఎస్.సి.లు దారిద్య్రంలో న్యూనతలో మగ్గుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఎస్.సి.ల బతుకులను బాగుచేయటానికి జరిగిన కృషితో ఇతర ఏ పార్టీకి లేనంత ఎక్కువ సంబంధం సహజంగానే ఉన్నది. దీనినెవరూ కాదనలేరు.
'నిమ్నజాతుల కన్నీటి నీరదములు/ పిడుగులై దేశమును గాల్చివేయుననుచు/ రాట్నమును దుడ్డుకర్ర కరాన బూని/ దెసలు దోతెంచె గుజరాతు ముసలి సెట్టి'; 'వెఱపు వలదు నీకు హరిజన సోదరా/ స్వీయరాజ్య రథము వెడలివచ్చె/ లాగిపొమ్ము నీకు లాభము గలదంచు/ బాడుచుండె రత్న భరతమాత'- స్వతంత్ర భారతదేశంలో ఎస్.సి.ల బతుకులు బాగుపడి తీరుతాయనే ప్రగాఢ విశ్వాసంతో మహాకవి జాషువ ఈ విధంగా పద్యగానం చేశారు. ఆ మహత్తర లక్ష్యం చేరుకునే కృషి సాగుతూనే ఉన్నది. అందులో కాంగ్రెస్ పార్టీ అనితరమైన పాత్ర పోషిస్తూనే ఉన్నది. అయినా ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ ఎస్.సి. ఓటు బ్యాంకు తగ్గిపోతున్నది. దానిని పునరుద్ధరించటానికి మీరు ఏమి చేయదలచారు అని మిత్రులనేక మంది నన్ను అడుగుతున్నారు. ఇందుకు నేను ఒకటి చెప్పదలచుకున్నాను. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నాను. ముందుగా కాంగ్రెస్ పార్టీలో ఎస్.సి.లకు ప్రాధాన్యం పెరిగేలా చూడాలి. వారి మాట పార్టీలో కంగుమని వినిపించేలా చేయాలి. వారి కంఠం మార్మోగేలా పార్టీలో తగిన మార్పు తీసుకురావాలి.
ఇందుకోసం గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ ఎస్.సి. కమిటీలను పటిష్ఠం చేయాలి. పునః చైతన్యవంతం గావించాలి. ఎస్.సి.ల నుంచి యువతరాన్ని నవతరాన్ని పార్టీ శ్రేణులలోకి తీసుకురావాలి. వారికి గురుతరమైన బాధ్యతలు అప్పగించాలి. ఎస్.సి.ల బాగు కోసం ఏమిచేయాలి, ఎలా చేయాలి అనే విషయాలపై పార్టీ లోపల, పార్టీకి పౌర సమాజ సంస్థలకు మధ్య విస్తృతమైన లోతైన చర్చ జరిగేలా సంస్థాగతమైన యంత్రాంగాలను ఏర్పాటు చేయాలి. ఆ వైపుగా పలురకాల సరికొత్త చొరవలు తీసుకోవాలి. రాజ్యాంగం ఎస్.సి.లకు అనేక రక్షణలు కల్పించింది. వాటి అమలుకు పలు చట్టాలు వచ్చాయి. అవి పకడ్బందీగ రాజీలేని రీతిలో అమలయ్యేలా చూడాలి. అదీ చాలదు. ఎస్సీ లకు పరిపూర్ణమైన సాధికారత సాధించడానికి మరెన్నో విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవాలి. కార్యక్రమాలు చేపట్టాలి. మరిన్ని చట్టాలు తేవాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎస్సీలకు ఉద్దేశించిన ప్రతి ఒక్క రక్షణ -సహాయం, రాజ్యాంగపరమైన, చట్ట సంబంధమైన వెసులుబాటు కచ్చితంగా సకాలంలో సంపూర్ణంగా వారికి అందేలా చూడాలి. అందుకు ఆయా కార్యక్రమాల అమలు వ్యవస్థను సమూల సంస్కరణకు గురిచేయాలి.
ఎస్.సి., ఎస్.టి. ఉపప్రణాళికలకు చట్ట బద్ధత కల్పించటం ద్వారా వాటి నిధులు వారికోసమే ఖర్చు అయ్యేలా చూడాలన్న డిమాండ్ అత్యంత సహజమైనది, సమర్థనీయమైనది. ఎందుకంటే ఎస్.సి.ల కోసం ఇతర అణగారిన వర్గాల కోసం నిధుల కేటాయింపు కాగితాలకే పరిమితమవుతున్నది. ఎస్.సి. అంటే ఇతర వర్గాలకు కన్నుకుట్టే స్థాయిలో ఈ కేటాయింపుల గురించి ప్రచారం విశేషంగా జరుగుతున్నది.

కాని వాస్తవంలో అది మేడిపండు సామెతను గుర్తు చేస్తున్నది. పేరు పెద్ద ఊరు దిబ్బ అనేనానుడిని జ్ఞప్తికి తెస్తున్నది. కాగితాల మీద బడ్జెట్ లెక్కలలో చూపిస్తున్న నిధులు వాస్తవంలో ఎస్.సి., ఎస్.టి.లకు అందడంలేదు. మధ్యలోనే దారిమళ్ళిపోతున్నాయి. ఇతర అమాంబాపతు అవసరాలకు తరలిపోతున్నాయి. వీరికి బడ్జెట్‌లో చేస్తున్న కేటాయింపులు అంకెల గారడీగానే తెల్లారిపోతున్నాయి. గణాంక విన్యాసాలుగానే మిగిలిపోతున్నాయి. ఉపప్రణాళికల నిధుల దారి మళ్ళింపు మీద పార్లమెంట్‌లోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సభ్యుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. సంకల్పానికి ఆచరణకు ఎంతో వ్యత్యాసం ఉన్న మాట వాస్తవం. ఈ విషయం అందరూ ఒప్పుకుంటారు. వీటి మధ్య పొంతన సాధించడానికి దూరాన్ని తొలగించడానికి తక్షణ ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నాము. ఎస్సీ, ఎస్‌టీ ఉపప్రణాళికలకు కేంద్ర స్థాయిలోని చట్ట బద్ధత కల్పించాలని కాంగ్రెస్ పార్టీ జైపూర్ డిక్లరేషన్‌లో ఘన సంకల్పం చెప్పుకున్నది. ముసాయిదా చట్టాన్ని రూపొందించడానికి సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఒక లక్ష్య కమిటీని ఏర్పాటుచేసింది. నేనందులో సభ్యుడిని. రాష్ట్రాలనుంచి, సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి సలహాలు సూచనలు కోరాము. ఈ చట్టాన్ని తీసుకురావడం అది సక్రమంగా సమగ్రంగా అమలయ్యేలా చూసి ఎస్ సి ఎస్ టిలకు ఉద్దేశించిన నిధులన్నీ ప్రతి పైసా వారికే ఖర్చయ్యేలా చూడటం ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. ఎస్సీల విషయంలో ముఖ్యంగా జరగవలసిందేమిటంటే రాజ్యాంగం వారికి హామీ ఇచ్చిన హక్కులన్నీ వారికి లభించేలా వారి అనుభవంలోకి వచ్చేలా చేయడం. డాక్టర్ అంబేద్కర్ బడిలో చదువుకున్నప్పుడు స్కూలు ప్యూను తనను అంటకుండా ఎత్తునుంచి పోసిన మంచి నీళ్ళతోనే దాహం తీర్చుకునే వాడట. ఆయన దాహంతో దహించుకుపోయిన అనేక సందర్భాలలో ఆ ప్యూను ఉద్దేశపూర్వకంగానే అందబాటులో లేకుండా పోయే వాడట. అటువంటప్పుడు దాహార్తితో గొంతు ఎండి ఆయన ఎంతో బాధపడేవారు. ఈ రోజున కూడా ఆ పాఠశాలలలో మధ్యాహ్న భోజనం వడ్డించేటప్పుడు పలు చోట్ల దళిత బాల బాలికలను వేరుగా కూర్చో బెడుతున్నారు. 'కింది కులాల' వారు వండే మధ్నాహ్న భోజనాన్ని తినడానికి 'పై కులాల'కు చెందిన పిల్లలు నిరాకరిస్తున్న సందర్భాలున్నాయి. పలు రాష్ట్రాలలోని మారుమూల ప్రాంతాలలో ఇవి తరచు కన్పిస్తుంటాయి. పాఠశాలల్లో కుల వివక్ష దళితుల పిల్లలను మంచి చదువుకు దూరం చేస్తుంది. అంతటి చిన్న వయసులోనే వారిలో ఆత్మన్యూనతా భావాన్ని పెంచుతుంది. అందుకే దళితులు తమ హక్కు లకోసం పోరాడే ముందు ఎన్ని సవాళ్ళనైనా ఎదుర్కొని బాగాచదువుకోవాలని అంబేద్కర్ చెప్పారు.
దేశంలో పని విభజన ఇప్పటికీ చాలా సందర్భాలలో వారి వారి అర్హతలు, సామర్థ్యాలను బట్టి కాకుండా కులాలను బట్టి సాగుతున్నది. 'ఇండియాలో పారిశుద్ధ్య కార్మికుడు కావడమనేది అందుకు సంబంధించిన పనితనం మీద ఆధారపడి జరగదు. అతడు లేక ఆమె ఆ పని చేయగలరా అనే దాని మీద కాకుండా వారి పుట్టుక (బలం) ఆధారంగా పారిశుద్ధ్యపు పనివారవుతారు' అని అంబేద్కర్ అన్నారు. నీటి సదుపాయం లేని పాయిఖానాలు శుభ్రం చేసి మానవ వ్యర్థాన్ని నెత్తిన మోసుకుపోయే హీనాతిహీనమైన వృత్తి చేస్తున్న దళితులు దేశంలో ఇప్పటికీ లక్షల సంఖ్యలో ఉన్నారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో మూడు లక్షల మందికి పైగా ఉన్నారని తెలుస్తున్నది. ఇంతకంటే బాధాకరం, సిగ్గుపడవలసిన విషయం ఏముంటుంది? ఇటువంటి పాయిఖానాలను ఈ నీచమైన వృత్తిని చట్టం నిషేధించింది. అయినా సామాజిక వ్యవస్థలోని క్రూరత్వం దానిని కొనసాగనిస్తున్నది. జాతీయ సలహా మండలి సూచన మేరకు యూపీఏ ప్రభుత్వం ఈ రకమైన నీచ వృత్తిని కేవలం పారిశుద్ధ్యానికి సంబంధించిన సమస్యగా గాక సామాజిక రుగ్మతగా పరిగణించాలని నిర్ణయించింది. అందుకే దళితులకు రాజ్యాంగం హామీ ఇచ్చిన మానవహక్కులు వారికి పరిపూర్ణంగా లోపరహితంగా సంక్రమించేటట్టు చేయడం వారు వివిధ జీవనరంగాలలో ఎదుర్కొంటున్న దారుణమైన వివక్షను రూపు మాపడం మా ముందున్న అతి ముఖ్యమైన కర్తవ్యం. అన్నింటికంటే ఎక్కువ ప్రాధాన్యం దీనికే ఇవ్వదలిచాం. అదే సమయంలో దళితులకు ఉన్నత ప్రమాణాల విద్య, ఆరోగ్య సేవలు, ఉపాధి అవకాశాలు లభించేలా చేయడానికి అగ్రతర ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం.
ఎస్.సి.లకు, సామాజికంగా అభివృద్ధి చెందిన వర్గాలకు మధ్య వివిధ ప్రగతి సూచీల పరంగా ఉన్న తేడాలను సరిగా అంచనా వేసి నిర్ణీత వ్యవధిలో ఈ వ్యత్యాసాలను తొలగించే కృషి జరిగేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ ఎస్.సి. విభాగం సంకల్పించింది. అందుకోసం నడుం బిగించింది. అభివృద్ధి సాధనలో అన్ని సామాజిక వర్గాల మధ్య సమానత్వం సాధించడానికి దోహదం చేసే విధానాలు, కార్యక్రమాలు, చట్టాలు రూపొందించడం వైపు దీక్షతో కృషి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎస్.సి. విభాగం పనిచేస్తున్నది.
తగిన అర్హత నిపుణత ఉన్నప్పటికీ ఎస్.సి.లకు ప్రైవేట్ రంగంలో మిగిలిన వారితో సమానంగా ఉద్యోగ అవకాశాలు లభించడం లేదు. ఈ విషయం పలు సమగ్ర పరిశోధనలలో సందేహాతీతంగా రుజువయ్యింది. ఒక పనిలో వివిధ వర్గాల వారిని నియమించడం వల్ల కార్యక్షేత్రంలో భిన్నత్వాన్ని వైవిధ్యాన్ని పాటించడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని ఇందువల్ల ప్రైవేట్ రంగంలో ఉత్పాకత కూడా గణనీయంగా పెరుగుతున్నదని అభివృద్ధి చెందిన దేశాలలో రుజువయ్యింది. ఇండియాకు కూడా ఇది వర్తిస్తుంది. అందుకే ప్రైవేట్ రంగంలో ఎస్.సి.లకు రిజర్వేషన్లు కల్పించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అది ఎస్.సి.ల అభ్యున్నతికే కాక దేశ సర్వతోముఖ వికాసానికి విశేషంగా తోడ్పడుతుంది. కుల వివక్ష అంతం కావడానికి ఉపయోగపడుతుంది.
ఎస్.సి.ల ఈ ఆకాంక్షను బలంగా ముందుకు తీసుకుని వెళ్ళడానికి దానినొక విధాన పరమైన ఆజ్ఞాపాలనగా స్వీకిరించి పని చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎస్.సి. విభాగం అంకితమై ఉన్నది. ఎస్.సి.లకు సంబంధించిన అన్ని అంశాల పైన పార్టీ ఏమి చేయదలచింది, ఎంతటి నిబద్ధతతో కృషి చేయదలచింది వచ్చే ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ సవివరంగా ఎరుక పరుస్తుంది. ఈ విషయమై దేశవ్యాప్తంగా గల ఎస్.సి.ల అభిమతాలను ఆకాంక్షలను తెలుసుకుని ఒక చోట చేర్చే పనిని ఏఐసీసీ ఎస్.సి. విభాగం నిమగ్నమై చేస్తున్నది.
-కొప్పుల రాజు
విశ్రాంత ఐఏఎస్ అధికారి; చైర్మన్ ఏఐసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్
- Andhra Jyothi Telugu News Paper Dated: 25/02/2014 

Monday, February 24, 2014

చరి్త్ర పుటల్లో చేరుతున్న రుంజ కళారూపాలు By Buddaram Ramesh


తెలుగు వారికి అపూర్వమైన జానపద కళా వారసత్వం ఉన్నది. సంగీతం, నాట్యం, హస్త కళలు, శిల్ప కళలు మొదలగు కళారూపాలు తరతరాలుగా సమాజానికి వినోదాన్ని పంచిపెడుతున్నాయి. జానపద కళా సాహిత్యం ద్వారా జాతి సం„స్కృతి తెలుస్తుంది. ఒక జాతి నిర్మాణానికి అవసరమైన ఆకారాలను జానపద కళలు అందిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. జానపద కళలకు తెలుగు నేల పండిన పంట పొలం వంటిది. ఎన్నో రకాల జానపద కళలు తెలుగు నేలను సుసంపన్నం చేశాయి. శతాబ్దాలుగా ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించాయి జానపద కళలు. 

ప్రాచీన సమాజంలో ప్రజలకు వినోదం కోసం జానపద కళామాధ్యమం తప్ప మరొక మాధ్యమం లేదు. పరివర్థితులైన శిష్ఠుల కళా రూపాలు ప్రజల దాకా వచ్చేవి కావు. అవి ప్రభువుల కొలువులకు, రాచనగరులకు పరిమితం అయ్యేవి. జన సామాన్యానికి, జానపదులకు అందుబాటులో ఉండి- వారి జీవితాన్నే వస్తువుగా జేసుకొని ఆడిన నాటకాలు జానపద కళలే. మన పురాణాలన్నింటినీ దృశ్య మాధ్యమంలో ప్రజలకు అందించి ప్రజలకు పురాణ పరిజ్ఞానాన్ని కలిగించినవి కూడా ఈ ప్రజా కళలే. ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నో జానపద ప్రదర్శన కళారూపాలు, భాగవత మేళా, కురవంజి (ఎరుకల సాని), తోలు బొమ్మలాట,. తప్పెటగుళ్ళు, పులివేషం, కోలాటం, చెక్క భజన, పండరి భజన, ఒగ్గు కథ, పంబ కథ, ఆసాది కథ, బైండ్ల కథ, కొమ్ముల కథ, పాండవ… కథ, రుంజ కథ, గొల్ల సుద్దులు, జడ కోలాటం (కులుకు భజన ), వగ్గు డోళ్ళు బురక్రథ- వంటి కళారూపాలన్నీ కూడా తర తరాలుగా ఆశ్రీత కులాల వారికి వృత్తిగా ఉన్న కళా రూపాలే. ఈ కళా రూపాలు క్రమేణా కాలగర్భంలో కలిసిపోయాయి. మరి కొన్ని కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్నాయి. ఈ కళా రూపాలు అన్నింటిలో రుంజులకు విశిష్ట స్థానం ఉంది. రుంజులు అనగా దాతృకులాల వారిని ఆశ్రయించి, గోత్రా లు పొగడి, వారి వంశచరిత్రలు పాడి జీవనోపాధి పొందేవారు. రుంజులలో ముఖ్యంగా భట్టులు, భట్రాజులు, విప్రవినోదులు, పుచ్చుకుం ట్లు, రుంజలు, పొడా పోతలవారు, మాల మాష్టివారు మొదల గు కులాల వారు న్నారు. వీరు ఆయా దాతృకులాల వారిని ఆశ్రయించి జీవనోపాధి పొందేవారు. ఉదా: బ్రాహ్మణులకు విప్రవినోది, వైశ్య (కోమటి) లకు వీరముష్టి, గొల్లలకు పొడపోతలు లేదా మందెచ్చులువారు, మాల కులస్థులకు మాల మాష్టివారు- ఉన్నారు. రంజ వారు ఆది నుంచి వ్యవసాయ దారులు. వ్యవసాయంతో పాటు ఈ రంజు వృత్తిని చేపట్టేవారు. 

తక్కు ధిక్కు... తకధిక్కు ధిక్కు... తకమని... అంబుజా సనుడు తాళంబువేయ- అంటూ మెల్లగా ప్రారంభమైన గానం క్రమంగా ఊపందుకుంటుంది. ఈ గానంలో వేగం, తాళంలో తీవ్రతను పెంచుకుంటూ- రుంజు ధ్వని తీవ్రతను పెంచుతూ కథలు చెపుతారు రుంజవారు. వీరి కథలకు అప్పట్లో మన రాష్ర్టంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. వీరిదగ్గర ఉన్న రుంజలను వాయిస్తూ కథలు చెప్పి తమ కళను ప్రదర్శించి యాచిస్తారు. అయితే వీరు ఎవరినిబడితే వారిని యాచించరు. కేవలం విశ్వబ్రాహ్మణులను మాత్రమే యాచిస్తారు. కనుకనే ఆశ్రీత కులాలలో ఇది ఒకటిగా గుర్తింపుకు నోచుకుంది. రుంజు వాయిద్యకులు త్రేతా యుగానికి చెందిన వారనీ విశ్వ కర్మ „సృష్టించిన రుద్ర మహేశ్వరుల సంతతివారనీ ఇతి హాసం తెలియచేస్తూ ఉంది. రుంజలు కథ చెబుతూ వాయించే వాయిద్యమే రుంజ. రుంజు వాయిద్యానికి ఒక ప్రత్యేకత ఉంది. చర్మ వాయిద్యాలలో చాలా పెద్దది రుంజ. దీని శబ్దం కూడా రెండు , మూడు కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. వృత్తి గాయకుల వాయిద్యాలలో ఇంత పెద్దది మరొకటిలేదు. దాదాపు మూడున్నర అడుగుల ఎత్తుండే ఈ వాయిద్యాన్ని నిలబెట్టి వాయించేవారు. రుంజ కారులు మోయలేని బరువుగానే దీనిని మోస్తుంటరు. నా సంసార బరువును ఇది మోస్తున్నప్పుడు దీని బరువును మేము మోయలేమా అని ఆ కళాకారులంటారు. 

పూర్వం రౌంజుకుడనే రాక్షసుని చర్మాన్ని రుంజు వాయిద్యానికి వినియోగించడం వల్ల, రౌంజ అనే పేరు ఏర్పడి, కాలక్రమేణ అది రుంజగా రూపాంతరం చెందిందని నానుడి. రుంజను ఇత్తడితో తయారు చేస్తారు. ఈ వాయిద్యాన్ని బలమైన కర్ర పుల్లలతో వాయిస్తారు. ఏట వాలుగా ముందుకు వంచి, కదలకుండా మోకాలితో అదిమి పట్టి, చేతులతో తాడును లాగి, శ్రుతిచేసి, తాళం ప్రకారం వరుసలతో ఉధృతంగా వాయిస్తారు. రుంజ వాయిద్యకులను రుంజ వారని పిలవటం కూడ వాడుకలో ఉంది. రుంజ వాయిద్యకులు ఒక వేళ వ్వవసాయాన్ని కలిగి ఉన్నా, ప్రధానంగా రుంజ వాయిద్యాన్నే వృత్తిగా స్వీకరిస్తారు. బాల్యం నుంచీ, విద్యాభ్యాసంతో పాటు ఈ విద్యను కూడా కట్టుదిట్టంగా నేర్చుకుంటారు. ప్రతి వారూ ఈ విద్యలో ఉత్తీర్ణు్లలై, గ్రామాలకు యాత్రలు సాగిస్తారు. సంసారాలతో పాటు ఎడ్లబండ్లలో బయలు దేరుతారు. నిత్య జీవితానికి కావలసిన వంట పాత్రలు మొదలైనవ వాటిని కూడ తమతోనే ఉంచు కుంటారు. ఈ రుంజ కథ త్రేతాయుగానికి చెందినదని చెబుతారు. ఆ కాలంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిందనీ, అప్పుడు వాయిద్య విశేషాలు ఏమీ లేవనీ, అందువల్ల పార్వతీ దేవి తన కళ్యాణానికి వాయిద్యాలు కావాలని విశ్వకర్మను కోరెననీ, అప్పుడు విశ్వ కర్మ రౌంజుకాసురుడనే రాక్షసుని సంహరించి, వాని చర్మాన్ని రుంజగా చేసి, సప్త తాళాలనూ, ముపై్పరెండు వాయిద్యాలను ఈ రుంజపై పలికించాడనీ, ఈ రుంజ వాయిద్యం తోనే పార్వతీ దేవి కళ్యాణం రంగ రంగ వైభోగంగా దేవతలందరూ కలిసి చేశారనీ విశ్వకర్మ పురాణం వివరించింది.

రుంజుల విశిష్ట లక్షణం- ఏ గ్రామానికి చేరుకున్నా వారు విశ్వ బ్రాహ్మణులను మాత్రమే యాచించడం. విశ్వ బ్రాహ్మణులు వీరిని ఎంతగానో ఆదరించి, దన ధన్యాలను దానం చేస్తారు. రుంజ వాద్యకులు తమ వాయిద్యాలతో, గానంతో, కథలతో వారిని రంజింప చేస్తారు. సంగీత శాసా్తన్రికి సంబంధించిన సప్తతాళాల్నీ, ముపై్పరెండు రాగాలనూ తమ ప్రదర్శనల్లో వినిపిస్తారు. మూల స్థంభం, పంచముఖ బ్రహ్మావిర్భా వము, పార్వతీ కళ్యాణము మొదలైన కథలను చెప్పడమే కాక, మధ్య మధ్య శ్రావ్యమైన కీర్తనల్నీ పాడుతూ, వాయిద్య నైపుణ్యాన్ని రుంజుపై పలికిస్తారు. మాములుగా మన భాగవత కాలక్షేపా లలో, కథాంతంలో, మంగళ సూచికంగా, పవనామా సుతుని బట్టి పాదార విదములకూ- అనే పారంపర్యంగా వచ్చే మం„గళ హారతినే వీరూ అనుకరిస్తారు.

గ్రామంలో ప్రవేశించిన రుంజ వారు ఒక రాత్రి విశ్వ బ్రాహ్మణులకు కథను వివరిస్తారు. పంచ బ్రాహ్మలను గురించి, వారి వంశోత్పత్తిని గురించీ చెపుతూ, పాంచ భౌతికమైన ఈ శరీరం అస్తిత్వాన్ని గూర్చి, పంచ భూతముల విధులనూ వివరిస్తారు. పంచ బ్రహ్మలంటే మనువు, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ. వారి విధులను గురించి ఈ విధంగా వివరిస్తారు- మనువుకు ఇనుప పనీ, వద్దు కరప్రనీ, త్వ్రష్టకు ఇత్తడి పనీ, శిల్పికి రాతి పనీ, విశ్వజ్ఞనికి బంగారు పనీ- ఈ విధంగా వేరు వేరు విధులను మాత్రమే చేపట్టాలని వివరిస్తారు. తరువాత ఓంకార స్వరూపాన్ని స్తుతిస్తారు. వారు చెప్పే కథలు- పార్వతీ కళ్యాణము, దక్షయజ్ఞము, విశ్వగుణా దర్శనము, వీర భద్ర విజయం, విశ్వకర్మ, బ్రాహ్మణ వంశాగమనము, దేవ బ్రాహ్మణ మాహోత్యము, మూల స్థంభము, సనారి విశ్వేశ్వర సంవాదము, విశ్వ ప్రకాశ మండలము. వీటిన్నిటికి పద్దెనిమిది అశ్వాసాలు గలిగి సం„స్కృత శ్లోకాల మయమైన, తాళ పత్ర గ్రంథం, మూల స్థంభం అధారమని చెబుతారు. రుంజలు విశ్వకర్మ పుట్టుక, పంచ బ్రహ్మల పుట్టుక, దక్షయజ్ఞం, పార్వతీ కళ్యాణం, రుంజల పుట్టుక, వీరబ్రహ్మం చరిత్ర చెబుతారు. విశ్వబ్రాహ్మణుల లోని సానగ (కమ్మరాచారి), సనాతన (వడ్రపుపని), అభవనస (కంచరపుపని), ప్రత్నన (శిల్పాచారి), సువర్ణస (బంగారపు ఆచారి) గోత్రాల వారి ఇళ్ళకు వెడతారు.

రుంజ కథకులు గ్రామానికి వెళ్ళినపుడు ఊరిలో పెద్ద ఆచారి- అంటే మను బ్రహ్మ సంతతి వారి ఇంటికి, లేక ఆ ఊరిలో మొదటిగా వచ్చి స్థిరపడిన ఆచారి ఇంటికి వెళ్ళి కథ చెబుతారు. కొన్ని సందర్భాలలో గ్రామంలోని విశ్వబ్రాహ్మణులు అందరికీ కలిపి ఒక చోట కథ చెప్పడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో పెద్ద ఆచారి ఇంట్లో కథ చెబితే, మిగతావారు అక్కడకు చేరుకొని కథ విని పారితోషికాలు ఇస్తారు. రుంజ కథకుడు కథ ప్రారంభించే ముందు ఏ ఇంటి ముందు కథ చెబుతాడో ఆ గృహస్థుని గోత్రం చెప్పి, అతని వంశం చెప్పి అతని కుటుంబం ఇంకా వృద్ధి కావాలని దీవించి తర్వాత విశ్వబ్రాహ్మణుల వంశ గమనాన్ని, పంచ బ్రహ్మల జన్మ ప్రకారాలను వివరిస్తాడు. ఆ తర్వాతే ఏ కథ అయినా. వీరికి ఇచ్చే పారితోషికం నికరం ఉండదు. అయితే ఏ దాత కూడా వీరిని తక్కువ చేసి పంపించడు. డబ్బులు, భోజనం,బట్టలు కూడా పెడతారు. ఈ విధంగా ఒక అలిఖితమైన, అవగాహన, ఆచారం, సంబంధం ఆశ్రీతులైన రుంజలకు- దాతలైన విశ్వబ్రా హ్మ ణులకు మధ్య ఎన్నో తరాలుగా కొనసాగుతూ వస్తోం ది. తరతరాలుగా వీరికి జీవనోపాధికి దోకాలేకుండా ఆసరాగ ఉండింది. ఐతే కాలంతో పాటు సామాజిక వ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా, ఈ కళ వీరితోనే అంతరించిపోతున్నది. 

వీరి పిల్లలు ఎవ్వరూ ఈ కళను నేర్వడంలేదు. వీరు ఇంతవరకూ ప్రభుత్వ గుర్తింపునకు కానీ, సహాయానికి కాని నోచుకోలేదు. సినిమాలు, టీవీలు రావడంతో వీరి కళకు ఆదరణ కరవైంది. రాష్ర్టంలో అన్ని జానపద కళా రూపాలతోపాటు రుంజ కళా వాయిద్య రూపం కూడా క్రమంగా మరుగున పడింది. అటు కులవృత్తులు దెబ్బతినడంతో విశ్వబ్రాహ్మణులు కూడా గతంలో వలె వీరిని ఆదరించలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో ఇళ్లవెంట వెళ్లి యాచించే ప్రయత్నాన్ని కూడా వీరు విరమించుకున్నారు. తెలంగా ణప్రాంతం, ఉభయగోదావరి జిల్లాలో వీరు జీవిస్తున్నారు. ఈ కళాకారులను ఏ ఒక్కరూ గుర్తించ పోవడం గమనార్హం. 
అటు వ్యవసాయాన్ని పట్టిం చుకోక, ఇటు నమ్ముకున్న కులవృత్తి దెబ్బతిని రుంజవారు దయనీయ పరిస్థితిలో కాలం గడుపుతున్నారు. ఇతర దేశాలలో ఇలాంటి కళారూపాలను నవీనం చేస్తున్నారు. ఈ కళారూపాలకు టెక్నాలజీని అందించి నవీనం చేయటమేగాక ఆ కళా సంపదలను కాపాడుతున్నారు. శ్రమ సామాజికీకరణ కావాలంటే శ్రామికుణ్ణి ప్రేమించాలి. అతని కళలను ఆదరించాలి. ఆ చెమట చుక్కల జ్ఞానాన్ని ఏ విధంగా నవీనం చేయాలో ఆ విధంగా సున్నిత విషయాలను కళలకు జోడించి కొత్త పార్శా్వనికి మార్గం వేయాలి. ఈ కళాకారులను ప్రోత్సహించి ఈ కళను గ్రంథస్తం కూడా చేయవలసి యున్నది. అప్పుడే ఆ బడుగు జీవుల శ్రమకు విలువ లభిస్తుంది. ఆ కళాజ్ఞానం సమాజంలో సజీవంగా ఉండగలుగుతుంది.

Surya Telugu News Paper Dated: 24/02/2014 

Sunday, February 23, 2014

'మగ చెట్టు'తో పనిలేని మహిళా నేత! - సతీష్ చందర్


P
 
2 
 
2 
 
0 
 
 

ఇప్పటి 'చెంచాల' యుగంలో, అగ్రవర్ణ పార్టీల అగ్రవర్ణ నేతలు చెప్పిన దానికెల్లా తలాడించే నేతలే షెడ్యూల్డు కులాల, తెగల నుంచీ ఎన్నికవుతున్నారు. మహిళా ప్రతినిధుల సంగతి సరేసరి. పదవీ స్వీకారం చేసిన తొలిరోజే వీరి చేత ఈశ్వరీ బాయి జీవితాన్ని కంఠస్తం చేయించాలి. అగ్రవర్ణ నేతల ముందు తలవంచటం మానకపోయినా, తలవంచినప ప్రతీసారీ, కనీసం తప్పు చేస్తున్నామన్నామన్న భావన వెంటాడుతుంది.
పైకి రావాలీ, పైకి రావాలీ అని పెద్దవాళ్ళు అంటూంటే, ముందు పైపై దీవెన అనుకుంటాం. నిజంగా పైకి రావటానికి ప్రయత్నించినప్పుడు తెలుస్తుంది, అది దీవెన కాదు, కేవలం హెచ్చరిక అని. 'బిడ్డా! పైకి రానివ్వర్రా, జాగ్రత్త' అన్న అంతరార్థం అందులో ఉంది.
పైకి వెళ్ళాలంటే, మెట్టు మెట్టుకీ చెట్టు పేరు చెప్పాలి. కులమో, గోత్రమో, శాఖో, ఉపశాఖో తెలిసేట్టు చేయాలి. అట్టడుగు వర్గాలకు చెప్పుకోవటానికి చెట్లుండవు. ఉన్నా, అవి జడలు విచ్చి, ఊడలు వేసి ఉండవు. ఏ రంగంలో అయినా అంతే, అన్ని రంగాలనూ తనలో లయం చేసుకోగల రాజకీయ రంగం అయితే మరీను.

ఆడవాళ్ళకయితే చెట్టు పేరు తప్పని సరి అయిపోతుంది. ఆ చెట్టెప్పుడూ మగ చెట్టయ్యే ఉండాలి. భర్త చాటు భార్యలకో, తండ్రి నీడన ఉన్న కూతుళ్ళకో దారులు దొరుకుతుంటాయి. అదీ కూడా చెట్టు కూలాక, మాత్రమే 'సానుభూతి'కి ప్రతీకలుగా వారు చట్టసభలకు వస్తుంటారు. అందుకే రాజకీయాల్లో మహిళలు పేర్లు చెప్పమనగానే తొలుత 'వితంతువు' పేర్లే స్ఫురణకు వచ్చాయి. వస్తున్నాయి కూడా.
అలాంటిది, అయిదు దశాబ్దాల క్రితమే, ఏ 'మగ చెట్టు' పేరూ చెప్పుకోకుండా, తెలంగాణ గడ్డ మీద చట్ట సభకు ఒక అట్టడుగు (అప్పటి 'అస్పృశ్య') వర్గాల నుంచి ఒక మహిళ సర్వస్వతంత్రంగా అడుగు పెట్టటం చిన్న విషయం కాదు. మానవుడు చంద్రమండలం మీద తొలిసారిగా పాదం మోపినంత గొప్ప విషయం. ఈ మాత్రం వివరణ చాలు, తెలుగువారు పోల్చుకోవటానికి. ఆమె ఎవరో కాదు. జె. ఈశ్వరీ బాయి. (1967లో నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం నుంచి అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ టికెట్టు మీద ఎన్నికయ్యారు. రెండవ దఫా 1972లో కూడా మళ్ళీ అక్కడి ప్రజలు ఆమెనే అసెంబ్లీకి పంపించారు)
ఆమెకు పెళ్లంటే ఏమిటో తెలిసేటప్పటికే పెళ్ళి (13వ ఏట) అయిపోయింది. తెలిశాక, తనకు తగనివాడని అనుకున్నారో ఏమో, తెగతెంపులు చేసుకుని, సొంత కాళ్ళ మీద నిలవాలనుకున్నారు. అప్పటికే ఆమెకో ఆడబిడ్డ పుట్టేసింది. అప్పుడు తెలిసింది పైకి రావటమంటే ఏమిటో...! పైకి రానివ్వమనే వారిపై యుద్ధమే, ఎదగటమంటే. తాను చదివారు. తన బిడ్డను చదివించారు. ఈ రెండూ నడవటానికి నలుగురికీ చదువు చెప్పారు. (ట్యూషన్లు చెప్పారు). తన ఆశించినట్లుగానే తన బిడ్డను డాక్టరుని (ఇప్పటి మంత్రి గీతారెడ్డి) చేశారు. ఇంతవరకూ అయితే, మహిళా పత్రికల్లోనో, అనుబంధాల్లోనో రాసుకునే ఓ 'సాధారణ విజయగాథ' ఆమె జీవితం ముగిసి పోయేది. కానీ ఆమె చదువు విస్తృతి పెరిగింది. అంబేద్కర్ రచనల్ని, ఉపన్యాసాల్నీ స్పృశించి ంది. కదలిపోయింది. అంబేద్కర్ ఎదుగుదలలో కూడా 'పైకి రానివ్వకుండా అడ్డుకునే శక్తులు' అడుగడుగునా ఎదురువచ్చా యనీ, కానీ ఆయన్ని 'అంగుళం కూడా వెనక్కి కదలించి లేక పో యాయ'ని ఆమె తెలుసుకున్నాక, ఎక్కడలేని ధైర్యం వచ్చింది. 'బిడ్డను' లాలించటమే కాదు, రాజ్యాన్ని పాలించటమూ తనకు తెలుసునని నిరూపించాలనుకున్నారు. నిరూపించారు.
కానీ 'మాంచాలను కొలిచి, మంగమ్మను తలచి, సరోజినీ దేవి పటం కట్టి పూజించే' ఈ 'పుణ్య' భారతంలో 'ఆయుధం పట్టిన' పంచాది నిర్మలలనే కాదు, అసెంబ్లీకి వచ్చిన ఈశ్వరీ బాయిలను కూడా సౌకర్యవంతంగా మరుస్తారు.
ఎదిగిపోవటే కాదు, ఎదిగినంత యెత్తులో కడదాకా ఉండి పోవటం కష్టమే. అంటే అవే పదవుల్ని పట్టుకుని వేళ్ళాడటం కాదు, అవే విలువల్ని పట్టుకుని ఉండిపోవటం. అంబేద్కర్‌వాదిగానే అంతిమ శ్వాస వరకూ జీవించారు.
భాషా ప్రయుక్త రాష్ట్రం పేరుమీద అభివృద్ధిలో రెండు వందల యేళ్ళు అగాధమున్న తెలంగాణ, ఆంధ్రలను కలపటానికి ఆదినుండీ ఆమె వ్యతిరేకే. తాను ఊహించినదే జరిగినదని 1969 తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోనూ అసెంబ్లీలో చెప్పారు. విద్యార్థుల మీద కాల్పులు జరపటం మీద అప్పటి ముఖ్యమంత్రిని అదే శాసన సభలో కడిగిపారేశారు. చెన్నారెడ్డి ఈ ఉద్యమాన్ని 'తెలంగాణ ప్రజా సమితి' పేరు మీద కొనసాగిస్తే, దానిని కాం గ్రెస్‌లో కలిపేసుకోవటంపట్ల అప్పటి ఇందిరా గాంధీపైనే సభలో ధ్వజమెత్తారు. 'పార్టీ సమస్యను పరిష్కరించుకుని, ప్రాంత సమస్యను పరిష్కరించినట్టుగా నమ్మ బలకటాన్ని' తప్పు పట్టారు.

ఇక షెడ్యూల్డు కులాల సమస్యలు వచ్చినప్పుడు కానీ, వారి మీద జరిగిన అత్యాచారాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కానీ, ఆమె ఆవేశానికి కట్టలు ఉండేవి కావు. 'అభ్యంతరకర వ్యాఖ్యలు' పేరు మీద ఆమె మాటల్ని తొలగించేవారు. నిజమే. అట్టడుగు వారి 'ధర్మాగ్రహం' ఇప్పటికీ పైనున్న వారికి అభ్యంతరకరమే.
ఇప్పటి 'చెంచాల' యుగంలో, అగ్రవర్ణ పార్టీల అగ్రవర్ణ నేతలు చెప్పిన దానికెల్లా తలాడించే నేతలే షెడ్యూల్డు కులాల, తెగల నుంచీ ఎన్నికవుతున్నారు. మహిళా ప్రతినిధుల సంగతి సరేసరి. పదవీ స్వీకారం చేసిన తొలిరోజే వీరి చేత ఈశ్వరీ బాయి జీవితాన్ని కంఠస్తం చేయించాలి. అగ్రవర్ణ నేతల ముందు తలవంచటం మానకపోయినా, తలవంచినప ప్రతీసారీ, కనీసం తప్పు చేస్తున్నామన్నామన్న భావన వెంటాడుతుంది.
- సతీష్ చందర్
(ఫిబ్రవరి 24న జే.ఈశ్వరీ బాయి వర్ధంతి)
- Andhra Jyothi Telugu News Paper Dated: 23/2/2014

దళితుల కలికితురాయి ఈశ్వరీబాయి By ఆచార్య జి. వెంకట్రాజం


ఆంధ్రవూపదేశ్ రాజకీయాలతో, దళిత సముద్ధరణతో పరిచయమున్న వారందరూ జె.ఈశ్వరీబాయి పేరు విని ఉంటారు. ఆమె నిజాం రాష్ట్రంలో తెలుగువారి ముద్దుబిడ్డ. ధైర్యసాహసాలున్న వీరవనిత, చైతన్య ఉద్యమ స్వరూపిణి. సంఘసేవా పరాయణురాలు, బలహీన దళిత పీడిత ప్రజల ఉద్ధారకురాలు, అంబేద్కర్ అడుగుజాడలో నడిచినవారు, రాజకీయ నాయకురాలు, మంచి శాసనసభ్యురాలు. ఆమెది కళ్లలా కపటంలేని నిర్మల హృదయం. లంచగొండి అధికారులకు సింహస్వప్నం. ఆమెకు ప్రజాసేవయే జీవిత పరమార్థం. రాజకీయ రంగంలో నైతిక విలువల కోసం పోరాటం సాగించిన ధైర్యశాలి. వారికి అకుంఠిత దేశభక్తి, దేశాభిమానం ఉన్నది. ఆమె మానవతావాది, నిగర్వి నిరాడంబరి, నిస్వార్థ సంఘసేవిక, ప్రస్తుతం ఆంధ్రవూపదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకొన్న డాక్టర్ జె.గీతాడ్డి కన్న తల్లి. 1918 డిసెంబర్ 1న సామాన్య దళిత కుటుంబం లో పుట్టారు. వారి తల్లి రాములమ్మ, తండ్రి బల్లెపు బలరామస్వామి. ఆయన నిజాం స్టేట్ రైల్వేస్‌లో పనిచేశారు. వారు సికింవూదాబాద్‌లోని చిలకలగూడలో నివసించారు. బలరామస్వామికి ఆరుగురు సంతానం. నలుగురు అబ్బాయిలు-బాబురావు, పాండురంగం, కిషన్, రవీందర్. ఇద్దరు అమ్మాయి- ఈశ్వరీబాయి, మాణికమ్మ పెద్దన్న బాబూరావు. వీరి జీవితంలోని ఒడుదుడుకుల్లో అండదండగా నిలచారు.

ఈశ్వరీబాయి సికింవూదాబాద్‌లోని ఎస్‌పీజీ మిషన్ పాఠశాలలో ప్రాథమిక విద్యను కీస్ హైస్కూల్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. వారికి తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిషు, మరాఠీ భాషల్లో ప్రావీణ్యం ఉంది. స్వశక్తిపై జీవించాల్సిన అవసరం వచ్చినప్పుడు సికింవూదాబాద్‌లోని ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. దీనితోపాటు సంపన్నవంతుల ఇళ్ళలో పిల్లలకు ట్యూషన్ కూడా చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేషనింగ్ శాఖలో కొంతకాలం ఉద్యోగం చేశారు. తల్లిదంవూడుల కోరిక మేరకు పూనాలోని ధనిక కుటుంబానికి చెందిన దంత వైద్యుడు డాక్టర్ లక్ష్మినారాయణతో పదమూడేళ్ల వయస్సులోనే పెళ్ళయింది. వారి వైవాహిక జీవితం కొంతకాలంపాటు సాఫీగా సాగింది. వారికి జన్మించిన అమ్మాయే డాక్టర్ జె. గీతాడ్డి. వీరు ఆంధ్రవూపదేశ్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఈశ్వరీబాయికి భర్తతో మనస్పర్ధ లు వచ్చి తన పుట్టింటికి వచ్చారు.

ఈశ్వరీబాయి జీవితం వడ్డించిన విస్తరి కాదు. జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. వైవాహిక జీవితంలో విడిపోయిన తరువాత వారు సంఘసేవ వైపు దృష్టి మళ్లించారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ ఉపన్యాసం, సిద్ధాంతాలు, ఆశయాలు, భావజాలం పట్ల ఆకర్షితురాలైంది. సమాజంలోని హెచ్చుతగ్గులు, కటిక పేదరికం, అంధ విశ్వాసాలు , అమాయకత్వం, ఈర్ష్య దేషాలను నిశితంగా ఆలోచించినప్పుడు వారి మనసు కకావికం అయ్యేది. దీనికి పరిష్కారం అంబేద్కర్ ఆశయాలే అని గట్టిగా భావించారు.
1951లో హైదరాబాద్, సికింవూదాబాద్ నగరాల పురపాలక సంఘం ఎన్నికలు ప్రప్రథమంగా జరిగాయి. అప్పటిదాకా నిజాం ఫర్మానాతో ఏర్పడే పురపాలక సంఘం మొదటిసారిగా ప్రజాస్వామ్యరీతిలో ఓటింగ్ పద్ధతిలో పురుడు పోసుకోవడానికి శ్రీకారం చుట్టింది. ఆనాడు జంటనగరాల్లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, సోషలిస్ట్ పార్టీలు బలమైన రాజకీయ పార్టీలు, అయినప్పటికీ ఈశ్వరీబాయి చిలకలగూడ వార్డు నుంచి ఎన్నికయ్యారు. అర్థబలం, అంగబలం, పార్టీబలం లేకున్న వారు స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించడం వారికే సాధ్యమయింది.

ఈ విజయం వెనక శ్రమించినవారు వారి సోదరుడు కిషన్ ఈశ్వరీబాయి తనవార్డులో రోడ్లు వెడల్పు చేయించారు.వీధుల్లో నల్లాలు ఏర్పాటు చేయించారు. వీధిదీపాలు, మరుగుదొడ్లు వంటి ప్రజాసౌకర్యాలను కల్పించారు.అంతేకాక రెక్కాడితే డొక్కాడని కార్మికులకు ఇళ్లస్థలాలను ఇప్పించారు. ఆమె అనేక కమిటీలో సభ్యురాలుగా ఉన్నందున ఎందరో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ్డాయి. మున్సిపల్ కౌన్సిలర్‌గా నగరాభివృద్ధికి శక్తివంచన లేకుండా అహర్నిశలు శ్రమించారు.

1967లో ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన సార్వవూతిక ఎన్నికలు జరిగాయి. ఈశ్వరీబాయి నిజామాబాద్ జిల్లా శాసనసభ నియోజకవర్గం నుంచి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా పోటీ చేశారు. వీరిపై భారత జాతీయ కాంగ్రెస్ పార్టీనుంచి అప్పటి దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి టి. సదాలక్ష్మీ పోటీచేశారు. అయినప్పటికీ విజయబావుటాను మరోసారి ఎగురవేశారు.వారు శాసనసభలో ప్రజోపయోగకరమైన ప్రశ్న లు వేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆమె అనేక పాలన సంస్కరణలకు వెన్నంటి నిలిచారు. విద్యారంగంలో, స్థానిక పరిపాలనాశాఖలో అనేక సంస్కరణలను తెచ్చారు. స్టాంపు డ్యూటి పెంపును అడ్డుకోవడంతో చైనా భారత రాయబార కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించడంలో ప్రము ఖ పాత్ర వహించారు. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను ఎండగట్టడంలో చేనేత ఉత్పత్తుల పన్నురద్దులో, ప్రభుత్వ సంస్థల పక్షపాత వైఖరులను వెలుగులోకి తేవడంలో వెన్నుముకగా నిలిచారు. 1972 లో రాష్ట్ర శాసనసభకు రెండోసారి ఎన్నికయ్యారు. అంతేకాక రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆంధ్రవూపదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకురాలుగా ఒక సంవత్సరం పనిచేశారు.

1951లో జగజ్జీవన్‌రామ్ నాయకత్వంలోని దళిత లీగ్ శాఖను హైదరాబాద్‌లో స్థాపించారు. షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి పనిచేసే నాలుగు సంస్థల్లోని యునైటెడ్ షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్, దళిత జాతీయ సమాఖ్య, దళిత వర్గాల లీగ్. 1957లో తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల షెడ్యూల్డ్ కులాల సమాఖ్యలు విలీనమై ఆంధ్రవూపదేశ్ షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ ఏర్పడింది. అందులో ఈశ్వరీబాయి ప్రధానకార్యదర్శిగా పనిచేశారు. 1958లో సికింవూదాబాద్‌లో జరిగిన షెడ్యూల్డ్ కులాల కార్యకర్తలు, నాయకులు సభలో పాల్గొన్నారు.

1960లో జరిగిన ఆంధ్రవూపదేశ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండి యా సంస్థాగత ఎన్నికల్లో వారు ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక అయ్యారు. 1962లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రవూపదేశ్ శాఖకు కార్యదర్శి అయ్యారు. జీవితాంతం ఆపార్టీలో పనిచేశారు. వీరు దళితులపై జరుగుతున్న అక్రమాలపై తన వాణిని వినిపించారు. అందులో దళితులపై అత్యాచారాలు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తాలూకా జనంపేటలో దళితులపై భూస్వాముల అత్యాచారాలు, కృష్ణా జిల్లా వణుకూరు గ్రామంలో దళితులను వెలికితీయడం వంటి సంఘటనలను, ఖమ్మంజిల్లాలో సంఘటనలు ప్రభుత్వ దృష్టికి తెచ్చారు. వరద బాధితులకు సహాయం, మహిళా సంక్షే మం, శాంతిభవూదతలువంటి అనేక అంశాలపై శాసనసభలో తనగొంతును వినిపించారు. అనారోగ్యంతో 1991 ఫిబ్రవరి 23న తుదిశ్వాస వదిలారు.
‘మా అమ్మగారు ప్రతి విషయంలోనూ క్రమశిక్షణ పాటించేవారు. సమయపాలనతోపాటు ప్రతిపని అత్యంత సమర్థత శ్రద్ధతో నిర్వహించేవారు. నన్ను ఎంతో క్రమశిక్షణతో పెంచారు. చిన్నవయస్సులోనే బాలబాలికలకు మంచి విషయాలు బోధించాలని పెద్దలపట్ల వినయవిధేయతలు, తోటివారితో వాత్సల్యం, గౌరవభావంతో మెలగడం వంటి అలవాట్లు నేర్పాలని ఆమె అభిలాషించే వారు’. అని గర్వంగా చెప్పుకునే ముద్దుపట్టి డాక్టర్ జె. గీతాడ్డిని కన్నతల్లి ఈశ్వరీబాయి.

-ఆచార్య జి. వెంకట్రాజం
ఉస్మానియా యూనివర్సిటీ
(నేడు ఈశ్వరీబాయి వర్ధంతి) Namasete Telangana Telugu News Paper Dated: 23/2/2014