Monday, October 5, 2015

విషతుల్య సాహితీ లోకంలో అక్షరాల పచ్చి నిజాలు! By వేముల యల్లయ్య


Updated :04-10-2015 23:40:13
దళిత నవల ప్రయాణానికి ఒక నీతి సూత్రాన్ని తన అద్భుతమైన కథనరీతులతో తెలుగులోకానికి ‘మైల’ నవల ద్వారా వరకుమార్‌ గుండెపంగు అందించాడు. ‘మైల’ నవల చదువుతూ ఉంటే అరాచకులు ఒక వైపు, అంటరానివారు ఒక వైపు కనిపిస్తారు.
 
సాహితీ వినీలాకాశంలో నవల ఎంత పరిపూర్ణత సంతరించుకుంటుందో పాఠకులు కూడా అదే స్థాయిలో దానిని ఆదరిస్తారు, అక్కున చేర్చుకుంటారు. తన ఆలోచనలతో అక్షరాల అల్లిక పొందుపరచిన విధానం రచయిత సృష్టించిన భావజాలాన్ని పాఠకులకు పంపుతుంది. పాఠకుడూ రచయిత తో పాటు పలు దారులలో ప్రయాణిస్తాడు. మౌఖిక కథనం అత్యంత ప్రాచీన కథన రీతి. సంచారుల సాహిత్యంలో భుక్తి కథనం జీవితమై అల్లుకుంటుంది. ధర్మ గ్రంథాలలో వివిధ రకాలైన దృష్టాంతాలు జనానికి ఉన్నతాశయాలను నిరూపణ చేసే కథనంతో ఉంటాయి. ఆ కథనంలో కథ గానమై అల్లుకుంటుంది. కొంత విస్తృతమై నవల రూపం ఎత్తుకుంటుంది. ఆనాటి జీవితాలకు బాగోతులు, వృత్తి గాయకుల నోటి ద్వారా కథ జనాన్ని చేరుతుంది. చేతి వాయిద్యంతో పాటు మెదడు కదిలిన వృత్తాంతాన్ని కథలుగా అల్లుతారు.
 
కథనం బజారుల బతుకు తంతుగా ఉంటుంది. అశ్రుత గాయకులు కుల నాయకత్వ లక్షణాలు అలవడే విధానాన్ని మౌఖికంగా కథను అల్లి చూపిస్తారు. రానురాను అక్షరజ్ఞానులు బుద్ధుని జాతక కథలతో మమేకమవుతారు. విస్తారమైన కథల సృష్టిలో మానవుని మనుగడ సాగే విధానం నైతిక తత్వాలు, తత్వశాస్త్రాలతో చిన్ని చిన్న కథలుగా జనానికి చేరుతుంది. ఇది తత్వానంతర శాస్త్రంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా జ్ఞానం, బుద్ధి, బోధ మనకు బైబిల్‌లో కనిపిస్తాయి. బైబిల్‌ తెలుగు అనువాదం జరిగిన తర్వాత జనం కథన రీతులను, అందులో ఉన్న ప్రబోధాలను చదివిన తరువాతే అప్పుడప్పుడే అక్షర జ్ఞానం నేర్చుకుంటున్న కింది జనం ఆ బైబిల్‌ పాఠకులుగా అలవాటుపడ్డారు. ఆ అలవాటే అంటరాని వాళ్ళ జీవితాలతో ‘ఏసు’ ఒక వెలుగు రేఖై బడుగుల సావడి ముందు అంటరానివాళ్ళను అక్కున చేర్చుకున్న పాస్టర్లు(అయ్యాగార్లు) కొంత మేలు కూడా చేసినారు. ఈ మేలును అగ్రకులస్తులు సహించక వాళ్ళమీద చెడుప్రచారం చేయడం జరిగింది. ఆ చెడుతో పాటు వీళ్ళు కూడా తన విలువైన బోధన సంపత్తిని అగ్రకుల బ్రాహ్మణిజా నికి భయపడి అమ్ముడుపోయి అందలాలకు అలవాటుపడ్డారు.
 
తెలుగు నవలా సాహిత్య జగత్తులోకి 2013 మేలో ‘మైల’ నవలా రచయిత అరుదైన ప్రవేశం జరిగింది. అప్పటికే కథ, నవల ఉత్తరాంధ్ర, రాయలసీమ, కొంత తెలంగాణ మార్క్సిస్టుల కబ్జాలో బందీ అయ్యాయి. సామాన్య జనానికి నవలా ప్రక్రియ అర్థం కాకుండా కుహనా మేధావులు అనేవారు తమ తమ సంఘాలకే పరిమితం చేశారు. ఈ వ్యవస్థ మీద ఆక్రోశంగా ఉన్న దళిత, గిరిజన, ఆదివాసి యువకులకు నవలా సారాంశం చెప్పకుండా అబద్ధపు ప్రసంగాలతో ఈ యువతను సాహితీక్షేత్రం నుంచి తప్పించారు. అయితే దళిత ప్రవాహమనే ఒక మహా ప్రవాహం సాహితీక్షేత్రాన్ని ఖండ ఖండాలుగా కులదొంతరులను విడగొట్టి హక్కుల ఉద్యమాలను తెలుగు ప్రాంతమంతా పరిగెత్తించింది. ఈ పూర్వరంగమంతా సాహితీ విలువలను మహనీయుల మానవత్వాన్ని, చెడును వదిలేసి కొంత మంచిని పిడికిట పట్టుకొని ‘మైల’ శుద్ధాత్మక నవలను తెలుగు సాహితీలోకానికి అందించిన ఘనత ‘వరకుమార్‌ గుండెపంగు’ కు దక్కుతుంది. బైబిల్‌ బోధకునిగా అపారమైన జ్ఞానసంపన్నుడు కూడా అయినందునే ఆయన ఈ ‘మైల’ నవలను సృష్టించగలిగారు. ఈ నవలలో కథానాయకుడు సాహిత్యాన్ని ఒక అల్లికగా మనిషి జీవితాలకు మెలిపెట్టి అర్థం చేయిస్తాడు, అర్థవంతమైన రచనా పటిమతో. కాని మన దేశ సాహిత్యం మహా భారత, ఉపనిషత్తుల రామాయణంలో కానిపోని కథలుంటాయి. అఖండమైన మూల వాసి జీవన విధానానికి వ్యతిరేకంగా ఈ జీవులు సంఘం అనే నీతి గుండంలో సమిథలవుతారు; తమ కళా రూపాలను అగ్ని గుండంలో బుగ్గి పాలు చేసి తాము దగ్ధమై వాళ్ళ ఆదర్శ గ్రంథాలలో కథనరీతులలో ఈ దేశ అసలు మూల వాసులకు నీతి బోధకాలు అందించిన చరిత్ర సాహిత్యంలో మిక్కిలి తక్కువగా ఉంది. ఈనాటికథ అంటే కులం, అవహేళన, అంటరానితనం, ప్రేమ, డిటెక్టివ్‌, అద్భుత ఘటనలు విజ్ఞానమనే సుడిగుండంలో శాస్త్రయుత కథన రీతులు తెలుగునేలలో ఏలుబాటుకి అలవాటు పడ్డాయి.
 
కాని, కుల నిర్మూలన-వర్గనిర్మూలన విషయాలు ఏవైనా మార్పుతో పాటు ఆదర్శాలు అటు వుంచితే అంటరానితనం, కుల నిర్మూలన అనే కథన రీతులుగా, ఇప్పుడు దళిత నవల ప్రయాణానికి ఒక నీతి సూత్రాన్ని తన అద్భుతమైన కథనరీతులతో తెలుగులోకానికి ‘మైల’ నవల ద్వారా వరకుమార్‌ అందించాడు. ‘మైల’ నవల చదువుతూ ఉంటే అరాచకులు ఒక వైపు, అంటరానివారు ఒక వైపు కనిపిస్తారు. ‘మత’ మనే ముసుగు అరాచకుడు ఆయుధంగా ఉపయోగిస్తే, అంటరాని జాతులు బైబిల్‌ జ్ఞానాన్ని ఒంట బట్టించుకున్న విధానాన్ని నవలలో పొందుపరుస్తూ, హక్కుల ఉద్యమ కథానాయకునిగా కుమార్‌ అనే పాత్ర ద్వారా మళ్ళీ ఒక పోరాటాన్ని చేస్తూ కనిపిస్తాడు. నిండు ప్రజల మధ్య నిజాన్ని నిగ్గు తేల్చాలని తను ఆ పాత్రై రచయిత జీవిస్తాడు. కథనమై కలాన్ని ‘కవాతుగా’ సన్నద్ధం చేస్తాడు. భారతీయ నవలల నుండి ఇప్పటి ‘మైల’ తిరుగులేని గ్రంథంగా చెప్పుకోవచ్చు. మనిషి జన్మ ఒక కుదురు నుంచి ఉద్భవిస్తుంది అనిచెబుతూ, ఆ తరువాత ‘ఆది జాంబవ పురాణం’ మూలాలు ఇందులో కథలు కథలుగా వివరిస్తాడు రచయిత. విస్తృతార్థంలో చర్చించిన కథనాయకుడు ఎంత ఆదర్శంగా చెప్తాడో అదే పెరిగి, పెరిగి పెద్దదై నవలగా రూపాంతరం చెందుతుంది.
 
వరకుమార్‌ గుండెపంగు కలం నుంచి జాలువారిన మరొక నవల ‘‘నేను బానిసనా?’. కడు బీదలుగా పోలీసు జీవితాలను అద్భుతంగా మలచి, వారి దుఃఖానికి అద్దం పట్టిన నవల ఇది. నవలంతా తాను పోలీసు పాత్రలో ఇమిడి ఏమీ చేయలేని స్థితిలోని ఖాకీ కర్కశత్వానికీ, తన బట్టలనిండా చెమటోడ్చిన బానిసత్వపు బతుకులకీ, బందూకుల బానిస జీవితానికీ అద్దం పడతాడు. కథానాయకుడు భరత్‌ రూపంలో ‘బందోబస్తు’కు బలపరచని పోలీసు మాన్యువల్‌ను మార్చాలని ప్రతిన బూనిన రచయిత ఇందులో కనిపిస్తాడు. అనేకానేక ప్రదేశాలను, సంఘటనలూ, వాటి చుట్టూ ఉన్న కన్నీళ్ళనూ ఒక్క దగ్గరకు చేర్చి మనకంట కన్నీరు పెట్టిస్తాడు. గ్రామం, వాడ, పట్టణం, మహానగరం... ఏదైనా సరే, రక్షణ అనే ప్రక్రియ ఎక్కడుంటే అక్కడ పోలీసు జీవితాలు ప్రమిదలుగా మారిపోయిన తీరు ఈ నవలనిండా మనకు కనిపిస్తుంది. నిత్యం భుజం మీద తుపాకులు మోస్తూ, నడుములు విరిగిన గూనివాళ్ళుగా, నిజాలు చూస్తున్న గుడ్డివాళ్ళులాగా పోలీసులు తయారుకావడానికి మూలకారణాలు వెతికిపట్టి, పోలీసు బాసులు చేస్తున్న అరాచకాలకు జుట్టు ముడేసి మూరెడు ముగుతాడుతో ముగింపు ఇస్తానంటాడు రచయిత వరకుమార్‌. నిర్దిష్టమైన జ్ఞానం ఈ నవల చదివితే విస్తారమవుతుంది. నిజాన్ని నడిబజారులో నిలదీస్తానని ప్రతినబూని- ‘మైల’ (శుద్ధాత్మక) నవల, ‘నేను బానిసనా..?’ (పోలీసు దుఃఖం) అనే రెండు నవలలు పాఠక లోకానికి అందించిన వరకుమార్‌ గుండెపంగు అభినందనీయుడు. లోపలి గుట్టును బయటకు గుంజి పరులముందు పంచనామ చేయడమే ఈ నవలలు సాధించిన విజయ రహస్యం. 
Andhra Jyothi Telugu News Paper Dated: 05/10/2015
వేముల యల్లయ్య
9440002659

No comments:

Post a Comment