Saturday, February 9, 2013

మూగబోయిన డమరుకం ----బుద్ధారం రమేష్




భారతదేశం అనేక కులాలు, జాతులు, మతాలతోపాటు విభిన్న సంప్రదాయాలు, సంస్కృతులకు నిలయం. అందులో సంచార జాతులది ప్రత్యేకమైన చరిత్ర, సంస్కృతి. ఇంకా సమాజానికి తెలియని కులాలు ఎన్నో ఉన్నాయి. మరి కొన్ని నామరూపాలు లేకుండా తుదిచి పెట్టుకుపోగా, మరికొన్ని అంతరించే దశలో ఉన్నాయి.అంధ్రవూపదేశ్‌లో ఉన్న 105 బీసీ కులా ల్లో ఒక కులం ‘బుడు బుడకల’. గతంలో జనాదరణ పొందిన కళారూపాలతో కుదరుగా జీవించేవారు. నేడు వీరు ఏ ఆసరా లేకుండా దుర్భర పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తునారు. ‘అంబ పలుకు.. జగదాంబ పలుకు, మహాలక్ష్మమ్మ పలుకు.. బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, మధుర మీనాక్షీ పలుకు.. కంచి కామాక్షీ పలుకు ’అని గొంతెత్తి పాడుతూ డక్కు.. డక్కు డమరకాన్ని మోగిస్తూ గానం చేస్తారు. చేతిలో డమరుకం, నడుముకు గంట, భుజాన జోలె, నల్ల కోటు వేసుకుని ఆపై శాలువా ధరించి, ఎర్రని తలపాగా చుట్టుకొని నల్లటి గొడుగుతో కనిపిస్తారు. తెల్లవారుజామునే భిక్షాటన ముగించాలనేది వీరి సంప్రదాయం. ఏ గ్రామం వెళితే, ఆ గ్రామ కుమ్మరుల ఇళ్ళదగ్గరే ఉండి, భోజనం కూడా వాళ్ళ దగ్గరే చేస్తారు. డమరుకం ’బుడ బుడ...’ అంటుంది కాబట్టి, వీరి వేషాన్ని ‘బుడు బుడకల వేషం’ అని పిలుస్తారు. ఆ పేరుతోనే వీరిని బుడు బుడకల వాళ్ళు అంటారు. వీరి కళారూపాన్ని ఇద్దరు లేక ఐదుగురు ప్రదర్శిస్తారు. సంప్రదాయ వస్త్రధారణతో పంచే,లాల్చీ, కోటు, పైన శాలువా, పెద్దపెద్ద మీసా లు పెట్టుకుంటారు. నుదుటన పసుపు బొట్లు అడ్డంగా పెట్టి, ఆపైన ఎరుపు బొట్టు రూపాయి బిల్లంత సైజు పెట్టుకొని, గడ్డం మీద నుంచి తలపైకి వచ్చేట్లుగా ఎర్రరంగు గుడ్డ చుట్టు కుంటారు. మెడలో రుద్రాక్ష మాలలు, చేతికి కడియాలు, కాలికి గగ్గేరలు తొడుక్కుంటారు. వీరి జీవన విధానం కుల కట్టుబాట్ల తో ఉంటుంది. వీరిలో కొట్లాటలుండవు, తిట్టుకోరు. మొగుడు-పెళ్లాలు పోట్లాడుకోడం, వాగ్వివాదాలు చేసుకోవటం వినపడదు. వరకట్నాల బెడద ఉండ దు. ఏ సమస్య వచ్చినా కుల పెద్దల మాటే శిరోధార్యం. పెళ్లిలో ఓలిగా కొంత సొమ్మును వధువుకు వరుడు ఇవ్వాలి. పెళ్లిపెద్దలు గంటలో పెళ్లితంతు ముగించి దంపతులుగా ప్రకటిస్తారు. పెళ్లి ఖర్చు, విందు ఖర్చు పెళ్లి కొడుకే భరించాలి. పెళ్లయిన తర్వాత ఏడాదిపాటు అల్లుడు అత్తవారింట్లో ఉండి అన్ని పనులు చేయాలి. అనంతరం వేరు కాపురం పెట్టిస్తారు. ఏదైనా గొడవ జరిగినా కుల కట్టడి ప్రకారం తప్పులను నిర్ణయిస్తారు. భార్యాభర్తల్లో ఎవరు తప్పు చేసినా మూల్యం చెల్లించవలసింది మాత్రం భర్తే. అందరినీ పిలిచి మందు పోయించ టం తప్పుకు పరిహారం. కులస్తుల మధ్య తగాదాలు జరిగినా కులపెద్ద తీర్పుతో పరిష్కారమవుతుంటాయి. మాతృస్వామ్య వ్యవస్థకు ఆనవాలుగా మిగిలిన అతికొద్ది సంస్కృతుల్లో బుడుబుడకల సంస్కృతిని ప్రధానంగా చెప్పుకోవచ్చు.


వీరిది పూర్వం మహరాష్ట్రలో ఒకప్పుడు కలిసి వున్న బీజాపూర్ సమీపంలోని పిట్నూక్ ప్రాంతమని తెలుస్తున్నది.రాష్ట్రంలో పలు ప్రాం తాల్లో నివాసముంటున్న బుడుబుడకల కులస్తులు వందల ఏళ్ల క్రితం వరదలు, కరువు బారినపడి పొట్ట చేతబట్టుకుని మన రాష్ట్రా నికి వచ్చినట్లు చెబుతారు. రాష్ట్రంలో వీరి జనాభా ప్రస్తుతం యాభై వేల వరకుంటుందని అంచనా. హైదరాబాద్‌లోని చిలుకలగూడ, మంగళఘాట్, అనంతపురం పట్టణం, కడప జిల్లా పులి గుంటూ రు జిల్లాలోని పలు ప్రాంతాల్లో , నెల్లూరు జిల్లాలోని కావలి, వెంక మనుబోలు, నాయుడుపేట, గూడూరు, తడ వూపాంతాల్లో, జహీరాబాద్, ఆమ్తోల్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో విస్తరించి ఉన్నారు. వీరు ఏ గ్రామంలో ఉన్నా ఊరు చివరే నివాసం. ఊరి చివర కాల్వకట్టలపైనో, ఇతర ప్రాంతాల్లోనో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తుంటారు. మరాఠీ వీరి మాతృభాష. బుడు బుడకల వారిలో మొత్తం ఏడు శాఖలున్నట్లు తెలుస్తున్నది. ఆరె బుడుబుడకల, మరాఠి, బొందిలి, కాపు, కాళి, బొమ్మలాట, బైట కమ్మరి తదితర తెగలు ఉన్నాయి. ఆరె బుడుబుడకలు డమరకం మోగి స్తూ యాచన చేసి, పాత గుడ్డలు స్వీకరించి, చిరుగులు కుట్టి వాటిని సంతల్లో అమ్ముకుని జీవనం సాగిస్తారు. రేకు డబ్బాల మరమ్మత్తులు వృత్తిగా కొనసాగిస్తున్నారు. ‘కాళీ’లు అడుక్కోవటం, బొమ్మలాట, తోలుబొమ్మలాట, వృత్తిగా జీవిస్తున్నారు. బైట కమ్మరి/ బహిర్ కమ్మరులు ఇనుము పని చేసి జీవనం సాగిస్తారు. మరాఠీలు వ్యాపారం, బొందివీలు బంగారపు వ్యాపారం చేస్తారు. ఐతె బంగారం వ్యాపారంగా జీవించే బొందిల సంఖ్య తక్కువ. ఆరె బుడు బుడకలకు, మిగతా శాఖలకు సామాన్య లక్షణాలున్నా, సామాజికంగా వారి కుల కట్టడి భిన్నమైనది. 



నాగరిక సమాజంతో సహజీనం చేస్తున్నప్పటికీ, అధునిక సమాజ పోకడలు గమనిస్తున్నప్పటికీ దశాబ్దాలు మారినా వారి తలరాతలు మారలేదు. ఉండటానికి జానెడు జాగ దొరకడం లేదు.తరతరాలుగా వీరిని ఆదరించిన సమాజం లో నేడు ఆదరణ లేక పస్తులుంటున్నారు. బతుకు దెరువు కోసం తరతరాలుగా చేసిన వృత్తిని వదిలి, బొంతలు కుట్టడం జీవనవృత్తిగా స్వీకరించారు. వీరికి ప్రభుత్వపరంగా ఎలాంటి పథకాలు అందడంలేదు. సంచార జీవితాలు కావడంతో వారి పిల్లలకు చదువు సంధ్యలు అందటంలేదు. ప్రభుత్వపథకాలు ఏవీ వీరి దాక చేరడంలేదు. వీరి అభివృద్ధికి చట్టాపూన్నిచేసినా అభివృద్ధి జాడ ఉండటంలేదు. ప్రభుత్వ లెక్క ల్లో వీరు కనిపించడంలేదు. 1970లో ఏర్పాటు చేసిన మొ ట్ట మొదటి బీసీ కమిషన్ చైర్మన్ అనంతరామన్ ఈ కులాలను సంచార, విముక్తి జాతులుగా గుర్తించి బీసీ కులాల జాబితాలోని‘ఎ’ గ్రూపులో చేర్చింది. వీరి అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించి, తగిన గుర్తింపును తేవాలని సూచించింది. ఐతే ఆ ప్రయత్నాలు ఏ మాత్రం జరగలేదు. 66 ఏళ్ళ స్వతంత్ర భారతంలో వీరి అభివృద్దికి ప్రభుత్వం చేసిన కృషి అంతంత మాత్రమే. జాతీయ స్థాయిలో సంచార జాతులకు కోసం ఏర్పాటు చేసిన కమిషన్ బాలకృష్ణ రెనకె అధ్వర్యంలో జాతీయ సర్వే నిర్వహించి వీరి స్థితిగతులపై ఒక నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఏళ్ళు గడుస్తున్నా ఆ సిఫారసులు అమలు కావడంలేదు. దీనికితోడు ఈ జాతుల అభివృద్ధికి కేటాయించిన నిధులు దారి మళ్ళినట్టు విమర్శలున్నాయి. ‘బుడుబుడకల కబుర్లోద్దు’,ఒరే బుడుబుడకలోడా’,‘వీడొక బుడుబుడకలోడు’ లాంటి పిలుపులతో వీరిని అవమాన పరుస్తున్నారు. ఆస్థిపాస్తులు, ఇళ్ళులేకపోయినా తాము మనుషులమేనని, తమను కూడా మనుషులుగా గుర్తించాల ని బుడుబుడకల వారు కోరుతున్నారు. వీరిని బుడుబుడకలకు బదులుగా ‘రాజ క్షతియ’,‘జ్ఞానేశ్వర్’అనే పేర్లతో పిలవాలని డిమాండ్ చేస్తున్నారు. అలా గే ఇప్పటికైనా సమాజంలో బుడుబుడకల వారికి తగిన సామాజిక గుర్తింపు, గౌరవం లభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

-బుద్ధారం రమేష్
కౌన్సిల్ ఫర్ సొషల్ డెవలప్‌మెం

Namasete Telangana Telugu News Paper Dated : 10/2/2013 

No comments:

Post a Comment