Sunday, July 28, 2013

కచ్చీరు ఉమ్మడి వేదికకు దిక్సూచి - డాక్టర్ పసునూరి రవీందర్


July 29, 2013
'బహుజన కచ్చీరు' చర్చ పూర్తిగా పక్కదారి పట్టింది. విశాల ప్రయోజన దృష్టితో నిర్వహించిన కచ్చీరు కొందరి సంకుచిత ఆలోచనల నడుమ గమనం గతితప్పింది. 'వివిధ'లో వ్యక్తమైన కొన్ని అభిప్రాయాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. అగ్రవర్ణాలు తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం బీసీలను, దళితులను పావులుగా వాడుకుంటున్నారు. అందుకే ఎక్కడ సంఘం పెట్టినా అందులో ఒకరిద్దరు దళితులకు, బీసీలకు అవకాశం కల్పించారు. పైగా అగ్రవర్ణ రాజకీయ నాయకుల కార్యక్రమాలకు మద్దతు కూడగట్టే వారిగానే వారిని మార్చివేశారు. ఈ మూసనుండి బయటపడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ (బహుజన) సాహిత్యకారులంతా కలిసి బహుజన ఉద్యమాన్ని నిర్మించాలని కొందరం భావించాం. ఇదే సందర్భంలో బహుజన కథల విషయానికి వచ్చేసరికి శిల్పపరమైన చర్చ అనివార్యంగా అగ్రవర్ణస్తులు ముందుకు తెస్తుండడం గమనించాం. ఇలాంటి చర్చ జరుగుతున్నప్పుడు దళితులు, బీసీలు చెప్పిన ఏ విషయాన్ని కూడా అగ్రవర్ణ సాహిత్యకారులు అంగీకరించడం లేదు. దీంతో అగ్రవర్ణాలతో కూడిన బహుజనోద్యమం సాధ్యం కాదనే విషయం స్పష్టమైంది. ఆధిపత్యవర్గాల దిశానిర్దేశాలు లేకుండా ముందుకెళ్లాలనే నిర్ణయం బలం గా ముందుకొచ్చింది. అందుకోసం బహుజనుల ఆధ్వర్యంలోనే బహుజన కథకుల కచ్చీరు జరగాలని నిర్ణయించుకొని సంగిశెట్టి శ్రీనివాస్, స్కైబాబ, నేను కలిసి ఏర్పాటుచేశాం.

ఈ 'కచ్చీరు' ఏర్పాటు వెనుక దాగిన కీలకోద్దేశాన్ని అర్థం చేసుకోకుండానే ఆరంభంలోనే కొందరు మిత్రులు తొందరపడ్డారు. సమస్యను గుర్తించిన పగ డాల నాగేందర్ దాని పరిష్కారాన్ని ఆలోచించకుండా ఇది సాధ్యం కాదన్నట్టు ఆదిలోనే అందరినీ నిరుత్సాహపరిచాడు. బీసీలు అంబేద్కర్‌ను ఒప్పుకోరని, తన పర్సనల్ అభిప్రాయాన్ని జనరలైజ్ చేసే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి ఇవాళ కార్యక్షేత్రంలో బీసీలు, దళితులు కలిసి అనేక సామాజిక ఉద్యమాల్లో కలిసి పనిచేస్తున్నారు. ఊరూరా ఫూలే, అంబేద్కర్ విగ్రహాలను నెలకొల్పుకుంటున్నారు. అంబేద్కర్‌ను గౌరవించే స్థాయిలోనే ఫూలేను కూడా దళితులు గుండెలనిండా నిలుపుకుంటున్నారు. ఈ వాస్తవాన్ని మరిచి చీలికలు తీసుకురావడం బహుజనోద్యమానికి నష్టమే తప్ప ప్రయోజనం కాదు. అంబేద్కరిజమంటే బుద్ధుని నుంచి కాన్షీరాం వరకు అనేకమంది బహుజన మహాపురుషుల తాత్వికత అని చెబితే దాన్ని అంగీకరించలేకపోయారు. బహుజనవాదం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యతతోనే రూపుదిద్దుకుంటుంది. సమాజంలో మెజారిటీగా ఉన్న బహుజనులు తమ ఐక్యతను కాదనుకొని కులాలవారీగా విడిపోతే ఆ పయనం ఏ దరికీ చేరదు.

ప్రతీ కులానికి తమ అస్తిత్వం ముఖ్యమే. కానీ దళితులకు, బీసీలకు, గిరిజనులకు, మైనారిటీలకు అందరి మధ్య ఉన్న కామన్ పాయిం ట్ అగ్రవర్ణ పీడితమే. అలాంటప్పుడు వీళ్లంతా కలిస్తేనే బహుజన ఉద్యమంలో విప్లవాత్మకమైన మార్పు సాధ్యమవుతుంది. బ్రాహ్మణీయ భావజాలం బహుజనుల్ని కులాల పేరుతో విడదీస్తే ఇవాళ కొందరు మిత్రులు ఫూలేను బీసీలకు, అంబేద్కర్‌ను దళితులకు మాత్రమే పరిమితం చేయడం ఖచ్చితంగా బ్రాహ్మణీయ భావజాలమే. మనుషులను విడదీసీన మనువాదం లాంటిదే ఇది కూడా. దళితులతో కలిసి పనిచేస్తే తమ అస్తిత్వానికి నష్టం వాటిల్లుతుందనే సంకుచితమైన అభద్రతాభావం వారిలో ఎందుకు ముందుకొస్తున్నది? బహుజనులంతా మూలవాసులనే తాత్విక భావన ఎందుకు కొరవడుతున్నదో అందరం ఆలోచించాలి. ఈ రకమైన పయనం ఎవరికి మేలు చేస్తుందో అర్థం చేసుకోవాలి.

అగ్రవర్ణ ఆధిపత్యం ప్రతీ సందర్భంలో ఇక్కడి భూమి పుత్రులను భౌతికంగానో, అభౌతికంగానో గాయపరుస్తూనే ఉంది. ఈ కుట్రలను ఓ కంటకనిపెడు తూ పోరాడాల్సిన బాధ్యత బహుజన సమాజానిది. ఈ దేశంలో ఉన్న నూటికి ఎనభైఐదు శాతంమంది బహుజనులే! సంపద సృష్టికర్తలైన వీరికి కనీసఅవకాశా లు దక్కకుండా చేశారు అగ్రవర్ణ పాలకులు. ఈ దుర్మార్గాలను బయటికి కనపడకుండా అగ్రవర్ణ సాహిత్యకారులు ఎప్పటికప్పుడూ జాగ్రత్త పడుతూనే ఉన్నా రు. బహుజనుల మధ్య ఐక్యత సాధ్యపడకుండా బ్రాహ్మణీయవాదులు కుట్ర చేస్తూనే వస్తున్నారు. దీనిని గ్రహించకుండా బహుజనులు తమలో తాము కొట్లాడుకుంటున్నారు. ఈ వాస్తవాలను గ్రహించలేనంత అంధకారంలోకి కూరుకుపోయిన బహుజన జాతి జాగృతానికి బహుజన సాహిత్యోద్యమం చారిత్రక అవసరం.
గడచిన మూడు దశాబ్దాలుగా బహుజనులు చేసిన సాహిత్యకృషి అసామాన్యమైంది. అప్పటికే స్థిరపడిపోయిన సాహిత్య విలువల్ని తృణీకరించి రచనలు చేయడం మామూలు విషయం కాదు. మొదట దళిత ఉద్యమం పురుడుపోసుకొని అగ్రవర్ణ ఆధిపత్యాన్ని నిలదీసింది. బీసీ కవులు ఇందులో భాగమయ్యారు. ఆనాడే బహుజనవాద దృష్టితో ఉద్యమం నడిచి ఉంటే ఇవాళ తెలుగు సాహిత్య చిత్రపటం మరోలా ఉండేది. ఇవాళ ఎవరికి వారు పూర్తిగా విడివడి దూరం జరుగుతున్నారు. ఈ పరిణామం ప్రమాదకరం. ప్రొఫెసర్ కొమ్రన్న బతికి ఉన్నప్పుడు దళితుల పట్ల, బీసీల పట్ల, ముస్లింల పట్ల ఒకే రకమైన బాధ్యతతో నడుచుకున్నాడు. ప్రస్తుతం డా.కాలువ మల్లయ్య లాంటి వారి స్ఫూర్తి అందరిలో రావాలి. ఎవరు బాధితులు, మనం ఎటువైపున్నామో ఆలోచించుకోవాలి.

ఇవాళ కావాల్సింది బహుజన రచయితలందరూ కలిసి ఒక ప్రత్యామ్నాయం నెలకొల్పడం. బీసీల్లోని ఒక కులం మరొక కులాన్ని వీళ్లు మా బీసీలే అనే భావన పెంపొందించుకోవాలి. అలాగే దళితుల్లోని కులాల్లోనూ ఉన్న భేదాభిప్రాయాలను తొలగించుకోవాలి. ఈ అగాథాలను అగ్రవర్ణాలే ట్యూన్ చేసి పెట్టాయి. ఈ అగాథాల్ని పూడ్చవలసిన బాధ్యత సామాజిక ఉద్యమకారులతోపాటు, సాహిత్యకారుల మీద కూడా ఉంది. దళిత, బీసీ, గిరిజన, మైనారిటీలను కలుపుకుపోయి ఒక బలమైన ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేసుకోవలసిన అవసరముంది. విశాల దృక్పథంతో బహుజన రచయితలందరి కోసం ఒక ఉమ్మడి వేదిక ఏర్పడాలి. అది బహుజన రచయితల సంఘంగానో, వేదికగానో ఉంటే బాగుంటుంది. కలిసిరాని, రాలేని వారిని వదిలేద్దాం. ఈ దేశమూలవాసులమనే ఎరుకతో, ఫూలే, అంబేద్కర్ ఆలోచనా విధానం ప్రాతిపదికగా ముందుకు వెళదాం.
- డాక్టర్ పసునూరి రవీందర్
drpasunuri@gmail.com
Andhra Jyothi News Paper Dated : 29/07/2013

No comments:

Post a Comment