Saturday, July 27, 2013

అగ్రకుల పార్టీలు బడుగులు స్వీయ నాయకత్వమే శరణ్యం By కదిరె కృష్ణ,


మోడీ అభ్యర్థిత్వంపై అగ్రకులాల అక్కసు!
బడుగుల ఓట్ల ఆకర్షణే బిజెపి లక్ష్యం
బంగారు లక్ష్మణ్‌ను తొక్కివేసిన బిజెపి 
జగ్జీవన్‌రామ్‌ను మోసం చేసిన కాంగ్రెస్‌ 
అవగాహనా లేమితో రాహుల్‌ గాంధీ 

అగ్రకుల పార్టీలు 2014 సాధారణ ఎన్నికల దృష్టితో ఒక నాటకం ప్రారంభించాయి. నరేంద్ర మోడీని బిజెపి, రాహుల్‌ గాంధీని కాంగ్రెస్‌- భావి ప్రధానులుగా, దేశ పరిరక్షణ శక్తులుగా ప్రచారం చేసుకుంటున్నాయి. ఇందులోని కుటిల నీతిని ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలు పసిగట్టనట్లయితే మరొకసారి మోసానికి గురికాక తప్పదు. హిందుత్వాన్ని కాపాడుకోవడానికి బిజెపికి ఇప్పుడు నరేంద్రమోడీ అనివార్యమైపోయారు. భారత్‌ వెలిగిపోతోంది వంటి నినాదాలు ఈ పార్టీని మరింత చీకటిలోకి నెట్టాయి. సేనాని పాత్రలో అద్వానీని ప్రజలు నిరాకరించడంతో గత్యం తరంలేక మోడీని తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రకటించింది. ఇప్పుడు అభివృద్ధి, ఉగ్ర వాద శక్తుల పట్ల కఠినవైఖరి వంటివాటితో మోడీని మెరిపించాలన్నదే బిజెపి యత్నం. ఈ క్రమంలోనే మోడీని తమ ఎన్నికల కమిటీ సారథిగా బిజెపి ప్రకటించింది. బిజెపి నిండా అగ్రకుల బ్రాహ్మణులు తిష్ఠ వేసి ఉన్నారు. ప్రత్యక్షంగానే ఎస్సీ, ఎస్టీ, బిసి కులా ల అభివృద్ధి, రిజర్వేషన్ల పట్ల బిజెపి తన అక్కసు వెళ్ళబోసుకుంటోంది. 

ఈసారి బహుజనవర్గాల నాయకత్వాన్ని బిజెపిలోని అగ్రకుల నాయకులు తట్టుకోలేక పోయారు. శూద్రుడైన మోడీని నాయకుడిగా అంగీకరించడానికి మనస్కరించక అద్వానీ రూపంలో తమ స్వభావాన్ని మరోసారి వెళ్ళబుచ్చారు. అద్వానీ, మోడీ విషయంలో ప్రవర్తించిన తీరు అగ్రకుల స్వభావానికి అద్దంపట్టింది. అస్త్ర సన్యాసం చేసినట్టు ట్విట్టర్‌లో అద్వానీ నమోదు చేసుకొని కొంత వివాదం సృష్టించే ప్రయత్నం చేశారు. రంగంలోకి దిగిన కొందరు నాయకులు మోడీ అవసరాన్ని చెప్పడం మూలంగా ఉక్కుమనిషి కొంత మెత్తబడ్డారు. ఇంతకీ మోడీద్వారా బిజెపి ఆశిస్తున్న ప్రయోజనమేమిటి? మోడీ ప్రధాని అభ్యర్థిత్వం ద్వారా బిజెపి పొందగలిగే లబ్ధి ఎంత? 
అభివృద్ధికి ప్రతీకగా మోడీని బిజెపి చూపిస్తున్నప్పటికీ వాస్తవంలో మాత్రం వెనుకబడిన కులాలను (బిసిలను) ఆకర్షించడానికేనని అర్థమవుతుంది. మోడీని సమర్థించడం ద్వారా బిసిలకే రాజ్యాధికారం వస్తుందనే భ్రమ కల్పించడానికి బిజెపి వేసిన ఒక ప్రమాదకర ఎత్తుగడ ఇది. అభివృద్ధి మంత్రమే నిజమైతే గుజరాత్‌- మానవాభివృద్ధి సూచికలో ఎంతో వెనుకబడి ఉంది.

అంటే మోడీ తరహా అభివృద్ధి వల్ల ప్రజల జీవన ప్రమాణాల్లో ఎంత మాత్రం మార్పు రాలేదన్నమాట! బడా పెట్టుబడిదారులు, గుత్తేదారుల అభివృద్ధి నిజమైన అభివృద్ధి కానేరదు. మోడీని అభివృద్ధికి ప్రతినిధిగా బిజెపి భావించడం లేదు సరికదా, ఆయనను నూటికి నూరుపాళ్లు బిసి కులాలను ఆకర్షించడానికే ఎంచుకున్నదనేది నిజం.బిసిలు మోడీని కేవలం బిజెపి నాయకుడిగానే గుర్తించినట్లు స్పష్టమవుతోంది. హిందుత్వ పార్టీలో ప్రధానమంత్రిగా మోడీ చేయగలిగేదేమీ ఉండదని, చివరికి మోడీని వాడుకొని అధికారంలోకి రాగానే అద్వాని వంటి వారిని రంగంలోకి దించే ఒక రహస్య అజెండా కూడా ఇందులో దాగిఉన్నది. ఎస్సీ, ఎస్టీ, బిసిల ఎదుగుదల ఎంతమాత్రం అంగీకరించలేని బిజెపి, ఆరెస్సెస్‌ వంటి హిందుత్వసంస్థలు, పార్టీలు మోడీవంటి శూద్రుణ్ణి ప్రధానిగా అంగీకరిస్తా యనుకోవడం అమాయకత్వమే. బంగారు లక్ష్మణ్‌ను ఎలా బలిపశువును చేశారో విదితమే. సమాజాన్ని హిందూ జాతీయవాద కోణంలో దర్శించే బిజెపిని బహుజనులు నమ్మడం లేదు. బ్రాహ్మణీయ శక్తుల కుట్రలను గ్రహించలేని కొందరు బిజెపి కుట్రకు బలయ్యే అవకాశమూ లేకపోలేదు. 

బాబూ జగ్జీవన్‌రామ్‌ (చమార్‌)కు ప్రధానిగా అవకాశం వచ్చినప్పుడు కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తే, బంగారు లక్ష్మణ్‌ కింది వర్గాలను ఆకర్షించి ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావచ్చనే కారణంతో ఇటు రాజకీయంగా, అటు సామాజికంగా కోలుకోలేకుండా తొక్కివేసింది బిజెపి. ఇటువంటి పార్టీల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలు కీలుబొమ్మలుగానో, అంబేడ్కర్‌ పరిభాషలో ‘బలమైనకుక్కలు(మజిల్‌డాగ్స్‌)’గానో, కాన్షీరాం మాటల్లో ఏ ‘చెంచాలు’గానో ఉంటారేతప్ప స్వతంత్ర నిర్ణాయక శక్తులుగా తమ జాతిని బానిసత్వంలోనుంచి విముక్తి చేస్తారనుకోవడం భ్రమ. మరో ప్రధానఇభ్యర్థి, కాంగ్రెస్‌పార్టీ 2014 ఐకాన్‌ రాహుల్‌ గాంధీ స్వభావరీత్యా అమాయకుడు. కాంగ్రెస్‌ పార్టీలోని బ్రాహ్మణ నారదబృందం ఇతనితో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శింపచేస్తోంది. తెరవెనుక రిహార్సల్స్‌ ఎంత పకడ్బందీగా జరిగినా పార్లమెంటులో పట్టు మని పదినిమిషాలు సొంత శైలి, సొంత దృక్పథాన్ని కనబరచడంలో విఫలమైన వీరుడు! సంపన్నుడిగా పుట్టి, సంపన్నదేశాలలో పెరగడం మూలంగా ఆయనకు భారతీయ జీవితం, పరిస్థితులు ఓపట్టాన అర్థం కావడం లేదు.

ఇదే పరిస్థితి రాజీవ్‌గాంధీకి దాపురించింది. అంచేత రాజీవ్‌ నిర్ణయాలన్నీ అసంబద్ధంగా, అవగాహనా రాహిత్యంతో ఉండేవి. బోఫోర్స్‌, తమిళఈలం వంటఇంశాల్లో ఆయన నిర్ణయాలు, పాత్ర వివాదాస్పదమయ్యాయి. రాహుల్‌గాంధీలో ఈ దోషాన్ని నివారించేందుకు దేశవ్యాప్తంగా పర్యటనలు చేయించారు. పాపం! రాహుల్‌ వాటిని విహార యాత్రల్లా భావించాడేమో కానీ, ఆయనలో ఈ దేశ స్థితిగతులపట్ల ఎంతమాత్రం అవగా హన పెరగలేదు. రాహుల్‌గాంధీ ప్రచారం చేసిన ప్రతి రాష్ర్టంలో కాంగ్రెస్‌పార్టీ ప్రతికూల ఫలితాలనే చవిచూడాల్సి వచ్చింది. రాహుల్‌ హిందుత్వ టెర్రరిజాన్ని తూర్పారబట్టి మైనారిటీ, లౌకికవాదులను ఆకర్షించా లనుకుంటారు. తదనంతరం ఎదురయ్యే ప్రతీఘాతాలను తట్టుకోవడానికి ఆయన రాజకీయ అవగాహనాస్థాయి సరిపోవడం లేదు. ఈదేశంలో ఎంతో వెనుకబాటుతనముంది, స్వాతంత్యం వచ్చి అర్థశతాబ్ది గడిచినా పేదరికం విపరీతంగా పెరిగిపోతోందని బాధపడతారు.

ఇలాంటి దేశంలో పుట్టినందుకు సిగ్గుగా కూడా ఉందని మరీ వాపోతాడు. కాని, స్వాతంత్య్రం వచ్చిన నాటినుండి నేటివరకు ఈ దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన వారు తన వంశీకులేనని, ఈ వెనుకబాటుతనానికి కారణం తన తాత ముత్తాతల ఘనతేనని విమర్శ రావడంతో నాలుక కరచుకుంటారు. బిజెపి బాహాటంగానే బ్రాహ్మణీయ అగ్రకుల శక్తులను సమర్థిస్తే కాంగ్రెస్‌ పార్టీ నిగూఢంగా అదేపనిని అంతకంటే ఎక్కువే చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీ కూడా బ్రాహ్మణులతో నిండి కళకళ లాడుతుంటుంది. ప్రత్యేకంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసిల పట్ల కాంగ్రెస్‌ పార్టీకి ఉండే అభిప్రాయమే (అణచివేత) రాహుల్‌కు ఉంటుందనడంలో సందేహం లేదు. కాంగ్రెస్‌లో తలపండిన నాయకులవద్ద యువరాజుకు తర్ఫీదుజరిగింది. కాబట్టి గతంలో కాంగ్రెస్‌పార్టీ ఎస్‌సి,ఎస్‌టి, బిసిలను అణచివేసినట్లే ఈయన ఆలోచనాధోరణి ఉంటుంది. ఎస్‌సి, ఎస్‌టి, బిసి ఓటు బ్యాంకును వాడుకొని బ్రాహ్మణీయశక్తుల స్వార్థప్రయోజనాలను నెరవేర్చడానికి రాహుల్‌గాంధీ ఉపయోగపడతాడు. బహుజన సమాజానికి ఉపయోగపడేదేమీ ఉండదు. 

మొత్తంగా రాహుల్‌గాంధీ ప్రజాస్వామ్యవాదో, తల్లివాదో, తాతవాదో అర్థం కాకుండా ఒక నీడలోని మానవాకారాన్నిపోలి, ఒక గందరగోళ వ్యక్తిత్వంగా మిగిలిపోయి ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ‘ఇప్పుడు రాహుల్‌ ప్రధాని పదవికి అర్హుడు’ అంటూ ప్రకటించారు. ప్రధాని పదవికి అర్హతలు పొందడం అంటే- కాంగ్రెస్‌ పార్టీ ఎత్తులు, జిత్తులు, కుట్రలు, పన్నాగాలు నేర్చుకోవడమే. రాహుల్‌ గాంధీ బిసిలకు రిజర్వేషన్లను వ్యతిరేకించిన గాంధీ వారసుడు. దళితులను నాయకత్వ స్థానంలో చూడజాలని అగ్రకులతత్వ పార్టీ నేత అవుతాడే గానీ బహుజనుల ఆశాజ్యోతి ఎంత మాత్రం కాడు. నూటికి ఎనభైశాతం మంది ప్రజలు ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కాలేకపోతున్నారు. రోజుకు రూ. 33 సంపాదనను ఇక్కడ గొప్ప అభివృద్ధిగా చూపిస్తున్నారు. 

నూతన ఆర్ధిక విధానాలతో మేడిపండు చందంగా ఉన్న అభివృద్ధి, ఆహార లోపంతో బాల్యం, నిరుద్యోగ నిస్పృ హలో యువత! దీనికి తోడు రోజుకో కుంభకోణం, మహిళల అభద్రత వెరసి తీవ్ర నైరాశ్యంతో దేశప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత ఆర్థిక సామాజిక వ్యవస్థ పట్ల అవగాహన, అంకితభావం ఉన్న నాయకత్వాన్ని అందించగల శక్తులు బహుజనులే. 
బహుజన శక్తుల ప్రతినిధిగా మరో ప్రధాని అభ్యర్థి బహుజనసమాజ్‌ పార్టీ నేత మాయావతి. ఆమె- కాన్షీరాం వారసురాలు. రాజ్యం ముఖం ఎరుగని ఎరుకల, మేథరి, చాకలి, కుమ్మరి వంటి అత్యంత వెనుకబడిన కులాల వాళ్లను అసెంబ్లీకి, పార్లమెంటుకు పంపించిన ఘనత కాన్షీరాంది. అలాంటి బహుజన తాత్వికుల ప్రతిరూపం మాయావతి. బహుజన కులాల అభివృద్ధి పట్ల నిబద్ధత ఉన్న నిజమైన ప్రతినిధి. బహుజన కులాల నేతృత్వంలో అక్కడ బ్రాహ్మణవర్గాలను నడిపించడం ఆమె రాజకీయ చతురత. బ్రాహ్మణీయ కులాల వాటానే వారికి రిజర్వేషన్లుగా ఇస్తున్నారు. 

సాంసృ్కతికంగా, రాజకీయంగా సంస్కరణలకు పునాదులువేస్తూ ఆర్థిక పటిష్ఠతను బహుజన కులాలు పొందగలిగినప్పుడే సామాజిక సమానత్వం సిద్ధిస్తుంది. బహుజనుల్లో సాంసృ్కతిక విప్లవం జనించడాన్ని కాంగ్రెస్‌, బిజెపి తదితర బ్రాహ్మణవాద పార్టీలు జీర్ణించుకోలేవు. బ్రాహ్మణవాదాన్ని మోస్తూ తమ అడుగులకు మడుగులొత్తే బహుజన కులాల నాయకత్వాన్ని పెంచి పోషించేందుకు బ్రాహ్మణ పార్టీలు శక్తివంచన లేకుండా కృషి చేస్తాయి. మహిళలను, ఆర్థిక రంగానికి వెలుపలఉన్న 70 శాతం ఎస్‌సి, ఎస్‌టి, బిసిలను ఆర్థికరంగంలో భాగస్వాములను చేయడం సాంసృ్కతిక విప్లవంలో ప్రధానభాగం. కాంగ్రెస్‌, బిజెపి పార్టీల మాదిరిగా బహుజనులు తమ నాయకులను, సిద్ధాంతాన్ని ప్రొజెక్టు చేయడంలో ముందుకు రావాలి. మోడీని, రాహుల్‌గాంధీని ప్రమోట్‌ చేసుకునేందుకు అగ్రకుల బ్రాహ్మణవర్గాలు చూపే ఉత్సుకత, ఆరాటం బహుజన కులాలనుంచి లోపించింది. ఒక స్వతంత్ర నాయకత్వాన్ని సాధించుకొని, సొంతం చేసుకునే తత్వాన్ని బహుజనులు అలవర్చుకోవాల్సి ఉన్నది.

రాజ్యంపై కాంక్షలేనిదే, రాజకీయ స్పృహ లేనిదే అధికారం కల్ల. రాజ్యాధికారం (స్వతంత్ర) లేనిదే కులబానిసత్వం, వెనుకబాటుతనం నిర్మూలన సాధ్యంకాదు. ఇవన్నీ సాధించేందుకు బహుజనుల్లో చైతన్యం రావడానికి ఉధృతంగా ఉద్యమాలు చేయవలసిన చారిత్రక సందర్భమిది. ఈ ఉద్యమాలకు త్యాగాలవసరమవుతాయి. ఆ త్యాగాలను రిజర్వేషన్ల ఫలితాలు అనుభవిస్తున్న ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు, నాయకులే చేయాల్సి ఉంది. బహుజన పితామహుల స్ఫూర్తిని గ్రహించి 2014 ఎన్నికలకు ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలు సమైక్యంగా పోరాడితే తప్ప బహుజన రాజ్యం సిద్ధించదు. బహుజన రాజ్యం రానిదే విముక్తి లేదు.

రచయిత మూలవాసీ బహుజన లిబరేషన్‌ మూవ్‌మెంట్‌ కన్వీనర్‌



Surya Telugu News Paper Dated : 27/07/2013

No comments:

Post a Comment