Tuesday, August 27, 2013

ముళ్లదారి By ఎం. ఎఫ్ గోపీనాథ్ రాసిన ‘నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా? అయితే సంతోషం’! పుస్తకానికి అల్లం రాజయ్య రాసిన ముందుమాటలోంచి కొన్ని భాగాలు


డాక్టర్ గోపినాథ్ తన పుస్తకానికి ముందుమాట రాయమంటే నేను ఆశ్చర్యపోయాను. అంత అనుభవం, లోతైన బహుముఖ అధ్యయనం నాకు లేదు. వేల సంవత్సరాలుగా ఎదుదురుగా నిలబడి యుద్ధం చేస్తు న్న, సర్వసంపదల సృష్టికర్తలైన ప్రజారాశుల్లో... ఆ సంపదను చేజిక్కించుకుని వారి మీద అధికారం చేస్తున్న ప్రజావ్యతిరేక పాలకపక్షాల లోతుపాతులు-కార్యకర్తగా, నాయకుడిగా ఆయన మమేకత్వం- విశ్లేషణ నాలాంటి వాడికి అందనిది.


అంటరాని కులంలో పుట్టి, కులాల ముళ్లకంచెలు దాటి, లేమిని ఎదిరించి, మారుమూల పల్లె ఎల్లలు దాటి-ఏకలవ్యుడిలా అనేక విద్యలు అభ్యసించినవారు ఆయన. అడుగడుగునా, దారి పొడుగునా రాజీలేని పోరాటంలో-ఒంటరిగా అనుభవించిన వొత్తిడి అనుభవిస్తున్న తీవ్రత మాటలకందనిది.
గజిబిజిగా అస్తుబిస్తుగా, వెనుకా ముందులుగా, కాలువలుగా, వాగుల్లాగా ప్రవహించిన వ్యాక్యాల లోతుల్లో తడి.. నా కళ్లల్లోకి ప్రవహించి.....



ఈ పుస్తకం చదవడానికి చాలారోజులు పట్టింది. ఇది రొమాంటిక్ ఫిక్షన్ కాదు. కథ కాదు-కవిత్వం కాదు- భయంకరమైన కఠోరవాస్తవం. రాసిన వాక్యాల వెంట, రాయని మరెన్నో తెలిసిన ఘటనలు చుట్టుము గోపి పల్లె బతుకు. మోకాలుముంటి దిగబడే దారులు, అడపాదడపా స్కూలుకు వచ్చే పంతుళ్ళు, ఊరి కొట్లాటలు, పసి మనసుల్లో ఎగిసిన, కలతపెట్టిన ఘటనలు... పశువులు, పంటలు, ఎండా, వానా, చలి, చేపలు, కన్నీళ్లు, కష్టాలు ప్రతిదీ-గుండె గొంతుకలోన గుబగుబలాడినయ్.
పల్లె-అందునా భారతీయ పల్లె-నిరంతర యుద్ధక్షేత్రం కదా! పల్లెలోని మనుషులు భూమి చుట్టు అల్లుకొని, కులాలుగా, వర్గాలుగా స్త్రీ పురుషులుగా, అనేక రకాలుగా విడిపోయి, ఒకరితోనొకరు తలపడుతూ, కలబడుతూ, హింసించుకుంటూ, నిత్యం గాయపడి నొప్పులతో బతుకుతారు కదా! దుర్భర దారిద్య్రం, అంతులేని వేదన-ఊపిరాడని పల్లెటూల్ల పిల్లగాండ్లు-అలాంటి ఒంటరితనాల్లోంచి-సంక్లిష్ట భారతీయ పల్లె బతుకు నుంచి బయటపడటానికి పడిన పాట్లు ఈ పుస్తకం...



భూమి కోసం, తాము సృష్టించిన సంపద కోసం ప్రజలు పోరాడుతున్న వేల సంవత్సరాల యుద్ధభూమి పల్లె-అయినా మాయోపాయాలతో సంపద పంచబడని, దోపిడీ చెక్కుచెదరని, స్థితిలో... సుదీర్ఘ యుద్ధాల్లో కూడా- తమ సృజనాత్మకతను, జ్ఞానాన్ని, అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ కొనసాగుతున్న-తలవంచని కింది కులాల వీరయోధుల కుటుంబంలో నుండి సాగిన జీవనయానం-ఆయన యుద్ధ బీభత్స అనుభవాలు నన్ను కకావికలు చేశాయి. ఆయనలాగే నాకు ఆ పల్లె కలలు, నెత్తుర్లు చిమ్మంగా కొట్టుకున్న కలలు... సుదీర్ఘ యుద్ధాల పీడకలలు, పెనుగులాడినకొద్దీ మునుపటికన్నా లోతుగా దినదినం యుద్ధరంగంలోకి నెట్టబడుతున్న పల్లెలు-అడవులు-ఎక్కడేమిటి అన్ని రకాల సంపద, వనరులు, సుడిగాలిలా-ఎలుగడిలా పరివ్యాప్తమౌతున్న యుద్ధరంగంలో నిలబడి చావోరేవో తేల్చుకోవాల్సిన సందర్భంలో ఈ పుస్తకం...



గోపి పల్లె నుండి బయటపడిన కాలం-అన్ని రకాలుగా ప్రజాస్వామ్యం మాయ బట్టబయలైన సమయం. నెహ్రూ ప్రవచించిన సంక్షేమం-గాంధీ హరిజనోద్ధరణ కానరాలేదు. మరింత పేదవాళ్లయ్యారు. అంబేడ్కర్ ప్రవచించిన రాజ్యాంగంలోని సామాన్యుల హక్కులు కాలరాచివేశారు. తెలంగాణలో 1969 వరకు దళిత కులాలు పేద పిల్లలు గోపిలాగే అనేక ప్రశ్నలు లేవనెత్తారు. జీవతమొక అగ్నిగుండమని గుర్తించారు. 



ప్రపంచవ్యాపితంగానే ఇది కోపోవూదిక్త కాలం. దేశవ్యాప్తంగా రెక్కవిప్పుతున్న రెవల్యూషన్ నక్సల్బరీ కొత్తదారిలో యాంగ్రీ యంగ్‌మెన్ సమస్తాన్ని ప్రశ్నించడమే కాదు, దాన్ని మార్చాలని బయలుదేరిన యువకులు...1969లో మొదలైన తెలంగాణ విద్యార్థుల ప్రత్యేక తెలంగాణ పోరాటం-1972 వరకు 370 మంది విద్యార్థుల హత్యతో....మరోమారు తెలంగాణ రక్తసిక్తమైంది. అప్పటికే తెలంగాణ సాయుధపోరాటం చెల్లాచెదురైన అనుభవం తెలంగాణ ప్రజలకున్నది. ఎప్పటిలాగే ప్రజలు తమ బిడ్డలను పోగొట్టుకుం అధికారాన్ని, ఆస్తుల్ని పంచుకున్నారు. కాని మానని గాయం మాటేమిటి? అది లోలోపల సలిపింది. రగిలింది. 1974 వరకు తెలంగాణలో అన్ని యూనివర్సిటీల్లోని ఆ మాటకొస్తే రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోని-విప్లవ విద్యార్థులు స్పష్టమైన ప్రణాళికతో ఏకమయ్యారు. రాడికల్ విద్యార్థి సంఘంగా ఏర్పడి ‘రోడ్ టు రెవల్యూషన్’ రచించుకున్నారు. ఉస్మానియాలో జార్జిడ్డిని మతవాదులు చంపేశారు. అగ్గిరాజుకుంది. అత్యవసర ప్రకటన తర్వాత దేశమే పెద్ద జైలు అయ్యింది. నిర్బంధంలో జైళ్లు కొత్త రకం పాఠశాలలయ్యాయి. చరివూతను, రాజకీయాలను, తత్వశాస్త్రాన్ని, ఉత్పత్తి, పంపకం, పెట్టుబడి భూమిక గురించి, భూమి గురించి తెలుసుకున్నారు.



ఎమ్జన్సీ ఎత్తివేత తరువాత రాడికల్ విద్యార్థులు ‘రోడ్ టూ రెవల్యూషన్’లో భాగంగా తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమాల్లో లీనమయ్యారు. ఈ రోడ్డు మీదికొచ్చి కలిసిన గోపి 1978 ఫిబ్రవరిలో రాడికల్ విద్యార్థి సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. చెరుకూరి రాజకుమార్(ఆజాద్) ఈ సంఘానికి అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. 
ప్రపంచంలోనే మొదటిసారిగా విద్యార్థులు గ్రామాలకు తరలారు. అదివరదాకా స్కూళ్లు, కాలేజీల్లో కల్లబొల్లి చదువుల స్థానే-వాళ్ల గ్రామాలను, ప్రజల జీవితాన్ని మార్క్సిజం వెలుగులో అధ్యయనం చేశారు. ప్రజల దగ్గరికి విద్యార్థులు వెళ్లడమనే ప్రక్రియ ఉత్తర, దక్షిణ తెలంగాణల్లోనే కాదు-కోస్తాలో, రాయలసీమలో ఒక ఉప్పెనలా సాగింది. 



అయితే ఈ పుస్తకం మర్యాదస్తుల పుస్తకం ఎంత మాత్రం కాదు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి నిరంతరం అవమానపరిచే-గాయపరిచే-హత్యచేసే ప్రపంచంలో ఒక దళితుడి తీవ్రమైన తిరుగుబాటు గొంతు. ఇది కల్పిత సాహిత్యం కాదు. కటిక వాస్తవం. సాంప్రదాయిక పద్ధతికన్నా భిన్నంగా మన సాహిత్య వాతావరణానికి అలవాటులేని పద్ధతిలో ఇలాంటి పుస్తకం రాయడంపచురించడం ఒక సాహసమే.అక్టోపస్‌లాగా, మృత్యువులా విస్తరిస్తున్న ప్రపంచీకరణ నేపథ్యంలో..వూపపంచ ప్రజలందరు తమ బలం, బలహీనతలను అంచనా వేసుకోవడానికి ముఖ్యంగా ప్రజా ఉద్యమాలు ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయాలి. ప్రజా పోరాటాల్లో సమస్త కులాలు, సమస్త శక్తులు భుజం భుజం కలిపి పోరాడడానికి ఈ పుస్తకం తోడ్పడుతుంది..



ఈ పుస్తకం నా అంచనా ప్రకారంగా రెండు రకాలుగా ప్రతి స్పందనలు చెలరేగడానికి కారణం కాగలదనిపిస్తున్నది. దొంగకు తేలుకుట్టినట్లు ఈ పుస్తకాన్ని పట్టించుకోకపోవడం. రెండోది వాయిపూంట్ రియాక్షన్. ఇంతదూరం నడిచి కూడా.. గోపి కత్తి అంచు మీదనే ఉన్నాడనిపిస్తుంది. ఇందులోని కొన్ని మాటలు మార్చవచ్చు. తొలగించవచ్చు. తద్వారా గోపికి మంచి పేరు రావచ్చు. మేధావిగా గుర్తింపు పొందవచ్చు. శత్రువులు తగ్గిపోవచ్చు... అయితే ఇది దృక్పథానికి సంబంధించిన సమస్య. ఇది లొంగిపోవడానికి, పోరాడటానికి సంబంధించిన సమస్య. లొంగిపోవడం, పోరాడటం అనేవి మనిషి పుట్టుకతోనే దోపిడీ సమాజాల్లో వెంటాడేవి. పోరాడటం గోపి నడక, ఆచరణ, నైజం.. అయినా పోరాటం మనిషి తనంతట తాను ఎంచుకునేది కాదు. అది అనివార్యంగా రుద్దబడేది. అత్యంత విషాదం ప్రపంచంలో ఇదే. ఈ కాలంలో ప్రపంచంలో ఏ మనిషి యుద్ధం బయట ఉండగలడు?అనూహ్య ప్రదేశమైన అబూజ్‌మడ్ ఇప్పటికీ కులం, మతం, స్వంత ఆస్తి తెలియని ఆదివాసుల మీద ప్రజాస్వామిక గణతంత్ర ప్రభుత్వ సైన్యం ఆధునిక ఆయుధాలతో మానవ రహిత యుద్ధ విమానాలతో దిగుతోంది. మూలవాసుల ఆస్తుల్ని, దేశాల సరిహద్దుల్ని చెరిపేసి కొల్లగొట్టబడే ప్రపంచీకరణ అనే సామ్రాజ్యవాద గొప్ప దోపిడీ సన్నివేశం లో ప్రతిదీ ఒక పేలే తుపాకే. అది కొండచిలువలా నోరు తెరుచుకున్న రోడ్డు కావచ్చు. కుప్ప తెప్పలుగా విస్తరించే నెట్ వర్కులు, మీడియా మాయాజాలం కావచ్చు. అది స్వైన్ ఫ్లూ కావచ్చు. ఎయిడ్స్ కావచ్చు. కార్చిచ్చులా గుప్పుమనే మరేదైనా కావచ్చును...



భారతదేశంలో ఆడ మగ, ముసలి ముతక, పిల్లా పీచు అన్ని కులాలు దళారులుగా లొంగిపోవడానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి వేల సంస్థలు నెట్ వర్కులు, టీవీలు, ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అట్లా లొంగిపోకుండా, దళారులుగా రూపాంతరం చెందకుండా మిగిలిన వారిపై దాడి కోసం భారత దేశం మనం చెల్లించే పన్నులతో ప్రపంచంలోని ఆయుధాలన్నీ కొనుగోలు చేసి అమెరికా వారి పర్యవేక్షణలో పెద్ద యుద్ధ రంగం సిద్ధం చేస్తోంది. 
అదిగో అలాంటి సన్నివేశంలో, సందర్భంలో పోరాడే ప్రజల పక్షాన నిలబడి లోపలి, బయటి వైరుధ్యాలను మనతో పంచుకుంటున్నాడు.. అలాంటి జ్వరతీవూవత గల గోపిని ఆలింగనం చేసుకుంటూ... ... 

-అల్లం రాజయ్య



(ఎం. ఎఫ్ గోపీనాథ్ రాసిన ‘నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా? అయితే సంతోషం’! పుస్తకానికి అల్లం రాజయ్య రాసిన 
ముందుమాటలోంచి కొన్ని భాగాలు...)

Namasete Telangana Telugu News Paper Dated : 28/08/2013 

No comments:

Post a Comment