Tuesday, August 28, 2012

వికలాంగుల వెతలు తీరేదెన్నడు ?----బిల్ల మహేందర్, బి. రాములు, లక్కిడ్డి సత్యం



handicapped
రాష్ట్రంలో వికలాంగుల సమస్యను గుర్తించి వారందరినీ ఐక్యం చేసిన ఘనత మందకృష్ణ మాదిగదే. వారి ఆధ్వర్యంలోనే హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాధికారంలో భాగస్వామ్యం అనే మూడు నిర్దిష్ట లక్ష్యాలతో 2007 ఆగస్టు28న ‘వికలాంగుల హక్కుల పోరాట సమితి’ స్థాపించబడింది. నాలుగు నెల ల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా డివిజన్ స్థాయిలో పర్యటించి దాదాపు 151 వికలాంగుల చైతన్య సభలను నిర్వహించడం జరిగింది. అనంతరం సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో 2007 నవంబర్ 26న ‘వికలాంగుల మహాగర్జన’ బహిరంగ సభ విజయవంతమైంది. అదేరోజు వికలాంగుల మహాశక్తిని ఉద్యమ రూపంగా మలిచి జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద దాదాపు 15 గంటల పాటు ఆందోళన నిర్వహించారు. దీంతో మేల్కొన్న ప్రభుత్వం వికలాంగులను చర్చలకు ఆహ్వానించింది. వారి న్యాయమైన డిమాండ్లపై లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో, ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమించారు.

ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. దీంతో 2008 ఫిబ్రవరి 26న ‘వికలాంగుల విజృంభణ’ పేరుతో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం అదే రోజు తిరిగి చర్చలకు ఆహ్వానించింది. చర్చ ల్లో అన్ని డిమాండ్లపై సానుకూలత వచ్చినా, పెన్ష న్ పెంపుపై సందిగ్ధత నెలకొన్నది. దీంతో వికలాంగుల విజృంభణ పేరుతో 2008 మార్చి 31న వందలాదిమంది వికలాంగులతో పాటు మందకృష్ణమాదిగ కూడా దీక్ష చేపట్టారు. దీనిపై స్పందించిన వైఎస్ రాజశేఖర్‌డ్డి అసెంబ్లీ సాక్షిగా వికలాంగుల పెన్షన్‌ను 200 రూపాయల నుంచి వైకల్య శాతాన్ని బట్టి 500, 600, 700లకు పెంచుతూ ప్రకటన చేశారు. అయితే ప్రభుత్వం 600,700 రూపాయల పెన్షన్ అమలు చేయనేలేదు. పైగా క్యాంపు లు నిర్వహించి నకిలీ వికలాంగుల పేరుతో అర్హులైన లక్షలాదిమంది 500 రూపాయల పెన్షన్ ను కూడా రద్దు చేసింది. 

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల గురించి మాట్లాడే రాజకీయ నాయకులు వికలాంగుల సంక్షేమం గురించి మాట్లాడకపోవడం శోచనీయం. వికలాంగులను కేవలం ఓట్లుగానే పరిగణిస్తున్నారు. వారికి జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో ప్రాధాన్యం కల్పించాలని ఏ రాజకీయ పార్టీ కూడా గుర్తించడం లేదు. దీంతో వారి సమస్యలపై చట్టసభల్లో గొంతెత్తే అవకాశం లేకుండాపోతున్నది. దీనితో వారి సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. సమస్యలను పట్టించుకున్న నాథుడు లేక సమస్యల వలయంలో వికలాంగులు విలవిలలాడుతున్నారు. సమాజంలో వికలాంగులు మిగతా వారితో సమానంగా, గౌరవం గా జీవించాలంటే ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్రాహం ఉండాలి. 

వారిని ఆదుకుంటామన్న భరోసా ఇవ్వాలి. కానీ ఆ దిశగా ప్రభు త్వం ఆలోచించిన దాఖలు కనిపించడం లేదు. అర్హులైన ప్రతి వికలాంగుడికి ఉచిత విద్య, వైద్యంతో పాటు గృహవసతి, విద్యుత్తు, ప్రయాణ తదితర సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. వాటితో పాటు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వికలాంగులకు ఇచ్చే పెన్షన్‌ను 500 నుంచి 1500లకు పెంచాలి. అప్పుడే వారి జీవితాలు బాగుపడతాయి. జనాభా ప్రాతిపదికన వికలాంగులకు బడ్జెట్ కేటాయించి, ఆ మొత్తాన్ని వారి పురోభి వృద్ధికే ఖర్చుచేయాలి. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా వికలాంగ ఉద్యోగులకు ఉన్నత చదువుల కోసం వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలి. సమాజంలో వికలాంగులు వివక్షకు గురికుం డా అవమాన నిరోధక చట్టాన్ని అమలు చేయాలి. వికలాంగుల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడమే కాదు, వాటిని చిత్తశుద్ధి తో అమలు చేయాలి. అలా చేసినప్పుడే వారు సమాజంలో మిగ తా వారితో సమానంగా సగౌరవంగా జీవించగలుగుతారు.

వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం మంత్రి సునీతా లకా్ష్మడ్డి అధ్యక్షతన ఏర్పడిన కమిటీ 19 సిఫార్సులతో కూడిన ఒక నివేదికను తయారు చేసి, ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికలో మహిళా వికలాంగులపై జరుగుతున్న వివక్షను అరికట్టడానికి అత్యాచార, అవమాన నిరోధక చట్టం తీసుకురావాలని సూచించింది. అర్హులైన వికలాంగులకు అసైన్డ్ భూములు ఇవ్వాలని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయినా ప్రభుత్వం వాటిని ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెడుతూ.. వికలాంగులను నిర్ల క్ష్యం చేస్తున్నది. అంతేకాదు వీరి సమస్యలకు సంబంధించిన చర్చ లు నిర్దిష్టంగా జరగడం లేదు. దీనికంతటికి కారణం చట్టసభల్లో వికలాంగులకు తగిన ప్రాధాన్యం లేకపోవడమే. కాబట్టి వారికి చట్టసభల్లో ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించాలి.

రాజ్యాధికారంలో వికలాంగులకు సరైన భాగస్వామ్యం ఉన్నప్పుడే వారి సమస్యలు తర్వగా పరిష్కారమ య్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రతి వికలాంగు డు కదం తొక్కాలి. ఈ న్యాయమైన ఉద్యమంలో రాష్ట్రంలోని అన్ని పార్టీల నాయకు లు, ప్రజాసంఘాలు, మేధావులు, మీడి యా వికలాంగులకు అండగా నిలవాలి. అప్పుడే వికలాంగుల సమక్షిగాభివృద్ధి సాధ్యమవుతుంది. వికలాంగుల న్యాయమైన హక్కులను సాధించుకోవడానికి చేసే ఈ మహోద్యమంలో అన్ని వర్గా ల వారు వికలాంగులకు తోడ్పడాలి. వారి పురోభివృద్ధికి చేయూతనివ్వాలి. వికలాంగులు సమాజంలో ఇతరులతో సమానంగా అన్ని రకాల గౌరవ ప్రాధాన్యాలు పొందా లి.వారు చేయగలిగే అవకాశమున్న ఉద్యోగాలలో వికలాంగులకే ప్రథమ ప్రాధాన్యమిచ్చి ఉపాధి కల్పించాలి. వికలాంగుల కోసం కొన్ని ప్రత్యేక ఉద్యోగాలను కేటాయించాలి. 
-బిల్ల మహేందర్, బి. రాములు, లక్కిడ్డి సత్యం
వికలాంగుల హక్కుల పోరాట సమితి
(నేడు నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ‘వికలాంగుల రాజ్యాధికార యాత్ర సభ’ సందర్భంగా)

Namasete Telangana News Paper Dated : 28/08/2012

No comments:

Post a Comment