Wednesday, May 30, 2012

సిబిఐ దర్యాప్తుల్లో దళిత కోణం ---కత్తి పద్మారావు,



నిజానికి సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రులు తెలంగాణకే కాదు సీమాంధ్ర దళిత బహుజనులకు పెద్ద ఎత్తున సామాజిక ద్రోహం చేశారు. వీరి అక్రమాల వల్లనే తెలంగాణ డిమాండ్ కూడా ముందుకు వచ్చింది. అగ్రకుల రాజ్యాధికార స్వభావాన్ని దళిత బహుజనులు అర్థం చేసుకోవల్సిన అవసరం వుంది. ఆర్థిక నేరాలు, రాజకీయ హత్యలు, అబద్ధ ప్రచారాలతో ఇప్పుడు నడుపుతున్న కార్పొరేట్ రాజకీయాల స్వభావాన్ని అర్థం చేసుకోవల్సిన చారిత్రక సందర్భం ఇది. 


కేంద్ర నేర పరిశోధక సంస్థ (సిబిఐ) దేశవ్యాప్తంగా తన కార్యక్రమాలు ముమ్మరం చేసింది. అధికారంలో ఉన్న పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తుందనే అపప్రథ ఈ సంస్థపై ఉన్నది. అయితే వివిధ కుంభకోణాల్లో మాజీ కేంద్ర మంత్రులు రాజా (డిఎంకె), సురేశ్ కల్మాడీ (కాంగ్రెస్), కరుణానిధి తనయ కనిమొళిని అరెస్ట్ చేయడం వల్ల సిబిఐ కొంత పారదర్శకత కూడా చూపిస్తూనే వెళుతుందనక తప్పదు. 



దళిత బహుజనులు కరుణాశీలురు. సహజంగానే ఎవ్వరు అరెస్ట్ అయినా వారు సానుభూతి చూపుతారు; అయితే తమ భూములు, సంపదలను దోచుకున్న వారు అరెస్టయినప్పుడు, శిక్షలకు గురయినప్పుడు కూడా జాలిపడడం ఆశ్చర్యం. నిజమే, చంద్రబాబు లాంటి వాళ్ళు ఎందరో ఇంకా నేర పరిశోధనకు గురికావలసివుంది. దాని కోసం కూడా చిత్తశుద్ధితో అందరూ కృషిచేయాలి. సుప్రీంకోర్టులో ఈ విషయం పెండింగ్‌లో ఉంది. ఒక దళిత మంత్రి చేసిన ఆరోపణల మూలంగా సిబిఐ నాలుగు రోజుల క్రితం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేసింది. ఆయన అక్రమార్జన వ్యవహారాలను రాజకీయ కోణం నుంచి కాకుండా నిష్పక్షపాతంగా సిబిఐ కోణం నుంచి దళిత బహుజనులు చూడాల్సిన సందర్భం ఇది. ఒకవేళ ఇటువంటి నేరపరిశోధనలే లేకపోతే దేశసంపద ఏమౌతుందో కూడా ఆలోచించాల్సివుంది. అందరికీ చెందాల్సిన సంపద కొందరి గుత్తస్వామ్యం కావడం రాజ్యాంగ విరుద్ధం అనే విషయాన్ని కూడా అవగాహన చేసుకోవాలి. 



వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి మీద భాతర శిక్షా స్మృతి సెక్షన్ 120 బి. రెడ్ విత్ 480, 409, 468, 471; అవినీతి నిరోధక చట్టంసెక్షన్ 13 (2) రెడ్ విత్ (13) 1 సి.డి. కింద కేసులను సిబిఐ నమోదు చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే పి.శంకర్‌రావు 2011 ఆగస్టులో రాసిన ఒక ఉత్తరం మేరకు జగన్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణపై రాష్ట్ర హైకోర్టు విచారణకు ఆదేశించింది. ఆ విచారణలో భాగంగానే సిబిఐ తన దృష్టిని జగన్‌పై కేంద్రీకరించింది. 



2004 మార్చి చివరినాటికి రూ.11 లక్షల ఆదాయం ఉన్న జగన్ నేడు రూ.43వేల కోట్ల ఆస్తులకు అధిపతి. ఇదెలా సాధ్యమయింది? జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలోని వేలాది ఎకరాల భూములు బహుళజాతి కంపెనీలకు, దేశీయ పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేసి తన కుమారుడి పరిశ్రమల్లోకి దొడ్డి దోవన ధనాన్ని ప్రవహింప జేశారు. జగన్ కంపెనీల్లో భారీ ప్రీమియంతో వారు పెట్టుబడులు పెట్టారని సిబిఐ తన పరిశీలనలో నిగ్గు తేల్చింది. హెటిరో గ్రూప్, ఇండియా సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, పొట్లూరి వరప్రసాద్, నిమ్మగడ్డ ప్రసాద్, పెన్నా గ్రూప్, ల్యాంకో గ్రూప్, సజ్జల గ్రూప్ తదితరులు రూ.250 నుంచి రూ.1140 వరకు ప్రీమియంతో జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని సిబిఐ గుర్తించింది. 



వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశ్రిత పక్షపాతానికి ఒడికట్టారు, కొందరు పారిశ్రామిక వేత్తలతో కుమ్మక్కై దేశ సంపదనే అమ్మడానికి చూశారు. ఇదంతా ఆయనొక పథకం ప్రకారమే చేశారు. దేశ సంపదను కుదువ పెట్టడానికి ఆయన ఎన్నుకున్న పారిశ్రామికవేత్తలందరూ అక్రమార్జనలో గజగండులే. జగన్‌కు ముందు అరెస్ట్ అయిన నిమ్మగడ్డ ప్రసాద్ విషయానికి వస్తే ఈ విధమైన దోపిడీలో అతనికి చాలా ప్రావీణ్యం వున్నట్టు కనబడుతుంది. పన్నెండు సంవత్సరాలకు ముందు ఆయన ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ మాత్రమే. ఎంతో నష్టాలకు గురైన ఔషధ సంస్థ హెరెన్ డ్రగ్స్‌ను కొనుగోలు చేసి మ్యాట్రిక్స్ లేబోరేటరీస్ అని పేరు మర్చారు. 



2007లో అమెరికన్ ఔషధ సంస్థ 'మిలన్'కు మ్యాట్రిక్స్ లేబోరేటరీస్‌ను అమ్మడం ద్వారా రూ.570 కోట్లు సంపాదించారు. మారిషస్‌కు సంబంధించిన కొన్ని సంస్థల ద్వారా రూ.864.4 కోట్ల డబ్బును జగన్ మీడియా సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు సిబిఐ ఆరోపిస్తుంది. ఆ తరువాత కొంత వాటా అమ్మిన తరువాత కూడా రూ.505 కోట్ల మేరకు ప్రసాద్ పెట్టుబడులు యింకా ఆ మీడియా సంస్థలో మిగిలే వున్నాయి. నిమ్మగడ్డ ప్రసాద్ ప్రారంభించిన గిల్ క్రిస్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ఫా విల్లాస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ఫా ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్‌లు జగన్‌కు చెందిన సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టాయని సిబిఐ భావిస్తుంది. 



ఈ పరిశోధన చేసే కొద్దీ దేశీయ వనరులు అమ్మడానికి మంత్రిమండలిని మొత్తాన్ని ప్రభావితం జేసి అక్రమంగా 26 జీ.ఓ.లు, వైఎస్ రాజశేఖర రెడ్డి తన మంత్రులపై వొత్తిడితో జారీ చేయించారని అర్థమవుతుంది. ఈ వ్యవహారంలో మోపిదేవి వెంకట రమణ, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణ వంటి మంత్రులందరికీ ప్రమేయముంది. ఇప్పటికే మోపిదేవిని సిబిఐ అరెస్టు చేసింది. ఈ ప్రక్రియలో బలమైన రెడ్డి మంత్రులు నెవ్వరినీ రాజశేఖరరెడ్డి పెట్టుకోలేదు. కాపులు, ఎస్సీ, బీసీ మంత్రులే ఎక్కువగా ఇందులో ఇరికించబడ్డారు. ఇద్దరు మహిళా మంత్రులను ఇరికించారు. 



'వాన్ పిక్' ప్రాజెక్టులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు ధారాదత్తం చేసిన భూముల్లో ఎస్సీ, బీసీ రైతులే ఎక్కువగా ఉన్నారు. నిజానికి ఈ విషయాలపై ఎవరు అరెస్టవుతున్నారు? కేసులు ఎవరి మీద జరుగుతున్నాయి? అనే దాని మీద కంటే దేశ సంపద ఎలా ఈ అవినీతి రాజకీయవేత్తల వల్ల కొల్లగొట్ట బడుతుంది? దేశం ఎలా తాకట్టులోకి వెళుతుంది? అనే విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎస్సీ బీసీ మంత్రులు కమ్మ, రెడ్డి ఆధిపత్యంలో నేరానికి గురౌతున్నారని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కమ్మా రెడ్డి పెట్టుబడిదారీ రాజకీయ దోపిడీ యుద్ధం అయినప్పటికీ కూడా రెండు వర్గాల వల్ల నష్టపోతున్నది దళిత బహుజనులే అని గుర్తించాలి. 



920 కిలోమీటర్ల సముద్ర తీరం కలిగిన కోస్తా తీర ప్రాంత వాసులైన బెస్తలు, యాదవులు, దళితులు, అగ్ర కులాలకు చెందిన కొందరు రైతులు కూడా ఈ మోసపూరితమైన చర్యల వల్ల తమ జీవన వ్యవస్థను కోల్పోయారు. 2007లో ప్రపంచ స్థాయిలో ఒక నౌకాశ్రయాన్ని, పారిశ్రామికవాడను నిర్మిస్తామని వాన్‌పిక్ ప్రాజెక్టును వ్యూహాత్మకంగా ప్రారంభించారు. మొదట ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, యుఏఇ లోని రస్-అల్-ఖైమా సంస్థకు మధ్య ఒప్పందం కుదిరింది. రస్-ఆల్-ఖైమా ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ యుఏఇ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించింది. ఈ ఒప్పందం కుదిరిన వెంటనే ఆ ప్రాజెక్టులో 49 శాతం ఈక్విటీతో భారతీయ భాగస్వామిగా ఎమ్ఈహెచ్‌పీఎల్ చేరింది. 



గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కారిడార్‌లను, ఓడరేవులను నిజాంపట్నం నౌకాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించి బదలాయించే పద్ధతిని ఈ సంస్థలు చేపట్టాల్సివుంది. ఈ సంస్థ నిజానికి మొత్తం 'వాన్ పిక్' ప్రాజెక్టును ఎంఇహెచ్‌పిఎల్ - ప్రక్రియల సంయుక్త సంస్థ అయిన వాన్‌పిక్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (విపిపిఎల్) అభివృద్ధి చేయాల్సి ఉంది. కాగా ప్రసాద్ ఇంతలో తన చెప్పుచేతల్లో ఉండేలా 'వాన్ పిక్ ప్రాజెక్ట్ లిమిటెడ్' పేరిట సమాంతరంగా మరో సంస్థను సృష్టించారు. 'వాన్ పిక్' ప్రాజెక్టు పేరుతో ఆ కొత్త సంస్థ ఇప్పటిదాకా దాదాపు 13 వేల ఎకరాల భూమిని చేజిక్కించుకుంది. 



నిమ్మగడ్డ ప్రసాద్ ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో భూములు అపహరించి ఏ విధమైన నిర్మాణాలు చేయకపోవడం వల్ల దళిత బహుజన రైతులు అటు ఉద్యోగాలు లేక, ఇటు ఆ పరిశ్రమల ద్వారా వచ్చే ఉపాధి లేక దిక్కులేని వారయ్యారు. దీని వలన పదిమంది పారిశ్రామిక వేత్తలు, పదిమంది రాజకీయవేత్తలు బాగుపడితే ప్రయోజనం ఏమిటి? ఇందుకేనా ఇంగ్లీషు వాళ్ళ మీద మనం పోరాడి స్వాతంత్య్రం తెచ్చుకొంది? డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగంలో దేశసంపదను గూర్చి, సహజ వనరుల సంరక్షణ గూర్చి తెలిపిన అంశాలు మృగ్యమవ్వాల్సిందేనా? ఇక దళిత బహుజనులు ఆలోచించాల్సిన విషయం. 



కోస్తా తీర ప్రాంతంలో అనేక భూముల్ని వివిధ కంపెనీలకు ప్రభుత్వాలు ధారాదత్తం చేయడం సబబేనా? విశాఖపట్నంలో ఫార్మా సిటీకి 2,143 ఎకరాల భూమిని కేటాయించిన విషయంలో రాంకీ సంస్థ రూ.113.74 కోట్లు ఆయాచిత ప్రయోజనం పొందడం అందుకుగాను జగతి పబ్లికేషన్స్‌కు రూ.10 కోట్లు వచ్చి చేరడం వంటివి చూస్తే స్వప్రయోజనం కోసం వివిధ పెట్టుబడిదారీ సంస్థల్ని పెంచి పోషించి, అక్రమ లావాదేవీలకు పెద్ద పీట వేసి, చిన్న చిన్న సంక్షేమ పథకాలతో పెద్ద ప్రచారాన్ని చేసుకున్న రాజశేఖరరెడ్డి బండారం మరింత బయటకు వస్తుంది. అయితే రాజశేఖరరెడ్డి మరణాన్ని ఒక సెంటిమెంటుగా చూస్తున్న దళిత బహుజనులు అసలు మొత్తం వ్యవస్థలోనే దళిత బహుజనులు జీవించే హక్కు రద్దయ్యే ప్రమాదం వుందని, ఇది చాలా ప్రమాదకరంగా మారుతుందనే విషయం 2004-05లో యిచ్చిన సెజ్‌లను చూస్తే మనకు అర్థమౌతుంది. 



2004-05 నుంచి సెజ్‌ల కోసం 80వేల ఎకరాలను సేకరించింది. దీనితో సంబంధం లేకుండా ప్రభుత్వం మరో 30 వేల ఎకరాలను సేకరించింది. ఇందులో 70 వేల ఎకరాలను ఐదు సెజ్‌ల కోసం సేకరించారు. దానిలోంచి 50వేల ఎకరాలను కేవలం వాన్‌పిక్, కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి, లేపాక్షి నాలెడ్జ్ హబ్, సత్యవేడు సెజ్, కృష్ణ పట్నం ఇన్‌ఫ్రా సెజ్‌కు అప్పగించారు. 



ఈ సెజ్‌ల మూలంగా మొత్తంగా నష్టపోయింది దళిత బహుజన రైతులే. మూలవాసుల్ని దెబ్బతీసే ఈ చర్యలను కేవలం రాజకీయంగా చూడటానికి వీలులేదు. ఆంధ్రుల ఆర్థిక సామాజిక సంస్కృతి అంతా భూమి, నీరు, ఖనిజ సంపద, అడవుల మీద ఆధారపడి వుంది. సముద్రతీరాన్ని ఎస్సీ, బీసీలు అడవులను ఎస్సీ, ఎస్టీలు ఆధారం చేసుకొని బతుకుతున్నారు. వారికి మూలాధారమైన సంపదను కార్పొరేట్ సంస్థలకు, మల్టీనేషనల్ కంపెనీలకు అమ్ముకుంటూ వారిని మధ్యతరగతిగా మారుస్తామని, కాలనీలను కట్టిస్తామని పరిశ్రమలు నిర్మించి ఉద్యోగ వసతి కల్పిస్తామని బూటకపు మాటలు చెప్పారు; 



పెట్టుబడుదారులకు అనుకూలంగా జీ.ఓ.లను విడుదల జేస్తూ సామాజిక ఆర్థిక దోపిడీకి గురౌతున్న ప్రతి అంశం మీద వ్యక్తులకతీతంగా నేర పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ భూములను తిరిగి ప్రజలకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించాలి. నిజానికి ఈ దోపిడీకి బీజం మన రాష్ట్రంలో చాలాకాలం క్రితమే పడింది. అందుకు కారకుడైన ముఖ్యమంత్రి ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన చంద్రబాబు. 2002లో రాంకీ సంస్థకి 3,148 ఎకరాలను చంద్రబాబు అప్పగించిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. దళిత బహుజనులకు న్యాయం జరగడం ఆయనకు ఇష్టంలేని విషయం. 



దాదాపుగా నిరాస్తిపరుడైన ఈ వ్యక్తి మూడు దశాబ్దాలలో అపర కుబేరుడు ఎ లా అయ్యారు? పిసిసి ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయ ణ ఆనాడు వైఎస్‌కు ఆంతరంగికుడు. దళిత బహుజనుల సంపద కుదువపెట్టడంలో తన నాయకుడికి తోడునడిచిన వాడే. చంద్రబాబు పాలనలో కమ్మ వారిలో నయా పెట్టుబడిదారీ వర్గం స్థిరపడింది. ఈ అంశాలు కూడా సిబిఐ ద్వారా బయటకు రావాల్సివుంది. నేరపరిశోధనా సంస్థలు రాజకీయ ప్రాబల్యాలకు, అధికారాలకు గురికాకుండా తప్పక స్వతంత్ర ప్రతిపత్తిని సంపాదించవల్సివుంది. 



లోక్‌పాల్ బిల్లులో ఈ అంశం కూడా పరిశీలనలో ఉంది. ఎవరు ప్రభుత్వంలోఉంటే సిబిఐ వారికి అనుకూలంగా ప్రవర్తిస్తుందనే వాదనలు ఉన్నాయి. ఒక కులాధిపతి తీర్పును కప్పిపుచ్చడానికి ఒక మీడియా, మరో కులాధిపతిని కాపాడడానికి మరొక మీడియా ప్రయత్నిస్తున్న సందర్భంలో నిర్ధారితాంశాలు పాక్షికంగానే ప్రజల్లోకి వెళుతున్నాయి. నిజానికి సీమాంధ్ర నుంచి పాలించిన ముఖ్యమంత్రులు తెలంగాణకే కాదు సీమాంధ్ర దళిత బహుజనులకు పెద్ద ఎత్తున సామాజిక ద్రోహం చేశారు. అవి సెంటిమెంట్స్‌తో మాఫీ చెందే విషయాలు కాదు. 



ఆంధ్రప్రదేశ్ ఈనాడు అవినీతికి అడ్డాగా మారిపోయింది. వీరి అక్రమాల వల్లనే తెలంగాణ డిమాండ్ కూడా ముందుకు వచ్చింది. అగ్రకుల రాజ్యాధికార స్వభావాన్ని దళిత బహుజనులు అర్థం చేసుకోవల్సిన అవసరంవుంది. ఆర్థిక నేరాలు, రాజకీయ హత్యలు, అబద్ధప్రచారాలతో ఇప్పుడు నడుపుతున్న కార్పొరేట్ రాజకీయాల స్వభావాన్ని అర్థం చేసుకోవల్సిన చారిత్రక సందర్భం ఇది. అమాయకత్వం వల్ల, బలవంతుల వల్ల ఈ రాజకీయ దోపిడీదారుల వల్ల నష్టపోయినవారు ఎక్కువ మంది బడుగులే. అనంతపురం జిల్లాలోని లేపాక్షి నాలెడ్జి హబ్ కోసం, చిలమత్తూరు మండలంలో 16,608 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. 



అందులో 3,330 దళిత బహుజన కుటుంబాల 8800 ఎకరాలు భూములను తక్కువ రేట్లకు బలవంతంగా ప్రభుత్వాధికారులు ఉపయోగించుకున్నారు. ఈ బోర్డర్ జిల్లా నుంచి ఎందరో దళిత బహుజనులు జీనవోపాధి లేక వలసపోయారు. ఓబుళాపురం మైనింగ్‌లో బిపి ఆచార్య అక్రమాలకు అంతులేదు. గచ్చిబౌలిలో అత్యంత ఖరీదైన 258 ఎకరాల భూమిని కారు చౌకకు కొన్న ఎమ్మార్ ప్రాపర్టీస్ చదరపు గజం 40వేల రూపాయలు చొప్పున అమ్మింది. ఈ ప్రక్రియల కథకు అంతులేదు. రాజకీయనాయకులు ప్రభుత్వాధికారులు దేశసంపదను ఇలా దోపిడీచేస్తూ పోతూ దళిత బహుజనులు జీవించే హక్కును కాలరాస్తున్నారు. మరో స్వాతంత్య్రం కోసం ప్రజలు పోరుచేసే పరిస్థితులు మన ముందుకు వస్తున్నాయి. 



ఈ పరిస్థితుల్లో అగ్రకుల రాజ్యాధికార దోపిడీ పరిస్థితులను అర్థం చేసుకొని ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కోసం అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగాన్ని, రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల్ని సూత్రాల్ని రక్షించుకోవడం కోసం దళిత బహుజనులు పోరాడవలసిన చారిత్రక పరిస్థితి ముందుకు వచ్చింది. అన్ని వైరుధ్యాలు, అన్ని పోరాటాలను దళిత బహుజనులను సామాజిక ఆర్థిక, రాజకీయ పరిణామ దృష్టితో చూడడమే అంబేద్కర్ వాదం. ఇది కమ్మారెడ్డి రాజకీయ దోపిడీ శకం. దీనికి చరమ గీతం పాడాల్సింది దళిత బహుజనులే.
- డా. కత్తి పద్మారావు

Andhra Jyothi News Paper Dated : 31/05/2012

No comments:

Post a Comment