Thursday, May 10, 2012

తెలంగాణ గళంలో కాషాయ గరళం!---ఘంటా చక్రపాణి,



బీజేపీ గురించి ఈ తరం నాయకుల్లో చాలామంది కంటే డా. దాసోజుశ్రావణ్‌కే ఎక్కువగా తెలుసు. టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరోలో క్రియాశీలంగా ఉన్న ఈ యువనేత పూర్వాక్షిశమం లో కరుడుగట్టిన కాషాయ కరసేవకుడు. శ్రావణ్ మాతో పాటు ఉస్మానియా యూనివర్సిటిలో చదువుతున్నప్పుడు అఖిల ఏబీవీపీ మిలిటెంట్ నాయకుల్లో ముఖ్యుడు.ఆయన ఏబీవీపీనుంచి ఆర్ట్స్‌కాలేజీ విద్యార్థిసంఘం ప్రధానకార్యదర్శిగా గెలుపొందారు. 1985-90 మధ్యకాలంలో కొన్ని వామపక్ష విద్యార్ధిసంఘాలను ప్రభుత్వం నిషేధించింది. మరికొన్నిటిని నిర్మూలించడానికి ఏబీవీపీ ప్రయత్నించేది. వామపక్ష, దళిత బహుజన విద్యార్ధి సంఘాలు, ఆ భావజాలంతో పనిచేసే విద్యార్థుల మీద ఏబీవీపీ ఆధ్వర్యం లో అనేక దాడులు జరిగేవి.ఆయనకు ఆకాలంలో అగ్రక్షిశేణి బీజేపీ నాయకులతో సన్నిహిత సంబంధాలుండేవి. అదే శ్రావణ్ ఇప్పుడు బీజేపీ రాజకీయాలను ఏవగించుకుంటున్నాడు. మతతత్వ, ప్రాంతీయ అవకాశవాద పార్టీ అని, నిండుకుండ లాంటి తెలంగాణ ఉద్యమంలో విషపుచుక్క అని బీజేపీపై విరుచుకుపడ్డారు. శ్రావణ్ మాటలను రాజకీయ ప్రేలాపనలుగా కొట్టిపారేయలేము. ఎందుకంటే ఆయన సంప్రదాయ రాజకీయ వాదికాదు. ఎంబీఏతో పాటు ఎంఏ, పీహెచ్‌డీ చేసిన శ్రావణ్ కొంతకాలం ఆధ్యాపకుడుగా ఉన్నా డు. ఆ తరువాత ప్రముఖ కార్పొరేట్ కంపనీలలో పనిచేసేవాడు.సామాజిక న్యాయం నినాదానికి ఆకర్షితుడై ప్రజారాజ్యంలో చేరిన శ్రావణ్ ఇప్పుడు తెలంగాణాతోనే అది సాధ్యమని నమ్ముతున్నాడు. ఆ నమ్మకంతోనే ఎన్ని ఒడిదుడుకులున్నా టీఆర్‌ఎస్‌లో కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. బీజేపీ కుల, మతవాద ధోరణి తెలంగాణవాదానికీ, సామాజిక న్యాయానికి పెనుముప్పుగా మారిందని అంటున్నారు.ఆయనొక్కరే కాదు, జాతీయవాద పార్టీగా బీజేపీని అభిమానిస్తోన్న వాళ్ళు, సంఘ్ పరివార్ పట్ల గౌరవం ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీ రాజకీయ ఎత్తుగడలపట్ల ఆందోళన చెందుతున్నారు. ఇది బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్య నాయుడు, ఆయన శిష్యుడు కిషన్‌రెడ్డి రాజేసిన కుంపటి అని వారి వాదన. ఆ కుంపటి ఇప్పుడు తెలంగాణ జేఏసీలో పొగపెడుతోంది. ఇది చాలా మంది తెలంగాణ వాదులను కలవరపెడుతోంది. 

బీజేపీ పన్నెండేళ్ళ క్రితం కాకినాడలో కాగితంమీద రాసి పెట్టడం మిన హా సంస్థాగతంగా తెలంగాణ కోసం ఎన్నడూ పోరాడింది లేదు. 2004 దాకా కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ఎన్నడూ తెలంగాణ ఊసే ఎత్తలేదు. తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ఆ పార్టీ అగ్రనాయకత్వం భావించింది.తెలంగాణ ఉద్యమం 2009 లో ఊపందుకున్న తరువాత ఆ పార్టీ గుంపులో గోవింద అన్నట్టుగా ఉద్యమానికి జైకొట్టింది. అడపాదడపా ఆ పార్టీ శ్రేణులను బహిరంగ సభలకు తరలించి బలోపేతం అయ్యే ప్రయత్నాలు చేసింది. బీజేపీకి ఎన్నడూలేని జనామోదం లభించడానికి ఆ పార్టీ సొంత ఎజెండా పక్కకుపెట్టి తెలంగాణ జేఏసీలో చేరడం కారణమయింది. తెలంగాణ జేఏసీకి ఉన్న విశ్వసనీయత మొత్తం తెలంగాణ సమాజాన్ని కులమతాలకు అతీతంగా, రాజకీయ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా అందరినీ ఏకం చేయడానికి దోహదపడింది. సిద్ధాంతపరంగా బద్ధ శత్రువులుగా ఉండే నక్సలైటు పార్టీలు, ప్రజాసంఘాలతో బీజేపీ చేతులుకలిపి పనిచేయాల్సిన పరిస్థితి తెచ్చింది. అప్పటిదాకా మతతత్వ రాజకీయాలు నడిపే పార్టీగా ఉన్న బీజేపీ, తెలంగాణ ఉద్యమ పార్టీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. 

చాలా మంది ఆ పార్టీని అంగీకరించే స్థితికి వచ్చారు. కేవలం తెలంగాణ సాధనే తప్ప మరో ఎజెండా లేని నాయకత్వం, దానికోసం సంఘటిత శక్తిగా కదిలిన ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, పౌర సమాజం వెన్నెముకగా ఉంటూ జేఏసీని నిలబెట్టాయి. ఆ పార్టీ తెలంగాణ కోసం చిత్తశుద్ధిగా పోరాడుతున్నదని నమ్మడం వల్లే నిజామాబాద్‌లో డి.శ్రీనివాస్‌ను కాదని ముస్లింలు కూడా జేఏసీ పై విశ్వాసంతో బీజేపీకి పట్టం కట్టారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మినారాయణ ముస్లిం వీధుల్లో తలపై టోపీ పెట్టుకుని కేసీఆర్, కిషన్‌డ్డితో కలిసి ఊరేగితే ప్రజలు నిజంగానే నమ్మారు. కానీ జేఏసీ కార్యక్షికమాల్లో, ప్రజా ఉద్యమ క్షేత్రంలో బీజేపీ కదలికలను నిశితంగా గమనించిన వారికి బీజేపీ పట్ల పెద్ద నమ్మకం ఎప్పుడూ లేదు. 
బీజేపీ కూడా టీడీపీ లాగే రెండు కళ్ళ సిద్ధాంతాన్నే పాటించింది. ఆ పార్టీ తరపున రాజేశ్వర్‌రావు, విద్యాసాగర్‌రావు, దత్తావూతేయ, లక్ష్మణ్‌లాంటి వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడితే కిషన్‌రెడ్డి మాత్రం వెంకయ్యనాయు డు కనుసన్నల్లో పనిచేస్తూ వచ్చారు. ఉద్యమం ఉధృతంగా ఉన్నరోజుల్లో బీజేపీ ఒకవైపు జేఏసీలో ఉంటూనే కార్యక్షికమాలకు దూరంగా ఉన్న సందర్భాలూ ఉన్నాయి. బతుకమ్మ ఆడడంలో ఆసక్తిగా పాల్గొన్న బీజేపీ శ్రేణులు సహాయ నిరాకరణ, సకలజనుల సమ్మె సందర్భంగా ప్రత్యక్ష కార్యాచరణకు దూరంగా ఉన్నాయి. రైల్‌రోకో సందర్భంగా టీఆర్‌ఎస్, టీ-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర నాయకులు అరెస్ట్ అయినప్పుడు బీజేపీ అగ్రనాయకులు ఎక్కడా కనిపించలేదని ఉద్యమాన్ని పరిశీలించిన వారికి అర్థమవుతోంది. అలాగే జేఏసీ పిలుపు మేరకు అందులో భాగస్వామ్య పక్షాల ప్రతినిధులంతా రాజీనామా చేసిన సందర్భంలో కూడా కిషన్‌డ్డి రాజీనామా చేయలేదు. 


జగన్ నిజామాబాద్ వచ్చినప్పుడు ఆయనను నిలదీయాలన్నా, చంద్రబాబును పాలకుర్తి రాకుండా అడ్డుకోవాలన్నా బీజేపీ స్పందించలేదు. పైగా అది తమ విధానం కాదని తప్పించుకున్నది. మహబూబ్‌నగర్ ఎన్నికలకు ముందు యాత్రచేసే దాకా ఆయన పెద్దగా ఉద్యమంలో లేరు. కనీసం ఉద్యమంలో పాల్గొని కేసుల పాలయిన వారిని విడిపించడంలో, నిరాశతో ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు మనోధైర్యం నింపడంలో ఆ పార్టీ నిర్లిప్తతే దీనికి నిదర్శనం. ఆంధ్రాలో జై ఆంధ్రా నినాదంతో ముందుకు వెడతామని చెప్పిన ఆ పార్టీ మూడేళ్ళు గడుస్తున్నా ఒక్క అడుగు కూడా వేయలేకపోయింది.నిజానికి జై ఆంధ్రా ఆపార్టీ విధానం అయితే ఇప్పటికే అటువంటి నిర్మాణం, కార్యాచరణకు పూనుకుని ఉండాలి. భావ సారూప్యం ఉన్న రాజకీయ సంస్థలు, పౌర సమాజంతో అక్కడ కూడా ఒక జేఏసీ ఏర్పాటు చేసుకుని ఉండాల్సింది. కనీసం అక్కడ ఆంధ్ర రాష్ట్రంకోసం పోరాడుతున్న దళిత బహుజన సంఘాలకు బాసటగా ఉండాల్సింది. కొవ్వూరులో పోటీ చేసి తమ వాదనను వినిపించి ప్రజలను ఆదిశగా చైతన్యవంతులను చేయాల్సింది. ఆప్రాంతంలో తన కులంలో ఆదరణ ఉన్న వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో ఒక మహాకూటమి ఏర్పాటు చేయాల్సింది.ఇవేవీ ఆ పార్టీ చేయలేదు. ఈ విషయంలో సీపీఐని, ఆపార్టీ అధినేత నారాయణను అభినందించాలి. ఆయన ఎక్కడైనా, ఎప్పుడైనా ఒకే నాలుకతో మాట్లాడారు. జేఏసీలో భాగం కాకపోయినా అన్ని సందర్భాల్లోనూ సీపీఐని ప్రజలపక్షాన నిలబడేలా చూశారు. ఇలాంటి విమర్శలు వచ్చిన ప్రతిసారీ బీజేపీ సుష్మాస్వరాజ్ పార్లమెంటు ప్రసంగాన్ని గురించి చెపుతుంటారు.


అది నిజమే, ఆమెకు స్పీకర్ అవకాశం వచ్చినప్పుడు తెలంగాణ సమస్యను అద్భుతంగా ఆవిష్కరించి అందరినీ ఆకట్టుకున్నది. అందు కే ఆమె తెలంగాణ ప్రజలకు దగ్గర కాగలిగారు. కానీ అన్నా హజారే అవినీతి అజెండాకోసం నెలలతరబడి పార్లమెంటు జరుగకుండా అడ్డుకున్న పార్టీ తెలంగాణ కోసం నిరవధికంగా పార్లమెంటును ఎందుకు స్తంభింప చేయలేక పోయింది? బీజేపీ ఎంపీల్లో వందమంది ఒక్కసారిగా లేచి నిలబడితే నిజంగానే ప్రభుత్వానికి ముచ్చెమటలు పడతాయి. కానీ ఆపార్టీ అలా చేయలేదు. 2014 దాకా చేయదు కూడా! ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలలాగే ఈ సమస్య 2014 దాకా మిగిలి ఉండాలని కోరుకుంటోంది. 2014ఎన్నికల్లో తెలంగాణలోని అన్నిస్థానాల్లోఒంటరిగానే పోటీ చేస్తాం అని ఆ పార్టీ నేత కిషన్‌డ్డి ప్రకటించారు. మహబూబ్‌నగర్ విజయం తరువాత ఆయనలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది.నిజానికి అప్పటినుంచే ఆ పార్టీ తప్పటడుగులు మొదలయ్యాయి. మహబూబ్‌నగర్ గెలుపు పూర్తిగా తనదేనని బీజేపీ భ్రమ పడుతున్నది. మహబూబ్‌నగర్‌లో బీజేపీ బలం కన్నా ఎన్నం శ్రీనివాసడ్డికి ఉన్న బలగం ఎక్కువ ప్రభావం చూపింది. శ్రీనివాసడ్డి పోటీ చేసే నాటికి ఆయనకు బీజేపీ సభ్యత్వం కూడా లేదు. ఆయన కరుడుగట్టిన తెలంగాణావాది. కేంద్రప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో చేరి టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. కేసీఆర్‌తో విభేదించి బయటకు వెళ్ళినా పార్టీ శ్రేణులతో సాన్నిహిత్యం కొనసాగిం చారు. టీఆర్‌ఎస్ పట్ల అక్కడక్కడా ఉన్న అసంతృప్తిని కూడా అనుకూలంగా మలుచుకున్నారు. 


ఆయనకు అక్కడ సామాజికంగా పెద్ద బలగమే ఉన్నది. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న ఎన్నంను బీజేపీఅభ్యర్థిగా ఎంచుకుంది. ఇదే మహబూబ్‌నగర్ జేఏసీ రెండుగా చీలిపోవడానికి కారణం అయింది. అక్కడి జేఏసీలో వామపక్ష భావాలున్న విద్యావంతులు ఉన్నట్టే ఆధిపత్య కులరాజకీయాలు నడిపే వాళ్ళూ ఉన్నారు. బీజేపీ శ్రీనివాసరెడ్డి బలంతో పాటు ఆయన కులాన్ని కూడా ఆయుధంగా వాడుకున్నది. అక్కడ పోటీ చేసిన అభ్యర్థుల్లో ఆయన ఒక్కరే రెడ్డి కావడం కలిసి వచ్చింది. ఇక రెండోది మతం.టీఆర్‌ఎస్ ముస్లిం అభ్యర్థిని రంగంలో దింపే సరికి బీజేపీ తన పాత మతవాదానికి పదునుపెట్టింది. కాషాయం పులుముకుని కిషన్‌రెడ్డి కాస్తా లాల్‌కిషన్ అద్వానీగా మారిపోయా రు. ఈ ఎన్నికను ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌తో పోల్చారు.ఆయనకు ముస్లిం సోదరుల్లో రజాకార్లు కనిపించారు. ఎన్నికల్లో గెలిచారు కానీ రెండేళ్లపాటు బీజేపీ నేతలు ఉద్యమంలో ఉంటూ పార్టీకి సమకూర్చిన సరికొత్త ఉదార రూపాన్ని మాత్రం చెరిపేసుకున్నారు. ఇప్పుడు ఆపార్టీ తెలంగాణ సాధనకు, ఉద్యమ సామాజిక న్యాయ ఎజెండాకు భిన్నంగా నడుస్తోంది. అందుకే పరకాలలో మరో శ్రీనివాసడ్డి కోసం గాలిస్తోంది. ఇప్పుడు ఆ పార్టీ చిన్నాచితక నేతలు కూడా సకల జనుల సమ్మె విరమణను తప్పుపడుతున్నారు. ప్రాంతీయ పార్టీలతో తెలంగాణ రాదనే వాదన లేవనెత్తుతున్నారు. శాసనసభకు జరిగే ఉపఎన్నికల్లో జాతీయ పార్టీ అవసరం ఏమిటో అర్థం కాదు. లోక్‌సభలో 114 మంది సభ్యులున్నా ఏమీ చేయలేకపోతున్న ఈ పార్టీ ఆంధ్రవూపదేశ్ అసెంబ్లీలో నాలుగో సభ్యుడు గెలిస్తే తడాఖా చూపిస్తామని చెప్పడం నమ్మశక్యంగా లేదు. బీజేపీ వైఖరి తెలంగాణవాదుల్లో ఆందోళన కలిగిస్తున్నది. భాగస్వామ్య పార్టీల ఈ ఆధిపత్య పోరు జేఏసీ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నది. ఇంతకాలం మీడియా గుసగుసలకే పరిమితమైన ఈ విభేదాలు ఇప్పుడు బహిరంగమయ్యాయి. బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మాటల యుద్ధమే దానికి అద్దంపడుతోంది.

మహబూబ్‌నగర్ లో బీజేపీ ప్రదర్శించిన దూకుడే ఇప్పుడు పరకాలలో టీఆర్‌ఎస్ ప్రదర్శిస్తున్నది. కచ్చితంగా వరంగల్ జిల్లా టీఆర్‌ఎస్‌కు, తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టు. మహబూబ్‌నగర్‌లో జేఏసీ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన బీజేపీ ఇప్పటికైనా పరకాల నుంచి విరమించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరిమీదయినా పోటీకి దిగొచ్చు. కానీ జేఏసీలో చేరిన పార్టీలు సమష్టిగా తెలంగాణ కోసం ఉద్యమిస్తామని, ఉద్యమ వ్యతిరేక శక్తులమీద యుద్ధం చేస్తామని చెపుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఒకరిమీద ఒకరు యుద్ధానికి దిగి ప్రజలను అయోమయంలో పడేస్తున్నాయి. ఇంతకాలం తమకు నీడనిచ్చిన చెట్టును తామే నరికేసుకుంటున్నాయి. జేఏసిని రద్దు చేస్తారని, కోదండ రామ్‌ను చైర్మన్ పదవినుంచి తప్పిస్తారని వార్తాకథనాలు వ్యాపిస్తున్నాయి. జేఏసీ అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రతిఫలించే వేదిక. దాన్ని రద్దు చేయడమంటే తెలంగాణ ఉద్యమాన్ని రద్దు చేయడమే. ఆ హక్కు ఏ ఒక్కరికీ ఉండదు. సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నా తెలంగాణ సమష్టి, జన ఆకాంక్షకు అధికారిక ప్రతినిధిగా నిలబడ్డ వ్యక్తి కోదండ రామ్. ఆయన జేఏసీ ఏర్పడ్డాక ఉద్యమంలోకి వచ్చిన వ్యక్తికాదు. మలిదశ ఉద్యమానికి పునాది వేసిన వారిలో ఒకరు. కీలకమైన సమయంలో ఉద్యమ రథానికి సారధిగా ఉన్న కోదండరామ్‌ను తొలగించే అధికారం కూడా ఎవరికీ లేదు. ఈ పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు జేఏసీ సూచన మేరకు నడుచుకోవాలి. లేదంటే ఎవరిదారి వాళ్ళు చూసుకోవాలి. ఉద్యమాన్ని విషతుల్యం చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు! 

సమాజ శాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు
ghantapatham@gmail.com

Namasete Telangana News Paper Dated : 11/05/2012 

No comments:

Post a Comment