Friday, July 13, 2012

హాస్టళ్ల దుస్థితి మారేదెన్నడు?----కె. బాలరాజ్


రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల సంక్షేమ హాస్టళ్లలో సకల సదుపాయాలు కల్పిస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసింది. దీనికోసం మంత్రులు, ఎమ్మెల్యేలు నెలకోసారి హాస్టళ్లలోనే బసచేయాలని ఆదేశించింది. పదిమంది విద్యార్థులకో స్నానాల గది, ఒక్కో విద్యార్థికి నాలుగు జతల బట్టలు, పౌష్ఠికాహారం అందిస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. వీటి లో ఏదీ అమలు కాలేదు. కాకుంటే.. తమ ప్రచారానికి పనికొస్తుందని కొందరు ఎమ్మెల్యేలు హాస్టళ్లలో రాత్రిపూట పడుకుని పేపర్లలో ఫోటో వేయించుకుని సంబరపడ్డారు. కానీ విద్యార్థులకు ఒరిగింది ఏమీ లేదు. సమస్యలేవీ పరిష్కరించబడలేదు. కొన్నేళ్లుగా విద్యార్థుల సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. గతంలో కన్నా ఇప్పుడు మరింత తీవ్రమయ్యాయి.

రాష్ట్రంలో దాదాపు ఐదువేలకుపైగా హాస్టళ్లలో లక్షలాదిమంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాలనుంచి వచ్చిన విద్యార్థులు హాస్టళ్లలో ఉంటున్నారు. వీరికి కనీస వసతులు కూడా లేక అనేక అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో సగానికి పైగా హాస్టళ్లకు స్వంత భవనాలు లేవు. అద్దె భవనాలలో ఉన్న హాస్టళ్లలో కనీస వసతులు లేక విద్యార్థులు నానా తిప్పలు పడుతున్నారు. మరుగుదొడ్లు, స్నానపు గదులు, విద్యుత్తు లాంటి సౌకర్యాలు లేక విద్యార్థులు సతమతమవుతున్నారు. వీటికితోడు వార్డెన్ల నిర్లక్ష్యం తోడై విద్యార్థులకు సంబంధించిన ఏ సమస్యా పరిష్కారం కాకుండా ఉంటున్నాయి. హాస్టళ్లలో పరిశువూభత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దీంతో చాలామంది వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులకు గురవుతున్నారు. విద్యార్థుల బాగోగులు చూడాల్సిన వార్డెన్ పట్టించుకున్న పాపాన పోవడంలేదు. దీంతో.. సంక్షేమ హాస్టళ్లం నరకకూపాలకు నకళ్లుగా తయారయ్యాయి.

ఇంటర్‌మీడియేట్ ఆ పైస్థాయి విద్యార్థులకు కనీసం 2600 కేలరీల శక్తిని ఇవ్వగల ఆహారం అందించాలి. కానీ మన ప్రభుత్వం 1100 కేలరీల ఆహారం మాత్రమే అందిస్తున్నది. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో మూడు నుంచి ఏడో తరగతి చదివే విద్యార్థులకు మూడు పూటల భోజనానికి గాను విద్యార్థులకు కేవలం రూ.15.50 పైసలు ఇస్తున్నది. ఇంటర్ చదువుతున్న వారికి రూ.17.54 పైసలు ఇస్తున్నది.

నిత్యావసర వస్తువులు, సరకుల ధర లు చుక్కలనంటిన నేపథ్యంలో ప్రభుత్వం మంజూరు చేస్తున్న డబ్బులతో మూడు పూటలా భోజనం ఎలా పెడతారో వారికే తెలియాలి. ప్రభుత్వం ఇస్తున్న ఈ చాలీచాలని డబ్బులతోనే విద్యార్థులకు నీళ్లలాంటి చారు, పురుగుల అన్నం పెడుతున్నారు. ఇలాంటి కలుషిత ఆహారం, పోషక విలువలు మచ్చుకైనా లేని ఆహారంతో విద్యార్థులు అనేక రోగాల పాలవుతున్నారు.
విద్యార్థులకు పౌష్ఠికాహారం అందిస్తున్నామని, ‘మెనూ’ ప్రకారం హాస్టళ్లలో భోజనం ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది. కానీ.. ప్రభుత్వం ఇస్తు న్న అరకొర నిధులతో ఏరకమైన మెనూ అమలుచేస్తారో చెప్పకనే చెబుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచి ఇచ్చినప్పుడే విద్యార్థులు చదువుకో గలుగుతారు. ఇక సంక్షేమ హాస్టళ్ల బాగోగుల గురించి హాస్టళ్లవారిగా కమిటీలు వేయాలని వారి పర్యవేక్షణలో హాస్టళ్లు పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. చాలా వరకు హాస్టళ్లలో కమిటీలే వేయలేదు. వేసినవి కూడా కాగితాలకే పరిమిత మై ఏ ఉపయోగం లేకుండాపోయాయి. హాస్టల్ కమిటీ కర్తవ్యాలు, బాధ్యతల గురించి ఎంతో గొప్పగా చెప్పినా.. అవేవీ ఆచరణలో అమలు కావడం లేదు.

రాష్టంలోని సగానికిపైగా హాస్టళ్లు వార్డెన్లు లేకుండానే నడుస్తున్నాయి. ఇన్‌చార్జీలతో హాస్టళ్లు నడిపిస్తున్నారు. దీనితో విద్యార్థుల సమస్యలు ఏవీ తీరడం లేదు. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా.. హాస్టళ్లన్నింటికీ వార్డెన్లను నియమించి వారు సమర్థవంతంగా పని చేసేలా చూడాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలను, ఉపకార వేతనాలను పెంచాలి. ప్రతి విద్యాసంవత్సరం ఆరోగ్య ఖర్చులకు గాను వెయ్యి రూపాయలు ఇవ్వాలి. హాస్టల్ విద్యార్థులకు సంబంధిత వార్డెన్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడే.. సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టగలుగుతారు.
-కె. బాలరాజ్
ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు
Namasete Telanagana News Paper Dated :14/07/2012 

No comments:

Post a Comment