Friday, October 26, 2012

కూడంకుళం: శేష ప్రశ్నలు--సుజాత సూరేపల్లి



దేశంలో ప్రజలు ఇవాళ ఉద్యమాల బాట పడుతున్నారు. వనరుల దోపిడీ, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించిన వారిని ఎదో ఒక పేరు పెట్టి నిర్బంధానికి గురి చేయడం జరుగుతున్నది. అది కూడంకుళం లాంటి పెద్ద అణు రియాక్టర్ పరిక్షిశమలు కావొచ్చు, ప్రత్యేక ఆర్థిక మండలాలు(సెజ్ ),బొగ్గు, గ్రానైట్, ఇనుము, బాక్సైట్,యురేనియం లాంటి ఖనిజ తవ్వకాలు కావచ్చు. పోర్టులు, ప్రాజెక్టులు, రోడ్లు, ఎఫ్‌డిఐ లాంటి పథకాల పేరుతో సాగుతున్న విధ్వంసాన్ని ప్రశ్ని స్తూ ఉద్యమిస్తే,చాలు వారిని జైలుకి పంపడం పరిపాటి అయిపోయింది. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వేధించడం నిత్యకృత్యమైంది. 
తమిళనాడులోని అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఉద్యమకారుల మీద, వేలాది మంది ప్రజలమీద అక్రమ కేసులు బనాయించి జైళ్లలో పెట్టా రు. మార్చి 2011లో జపాన్‌లోని ఫుకుషిమ అణువిద్యుత్ విస్ఫోటనం వల్ల జపాన్ విల విలలాడింది. ఇప్ప ట్లో ఆ దుష్ర్పభావం నుంచి బయటపడేటట్టు లేదు. ప్రపంచ చరిత్రలోనే ఇది అత్యంత ప్రమాద కరమైన సంఘటనగా సాంకేతిక నిపుణులు గుర్తించినరు. జపాన్ ప్రభుత్వం ఇది హిరోషిమా కంటే 168 రెట్లు ప్రమాదకరమైనదని అధికారికంగా ప్రకటించి, జపాన్‌లోఉన్న 54 రియాక్టర్లను మూసేశారు. ఈ ఘటన తరువాత లక్షా యాభై వేలమంది దూర ప్రాంతాలకు పారిపోయి తలదాచుకున్నారు. బహుశా కొన్ని దశాబ్దాలు దీని ప్రభావం ఉండొచ్చు. 

టెక్నాలజీలో ఎంతో ముందున్న జపాన్ ఇప్పడు తమ శక్తిని మరోసారి అంచనా వేసుకుంటున్నది .ఇతరదేశాలు కూడా వీటికి దూరంగా ఉంటున్నా యి. ఫుకుషిమ ప్రమాదంతో ప్రకృతి విధ్వంసం, గాలి నీరు కలుషితం, ఆహార ధాన్యాలపై పడ్డ ప్రభావంపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచానికి అణు రియాక్టర్ల వల్ల కలిగే నష్టాలు, లాభాల గురించి ప్రపంచ దేశాలు మల్లగుల్లాలు పడుతూనే ఉన్నాయి. ఇలాంటి పెద్ద ప్రమాదాల గురించి దూరదృష్టితో ఆలోచించి వీటిని అడ్డుకుంటున్నారు. 
కూడంకుళం 1988లో దివంగత రాజీవ్‌గాంధీ, మైకేల్ గోర్బచేవ్ మధ్యన జరిగిన ఒప్పందంతో కూడంకుళం అణు రియాక్టర్ నిర్మాణం ప్రారం భమైంది. కొద్ది రోజులు రష్యా రాజకీయ అనిశ్చితి కారణంగా, అటు తరువాత అమెరికా పెట్టిన అడ్డంకుల వల్ల ఆగి 2001 సెప్టెంబర్‌లో మొదలైంది.అప్పటి నుంచే దీనిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అనేక రూపాలలో నిరసనను తెలుపుతూ ఉద్యమం చేపట్టారు. 

మత్స్యకారులు, పేద ప్రజలు దీన్ని రేడియేషన్ ద్వారా జరిగే నష్టాలను తెలుసుకుని మరింత పట్టుదలతో ముందుకుపోతున్నారు. కోర్టులో కేసు కూడా వేశారు. కోర్టులో వేసిన పిల్ ప్రజలకు అనుకూలంగా వచ్చినా పట్టించుకొనే నాథుడు లేడు. ఉదయకుమార్ న్యూక్లియర్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమ కమిటీ నాయకుడిని అరెస్ట్ చేసి, వాళ్ళ సంస్థకు విదేశీ నిధులు వస్తున్నాయని, కొన్ని ఎన్‌జీవోలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపిస్తున్నాయని అనుమానం తో కేసులు పెట్టి, భయవూబాంతులకు గురిచేస్తున్నారు. 
ఈ నెల 11న కూడంకుళం అణు రియాక్టర్ పరిస్థితులను అధ్యయనం చేయడానికి వెళ్ళిన నిజ నిర్ధారణ కమిటీ సభ్యులైన విరసం, పౌర హక్కుల సంఘం, విద్యార్థి సంఘాలు మొదలగువారిని అరెస్ట్‌చేసి నాంగనేరి పోలీస్‌స్టేషన్‌లో విరసం కార్యదర్శి పి.వరలక్ష్మితోపాటు ఎనిమిది మందిపై అర డజన్‌కు పైగా కేసులు పెట్టా రు. ఈ కమిటీ సభ్యులు తమిళనాడులో మావోయిస్ట్ ప్రచారానికి వచ్చారని, ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి, వారి వద్దకు వచ్చే లాయర్లను కలువనీయకుండా, కార్యదర్శి వరలక్ష్మి ఫోటోను ఫేస్‌బుక్‌లో నుంచి తీసి మావోయిస్ట్‌ను వివాహమాడినట్టు ఓ కట్టు కథ అల్లారు. 

ఇలాంటి కట్టుకథలు అల్లే పోలీసు ఘనులు దేశం నిండా ఉన్నారు. అరెస్ట్ అయినవారిలో హమీద్-ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం, దస్తగిరి-రాయల్ సీమ విద్యార్థి వేదిక, ప్రతిమ దాస్- ఒడిషా హైకోర్ట్ లాయర్, అరవింద్ అవినాష్, దామోదర్-పి.యు.సి.ఎల్ జార్ఖండ్, ప్రియదర్శిని-పరిశోధక విద్యార్థి, జేఎన్‌యు ఢిల్లీ తదితరులను తమిళనాడు ప్రభుత్వం బస్సులో పోతుండగా అరెస్ట్ చేసింది. లెఫ్ట్ భావజాలం ఉంటే మావోయిస్టులెనా? 40 ఏళ్లుగా పనిచేస్తున్న విప్లవ రచయితల సంఘం ఇప్పుడు కొత్తగా కనపడుతుందా? మావోయిస్టు సానుభూతిపరులుగా ఉన్నంత మాత్రాన అరెస్ట్ చేయకూడదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోదా? 

నిజంగా మావోయిస్టులు దేశ విద్రోహులా? రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఏ రాజకీయలతోనైనా ఉండొచ్చు అన్నప్పుడు ఎందుకు ప్రతిసారి కొద్దిమందిని, కొన్ని సంఘాలకు ఆ ముద్ర వేసి ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూస్తున్నారు? పోలవరం, కూడంకుళం, కోస్టల్ కారిడార్, సెజ్‌లలో జరిగింది ఇదే. ఉద్యమకారు లు ఎప్పుడూ హిట్ లిస్టులోనే ఉంటారు. సమాచార హక్కు కార్యకర్తల హత్యలు, జర్నలిస్ట్‌ల హత్యలు, ప్రజాస్వామికవాదుల జైలు జీవితాలు అన్నీ మనం చూస్తూనే ఉన్నాం. మావోయిస్టులు అంటే అసాంఘిక శక్తులని ముద్ర వేయడం సమంజసమేనా? ఇప్పటి వరకు పోలీసుల చేతిలో మరణించిన వాళ్ళు ఎంతమంది? ప్రజల నిర్వాసిత్వానికి కారణమైన వాళ్ళు, వేల సంఖ్యలో రైతులు, విద్యార్థులు, నేత కార్మికుల ఆత్మహత్యలకు కారకులు ఎవరు? భూములు, వృత్తులు కోల్పోయి మతి స్థిమితం తప్పిన వాళ్ళ లెక్కలు తీస్తే ప్రభుత్వాలు అధికారికంగా చేస్తున్న హింసని అర్థం చేసుకోవచ్చు. ఈవిధానాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఒక బస్సు తగుల బెట్టడమే హింస అయితే, వేలాది మంది ఆదివాసీల గూడాలను తగులబెట్టి, జైలులో నిర్బంధించడం హింస కాదా? దీన్ని ఏమనాలి? ప్రజలను నిర్దాక్షిణ్యంగా అణచివేసే విధానాలు అవలంబిస్తూ నిత్యం అమాయక ప్రజలను భయాందోళనలకు ఎవరు గురి చేస్తున్నారో కమిటీ వేసి పరిశోధిస్తే విచారిస్తే బాగుంటుంది. ప్రజ ల కోసం పనిచేస్తున్న వారిని మావోయిస్టులు అంటున్నారు. మరి ప్రజలను హింసి స్తున్న రాజ్యాన్ని ఏమనాలి? ఎవరు ఈదేశాన్ని రక్షించాలి ? హింస అని ఎవరు నిర్వచిస్తున్నారు? ఎట్లా నిర్వచిస్తారు? అతి పెద్ద ప్రజాస్వామ్యం, కోట్లకొద్దీ డబ్బు తో నడిపిస్తున్న రక్షణ వ్యవస్థ ఉన్నా కూడా తప్పుడు కేసులు, ఆరోపణలు చేయడంలో.. వారి వ్యవస్థలు ఏవీ సరిగ్గా పని చేయ అర్థం చేసుకోవాల్నా? 

ఇప్పుడు దేశంలో, రాష్ట్రంలో భయంకర నిశ్శబ్దం రాజ్యమేలుతున్నదిపపంచీకరణలో భాగంగా వ్యక్తివాదం, స్వలాభం కావొ చ్చు లేదా ఈ రాజ్యం విధానాల వల్ల భయం కూడా కావొ చ్చు కానీ ఈ నిశ్శబ్దం ద్వారా రేపు మనమూ నష్టపోయే పరిస్థితులు రాబోతున్నాయి. ఇప్పటి సామాజిక ఆర్థిక , రాజకీయ పరిస్థితులను అంచనా వేయకుండా మౌనంగా ఉంటే మన సమాధిని మనం అందంగా తవ్వుకున్నట్లే. ప్రజల పోరాటాలు వారివి మాత్రమే కాదు, మనందరివి. అందరం గొంతెత్తి ఈ అన్యాయాలను అడ్డుకోకపోతే ఒకరో ఇద్దరో చరివూతలోకి ఎక్కి అసాంఘిక శక్తుల లాగానో, హక్కుల కార్యకర్తల లాగానో మిగిలి పోతారు. కాని సమాజాన్ని మొత్తంగా మార్చడంలో విఫలమౌతారు. ప్రజాకార్యకర్తలు నిస్వార్థంగా తమ జీవితాలను ఫణంగా పెట్టి చేసిన త్యాగాలకు ఫలితం దక్కాలంటే మన మందరం గొంతెత్తి అన్యాయాన్ని, అవినీతిని ఎదిరించాలి. ప్రభుత్వాల ప్రజావ్యతిరేక చర్యలను ప్రశ్నించాలి, దళిత, బహుజన, ఆదివాసి, మైనారిటీ, స్త్రీల జీవితాలకు అండగా నిలవాలి.

నేటి సందర్భం, సమయం మధ్య తరగతి ప్రజల అవగాహనపై ఆధార పడి ఉన్నది. కింది కులాల పోరాటాలకు, వనరుల పై హక్కుల పోరాటాలకు మద్దతు తెలపాలి. బడుగుల జీవితాలను నాశనం చేస్తూ, వారి సమాధుల మీద అభివృద్ధి పునాదులు వేసే విధానాలను వ్యతిరేకించాలి. 

-సుజాత సూరేపల్లి
తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యద

Namasete Telangana News Paper Dated : 26/10/2012 

No comments:

Post a Comment