Saturday, December 8, 2012

అస్తిత్వ ఉద్యమ సాహిత్యానికి అస్తిత్వమేది? --Maddirala Siddartha



వాస్తవానికి రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్‌ న్యాయబద్ధమైనదే కానీ ఏ విధంగా పంచుకోవాలి అనేది ఇప్పుడున్న ప్రధాన సమస్య. సాహిత్యం విషయానికి వస్తే నిన్న మొన్న దాకా దళితులపెై వివక్షకు ఏదో రూపంలో నిరసన తెలియజేయడం దళిత రచయితల దినచర్యగా ఉండేది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. వివక్షకు గురెైన వ్యక్తి మాలో, మాదిగో చూసి అప్పుడు తమ దృక్పథాన్ని రచయితలు వ్యక్తపరుస్తున్నారు. కొద్దిమంది రచయితలు స్పందించడం మానేశారు. ఇందుకు కారణం- ఏం రాస్తే ఆ కవిని ఏ కవిగా (మాల, మాదిగ) ముద్ర వేస్తారో అన్న అభద్రతా భావం వారిలో ఏర్పడింది.

dalit-2
తెలుగు సాహిత్య అధ్యయ నం ప్రారంభమై దాదాపు కొన్ని వందల సంవత్సరాలు అవు తోంది. లభిస్తున్న ఆధారాల ప్రకా రం, సాహిత్య చరిత్రకారుల అభి ప్రాయం ప్రకారం నన్నయ యుగం తో లిఖిత సాహిత్యం ఆరంభ మయింది అనుకుంటే, ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో యుగాలుగా, ఎన్నో ప్రక్రియలుగా, ఎన్నోవాదాలుగా పరిణామం చెందుతూనే ఉంది. ఈ క్రమంలో భాగంగా ఆధునిక సాహిత్యం అవతరించింది. ఆధునిక సాహిత్యంలో అంతర్భాగంగా వచ్చిన అస్తిత్వ సాహిత్య ఉద్యమాల్లో ప్రముఖమైనది ‘దళిత సాహిత్యం’. ఇది 1980ల్లో ప్రారంభమైంది. దళిత సాహిత్యం ఆరంభమైన మొదట్లో దాని వాడి, వేడి చూసి, అది తెచ్చిన భావ, భాష, వస్తు, శిల్ప, రూప వెైవిధ్యాన్ని చూసి కొన్ని వందల సంవత్సరాల తెలుగు సాహిత్యానికి సవాలుగా మారుతుందని చాలామంది సాహితీ విమర్శకులు భావించారు.

దీంతో పాటు కొన్ని యుగాలుగా కొనసాగుతూ వస్తున్న తెలుగు సాహిత్య నియమ నిబంధనలను ఖండిస్తూ సాహిత్య అంతిమ ప్రయోజనం సమాజశ్రేయస్సు అని, తద్వారా సాహిత్య అంతిమ లక్ష్యం నెరవేరుతుందనీ తెలియజెప్పే దిశగా దళిత సాహిత్యం బయలుదేరింది. దళిత సాహిత్య లక్ష్య, లక్షణాలను పరిశీలించిన సాహిత్య, సామాజిక మేధావిలోకం, సాహిత్య విమర్శకులు భవిష్యత్తులో ప్రతి అస్తిత్వ, ప్రాంతీయ సాహిత్యాలకు దళిత సాహిత్యం మార్గదర్శకంగా మారే అవకాశం ఉందని భావించారు. సాహిత్య విమర్శకుల, రాజకీయ విశ్లేషకుల అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా దళిత సాహిత్యం తన ఆశయాన్ని అన్ని విధాలా నెరవేర్చింది. దళిత సాహిత్యం ప్రారంభమైన మొదట్లో తాను ఎంచుకున్న లక్ష్యానికి, విధానానికి సర్వత్రా కృషి చేసింది. సాహిత్య యుగ ప్రస్థానంలో 19వ శతాబ్దం నుండి సాహిత్యం అంటే అస్తిత్వ సాహిత్యమనే ఆశాభావాన్ని సాహితీ విమర్శకులకు కలిగింపచేసింది.

రానున్న సాహిత్య యుగమంతా అస్తిత్వ కవితా యుగం అని ముద్ర వేసుకొంది. దళిత సాహిత్యం ఏర్పాటు అయి ఈ లక్ష్యం సంపూర్ణంగా నెరవేరుతున్న రోజుల్లో, రేపో మాపో రాజ్యాధికారం సాధిస్తామన్న ఆశాభావంతో దళితులు తమ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్న తరుణంలో, తరతరాలుగా దారిద్య్ర రేఖకు దిగువన బతికిన దళిత ప్రజలు, అంటరానితనాన్ని ఇన్నాళ్ళు అనుభవించిన దళిత ప్రజలు బానిస సంకెళ్ళన్నంటిని తెంచుకుని ప్రధాన జీవన స్రవంతిలోకి వస్తున్న సమయంలో, మాల, మాదిగ అంతర్గత యుద్ధాలు మొదలయ్యాయి. ఈ యుద్ధాలే మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి, మాల మహానాడు! మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి సామాజిక న్యాయం వెైపు కొనసాగినా, అది తెచ్చిన డిమాండ్‌ న్యాయబద్ధమైన మాట వాస్తవమే అయినా, ఈ ఉపకులాల అంతర్గత పోరు దళిత అనెైక్యతకు, దళిత సాహిత్య స్తబ్దతకు, దళిత ఉద్యమ వెైఫల్యానికి దారి తీసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. 
రిజర్వేషన్‌ పంపిణీ వివాదాలవల్ల దళిత ఉప కులాల మధ్య అనెైక్యత మాత్రమే కాకుండా, ఒకరిపెై ఒకరు వివిధ రూపాల్లో దాడులకు దిగడం వరకు పరిణతి చెందింది. క్రమంగా ఇది సాహిత్య రంగంలో కూడా చోటుచేసుకుంది. కంచికచర్ల, కారంచేడు, చుండూరు, వేంపెంట, నీరుకొండ వరకు దళిత ఉద్యమకారులుగా, దళిత మేధావులుగా అగ్రకుల సమాజంలో ఖ్యాతి గాంచినా, పొట్టిలంక, లక్ష్మింపేట సంఘటనల సమయానికి దళిత ఉద్యమకారుల గళం, దళిత కవుల కలం చీలిపోయాయి. 

మాల, మాదిగ మేధావులుగా- మాల, మాదిగ కవులుగా సమాజంలో కొత్తరూపాన్ని తమకు తామే ఆవిష్కరించుకున్నారు. ఇది ఒక విధంగా ఆహ్వానించదగిన శుభపరిణామమే. అస్తిత్వ ఉద్యమాల్లో ఎవరి అస్తిత్వం గురించి వారు మాట్లాడడం, రాయడం మంచిదే కానీ, అది శృతి మించి సోదర కులాలన్నీ ఒకదానిపెై ఒకటి దాడికి దిగడం వలన లాభం కంటే ఎక్కువ నష్టం వచ్చే ప్రమాదం ఉంది. ఇటువంటి ప్రమాదమే దళిత ఉద్యమంలో, దళిత సాహిత్యంలో చోటుచేసుకుంది. ఇన్నాళ్ళు దళిత పేరుతో చెలామణి అయిన మేధావులు, కవులు ఇప్పుడు తమ లక్ష్యాన్ని మరచి వారికి వారే పోటీ పెంచుకుంటున్నారు. ఉపకులాల మధ్యా పోటీని పెంచుకోవడం వల్ల దళిత ఉద్యమం ఎటు పయనిస్తోందో ఒకసారి మేధావి లోకం అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యమంలో, సాహి త్యంలో కుల చెైతన్యం రావడం, ఆ దిశగా సాహిత్య రచన చేయడం ఎవరి జీవినవిధానాలను వారు సాహిత్యంలో వస్తువులుగా సృజనీ కరించడం ఆహ్వానించదగ్గ విష యమే. 

కానీ అది స్థాయిని మించి సోదరకులాల మీద దాడికి దిగడం, ఉద్యమం, సాహిత్యం అంతా తమదే అని ఒకరికి ఒకరు వాద, ప్రతి వాదాలు విసురుకోవడం, తమ కులమే గొప్ప అని తమకు తామే సర్టిఫికేట్లు ఇచ్చుకోవడం- ఈ వాదాన్ని వ్యతిరేకిస్తూ మరో కులం కూడా అంతా తామే అంటూ సర్టిఫి కెట్లు ఇచ్చుక్వోడం ఈ రోజు అటు ఉద్యమంలో, ఇటు సాహి త్యంలో జరుగుతోంది. వాస్తవానికి దళితఉద్యమ, సాహిత్య నిర్మాణంలో అన్నికులాల వారి సమ ప్రాధాన్యత ఉన్నదన్న విషయాన్ని దళిత మేధావిలోకం, దళిత సాహితీలోకం విస్మరించకూ డదు. 

రిజర్వేషన్ల సమాన పంపిణీయే సామాజిక న్యాయం అనే నినాదంతో దళిత రిజర్వేషన్లలో వర్గీకరణ జరగాలని కొందరు, రిజర్వేషన్లను వర్గీకరించడం అంటే దళితులను విభజించి పాలించడమేనని, కనుక ఏకీకరణ కావాలని కొందరు చేపట్టే ఉద్యమంలో జాతి ప్రయోజనాలు ఏమో కానీ సొంత ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నట్లు- వర్గీకరణ, ఏకీకరణ ఉద్యమ ప్రస్థానంలో స్పష్టమవుతుంది. వర్గీకరణ కావాలని మాదిగలు- వారి ఉపకులాలు తెలుగుదేశం పార్టీని ఆశ్రయిస్తే, ఏకీకరణ కావాలని మాలలు, వారి ఉపకులాలు కాంగ్రెస్‌ను ఆశ్రయించారు. ఇది ఆసరాగా తీసుకొని ఆ రెండు రాజకీయ పార్టీలు తమ తమ స్వలాభాల కోసం ఆయా కాలానుగుణంగా దళితులపెై విభజించు పాలించు సూత్రాన్ని ప్రయోగిస్తున్నాయి.వాస్తవానికి రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్‌ న్యాయబద్ధమైనదే కానీ ఏ విధంగా పంచుకోవాలి అనేది ఇప్పుడున్న ప్రధాన సమస్య. సాహిత్యం విషయానికి వస్తే నిన్న మొన్న దాకా దళితులపెై వివక్షకు ఏదో రూపంలో నిరసన తెలియజేయడం దళిత రచయితల దినచర్యగా ఉండేది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. వివక్షకు గురెైన వ్యక్తి మా, మాదిగో చూసి అప్పుడు తమ దృక్పథాన్ని రచయితలు వ్యక్తపరుస్తున్నారు.

కొద్దిమంది రచయితలు స్పందించడం మా నేశారు. ఇందుకు కారణం- ఏం రాస్తే ఆ కవిని ఏ కవిగా (మాలో, మాదిగ) ముద్ర వేస్తారో అన్న అభద్రతా భావం వారిలో ఏర్పడింది. కొంతమంది రచయితలు బహుజన వాదాన్ని బలోపేతంచేసే పనిలో బిజీగా ఉన్నారు. దళితుల మధ్య ఐక్యత లేనప్పుడు బహుజంవాదం ఎలా బలపడుతుంది అనేది ప్రశ్న! చాలా మంది మాదిగ మేధావులు, రచయితలు చాలా స్పష్టంగా తాము పలానా అని ముద్ర వేసుకొని సాహిత్యంలో తమ స్థానాన్ని సుస్థిరపరచుకున్నారు. మాలలు ఏ వాదాన్ని బలపరచాలో తెలియక తమ కలాలను నిద్రపుచ్చుతున్నారు. ఇది ఇలాఉంటే, విశ్వవిద్యాలయాలు అధ్యయన కేంద్రాలుగా ఉంటూనే తమ కులప్రభావాన్ని చాటుకుంటున్నాయి. భావి దళితజాతి నిర్మాణానికి పూనుకోవాల్సినవారే దళిత అనెైక్యతకు ఆజ్యం పోస్తున్నారు. ఇవన్నీ తెలియని గ్రామీణ దళితప్రజానీకం అటు మాదిగల మీటింగులకు, ఇటు మాలల మీటింగులకు పోతున్నారు. 

ఎందుకు పోతున్నారో వారికి ఇప్పటికీ తెలియదు. ఏదో బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ప్రసాదించిన రిజర్వేషన్ల ద్వారా కొద్దో గొప్పో దళిత యువత విద్యారంగంలోకి, రాజకీయ రంగంలోకి ఇప్పుడిప్పుడే వస్తున్నది. అలాంటి వారికి చేదోడు వాదోడుగా దళిత మేధావిలోకం ఉండాలి. కనుక ఇప్పుడెైనా ఇది గమనించి మాల, మాదిగ మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్లు పంచుకోవాలా వద్దా, పంచుకుంటే ఏవిధంగా పంచుకోవాలి, జోన్లవారీగానా, లేక ప్రాంతాల వారీగానా, లేక జనాభా ప్రాతిపదికనా, లేక క్రీమిలేయర్‌ విధానం ద్వారానా- అనేది ఏదో ఒకటి ఇరువర్గాల ప్రజలకు సమ్మతంగా ఉండేలా నిర్ణయించుకుంటే మంచిది. లేకపోతే ఎన్ని దండోరా ఉద్యమాలు చేసినా, ఎన్ని మాల మహానాడు ఉద్యమాలు చేసినా అవి కేవలం అగ్రకుల రాజకీయ పార్టీల ప్రాభవానికి బాసటగా నిలుస్తాయే తప్ప, దళిత ప్రజలకు ఒరిగేది ఏదీ లేదు. 

ఎప్పుడెైతే ఈ ఉద్యమం ఒక శాశ్వత పరిష్కారానికి వస్తుందో, అప్పుడు ఉద్యమానికి సాధనంగా సాహిత్యంకూడా తన ధోరణి మార్చుకుని, మాల, మాదిగ కవులుగా చెలామణి అవుతున్న రచయితలంతా అంతర్గతంగా తమ తమ కుల ప్రస్థానాన్ని, తమ సంస్కృతీ, సంప్రదాయాలను కాపా డుకుంటూనే ‘మేం దళిత కవులం’ అని గర్వంగా చెప్పుకుని, దళిత సాహిత్య చరిత్ర పుననిర్మాణానికి మార్గదర్శకులవుతారు. కుల అస్తిత్వాల గురించి సాహిత్యంలో చర్చించడం మంచిదే కానీ దళిత కులాల అన్నింటి సంస్కృతీ ఇంచుమించు ఒకే విధంగా ఉంటుంది. కనుక ఆ దిశగా రచనలు చేస్తే దళిత ఉద్యమం, దళిత సాహిత్యం బలపడే అవకాశం ఉంటుంది. అప్పుడే అది దళిత ఉద్యమ, సాహిత్యాలను భుజాన వేసుకుని మోయబోతున్న యువతకు ఆదర్శప్రాయంగా ఉంటుంది. 

ఇది జరగకపోతే భవిష్యత్తులో దళిత సాహిత్యానికి, దళిత ఉద్యమాల అస్తిత్వానికి- అస్తిత్వమే కరవవుతుంది.బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ చెప్పినట్లు రెండు వర్గాల మధ్య విభేదాలొస్తే ఏదో ఒక వర్గం మిగిలి, మరో వర్గం నాశనం అవుతుంది. అదే ఒక వర్గంలో రెండు శిబిరాల మధ్య విభేదాలొస్తే చివరకు వర్గం నాశనం అవుతుంది. ఒకే సిద్ధాంతం, ఒకే సమాజం, ఒకే పోరాటం చేసే వ్యక్తుల మధ్య, సంస్థల మధ్య మిత్ర వెైరుధ్యం ఉండాలి కానీ శత్రువెైరుధ్యం ఉండకూడదు. ఏ అగ్రకులాల చేతిలో దళితులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో అదే అగ్రకులాన్ని ఆశ్రయించి తమకు న్యాయం కావాలనడంలో- తాము ఉదయం లేచినప్పటినుండి జపించే ఆత్మగౌరవం ఏమవుతుందో దళిత ప్రజానీకం ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. 

madhi-raa
బహుజన రాజ్యం రావాలని చాలా మంది ప్రసంగాలు, పుస్తకాలు రాస్తూన్నారు. ఇంట గెలిచి రచ్చ గెలువు అన్న తీరున ఇంట్లో సమస్యను పరిష్కరించకుండా బయట బహుజనులకు ఏం బోధిస్తాం? కొద్దో గొప్పో చెైతన్యం ఉన్న దళిత కులాలు విడిపోయి ఒంటరిగా బతుకుతుంటే ముందు అది పరిష్కరించకుండా బహుజన రాజ్యం ఏవిధంగా బలోపేతం అవుతుంది అనేది ప్రశ్న. దళిత ఉపకులాల మధ్య పోరును పరిష్కరించకుండా బహుజనరాజ్యం బలోపేతం కావడం, దళితులకు రాజ్యాధికారం రావడం మరికొన్ని ఏళ్ళపాటు అది కేవలం నినాదాలకు, సమావేశాలకు, మీడియాలో ప్రకటనలకు పరిమితం అవుతాయి తప్ప, ఎప్పటికి ఆచరణలో సాధ్యం కాదు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, రానున్న ఎన్నికల సమయానికి ఈ వర్గీకరణ, ఏకీకరణ ఉద్యమాల తీరు తెన్నుల్ని క్షుణ్ణంగా సమీక్షించి, వాటి పరిష్కారానికి సరెైన మార్గాన్ని ఎంచుకుని రాజ్యాధికార సాధన దిశగా దళిత బహుజన మేధావులు, కవులు, కళాకారులు, పరిశోధకులు పయనించాలి.

Surya News Paper Dated : Nov -19-2012 

No comments:

Post a Comment