Monday, May 12, 2014

ఇప్లూలో ఏం జరిగింది? By శంకర్, ఉపేందర్, కె. మహేష్, కె. రాజేష్, స్టాలిన్, ఆర్. లింగస్వామి ఇఫ్లూ, ఓయూ రీసెర్చ్ స్కాలర్లు


Published at: 11-05-2014 00:37 AM
సమాజ స్థితిగతులను బేరీజు వేసుకుంటూ భవిష్యత్ తరాలకు దశ, దిశ నిర్దేశించడంలో ఎనలేని పాత్ర పోషించి నూతన ప్రపంచ ఆవిర్భావానికి నాంది పలకాల్సిన విశ్వవిద్యాలయాల్లో కులాధిపత్యం, అణచివేత, అన్యాయాలు రాజ్యమేలుతున్నాయి. మనుషులంతా సమానమే అన్న రాజ్యాంగ ప్రాథమిక స్ఫూర్తిని అక్షరాల పాటించాల్సిన ప్రథమ 'పాఠశాలలే'... అగ్రహారాలుగా మారిపోయాయి. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ పక్కనే ఉన్న ఇఫ్లూ (ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ) అడ్మినిస్ట్రేషన్ ముగ్గురు విద్యార్థులను అక్రమంగా, అన్యాయంగా రెం డేళ్ళపాటు రెస్టికేట్ (బహిష్కరణ) చేసింది. వర్సిటీ వీసీ సునయన సింగ్ ఇతర అధికారులు చెబుతున్న దానిని బట్టి లైబ్రరీలో అద్దం పగలగొట్టినందుకు వేసిన 'శిక్ష' మాత్రమే. కేవలం చదువుకునేందకు లైబ్రరీని తెరచి ఉం చండని అడిగితే జరిగిన 'బహిష్కరణ' ఇది. రీడింగ్ రూం కోసం జరిగిన తోపులాటకు బాధ్యులను చేస్తూ, ఆ రోజు అక్కడ లేని విద్యార్థులపై రెస్టికేషన్ శిక్ష వేయడం దుర్మార్గం. పగిలిన రూం గ్లాస్‌కు రెస్టికేట్ అయిన విద్యార్థులకు ఏ సంబంధంలేదని ఇఫ్లూ అధికారిక స్టూడెంట్స్ కౌన్సిల్ రాతపూర్వకంగా వీసీకి విన్నవించినా వీసీ పట్టించుకోలేదు. విద్యార్థులపై చర్యలు తీసుకునేందుకు యూజీసీ రూపొందించిన నిబంధనలకు విరుద్ధంగా రెస్టికేషన్ చేయడం అన్యాయం. గ్రామ పునాదుల్లో నిర్మితమైన బ్రాహ్మణీయ భావజాలం నేటి విశ్వవిద్యాలయాలకు పాకింది.
ఇఫ్లూ తదితర కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో నిరుపేద విద్యార్థులు కనీస సౌకర్యాలపై నోరు విప్పితే నిర్బంధాలు, కేసులు, సెక్షన్లు ఎదుర్కొనవలసి వస్తోంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నాడనే నెపంతో మరో స్కాలర్ కోటేష్‌ను గత ఏడాది ఐదురోజులపాటు బహిష్కరించారు. చదువుకునేందుకు సౌకర్యాలు కల్పించాలని కోరిన పీహెచ్‌డీ స్కాలర్లు మోహన్ దరావత్, సతీష్ నయనాల, పీజీ విద్యార్థి సుభాష్‌లపై రెస్టికేషన్ దండన ప్రయోగించారు. వీసీ సునయన సింగ్‌ది ఆది నుంచి నియంతృత్వ పోకడే. ఇఫ్లూలో కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందని కేంద్ర ఆడిట్ (కాగ్) అధికారులు సైతం గుర్తించారు. అధికారం అండతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీవర్గాల విద్యార్థులను వీసీ వీలు చిక్కినప్పుడల్లా వేధింపులకు గురిచేస్తున్నారు. కనీసం తమ సమస్యలు వినిపించేందుకు అపాయింట్‌మెంట్ కోరినా బడుగు విద్యార్థులకు అపాయింట్‌మెంట్ ఇవ్వని వీసీ అగ్రవర్ణ విద్యార్థులతో మాత్రం కోరకుండానే సమావేశమవుతుంటారు. రెస్టికేషన్ సమస్యపై చర్చించేందుకు వచ్చిన ఎమ్మెల్సీ చుక్కారామయ్య, రాజ్యసభ మాజీ ఎంపీ అజీజ్ పాషా, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, మాజీ అడిషనల్ డీటీ నాయక్, రిటైర్డ్ ఐజీ జగన్నాథరావు, టీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరామ్ తదితర ప్రజాసంఘాల నాయకులు కూడా వీసీని కలిసేందుకు గేటు దగ్గరే గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. నాలుగు రోజులుగా మేధావులు, ప్రజాసంఘాలు, విద్యార్థిలోకం రెస్టికేషన్‌కు వ్యతిరేకంగా ఇఫ్లూ వైపు దారికడుతున్నారు. వీసీ ఇవేమీ పట్టించుకోకుండా పది రోజులు సెలవుపై వెళ్ళారు.
సాంస్కృతిక, సామాజిక ఉద్యమాల్లో పాల్గొనడమే ఇప్లూ విద్యార్థులకు శాపంగా పరిణమించింది. తెలంగాణ ఉద్యమం, సాంస్కృతిక ఉద్యమాలు బీఫ్ ఫెస్టివల్, నరకాసుర వధ, రావణాసుర జయంతులతో పాటు ఇతర సామాజిక ఉద్యమాల్లో ఉస్మానియా వర్సిటీ విద్యార్థుల ఇఫ్లూలోని దళిత బహుజన విద్యార్థులు కలసి కొనసాగించారు. ఇదే వర్సిటీ అధికారులకే కంటగింపుగా మారింది. ఓయూ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెడితే దానికి భిన్నంగా ఇఫ్లూ అధికారులే ఇక్కడి విద్యార్థులపై అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసులు బనాయించిన సందర్భాలున్నాయి. అలాంటి విద్యార్థులపై అగ్రకుల అధ్యాపకులు పలు పరీక్షల్లో తమ 'కసి' తీర్చుకున్న ఉదంతాలు ఉన్నాయి. మోహన్ దరావత్, సతీష్ నయనాల వంటి విద్యార్థులు అటు ఉద్యమంలో పాల్గొంటూనే ఇటు ఇఫ్లూ లోపల జరుగుతున్న అక్రమాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించడంలో ముందున్నారు. ఈ కారణంగా వీసీ, ఇతర అధికారులు కలసి వారిని ఒక పథకం ప్రకారం రెస్టికేట్ చేశారు. లేనిపోని విషయాలకు, నాణ్యమైన విద్యనందించేందుకు అవసరమైన సదుపాయాలను అడిగిన పాపానికి అధికారం ఉంది కదా అని ఇలాంటి శిక్షలు వేయడం అన్యాయం.
ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటీ విద్యార్థులను వేధింపులకు గురిచేసే యూనివర్సిటీల్లో ఇఫ్లూ ఒకటి. నగర శివారులో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో పాటు ఇక్కడ అగ్రకుల ప్రొఫెసర్లు స్కాలర్లపై కుల పెత్తనాన్ని నిత్యం ప్రదర్శిస్తూనే ఉంటారు. అణగారిన వర్గాల పిల్లలను ఏదో ఒక సాకుతో వివక్షకు గురిచేస్తూనే ఉం టారు. ఫలితంగా ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వర్సిటీలో ఒక్కోడిపార్డ్‌మెంట్‌లో ఒక్కోరకమైన వివక్ష కొనసాగుతోంది. ఫిల్మ్ స్టడీస్‌లో పీహెచ్‌డీ దళిత స్కాలర్ సతీష్‌కు గ్రూప్ వన్ కేడర్ ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ప్రభుత్వోద్యోగులు తమ పీహెచ్‌డీని పార్ట్ టైంకి మార్చుకునే అవకాశమున్నా, ఆయన పీహెచ్‌డీని రద్దు చేశారు. ఇదే డిపార్ట్‌మెంటులో మరో స్కాలర్ నర్సింగ్ రావు ప్రొఫెసర్ల వేధింపులకు మనోవ్యాధికి గురై చికిత్స తీసుకుంటున్నాడు. అట్లాగే ట్రాన్స్‌లేషన్ స్టడీ స్‌లో ట్వింకిల్ దాసరి, జర్మన్ స్టడీస్‌లో శ్రీరాములు, రం జన్ కుమార్, మాయకుమారి వంటి స్కాలర్లు అధ్యాపకుల ఆగడాలకు బలైనవారే. వీరంతా దళిత విద్యార్థులే. వీరితోపాటు ఇప్పటికీ మరెందరో విద్యార్థులు తీవ్ర వివక్షకు గురవుతున్నారు. విద్యార్థులపై విధించిన రెస్టికేషన్ ఎత్తివేసి విద్యార్థులు చదువుకునేందుకు ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని చేస్తున్న ఉద్యమాన్ని వర్సిటీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
ఇది వీసీ అహంభావానికి నిదర్శనం. కాగా తనకు ఓ కేంద్రమంత్రి అండగా ఉన్నంత వరకు ఎలాంటి ఇబ్బందిలేదనే వీసీ అహంకారం. నిబంధనలకు విరుద్ధంగా నిరుపేద దళిత బహుజన విద్యార్థులపై విధించిన రెస్టికేషన్ ఎత్తి వేయాలని, వర్సిటీ నిధులను దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరపడంతో పాటు కులం పేరుతో వివక్ష పాటిస్తోన్న వీసీ, ఇతర అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎలాంటి వివక్ష, అసమానతలకు తావు లేకుండా నాణ్యమైన విద్య అందించాలని కోరుతూ ఈ నెల 12న 'ఛలో ఇఫ్లూ' కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కుల, మత కబ ంధ హస్తాల్లో నలిగిపోతున్న విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు విద్యార్థులు మేధావులు ప్రజాసంఘాలు, బుద్ధిజీవులు ఈ ఆందోళనలో పాల్గొని విద్యా హక్కు కోసం మద్దతుగా నిలవాలని కోరుతున్నాం...


Andhra Jyothi Telugu News Paper Dated: 11/05/2014 

No comments:

Post a Comment