Sunday, May 18, 2014

ఉన్నత విద్యాలయాల్లో కుల అణచివేత By సుజాత సూరేపల్లి


Updated : 5/18/2014 12:37:31 AM
Views : 11

కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో పేద, దళిత, ఆదివాసీ, మైనారిటీ విద్యార్థుల పట్ల అమానవీయ ఘటనలు చూస్తుంటే ఆందోళనగా ఉన్నది. విద్యార్థుల పై జరుగుతున్న హింస, దానికి ప్రతిగా వారిలో పెరుగుతున్న అసంతప్తిని వ్యక్తపరిచే వేదికలు లేకపోవడంపై కూడా దష్టి సారించాల్సిన అవసరం పెరిగింది . అనూహ్యంగా పెరుగు తు న్న విద్యార్థి ఆత్మ హత్యలు, ప్రొఫెసర్ల ఆగడాలు, కుల వివక్ష, మరొకవైపు చాప క్రింద నీరులా ప్రైవేటీకరణ, అవినీతి, అవాంఛనీయ సంఘటనలు ప్రజాస్వామిక వాదులను మేధావులను కలవర పెడుతున్నవి. ఇపుడు యుద్ధ ప్రాతిపదికన కొంత ప్రక్షాళన అత్యవసరం. మరొక కోణంలో నుంచి చూస్తే విద్యార్థుల స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను, హక్కుల గొంతులను, ఉద్యమాలను అణచి వేస్తున్న యాజమాన్యం, అధికారుల వైఖరిని కూడా ప్రస్తుత పరిస్థితికి అన్వయించుకోవాలి. అందులో భాగంగానే హైదరాబాద్ ఇఫ్లూ కేంద్ర విశ్వ విద్యాలయంలో మోహన్ దారావత్ , సతీష్ నైనాల పరిశోధన విద్యార్థులు, సుభాష్ అనే పీజీ విద్యార్థి బహిష్కరణ ఎత్తివేయాలని వారం రోజులుగా జరుగుతున్న ఉద్యమాన్ని చూడాల్సిన అవసరం ఉన్నది . 

విశ్వ విద్యాలయాల్లో ముఖ్యంగా కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో రోజు రోజుకీ విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడిని అర్థం చేసుకోవాలంటే ముందుగా అక్కడ జరుగుతున్న విధానాలను పరిశీలించాలి. 2010 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు దేశంలో 254 ఉన్నాయి. అందులో జూన్ 2011 నాటికి దేశ వ్యాప్తంగా 42 కేంద్రీయ విశ్వ విద్యాలయాలు, ఆంధ్ర ప్రదేశ్‌లో మూడున్నాయి. వాటిలో లక్షకు పైగా విద్యార్థులు ఉన్నట్టు లెక్కలు చెపుతున్నాయి. ఉన్నత విద్య అన్ని ప్రాంతాలకు చేరాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వాలు విద్యకు కావాల్సిన ముఖ్యమైన అంశాలను మరుస్తున్నాయి. దీనికి ఉదాహరణ స్టేట్ యునివర్సిటీలలో ఎటువంటి సౌకర్యాలు లేకపోవడం, ఎటువంటి ప్రమాణాలు పాటించక పోవడం, కొన్ని ప్రాంతాలలో కనీసం స్కూల్స్ కంటే కూడా అధ్వాన్నంగా ఉండడం చూస్తున్నాము. 

కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో లెక్కకు మించి బడ్జెట్ కేటాయించి, అధిక వేతనాలు, అన్నిరకాల సౌకర్యాలు, భవనాలు కల్పించడంపై ఎవరూ మాట్లాడరు! ఎక్కడైనా విద్య నేర్పడమే ముఖ్య సూత్రం అయినప్పుడు, గ్రామాల నుంచి వచ్చే పిల్లలకు ఉన్న అవసరాల రీత్యా స్టేట్ యునివర్సిటీలకు ఎక్కువ డబ్బులు ఇవ్వ వలసింది పోయి, కేవలం సెంట్రల్ అన్న పదంతో అత్యధికంగా బడ్జెట్‌ని కేటాయించడంపై కూడా ఆలోచించాలి. 11వ ప్రణాళిక ప్రకారం ఉన్నత విద్య అందరికి చేరువ కావాలని, ముఖ్యంగా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన కులాల విద్యార్థులకు చోటు కల్పించాలని, అట్లనే వివిధ గ్రామీణ ప్రాంతాలలో కూడా విస్తరించాలని నిర్ణయించారు. అటువైపు కొద్దిగా ప్రయత్నాలు కూడా మొదలైనాయంటున్నారు. 
కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో ఒక విచిత్ర మైన పరిస్థితి కనపడుతుంది. మెరిట్, స్కిల్, స్పోకెన్ లేదా బ్రోకెన్ ఇంగ్లీష్ వంటి పదాలు ఎక్కువగా వినపడతాయి. కన పడతాయి. అంతవరకు ఫరవాలేదు. కానీ అవి కేవలం అగ్రకులాల వారికి మాత్రమే ఉంటాయని వారి భావన.

ఇంకా ఇదే విషయాన్ని మెజారిటీ ప్రజలు కూడా నమ్ముతుంటారు! మరో వైపు చూస్తే.. దళితులు, అదివాసీలు, బీసీలు, మైనారిటీలు అంటే చాలా చిన్న చూపు. వారు రిజర్వేషన్ ద్వారా వచ్చారని, ప్రభుత్వ సౌకర్యాలు అనుభవించేస్తున్నారని అగ్ర కుల విద్యార్థులు, అధ్యాపకులు చాల బాధ పడుతుంటారు. నిజానికి కొన్ని వేల సంవత్సరాలుగా, కొన్ని కులాలు తెగల చెమట, రక్తం పీల్చి, విజ్ఞానానికి దూరం చేసి, హింసించి, వారికి చెందాల్సిన భూమి, వనరులు అన్ని అనుభవిస్తూ ఉన్న ఈ వర్గాలు చదువుకున్న వారు అనడం దురదష్టం. సమాజంలో సమానత్వం సాధించడానికి వీటికి ప్రతిఫలంగానే ప్రభుత్వం కల్పించే ఒక చిన్న వెసులుబాటు రిజర్వేషన్ విధానం అని ఎ ఒక్కరూ అనుకోరు. ఇక అక్కడినుంచి కథ మొదలైతది. చదువుకుంటున్న బిడ్డలు బతుకు మీద కోటి ఆశలతో, ఏదో చేయాలనే తపనతో ముఖ్యంగా పేద విద్యార్థులు అందునా వెలివేయ బడ్డ కులాల , తరగతుల విద్యార్థులు విశ్వ విద్యాలయాల్లో అడుగు పెడతారు. అడుగు పెట్టిన రోజునుంచి ప్రతి చోట సంఘర్షణ పడుతూనే ఉంటారు. వేసుకునే బట్టల దగ్గర నుంచి, మాట్లాడే మాటలు, తినే తిండి తనతో వచ్చిన అలవాట్లను మార్చుకోవడాలు, కొత్త ప్రపంచానికి అలవాటు పడడాలు మొదలైతాయి. ఇదో రకమైన ఎలియనేషన్ (పరాయీకరణ). విద్యార్థి మంచి అధ్యాపకుల చేతిలో పడితే సంతోషం. 

లేదా తన కోర్స్ పూర్తి అయిపోయేదాకా అనిశ్చితి, అశాంతితో బతకాలి. మధ్య తరగతి విలువలతో నరకం అనుభవించాల్సి వస్తుంది. అంతో ఇంతో విద్యా ప్రమాణాలు కలిగి ఉండి, విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకొని వారిని వెన్నంటి ఉండే ఉపాధ్యాయులను వేళ్ళపై లెక్క పెట్టవచ్చు. సాధారణంగా విద్యార్థులు తమ సౌకర్యాలకు, పుస్తకాలకు, అధ్యాపకులకు సంబంధించిన విషయాలలో గొంతు ఎత్తక తప్పదు. కొన్ని సార్లు హక్కుల పోరాటం చేయనిదే వారికి బతుకు గడవదు. అయినా పోరాటం ఒక ప్రజాస్వామిక హక్కు. ఆ వైఖరే అతని విద్యార్థి జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఈ క్రమంలోనే విద్యార్థులలో చీలిక ఏర్పడు తుంది. కొందరు అగ్రకుల ప్రొఫెసర్లకు, అధికారులకు చెంచాలుగా మారితే, మరి కొంతమంది చాటు మాటుగా మద్దతు తెలుపుతుంటారు. వీరిని కూడా తప్పు పట్టనవసరం లేదు. ఆ అవసరం అటువంటిది. విద్యార్థి అప్పటి వరకూ చదివిన చదువు ఒక ఎత్తు అయితే, కేంద్రీయ విశ్వ విద్యాలయాల సంస్కతి ఒక ఎత్తు. వీటన్నింటిని అధిగమించుకుంటూ ముందుకు పోతూ ఉంటాడు విద్యార్థి. ఈ క్రమంలో విపరీతమైన మానసిక ఒత్తిడి పెరిగినపుడు ఆత్మహత్యలు చేసుకోవడం పరిపాటి. చాలా మంది విద్యార్థులు ఆత్మ నూన్య తా భావానికి గురవుతుంటారు. అదొక కల్చరల్ షాక్. కలగూర గంప లాగా రకరకాల మనుషులు మనస్తత్వాలు, మినీ ఇండియా లాగా అనిపిస్తుంది. 2009లో నేను ఢిల్లీ యూనివర్సిటీలో కొన్నిరోజులు ఉన్నప్పుడు, అక్కడ ఉక్కిరి బిక్కిరి అయి కేంద్రీయ విశ్వ విద్యాలయాలు అగ్రహారాలు అని చెప్పడం ఇంకా గుర్తు ఉంది. 

ఇక ఇఫ్లూలో ఘటన. ఏదో ఒక అద్దం పగిలిందని, అక్కడ ఉన్న వివాదాల వీసీ ఇచ్చిన శిక్ష రస్టికేషన్. దీన్ని చిన్నగా తీసి వేయడానికి లేదు. ఈ విద్యార్థులు ఉద్యమాలలో కీలకం గా పని చేస్తున్న వారు. మోహన్ దారావత్ దళిత ఆదివాసీ బహుజన్ మైనారిటీ ప్రెసిడెంట్. సతీష్ నైనాల తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ కార్యదర్శి. సుభాష్ కూడా చురుకైన విద్యార్థి. వీరి కోరిక లైబ్రరీని 24 గంటలు తీసి ఉంచాలని. ఇది న్యాయ మైనదే. ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు కొద్దిగా నష్టం జరగడం కూడా అనివార్యమే. కాని ముగ్గురి మీదనే కక్ష సాధింపు చర్య. అందులో వారు ముగ్గురు సంఘటన జరిగినపుడు అక్కడ లేరు. ఎటువంటి కమిటీ లేక పోవడం, ఉన్నా అందులో ఎస్సీ, ఎస్టీ మెంబర్లు కూడా లేకపోవడం వంటి ఎన్నో తప్పులు, లొసుగులు కనపడుతున్నాయి. కేంద్రీయ విశ్వ విద్యాలయాలలో అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు, అన్ని వర్గాలకు చెందిన వారుంటారు కాబట్టి అందరిని కూడ కట్టడం ఒక సమస్య. అట్లా అని వారు సమస్యలకి స్పందించక పోవడం అనేది ఉండదు. కాకపోతే సమస్య కింది కులా ల అంశం అయినపుడు మాత్రం ఒక రకమైన నిశ్శబ్దం అలుముకుంటుంది. ఆ కులాల నుంచి వచ్చిన అధ్యాపకుల నోళ్లు కూడా మూత పడతాయి. బయట పెద్ద పెద్ద రాడికల్ ప్రొఫెసర్లుగా పేరు తెచ్చుకున్న వారెవరూ కూడా అక్కడ కన పడరు ఎందుకో! కుల సంఘాల వారుకూడా ఆచి తూచి స్పందిస్తారు. 
ఇఫ్లూలో జరిగిన ఆత్మ హత్యలు, వర్కర్ల పట్ల అమానుష ప్రవర్తన , తీసివేయడాలు, ప్రతి నలుగురిని విడగొట్టడం, అతి పొగరుగా వ్యవరించడంతో ప్రస్తుత వీసీ వార్తల్లోకి ఎక్కిన వ్యక్తి. అద్దం పగలడమే విద్యార్థులను తీసి వేయడానికి కారణం అయితే ఏ యూనివర్సిటీలో విద్యార్థులు మిగలరు.

పరిస్థితులను అంచ నా వేయకుండా, వాటికి దారి తీసిన మన నిర్ణయాలు ఎంతవరకు కారణమో చూడకుండా, బాధ్యత గల పదవులలో ఉన్న వ్యక్తులు చేసే చర్యలు కావు ఇవి. ఇవి ఉద్యమాల గొంతులను అణచి వేసే చర్యలే. హక్కుల గొంతులు విశ్వ విద్యాలయాల్లో కనపడకుండా చేయాలనే కుట్రలో వీటిని భాగంగానే చూడాలి. అణచి వేయబడిన కులాలపై కూడా ఇది ఒక వేటు. ఆ ఫలానా వీసీ గారు రాజకీయ అండదండలతో కొనసాగుతున్నారు కాబట్టి, ఆ రాజకీయ పార్టీలతోనైనా ఒత్తిడి తెప్పిస్తే బాగుంటుదేమో ఆలోచించాలి. లేదా విద్యార్థుల విలువైన కాలం పనికిమాలిన విషయాలకు ఆందోళన రూపంలో ముగుస్తుంది. ఇంకా పరిస్థితులు మారకపొతే చేయి దాటి పోయే ప్రమాదం కూడా ఉంటుంది. మనం కొండతో ఢీ కొంటున్నాం అన్న సంగతి మరిచి పోవద్దు. అదేవిధంగా విద్యా వ్యవస్థపై మచ్చ తెచ్చే వారు ఎవరైనా, ఎటువంటి చర్యలనైనా అందరూ ముక్త కంఠంతో ఖండించాలి . 
-సుజాత సూరేపల్లి
తెరవే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Namasete Telangana Telugu News Paper Dated: 18/05/2014 

No comments:

Post a Comment