Saturday, June 16, 2012

ముస్లిం రిజర్వేషన్లు-రాజ్యాంగ రక్షణ----కనీజ్ ఫాతిమా



ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం 2004లో జీవో33ను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం 2011లో 4.5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది. అప్పటి నుంచి మైనార్టీలకు ముఖ్యంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ అనేకమంది వాదిస్తున్నారు. ముస్లింలకు విద్యా, ఉద్యోగరంగాల్లో 4.5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. తీర్పులు వెలువరించే సమయంలో న్యాయాధిపతులు రాజ్యాంగంలోని ఆయా ఆర్టికల్స్ స్పిరిట్‌ను అర్థం చేసుకున్నట్లు లేదు.ముస్లింల కు రిజర్వేషన్లను వ్యతిరేకించేందుకు ఎప్పటికప్పుడు కొత్త వ్యక్తీకరణలు వస్తున్నా యి. మతపరమైన రిజర్వేషన్లకు రాజ్యాంగ అనుమతి లేదనీ, సమాజాన్ని విచ్ఛి న్నం చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కోర్టు తీర్పు ముస్లింలతో సహా ఇతర మైనార్టీల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపబోతున్నది. సుప్రీంకోర్టుకు ఈ విషయాన్ని కేంద్రం నివేదించింది. సుప్రీంకోర్టు కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ మీద అసహనం ప్రదర్శించింది.రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే ఇవ్వడానికి కూడా నిరాకరించింది. మైనార్టీ రిజర్వేషన్లు ఇవ్వడానికి గల డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌ను కోర్టుకు సమర్పించాలని సూచించింది. 

రాజ్యాంగం అమలులోకి వచ్చిన వెం టనే మద్రాసు రాష్ట్రంలో కొనసాగుతున్న ఓబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ సమ్మతం కాదని మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ సాగింది. పార్లమెంటులో కూడా దీనిపై చర్చ జరిగింది. మద్రాసు కోర్టు న్యాయాధీశులు రాజ్యాంగం సారాన్ని అర్థం చేసుకోలేదని, వారు కేవలం న్యాయశాస్త్ర నిపుణులుగానే మిగిలిపోయారని అప్పటి పార్లమెంటులో డాక్టర్ అంబేద్కర్ వ్యాఖ్యానించారు. మద్రాసులో ఎప్పటి నుంచో అమలవుతున్న ఓబీసీ రిజర్వేషన్లు కొత్త రాజ్యాంగం ప్రకారం న్యాయసమ్మతమేననీ, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 16 హామీ ఇస్తున్న ప్రాథమిక హక్కుల పరిధిలోకి వస్తాయని ఆయన వాదించారు. ఆయన వాదనను అంగీకరించి తొలి రాజ్యాంగ సవరణ ఓబీసీ రిజర్వేషన్ల కోసం చేశారు. ఓబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమని నాడు మద్రాసు కోర్టు తీర్పు ఇచ్చినట్టే, నేడు ఆంధ్రవూపదేశ్ హైకోర్టు మైనార్టీ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని తీర్పుఇచ్చింది. మైనార్టీ రిజర్వేషన్లను కోర్టులు కొట్టివేస్తాయని 2007లోనే బాలగోపాల్ ఊహించారు.

రాజ్యాంగం ఈ దేశ పౌరులకు మౌలిక హక్కులు కల్పించింది.విద్యా, ఉద్యోగ రంగాలు ఈ హక్కుల కిందే పరిగణింపబడ్డాయి. వీటిని నిరాకరించే అధికారం ఏ వ్యవస్థకూ లేదు. ఆర్టికల్ 13(2), 3 (ఎ) ప్రకారం మౌలిక హక్కులకు భంగకరమైన ఎలాంటి చట్టమైనా రాజ్యాంగం ప్రకారం చెల్లదు. ఆర్టికల్ 14 ప్రకారం ఈ దేశంలోని పౌరులంతా చట్టం ముందు సమానులే. అంటే అన్ని మతాల ప్రజలు చట్టం ముందు సమానులే. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విద్యా,ఉద్యోగ హక్కులతో పాటు, జీవించేహక్కు, ప్రాతినిథ్యం వహించేహక్కును మౌలిక హక్కు ల పరిధిలోనే పెట్టాలని రాజ్యాంగ సభలో వాదించారు. ఈ హక్కులను మార్చే అధికారం ఎవరికీ లేదని ఆర్టికల్ 13 ఆదేశిస్తుంది. అందుకే మౌలిక హక్కులే రాజ్యాంగం అసలైన నిర్మాణం. ఆర్టికల్ 15 పౌరులకు ప్రాతినిధ్యహక్కు కల్పిస్తుంది. ఆర్టికల్ 15(4), (5) ప్రకారం సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడి న వర్గాలకు స్పెషల్ ప్రొవిజన్ చేసేందుకు రాజ్యాన్ని ఆటంకపరిచేదేదీ లేదు. ఆర్టికల్ 16(1), (2), (4)విద్యా, ఉద్యోగ రంగాలలో పౌరులందరికీ సమానత్వం కల్పించబడింది. ముస్లింలు, ఇతర మైనార్టీలు ఈదేశ పౌరులు. అందువల్ల రాజ్యాంగం హామీ ఇచ్చిన మౌలిక హక్కులను వారికి ఇవ్వాలి. కానీ న్యాయ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నది. విద్యా, ఉద్యోగాలలో మైనార్టీలకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నది. రాష్ట్ర హైకోర్టు మైనార్టీ రిజర్వేషన్లు ఆర్టికల్ 15,16 పరిధిలోకి రావని తీర్పు ఇవ్వడం ఆశ్చర్యం. ఫండమెంటల్ రైట్స్ గురించి ఏర్పా టు చేసిన ప్రతి ఆర్టికల్‌లో తొలుత మతం అనే పదాన్నే చాలా స్పష్టంగా వాడా రు. ఈ మౌలిక హక్కులను ఉల్లంఘించరాదని రాజ్యాంగం నిర్దేశిస్తుంటే న్యాయవ్యవస్థ మాత్రం మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమని అంటున్నది. మైనార్టీ రిజర్వేషన్ జీవోను, ఆర్డినెన్స్‌ను మూడుసార్లు న్యాయవ్యవస్థ కాలరాసిం ది. న్యాయవ్యవస్థ రాజ్యాంగాన్ని వక్రీకరించడం కాదా ఇది? మతం పేరుతో పౌరుల పట్ల వివక్ష చూపించరాదని రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. ముస్లింలు ఆర్థికంగా, సాంఘికంగా, విద్యా, ఉద్యోగపరంగా దయనీయ స్థితిలో ఉన్నారని అనేక కమిషన్లు చెప్పాయి. న్యాయవ్యవస్థ ముస్లింల అభివృద్ధి కోసం ప్రత్యేక రిజర్వేష న్లు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు ఆదేశాలివ్వడం లేదు? 

ముస్లింలను ఓబీసీ జాబితాలో చేర్చే విషయంలో ఒక సాంకేతిక సమస్య ఇమి డి ఉన్నది. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండరాదనే ఒక వాదన ఉన్నది. ఈ సమస్య ఆరు దశాబ్దాలుగా ఉన్నది. అయితే మండల్ కమిషన్ కేసులో జస్టిస్ జీవన్‌డ్డి తీర్పు చెప్పారు. ఆ తీర్పులో ‘వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ 50 శాతం మించరాదనేది సాధారణ నియమం. ప్రత్యేకమైన అంశాలలో దీనికి మినహాయింపులు ఉండొచ్చు. ఇదే కాదు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చే రిజర్వేషన్లు కాకుండా, ఇతర కారణాల ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్లకు 50 శాతం సీలింగ్ వర్తించదు’ అన్నారు. అందువల్లే స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం, వికలాంగులకు, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా వంటి వాటిలో మూడు శాతం రిజర్వేషన్లు అమలువుతున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. బీసీలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడు అగ్రకులాలు ఎలాంటి వాదనలు చేశాయో, ఇప్పుడు ముస్లిం, ఇతర మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తే మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్లవని అలాంటి వాదనలే చేస్తున్నారు. ఏదైనా కులం సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడితే దాన్ని వెనుకబడిన వర్గంగా గుర్తించి రిజర్వేషన్లు కల్పిస్తే, అది కులం ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు కాదనినాడు సుప్రీంకోర్టు తెలిపింది. అదే సూత్రం ప్రస్తుత పరిస్థితుల్లో వర్తిస్తుంది. సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడిన సమూహాలకు రిజర్వేషన్లు కల్పించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఈ సందర్భంలోనే ‘ఒకవేళ ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ముస్లింల్లో వెనుకబాటు తనం ఉందని గుర్తిస్తే, వారికి రిజర్వేషన్ ఇవ్వొచ్చు’ అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది.

ముస్లిం, ఇతర మైనార్టీలకు బీసీ రిజర్వేషన్ల నుంచి కోటా కేటాయించడం వల్ల బీసీ సోదరులు ముస్లిం వ్యతిరేకులుగా మారుతున్నారు. నిజంగా ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలనే సంకల్పం ప్రభుత్వాలకు ఉంటే 50 శాతం సీలింగ్‌ను తొలగించాలి. ముస్లిం, ఇతర మైనార్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేష న్లు కల్పించాలి. ఓబీసీల్లోని 27 శాతం నుంచి 4.5 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అంటే ముస్లింల, ఇతర మైనార్టీల ప్రాతినిథ్య హక్కును తగ్గించడమే అవుతుంది. బీసీలకు, ముస్లింలకు మధ్య గొడవపెట్టే ఎత్తుగడను ప్రభుత్వం అమలు చేస్తున్న ది.బీసీల వైఖరి కూడా ముస్లింల పట్ల అహేతుకంగా ఉన్నది. బీసీలు అగ్రకుల రాజకీయాలను సరిగ్గా అర్థం చేసుకోవా లి.మాయావతి అగ్రకులాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తే బీజేపీ, కాంగ్రెస్‌లు ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. అలాగే బీసీలు కూడా ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించలేదు. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగ సమ్మతం కావు. మరి అగ్రకులాలకు కల్పించే రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమని ఏ ఒక్క బీసీ సం ఘమూ కోర్టులో కేసువేయలేదు. మతం పేరుతో ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న బీసీ సంఘాలు అగ్రకులాలకు ఇచ్చే రిజర్వేషన్లు మతపరమైనవని ఎందుకు వాదించడం లేదు? కోర్టులు కూడా అగ్రకులాలకు రిజర్వేషన్లను ఎందుకు తిరస్కరించడం లేదు? వెనుక బడిన ముస్లిం లకు, ఇతర మైనార్టీలకు రిజర్వేషన్లు ఇస్తామంటే మతం పేరుతో ఎందుకు వ్యతిరేకిస్తున్నారు.అందువల్ల ముస్లింలకు ఇతర మైనార్టీలకు రిజర్వేషన్ ఇవ్వ డాన్ని న్యాయవ్యవస్థతో సహా ఎవరూ వ్యతిరేకించ కూడదు. న్యాయ వ్యవస్థ ద్వారా కూడా మైనార్టీలకు న్యాయం జరగకపోతే.. ప్రజలు ఎన్నుకున్న పార్లమెం ప్రజలకు సరియైన న్యాయం చేయాలి. ఈ దేశపౌరులైన ముస్లింలకు రాజ్యాం గబద్ధమైన న్యాయంచేసే అత్యున్నత అధికారం పార్లమెంటుకే ఉన్నది. కాబట్టి బీసీ రిజర్వేషన్ కోసం రాజ్యాంగ సవరణ చేసినట్లే, జనాభా ప్రాతిపదికన మైనార్టీ రిజర్వేషన్ కోసం రాజ్యాంగ సవరణ చేయాలి. ముస్లిం, ఇతర మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించాలనే సంకల్పం, నిజాయితీ కేంద్ర ప్రభుత్వానికి ఉంటే, గతంలో బీసీ రిజర్వేషన్ కోసం రాజ్యాంగ సవరణ చేసినట్లే చేయాలి. అలా కాకుండా జీవోలు, ఆర్డినెన్స్‌ల పేరుతో మైనార్టీలను మభ్యపెట్టాలని చూస్తే, ముస్లిం, బీసీల మధ్య ఘర్షణ పెట్టాలని చూస్తే ప్రభుత్వం భంగపడక తప్పదు. 

-కనీజ్ ఫాతిమా
(సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ సహాయ కార్యదర్శి

Namasete Telangana News Paper Dated : 17/06/2012 

No comments:

Post a Comment