Monday, January 21, 2013

బహుజనం లోపించిన స్త్రీవాదం - జూపాక సుభద్ర



అగ్రకుల కమ్యూనిస్టులుగానీ, ఫెమినిస్టులు గానీ కుల పురాణాల్లోని సామాజిక పోరాట భావజాలాన్ని, వస్తువుని, యితివృత్తాల్ని స్ఫూర్తిగా తీసుకోకపోడాన్ని ఆధిపత్య కుల అణచివేతలుగానే అర్థం చేసుకోవాలి... శ్రీశ్రీ 'మహాప్రస్థానం'నుంచి ఓల్గా 'మృణ్మయనాదం' దాకా పరిశీలిస్తే ఆధిపత్య పురాణాల్లోని ఆధిపత్య ప్రతీకల్ని పాత్రల్ని (సీత, ఊర్మిళ, అహల్య) స్వీకరించారే తప్ప అణగారిన ప్రతీకల్ని పాత్రల్ని (తాటకి, శూర్పణఖ) అంటుకోలేకపోయారు. 

పాశ్చాత్య దేశాల్నించి భారతదేశానికి వచ్చిన అనేక యిజాల్లో ఫెమినిజం ఒకటి. యిది పాశ్చాత్య దేశాల్లోని ధనిక తెల్లజాతి స్త్రీల యిజమ్. 1970 దశకంలో పాశ్చాత్య దేశాల్లో పితృస్వామ్య వ్యవస్థపై స్త్రీల పోరాటాలతో, వారి సాహిత్యాలైన 'ది ఫెమినైన్' 'సెక్సువల్ పాలిటిక్స్' లాంటి సాహిత్యాలతో భారతదేశ ధనిక చదువుకున్న అగ్రకులాల స్త్రీలు ప్రభావితులయ్యారు. పితృస్వామిక అణచివేతల్ని పెత్తనాల్ని కుటుంబ లైంగిక హింసల్ని నిరసించిన చైతన్యం స్త్రీవాదంగా భారతదేశంలో ఉద్భవించింది. ఆంధ్రప్రదేశ్‌లో వామపక్ష ఉద్యమాల్లోని అగ్రకుల పురుషుల్తో సమానంగా విద్యాధికులైన ధనిక, మధ్యతరగతి సీమాంధ్ర అగ్రకులాల స్త్రీలు స్త్రీవాదాన్ని అందుకొని తమని ఫెమినిస్టులుగా ప్రకటించుకున్నారు. సాంఘికంగా తమ కులాల పురుషుల్తో విద్య ఉద్యోగం వంటి కొన్ని రంగాల్లో సమానంగా వున్న యీ స్త్రీలు సమాజంలోని రాజకీయ ఆర్థిక సామాజిక రంగాల్లో జెండర్ స్పృహ ను పెంచగలిగారు. పీవోడబ్ల్యూ, స్త్రీశక్తి సంఘటన, ఫెమినిస్టు స్టడీ సర్కిల్, మహిళా విద్యార్థి వేదిక వంటి సంఘాలేర్పాటు చేసి స్త్రీల (అగ్రకులాల) శరీరాల చుట్టూ అల్లబడిన మిత్, కుటుంబాల్లో వుండే అప్రజాస్వామిక విలువలు, జరిగే హింసల్ని, పితృస్వామిక అణచివేతల్ని ప్రశ్నించారు.

స్త్రీవాద సాహిత్యం ప్రధానంగా సీమాంధ్ర, ధనిక, మధ్యతరగతి, అగ్రకులాల స్త్రీల నుంచి వచ్చింది. వీరు వివిధ ప్రాంతాల, కులాల, మతాల అస్తిత్వాల వైవిధ్యాల్ని వైరుధ్యాల్ని పక్కకు నెట్టి స్త్రీలంతా ఒక్కటే, భిన్నత్వాలు లేవు అనే అప్రజాస్వామికాల్ని సమాజంలో, సాహిత్యంలో ప్రచారం చేయడం జరిగింది. జరుగుతున్నది.

పాశ్చాత్య దేశాల్లోని తెల్లజాతి స్త్రీలు ఫెమినిజాన్ని ఆక్రమించుకొన్నట్లు ఇక్కడ అగ్రకులాల స్త్రీలు స్త్రీవాదాన్ని తమ పరిధిలోనికి తెచ్చుకున్నరు. నల్లజాతి మహిళల అస్తిత్వాలు భ్నిమైనవి అని తెలిసి కూడా తెల్లజాతి ధనిక స్త్రీలు తమ వర్ణ దురహంకారాన్ని ప్రదర్శించినట్లే ఇక్కడి అగ్రకుల 'స్త్రీవాదం' ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల సమస్యల్ని ఎజెండా కాకుండా కప్పేసిందని బహుజన కులాల మహిళలు ప్రశ్నిస్తున్నారు. కులం అగ్రవర్ణం కావడం, జాతీయోద్యమ ఫలితాలను అందుకోవడం వల్ల ఆధిపత్య కులాల స్త్రీలకు నిమ్నకులాల మహిళల కంటే మెరుగైన జీవితం, చదువులు, సంపదలు ఒనగూరినయి. ఆధిపత్య కుల మగ ప్రపంచం వారి స్త్రీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థల్ని కొంత వరకైనా అందుబాటులో వుంచింది. దురాచారాల్ని సంస్కరించింది. చదువు నేర్పింది. తమ కనుసన్నల్లో నుంచి కనుమరుగు కాకుండా, కంట్రోలు తప్పకుండా ఉద్యమాలు చేయించింది. ఉద్యోగాలు చేయించింది, చట్టసభలకు పంపింది. యీ వెసులుబాటుతో ఆధిపత్య కులాల స్త్రీలకు తమ మగవాళ్ల చేతిలో వున్న ప్రచురణ సంస్థలు, అకాడమీలు, మీడియా వంటి సంస్థల వల్ల తమ సాహిత్య విస్తృతిని పెంచుకునే అవకాశాన్నిచ్చింది. కవిత్వం, కథ, నవల, సిద్ధాంత వ్యాసాలు, వారి సమస్యల్ని వస్తువుగా చేసుకొన్న సాహిత్యం తెలుగులో కోకొల్లలుగా వచ్చింది- ఫెమినిస్టు సాహిత్యంగా. మిగతా రంగాల్లోకి కూడా వీరు విస్తరించగలిగారు. పత్రికల్లో ప్రత్యేక స్త్రీలపేజీలు, మహిళా కాలమ్స్, మహిళా పత్రికలు, చానల్లు ఏర్పాటు చేసుకోగలిగారు.

స్త్రీలంతా ఒక్కటే, వారి సమస్యలన్ని, బాధలన్ని వొక్కటే, 'మాకు గోడలు లేవ'ని నినదిస్తున్న స్త్రీవాద సాహిత్యం తమకన్నా హీనంగా దోపిడీ చేయబడుతూ అవమానంగా అనేక హింసల్తో జీవిస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల సమస్యల్ని, తమ సాహిత్యంలో ఏ మేరకు భాగస్వామ్యం కల్పించగలిగారు? అట్లా తమ సామాజిక బాధ్యతలను ఎంతవరకు ప్రకటించుకున్నారు? అనేది చర్చించడం యీ వ్యాసం ప్రధాన ఉద్దేశం.

ఈ ఫెమినిస్టులు వేసిన మొదటి పుస్తకం 'మనకు తెలియని మన చరిత్ర' (1986). ఏడుగురు సంపాదకుల్లో ఒక్క దళిత మహిళ కనిపించదు. ఇది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న స్త్రీల సజీవ చరిత్రగా వేస్తున్నామని చెప్పి ఆధిపత్య కులాల స్త్రీల (ముగ్గురు, నలుగురు బీసీ మహిళలు మినహా) సజీవ చరిత్రల్నే చరిత్రీకరించడం జరిగింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న అంటరాని, ఆదివాసి మహిళల సజీవ చరిత్రల్ని చీకటి చేయడం జరిగింది. వీరు వేసిన మొదటి అడుగే అంటరాని మహిళల్ని, ఆదివాసి మహిళల్ని విస్మరించడంగా మొదలు కావడం దురదృష్టకరం. 1953లో ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ 'ఆంధ్ర కవయిత్రుల చరిత్ర'లో కనబరిచిన కుల జెండర్ వివక్షలకు భిన్నమైన చైతన్యాలేవీ యీ వామపక్ష భావాలు కలిగిన అగ్రకుల స్త్రీలు అందించలేకపోయారు. యిప్పటికీ స్త్రీవాద సాహిత్యంలో యివే ధోరణులు కొనసాగుతున్నయి.

1989లో ఫెమినిస్టు స్టడీ సర్కిల్ పేరుతో ప్రచురించిన 'మాకు గోడలు లేవు' ఫెమినిజం పరిచయంగా వ్యాస సంకలనం వచ్చింది. వ్యాస అంశాలు (1) ఫెమినిజం అంటే ఏమిటి? (2) అంతర్జాతీయ స్త్రీ విముక్తి ఉద్యమ చరిత్ర (3) మూడవ ప్రపంచ దేశాల పోరాటాల్లో స్త్రీల పాత్ర (4) ఫెమినిస్టు అవగాహన. యీ అంశాల్లో స్థానికంగా వున్న నిమ్నకులాల మహిళల అనేక వీరోచిత పోరాటాలు వీరికి కనబడలేదు. గ్రామాల్లో దొరల అరాచకాలకు వ్యతిరేకంగా బహుజన కులాల మహిళల పోరాటాలు, సింగరేణి కాలరీస్‌లో బాయిదొరల యిండ్లల్ల అకృత్యాలకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కాల్పులకు గురైన అంటరాని మహిళల ఉద్యమాలు, తునికాకు పోరాటాలు, మహిళలు చేసిన మద్దూరులాంటి భూపోరాటాలు, బీడీ కార్మిక ఉద్యమాలు, కూలి పోరాటాలు ఫెమినిస్టులకు అప్రస్తుతాలైనవి. అంతర్జాతీయ స్త్రీ విముక్తులు, వారి ఉద్యమ చరిత్రలను ప్రముఖంగా ప్రచురించారు. 'మాకు గోడలు లేవు, గోడల్ని పగలగొట్టడమే మా పని' అని శ్రీశ్రీ నినాదాన్ని అందిపుచ్చుకున్న ఫెమినిస్టులు కులగోడలు, శ్రమగోడలు, దొర దొర్సాని గోడలు, మత గోడలు, జోగినీ దురాచారాలలో బందీలై బాంచలకు బాంచలైన మహిళల ప్రత్యేక గోడల్ని అంటుకోలేదు.

1993లో 'నీలి మేఘాలు' స్త్రీవాద కవితా సంకలనం (ఓల్గా, వసంత కన్నాభిరాన్ సంపాదకులు)లోని కవయిత్రులంతా దాదాపు సీమాంధ్ర అగ్రకులాల కవయిత్రులు. కవితా వస్తువులు కూడా తమ అగ్రకుల స్త్రీల చుట్టు పరిమితమైన అంశాలే. (ఇందులో ఒక తెలంగాణ ఆధిపత్య కులం, సీమాంధ్ర ముస్లిం, దళిత కవయిత్రులే కనబడ్తారు.) సంపాదకుల్లో ఒకరు 'స్త్రీగా రాయడమంటే..' అని రాస్తూ ఏ స్త్రీగా రాయడమో విశ్లేషించలేదు. స్త్రీ అంటే చదువుకున్న కోస్తాంధ్ర అగ్రకుల స్త్రీ అనే ఒక్క అస్తిత్వమేనా? ఈ స్త్రీ చుట్టూతా అల్లబడిన కుటుంబ హింస, లైంగిక హింస, మగాధిపత్యం, బాడీ పాలిటిక్స్ గురించిన రాజకీయ అవగాహనలే ఈ సంకలనంలోని వస్తువులు. ఇట్ల నిమ్నకులాల జెండర్ అస్తిత్వాలు, వాటి రాజకీయాలు చర్చలోకి, వెలుగులోకి రాకుండా స్త్రీవాద సాహిత్యం కృషి చేసింది.

1990లో 'కఠోర షడ్జమాలు' ఫెమినిస్టు వ్యాసాలు వసంత కన్నాభిరాన్ వెలువరించారు. యీ వ్యాసాల్లో 'న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి' అనే హిందూ మనువాదాన్నిగానీ, మనిషిని మనిషిగా చూడని కుల వ్యతిరేకతలుగానీ కనిపించవు. 1995లో 'సరిహద్దులు లేని సంధ్యలు' కల్పనా కన్నాభిరాన్, ఓల్గా, వసంత కన్నాభిరాన్ సంపాదకత్వంలో వచ్చింది. ఇది స్త్రీల సంఘాల పరిచయ వ్యాసాల సంకలనం. ఫెమినిస్టు రాజకీయాలు, కార్యాచరణ, ప్రశ్నలతో ఫెమినిస్టు సిద్ధాంత వ్యాస సంకలనంగా వచ్చింది. ఇందులోనూ పూర్తిగా అగ్రవర్ణ స్త్రీల కుటుంబాలు, లైంగిక అణచివేత, పితృస్వామ్య పెత్తనాల చుట్టూ చర్చ సాగింది.

'తొలి వెలుగులు' 2003లో స్త్రీవాద సిద్ధాంత వికాసంగా ఫెమినిస్టు థియరీగా ఓల్గా వేశారు. అమెరికా, యూరప్ దేశాల శ్వేతజాతి స్త్రీలైన ఎబిగిల్ ఆడమ్స్, జుడిత్, మేరి ఉల్ స్టోన్ ఫ్రాన్సిన్‌రైట్, జాన్ స్టువర్ట్‌మిల్ వంటివారు రూపొందించిన స్త్రీవాదాల్ని వారి దృక్పథాల్ని చర్చల్ని యథాతథంగా దిగుమతి చేసిన సిద్ధాంతంగా ఈ వ్యాస సంపుటి వుంది. మత చర్చ కూడా బైబిల్ చుట్టు ఉన్న మిత్ చర్చ గూర్చిన అంశమేగానీ హిందూ మతం గూర్చిన చర్చ లేదు. 'స్త్రీలు-ఆర్థిక ప్రపంచం' వ్యాసంలో 'స్త్రీలు చేసే యింటి చాకిరికి వున్న ఆర్థిక విలువ ఎంతైనప్పటికి వాళ్లు దానిని పొందలేరు' అనేది యింటి చాకిరి చేసే అగ్రకులాల మధ్యతరగతి స్త్రీల ఆర్థికంగా చెప్పారు. మరి యింటి చాకిరీ, బైటి చాకిరి చేసే అణగారిన మహిళల చాకిరికి వున్న ఆర్థిక విలువల మాటేంటి? 'యింటి చాకిరికి జీతం లేని'తనాలే ఎజెండా అయింది కాని యింటి చాకిరితో పాటు బైటి చాకిరీకి కూడా జీతం లేని కుల అణచివేతల్ని గూర్చిన అంశాల మాటేంది? 'మాతృత్వం వల్ల పనిచేయలేనివారిగా ముద్రవేసి స్వాతంత్య్రాన్ని నిరాకరిస్తున్నారు' సరే, కాని బహుజన కులాల మహిళలు యింకో నిమిషానికి ప్రసవిస్తారనేదాకా సామాజిక ఉత్పత్తిలో పాల్గొంటున్న విషయం విస్మరించారు.

2009లో 'స్త్రీవాద రాజకీయాలు-వర్తమాన చర్చలు' (రమా మెల్కోటె, కె.సజయ సంపాదకులు) అన్వేషి-రీసెర్చి సెంటర్ ఫర్ వుమెన్ స్టడీస్ వేసింది. వర్తమాన చర్చలు-లో బహుజన మహిళల ప్రశ్నలు, అస్తిత్వాలు చర్చకు రాకపోవడమే వుంది. అంశాలన్నీ ఆధిపత్య స్త్రీల చుట్టున్న రాజకీయ విశ్లేషణలే. కేవలం ఒక అంటబడని మహిళకు తన జెండర్ పాలిటిక్స్‌ను చర్చించే అవకాశం కల్పించడడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ వ్యాసాల్లో ఎక్కువగా ఇండియన్ ఫెమినిస్టులు- వీణామజుందార్, ఇందు అగ్నిహోత్రి, పార్దా చటర్జి, ఊర్వశి బుటాలియ, వందనా సోనాల్కర్, ప్లేవియా ఆగ్నేస్, బీనా అగర్వాల్ వంటి తెలుగేతర ఇండియా ఫెమినిస్టులు వర్తమానంలో స్త్రీవాద ఉద్యమ చర్చలు చేశారు. అవన్నీ అగ్రకుల స్త్రీల దృష్టికోణాల నుంచే ఉన్నాయి. స్త్రీవాద కథలు, నవలలు కూడా తెలుగులో విస్తృతంగానే వచ్చినయి. అవన్నీ కూడా ఆధిపత్య కుల జెండర్ దృష్టికోణాలే.

దీన్నంతా స్త్రీలందరి వాదంగా ప్రచారం చేసుకోవడం జరిగింది. అణగారిన కులాల జెండర్ సమస్యల్ని అప్రస్తుతం చేశారు. అవాచ్యం చేశారు. కులసమాజంలో పురుషులంతా ఒక్కటి కానట్లే స్త్రీలు కూడా ఒకటిగా లేరు. పురుషాధిక్యత కూడా అణగారిన కుల మహిళల మీద ఆధిపత్య కులాల స్త్రీల మీద ఒకే తీరుగా లేదు. యిది ఒప్పుకోడానికి, తద్వారా కార్యచరణకి స్త్రీవాదులు సిద్ధంగా వున్నట్లు కనిపించరు. ఉత్పత్తి కులాల స్త్రీల భాషని బూతనీ, రోతనీ, తెలంగాణమనీ, అర్థం కావట్లేదని, రాసేవాల్లే లేరనీ వారి రచనల్ని ఆధిపత్య కుల రచయితలు చీకటిలోకి నెట్టినారు. ఆ దారిలోనే స్త్రీవాదులు తమ సంకలనాల అగ్రహారాలకి బహుజనుల రచనల్ని అంటనివ్వలేదు. యివి ఎంత అబద్ధాలో దళిత మహిళల సాహిత్య సంకలనం 'నల్లపొద్దు' నిరూపించింది.

భారతదేశ కులపురాణాలన్నీ సామాజిక సాంస్కృతిక అణచివేతల్నించి వచ్చినవే. మెజారిటీ ప్రజల్లో కుల పురాణాలు సాహిత్య ప్రక్రియగా, సాంస్కృతిక కళారూపాలుగా కొనసాగుతున్నప్పటికీ యిప్పటిదాకా అగ్రకుల కమ్యూనిస్టులుగానీ, ఫెమినిస్టులుగానీ కుల పురాణాల్లోని సామాజిక పోరాట భావజాలాన్ని, వస్తువుని, యితివృత్తాల్ని స్ఫూర్తిగా తీసుకోకపోడాన్ని ఆధిపత్య కుల అణచివేతలుగానే అర్థం చేసుకోవాలి.

కమ్యూనిస్టు సాహిత్యంలోనూ, ఫెమినిస్టు సాహిత్యంలోనూ శ్రీశ్రీ 'మహాప్రస్థానం'నుంచి ఓల్గా 'మృణ్మయనాదం' దాకా పరిశీలిస్తే ఆధిపత్య పురాణాల్లోని ఆధిపత్య ప్రతీకల్ని పాత్రల్ని (సీత, ఊర్మిళ, అహల్య) స్వీకరించారే తప్ప అణగారిన ప్రతీకల్ని పాత్రల్ని (తాటకి, శూర్పణఖ) అంటుకోలేకపోయారు. స్త్రీవాదులు కుల, హిందూమత అణచివేతల గురించి ఎక్కడా చర్చించలేదు. యీ చర్చ చేస్తే తమ కులాల పురుషుల్తో పాటు తాము కూడా బహుజన మహిళల్ని అణచివేస్తున్న తీరు బహిర్గతమవుతుంది. అందుకే పాశ్చాత్య ధోరణిలోనే ఫెమినిస్టులు చర్చిస్తారు.

1934లోనే 'కుల నిర్మూలన' గ్రంథంలో అంబేద్కర్ 'కుల వ్యవస్థ శ్రమ విభజననే కాదు శ్రామికుల మధ్య విభజనను కూడా సృష్టించింద'ని విశ్లేషించాడు. దీన్నంతా పక్కకు పెట్టి కమ్యూనిస్టు అగ్రవర్ణ పురుష నాయకత్వం భారతదేశ కుల వ్యవస్థకు యిమడని వర్గ వ్యవస్థను దిగుమతి చేసుకొని కులాలుగా వున్న శ్రామిక సమూహాల నన్నింటిని 'కార్మికవర్గం'గా కట్టగట్టి వారిమీద తమ సామాజికాధిపత్యాల్ని కొనసాగిస్తూ కింది కులాల నాయకత్వాల్ని కిందనే అణచిపెట్టారు. వారి అడుగుజాడల్లోనే స్త్రీవాదులు దేశీయ బహుజన మహిళా విముక్తికి సరిపోని పాశ్చాత్య శ్వేతజాతి స్త్రీల సిద్ధాంతాన్ని ఫెమినిజంగా దిగుమతి చేసుకొన్నారు. అందుకే aవారి సిద్ధాంతాల్లో, రచనల్లో బహుజనులు కనిపించరు. స్త్రీవాదులది సామాజిక ఉత్పత్తికి దూరమైన ప్రపంచం. బహుజన స్త్రీలది సామాజిక ఉత్పత్తిలో వున్న ప్రపంచం. వారి ప్రపంచం చిన్నది. వీరి ప్రపంచం విస్తృతమైంది.

అట్లనే ఫెమినిస్టు సైద్ధాంతిక ఆచరణ బహుజన స్త్రీల మీద నాయకత్వ పెత్తనాల్ని, అణచివేతల్ని చలాయిస్తూ 'భారత ఫెమినిజం'గా చలామణీ అవుతున్నది. దొర్సానుల ఫెమినిజం ప్రజాస్వామీకరించబడాలంటే మెజారిటీగా (85%) వున్న బహుజన వర్గాల మహిళావరణాలను, చరిత్రలు, సంస్కృతులు, కళలు, సాహిత్యాలను గుర్తించి వెలికితీయాల్సిన అవసరముంది.

- జూపాక సుభద్ర
98499 05687
('తెలుగు సాహిత్యం: వర్తమాన రాజకీయాలు-సామాజిక ఆర్థిక ఉద్యమాలు' అనే అంశంపై హైదరాబాద్‌లో జరిగిన జాతీయస్థాయి సదస్సులో సమర్పించిన పత్రంలోని కొన్ని భాగాలు)

Andhra Jyothi News Paper Dated: 21/1/2013

No comments:

Post a Comment