Saturday, October 5, 2013

సంకట స్థితిలో సంక్షేమ హాస్టళ్లు By మూడ్‌ శోభన్‌

సామాజికంగా, ఆర్థికంగా, విద్యా ఉద్యోగ రంగాలలో వెనుకబడిన తరగతులకు ఉపశమనం కల్గించటం కోసం భారత రాజ్యాంగం కల్పించిన అవకాశాల మేరకు దేశంలోని షెడ్యూల్ట్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, వెనుకబడిన తరగతులకు హాస్టళ్ళ వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. దళిత, బలహీన వర్గాలకు అందుతున్న ఈ సౌకర్యాలను ప్రభుత్వాలు భిక్షలాగా భావిస్తున్నాయి. అందుకే అరకొరగా నిధులు కేటాయిస్తున్నాయి. 'ఇప్పటికి కల్పిస్తున్న సౌకర్యాలకు అదనంగా మరిన్ని సౌకర్యాల కోసం ఇంకెంత కాలం డిమాండ్‌ చేస్తా'రంటూ వస్తున్న ఈసడింపుల్లో కూడా వాస్తవం ఉందేమోనని కొందరు హాస్టల్‌ విద్యార్థులు అనుకుంటున్నారు. ప్రభుత్వాలు హాస్టళ్ళ పట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణి, చిత్తశుద్ధిలేమి పై తప్పుడు ప్రచారాలకు తోడ్పాటునిచ్చే విధంగా ఉంటున్నాయి. రాజ్యాంగంలోని 16వ అధికరణ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశం ఉండాలి. 39వ అధికరణ (సి) ప్రకారం సంపద ఒక్క దగ్గరే కేంద్రీకరించకుండా చూడాలి. 46వ అధికరణ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, తదితర బలహీన వర్గాల ఆర్థిక ప్రయోజనాలకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి అంటూ రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. రిజర్వేషన్‌ సౌకర్యం కల్పిస్తున్నది. ఈ నిర్దేశాల సారాంశాల ఫలితంగానే హాస్టళ్ళ సౌకర్యం పేద, దళిత, బలహీనవర్గాలకు అందుతున్నది. ప్రభుత్వాలు రాజ్యాంగ నిర్దేశాలను చిత్తశుద్ధితో అమలు చేయటం లేదు. హాస్టళ్ళను ఏర్పాటు చేసి నడుపుతున్నా వాటి పట్ల, అందులో చదువుతున్న విద్యార్థుల పట్ల మమకారం లేకుండా, వారి చదువుల పట్ల అశ్రద్ధ చూపుతూ వస్తున్నాయి.
సంక్షేమ హాస్టళ్ళకు ఇచ్చే ప్రాధాన్యం ఎప్పుడూ మాటలకే పరిమితమౌతున్నది. భారత మాజీ రాష్ట్రపతి కెఆర్‌ నారాయణన్‌ అన్నట్లు 'సమాజంలో కొద్ది మంది శీతల పానీయాలు సేవిస్తుండగా, పెద్ద సంఖ్యలో ప్రజానీకం త్రాగునీటికి కూడా నోచుకోవటం లేదు. ఈ నేపథ్యంలో ఈ తరగతులను అవతలి ఒడ్డుకు చేర్చటానికి ప్రత్యేక మార్గాలు అవసరం.' తరతరాలుగా సామాజికంగా, ఆర్థికంగా, వైజ్ఞానికంగా వెనుకబడిన తరగతులైన దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు రాష్ట్ర జనాభాలో అత్యధికులైనా నేటికీ మొదటితరం కూడా విద్యను అభ్యసించలేని స్థితిలో ఉన్నారు. వీరికి విద్యను అందించటం కోసం ఏర్పాటైన యంత్రాంగమే 'హాస్టల్‌'. వారి దయనీయమైన జీవన స్థితి గతుల నుంచి వెసులుబాటు కల్పించి వారికి విద్యను అందించటమే దీని ఉద్దేశం. కానీ ఆచరణలో ఇవి రోజురోజుకు నిర్వీర్యం అవుతూ పేద దళిత, గిరిజనులను విద్య నుంచి దూరం చేస్తున్నాయి.
ప్రపంచీకరణ-సంక్షేమహాస్టళ్ళు
1990 అనంతరం ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ రూపంలో ముందుకొచ్చిన ఆర్థిక విధానాలు ప్రభుత్వాలను సంక్షేమం నుంచి పక్కకు నెట్టేశాయి. ప్రపంచబ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వాలు సంక్షేమ రంగం నుంచి తప్పుకుంటున్నాయి. ఈ విధానాలనే సర్వరోగ నివారిణిగా పేర్కొంటున్న పాలకుల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ఫలితంగా హాస్టళ్ళు నిర్వీర్యమై, హాస్టల్‌ విద్యార్థులు తీవ్ర సమస్యల నెదుర్కొంటున్నారు. నిధుల కోత, సౌకర్యాల లేమితో హాస్టల్‌ వ్యవస్థ కుంటుబడుతున్నది. వీటిని రక్షించుకుని పటిష్ట పరచడం కోసం ఉద్యమించాల్సిన అవసరమున్నది.
రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్ళ నిర్వహణ కోసం ప్రభుత్వం 1997లో 126 జీవోను విడుదల చేసింది. హాస్టళ్ళను మరింత బాధ్యతాయుతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి, నిర్ణయాల అమలులో ఆలస్యం చోటు చేసుకోకుండా, ఏఏ అధికారాలు ఏ అధికారి నిర్వర్తించాలో, ఏ సౌకర్యానికి ఎంత మొత్తం కేటాయించాలో నిర్ధారిస్తూ ఆ జీవోలో పొందుపరిచింది. 1997 నాటి ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా ఆ కేటాయింపులు చేశారు. ప్రస్తుత ధరలకు అవి ఏ విధంగానూ సరితూగవు అనేది స్పష్టం. కానీ ఆనాటికి నిర్దేశించిన కేటాయింపులు కూడా హాస్టళ్ళకు సరిగ్గా చేరటం లేదు. అందుకు ప్రభుత్వం నిధులనూ విడుదల చేయటం లేదు. బడ్జెట్‌ కేటాయింపులు చేసినా నామమాత్రంగానే నిధులు వెచ్చిస్తున్నారు.
శాశ్వత వార్షిక సమీక్షా కమిటీ అవశ్యం
నిత్యావసర వస్తువుల ధరలు చుక్కల్లోకి ఎగబాకుతున్నాయి. హాస్టళ్ళ నిర్వహణకు అవసరమైన కేటాయింపులు మాత్రం గొర్రె తోక బెత్తెడు అన్న చందంగా అక్కడే ఉంటున్నాయి. ఒక్క విద్యా సంవత్సరంలోనే ధరలు అనేక రెట్లు పెరుగుతున్నాయి. కానీ హాస్టల్‌ విద్యార్థులకు ఇస్తున్న మెస్‌ ఛార్జీలు, కాస్మొటిక్‌ చార్జీలు, ఇతర కేటాయింపులు 2008 నాటివే కొనసాగుతున్నాయి. ప్రభుత్వ చట్టం ప్రకారం విద్యార్థుల కేటాయింపుల్లో ఏటా 10 శాతం పెరుగుదల ఉండాలి. అది ఎక్కడా అమలుకు నోచుకోవటం లేదు. హాస్టల్‌ విద్యార్థులకు చెందవలసిన వసతులను సమీక్షించి ప్రతిపాదనలు చేయటానికి ఒక యంత్రాంగమంటూ లేదు. రాష్ట్రంలో దాదాపు 6,444 హాస్టళ్ళలో చదువుతున్న దళిత, బలహీన, గిరిజన విద్యార్థుల అవసరాలు గుర్తించటానికి ఏ యంత్రాంగమూ లేదు. ఫలితంగా విద్యార్థులు పౌష్టికాహార లోపంతో అనేక వ్యాధులకు గురౌతున్నారు. భోజనవసతి కల్పించటం ద్వారా అక్షరాస్యతా శాతాన్ని పెంచటానికి, డ్రాపవుట్‌ తగ్గించటానికి, మళ్ళీ బడికి మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు పరుస్తున్నారు. హాస్టల్‌ విద్యార్థులకు కేవలం మెస్‌ఛార్జీలే కాక 126 జీవో ప్రకారం రావలసిన అన్ని సౌకర్యాలు, వాటికి కేటాయింపులు సరిపోయే విధంగా పెంచాల్సి ఉంది. ప్రభుత్వం నిర్దేశించే వస్తువులను కొనుగోలు చేయటానికి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కొనుగోలు కమిటీలు ఎలా ఉన్నాయో అలాగే వార్షిక సమీక్షా కమిటీలను కూడా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలి. ఇందులో కొనుగోలు కమిటీ ఛైర్మన్‌, పౌర సరఫరాల అధికారి, ఎఎస్‌డబ్య్లుఒ, వార్డెన్‌, మేట్రన్‌, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలకు ప్రాతినిధ్యం ఉండాలి. ఇది ప్రతి సంవత్సరం హాస్టల్‌కు విడుదల అవుతున్న నిధులు, విద్యార్థులకు అందవలసిన సౌకర్యాలు సరిగా అందుతున్నాయా?లేదా? ధరలు ఎంత శాతం పెరిగాయి, వాటికనుగుణంగా మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలు, ఇతర సౌకర్యాలకు కేటాయింపులు ఎంత శాతం పెంచాలో నిర్ధారించి ప్రభుత్వానికి నివేదించాలి.
సంక్షేమ గురుకులాలను బలోపేతం చేయాలి
ప్రభుత్వ చిత్తశుద్ధి లేమి, అవినీతి ఫలితంగా రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలు నిర్వీర్యమవుతున్నాయి. 1997లో వీటి ఆవిర్భావం నాటి యంత్రాంగం ఎలాంటి విస్తృతికీ నోచుకోని ఫలితంగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న దళిత విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమౌతున్నారు. సరళీకరణ నేపథ్యంలో విద్యారంగం అంగడి సరుకుగా మారి, మార్కెట్‌ శక్తులకు బానిసగా మారింది. దళిత గిరిజనులకు కొద్దిమేరకైనా నాణ్యమైన విద్య సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ద్వారా మాత్రమే అందుతున్నది. ఈ సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు ఐఐటిల్లో, ఎఐఇఇఇలో సీట్లు పొందారు. ఇలాంటి విద్యాసంస్థలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. వీటి అభివృద్ధికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఆరు జోన్లలో ఒక్కొక్క జోన్‌కు సగటున 50 పాఠశాలలు ఉన్నాయి. కానీ వీటి పర్యవేక్షణకు నియమించిన ఆరుగురు జోనల్‌ అధికారులు సరిపోవటం లేదు. ఉన్న జోనల్‌ అధికారులు కూడా ఆయా జోన్‌ పరిధిలో కాకుండా హైదరాబాద్‌లో ఉండి విధులు నిర్వర్తించటం వల్ల ఫలితం నెరవేరటం లేదు. జోనల్‌ అధికారులను పెంచాల్సిన అవసరం ఉంది.
Prajashakti Telugu News Paper Dated: 05/10/2013 

No comments:

Post a Comment