Wednesday, December 11, 2013

ఉన్నతవిద్య ఉన్నత కులాలకేనా? By గిన్నారపు ఆదినారాయణ


ఉన్నత విలువలకు నిలయాలుగా ఉండాల్సిన చదువుల నిలయాలు కులగజ్జికి కేంద్రంగా మారుతున్నాయి. దళిత, వెనుకబడిన విద్యార్థులకు ఉరితాళ్లు పేనుతున్నాయి.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటు న్న విద్యార్థుల్లో తెలంగాణ ప్రాంత విద్యార్థులే ఎక్కువగా ఉండడం విషాదం.

కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యా విధానానికి, ఉత్తమ పరిశోధనా రంగానికి మారుపేర్లు. అలాంటి కేంద్రీయ విశ్వవిద్యాలయాలే వల్లకాడుగా మారి విద్యార్థులను బలి తీసుకుంటున్నాయి. ఢిల్లీ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ విశ్వవిద్యాలయం, ఇఫ్లూ వంటి విద్యాలయాల్లో అనేక ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కారణం ఏమిటి? కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోనే ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? విశ్వవిద్యాలయాలు విద్యార్థిని కేంద్రంగా చేసుకొని పాఠాలు బోధించడం లేదు. ఉపాధ్యాయులు వారికి కావలసిన విషయాన్ని రాబట్టుకోనుటకు వారికి అవార్డులు, రివార్డులు రావాలనే తపనతో విద్యార్థులను హింసా పీడనలకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక మంది విద్యార్థులు మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నా రు. రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి పరిస్థితి లేదు. ఆత్మహత్యలు చేసుకునే విద్యార్థులు కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనా ర్టీ విద్యార్థులు మాత్రమే. దీనికి అగ్రవర్ణ అధ్యాపకుల వేధింపులే కారణమని ఆరోపణలున్నాయి.

విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి కష్టపడి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి వారి ఆశయాలను నెరవేర్చుకోవాలని వస్తారు. అలా వచ్చిన దళిత విద్యార్థులను ప్రోత్సహిం చి వారి ఆలోచన విధానాన్ని పరిపక్వం చేయాల్సిన ఉపాధ్యాయు లు మొగ్గలోనే తుంచాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటిక్షిగేటెడ్ ఐఎంఏ,ఎంఏ విద్యార్థులను ముఖ్యంగా సెమిస్టరులో అనేక సా ర్లు ఫెయిల్ చేసి మరో సెమిస్టర్‌కు వెళ్ళకుండా వేధిస్తున్నారు. ఎంఫిల్, పీహెచ్‌డీ, ఎంటెక్ వంటి కోర్సుల్లో దళిత వెనుకబడిన ప్రాంత విద్యార్థులు పరిశోధక స్థాయికి రావడం చాలా అరుదు. ఒక వేళ వస్తే ‘గైడ్’ కులవివక్ష కారణంగా ఎంతో వేదన చెందుతు న్నారు. విద్యార్థులను అనేక రకాలుగా ఒత్తిడికి గురిచేసి వారి పరి శోధనా రిపోర్ట్‌కు సంతకం పెట్టకుండా రాత్రి, పగలు ల్యాబ్‌లో ఉంచడం వంటివి చేయడం వల్ల విద్యార్థులు మానసిక హిం సకు గురవుతున్నారు. తోటి విద్యార్థులకు చెప్పుకుంటే చులకనగా చూస్తారనే భయం తో ఎవరికీ చెప్పకుండా నలిగిపోతున్నారు. యూనివర్సిటీలో ఉండే ఇలాంటి సమస్యలను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇవి విద్యార్థులు చేసుకునే ఆత్మహత్యలు కావు, బలవన్మరణాలని చెప్పక తప్పదు.


విశ్వవిద్యాలయాలు విద్యార్థులను మేధావులుగా తయారు చేయడానికి బదులు మతిస్థిమితం లేకుండా చేస్తున్నాయి.ఇటీవల రంగాడ్డి జిల్లాకు చెం దిన వెంక అనే విద్యార్ధి రసాయన శాస్త్రంలో(ఎమ్మెస్సీ గోల్డ్ మెడల్) పరిశోధన చేస్తున్నాడు. ఈ శాఖలో పరిశోధన చేయడమే గొప్ప విషయం. ఇట్లాంటి విద్యార్థులను ఉపాధ్యాయులు హింసా పీడనకు గురిచేసి ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకు రావడం దారుణం. 2005లో సునీత అనే తెలుగు పరిశోధక విద్యార్థిని (యూజీసీ), జేఆర్‌ఎఫ్ సాధించిన దళిత విద్యార్థిని మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నది. 2006లో ఢిల్లీకి చెందిన ఆశిష్ ధావన్ అనే ఎమ్మెస్సీ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. 2007లో కేశవ్ అనే కరీంనగర్‌కు చెందిన ఎంఫిల్ తెలుగు పరిశోధక విద్యార్థి ఇంటికి వెళ్లి రైల్ పట్టాలపై ఆత్మహత్య చేసుకు న్నాడు. 2008లో సింతిల్ కుమార్ అనే తమిళనాడుకు చెందిన ఫిజిక్స్ పరిశోధక విద్యార్థి, 2009లో రంగాడ్డి జిల్లాకు చెందిన బాలరాజు అనే తెలుగు పరిశోధక విద్యార్థి, 2012లో రతన్ అనే ఎంఏ మాస్ కమ్యునికేషన్ విద్యార్థి, ఈ ఏడులోనే మల్లికార్జున్ అనే దళిత విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు.

2012లో స్వాతిరాణి అనే కరీంనగర్ విద్యార్థిని కూడా మనోవేదనకు గురై హాస్టల్లో ఉరి వేసుకొని చనిపోయింది. ఆదిలాబాద్‌కు చెందిన స్వరణ్ సింగ్ అనే ఫిజిక్స్ విద్యార్ధి కూడా తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 2013లో వరంగల్ జిల్లా భుపాలపల్లి గ్రామానికి చెందిన పుల్యాల రాజు ఉరివేసుకొని చనిపోయారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మోహిని మిశ్రా భవనంపై నుంచి కిందపడి చనిపోయింది. రంగాడ్డికి చెందిన దేవయ్య అనే పరిశోధక విద్యార్థి మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇలా వీరందరూ వెనుకబడిన ప్రాంతాలకు (ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి), దళితవర్గాలకు చెందిన విద్యార్థులే కావ డం గమనార్హం.

ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) హైదరాబాద్‌లో 2010లో ముత్యం అనే పరిశోధక విద్యార్థి (నిజామాబాద్), 2011లో బాలాజీ అనే పరిశోధక విద్యార్థి (చీరాల), 2012లో మదస్పిర్ కమ్రాన్ అనే జమ్మూకశ్మీర్‌కు చెందిన పరిశోధక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. 2013లో మోయిన్ ఖాన్ అనే పరిశోధక విద్యార్థి (తమిళనాడు), అలాగే ఈ అక్టోబర్ 22న ఉషా సాహు అనే బీఎడ్ విద్యార్థిని (ఒరిస్సా) ఆత్మహత్య చేసుకున్నారు.

ఇవి ఆత్మహత్యలు కావు, విశ్వవిద్యాలయాలు చేస్తున్న హత్య లు. యూనివర్సిటీ స్థాయి విద్యార్థి ప్రాణాలు కోల్పోతే అది ఆ కుటుంబానికే కాదు, సమాజానికి తీరని నష్టం. ఇందుకు దారితీస్తున్న పరిస్థితులపై దృష్టిసారించాలి. పరిస్థితులను చక్కదిద్దాలి. లేకుంటే రేపటి భవిష్యత్తు అంధకారం కాకమానదు.
-గిన్నారపు ఆదినారాయణ
రీసెర్చ్ స్కాలర్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాల Namasethe Telangana Telugu News Paper Dated: 12/12/2013 


No comments:

Post a Comment