Sunday, February 2, 2014

పెట్టుబడికి పుట్టిన సరికొత్త శిశువు! హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్

పెట్టుబడికి పుట్టిన సరికొత్త శిశువు! హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్
సాహితీ సజన చేసేవారికి, పాఠకులకు మధ్య సంబంధాలు పెంచుతూ సాహిత్యానికి ప్రాచుర్యం కల్పిస్తామని ప్రకటించిన హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ 2014 పేరుకు తగ్గట్లుగానే వేడుకగా జరిగింది. విదేశీ ప్రతినిధులు, భారతీయ భాషలకు చెందిన రచయితలు, పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులు, కార్పోరేట్ సంస్థల నిర్వాహకులు, కళాకారులు, ఎన్‌జీవోలు, ప్రభుత్వాధికారులు పాల్గొన్న ఈ సాహితీ సభలను తెలుగు నేలపై జరిగే సంప్రదాయ సాహితీ సభలకు భిన్నంగా నిర్వహించారు. ఆహ్వానము, ఆతిథ్యము, నేపథ్యము భిన్నంగా ఉన్న ఈ సాహితీ సభ ల వెనకున్నవాళ్లు, ముందుండి నిర్వహించినవాళ్లు అనేక కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నారు. ఈ సాహితీ సభలు జరుగకముందే వీటిపై కొందరికి అభిమా నం, మరికొందరికి అనుమానాలు ఉన్నాయి. ఎవరికి ఎన్ని అనుమానాలున్నా మాది కళా వేదిక.

సజనతో పండుగచేసుకుంటున్నాం.సాహిత్యాన్ని సేద్యం చేసేవారు, సాహిత్యాన్ని అభిమానించేవాళ్లు మాతో కలవొచ్చన్న హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ డైరెక్టర్ ఆహ్వానాన్ని మన్నించిన స్థానిక రచయితలు చాలా తక్కు వ. నిర్వాహకులు వ్యక్తిగతంగా ఆహ్వానించిన స్థానిక రచయితలు ఇంకా తక్కువ. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న సాహితీ సభల్లో ప్రాంతేతరులు ఎక్కువగా ఉండడం స్థానిక రచయితలు, కవులకు ఆశ్చ ర్యం కలిగించింది. భారతీయ సాంస్కతిక రాజధానిగా ప్రసిద్ధమైన కలకత్తా నగరం తర్వాత సాహితీ రంగంలో ప్రగతిశీలమైన భావాలకు పదునెక్కించే రచయితలు, కవులు ఉన్న నగరం హైదరాబాద్. రాజకీయ, ఆర్థిక, సామాజిక విషయాల్లో భారతీయ సమాజం కంటే ముందుండే హైదరాబాద్ నగర మేధావులు, కవులు, కళాకారులు ఈ సాహితీ సభ ల్లో మచ్చుకు కొందరు మాత్రమే ఉండడం మేధావుల మెదళ్లనే కాదు సామాన్యుల మెదళ్లనూ తొలుస్తోంది.

హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ డిగ్గీ ప్యాలస్‌లో జరిగే జైపూర్ లిటరరీ ఫెస్ట్‌కున్నంత ఆదరణ లేకపోయినా ఆ స్థాయిలో నిర్వహించడమే తమ భవిష్యత్ కర్త వ్యమని ప్రకటిస్తూ హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ ముగిసింది. జైపూర్ లిటరరీ ఫెస్ట్‌లో తొలి ఏడాది 50 మంది మాత్రమే పాల్గొన్నారు. నేడు 50 వేల మంది పాల్గొంటున్నారు. దానితో పోల్చితే హైదరాబాద్ ఫెస్ట్‌కు ఆదరణ బాగానే ఉంది. నాలుగో ఏడాదే 5 వేల మంది పాల్గొన్నారని హైదరాబాద్ లిటరరీ ట్రస్ట్ తన భవిష్యత్ వ్యూహాన్ని విప్పి చెప్పింది. సాహితీ అభిమానులయిన ట్రస్ట్ నిర్వాహకుల గొంతులోంచి వినిపించే మాటల్లో వ్యూహాలే కానీ విలువల జాడ ఇసుమంతయినా కనిపించట్లేదు. ఎవరెన్ని ప్రశ్నలు సంధించినా కళతో పండుగ చేసుకుందామనే సమాధానం! కుచ్చి కుచ్చి ప్రశ్నిస్తే ...మాకు ఏ జెండా లేదు, ఎజెండా లేదు. సాహిత్యానికి కూడా వేడుక జరపవచ్చని సమాజానికి తెలియజేస్తున్నాం. అం తే! అంటున్నారు నిర్వాహకులు. కానీ ఈ మాటలు నమ్మదగినవేనా? ఏ పరమార్థమూ లేకుండా కార్పోరేట్ సంస్థలు సాహితీ సభలు వెనకుండి నిర్వహిస్తా యా? కార్పొరేట్ శక్తులు ఆర్థిక పోషకులుగా ఉండి నిర్వహించిన హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ పెట్టుబడికి పుట్టిన సరికొత్త శిశువు!

హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో దళిత సాహిత్యంపై నిర్వహించిన కార్యశాలలో దళిత రచయిత్రి గోగు శ్యామల, జె. శ్రీనివాస్, గోరటి వెంకన్న తదితరులు ప్రసంగించారు. దళిత సాహిత్యంతో బ్రాహ్మణాధిక్య సమాజాన్ని ప్రశ్నిస్తున్న ఈ కవులు, రచయితలు ప్రాచీన సాహిత్యంలోని పద్యాలలో దళిత, బహుజనుల్ని అవమానించే పద్యాలున్నాయని ప్రస్తావించారు. ప్రపంచీకరణతో ఆధునిక సమాజంలోనూ అంటరానితనం అమలవుతోంది, ఎక్కువవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రచయితలు చెప్పినట్లుగా ప్రాచీన కాలంలోని కవులు బ్రాహ్మణులు. బ్రాహ్మణుల్ని పోషించిన రాజులు కూడా అగ్రకులాల వారే. రాజ్యాన్ని ప్రశ్నించకుం డా, రాజుల్ని కీర్తించే కవులు భూస్వామ్య శక్తుల కింద నలిగే ప్రజల్ని కించ పరిచారు.

భూస్వామ్య అణిచివేతను కొనసాగించేందుకు భారతీయ సమాజంలో అంటరానితనానికి, అగ్రకులాల ఆధిపత్యానికి ప్రాచీన సాహిత్యం మద్దతు పలికింది. రాజ్యం మారినప్పుడు కొత్త కవులకు పోషకులు లభిస్తారు. పాలకుల సంస్కతి, సంప్రదాయాలను రాజ్యం ఆదరిస్తుంది. పాలితుల సంస్కతి, సంప్రదాయాలను పాలకులు విస్మరిస్తారు. ప్రపంచంలోని అన్ని రాజ్యాలలోనూ ఆధిపత్య శక్తుల సంస్కతి వర్ధిల్లింది ఈ విధంగానే. ప్రపంచీకరణ నేపథ్యంలో అంటరానితనం పెరుగుతున్నమాట నిజమే. పెరుగుతున్న అంటరానితనానికి, అణిచివేతకు పోషకులు ఈ రాజ్యమే. వాటి ఫలితంగా ప్రయోజనాలు పొందేది అగ్రకుల భూస్వామ్య శక్తులు. వారికి మద్దతుగా నిలిచే పెట్టుబడిదారులు. అభివద్ధి నిరోధక భావజాలానికి అండగా నిలిచే ఈ కవల సోదరుల ఆధునిక ఆస్థానం హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్. రాజుల మెప్పు కోసం ఆనాటి కవులు పీడితుల పక్షం నిలువలేదు. ఈ కార్పొరేట్ సాహితీ సభ రాజ్యం మెప్పును కాదనుకుని ప్రజల పక్షం నిలుస్తుందా?

ప్రజలందరికీ సాహిత్యాన్ని చేరువచేస్తామంటున్న ఈ లిటరరీ ఫెస్ట్ ఏ సాహిత్యాన్ని చేరువ చేస్తుంది? ఎవరి కోసం చేరువచేస్తుంది? ఏ విలువల కోసం చేస్తుంది? ఈ అవసరం ఈనాడే ఎందుకొచ్చింది? జాస్మిన్ విప్లవం ప్రజాస్వామిక ఆకాంక్షగా ముందుకొస్తే దానిని తమ స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా అమెరికా మలచుకుంది . సామ్రాజ్యవాదాని కి ప్రపంచమంతా తలవంచినా ఎదిరిస్తూ నిలుస్తున్న ముస్లిం సమాజంలోని ప్రగతిశీల శక్తుల కషిని పెట్టుబడిదారీ శక్తులు ఎటు మళ్లించాయో మనందరికీ తెలుసు. ప్రజా ఉద్యమాల వెల్లువతో అడుగడుగునా ఆటంకాలెదుర్కొంటున్న విదేశీ సామ్రాజ్యవాదానికి, భారతీయ బహుళజాతి కంపెనీలకు ఇప్పుడు సరికొత్త మేధావి వర్గం అవసరమవుతోంది. పోలేపల్లి సెజ్‌ను ప్రశ్నిస్తూ కలాలు పేదల పక్షాన గళాలెత్తాయి. భూమిపుండు ఓపెన్ కాస్ట్ గనులపై పాట కట్టాయి.

ప్రజా ఉద్యమాలకు మేధోపరమైన కషిని అందిస్తు న్న విప్లవ రచయితలు, అభ్యుదయ కవులు, బ్రాహ్మణాధిపత్యాన్ని తూర్పారబడుతున్న దళిత సాహి త్యం, విస్మరించిన ప్రజల అస్తిత్వం కోసం నినదిస్తు న్న ముస్లిం సాహితీ వేదికలు, ఆదివాసీ రచయితలకు హైదరాబాద్ ఆలంబన. హైదారాబాద్‌కు ఈ ఒరవడి ఈనాటిది కాదు. దశాబ్దాల వారసత్వం ఉం ది. పౌరహక్కుల కోసం నినదించిన జయసూర్య, ప్రజా పీడకుడిని దునుమాడిన మగ్ధుం, అరాచకాన్ని ఎదురించి అమరుడైన షోయబుల్లాఖాన్, దళిత, బహుజనుల అభ్యుదయానికి నాంది పలికిన భాగ్యరెడ్డి వర్మ అందించిన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న తెలంగాణ హదయం హైదరాబాద్. పెట్టుబడి కాలు పెట్టిన చోటల్లా వెల్లువెత్తుతున్న ఉద్యమాలకు తోడుగా నిలుస్తున్న సాహితీ సంఘాలు, సాహితీ వేత్తలంటే పెట్టుబడికి కన్నుకుడుతోంది.

ప్రజల పక్షం వహించే ప్రజా సాహిత్యం ఉన్నట్లే ఇప్పుడు రాజ్యం పక్షం వహించే ఓ సాహిత్యం కావాలి. ప్రగతిశీల భావాలున్న రచయితల్ని ఆహ్వానించి ఆదర్శవంతమైన అంశాలపై చర్చలు నిర్వహించినా ఈ సాహితీ సభ అంతిమ లక్ష్యం అదే. ఇది ఆరోపణేమీ కాదు. ఈ సాహితీ సభలకు పోషకులుగా ఉన్న ఆంగ్ల ప్రచురణ కర్తలు అన్నమాటే. హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ లో ఓ ఆంగ్లపుస్తకాల ప్రచురణ సంస్థ నిర్వాహకురాలు మార్కెట్ ఉన్న పుస్తకాలనే మేం ప్రచురిస్తాం, పుస్తక వ్యాపారానికి వాదాల కంటే పాఠకాదరణ ముఖ్యం అని చెప్పుకొచ్చింది. ఓరియంటల్ బ్లాక్ శ్వాన్, ఆక్స్‌ఫర్డ్ ప్రెస్, రోలీ బుక్స్, సాహిత్య్ వంటి సంస్థలు ఈ లిటరరీ ఫెస్ట్ వేదికగా వేలాది మంది యువ పాఠకుల్ని కలుసుకున్నాయి.

నిర్వాహకులు తరలించిన పాఠకులంతా యువతే కావడం ఓ విశే షం. కారణం ఏమై ఉంటుంది? పాఠశాలల్లో తెలు గు మాధ్యమం పోయి ఆంగ్ల మాధ్యమం పెరగడమే. నగరంలోనే కాదు రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య దశాబ్ద కాలంలో గణనీయంగా పెరగింది. వీరు ఇంత కాలం తెలుగు లేదా ఇతర స్థానిక భాషల సాహిత్యం చదివేవారు. వారిని ఆంగ్ల సాహిత్యంవైపుకు మళ్లించుకునేందుకు ఈ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఆ ప్రయత్నానికి హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ దోహదపడుతోంది. ఈ ప్రచురణ సంస్థల పాలసీ పెట్టుబడిదారులకు కూడా అనుకూలమైనదే కావడంతో జతకట్టడానికి ఏ విధమైన సిద్ధాంత అవరాధాలూ ఏర్పడలేదు.

కొస మెరుపు ఏమంటే.. హైదరాబాద్ నగరాన్ని ఆధునిక అభివద్ధి నమూనాతో ధ్వంసం చేస్తున్న అధికారులు, బాధ్యతాయుతమైన హోదాల్లో ఉండి నగరంలోని ప్రాచీనమైన, చారిత్రకప్రాధాన్యత ఉన్న కట్టడాలను ధ్వంసం చేస్తున్న వాళ్లు ఈ లిటరరీ ఫెస్ట్ సందర్భంగా నిర్వహించిన మై సిటీ - మై డ్రీమ్ పేరుతో ఉపన్యసించడం..!
-నాగవర్ధన్ రాయల
8096677456, Namasete Telangana Telugu News Paper Dated: 3/2/2014

No comments:

Post a Comment