Monday, September 23, 2013

నా మంచం నాఇష్టం! (Book Review) డా ఎం.ఎఫ్‌. గోపీనాధ్‌ రచన ‘నా పొగరు మిమ్మల్ని గాయపరచిందా? అయితే సంతోషం!’ ఆవిష్కృతమవుతున్న సందర్భంగా ఆ పుస్తకంలోని కొన్ని భాగాలు)


నా కంప్యూటర్‌ నా ఇష్టం, నా ఫేస్‌ బుక్‌ నా ఇష్టం- అనాలి గానీ నా మంచం, నా ఇష్టం ఏంటి అనుకుంటున్నారా? భూమికి ఆత్మగౌరవానికి సంబంధం ఉన్నట్లే ఈ దేశంలోని గ్రామీణ జీవితంలో మంచానికి ఆత్మగౌరవానికి, కుల అణచివేతకు సంబంధం ఉందని నా నమ్మకం. చాలా మంది నాగరీకులు ఒప్పుకోకపోవచ్చు. కాని కుర్చీ కన్నా మంచానికే ఈ దేశ గ్రామీణ జీవితంలో విలువెక్కువ. మీరు నాలాగా ఊరోళ్లైతే మంచానికి ఆత్మగౌరవానికున్న లింక్‌ ఏమిటో అర్థం అవుతుంది. ఆ లింకేంటంటే ఈ దేశంలో మనుష్యులందరూ సమానం కాదని, అట్లా ఉండటానికి వీల్లేదని వేదాలు ఘోషించాయి. అట్లా అని బ్రాహ్మణేతరులను నమ్మించారు. అందుకే దోపిడీ కులపోడొస్తే, దోపిడీకి గురయ్యే కులపోడు మంచం మీద కూర్చోటం అపచారం, అరిష్టం అయింది. మా ఇండ్లలో అంటే మాల మాదిగిండ్లల్లో కూడా మంచాలు ఉంటాయి. పందిరి మంచాలు లేకపోయినా కుక్కి మంచాలైనా ఉంటాయి.

కనీసం ఒక్క మంచమైనా ఉంటుంది. మా కన్నా పై కులపోళ్లు మా ఇంటికి ఎవరొచ్చినా, లేక అటువైపు వెళ్తున్నా మేమందరం అంటే లేవలేని గర్భిణీ స్త్రీలైనా, ముసలోళ్లైనా దిగ్గున లేచి లెంపలేసుకోవాలి. వాళ్లు వచ్చినప్పుడే కాదు, రాకముందు కూడా మంచంలో కూర్చున్నందుకో, ‘మంచం’ అనే వస్తువును ఇంట్లో ఉంచుకున్నందుకో కాని, మా వాళ్లు తరతరాలుగా లెంపలేసుకుంటున్నారు. మా చిన్నప్పుడు, మా గూడెంలో మా పెద్దోళ్లు మాకు నేర్పే రూల్‌ నెం.1. పెద్ద కులపోళ్లు వస్తే మంచం మీద కూర్చోకూడదు. రూల్‌ నెం.2. కూర్చుంటే దిగ్గున లేచి, లెంపలేసుకోవాలి. రూల్‌ నెం.3. తలకు చుట్టుకున్న తలగుడ్డ తీసి, మంచాన్ని దులిపి ‘కూర్చోండయ్యా’ అని, వంగి రెండు చేతులు మంచం వైపు చూపించాలి. 

దీనికి భిన్నంగా జరక్కూడదు. ఒక వేళ ముసలివాళ్ళు మంచం మీద పడుకోవాలనుకుంటే మంచాన్ని తలక్రిందులుగా వేసి అంటే మంచంకోళ్ళు పైకి, నులక క్రిందకు వచ్చేటట్లు వేసికొని పడుకోవాలి. ఊరు, వాడకు సరిహద్దు మా ఇల్లు. మా ఇంటికి పడమర మాల ఇళ్లు, తూర్పున ఒక గౌండ్ల ఇల్లు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత కంసాలోళ్ల ఇల్లు. దాని పక్కనే వేరే ఊరు నుండి వచ్చిన రెడ్డోళ్ళ ఇల్లు, దక్షిణాన కొంచెం మోతుబరి రెడ్ల ఇళ్ళు, ఉత్తరాన దొడ్లు ఉన్నయి. మా ఇంటికి ఉత్తరాన ఉన్న దొడ్లలో నుండి మెయిన్‌రోడ్‌కు (డొంక)కు అనధికార దారి ఉంది. ఆ దారి గుండా నడిస్తే శూద్రోళ్లకు ఒక అరకిలోమీటర్‌ దూరం కలిసి వస్తుంది, మెయిన్‌రోడ్‌ ఎక్కటానికి. చిన్నప్పటి నుండి నాకొక అలవాటు ఉంది. అదేంటంటే, నా మంచంలో నేను కూర్చోవటం. ఎవరొచ్చినా సరే మంచం మీద నుండి లేవకపోవటం. 

ఈ అలవాటు ఈ దేశంలోని దళితులకు నిషిద్ధం. కానీ నేనట్లా అనుకోలేదు. నా మంచం నా ఇష్టం. అందుకే మా ఇంటి ముందు దారి ప్రక్కన మంచం వేసుకుని స్వేచ్ఛగా కూర్చోని బువ్వ తినేవాణ్ణి. శూద్ర కులాలు అంటే రెడ్లు, కోమట్లు, కొన్ని బీసీల కులాలవాళ్లు ఆ దారి వెంట వెళ్తున్నప్పుడు లేచేవాణ్ణి కాదు. ఈ ‘సద్గుణా’లేవీ నాకబ్బలేదు. అందుకు నేను ఏనాడూ చింతించలేదు. పైగా గర్వపోతుననే పేరు కూడా వచ్చింది. సోకాల్డ్‌ అగ్రకులాల్తో ‘గర్వపోతు’నని 1965ల్లోనే పిలిపించుకున్నానంటే, మీకేమనిపిస్తుందో నాకు తెలీదు కానీ మరో జన్మంటూ ఉంటే మా వూళ్లోనే, మా కులంలోనే లేదా అలాంటి కులంలో ఏదో ఒక దాన్లో పుట్టి అయ్యంకాళి అంత ఎత్తున ఎదిగి నడిమంచంలో మళ్లీ మళ్లీ కూర్చోవాలనిపిస్తుంది.

ఆ నా అలవాటును సవాలుగా తీసుకున్నారో, లేక అవమానపడ్డారో కాని ఆయా కులాలవాళ్లు ఆ దారిన రావటం మానేశారు. అప్పుడు నేను చాలా సంతోషపడ్డాను కానీ మా పెద్దయ్య కొడుకు శౌరి అన్నయ్య మాత్రం ‘జాగర్తరా! మనం అడవిలోకి పోతే ఏ చెట్టు మీద గొడ్డలేస్తాం? మంచిగున్న దాని మీదే కదా! మరి మా అందరిలో నువ్వే చదువుకుంటున్నావు. నీ పోకడేమో పెద్ద కులపోళ్ళని లెక్కచేయడం లేదు. జాగర్త!’ అన్నాడు.
......
మా ఊళ్ళో నేను ప్రైమరీ స్కూల్‌లో చదివేటప్పుడు మా ఊరి పంతులమ్మగారు (బ్రాహ్మణావిడ) ఒక పరీక్ష పెట్టారు. ఒక పుస్తకంలో రాజస్తాన్‌, భోజ్‌పూర్‌, ఉదయ్‌పూర్‌, జైపూర్‌, జంతర్‌మంతర్‌ లాంటి పదాలతో కూడిన పాఠం ఉంది. ఈ పాఠాన్ని తప్పుల్లేకుండా అందరూ చదవాలి. ఒకవేళ చదవకపోతే చదివినవాళ్లతో లెంపకాయ వేయిస్తానన్నారు పంతులమ్మగారు. మొదట మా క్లాస్‌లోని రెడ్డోళ్ళ పిల్లల్ని చదవమంది. అ పదాల్ని పలకలేక చదవలేకపోయారు. నన్ను చదవమంటే చదివాను. పంతులమ్మగారు లెంపకాయ వేయమంది. రెడ్డి పిల్లవాడి చెంప మీద ఒక్కటేశాను. వెంటనే పెద్ద గొడవ మొదలైంది. పంతులమ్మగారిని నిలదీయటానికి ఓ గుంపు స్కూల్లోకి వచ్చింది. ‘ఎంత ధైర్యం? మాలోడి చేత రెడ్డోరి పిల్లల్ని కొట్టిస్తావా?’ అని. పంతులమ్మ బిక్క మొఖం వేసి స్కూల్‌కు శెలవిచ్చింది.
.....
ఒకరోజు పంతులుగారు వానొచ్చినందువల్ల గోసీడు నుండి రాలేదు. బడిలో పిల్లలందరం గోల చేస్తున్నాం. అంతలోనే ఏమైందో ఏమోగాని మా దళిత పిల్లల్ని ఊరోళ్ళ పిల్లలందరూ కలిసి చీపుర్లు తీసుకుని బడి నుండి వెళ్ళగొట్టారు. ఇప్పటికీ ఈ సంఘటన నాకు అవమానంగా తోస్తుంది. బహుశా ఇలాంటి కార్యక్రమాలన్నీ అంటరానివాళ్ళ చదువును అడ్డగించే హిందూ ప్రణాళికలో భాగమనుకుంటాను. లేకుంటే అంత సడెన్‌గా ఒక రిఫ్లెక్స్‌లాగా ఊళ్లో అన్ని కులాల పిల్లలు ఏకమై మాలోళ్ళ పిల్లల్నందరినీ బడి నుండి గెంటేయడమేమిటి? ఇలాంటి హిందూ స్వభావానికి భిన్నంగా ‘మీరు చదువుకోవాలి’ అని స్కూల్స్‌ పెట్టిన క్రిస్టియన్స్‌ను, ‘మీరు ఆరోగ్యంగా ఉండాలి’ అని 150 సంవత్సరాల క్రితమే మిషన్‌ ఆసుపత్రులు కట్టించిన క్రిస్టియన్‌ మతాన్ని మేము గౌరవించి, మతం మార్చుకుంటే గాంధీలాంటి రుషులకు ఎందుకు కోపం? మేం చదువుకోవడం, జ్ఞానాన్ని పొందడం, ఆత్మగౌరవంతో బతకడం, గాంధీలాంటి అభివృద్ధి నిరోధకులకు ఇష్టముండదు కాబోలు. 

మేము చదువుకున్న ప్రైమరీ, హైస్కూల్‌ పుస్తకాల్లో ఒక ఫూలేని గురించికానీ, అంబేడ్కర్‌ గురించి కానీ, సావిత్రీబాయి ఫూలే గురించి కానీ ఏమీ లేదు. అభివృద్ధి నిరోధకులైన కులతత్వవాదుల గురించి మాత్రం గుట్టల కొద్దీ గుప్పించారు. నేను ప్రైమరీ స్కూల్లో చదువుతుండగా మాకు మహాత్మా గాంధీ గురించి ఒక పాఠం ఉంది. పాఠంలో అన్ని సుగుణాలతోపాటు ‘గాంధీగారు ఎప్పుడూ అబద్ధం ఆడలేదు’ అని మా పంతులుగారు ఒకటే మెచ్చుకుంటున్నారు. నా చిన్న మెదడుకు అప్పుడే ఒక అనుమానం కలిగింది. అసలు అబద్ధం ఆడకుండా ఉండడం ఏ మనిషికైనా ఎట్లా సాధ్యం? అని. ఇప్పుడనిపిస్తుంది. వకీలు వృత్తిని చేపట్టిన వ్యక్తికి, వ్యాపార కులం నుండి వచ్చిన వ్యక్తికి అబద్ధం చెప్పాల్సి రావడమనేది వాళ్ల వృత్తే కదా! ఇది చాలా వాస్తవ విరుద్ధమైన విద్యా బోధన. 
... 
1978 ఫిబ్రవరి 24న ఆర్‌ఈసీ వరంగల్‌లోని ఒక హాస్టల్‌లో నేను ‘వైట్‌మాన్‌’ అనే ప్రకాశ్‌ మాస్టర్‌ (ఐ.వి. సాంబశివరావు)ను కలవటం జరిగింది. ఆయన రహస్య జీవితం గడుపు తున్నారని, రాడికల్‌ విద్యార్థి రాష్ట్ర మహాసభలకు ఇంచార్జ్‌గా వచ్చారని తర్వాత తెలిసింది. ఆయన ఆ రోజు ‘చెరుకూరి రాజ్‌కుమార్‌ అధ్యక్షుడిగా, రవి ఉపాధ్యక్షుడిగా, నేను ప్రధాన కార్యదర్శిగా మరి కొంతమందిని మహాసభ ఎన్నుకో బోతున్నదని, బాధ్యతగా ఉండాలని చెప్పారు. అధ్యక్షుడిగా రవిని ఉంచాలని వరవరరావు పట్టుబట్టాడని, అయినా పార్టీ ఒప్పుకోలేదని ‘వైట్‌మాన్‌’ తర్వాత చెప్పారు. ఈ విషయం రవి చాలాసార్లు, అక్కడక్కడ రాజ్‌కుమార్‌కన్నా తనకే అధ్యక్షుడయ్యే అర్హత ఉందని అన్నందువల్ల ఒక ఎగ్జిక్యూటివ్‌ మీటింగ్‌లో, అనేక ఇతర అభియోగాలతో కలిపి రవిని ప్రకాశ్‌ మాస్టర్‌ నిలదీయటం, రవి తన తప్పు ఒప్పుకుని, ఉపాధ్యక్షుడిగా రాజీనామా చేస్తాననడం, ప్రకాశ్‌ మాస్టారే వారించి, సవరించు కోమనడం... 

ఇవన్నీ 1978లో జరిగాయి. వాస్తవంగా రాజ్‌కుమార్‌కున్న పట్టుదల, నిరాడంబరత, నిజాయితీ, సిద్ధాంత పరిజ్ఞానం రవిలో పదోవంతు కూడా లేదనేది వాస్తవం. మరి వరవరరావు రాజ్‌కుమార్‌ను ఎందుకు వద్దన్నాడు? రవిని ఎందుకు సపోర్ట్‌ చేశాడు? రవి బ్రాహ్మణుడు, వరవరరావు బ్రాహ్మణుడు. రాజ్‌కుమార్‌ బ్రాహ్మణుడు కాదు. రవి 1979లో ఖమ్మంలో జరిగిన రాడికల్‌ యూత్‌ లీగ్‌ సభల్లో పనిచేసి ఆ తర్వాత బాంబే వెళ్లిపోయాడు. డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ తమ్ముడు కాబట్టి ఒకసారి కలిశాడు. రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యాడు. 1978 ఫిబ్రవరి, 25, 26 తేదీల్లో వరంగల్‌లో రాడికల్‌ విద్యార్థి సంఘం రాష్ట్ర ద్వితీయ మహాసభలు ప్రారంభమవుతాయన్న రోజు ఉదయం, లిన్‌పియావో గ్రూపుకు చెందిన రామిరెడ్డి (ఇప్పుడు ప్రొఫెసర్‌ రామిరెడ్డి) నాయకత్వంలో కరపత్రాలు పంచు తున్నారు.

‘కొండపల్లి బొమ్మలు కొలువు తీరటానికి తప్ప పోరాటానికి పనికిరా’వని, ‘నరకండి, చంపండి భూస్వాముల్ని’ అని నినాదాలు ఇచ్చుకుంటూ వెళ్తున్న పదిమందిని చూశాము. ఈ మహాసభల్ని లీగల్‌గా ఉన్న వరవరరావు అన్నీ తానై నడుపుతున్నాడు. నాకు పరిచయం లేదు. అరుణ్‌ శౌరి (బ్రాహ్మణుడు, బిజెపీ ప్రభుత్వంలో పబ్లిక్‌ సెక్టార్‌ని నిండా ముంచిన మంత్రిత్వశాఖ మంత్రి) ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథి, ప్రారంభోపన్యాసకులు. ఈ వ్యక్తిని ప్రారంభోపన్యాసానికి ఆహ్వానించడానికి బాధ్యులు వరవరరావే. భారతీయ చరిత్రలో అభివృద్ధి నిరోధక బ్రాహ్మణులకు, లిబరల్‌ బ్రాహ్మణులకు, హాట్‌లైన్‌ ఎప్పుడూ ఆపరేట్‌ అవుతుం దనటానికి అరుణ్‌శౌరి, వరవరరావుల అనుబంధమే ఒక తాజా ఉదాహరణ. అంబేడ్కర్‌ మీద విషం వెళ్లగక్కిన ‘వర్షిప్పింగ్‌ స్మాల్‌ గాడ్స్‌’ అనే పుస్తకాన్ని రాసిన అరుణ్‌శౌరి, అంబేడ్కర్‌ను అవమానించి, తర్వాత అంబేడ్కర్‌ యువజన సంఘాలు దండెత్తాయని, అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మోకరిల్లిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌ (ఎం.పి.) వరవరరావుకు మిత్రులవటం యాదృచ్ఛికం కాదు.
.....
ఉస్మానియాలో ఎండీ. చేస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది. కరీంనగర్‌ జిల్లా మిట్టపల్లి ప్రాంతానికి చెందిన ఒక వెలమ దొరను పీపుల్స్‌వార్‌ స్క్వాడ్‌ గొడ్డలితో నరికింది. ఆ పేషెంట్‌ న్యూరో సర్జరీ వార్డులో ఉన్నాడు. ఓ రాత్రి డ్యూటీలో పేషెంట్‌కు బాగాలేదని అక్యూట్‌ మెడికల్‌ కేర్‌లో ఉన్న మాకు ‘కాల్‌’ వచ్చింది. వెళ్ళి మెడికల్‌ హిస్టరీ తీసుకుంటే, పేషెంట్‌ చెప్పాడు ‘నక్సలైట్లు నరికారు’ అని. పేషెంట్‌కి కావల్సిన వైద్యం అందించి వచ్చాను. తరువాత ఒకానొక సందర్భంలో ఈ విషయం చర్చకు వచ్చింది. ఒకరు అన్నారు కదా ‘పార్టీ చంపాలనుకున్న వాడు కదా. ఫినిష్‌ చేసేస్తే సరిపోయేది’ అని. ‘ఆ పని చేయాల్సింది పార్టీ. డాక్టర్‌ కాదు. శుత్రువైనా వైద్యం కొరకు వస్తే రక్షించే పంపుతాము. ఆ దొరగాడు మరలా వస్తాడు కదా! మీ చేతికి చిక్కుతాడు కదా!’ అన్నాను. ఇలాంటి అభిప్రాయలున్న నాపట్ల నిమ్స్‌ హాస్పిటల్‌లో చేరే పోలీసులకెందుకు భయం అనుకున్నాను. లేని జబ్బుల్ని అడ్డం పెట్టుకొని జైళ్ళు, కోర్టుల నుండి తప్పించుకోటానికి హాస్పిటల్స్‌లో చేరి, హాయిగా మందుకొట్టే రాజకీయ నాయకులకు, కార్పొరేట్‌ గుండాలకు ‘రహస్యం’ బయటపడ్తుందేమోననే భయం ఉండాలి గానీ వీళ్ళ కెందుకు భయం? 
...
మానవత్వాన్ని మంటగలిపి, మారకపు విలువల్నే ప్రధానం చేసిన మృగాల మధ్య, కత్తుల వంతెన మీద నుండి నడుచుకుంటూ ఊరుకి వాడకీ మధ్యనున్న సరిహద్దుల్ని చెరిపే ఒక సున్నితమైన వృత్తిని సుమారుగా రెండు దశాబ్దాలు కొనసాగించిన, వైవిధ్యభరితమైన దళిత జీవితం అది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో గెస్టోపో కాన్సెంట్రేషన్‌ క్యాంపులో డాక్టర్‌ నార్మన్‌ బెతూన్‌ని నాజీ జర్మన్‌లు శారీరకంగా హింసించిన ఘటనలకన్నా కౄరంగా నన్ను ‘క’మ్మం సమాజం మానసికంగా హింసించింది. ఆ హింస ‘క’మ్మం రైటిస్టుల నుండి కాకుండా సోకాల్డ్‌ లెఫ్టిస్ట్‌(?) శిబిరం నుండి రావటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఆ హింస మీకు అర్థం కావాలంటే మీరు దళితులుగా పుట్టాలి. దళితులుగా పుట్టటం, బాధలు ఆనుభవించటమే కాదు ముఖ్యం. వీళ్లనెదిరించాలనే దృఢ నిశ్చయం, దాసోహమనకూడదనే ఆత్మగౌరవం, నిత్య నూతనంగా భగభగ మండే నిప్పుల కొలిమిలో రాటు దేలుతూ ఉంటేనే ‘ఆ హింస’ మీకు అర్థం అవుతుంది. ఒక వైపున ‘రాజ్యం’ నీలి నీడలు, మరోవైపు దోపిడీ కుల సామాజిక పీడన. నా కంట్లో నా వాళ్లతోనే పొడిపించే కుటిల రాజకీయం. నిస్సహాయతలో ఉన్న నా పునాది కులాలు! ఇదీ రెండో భాగంలో మీరు చదవబోయే విషయం.

అరుణ్‌ శౌరి (బ్రాహ్మణుడు, బిజెపీ ప్రభుత్వంలో పబ్లిక్‌ సెక్టార్‌ని నిండా ముంచిన మంత్రిత్వశాఖ మంత్రి) ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథి, ప్రారంభోపన్యాసకులు. ఈ వ్యక్తిని ప్రారంభోపన్యాసానికి ఆహ్వానించడానికి బాధ్యులు వరవరరావే. భారతీయ చరిత్రలో అభివృద్ధి నిరోధక బ్రాహ్మణులకు, లిబరల్‌ బ్రాహ్మణులకు, హాట్‌లైన్‌ ఎప్పుడూ ఆపరేట్‌ అవుతుం దనటానికి అరుణ్‌శౌరి, వరవరరావుల అనుబంధమే ఒక తాజా ఉదాహరణ. అంబేడ్కర్‌ మీద విషం వెళ్లగక్కిన ‘వర్షిప్పింగ్‌ స్మాల్‌ గాడ్స్‌’ అనే పుస్తకాన్ని రాసిన అరుణ్‌శౌరి, అంబేడ్కర్‌ను అవమానించి, తర్వాత అంబేడ్కర్‌ యువజన సంఘాలు దండెత్తాయని, అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మోకరిల్లిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌ (ఎం.పి.) వరవరరావుకు మిత్రులవటం యాదృచ్ఛికం కాదు.

కరీంనగర్‌ జిల్లా మిట్టపల్లి ప్రాంతానికి చెందిన ఒక వెలమ దొరను పీపుల్స్‌వార్‌ స్క్వాడ్‌ గొడ్డలితో నరికింది. ఆ పేషెంట్‌ న్యూరో సర్జరీ వార్డులో ఉన్నాడు.... ఒకరు అన్నారు కదా ‘పార్టీ చంపాలనుకున్న వాడు కదా. ఫినిష్‌ చేసేస్తే సరిపోయేది’ అని. ‘ఆ పని చేయాల్సింది పార్టీ. డాక్టర్‌ కాదు. శుత్రువైనా వైద్యం కొరకు వస్తే రక్షించే పంపుతాము. ఆ దొరగాడు మరలా వస్తాడు కదా! మీ చేతికి చిక్కుతాడు కదా!’ అన్నాను. 

నా పొగరు మిమ్మల్ని 
గాయపరచిందా?
అయితే సంతోషం!
ఎం.ఎఫ్‌. గోపీనాధ్‌
వెల: రూ. 100
ప్రతులకు
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, 
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌
గుడిమల్కాపూర్‌, 
హైదరాబాద్‌, 500 006
ఫోన్‌: 23521849

(సెప్టెంబర్‌ 28వ తేదీన హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో డా ఎం.ఎఫ్‌. గోపీనాధ్‌ రచన ‘నా పొగరు మిమ్మల్ని గాయపరచిందా? అయితే సంతోషం!’ ఆవిష్కృతమవుతున్న సందర్భంగా ఆ పుస్తకంలోని కొన్ని భాగాలు) 

Surya Telugu News Paper Dated: 23/09/2013 

No comments:

Post a Comment