Saturday, October 15, 2011

గాంధీ-కోతి కథలు వద్దు - గోగు శ్యామల Andhra Jyothi Dated 16/10/2011


గాంధీ-కోతి కథలు వద్దు

- గోగు శ్యామల

తెలంగాణ స్వరాష్ట్ర పోరాటం గూర్చి కంచ ఐలయ్య ఒక సామాజిక శాస్త్రవేత్తగా తెగ బాధపడుతున్నారు. 'గాంధీతాతా నువ్వే చెప్పు' (అక్టోబర్ 11, ఆంధ్రజ్యోతి) అన్న ఐలయ్య వ్యాసం ప్రకారం ఆయన బాధపడుతున్న అంశాలివి: (అ) తెలంగాణ బిసిలు, 'కమ్మ క్యాపిటల్' పాలన తెలంగాణ ప్రజలకు ఒక వరంలా ప్రాప్తించిన తరువాతనే కొంతైనా బతుకు దెరువులతో అటు ఇటు కదలగలుగుతున్నరట;

(ఆ) రెడ్లు, కమ్మలు అధికారం కోసం కొట్లాడుకుంటుంటే కమ్మలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని బాధను వ్యక్తం చేసిండు; (ఇ) ఇదే సమయంలో తెలంగాణ రెడ్లను, వెలమలను కమ్మొళ్ళు తమ కాళ్ల కింద తొక్కేసిండ్రని ఇంకో తీరు బాధపడ్డడు; (ఈ) అన్ని రంగుల పార్టీల కోతులన్నీ కరప్షన్‌తో చిన్న రాష్ట్రాల ఉద్యమాన్ని జోడించి సోనియా గాంధీని ఇటలీకి పంపించాలని వ్యూహం పన్నుతున్నారని బాధపడ్డడు.

ఒక దిక్కు ఢిల్లీలో రాజఘాట్ దగ్గర మూడు కోతుల వెనుక ఓ అజ్ఞాత కోతికూడా ఉందని ఐలయ్య అంటుండు. మరి ఈ కోతుల గుంపును ఉత్తర తెలంగాణలో తంతే హైదరాబాద్ పరుపులో పడ్డరని రాసిండు. ఐలయ్య ప్రకారం తన్నింది గూడా కోతే గదా? తన్నింది, తంతె పడింది ఒకే జాతి కోతులే గదా? తెలంగాణ ఇస్తే హైదరాబాద్‌లో గుజరాత్ మారణకాండ రిపీట్ అయితదని అసదుద్దీన్ ఓవైసీని మించి అనవసర బీకర భాష వాడి పంచాంగం చెప్పిండు. అయినా ఒక చిన్న ప్రశ్న. తాను చెప్పిన ఆ అజ్ఞాత కోతికి కాశాయ కోతికి జోడీ కుదిర్చి.. వానర రామదండుకు నాయకత్వానికి జోడీ కుదిర్చి ఊచకోత పంచాంగం జెప్పిండు.

ఇంత జోడీలు కుదిర్చె ఐలయ్యగారు బహుజనుల జోడీలను యాడ ముదిరిపెట్టిండు? అసలు ఆయన జెప్పే పంచాంగం ఏంది? బహుజన పంచాంగమా? సోనియా గాంధీ కాంగ్రెస్ పంచాంగమా? విశాలాంధ్ర, సమైక్యాంధ్ర కోసం ఈ కోతుల పంచాంగమా? అంబేద్కర్ చిన్న రాష్ట్రాల ఆవశ్యకత సూత్రీకరణను డిస్‌ప్రూఫ్ అని చెప్పే ప్రయత్నం చేయడానికి గాంధీ మనుమడి అవతారమెత్తిండేమో?

ఐలయ్య ఒకటి మాత్రం గుర్తించుకోవాలి. మనువాదులకు, ద్విజులకు, ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని అవతారాలెత్తినా అంబేద్కర్ సిద్ధాంతాన్ని డిస్‌ప్రూఫ్ చేయడానికి సాధ్యం కాలేదని, అంతనుకుంటే తొక్కి పెట్ట వచ్చు, అణిచిపెట్ట వచ్చు. కాని డిస్‌ప్రూఫ్ అనే ప్రసక్తి చరిత్రలో, ముఖ్యంగా వర్తమానంలో జరగలేదు. అయినా ప్రత్యేక తెలంగాణకై బహుజనుల ఆకాంక్ష పట్ల తన వైఖరేందో ప్రకటించలేదు.

'తాతా తాతా' అంటూ గాంధీ చెప్పిన కోతుల కథ ను అడ్డం పెట్టుకొని డొంకతిరుగుడు కథలు చెపుతుండు. ప్రస్తుతం ఈ కథలు చెప్పుడు ఐలయ్యకే కాదు ఎవ్వరికీ సాధ్యపడదు. ఎవ్వరైనా కూడా నాలుగు కోట్ల ప్రజలు మూకుమ్మడిగా 'సకలజనుల సమ్మె'లో పాల్గొని తమ ఆకాంక్షను చాటుతున్నపుడు ప్రత్యేక తెలంగాణకు అనుకూలమా లేక గుప్పెడు దళారీలు, పెట్టుబడీదారులు, మాఫియాలు డబ్బుసంచుల బలంతో ముందుకు తెస్తున్న సమైక్యాంధ్ర, విశాలాంధ్ర డిమాండుకు అనుకూలమా తేల్చి చెప్పాల్సిందే.

నేటి సకల జనుల సమ్మె తెలంగాణ ఉద్యమపు అత్యున్నత దశ. ప్రపంచంలో కనివినీ ఎరుగని రీతిలో ఇది జరుగుతున్నది. ఈ ఉద్యమాన్ని ప్రధానంగా అనేక ఉత్పత్తి కుల, తెగ, జాతి అస్తిత్వాల ప్రజలు నడిపిస్తున్నారు. 1969 కంటె ముందునుంచే లక్షలాది ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఆ ఉద్యమం నేడు కోట్ల జనసంఖ్యలో పాల్గొనే దశకు చేరింది. దీనితోపాటు అనేక అస్తిత్వాలు పాలుపంచుకుంటున్న రాజకీయేతర, ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమమిది.

'ఇది మాది' 'మాది మాక్కావాలె' అంటే ఈ ప్రాంతం మాది. ఇక్కడి సమస్త వనరులు, నీరు, భూమి మాది అనీ తేల్చి చెపుతున్నారు. "ఇక్కడ పరాయి పాలన వద్దు, మా ప్రాంతాన్ని మేమే పరిపాలించుకుంట ం!'' అని ఉద్యమం చేస్తున్నరు, ప్రాణ త్యాగాలు చేస్తున్నరు. 'మాకు స్వాతంత్య్రం వచ్చింది' అనుకున్న తరువాత దాదాపు 'భారతదేశంలోనే మొట్ట మొదటిసారిగా మందుకొచ్చిన రాజకీయేతర ప్రాంతీయ అస్తిత్వ అతిపెద్ద ఉద్యమం ఇదే' అని కూడా చెప్పుకోవాల్సి ఉంది.

అయితే అధికార రాజకీయ పార్టీలు, వాటి పెత్తనాన్ని సపోర్టు చేసే శక్తులు బెల్లమున్న దగ్గర ఈగలు ముసిరినట్లు, ఓట్లు, సీట్లు, అధికార అందలం కోసం ఉద్యమం చుట్టూ అలుముకోవచ్చు. వారి వారి పంపకాల సమస్యలు ఉద్యమం చుట్టూ ముసురుకోవచ్చు. అంతమాత్రాన రెడ్డి వెలమ, కమ్మ అనే మూడు పాలకవర్గ కోతులు గుంపు కథ తెలంగాణ రాష్ట ఉద్యమానికి, చోదక శక్తులుగా ఉన్న బహుజనులకు ఎట్ల సరిపోతది? దేశంలో అన్నీ రాజకీయ పార్టీలు, కూటములు, శక్తులు, ప్రభుత్వ వ్యవస్థలు, కాంగ్రెసు, కాషాయ కూటమి మొదలుకొని కమ్యూనిస్టు, మార్క్సిస్టు, లెనినిస్టు, మావోయిస్టుల దాకా తెలంగాణతో సహా యావత్ దేశంలో విఫలమయిన నేపథ్యంలో కోట్ల ప్రజలు పాల్గొని నడుపుతున్న మహా ఉద్యమం నేటి సకలజనుల సమ్మె.

తెలంగాణలో సామ్రాజ్యవాద కార్పొరేట్ల, దళారుల పెత్తనం కింద కొనసాగుతున్న వనరుల దోపిడీని పై రాజకీయ శక్తులు ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలా, కండ్లప్పగించి శ్రోతల తీరులో చూస్తున్నారు. వారి సిద్ధాంతాల నాటి నుంచి నేటి వరకూ పూర్తిగా దిగజారిన నేపథ్యంలోనే స్వరాష్ట్ర ఉద్యమం నడుస్తున్నది. అందుకే అనేక సాంప్రదాయ ఉత్పత్తి వృత్తుల, అస్తిత్వ బహుజన ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోగా తరతరాల నాటి కుటుంబ వృత్తులకు, వృత్తులే, జాతులకు జాతులే నేడు అంతర్ధానానికి, అడ్డు, అంతులేని విధ్వంసానికి గురయితున్నవి. ఈ దశలోనే తెలంగాణ ఉద్యమం, సకల జనుల సమ్మె పెల్లుబుకింది.

అంతేకాని ఎవరో మూడు కో తులో, ఏదో అధికార కోతుల గుంపులో, లేదా అజ్ఞాత రాజకీయ కోతులో తెలంగాణ ఉద్యమాన్నిగాని, సకల జనుల సమ్మెను గాని చేయడంలేదు. తెలంగాణ ప్రాంతాన్ని, జీవావరణాన్ని, వనరులను, వీటిపై ఆధారపడి బతికే అనేక ఉత్పత్తి అస్తిత్వాల బహుజన సమాజాన్ని, దాని పోరాట చరిత్రను ఈ కోతుల గుంపులకు మెడలో మెడల్స్‌గా వేసి అప్పజెప్పడమే వ్యాసకర్త ఉద్దేశంగా కనిపిస్తున్నది. ఇది ఏం సామాజిక శాస్త్రం? ఏ సామాజిక వర్గాల ప్రయోజనమో వ్యాసకర్త స్పష్టం చేయాల్సి ఉన్నది.

తెలంగాణ ఉద్యమం పట్ల వలసాంధ్రా కోతి రాజకీయాలకు మన సోషల్ సైంటిస్ట్ బలైండా? బక్రా అయిండా?? ఎందుకంటే ఉద్యమం కీలక దశలోనున ్న సందర్భంలో అడుసుమిల్లి , లోక్‌సత్తా జయప్రకాశ్‌లు, ముఖేష్ నాగేందర్లు, లగడపాటి, రాయపాటి, కావూరి, రేణుకా చౌదరి, శైలజానాథ్, జేసి, టీజీల లొడలొడలన్నీ ఫేలైనవి. ఈ స్థితిలో బహుజన మేధావి అయిన కంచ ఐలయ్యగారి ద్వారా గాంధీ-కోతి కథలతో బహుజనులను బక్రా చేద్దామనుకున్న కాంగ్రెస్ కోతిరాజకీయాలకు తానే బక్ర అయిండా? అన్నది తేలడానికి వారాలు కాదు రోజులు చాలు.

ఇప్పటికైనా సారూ.. కోతి కథలు పక్కకు పెట్టి చెవులు, కండ్లు మూసుడు మాని తెలంగాణ రాష్ట్ర ఉద్యమ లోతులను, బహుజన ఆకాంక్షలను ఉన్నదున్నట్లు మాట్లాడితే బాగుంటుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం, వలసాంధ్ర దోపిడి పీడనల నుంచి విముక్తి కోసం లక్షలాది మంది ప్రభుత్వోద్యోగులు, ఎవరికి వారుగా, సమిష్టిగా - సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, న్యాయ శాఖలోని ప్రభుత్వోద్యోగులకు తోడు అడ్వొకేట్లు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, యాజమాన్యాలు, టీచరు మొదలుకొని అన్ని తరగతుల ఉద్యోగులు, ఆఫీసరు మొదలుకొని గుమాస్తా వరకు సమ్మె చేస్తున్నరు.

ఇదే సకలం, కనీవినీ ఎరుగని రీతిలో కొనసాగుతున్నది. కులవృత్తులవారిగా చూస్తే చాకలి, మంగలి, అవుసుల తదితర పంచదాయిల పోరాటం, మాదిగ, గొల్లకుర్మ, ముత్రాసి, గంగపుత్రులు, బేగరి, గౌడు, లంబాడ, కోయ, గోండు, మున్నూరుకాపు, మాల, ముస్లిం, క్రిస్టియన్, అర్చకులు, జండరు పరంగా అన్ని అస్తిత్వ సమాజాల్లోని స్రీలు పోరాడుతున్నారు. ప్రతిపనిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ప్రజలు పోరాడుతూ వందలాది విద్యార్థుల బలిదానాలతో, కష్ట నష్టాల కోర్చి సకల జనుల సమ్మె వరకు చేరుకున్నారు.

అద్వితీయమైన నేటి మన సకల జనుల సమ్మెను పట్టుకొని 'గీ చిన్న తెలంగాణ' అనీ ఒక సోషల్ సైంటిస్ట్ అంటాడా? ఈయనకు గీ తెలంగాణ రాష్ట్రం బాధకన్నా.. గా 'సోనియా కాంగ్రెస్‌ను, అధికారంను వదిలి ఇటలీ తిరిగి పోతన్నదే' అనే బాధనే మిన్ననా? ఇదేం తర్కమో బహుజనులు బాగానే అర్ధం చేసుకోగలరు. వలసవాద కోతి రాజకీయాలను, రాజకీయ శక్తులను బాగానే అర్థం చేసుకున్నందువల్లనే సకల జనుల సమ్మెలో పాల్గొంటున్నరు. మొదటిసారి తెలంగాణలో అన్ని దళారీ రాజకీయ పెత్తనాలను తిరస్కరించి స్వతంత్ర ఇచ్ఛతో తమ తమ సమస్యలకు స్వతంత్రమైన స్వపరిపాలన, రాజకీయ అధికారాల కోసం తమ భవిష్యత్తును నిర్ధారించుకునే దిశగా, నిర్మించుకునే దిశగా తెలంగాణ కోసం సకల జనులు కదిలిండ్రని అర్ధం చేసుకోవాల్సి ఉంది.

- గోగు శ్యామల
రచయిత్రి

No comments:

Post a Comment