Saturday, October 15, 2011

బీసీల అభివృద్ధిని అడ్డుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం By -ఆర్. కృష్ణయ్య Namasethe Telangana Dated 16/10/2011

బీసీల అభివృద్ధిని అడ్డుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ వారి అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా విద్యా,ఉద్యోగ, ఆర్థిక, రాజకీయాభివృద్ధికి చిత్తశుద్ధితో పాటుపడటం లేదు. పైగా అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో బీసీల గొంతు నొక్కడానికే కుట్రలు చేస్తున్నది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీ వ్యతిరేక విధానాలనే అవలంబిస్తున్నది. దీనికి తాజా ఉదాహరణ సుప్రీంకోర్టు తీర్పును సాకుగా తీసుకొని పంచాయితీరాజ్ సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించడానికి కుట్ర చేసింది. దీనికి వ్యతిరేకంగా బీసీ సంక్షేమ సంఘం పెద్ద ఎత్తున ఉద్యమానికి సన్నాహాలు చేయడంతో.. ప్రభుత్వం తాత్కాలికంగా వెనకడుగు వేసింది. పరిస్థితులు ఇలా ఉంటే.. వివిధ పార్టీలలోని బీసీ నాయకులు ఎవరూ బీసీ సమస్యల పట్ల చిత్త శుద్ధితో పట్టించుకోవటం లేదు. తమ రాజకీయ మనుగడ కోణంలోనే సమస్యలను చూస్తున్నారు కానీ... మెజారిటీ బీసీ ప్రజల ప్రయోజనాలను పట్టించుకోవటం లేదు. దీనిని అలుసుగా తీసుకొన్న వివిధ పార్టీల అగ్రకుల నాయకత్వం బీసీల ప్రయోజనాలను తుంగలో తొక్కుతోంది. రా జ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 340 ప్రకారం బీసీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. కానీ దీనిని పట్టించుకోకుండా..అందరూ బీసీ అభివృద్ధికి తూట్లుపొడుస్తున్నారు.
బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి కూడా.. బీసీ వ్యతిరేక చర్యలే చేపడుతున్నారు. ఇకనైనా బీసీల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి.బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలని 2008లో అసెంబ్లీలో తీర్మానం చేశారు. కానీ దానిపై ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వంపై ఏవిధమైన ఒత్తిడి చేయడం లేదు.

ఈ విషయాన్ని గాలికి వదిలేశారు. దీనిపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించాలి.అలాగే సుప్రీంకోర్టు తీర్పు సాకుగా తీసుకొని ఉన్న రిజర్వేషన్లను తగ్గించే చర్యలు తీసుకుంటున్నారు. దీనికి స్వస్తి పలకాలి. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా ‘బి- కేటగిరి’ విద్యార్థులకు 2009 కౌన్సిలింగ్‌లో ఎలాంటి ఫీజులు వసూలు చేయలేదు. జీఓ నెం.18లో ఎస్సీ, ఎస్టీలతో సమానం అని స్పష్టంగా ఉండటంతో అప్పుడు ఫీజులు వసూలు చేయలేదు. దీంతో ఎంతో మంది బీసీ విద్యార్థులు చదువుకుంటున్నారు. కానీ ఇప్పడు ప్రభుత్వం ఫీజులు చెల్లించడానికి అనేక అడ్డంకులు కల్పిస్తున్నది. ఫీజులు చెల్లించడానికి నిరాకరిస్తున్నది. హైకోర్టు ‘ఫీజులు చెల్లించాల్పిందే’నని చెప్పినా.., ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనికి వ్యతిరేకంగా బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో.. అప్పటి సీఎం రోశయ్య బీసీ విద్యార్థులకు ఫీజులు చెల్లించాలని జీఓ నెం.222/2010 ను జారీ చేశారు. కానీ దీనిని అమలు చేయలేదు. బడ్జెట్‌ను విడుదల చేయలేదు. ఫీజులు చెల్లించలేదు. దీంతో.. బీసీ విద్యార్థులు కాలేజీలలో నానా యా తనలు పడుతున్నారు. యాజమాన్యాల వేధింపులకు బలిఅవుతున్నారు. అలాగే... ప్రభుత్వం బీసీల వ్యతిరేక వైఖరి విడనాడాలి. బీసీ కులాలకు చెందిన జూనియర్ అడ్వకేట్లకు నెలకు 500 రూపాయలు చెల్లిస్తున్నారు.

స్టయిఫండ్ ను ఎస్సీ, ఎస్టీ లకు నెలకు 500ల నుంచి వెయ్యికి పెంచింది, కానీ.. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు పెంచకుండా అలాగే ఉంచింది. ఎప్పుడో 1984లో నిర్ణయించిన స్టయిఫండును పెరుగుతున్న ధరల కనుగుణంగా పెంచడానికి బదులు అలాగే ఉంచడం ఎంతవరకు సబబో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. హైస్కూలు విద్యార్థులకు కూడా మెస్ చార్జీల కోసం 960 రూపాయలు కేటాయిస్తోంది. కానీ.. జూనియర్ అడ్వకేట్లకు మాత్రం 500 మాత్రమే ఇస్తామనడం బీసీల పట్ల ప్రభుత్వానికి ఉన్న ప్రేమ అర్థం అవుతోంది. బీసీ జూనియర్ అడ్వకేట్లందరికీ.. నెలకు కనీసం అయిదువేలకు తగ్గకుండా స్టయిఫండ్ ఇవ్వాలి. బీసీల విద్యాభివృద్ధి కోసమని 2010 జూన్‌లో కొత్తగా 300 బీసీ బాలుర కాలేజీ హాస్టళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ.. ఇప్పటి వరకూ ఒక్కదానిని కూడా ప్రారంభించలేదు. దీనిని బట్టి బీసీల పట్ల ప్రభుత్వానికి ఉన్న ద్ధ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అలాగే 2008లో కాలేజీ అమ్మాయిల కోసం కూడా 300 హాస్టళ్లను ప్రారంభిస్తున్నామని ప్రకటించి ఇప్పటికీ 64 హాస్టళ్లు ప్రారంభించనేలేదు. ఇది బీసీ వ్యతిరేక చర్య కాకుంటే ఏమవుతుందో ప్రభుత్వమే చెప్పాలి.ప్రపంచీకరణ, సరళీకరణ విధానాల ఫలితంగా కులవృత్తులన్నీ.. నాశనమై గ్రామీణ వృత్తిదారులంతా.. ఆకలితో అలమటిస్తున్నారు. వీరి అభివృద్ధికోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ఏమీ తీసుకోవడంలేదు. శాలివాహన, విశ్వవూబాహ్మణ, వాల్మీకి, మేదర, సగర, దర్జీ, దూదేకుల, కృష్ణబలిజ/పూసల, బట్రాజు తదితర కులవృత్తుల వారికి ఫెడరేషన్లు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఉన్న వాటికి కూడా నిధులు మంజూరు చేయలేదు.అలాగే గ్రామాలలో అధికంగా ఉన్న చేనేత కార్మికులు, గీత కార్మికులు ఆకలి చావులకు గురవుతున్నారు. కాబట్టి రాష్ట్ర బడ్జెట్‌లో కుల వృత్తిదారుల అభివృద్ధికోసం ప్రత్యేక నిధులు కేటాయించాలి.

ఇక రాష్ట్రంలోని బీసీ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించకుండా.. ప్రభు త్వం నిర్లక్ష్యం చేస్తోంది. పక్క రాష్ట్రాల్లో బీసీలకు వందనుంచి రెండువందల కోట్ల రూపాయలు కేటాయిస్తుంటే.. మన రాష్ట్రం మాత్రం కేవలం 10 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంటోంది. రాష్టంలోని బీసీ కులాల జనాభా ప్రాతిపదికన చూస్తే.. కనీసం 500 కోట్లు కేటాయించాలి. అప్పుడు 4 కోట్లమంది బీసీలు అభివృద్ధిబాటన పడతారు.
బీసీల విద్యాభివృద్ధి కోసం పాటుపడుతున్నామని చెప్పుకుంటున్న ప్రభు త్వం పదిలక్షల మంది పాఠశాల విద్యార్థులకు నాలుగేళ్లుగా మెస్ చార్జీలు పెంచడంలేదు. దీంతో.. పెరిగిన ధరల నేపథ్యంలో అర్థాకలితో విద్యార్థులంతా అలమటిస్తున్నారు. పేద , బీసీ బడుగు వర్గాల పాలిట వరవూపసాదంగా మారిన ఫీజు రీయింబర్స్ మెంట్ స్కీమ్ ను కూడా ప్రభుత్వం నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో.. పేద కుటుంబంలో పుట్టిన ఎంతోమంది విద్యార్థులు ప్రొఫెషనల్ వృత్తి విద్యాకోర్సులు చదువుతున్న వారు అయోమయంలో పడ్డారు. చదువులు కొనసాగించలేక నానా కష్టాలు పడుతున్నారు. గత సంవత్సరం నుంచి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్‌ను ఎత్తివేయడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తోంది. దీంతో..రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అనేక విధాలుగా కష్టాల పాలవుతున్నారు. కొంతమంది.. చదువులు కొనసాగించలేక మధ్యలోనే చదువులు విడిచిపెడుతున్నారు. మరి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఫీజులు చెల్లించడం ఇష్టంలేక అనేక రకాలుగా ప్రభుత్వం ప్రతిబంధకాలను సృష్టిస్తోంది.

ఇలా.. బీసీ వ్యతిరేక చర్యలను ఎనై్ననా చెప్పుకోవచ్చు. నామినేటెడ్ పోస్టులలో, కలెక్టర్ల నియామకాలలో బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. కేవలం బీసీ ఉన్నతాధికారులపై ఏసీబీతో దాడులు చేయిస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన ఐఏఎస్ ఆఫీసర్లపై కూడా దాడులు చేస్తున్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీలోని బీసీ నాయకులు, మంత్రులు పతిపక్షపార్టీ నేతలు నోరు మెదపడం లేదు. బీసీలను రాజకీయంగా అణచివేయడానికి ఎన్నో కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు బీసీ సంక్షేమ సంఘం బీసీలకు అండగా నిలిచి పోరాడుతోంది. ఈ పరిస్థితుల్లో బీసీలంతా ఐక్యమై ఆకలి పోరాటం చేయడమే కాదు, ఆత్మగౌరవ పోరాటాన్ని కూడా చేయాల్సిఉంది. అంతిమంగా రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాల్సిఉంది. 
-ఆర్. కృష్ణయ్య
అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సంఘం

No comments:

Post a Comment