Saturday, July 5, 2014

కలిసుండే పంచుకుందాం... కొంగర మహేష్‌


Published at: 06-07-2014 02:35 AM
పార్లమెంటు సవరణ చట్టం ద్వారా వెనుకబాటుతనం, జనాభా ఆధారంగా రెండు రాష్ర్టాల్లోనూ (తెలంగాణలో మాదిగ, మాదిగ ఉపకులాలకు 12 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో మాలలకు 9-10 శాతం రిజర్వేషన్లు దక్కేలా) ‘ఏబీసీడీ’లు అమలుచేయాలి... జనాభా దామాషా ప్రకారం ఎవరికీ అన్యాయం జరగకుండా రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా అందితేనే ఒక్కటవుతారనే సత్యాన్ని దళితులంతా విశాల దృష్టికోణంతో ఆలోచించాలి.
రా జ్యాంగం అందించిన ఉమ్మడి రిజర్వేషన్ల ఫలాలను షెడ్యూల్డు కులాలన్నింటికీ సమానంగా పంపిణీ జరగాలని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే గ్రామంలో 1994 జూలై 7న ప్రారంభమైంది. ఎమ్మార్పీఎస్‌ ఆవిర్భావం తర్వాతనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలన్నీ తమతమ అస్తిత్వాల పునరేకీకరణలో పడ్డాయి. ఆ క్రమంలోనే లంబాడీల ‘నంగారాబేరీ’, రజకుల ‘చాకిరేవు’, గౌడ్ల ‘మోకుదెబ్బ’, ఆదివాసీల ‘తుడుందెబ్బ’ వంటి కులచైతన్య, ఆత్మగౌరవ హక్కుల పోరాటాలు మొదలయ్యాయి. తెలంగాణ మలిదశ ఉద్యమం కూడా ఈ కాలంలోనే పున:ప్రారంభమై అనతి కాలంలోనే ఉద్యమ గమ్యాన్ని చేరుకుంది. ‘తెలంగాణ’ ఎంతటి ప్రజాస్వామిక డిమాండో మాదిగల కోర్కెలు కూడా అంతే సమానత్వ, ప్రజాస్వామిక డిమాండ్లుగా సమాజ మద్దతును పొందాయి. అయితే ‘దండోరా’ నాయకత్వంలో జరిగిన గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారుల ఉద్యమం, ప్రమోషన్లలో రిజర్వేషన్లు, వికలాంగుల ఉద్యమం వంటి పోరాటాలు సక్సెస్‌ అయ్యాయి. కానీ ఉద్యమ ప్రధాన లక్ష్యం... రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించి ఎస్సీ జనాభాలో ఉన్న 60 కులాలకు న్యాయం చేయాలనే డిమాండ్‌ను మాత్రం సాధించుకోలేకపోయింది. ఉద్యమం ప్రారంభమై ఎన్నేళ్లయ్యిందో దాదాపు అంతే స్థాయిలో ఎమ్మార్పీఎస్‌ చీలికలు పేలికలైంది తప్ప గమ్యాన్ని చేరుకోలేకపోయింది. ఇందుకు ఆయా కాలాల్లో ఉన్న ప్రభుత్వాలు తమ ‘అవసరాల’ కోసం మాదిగల్ని రాజకీయ పావులుగా వాడుకోవడం ఒక కారణమైతే... మాదిగల నాయకత్వం స్పందించిన తీరు... అది అనుసరించిన వ్యూహాలు మరో కారణం. రిజర్వేషన్ల తోడ్పాటుతో ఎదిగిన దళితులు (మాల, మాదిగలు) సోదరకులాల (ఇతర ఎస్సీ ఉపకులాలు)పైనే వివక్ష పాటిస్తున్నారు.
రెల్లి, ఆది ఆంధ్ర, బైండ్ల వంటి అతికొద్ది ఉపకులాలు కాస్తమెరుగ్గా ఉన్నా బుడిగ జంగాలు, పైడి, పాకి, చిందు, డక్కలి, గోసంగి, మాస్టిన్‌, దాసరి, మోచి, మెహతర్‌ వంటి మిగతా ఉపకులాలకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఇన్నేళ్లలో వాటి ఫలితాలు దరిచేరకపోవడం ఆందోళనకరం. వీటిల్లో కొన్ని కులాలు కుటుంబాల పిల్లలు ప్రాథమిక స్థాయి దాకా కూడా రావడం గగనమే. దాదాపు 45 ఉపకులాలు ఇప్పటికీ గ్రామ పంచాయతీల్లో వార్డు సభ్యులుగా కకూడా అడుగుపెట్టలేదు. బిక్షాటన, సంచార జీవనం, పాకీపని, కులవృత్తుల వంటి పనులతో పొట్టపోసుకునే వీరిని ప్రభుత్వాలు సైతం పట్టించుకోవడం లేదు. రాజ్యాంగం ఎస్సీలకు అందిస్తున్న 15 శాతం రిజర్వేషన్లను జనాభాలో తక్కువగా ఉన్న మాలలే అత్యధికంగా అనుభవిస్తున్నారని... దీనివల్ల జనాభా పరంగా అత్యధికంగా ఉన్న తమకు తీరని అన్యాయం జరుగుతుందని మాదిగలు ‘ఏబీసీడీ’ ఉద్యమాన్ని ప్రారంభించారు. అయితే సామాజిక, చారిత్రక స్థితిగతులను పరిశీలిస్తే అటు ఆంధ్రలో, ఇటు తెలంగాణలోనూ మాలలకు ప్రత్యేకించి కుల వృత్తి అంటూ ఏదీ లేకపోవడం... మాదిగలకు చెప్పులు కుట్టే ప్రధాన జీవన వృత్తి ఉండటంతో రిజర్వేషన్లు అనుభవించడంలో హెచ్చుతగ్గులు మొదలయ్యాయి. కులవృత్తి లేని మాలలు వ్యవసాయరంగం వైపు మళ్లి అటు నుంచి విద్యారంగంలో అడుగుపెట్టారు. మాదిగలు మాత్రం తమ ‘వృత్తి’కి ప్రపంచీకరణ వెన్నుపోటు పొడిచినా ప్రత్యామ్నాయమార్గం లేకపోవడంతో దాన్నే నమ్ముకొని ఉండటం, తెలంగాణ ప్రాంతంలోనైతే భూస్వాముల పొలాల్లో పాలేర్లుగా మారి చదువులకు దూరమయ్యారు. చదువులు చేతికొచ్చే సమయానికి మాలలు వీరికంటే విద్యా ఉద్యోగగ రంగాలతో పాటు రాజకీయ రంగంలోనూ పైచేయిగా ఉన్నారు. ‘దండోరా’ ఉద్యమంతో విద్యా ఉద్యోగ రంగాల్లో మాలలు మాదిగలు, మాదిగ ఉపకులాల వారి కన్నా మెరుగ్గా ఉన్నారని దీనికి ఉన్న రిజర్వేషన్లను వెనుకబాటుతనం ఆధారంగా ఏబీసీడీలుగా చేస్తే పరిష్కారం లభిస్తుందని నాటి ప్రభుత్వాలు నియమించిన జస్టిస్‌ రామచంద్రరాజు కమిషన్‌, జస్టిస్‌ ఉషామెహ్రా కమిషన్‌లు నివేదించాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు 2000 సంవత్సరంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ ద్వారా 2004 దాకా ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించి విద్యా, ఉద్యోగ నియామకాలు చేపట్టింది. ఉద్యమ ప్రభావంతో విద్యా ఉద్యోగాల్లోనే కాదు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మాదిగలకు సముచిత స్థానం కల్పించాయి. ఫలితంగా అసెంబ్లీ, పార్లమెంటు, మంత్రివర్గంలోనూ మాల, మాదిగల వాటా సమానంగా కొనసాగడం మొదలయ్యింది. అయితే ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ మాల మహానాడు సుప్రీంకోర్టును ఆశ్రయించడం... ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ అం శం చట్టసవరణతో ముడిపడిన అంశమని, ఇది పార్లమెంటు ఆమోదంతో జరగాలంటూ ‘ఏబీసీడీ’లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. అప్పటి నుంచి నేటి వరకు పార్లమెంటులో ఏబీసీడీల చట్టబద్ధతకోసం ఉద్యమం జరుగుతూనే ఉంది. ఇదే సమయంలో పాత పద్ధతిని అవలంభిస్తే తెలంగాణలో అత్యధికంగా ఉన్న మాదిగలు తీవ్రంగా నష్టపోతారని దాని స్థానంలో ప్రాంతాల వారీ వర్గీకరణ డిమాండ్‌ తెరపైకి వచ్చింది. సీమాంధ్రలో మాలల ప్రాబల్యం, తెలంగాణలో మాదిగలు అధిక సంఖ్యలో ఉండటంతో రాష్ట్ర విభజనతో ‘వర్గీకరణ’ తీరుతుందని కూడా ప్రచారం మొదలైంది. అయితే తెలంగాణలో మాదిగలు జనాభా పరంగా ఎక్కువగా ఉన్నా 2004 నుంచి ఏబీసీడీ వర్గీకరణ అమలులో లేని ఈ సమయంలోనూ రిజర్వేషన్లు అత్యల్పంగానే దక్కుతున్నాయి.
దీనికి ఉదాహరణగా తెలంగాణ నడిగడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎస్సీ రిజర్వుడు అధ్యాపక పోస్టుల నియామకాన్ని పరిశీలిస్తే దాదాపు 70శాతం దాకా మాలలుంటే మిగిలిన అధ్యాపక పోస్టుల్లో 30 శాతం మాదిగలున్నారు. దీన్ని బట్టి రాష్ట్రం రెండు ముక్కలైనా ఎస్సీ రిజర్వేషన్ల వినియోగంలో భారీగా వ్యత్యాసాలున్నాయని అర్థమవుతోంది. పార్లమెంటు సవరణ చట్టం ద్వారా వెనుకబాటుతనం, జనాభా ఆధారంగా రెండు రాష్ర్టాల్లోనూ (తెలంగాణలో మాదిగ, మాదిగ ఉపకులాలకు 12 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో మాలలకు 9-10 శాతం రిజర్వేషన్లు దక్కేలా) ‘ఏబీసీడీ’లు అమలుచేయాలి. ఓట్ల కోసం ఫీట్లు వేయకుండా సమస్యను ఐదేళ్లపాటు సాగదీయకుండా అటు ఆయా ప్రభుత్వాలు, ఇటు ఎమ్మార్పీఎస్‌ నాయకత్వం చిత్తశుద్ధితో సమస్య పరిష్కారానికి పూనుకోవాలి. జనాభా దామాషా ప్రకారం ఎవరికీ అన్యాయం జరగకుండా రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా అందితేనే ఒక్కటవుతారనే సత్యాన్ని దళితులంతా విశాల దృష్టికోణంతో ఆలోచించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దళితులకు జరిగిన అన్యాయాలు కొత్త రాష్ర్టాల్లో జరగకుండా ఉండాలంటే ‘వర్గీకరణ’ అనే చిన్న అంశాన్ని త్వరితగతిన పరిష్కరించుకుని ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు, దళితుల సంక్షేమం, రాజ్యాధికారం అనే అంశాలపై దృష్టి సారించాలి.
కొంగర మహేష్‌
రీసెర్చ్‌ స్కాలర
ఓయూ (రేపు మాదిగ దండోరా ఆవిర్భావ దినోత్సవం)

Andhra Jyothi Telugu News Paper Dated: 6/07/2014 

No comments:

Post a Comment