Thursday, September 22, 2011

బియ్యం 'పథకం' - సంపాదకీయం Andhra Jyothi 23/09/2011



బియ్యం 'పథకం'
- సంపాదకీయం

రాష్ట్రంలో మళ్ళీ సంక్షేమ పథకాల జోరు మొదలైంది. పేదలకు ఒక్క రూపాయికే కిలో బియ్యం పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతిలో బుధవారం నిర్వహించిన రైతు, మహిళా సదస్సులో ప్రకటించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠను పెంపొందించేందుకు ఆయన ప్రారంభిస్తున్న అనేక సంక్షేమ పథకాల్లో రూపాయి బియ్యం పథకం అత ్యంత కీలకమైనది. రాష్ట్రంలోని రెండు కోట్ల 25లక్షల తెల్ల రేషన్ కార్డుల కుటుంబాలు ఒక్కింటికి నెలకు 20కిలోల చౌక బియ్యం ఈ పథకం ద్వారా అందుతాయి.

అక్టోబరునుంచి కొత్తగా మరో 24లక్షల తెల్లకార్డుల కుటుంబాలు కూడా ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నాయి. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్న ఈ తరుణంలో ప్రభుత్వం వాటిని అదుపు చేయకుండా కేవలం బియ్యాన్ని మాత్రమే చౌక ధరలకు అందిస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ మూలనపడ్డాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అనేక సంక్షేమ చర్యల ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు.

తమిళనాడులో 1967లో డిఎంకె ముఖ్యమంత్రి అన్నాదురై చౌక బియ్యం పథకాన్ని తొలుత ప్రారంభించారు. ఆ పథకం ఆయన అధికారంలోకి రావడానికి దోహదం చేసింది. అదే తీరులో రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ద్వారా పేదలకు పట్టెడన్నం పెట్టడమే తన ధ్యేయమంటూ 1983లో ఎన్‌టి రామారావు ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అంతకంటె ముందు విజయభాస్కర్‌రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పదిపైసలు తక్కువ రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని అందించినప్పటికీ చౌక బియ్యం పథకాన్ని విజయవంతంగా అమలు చేసిన ఘనత రామారావుకే దక్కింది.

ఎన్టీఆర్ హయాం తర్వాత ఆ పథకం గాడి తప్పింది. ఆ తర్వాత చాలా కాలానికి వైఎస్ఆర్ హయాంలో రాష్ట్ర పేదలకు చౌక బియ్యం పథకం తిరిగి అందుబాటులోకి వచ్చింది. తమిళనాడు తర్వాత పేదలకు చౌక బియ్యం అందజేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పరిగణించబడుతోంది. కరుణానిధి ఎన్నికల విజయానికి కూడా చౌక బియ్యం పథకం హామీనే ప్రధానంగా ఉపకరించింది. ఒక్క రూపాయికే కిలో బియ్యం పథకాన్ని దేశంలో మొట్టమొదటగా కరుణానిధి 2008లో ప్రవేశపెట్టారు. అందుకు పోటీగా కుటుంబానికి నెలకు పాతిక కిలోలు అందించే ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించి జయలలిత చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు చౌక బియ్యం పథకం రాజకీయ పార్టీలకు మిగతా ఎన్నికల వాగ్దానాల కంటె శక్తివంతమైన సాధనంగా ఉపకరించింది.

రైతులకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసే సమయాన్ని, పేదలకు ఇచ్చే సబ్సిడీ బియ్యం పరిమాణాన్ని పెంచుతూ సంబంధిత ఫైళ్ళ మీద వైఎస్ఆర్ రెండవసారి అధికారంలోకి వచ్చిన అనంతరం సంతకాలు చేసిన్పటికీ అమలులోకి తీసుకురాలేపోయారు. ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా రాష్ట్ర రాబడి క్రమంగా క్షీణించడం, ఆరోగ్యశ్రీ లాంటి జనాకర్షక పథకాలకు నిధుల మళ్ళించడం, రాష్ట్ర ఖజానా మోయలేని స్థాయిలో అనేక సంక్షేమ పథకాలను ప్రకటించిన కారణంగా కుటుంబానికి 30 కేజీలను అందించే పథకం కోల్డ్‌స్టోరేజీలోకి వెళ్లింది.

రామారావు రెండు రూపాయలు కిలో బియ్యం ప్రవేశపెట్టినప్పుడు బహిరంగ మార్కెట్‌లోని బియ్యం రేటుకు సబ్సిడీ బియ్యం రేటుకు రూపాయి, రెండు రూపాయల కంటె పెద్దగా వ్యత్యాసం లేదు. అందువల్ల రాష్ట్ర ఖజానాపై ఇప్పుడున్నంత భారం పడలేదు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే సబ్సిడీ పోను రాష్ట్ర ప్రభుత్వం ఆరు రూపాయల దాకా సబ్సిడీ భారాన్ని భరించవలసి వస్తోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు ఒకవైపు చెప్పుకుంటూ, గతంలో విజయవంతంగా అమలుచేసిన సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఏ ధైర్యంతో ఈ పథకాన్ని ప్రకటించినట్లు? రాష్ట్రంలో రెండు రూపాయల కిలో బియ్యంపై సర్కారు ఏటా రెండు వేల కోట్ల రూపాయల సబ్సిడీ భరిస్తోంది.

ఒక్క రూపాయికి కిలో బియ్యం పథకంతో అదనంగా మరో ఆరువందల కోట్ల రూపాయలకు పైగా భారాన్ని ప్రభుత్వం భరించవలసి ఉంటుంది. నిధులు కరువైనప్పటికీ తమ ప్రభుత్వంపేద ప్రజల కోసం ఈ భారాన్ని భరిస్తున్నట్లు సిఎం ప్రకటించడంలో మర్మమేమిటి? అక్టోబర్‌నుంచి ఆహార భద్రత పథకం కింద నిరుపేద కుటుంబాలకు కిలో మూడు రూపాయల వంతున 30 కిలోల బియ్యం కేంద్రం అందజేయనుంది.

అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న పేద కుటుంబాల సంఖ్యపై మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలున్నాయి. రాష్ట్రం ప్రభుత్వం చూపిస్తున్న పేద కుటుంబాల సంఖ్య కంటె చాలా తక్కువగా 50 లక్షలకు పైగా కుటుంబాలకు మాత్రమే కేంద్రం సబ్సిడీ అందించనుంది. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుక్నుప్పటికీ రాష్ట్ర ఖజానాపై బియ్యం సబ్సిడీ భారం పెద్దగా ఉండదు. అయితే కిలో బియ్యం ధర రెండు రూపాయల నుంచి ఒక రూపాయికి తగ్గించడం వల్ల పేద ప్రజలకు తగ్గే భారం కేవలం ఇరవై రూపాయలు మాత్రమే.

సబ్సిడి బియ్యం వినియోగం పోను మిగిలిన రోజుల కు పేద ప్రజలు బహిరంగ మార్కెట్‌లో కొనుక్కునే బియ్యం ఇతర నిత్యావసరాల ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. బియ్యం ఖర్చుతో సహా మిగిలిన నిత్యావసరాల ధరలన్నీ పెరిగిపోవడంతో సామాన్యుని బతుకు దుర్భరంగా మారింది.

ఆహార భద్రత పథకం ద్వారా కేంద్ర బడ్జెట్‌పై పడుతున్న అదనపు భారాన్ని తప్పించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. కేంద్ర ప్రణాళిక సంఘం ద్వారా పేదల సంఖ్యను అంచనా వేసే దారిద్య్ర రేఖను నిర్ణయించడంలో ఎత్తులు వేస్తోంది. ఈ ఏడాది జూన్ నాటి ధరల ప్రాతిపదికన రోజుకు నగరాల్లో 32 రూపాయలు, గ్రామాల్లో 26రూపాయలుగా దారిద్య్ర రేఖను నిర్ణయిస్తూ సుప్రీం కోర్టుకు ప్రణాళిక సంఘం తాజాగా ఒక అఫిడవిట్ సమర్పించింది.

కేవలం బిపిఎల్ సబ్సిడీ భారాన్ని తప్పించుకునే ఉద్దేశంతో రూపొందించిన ఈ గణాంకాలు దేశాన్ని పచ్చిగా మోసగించడమే. దేశీయంగా నిరుపేదల సంఖ్యపై కచ్చితమైన అవగాహన లేకుండా ఆహార భద్రత బిల్లు తెచ్చినా ఉపయోగం ఉండదు. దేశంలో పేదల సంఖ్య సురేశ్ టెండూల్కర్ కమిటీ ప్రకారం 38 కోట్ల మంది ఉంటే, ఎన్.సి. సక్సేనా కమిటీ 50 కోట్ల మంది ఉన్నారని, అర్జున్ సేన్ గుప్తా కమిటీ 75 కోట్ల మంది ఉన్నారని ప్రకటించాయి.

సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ డిపి వాధ్వా కమిటీ ప్రకారం వార్షికాదాయం 60వేల రూపాయల లోపు కుటుంబాలను దారిద్య్ర రేఖ దిగువన ఉన్నట్లు పరిగణించాలని తేల్చింది. సరైన ప్రాతిపదికలతో సహేతుక ప్రమాణాలతో పేదల సంఖ్యను నిర్ధారిస్తే సబ్సిడీ బిల్లు తడిసి మోపెడవుతుందని కేంద్రం భయపడుతోంది. పేద కుటుంబాల గణాంకాలను తగ్గించుకోవడం ద్వారా మూడు రూపాయల కిలో బియ్యం భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఆహార భద్రత ప్రస్తుతం ప్రపంచ సమస్యగా మారింది.

2008లోని ఆహార, ఇంధన సంక్షోభం, ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అధిక ధరలు మరింత మందిని పేదరికంలోకి నెట్టివేశాయని, ఈ ఏడాది దాదాపు 4.4 కోట్ల మంది పేదలుగా మారారని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎమ్ఎఫ్) తాజా నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో పేదల సంఖ్యను తగ్గించడంపై కాక పేదరికం తగ్గించి, సామాన్యుడి కొనుగోలు శక్తి పెంచే కార్యక్రమాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టాలి. పేదరికం నిర్మూలన ఓట్ల బ్యాంకు రాజకీయాల కేంద్రంగా మారితే చౌక బియ్యం పంపిణీ పథకాలు ఎన్నికల ప్రచార సాధనాలుగా మారుతాయి

No comments:

Post a Comment