Tuesday, September 6, 2011

బీసీలపై సమగ్ర అధ్యయనం ఏదీ ? by Durgam Ravindar Surya News Paper Date 06/09/2011


బీసీలపై సమగ్ర అధ్యయనం ఏదీ ?
రాష్ర్టంలోని వెనుకబడిన వర్గాల వారికి స్పెషల్‌ కంపోనెంట్‌ ప్లాన్‌ను 2012- 13 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రూపొం దించాలని బీసి మేధావులు కొందరు ఒక సదస్సులో తీర్మానించారు. బిసీలకు ఇప్పటి వరకు కేంద్రస్థాయిలో కానీ, రాష్ర్టస్థాయిలో కానీ, అటువంటి ప్రణాళిక లేదు. ఇలా జాతీయ స్థాయిలో షెడ్యూల్డ్‌ కులాలు, జాతులకు స్పెషల్‌ కంపోనెంట్‌ ప్లాను, సబ్‌ ప్లానులు ఉన్నాయి. అవి ఎక్కడా, ఎప్పుడు కూడా పూర్తిగా అమలు కావడం లేదు. ఇప్పటికి పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో నేటికీ బీసీలకు రిజర్వేషన్లే లేవు. కాన్పూర్‌ ఐఐటిలో దాదాపు వెయ్యిమంది బోధనా సిబ్బందిలో ఒక్కరంటే ఒక్కరు బీసి ఉపాధ్యాయుడు లేరు. గ్రూప్‌-1 ఉద్యోగుల్లో కీలక పదవుల్లో, ఉన్నతోద్యోగాల్లో బీసిల సంఖ్య చాలాచాలా తక్కువగా ఉంది. కొన్ని కులాల్లో గ్రాడ్యుయేట్స్‌ కూడా లేరంటే 65 ఏళ్ళ స్వతంత్ర భారతదేశం ముక్కున వేలేసుకుంటుందో లేదో?

మండల్‌ ఉద్యమం ఫలితంగా బీసిలకు ఒక గుర్తింపు లభించింది. దాని ఫలితమే బిసిలకు విద్యా, ఉద్యోగాల్లో 25 శాతం రిజర్వేషన్లు వచ్చాయి. బీసిలు అంటే రాష్ర్టంలోనే దాదాపు 140 వెనకబడిన కులాల వారు. వీరందరి తరఫున కొందరు స్పెషల్‌ కాంపోనెంట్‌ డిమాండ్‌ చేశారు. ఒక్కో కులానికి ఒక్కరు చొప్పున కానీ, అన్ని బీసి కుల సంఘాల ప్రతినిధులు కానీ ఇందులో లేరు. ఒక్కో కులానికి ఎంత జనాభా ఉందో ఎవరికీ తెలియదు. ఆయా కులాల సమస్యలు ఏమిటో తెలియదు. ఒక్కో కులం వారి డిమాండ్స్‌ ఏమిటో తెలియదు. ఆయా కులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితి ఏమిటో తెలియదు. అందరి తరఫున గంప గుత్తగా కొందరు ఈ డిమాండ్‌ చేశారు. ఎవరో ఒకరు డిమాండ్‌ చేయడం, సమస్యను సమాజం దృష్టికి, ఏలినవారి దృష్టికి తేవడం అవసరమే. తెచ్చే ముందు ఆయా కులాల పెద్దలు, మేధావులు కులాల వారీగా నిర్దిష్ట డిమాండ్లను గుర్తించాల్సింది.

ఆయా కులాల వారి సమస్యలను కొద్దిగానైన అధ్యయనం చేయాల్సింది. ఆయా కులాల్లో మహిళల స్థితిగతులు, బాలికా విద్య, శిశుమరణాలు, ఉజ్జాయింపుగా ఆయా కులాల జనాభా తదితర వివరాల్ని సేకరించాల్సింది. ఏ కులానికి సంబంధించిన వృత్తి ఏమిటి? వారి వృత్తి నైపుణ్యాలు ఏమిటి? వారికి ఏ వనరుపై అధికారం ఉండేది! వారి వనరులు ఎలా పరాధీనం అయ్యాయి. వారు ఏం కోల్పోయారు. ఈ స్థల కాలంలో వారు ఏ డిమాండ్‌ చేయాలి- ఇత్యాది అంశాలపై ఆయా కుల సంఘాల పెద్దలతో కలిసి కొంత అధ్యయనం చేయాల్సింది. ఇలాంటి అధ్యయనాల మొత్తం, ఆయా కులాల వారి డిమాండ్లు మొత్తం కలిపితే బీసి కులాల డిమాండ్లు అవుతాయి.

బీసిలందరి తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడేవారు ఇంకో విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అసలు ఈ బీసిలు నిజంగా వెనకబడిన వారా? వెనకపడగొట్ట బడిన వారా? వెనక బడిన వారుగా పేరు పెట్టబడినవారా? వెనకబడితే దేనిలో వెనకబడ్డారు? శ్రమలోనా? నైపుణ్యంలోనా? విద్యలోనా? అక్షరాస్యతలోనా? అడుక్కోవడంలోనా? ఆలోచనలోనా? అధ్యయనంలోనా? కూర్చుని తినడంలోనా? కుట్రలు చేయడంలోనా? వారికి జరిగిన జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించడంలోనా?

పద్మశాలి పిల్లవాడికి పత్తిని అద్భుత వస్త్రంగా మలిచే పనివచ్చు గదా? దీనిని నైపుణ్యం అనవచ్చా లేదా? ఇది విద్యకాదా? అలాగే కురుమ పిల్లవాడికి అడివిలో ప్రతి ఆకు అలం పేరు తెలుసు. అది ఏ రకమైన అనారోగ్యానికి మందుగా పనికివస్తుందో తెలుసు. గొడ్లు, మేకలకు ఏ సీజన్‌లో ఏ జబ్బు చేస్తుందో తెలుసు, దానికి ఏ ఆకు పసరు వేస్తే తగ్గుతుందో తెలుసు. గొర్రె బొచ్చును 40 ఏళ్ళు మన్నే గొంగడిగా చేయడం వచ్చు. ఇలా ఒక్కో కులం దగ్గర ఒక విద్య ఉంది. వారికి జీవావరణంలోని ఒక వనరుతో సంబంధం ఉంది. ఆ వనరుపై వారికి హక్కు ఉంది. ఆ హక్కును, సంబంధాన్ని నిర్దయగా తెంపివేసి, వారిని భిక్షగాళ్ళను చేసిన- చేస్తున్న వారెవరు? వీరి వనరుపై వీరికున్న హక్కును హరిస్తున్న వారెవరు? వీరి నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకోకుండా వీరి వనరులను, జీవనోపాధులను దెబ్బకొట్టిన వారెవరు? వీరిని వ్యర్థులుగా చేసినవారెవరు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలకై అధ్యయనాలు అన్ని వృత్తి కులాలపై జరగాల్సి ఉంది?

1931 లో చివరిసారి కులాల వారిగా జనాభా లెక్కలు తీశారు. ఇప్పటి వరకు ఆ లెక్కలను మళ్ళీ తీయడంలేదు. ముందు వృత్తి, సేవక, సంచార, ఆధార, ఆశ్రీత కులాలవారు అడగాల్సింది కులాల వారీగ జనాభా లెక్కలు తీయమని, వారి సమస్యల ప్రత్యేక అధ్యయనాలు చేయమని.వీరిని వెనకబడినవారు అనకుండా నైపుణ్యం కలవారు, అద్భుత నైపుణ్యం కలవారు, ప్రకృతి వనరులపై నేరుగా ఆధారపడేవారు, భూమిపై ఆధారపడ్డవారు, ఇంటి బయట శ్రమించేవారు, ఇంట్లో శ్రమించే వారు, లోహాలతో పనిచేసేవారు, రాయికి జీవం పోసేవారు, మన్నులోంచి అన్నం సృష్టించేవారు, సంపద సృష్టించేవారు, విశిష్ట సేవక కులాలు, అతి విశిష్ట సేవక కులాలు, కీలక సేవలు అందించేవారు, ప్రాణాధార సేవలు అందించేవారు, అత్యవసర సేవలు అందించేవారు అని అనాల్సింది.

వీరిలో సీనియర్‌ సిటిజన్స్‌ను మాస్టర్‌ క్రాఫ్ట్స్‌మెన్‌గా గుర్తించి వారి ద్వారా ఆయా వృత్తులకు, నైపుణ్యాలకు మరిన్ని ఆధునికతలను అద్ది, మెరుగులు దిద్దాల్సిందిపోయి వారిని- బీసిలని, గొంగడి గాళ్ళని- న్యూనపరిచి, గేలిచేసి, నీచపరిచి సమాజం తనకుతాను అన్యాయం చేసుకొన్నది. వారికీ తీరని అన్యాయం చేసింది. వారిని నోరూ, ఆలోచన లేనివారిని చేసింది. చాలా బీసి కులాలు తమకు ఏమి కావాలో కూడా అడగలేని స్థితిలో ఉన్నాయి. వారి అవసరాలను డిమాండ్‌ చేసే స్థితిలో వారు లేరు. ఈ దుర్మార్గం ఇంకా కొనసాగుతున్నది.

ప్రస్తుతం 17 కులాల వారికి ఫెడరేషన్లు ఉన్నాయి. వాటిలో కొన్నిటికి ఒక ఛైర్మన్‌, ఒక కారు, ఒక ఆఫీసు, కొంత ఆర్భాటం ఉంటుంది. ఆ కార్పొరేషన్‌ దగ్గర ఆ కులానికి సంబంధించి పూర్తి సమాచారం ఉండదు. ఆ కులం వారు ఏఏ మండలంలో ఎంతమంది ఉన్నారో, వారి ఇబ్బందులేమిటో? వారి ఆర్థిక అవసరాలు ఏమిటి ఇత్యాది వివరాలుండవు! ఆ వృత్తి కులం అభివృద్ధికి నిధులు కానీ, ప్రణాళికలు గానీ ఉండవు. అధ్యయనమనే ఆలోచన అసలే ఉండదు. 2011-12లో రాష్ర్ట ప్రభుత్వ బడ్జెట్‌ మొత్తం విలువ రూ. లక్షా 29 వేల కోట్లు అని అంచనా. అందులో దాదాపు రూ. 56 వేల కోట్లు ప్లాన్డ్‌ బడ్జెట్‌గా, 73 వేల కోట్లు నాన్‌-ప్లాన్డ్‌ బడ్జెట్‌గా ఉంటుంది. నాన్‌ప్లాన్‌ బడ్జెట్‌ జీతభత్యాలకు, ఎస్టాబ్లిష్‌మెంట్‌కు, పాత స్కీములను నడపడానికి ఖర్చు చేస్తారు. ఆ డబ్బుల్లో కొత్త ప్లానులు ప్రతిపాదించలేదు. అందువల్ల రూ. 56 వేల కోట్ల ప్లాన్డ్‌ బడ్జెట్‌లో 25 శాతం స్పెషల్‌ బిసి ప్లానుకు రూ.14 వేల కోట్లు ఇవ్వవచ్చు. 2012 నాటికి బడ్జెట్‌ పెరగనుంది కనుక దాదాపు రూ.15 వేల కోట్లతో బీిసీ బడ్జెట్‌ రూపొందించాలనేది బీసి మేధావుల డిమాండ్‌గా ఉంది.

ఇప్పుడు బీసిల కోసం కేటాయిస్తున్న రూ. 3,400 కోట్లు స్కాలర్‌షిప్‌లకే ఖర్చు అవుతున్నది. ఇందులో అనేక అవకతవకలున్నాయి. ప్రస్తుత 17 ఫెడరేషన్లు పోగా మిగిలిన కులాలన్నిటికి ఫెడరేషన్లను ఏర్పాటు చేయాలి. వృత్తి కోల్పోయిన చిన్న కులాలను గుర్తించి, ఆ కులాల అభివృద్ధికి ప్రత్యేక ఫెడరేషన్‌ ఏర్పరిచి, వారికి స్థిర జీవితాన్ని ఒక ఇల్లును, భూమి లేదా గౌరవప్రద వ్యాపారం లేదా మరో వృత్తిని ఏర్పరచాలి. తల్లిదండ్రులు భిక్ష తెచ్చి పెడితే, అది తిని పిల్లలు ఆత్మ గౌరవంతో స్కూల్లో కూర్చోలేరు. అందుకని ఈ ప్లాను ఫెడరేషన్‌ వాళ్ళ కుటుంబాల సెటిల్‌మెంట్‌పై దృష్టి నిలిపి ఎక్కువగా ఖర్చు చెయ్యాలని బీసి మేధావులసభ తీర్మానించింది.

అన్ని బీసీ కులాలకు కాన్ఫెడరేషన్‌లుగా రూపొందించి వాటికి మంచి ఆఫీసులు, అధ్యయన సిబ్బందిని ఏర్పర్చాలని కూడా మేధావులు సూచించారు. వృత్తుల ఆధునికీకరణకు పూనుకోవడం. ఫెడరేషన్‌ల ద్వారా ప్రత్యేక అధ్యయనాలు, పరిశోధనలు, విస్తృత చర్చలు జరగాలి. ఈ పనికి ప్రతి ఫెడరేషన్‌లో పరిశోధన, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా డబ్బు కేటాయించుకొని నిపుణుల కమిటీలు వేయాలి. ప్రత్యేక బీసీ ప్లానుతో ఆర్థిక వ్యవస్థలో విప్లవాన్ని తేవచ్చునని ఈ మేధావులు సూచించారు.

ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి ద్వారా కులాల ఆర్థిక, సామాజికాభివృద్ధి జరుగుతుంది. ఇది ప్లాన్డ్‌ బడ్జెట్‌ద్వారా మాత్రమే సాధ్యం. ఈ ప్లానులో నాలెడ్జ్‌ కేంద్రాల అభివృద్ధి, సాంస్కృతిక రంగాల అభివృద్ధిని, లైబ్రరీలను పెట్టవచ్చు.బీసీ కళల ఆధునికీకరణ జరపవచ్చు. వీటన్నింటికీ ప్రత్యేక అధ్యయనాలు చేయాలని సదుస్సు తీర్మానించింది.అంతకు ముందుగా బీసీలను తమ కుల చైతన్యం నుంచి, ఒక బిసి చైతన్యంలోకి ఎదిగించాలని కూడా మేధావులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది సాధ్యమా? అనే దిశలో కూడా ఆలోచన చేయాలి. ‘బీసీ బ్యాక్‌వర్డ్‌క్లాస్‌, వెనకబడిన తరగతులు’ అని పేరు పెట్టడంలోనే పెద్ద మతలబు ఉంది.

durgam-ravinderఈ పదాన్ని ఎవరు ఎందుకు కాయిన్‌ చేశారు, వీరు నిజంగా వెనకబడిన వారేనా? వెనకబడితే ఎందులో వెనకబడ్డారు అనే మూల ఆలోచన చేయాలి. వీరికి ఈ పేరు పెట్టకపోతే బీసి కులాలవారందరూ కలసి పై కులాల వారితోబాటు కూర్చుని తినేవారు, శ్రమను నిరాకరించేవారు, కుట్రలు జరిపేవారు అనే పేరు పెడతారని భయం కాబోలు. అందుకే వీరిని వెనకబడినవారు అనే పేరుతో మెస్మరైజ్‌చేసి, ‘నిజమే, మేము వెనకబడినవారమని’ అనుకునేలా చేశారు. ఇది భావజాల ఆధిపత్య సమస్య. ఫెడరేషన్‌ ఏర్పాటుకు డిమాండ్‌చేసే ముందు మేము వెనకబడినవారము కాము అని ‘డీ మెస్మరైజ్‌’ ప్రక్రియ జరగాలి. లేకపోతే ఎన్ని ఫెడరేషన్‌లు వచ్చినా అగ్రకుల బ్లాక్‌హోల్‌ భావజాలంలో ఫెడరేషన్లు ఆవిరి అయిపోవడం ఖాయం.

No comments:

Post a Comment