Tuesday, September 6, 2011

రక్త చరిత్ర సంపాదకీయం Andhra Jyothi Sep 07-2011


రక్త చరిత్ర
సంపాదకీయం

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో ఎట్టకేలకు తీర్పు వెలువడింది. 2005లో ప్రారంభమైన ఈ కేసు విచారణ ఆరేళ్ళపాటు సాగింది. కుట్రపూరితంగా హత్య చేసినట్లు నేరం రుజువైనందున ఈ కేసులో పి.నారాయణ రెడ్డి, బి.రేఖమయ్య తదితర ఎనిమిది మంది ముద్దాయిలకు గురువారంనాడు అనంతపురం జిల్లా కోర్ట్టు జీవితఖైదు విధించింది. ఫ్యాక్షన్ హత్యలకు, కోర్టు శిక్షలకు విసిగిపోయిన రాయలసీమవాసులకు ఈ తీర్పు పెద్ద ఆశ్చర్యం కలిగించక పోవచ్చు. ఈ కేసులో 16 మంది నిందితులతోపాటు 133 మంది సాక్షులను కోర్టు విచారిచింది. పరిటాల రవి హత్య కేసు విచారణ దశలో ఉండగానే కీలక నిందితులు మద్దెలచెరువు సూరి, మొద్దుశీనులే కాకుండా మరికొందరు కూడా వేర్వేరు కారణాల రీత్యా హత్యకు గురయ్యారు.

ఒకే కేసులో నిందితులు ఇట్లా అసహజ మరణాలకు గురికావడం ఆశ్చర్యకరమే. సరైన సాక్ష్యాధారాలు లేనందున నలుగురికి ఈ కేసునుంచి విముక్తి లభించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్థిక నేరాలు దర్యాప్తు దశలో ఉన్నపుడు ఈ తీర్పు వెలువడడం విశేషం. రాయలసీమ ఫ్యాక్షనిజంతోపాటు, రాష్ట్ర రాజకీయాల కోణం కూడా ఉండటం మూలాన ఈ కేసు రాష్ట్ర ప్రజల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తించింది. పరిటాల రవి హత్యలో అసలైన సూత్రధారులకు శిక్ష పడలేదని, ప్రధాన నిందితుడు జగన్ బేఫికర్‌గా తిరుగుతున్నాడని రవి సతీమణి సునీత, తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

స్థానిక వనరులు, ఆధిపత్యాల పునాదిగా సాగిన రాయలసీమ ఫ్యాక్షనిజం క్రమంగా రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగింది. ఫ్యాక్షన్ ముఠాల పరస్పరం చేసుకునే దాడులు, హత్యకాండలతో రాయలసీమలో నెత్తురు పారేది. ఈ ఫ్యాక్షన్‌లకు సామాజికమైన కోణం కూడా ఉన్నది. రాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీల వ్యవస్థ ఏర్పడిన తరువాత ఫ్యాక్షన్‌లకు రాజకీయ రంగు కూడా ఏర్పడింది.

వామపక్ష రాజకీయాల్లో కొనసాగి జనజీవన స్రవంతిలోకి వచ్చిన పరిటాల రవికి, ఆయన కుటుంబ ఫ్యాక్షన్ రాజకీయాలకు వేదికగా తెలుగుదేశం పార్టీ ఉపయోగపడింది. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత ఆధిపత్య పోరులో భాగంగా చెన్నారెడ్డి ప్రభుత్వాన్ని దింపేందుకు హైదరాబాద్‌లో జరిగిన మత ఘర్షణల్లో రాయలసీమ ఫ్యాక్షనిజం పాత్ర ఉందన్న ఆరోపణలున్నాయి. ఫ్యాక్షనిజం, రాజకీయాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని రాజధాని దాకా పాకి, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయసాగాయి.

అనంతపురం జిల్లాలో సాంప్రదాయ భూస్వామ్య వర్గం చెలాయిస్తున్న ప్యాక్షనిజాన్ని ఎదుర్కొంటూ పరిటాల కుటుంబం క్రమంగా తానే ఒక ఫ్యాక్షన్‌గా ఎదిగింది. తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత రవి తన చొరవతో జిల్లాలో పార్టీని బలమైన శక్తిగా నిలిపారు. తెలుగుదేశం అధికారంలో ఉన్న కాలంలో, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా తన ప్రాబల్యాన్ని విస్తరించిన పరిటాల రవి, అనేక రియల్ ఎస్టేట్, వ్యాపార, వాణిజ్య వివాదాల్లో మధ్యవర్తిత్వం నెరిపారు.

అనంతపురం జిల్లాలో ప్రత్యర్థి ముఠాలను హింసాపద్ధతుల్లో అదుపు చేశారు. మద్దెలచెరువు సూరి కుటుంబంపై టెలివిజన్ బాంబు ప్రయోగించారు. హత్య చే యించారన్న ఆరోపణలున్నాయి. అందుకు ప్రతీకారంగా సూరి ముఠా కారుబాంబు ప్రయోగించి రవిని హత్య చేయబోయి పాత్రికే యులతో సహా 26 మంది మరణానికి కార ణమైంది.

వైఎస్ఆర్ సారధ ్యంలో 2004లో రాష్ట్ర అధికార పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ తరువాత రాయలసీమ కాంగ్రెస్ పార్టీలోని ఫ్యాక్షనిస్టులు శత్రుశేషం లేకుండా పరిటాల రవి అనుయాయులను ఊచకోత కోశారు. అందుకు పరాకాష్ఠగా పరిటాల రవి హత్య కూడా జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది లగాయతు పరిటాలకు ప్రాణాపాయం ఉన్నదనే విషయం ఆయనకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రమే గాక ప్రజలందరికీ తెలుసు. తనకు రక్షణ కల్పించవలసిందిగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్‌తో సహా అందరినీ కలిసి పరిటాల రవి అభ్యర్థించారు.

తమ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, అమానుషకాండకు వ్యతిరేకంగా తెలుగుదేశం అనేక నిరసనోద్యమాలను చేసింది. రాజకీయ, ఫ్యాక్షనిజం నేపథ్యంలో అధికారం అండతో ప్రత్యర్థులు పరిటాల రవి అనుచరులను ఒక్కొక్కరినే హత్యచేస్తూ, చివరికి పరిటాల రవిని కూడా హత్య చేశారు. ఈ హత్యలో పోలీసుల ప్రమేయం కూడా ఉందని ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వమే పరిటాలను హత్య చేయించిందని తెలుగుదేశం ఆరోపించింది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, గంగుల భానుమతిల ప్రమేయంతోనే ఈ హత్య జరిగిందని అసెంబ్లీలోనూ, బయటా రవి హత్యపై పెద్ద దుమారం రేగడంతో వైఎస్ ప్రభుత్వం వారిపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది.

సిబిఐ వారికి క్లీన్ చిట్ ఇచ్చింది. హత్య జరిగిన కొద్ది రోజులకే వరుసగా రేఖమయ్య మహబూబ్‌నగర్‌లోను, నారాయణరెడ్డితో పాటు మరో నలుగురు అనంతపురం కోర్టులోనూ లొంగిపోయారు. ఆ తర్వాత మొద్దుశీను అనే వ్యక్తి పరిటాల రవిని తానే హత్య చేశానని ప్రకటన చేయడంతో సిబిఐ దర్యాప్తు అటువైపుగా సాగింది. దర్యాప్తు క్రమంలో సిబిఐ మరికొందరిని కూడా అరెస్టు చేసి కేసులు పెట్టింది. ఈ హత్య వెనుక ఫ్యాక్షనిజం కంటె రాజకీయార్థిక కోణమే ప్రధానంగా ఉంది.

రాయలసీమలో రాజకీయ ప్రత్యర్థిని బలహీన పరిచే ఉద్దేశంతోనే రవి హత్య జరిగింది. సూరి ప్రతీకారం మాత్రమే రవిని హతమార్చిందని భావిస్తే, అది సాంకేతిక సత్యమే కావచ్చునుకానీ, రాజకీయ వాస్తవం కాదు. ఇతర కారణాల వల్ల సహచరుని చేతిలోనే మరణించిన సూరిని పక్కన పెడితే, కాలక్రమంలో హత్యలకు గురి అయిన ఇతరులు, ఇప్పుడు శిక్ష పడినవారు అందరూ పాత్రధారులే తప్ప సూత్రధారులు కాదు.

దవి హత్యలో రాజకీయ కోణం ఉంటే, దానిపై కూడా దర్యాప్తు చేయవలసిన అవరసం ఉన్నది. పరిటాల సునీత చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాకపోవచ్చును కానీ, రవి హత్యలో దోషులు ఇంకా మిగిలే ఉన్నారన్న ఆమె ఆవేదనను ఆర్థం చేసుకోవాలి. 2004 తరువాతి పరిణామాలన్నిటి మీదా ఒక సమీక్ష, ఒక సమగ్ర విచారణ జరిపితే కానీ ఆర్థిక నేరాలకు, రాజకీయ హింసాకాండకు ఏదైనా సంబంధం ఉన్నదేమో వెల్లడికాదు.

No comments:

Post a Comment