Friday, April 13, 2012

తెలంగాణకు కొత్త ఫేస్‌బుక్ కావాలి!---పొఫెసర్ ఘంటా చక్రపాణి



మిమ్మల్ని మీరు దహించుకోకండి. 2014 వరకు ఆగండి, అప్పుడు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలను కాల్చిపారేయవచ్చు’. ఇది తెలంగాణ విద్యార్థులకు హరిరాఘవ్ అనే ఒక యువకుడు ఫేస్‌బుక్ ద్వారా ఇచ్చిన సందేశం.ఇలాంటి సందేశాలు చూసినప్పుడు సోషల్ మీడియా మనకు చాలా మేలు చేస్తోందనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమానికి ఇదొక వారధిగా మారిపోయింది. చిన్న సంఘటన జరిగితే చాలు క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రసారమైపోతోంది. మరుక్షణం లక్షలాది గొంతులు ఒక్కటయి నినదిస్తున్నాయి. ఆవే శం, ఆవేదన, ఆలోచనల సమ్మిళిత సందేశాలు ప్రపంచం నలుమూలలనుంచి మనకు చేరిపోతాయి. ఇప్పుడు తెలంగాణవాదం ఈ గడ్డమీదే కాదు ప్రపంచంలో మనిషనేవాడు సంచరిస్తున్న ప్రతి దేశంలోనూ ప్రాణంతో ఉన్నందుకు ఆనందమేస్తుంది. భోజ్యానాయక్ ఆత్మహత్య పట్ల వీరాడ్డితండా తల్లడిల్లినట్టుగానే వీళ్ళంతా తల్లడిల్లారు. చావొద్దని సొంత తమ్ములకు చెప్పినట్టు చెప్పారు. కానీ తెలంగాణ రాకపోతే జీవితం లేదని మనమే కదా వాళ్లకు చెప్పాం. తెలంగాణ వాదాన్ని పదునెక్కించిన మాటలు, ఆటలు, పాటలు అదే కదా బోధించింది. అలా భయపడి, బెంగపడి కూడా చివరకు రెండేళ్ళు పోరాటంలో నడిచే కదా భోజ్యానాయక్ నడిరోడ్డుమీద నిప్పురవ్వై రగిలిపోయింది. ఒకరిని చూసి ఒకరు ఒక్కవారంలో ఏడుగురు అలా బలయిపోవడం తెలంగాణలో విషాదం నింపిం ది. అందరిలో ఆవేదన ఉన్నదే తప్ప ఆత్మహత్య ఆలోచనలో ఉన్న వారిని ఊరడించగలిగే ఉపాయమేదీ కనిపించలేదు. కానీ హరిరాఘవ్ సందేశం మాత్రం స్పష్టంగా ఒక పరిష్కారాన్ని చూపినట్టు కనిపించింది. హరి రాఘవ్ ఎవరో తెలియదు. ఫేస్‌బుక్ స్టేటస్ ప్రకారం హైదరాబాద్‌లో ఉండే సైకాలజిస్ట్. భోజ్యానాయక్ సజీవదహనం తరువాత ఆత్మహత్యలకు వ్యతిరేకంగా అనేక విధాలుగా ఆయన స్పందించారు. అనేక పోస్టర్లు తయారు చేశారు. కవితలు, పాటలు పోస్ట్ చేశారు. ఆత్మహత్యలకు కారణాలు విశ్లేషిస్తూ, చనిపోవడం వల్ల కలిగే నష్టాలు ఏకరువు పెట్టారు. హరిరాఘవ్ లాగే నిశాంత్ దొంగారి, సమత, పాండు, మహి ఇట్లా అనేకమంది స్పందించారు. ఎవ్వరూ నిరాశ పడ 2014 దాకా ఆగుదామనే అంటున్నారు. 

తెలంగాణ సాధనకు ఒకే ఒక మార్గం పార్లమెంటులో బిల్లు పెట్టడం. కచ్చితంగా అది రాజకీయపార్టీల ద్వారానే సాధ్యం. అలాంటప్పుడు ఆత్మాహుతుల వల్ల ప్రయోజనం ఏముంది? ఇది తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఏర్పాటు 2014దాకా సాధ్యం కాదని, అప్పటిదాకా ఉద్యమాలు అక్కరలేదని కాదు. ఇప్పుడున్న పరిస్థితు ల్లో తెలంగాణ ఎప్పుడైనా ఏర్పడవచ్చు. ఎప్పుడనేది తేల్చాల్సింది ప్రభుత్వం కాదు, ఉద్యమం. మరోసారి ఉద్యమం ఉవ్వెత్తున లేస్తే ప్రభుత్వం దిగి వస్తుంది.ఇప్పుడిప్పుడేసాధ్యపడకపోయినా 2014 నుంచి ఎవరూ తప్పించుకునే వీలులేదు. అలా వీలులేని స్థితిని సృష్టించాల్సిన బాధ్యత ఉద్యమాని ది. ప్రజలను దహించి వేస్తోన్న భావోద్వేగాలను చల్లార్చకుండా ఆత్మహత్యలు ఆగాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. కాబట్టి ఆ దిశగా ఉద్యమ కార్యాచరణ ఉండాలి. ఉద్యమం ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్‌పార్టీ టార్గెట్‌గా సాగా లి. కాంగ్రెస్ నేతలు- తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరి పాత్రను వాళ్ళు రక్తికట్టిస్తున్నారు. తెలంగాణవాదులుగా చెలామణీ అవుతూనే పార్టీలో, పదవిలో కొనసాగుతున్నారు. వీళ్ళ నాటకానికి తెరపడాలంటే ఉద్యమం బరిగీసి నిలబడాలి. ఉద్యమంతో నిలబడేవారే తెలంగాణవాదులని మిగిలిన వారంతా ద్రోహులేనని ప్రకటించాలి. ఇది చేయకపోతే కాంగ్రెస్‌లో తెలంగాణవాదులని చెప్పుకునేవాళ్ళు రోజొకరి ఇంట్లో టిఫిన్ కో, భోజనానికో కలుస్తారు. అది తెలంగాణ కోసమే అని నమ్మబలుకుతారు. వారానికో గుంపు ఢిల్లీ వెళ్లి పైరవీలు చేసుకుని వస్తుంది. అధిష్ఠానంతోనో, అమ్మతోనో మాట్లాడామని చెబుతారు. నెలా రోజుల్లో అని ఒకడంటే, వారమే అని ఇంకొక డు వాగుతుంటారు. ఏ పదవిలోలేని వాడు ఇప్పుడే తెలంగాణ రాదని కుండ బద్దలుకొడతాడు. ఇది ప్రజల మీద, మరీ ముఖ్యంగా తెలంగాణ కోసం పడి చచ్చే అమాయక జనాల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఈ పరిస్థితులను అనుకూలంగా మలచుకోవడానికి కాంగ్రెస్ స్థానికసంస్థల ఎన్నికలను తెరమీదికి తెస్తోంది. తెలంగాణలో టీడీపీ నామరూపాలు లేకుండాపోయిన పరిస్థితులను అవకాశంగా తీసుకొని పార్టీని పటిష్ట పరచుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ నేత లను నిలదీయడానికి ఇంతకు మించి సమయం ఇంకొకటి ఉండదు. ఇది ఉద్య మం నీరుగారిందనో, తెలంగాణ రాదనో దిగులుపడే వారికొక ధైర్యాన్ని ఇస్తుంది. 

ఇక రెండోది ఉద్యమం ఒక దీర్ఘకాలిక ప్రక్రియ అని ప్రజలు అర్థం చేసుకోవా లి. జేఏసీలు, రాజకీయ పార్టీలు ఈ విషయం స్పష్టంగా చెప్పాలి. 2014 ను అంతిమ గడువుగా ప్రకటించాలి. తెలంగాణ ఉద్యమం ఒక ప్రవాహంలా కదల డం లేదు. అలల లాగా ఎగిసిపడుతోంది. అలల్లో అలా పైకి లేచిన వాళ్ళు ఒక్కసారిగా మళ్ళీ కుప్పకూలే సరికి తట్టుకోలేకపోతున్నారు. ఆ ఉద్వేగ ఉత్థాన పతనాలు సామాన్యులను కలతకు గురిచేస్తున్నాయి కాసేపు పరుగెత్తడం, అంతకు రెట్టింపు సమయం విశ్రమించడం వల్ల గమ్యం చేరుతామా లేదా అనే అయోమ యం సహజం. కాబట్టి ఉద్యమం నడక నేర్చుకోవాలి. ఆ నడకకు ఒక గమ్యం ఉండాలి. ఆ గమ్యం 2014 అని స్పష్టం చేసుకోవాలి. ఆలోపు వస్తే సంతోషం. రాకపోతే అదే అంతిమ సమరం అని అర్థం చేయించాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు మినహా వేరే అవకాశాలు ఉండవు. కాబట్టి ఎన్నికలు సృష్టించడమో, ఎన్నికల సమయం దాకా ఆగడమో చేయాలి. ఎవరినీ రాజీనామా చేయాలని అడగక్కరలేదు. వాళ్లకు వాళ్ళుగా రాజీనామా చేసే పరిస్థితులు కల్పించాలి. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తలుచుకుంటే ఒక్క నెలలో తెలంగాణ ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఉన్న దివాలా పరిస్థితుల్లో అది మరీ సులభం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు,మంత్రులు ఇరవైమంది రాజీనామా చేస్తే చాలు. అందరూ ఒకేసారి చేస్తే భావోద్వేగాలని స్పీకర్ అడ్డు చెప్పవచ్చు. కాబట్టి రోజుకొకరు-రాజీనామా చేస్తే తెలంగాణ ఏర్పా టు ప్రక్రియ మొదలుపెట్టడానికి పదిరోజుల సమయం చాలు. అంటే ఇన్ని చావు లు లేకుండా ఒక్క నెలలో తెలంగాణ తెచ్చే శక్తి కాంగ్రెస్ నేతలకు ఉంది. ఉద్యమం చేయాల్సిందల్లా వాళ్లు తలవంచే పరిస్థితి సృష్టించడం. వాళ్ళ రాజీనామాలు కోరుతూ కోదండరామ్ ప్రకటనలు చేయడం కాదు. అలా చేస్తే కోదండరామ్ టీఆర్‌ఎస్ తొత్తు అనో, బీజేపీ బంటు అనో ప్రచారం చేస్తారు. కాబట్టి రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఉద్యమం ద్వారా కల్పించాలి. 

ఇవన్నీ సాధ్యపడాలంటే తెలంగాణకు ఒక నిజమైన ఫేస్‌బుక్ కావాలి. జనం లో ఒకరినుంచి ఒకరికి అల్లుకుపోగలిగే సోషల్‌నెట్ కావాలి. అది జేఏసీ పునర్‌వ్యవస్థీకరణతోనే సాధ్యమౌతుంది. ఇప్పుడున్న జేఏసీలో ఎన్నికల రాజకీయాల కు అతీతంగా ఉద్యమంకోసం ఉన్న సంఘాలు, సంస్థలు ఇరవైకి పైగానే ఉన్నా యి. వాటితో పాటు బయట ఉంటూ తెలంగాణకోసం నిజాయితీగా పనిచేస్తున్న పౌరసమాజంతో జేఏసీ ఏర్పడాలి. ఇప్పుడు జేఏసీకి ఊరూరా ప్రతినిధులున్నా రు. అలా లేనిచోట ఉద్యోగులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, పాత్రికేయులు, విద్యావంతులు, విద్యార్థులు ఎవరో ఒకరున్నారు. ఎవరూలేనిచోట సామాన్య ప్రజలున్నారు. అంతాకలిస్తే తెలంగాణకు అతిపెద్ద సోషల్ నెట్ వర్క్ అయి తీరుతుంది. ఒక స్వతంత్ర సంస్థగా జేఏసీ నిలబడుతుంది. ఉద్యమాన్ని రాజకీయ అవసరాలకు అనుగుణంగా కాకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడిపించవచ్చు. ఇందుకోసం ముందుగా ఇప్పుడున్న జేఏసీ పూర్తిగా ప్రక్షాళన జరగాలి. మహబూబ్‌నగ ర్ ఎన్నికల ఫలితం తరువాత జేఏసీ విశ్వసనీయత సన్నగిల్లినట్టు కనిపిస్తోంది. పరస్పర విరుద్ధమైన ఎజెండాలతో ఉన్న టీఆర్‌ఎస్, బీజేపీలు ఒకే రాజకీయ జేఏసీలో ఉండడం విస్మయం కలిగించే విష యం. రాజకీయ జేఏసీకి రాజకీయ ఎజెండా ఉండాలి. ప్రణాళికా ఉండాలి. కానీ ఇప్పుడు జేఏసీలో అటు ఐక్యతా ఇటు కార్యాచరణ రెండూ కనిపించడం లేదు. ఇరవైనాలుగు పుల్లల గొడుగుగా జేఏసీ విస్తరిస్తే రాజకీయపార్టీలు ఆ గొడుగు కింద తలదాచుకుంటున్నాయి. అదికూడా ఎన్నికల దాకే! ఆ తరువాత ఎవరిదారి వారిదే అంటున్నా యి. ఎన్నికల దాకా జాయింట్‌గా ఉంటాం ఎన్నికల్లో ఎవరి యాక్షన్ వాళ్ళది అంటే ప్రజలకు నిజంగానే పిచ్చెక్కుతుంది. టీఆర్‌ఎస్, బీజేపీ నిన్న ఎన్నికల్లో ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకున్నారు. రేపు పరకాల కోసం ఎవరి వలలు వాళ్ళు భుజాన వేసుకుని తిరుగుతున్నారు. వాళ్ళు ఉమ్మడిగా ఉద్యమాన్ని నడిపించడం వీలయ్యే పనికాదు. రాజకీయ అవసరాల రీత్యా కూడా అది అనైతికమే. రాజకీయ జేఏసీ చైర్మన్‌గా ఒకే ఒరలో రెండు కత్తులు పెట్టుకుని యుద్ధం చేస్తానంటే కోదండరామ్‌ను ఎవరూ నమ్మరు. జేఏసీ ఆ నమ్మకాన్ని పోగొట్టుకుం మొత్తం తెలంగాణ ఉద్యమానికే నష్టం. ఆ నష్టం ప్రజల ఆత్మస్థైర్యాన్ని మరింత దెబ్బదీసే ప్రమాదం ఉంది. ఏకాభివూపాయంలేని రాజకీయ పార్టీలు జేఏసీకి అనుగుణంగా నడుచుకోవడమో లేక జేఏసీ వారిని వదిలించుకోవడమో తప్పనిసరి. అలాగని రాజకీయ పార్టీలను దూరం చేసుకోవాలని కాదు. వాళ్ళనూ కొద్దిరోజు లు స్వతంవూతంగా ఎవరిసత్తా ఏమిటో నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చి చూస్తే తప్పేమీ లేదు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అన్ని సీట్లూ మావే అని బీరా లు పలుకుతున్న కొన్ని పార్టీలకు చాలా గ్రామాల్లో, మండలాల్లో పార్టీ శాఖలు కూడాలేవు. ఈ రకంగానైనా వాళ్ళు వారి పార్టీల పునాదులను పటిష్టం చేసుకుంటారు. రెండేళ్ళ సమయం ఇచ్చి ఈ రెండేళ్లలో ఎవరు ఎవరివైపో తేల్చి 2014లో ప్రజల పక్షానలేని పార్టీలను నిజంగానే కుప్పవేసి కాల్చి పడేయవచ్చు. ఆ అవకా శం తప్పక వస్తుంది. అప్పటిదాకా ఎవరూ కాలిపోవద్దనే కోరుకుందాం. 

పొఫెసర్ ఘంటా చక్రపాణి 
రచయిత సమాజశాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు 
ఈ మెయిల్: ghantapatham@gmail.co

Namasete Telangana News Paper Dated : 14/04/2012 

No comments:

Post a Comment