Friday, April 13, 2012

బీసీరిజర్వేషన్లు-అంబేడ్కర్‌----యం.ఎఫ్.గోపీనాథ్



‘చరిత్రలో అపార్ధాలకు, వాస్తవాల వక్రీకరణలకు పరిమితులుండవు’
- ఎరిక్‌ ఫ్రామ్‌

నష్టం చేసింది గాంధీ, నెహ్రూ, పటేల్‌ 
అంబేడ్కర్‌పై అపోహ లెందుకు?
హిందూ సమాజంలో భాగంగా ఉండడమే! 
కింది సమాజంపై ఆధిక్యతా భావం 
బీసీ రిజర్వేషన్లకోసం అంబేడ్కర్‌ పోరాటం 

Ambedkar

ఈ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 2010 ఆగస్టు నుండి అణగారిన కులాల మేధావులతో, ఉద్యమకారులతో, రాజకీయ నాయకులతో కనీసం 20 సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాల్లో అనేక విషయాలతో పాటు రెండు ముఖ్యమైన విషయాలు యథాలాపంగా చర్చకొచ్చేవి. అవి 1. కులాల అవిర్భావం, 2. బీసీల, క్రైస్తవుల రిజర్వేషన్లు- వీటి విషయంలో అంబేడ్కర్‌ పాత్ర. 2011 జూన్‌ 11న విజయవాడలో డా అంబేడ్కర్‌ రాసిన ఏడవ సంపుటి (శూద్రులెవరు) గురించి రైల్వే ఉద్యోగులు ఒక సమావేశం నిర్వహించారు.

ఒక మిత్రుడు మాట్లాడుతూ ‘డా అంబేడ్కర్‌ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్స్‌ కల్పించినట్లే బిసిలకు, మత మైనారీటీలకు కూడా కల్పిస్తే బాగుండేది’ అన్నారు. ఇదే విషయం చాలా మంది నుండి చాలా సందర్భాలలో వినిపిస్తోంది. అంతే కాదు, కొంతమంది దళిత క్రిస్టియన్స్‌కి రిజర్వేషన్‌ సదుపాయం రాకుండా డా అంబేడ్కర్‌ అడ్డుపడ్డాడని కూడా ఒకరు చెప్పారు. చదువుకున్న వాళ్ళ నుండి చదువులేని రాజకీయ నాయకుల వరకు బీసీల, దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్‌ విషయంలో వాస్తవాలకు భిన్నంగా ఎందుకు అపోహపడి అంబేడ్కర్‌ని అపార్ధం చేసుకొం టున్నారు? వీళ్ళను మోసగించిన గాంధీ, నెహ్రూ, పటేల్‌ లను వదలిపెట్టి, బీసీల రిజర్వేషన్‌, దళిత క్రిస్టియన్‌ రిజర్వేషన్‌, మతమైనారీటీల ప్రత్యేక హక్కుల కోసం నీ- నా భేదం లేకుండా అణగారిన కులాలన్నింటికోసం, మహిళల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి పోరాడిన డా అంబేడ్కర్‌ని అపార్ధం చేసుకోటానికి గల కారణం ఏమిటి? బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పట్ల బీసీ కులాల మేధావులు, మత మైనారిటీల మేధావులు 1994కి ముందు పూర్తిగా వ్యతిరేకంగానే ఉన్నారు. మతమైనారీటీల విషయం అంతకన్నా భిన్నంగా లేదు.

కారణం ఏమిటి? బీసీలు బ్రాహ్మణీయ హిందూ సమాజంలో భాగంగా ఉండడం; బ్రాహ్మణీయ సోషల్‌ ఆర్డర్‌ని తూ.చ తప్పకుండా పాటించడం; తమ పైన ఉన్న సమాజం మీద కోపం కన్నా, తమ కింద ఉన్న సమాజం మీద ఉన్న ఆధిక్యతా భావంతో కూడిన ఆనందం, తృప్తి; అణచివేస్తున్న హిందూ సింబల్స్‌ (దేవుళ్ళు, దేవతలు)నే ఆరాధించటం; మహాత్మాపూలే, సాహుజీ మహరాజ్‌, నారాయణ గురు వంటివారి గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయకపోవడం. ఇవన్నీ సాధారణ ప్రజలలోఉండే సాధారణ లక్షణాలు. 

బాబా సాహెబ్‌ని మాల మాదిగలే ఎప్పుడూ విగ్రహాలు పెట్టి, జయంతులు, వర్ధంతులు చేస్తారు. కాబట్టి అంబేడ్కర్‌ కూడా అంటరాని వాడనుకోవడంలో చదువులేని బీసీలను తప్పు పట్టనవసరం లేదు. మాల మాదిగలు క్రీస్తు మతాన్ని తీసికొన్నందువల్ల ఏసుక్రీస్తు కూడా అంటరానివాడనే నమ్మకం హిందువుల్లో ఉండటం సహజ పరిణామమే. ఈ దేశంలో ఒక వేళ విద్యుత్తును, మోటార్‌ సైకిల్‌ను, ఆవిరి ఇంజిన్లను అంబేడ్కర్‌ కనిపెట్టినట్లయితే వాటిని కూడా ఈ బ్రాహ్మణీయ హిందూ సమాజం వాడక పోయేదేమో! ఈ భావన సగటు హిందూ మైండ్‌కి ఉండడంలో తప్పులేదు. కానీ చదువుకున్న లాయర్లు, జడ్జీలు, రాజ్యాంగ నిపుణులు, లెక్చరర్లు, రీడర్లు, ప్రొఫెసర్లు, ఉద్యమాల్లో పాల్గొనే బీసీలు, మత మైనారీటీలు- తమకోసం అంబేడ్కర్‌ చేసిన కృషి గురించి తెలిసుకోక పోవడం, తెలిసినా చెప్పక పోవడం నిజంగా విచారించవల్సిన విషయం.

అసలు విషయం ఏమిటంటే- వాస్తవ చరిత్రను చదవక, అవగాహన చేసుకోక పోవడమే! గాంధీ, నెహ్రూ, పటేల్‌ తరుపున వకాల్తా పుచ్చుకున్న బ్రాహ్మణీయ హిందూ మీడియా మరో కారణం.
డా అంబేడ్కర్‌ పట్ల ఉన్న అపోహల్ని సవరించుకోవడం అనేది అణగారిన కులాల, వర్గాల నాయకులకు, ఆ వర్గాల ప్రజలకు ఎంతైనా అవసరం. అందుకే 1930 నుండి 1951 వరకు- అంటే లండన్‌లో జరిగిన మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు మొదలుకుని 1951 సెప్టెంబర్‌ 27న అంబేడ్కర్‌ కేంద్ర క్యాబినెట్‌కి రాజీనామా చేసిననాటి వరకు జరిగిన పరిణామాల్ని కూడా ఒకసారి పరిశీలించాలి. రాజ్యాంగంలోని 330, 332 అధికరణల ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు, 15(14), 16(4) అధికరణల ప్రకారం కార్యనిర్వాహక శాఖల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించిన డా అంబేడ్కర్‌- బీసీ వర్గాల రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సభలో తీవ్ర పోరాటం చేశారన్న వాస్తవం రాజ్యాంగ పరిషత్‌లో జరిగిన చర్చల మినిట్స్‌ చూస్తే తేలుతుంది.

రాజ్యాంగ పరిషత్‌కు బీసీల ప్రయోజనాలను కాపాడే‚ ఒక్క వ్యక్తి కూడా ఎందుకు ఎన్నిక కాలేదు? రాజ్యాంగ రచనా సంఘంలో బీసీల తరుపున వాదించే ఒక్క నిపుణుడు కూడా ఎందుకు లేడు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పవల్సింది గాంధీ, నెహ్రూ, పటేల్‌లే.
కొల్హాపూర్‌ సంస్థానాధీశుడైన ఛత్రపతి సాహు మహారాజ్‌ తన సంస్థానలోనే తన పర్సనల్‌ సెక్రెటరీగా ఒక జైన మతస్థుణ్ణి నియమించుకున్నాడు. అతను పట్టభద్రుడు కాదన్న విషయాన్ని సాకుగా చూపి- బ్రిటిష్‌ ప్రభుత్వాధికారులతో కుమ్మక్కయిన బ్రాహ్మణవర్గం మహారాజు పర్సనల్‌ సెక్రటరీని పదవినుండి తీసివేయించింది. అప్పుడు పట్టభద్రుడైన బ్రాహ్మణేతరుని కోసం వెదికితే ఒక్క వ్యక్తి కూడా దొరకలేదు. అంటే ఆనాడు ఒక్క బ్రాహ్మణేతరుడికి కూడా ఇంగ్లీష్‌ చదువులు చదివే అవకాశం గానీ, డిగ్రీ వరకు చదవే అవకాశంగానీ లేదు. సమస్యకు మూలం తెలుసుకున్న సాహు మహారాజ్‌ 1901లో వెనుకబడిన కులాల పిల్లలకు స్కూళ్ళు, హాస్టళ్ళు తెరిచాడు. 1902 జూలై 26 నుండి ఈ కులాలకు విద్య, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాడు. 

మహత్మా పూలే, సాహు మహారాజ్‌ ల చరిత్ర తెలుసుకొన్న బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ అణచివేతకు గురై, వెనక్కునెట్టి వేసిన కులాల, మత మైనారీటీలందరి కోసం పోరాడాడు. మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వీరందరికి విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ప్రత్యేక సదుపాయల్ని కల్పించే విధంగా బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని ఒప్పించాడు. కాని రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి వచ్చిన మోహన్‌ దాస్‌ కరంచంద్‌ గాంధీ భారతీయులందరికి తానే ప్రతినిధినని మొండికేశాడు. అందుకు అంటరాని కులాలు ఒప్పుకోలేదు. గిరిజనులు డా అంబేడ్కర్‌ని వ్యతిరేకించలేదు. ముస్లిం మైనారీటీల తరుపున జిన్నా వకాల్తా పుచ్చుకున్నాడు. బీసీలు గాంధీని నమ్మి, మహారాష్ట్ర బీసీ నాయకుడైన జాడే జవాల్కర్‌ నాయకత్వంలో ‘మా నాయకుడు డా అంబేడ్కర్‌ కాదు, గాంధీనే’ అని బ్రిటిష్‌ ప్రిమియర్‌కి టెలిగ్రామ్‌ లిచ్చారు. ఇదీ రికార్డయిన చరిత్ర. 

డా అంబేడ్కర్‌ నాయకత్వంలో కమ్యూనల్‌ అవార్డు ద్వారా ప్రత్యేక నియోజకవర్గాలు సాధించుకున్న అంటరాని కులాల నోట్లో దుమ్ముకొట్టే పూణే ఒప్పందాన్ని తన ఆమరణ నిరాహార దీక్ష ద్వారా సాధించుకున్నాడు గాంధీ. 1946లో రాజ్యాంగ పరిషత్‌కు జరిగిన ఎన్నికల్లో డా అంబేడ్కర్‌ని గాంధీ, నెహ్రుల కాంగ్రెస్‌ ఓడించింది. అప్పుడు డా అంబేడ్కర్‌ని నామ శూద్రుల నాయకుడైన జోగేంద్రనాథ్‌ మండల్‌ పశ్చిమబెంగాల్‌కు ఆహ్వానించి జైసూ ్‌కుల్నార్‌ జిల్లాల నుండి గెలిపించి రాజ్యాంగ పరిషత్‌కి పంపించారు. 1946లో అప్పటి వరకు బెంగాల్‌ విభజనకు ఒప్పుకోని హిందూ మహాసభ, కాంగ్రెస్‌ నాయకత్వం, పశ్చిమ బెంగాల్‌లోని జైసూల్‌ కుల్నార్‌ జిల్లాలను జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్‌ అడక్కపోయిన కూడా 1947లో పాకిస్థాన్‌కి ఇచ్చేసింది కాంగ్రెస్‌. అంబేడ్కర్‌ని రాజ్యాంగ పరిషత్‌లోకి రానీయకుండా చేయడానికి నామ శూద్రుల (జొగేంద్రనాథ్‌ మండల్‌) జనాభా 50 శాతం ఉన్న ప్రాంతాన్ని పాకిస్థాన్‌ కివ్వడానికికూడా వెనుకాడలేదు హిందూ మహసభ, కాంగ్రెస్‌ నాయకత్వం. 

అప్పుడు బ్రిటిష్‌ ప్రిమీయర్‌ ఒత్తిడి మేరకు పూణే నుండి ఎన్నికైన ఒక కాంగ్రెస్‌ బ్రాహ్మణ సభ్యుణ్ణి విరమింపజేసి డా అంబేడ్కర్‌ రాజ్యాంగ సభకు ఎన్నిక కావటానికి కాంగ్రెస్‌ సహకరించవలసి వచ్చింది.1947 జులై 9న అంబేడ్కర్‌ రాజ్యాంగ సభకి ఎన్నిక కావడం, 1947 జులై 10న బ్రిటిష్‌ ప్రభుత్వం భారత దేశానికి 1947 ఆగస్టు 15 నాడు స్వాతంత్య్రం ఇస్తామని ప్రకటించడం జరిగిపోయాయి. ఈ రెండు సంఘటనలు యాథృచ్ఛికం కావు.1902 జులై 26న కొల్హాపూర్‌ సంస్థానంలో ప్రారంభమైన వెనుకబడిన కులాల రిజర్వేషన్లు 1922 వరకు కొనసాగాయి. 1932లో రెండవ రౌండ్‌ టేబుల్‌ సమావేశమప్పుడు రిజర్వేషన్ల విషయంలో గాంధీ బీసీలకిచ్చిన వాగ్ధానాన్ని స్వాతంత్య్రం వచ్చిన తరువాత నిలబెట్టుకోలేదు. 

మరలా బీసీల రిజర్వేషన్‌ విషయాన్ని రాజ్యాంగ పరిషత్‌లో డా అంబేడ్కర్‌ లేవనెత్తినప్పుడు సర్ధార్‌ వల్లభ భాయి పటేల్‌ ‘షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌, షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ అంటే సరే, మరి ఈ బీసీ లంటే ఎవరు’ అని బీసీ రిజర్వేషన్లను- ‘లిస్టెడ్‌ క్యాస్ట్స్‌’ కాదన్న సాంకేతిక అంశాన్ని లేవనెత్తి అడ్డుకున్నాడు. అప్పుడు అంబేడ్కర్‌ రాజ్యాంగంలోని 340 అధికరణం ద్వారా బీసీ కులాల జాబితాను తయారుచేయడానికి, వారికి రిజర్వేషన్లు కల్పించటానికి ఒక కమిషన్‌ను నియమించాల్సిన ‘రాజ్యాంగపర ఆదేశా’న్ని జారీ చేయించాడు. 1947 తర్వాత ఓబీసీల జాబితాను బి.ఆర్‌. అంబేడ్కరే తయారు చేశాడు. కానీ 1951 వరకు బీసీ కమిషన్‌ నియమించడానికి నెహ్రూ మంత్రివర్గం ముందుకు రాకపోగా ఆ విషయంలో డా అంబేడ్కర్‌ని అడ్డుకున్నది. 

అదే సమయంలో మహిళా హక్కులకు సంబంధించిన హిందూకోడ్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలన్న డా అంబేడ్కర్‌ ప్రతిపాదనను నెహ్రు కెబినెట్‌ తోసి పుచ్చింది. బీసీ కమిషన్‌ ఏర్పాటును, హిందూకోడ్‌ బిల్లును కాంగ్రెస్‌ ప్రభుత్వం అడ్డుకోవడం వల్లనే నెహ్రు కేబినెట్‌లో 4 సంవత్సరాల 56 రోజులు న్యాయశాఖ మంత్రిగా ఉన్న డా అంబేడ్కర్‌ 1951 సెప్టెంబర్‌ 27న రాజీనామా చేశాడు. తన రాజీనామా పత్రాన్ని కూడా రాజ్యసభలో చదవకుండా అయ్యంగార్‌ ద్వారా నెహ్రు అడ్డుకున్నాడు. అందువల్ల పార్లమెంట్‌ రికార్డుల్లో డా అంబేడ్కర్‌ రాజీనామాకు గల రెండు కారణాలు రికార్డు కాలేదు. కానీ ఆనాటి పత్రికలు అంబేడ్కర్‌ రాజీనామాకు గల కారణాల్ని ప్రచురించాయి.

ఇదే సందర్భంలో లక్నోలో జరిగిన ఒక సంఘటనని గుర్తుకు తెచ్చుకోవాలి. 1948 ఏప్రిల్‌ 24, 25 తేదీలలో షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌ ఫెడరేషన్‌ సమావేశాలు జరుగుతున్నాయి. ఆర్‌.యల్‌. చంద్రాపురి అనే బీసీ నాయకుడి నేతృత్వంలో కొందరు బీసీ నాయకులు డా అంబేడ్కర్‌ని లక్నోలో కలిసి ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీ లకు కూడా నాయకత్వం వహించవల్సిందిగా కోరారు. అప్పుడు డా అంబేడ్కర్‌ ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కల్సి ఒక శక్తిగా ఎదిగితే యుపీలో ముఖ్యమంత్రిగా ఉన్న గోవింద్‌ వల్లబ్‌ పంత్‌ మీ బూట్లకు లేసులు కట్టే పనికి పూనుకుంటాడు’ అన్నారు. ఈ వార్త కూడా అప్పటి పత్రికల్లో వచ్చింది. ఈ వార్త చదివిన చాచా నెహ్రు, ఆర్‌.యల్‌. చంద్రాపురికి క్యాబినెట్‌ మంత్రి పదవిని ఎరగా వేస్తే చంద్రాపురి దాన్ని తిరస్కరించారు. 

తన రాజీనామా తరువాత దేశవ్యాప్తంగా బీసీల చైతన్యయాత్రను డా అంబేడ్కర్‌ ప్రారంభించిన దరిమిలా, దానిని అడ్డుకోవటానికే నెహ్రు బీసీ కమిషన్‌ వేశాడు. డా అంబేడ్కర్‌ కృషి ఫలితంగా 340 అధికరణాన్ని రాజ్యాంగంలో చేర్చడం వల్లనే బీసీల కమిషన్‌ ఏర్పాటుకు మార్గం ఏర్పడ్డదన్న విషయాన్ని బీసీలు గుర్తించాలి. బీసీల రిజర్వేషన్లను దెబ్బ తీయడానికే కాకా కాలేల్కర్‌ అనే పూణే బ్రాహ్మణుణ్ణి బీసీ కమిషన్‌ ఛైర్మన్‌గా నెహ్రూ నియమించాడు. అదే సమయంలో బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యవహరించవల్సిందిగా ముఖ్య మంత్రులకు నెహ్రూ రహస్య లేఖల్ని రాసిన విషయాన్ని 1977 లో పార్లమెంట్‌లో హోమ్‌ మంత్రిగా ఉన్న ఛౌదరి చరణ్‌సింగ్‌ బయటపెట్టాడు. 

అంతేకాదు కాకా కాలేల్కర్‌ 2218 కులాలను బీసీలుగా గుర్తించి నెహ్రు ప్రభుత్వానికి సమర్పించగా, దాన్ని తొక్కిపెట్టమని అప్పటి రాష్టప్రతి రాజేంద్రప్రసాద్‌ నెహ్రూకు రహస్య లేఖ రాసిన విషయాన్ని ‘రాజేంద్ర ప్రసాద్‌ లేఖలు’ అనే గ్రంథాన్ని రాసిన డా వాల్మికి చౌదరి (రాజేంద్ర ప్రసాద్‌ సెక్రెటరీ) బయట పెట్టాడు. ఆ లేఖను అందుకున్న నెహ్రు వెంటనే కాకా కాలేల్కర్‌ను పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌కి పిలిపించి మందలించగా, అప్పుడు కాకా కాలేల్కర్‌ తానిచ్చిన రిపోర్టు బీసీల ప్రయోజనాలను కాపాడదని, అందువల్ల ఆ సిపార్సులను వెనక్కి తీసుకుంటున్నానని31 పేజీల ఉత్తరాన్ని ప్రభుత్వానికిచ్చాడు.

ఈ లేఖను సాకుగా తీసికొని- కమిషన్‌ అధ్యక్షుడే అంగీకరించని సిపారసులను అమలు చేయలేమని- పార్లమెంట్‌లో ప్రకటించాడు నెహ్రూ. దరిమిలా నెహ్రూ వారసులైన దేశ పాలకులు బీసీ రిజర్వేషన్లవిషయాన్ని 20 సంవత్సరాలు పార్లమెంట్‌లో చర్చకు రానీయకుండా అడ్డుకోగలిగారు.1977లో కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పతనమైన తరువాతనే మురార్జీ దేశాయ్‌ ప్రధానిగా ఉన్నప్పుడే బీసీల సమస్యను అధ్యయనం చేయడానికి ఓబీసీకి చెందిన బిందేశ్వర ప్రసాద్‌ మండల్‌ అనే ఎంపీ అధ్యక్షతన ఒక కమిటీని రాజ్యాంగం లోని 340 ఆధికరణం ద్వారా ఏర్పరిచారు. తరువాత జరిగిన పరిణామాలు ఇటీవలి చరిత్రే. 

ఇక క్రిస్టియన్‌ మైనారిటీల రిజర్వేషన్ల్‌ విషయానికొస్తే, ఇక్కడా డా అంబేడ్కర్‌కి అడ్డుపడ్డది గాంధీ శిష్యుడు కాంగ్రెస్‌వాది అయిన కేరళ సిరియన్‌ క్రిస్టియన్‌ (నంబూద్రి బ్రాహ్మణ క్రిస్టియన్‌) అన్న విషయం చరిత్రలో దాగిన సత్యం. రాజ్యాంగ పరిషత్‌లో దళిత క్రిస్టియన్స్‌కి రిజర్వేషన్స్‌ కల్పించాలని డా అంబేడ్కర్‌ ప్రతిపాదించినపుడు, కేరళలో దళిత క్రిస్టయన్స్‌ని సిరియన్‌ క్రిస్టియన్‌ చర్చీలలోకి కూడా అడుగుపెట్టనివ్వని క్రిస్టియన్‌ (సిరియన్‌) ప్రతినిధి ‘అవర్‌ క్రిస్టియన్స్‌ ఆర్‌నాట్‌ బెగ్గర్స్‌’ (మా క్రిస్టియన్లు బిచ్చగాళ్ళు కాదు) అని, ‘మా క్రిస్టియన్స్‌కి రిజర్వేషన్స్‌ అవసరం లే’దని దళిత క్రిస్టియన్ల నోట్లో దుమ్ము కొట్టిన చరిత్ర దళిత క్రిస్టియన్స్‌కి తెలి యకపోవడం చరిత్రని చదవకపోవటమే. క్రిస్టియన్‌ మత మార్పిడులను వ్యతిరేకించిన గాంధీ, నెహ్రుల ఫోటోలను అగ్రకుల క్రిస్టియన్‌ సంస్థలు నడిపే స్కూళ్ళు, కాలేజీల్లో పెట్టి పూజిస్తారు. రాజ్యాంగంలో 51వ ఆర్టికల్‌ ద్వారా మైనారిటీ హక్కుల్ని పొందు పరిచేందుకు కృషిచేసిన డా అంబేడ్కర్‌ని ఆడిపోసుకోటానికి, హిందూ క్రిస్టియన్ల పెద్దలు బ్రాహ్మణ భావజాల పీడితులైనందుకు, వాళ్ళ భావదారిద్య్రానికి విచారిం చాలి. 

gopi
ఈ భావ దారిద్య్రం ప్రభావం ఎంతంటే- తనని విద్యార్ధి దశలో అవమాన పర్చి, స్వంత ఇంటి నుండే వెలి కావడానికి కారణమైన బ్రాహ్మణిజాన్ని జీవితాంతం చీల్చి చెండాడి, ప్రత్యమ్నాయ సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపిన మహాత్మా పూలేకి- దండలేస్తున్న కొంతమంది కూడా డా అంబేడ్కర్‌- పూలే గురించి రాయలేదని కువిమర్శలు చేస్తున్నారు. ధనం జయ కీర్‌ని పూలే గురించి రాయలని కోరి, పూలే గురించి తను రాసిన వివరాల స్క్రిప్ట్‌ను ఆయనకు ఇచ్చి, పూలే జీవిత చరిత్ర రాయడం పూర్తి అయినతరువాతనే తన జీవిత చరిత్రను రాయా లన్న అంబేడ్కర్‌ని అపార్ధం చేసుకుంటున్నారు. డా బి.ఆర్‌. ఆంబే డ్కర్‌ రాసిన స్క్రిప్ట్‌కి ‘మహత్మా ఫూలే- ది ఇండియన్‌ సోషల్‌ రివల్యూషన్‌’ అనే నామకరణం కూడా చేశారు. తాను రాసిన ‘శూద్రులెవరు?’ అనే గ్రంథాన్ని ఫూలేకి అంకిత మిచ్చి, తన ముగ్గురు గురువుల్లో ఫూలేని చేర్చుకున్న డా అంబేడ్కర్‌ గురించి అపార్థం చేసుకోకుండా ఉండాలంటే వీళ్ళు కూడా మనువాద ప్రభావం నుండి బయటపడాలి! 
ఏప్రిల్‌ 14 అంబేడ్కర్‌ జయం

Surya News  Paper Dated : 14/04/2012

No comments:

Post a Comment