Sunday, September 4, 2011

అన్నా అర్థంలో అవినీతి అంటే..సుదర్శన్ బాలబోయిన కుమారస్వామి నాగం పరిశోధక విద్యార్థుల Namasethe Telangana 28/08/2011


8/27/2011 11:46:28 PM
అన్నా అర్థంలో అవినీతి అంటే..
బ్రాహ్మణీయ, పెట్టుబడిదారీ విధానాలే దళిత బహుజనులను పీడించే అధర్మానికి మూలాధారాలని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అన్నాడు. నిజంగా అవినీతిని వ్యతిరేకించే వారెవరైనా ఉంటే, ఈ సమాజంలోని అమానవీయ బ్రాహ్మణ విలువలకు, సంస్కృతికి, పెట్టుబడిదారీ విష సంస్కృతులకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్మించాలి. అంతే తప్ప అగ్రకుల, వర్గ ప్రయోజనాలను పునర్నిర్మించే అన్నా (అ)ధర్మాన్ని ఆదర్శంగా తీసుకోరాదు.
దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిని అంతమొందించడానికి మరింత మెరుగైన చట్టం (జన్ లోక్ పాల్ బిల్లు)ను రూపొందించాలని అన్నాహజారే, అతని అనుయాయులు ఉద్యమం లేవదీశారు. అన్నా టీం సభ్యులు (ఎలిట్ క్లాస్, క్యాస్ట్ ) ప్రభుత్వంపై చేస్తున్న ఒత్తిడి, లేదా ఉద్యమం సంగతి ఎలా ఉన్నా.. దీనిపై దేశం లో విభిన్న వాదనలు వస్తున్నాయి. అవినీతి అంటే ఏమి ? దాన్ని ఎలా నిర్వచించాలి? అవినీతికి ఈ దేశంలో ఉన్న మూలాలేమిటి? వంటి అంశాలపై లోతైన చర్చ సాగుతోంది. అంబేద్కరిస్టులు మొదలుకొని మార్క్సిస్టుల దాకా అన్నా ఉద్యమం, పర్యవసానాల గురించి సైద్ధాంతిక చర్చను లేవదీస్తున్నారు.
సమాజంలోని కొన్ని శక్తులు రూపొందించుకున్న విలువలు ఆచరణలో విఫ లం చెందితే, ప్రజా సమూహాలలో సంఘర్షణ మొదలౌతుంది. తిరిగి నీతి, అవినీతుల పునాదులను పునః సమీక్షించుకొని మరింత విస్తృతంగా, ఉదారంగా ఉండే సరికొత్త విలువలను రూపొందించుకుంటాయి.
సామాజిక ఉత్పత్తి శక్తుల పునాదుల ఆధారంగా సమస్త ఉపరితల రంగాలు నిర్ణయించబడతాయని, నియంవూతించబడతాయని మార్కిస్టు మహోపాధ్యాయుడు కారల్ మార్క్స్ ప్రతిపాదించారు. సరిగ్గా నేడు దేశ రాజకీయాలలో ప్రధాన చర్చనీయాంశమైన అవినీతి వ్యతిరేక ఉద్యమం తీరుతెన్నులను ఈ దృక్పథం నుంచి కూడా చూడవచ్చు. ఏ సమాజంలోనైనా ఆధిపత్య శక్తులు నిర్మించిన విలువలకు భిన్నంగా, వ్యతిరేకంగా అణచివేతకు గురవుతున్న వర్గాలు నిత్యం సంఘర్షిస్తూనే ఉంటాయి. ఈ సంఘర్షణనే విలువల స్వరూపాన్ని, గుణాత్మక స్వభావాన్ని గతం కంటే మెరుగైనదిగా తీర్చిదిద్దుతుంది. విలువలు లేదా నీతి మరింత ఉన్నతమైనదిగా ఉన్నతీకరించబడే ప్రతి దశలోనూ దాని ప్రతిఫలాలు విశాల ప్రజారాశులకు అందజేయబడతాయి. ఆ ప్రతిఫలాలు గతంకంటే మెరుగైనవి మాత్రమే కాక ప్రజాస్వామికమైన, ప్రగతిశీలమైన సమాన అవకాశాల రూపంలో అక్కడి ప్రజా సమూహాలన్నింటికీ వీలైనంత విస్తృతంగా పంచబడతాయి. మానవ పరిణామ ప్రతి దశలోనూ నీతికి సంబంధించిన ఘర్షణ నిత్యం సాగుతూనే ఉంటుంది.
యజమానులు నిర్మించిన నీతి, దాని తాలూకు విలువల్ని ధ్వంసం చేస్తూ బానిసలు సృష్టించిన మహోన్నతమైన ఫ్యూడల్ సమాజాన్ని నిర్మించింది. ఈ విధంగానే ఫ్యూడల్ సమాజాన్ని ధ్వంసం చేసి దానికంటే మెరుగైన పెట్టుబడిదారీ విధానంలోని రాజకీయ ప్రజాస్వామిక విలువలను ప్రజలు రూపొందించుకున్నారు. అంటే చరివూతలో దోపి డీ శక్తులు నిర్మించుకున్న ఉత్పత్తి పునాదుల్నే కాకుండా దాని ఉపరితల అంశాలైన నైతిక, సాంస్కృతిక విలువల్ని సైతం అణచివేతకు, పీడనకు గురవుతున్న శక్తులు నిరంతరం మార్చుకుంటూ.. ఉన్నతీకరించుకుంటూ..మానవీకరించుకుంటాయి. భారతీయ సమాజంలో కూడా కొన్ని వేల సంవత్సరాలుగా.. ప్రజాసమూహాల న్నీ.. నిత్యం సామాజిక అణచివేతలకు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నతమైన మానవీయ విలువలను నిర్మించుకుంటున్నాయి.
మనువు రూపొందించిన ధర్మం ఈ సమాజంలోని ప్రజా సమూహాలను సమానంగా చూడటానికి నిరాకరించింది. ఉత్పత్తిని సృష్టించే శూద్ర, అతిశూద్ర వర్ణాల శ్రమను, సంపదను దోపిడీ చేసే బ్రాహ్మణీయ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను నిర్మించింది. ఇది హిందూ ధర్మం అని జనులను శాసించింది. ఈ ధర్మాన్ని ఉల్లంఘిస్తే అత్యంత కఠినమైన, నీచమైన శిక్షలు అమలు చేసింది. ఈ బ్రాహ్మణీయ, హిందూ నీతిని ఈ దేశ పాలకులు 1950 వరకూ కాపాడుకుంటూ కాలం గడుపుతూ వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ప్రజాపోరాటాలు పారిక్షిశామిక విప్లవాల ఫలితంగా గత సమాజపు పునాదులు పెకిలించబడ్డాయి. నిర్మూలించబడ్డాయి. ప్రజలే స్వయంగా నిర్మించుకొని, పాలించుకొనే రాజకీయ మూలాలు కలిగిన సోషలిస్టు, పార్లమెంటరీ ప్రభుత్వాలు ఉనికిలోకి వచ్చాయి. ఈ క్రమంలోనే భారత దేశంలో సైతం మనువాద నైతిక విలువలు బద్దలు కొట్టబడి ఎన్ని లోపాలున్నప్పటికీ చట్టం ముందు అందరూ సమానులే (రూల్ ఆఫ్ లా) అనే విలువ అస్తిత్వంలోకి వచ్చిం ది. జీవన విధానంగా మారింది.
అయితే.. అన్నా హజారే టీం సభ్యులు ప్రతిపాదిస్తున్న అవినీతి వ్యతిరేక జన్ లోక్ పాల్ బిల్లు ధ్వంసం చేయబడిన నైతిక విలువల్నే తిరిగి ప్రతిపాదించే విధంగా ఉంది. అన్నా హజారే ఉద్యమానికి వచ్చిన ప్రతిస్పందనను తట్టుకోలేని ప్రభుత్వం దీని వెనుక మావోయిస్టులున్నారని దుష్ర్పచారానికి దిగింది. అటు తర్వాత, ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న ప్రజాస్వామిక సూత్రాలకు, విలువలకు పూర్తి విరుద్ధమైనదని స్యయంగా గాంధీ మనుమడు తుషార్ గాంధీ, మాజీ స్పీకర్ సోమనాధ్ చటర్జీల చేత విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టించింది. ఇదిలా ఉంటే... భారత పార్లమెంటరీ రాజకీయాలను అందించిన భారత రాజ్యాంగాన్ని అగౌరపర్చడమే గాక, మనువాద శక్తుల రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చడమే అన్నా బృందం లక్ష్యంగా కనిపిస్తున్నదని అంబేద్కరిస్టులు, సామాజిక శాస్త్రవేత్తలు, ఉద్యమకారులు అంటున్నారు.
అన్నా చుట్టూ బ్రహ్మణ, బ్రహ్మణేతర అగ్రకుల శక్తులు, బడా కార్పోరేట్ రంగ ప్రముఖులు చేరి ఉన్నారు.
వీరంతా మనువాదాన్ని, ప్రైవేటీకరణ అనుసరిస్తూ, రిజర్వేషన్ విధానాలను, సామాజిక న్యాయసూవూతాలను ఉల్లంఘించే ప్రతిపాదనల దిశగా ప్రస్తుత ఉద్యమాన్ని కుట్రపూరితంగా చేపట్టారు. ప్రజా సమస్యల పరిష్కా రం కోసం ఉద్యమిస్తున్న ప్రస్తుత తరుణంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య గురించి చర్చకు పెట్టవద్దని, సందర్భరాహిత్యమని వాదిస్తున్నారు. పార్లమెంటరీ రాజకీయాలపైన ఏ మాత్రం విశ్వాసం లేని మావోయిస్టులు రేపు ప్రజల కోసం లక్షల మందితో లాంగ్‌మార్చ్ చేస్తే ఈ బృందం సభ్యులంతా ఏటు వైపు నిలబడతారు?
అన్నా ‘హీరో’ వర్షిప్ అత్యంత ప్రమాదకరంగా, భయానకంగా ప్రచారం చేయబడుతున్నది. ప్రజలకు విలువనీయకుండా వ్యక్తిని మాత్రమే పూజించే విధానం ఎంత ప్రమాదకరమైందో చరివూతలో అనేక ఉదాహరణలున్నాయి. 1935లో నాజీ నాయకుడు అడాల్ఫ్ ‘హిట్లర్ ఈజ్ జర్మనీ ఆన్ జర్మనీ ఈజ్ హిట్లర్’ అని కీర్తించారు. ఇలాంటి వ్యక్తి పూజ రెండవ ప్రపంచ యుద్ధంలో నాలుగు కోట్ల మంది మరణహోమానికి దారి తీసింది. ‘ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇంది రా’ అంటూ 1975లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవకాంత్ బారు అకాశానికెత్తాడు. దీనితో అపరకాళీగా అవతరించిన ఇందిర మొత్తం దేశాన్ని ఎమ్జన్సీ చీక ట్లో బంధించింది. ప్రస్తుతం ‘అన్నా ఈజ్ ఇండియా ఇండియా ఈజ్ అన్నా’ అని కిరణ్‌బేడీ పదే పదే అంటుంది. దీని ఫలితంగా భవిష్యత్‌లో మనం ఎలాంటి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందో? గత అనుభవాల నుంచి తగిన గుణపాఠం తీసుకొని అన్నా ఉద్యమాన్ని ఎలా కట్టడి చేయాలో బాధ్యత గల పౌరులు గా ఆలోచించాలి.
సోషలిజం ఎన్నటికి నెరవేరని స్వప్నమని రష్యా పతనాంతరం ప్రపంచ పెట్టుబడిదారి వర్గం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. మూడో ప్రపంచ దేశాల్లో మార్కెట్ కోసం మొదలుకొని వనరులను కొల్లగొట్టడానికి బహుళజాతి సంస్థలు పెద్ద ఎత్తున అవతరించాయి. ‘కార్పోరేటు సామ్రాజ్యాలు వెనుకబడిన దేశాల్లోని సంపదను దోచుకోవడానికి ప్రభుత్వాధినేతలను, రాజ్యాధినేతలను డాలర్‌తో లొంగదీసుకుంటామని లేదంటే సి.ఐ.ఎ తోడేళ్ళతో వేటాడటం అత్యంత సహజమైన విషయమని’ ఒకప్పటి ఎం.ఎన్.సి ల ఏజెంట్ జాన్ పెర్కిన్స్ నగ్న సత్యాను వెలిబుచ్చాడు.
సంపద, సహజ వనరుల సమానంగా పంపిణీ జరగకుండా కొద్ది మంది సంపన్నులు సృష్టించే కృత్రిమ కొరతే అవినీతికి ప్రధాన మూలం. కొద్ది మంది సంపన్నుల గుత్తాధిపత్యంలో భూమిలాంటి సహజ వనరులు ఉండటం వల్ల ప్రజలకు సక్రమంగా పంపిణీ కాకుండా పోతుంది. ఆ సంపదను తిరిగి ఆ వర్గమే అక్రమ పద్ధతుల్లో మరింత లాభాలు గడించడానికి పెట్టుబడిగా ఉపయోగిస్తుంది. ఈ దేశ మొత్తం అవినీతి యంత్రాంగంలో ప్రధాన భాగమైన సంపన్నులను శిక్ష నుంచి తప్పించి, నామమావూతమైన ఉద్యోగులను మాత్రమే బలిచేయబూనడం వెనుక ఎటువంటి కుట్రలు దాగి ఉన్నాయో ఇట్టే పసిగట్టవచ్చు. పరిక్షిశమ నెలకొల్పడాని కి సరైన ప్రమాణాలు లేని పెట్టుబడిదారుడి (అగ్రకుల, వర్గ) దరఖాస్తును తిరస్కరించే అధికారిని (దళితుడై ఉండవచ్చు) లంచం ఆశించాడని శిక్షించడం ఎంత సులభం.
ఎల్.పి.జి ప్రభావం వల్ల కనీస జీవన అవసరాలైన ఆహారం,దుస్తులు, విద్య, వైద్యం వంటి వాటిని తీర్చుకోవడానికి వీలు లేని పరిస్థితికి సమాజం నెట్టివేయబడింది. ప్రతి ఒక్కరికీ కనీస అవసరాల్ని అందుబాటులోకి తెచ్చే రాజకీయ వ్యవస్థను నిర్మూలించకుండా అవినీతి నిర్మూలించడం సాధ్యమేనా?
బ్రాహ్మణీయ, పెట్టుబడిదారీ విధానాలే దళిత బహుజనులను పీడించే అధర్మానికి మూలాధారాలని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అన్నాడు. నిజంగా అవినీతిని వ్యతిరేకించే వారెవరైనా ఉంటే, ఈ సమాజంలోని అమానవీయ బ్రాహ్మ ణ విలువలకు, సంస్కృతికి, పెట్టుబడిదారీ విష సంస్కృతులకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్మించాలి. అంతే తప్ప అగ్రకుల, వర్గ ప్రయోజనాలను పునర్నిర్మించే అన్నా (అ)ధర్మాన్ని ఆదర్శంగా తీసుకోరాదు.
-సుదర్శన్ బాలబోయిన
కుమారస్వామి నాగం
వేణుగోపాల్‌డ్డి బండారి
(ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులు

No comments:

Post a Comment