Saturday, February 25, 2012

భాగ్యరెడ్డి వర్మ అడుగుజాడల్లో.. -మల్లెపల్లి లక్ష్మయ్య


హైదరాబాద్ నగరంలోని చాదర్‌ఘాట్ చౌరస్తాలో ఉన్న భవనంపై 'ఆది హిందూభవన్' అని రాసి వుంటుంది. అటువైపుగా వెళ్ళుతున్న వాళ్ళమం తా చాలా సార్లు ఆ అక్షరాలను చూస్తూ ఉంటాం.' ఆది హిందూ భవన్' అనే పేరు చూసి దానిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లేదా విశ్వహిందూపరిషత్‌కు చెందిన భవనమనుకునే వారి సంఖ్య తక్కువేమీ కాదు. అయితే అది, ఆ సంస్థల వైఖరికి భిన్నమైన భావజాలంతో సామాజిక సమానత్వం లక్ష్యంగా సాగిన ఉద్యమానికి కేంద్రమనే విషయం కొద్దిమందికే తెలుసు. ఆ ఉద్యమ క్రేందం నిర్వాహకుడు ఎం.బి.గౌతమ్. సంస్కర్త , మానవతావాది అయిన గౌతమ్ 98 ఏళ్ళ నిండు వయస్సులో గురువారం నాడు అంతిమ శ్వాస విడిచారు. 

హైదరాబాద్ సంస్థానంలోనే కాక, యావత్ తెలుగు ప్రాంతంలోను, ఆ మాట కొస్తే దక్షిణ భారతావనిలో, అంతేకాదు యావద్భారతదేశంలో తొలితరం దళిత నాయకులలో ఒకరైన భాగ్యరెడ్డి వర్మ కుమారుడు గౌతమ్. సంఘసేవను తండ్రినుంచి వారసత్వంగా గ్రహించిన గౌతమ్ తన జీవితం ప్రారంభం నుంచి తుదివర కు అణగారిన వర్గాల వారి శ్రేయస్సకు, ముఖ్యంగా ఆ వర్గాల బాలికల విద్యాభ్యాసానికి నిబద్ధతతో కృషిచేసిన ఉదాత్తుడు. 'ఆది హిందూభవన్'ను భాగ్యరెడ్డివర్మ 1920లో నిర్మించారు.

అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ భవనం సామాజిక సేవా కార్యకలాపాలకు కేంద్రంగా భాసిల్లింది. రెండు దశాబ్దాలుగా హైదరాబాద్ నగరంలోని అనేక భవనాలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అదృశ్యమయ్యాయి. అయి తే గౌతమ్ తన తండ్రి నిర్మించిన భవనాన్ని చివరివరకు ఆయని నిలువెత్తు ఉద్యమ స్ఫూర్తికి ప్రతీకగా నిలబెట్టారు. ఇది ఎంతైనా స్ఫూర్తిదాయకమైన విషయం. 

భాగ్యరెడ్డి వర్మ దంపతులకు గౌతమ్ ఏకైక సంతానం. 1913 ఆగస్టు 22న జన్మించిన గౌతమ్ నిజాం కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలోను, రజాకార్ల వ్యతిరేక పోరాటంలోను పాల్గొన్న కొంతకాలం జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆ కాలంలోనే గౌత మ్ తన ఉపాధ్యాయ జీవితాన్ని ప్రారంభించారు. 1942 వరకు బాల బాలికలకు ఉమ్మడి పాఠశాలగా ఉన్న పాఠశాలను బాలికల పాఠశాలగా మార్చి ఇప్పటివరకు నడిపారు. ఆ పాఠశాల నిర్వహణ గౌతమ్ సామాజిక నిబద్ధతకు ఒక నిలువెత్తు సాక్ష్యం. గౌతమ్ అవివాహితుడు. జీవితాన్ని సామాజిక సేవలకే అంకితం చేశారు.

1942-52 సంవత్సరాల మధ్య ఉపాధ్యాయుడు గా పనిచేస్తూనే గౌతమ్ హైదరాబాద్ సంస్థాన రాజకీయాలలో చురుగ్గా పాల్గొన్నారు. 1952లో జరిగిన మొట్ట మొదటి శాసనసభా ఎన్నికలలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. బూర్గుల రామకృష్ణరావు నేతృత్వంలోని హైదరాబాద్ రాష్ట్ర ప్రభు త్వం ఏర్పాటు చేసిన భూసంస్కరణల కమిషన్‌లో గౌతమ్ సభ్యలు. దళితులకు, పేదలకు భూములు దక్కడానికి ఆ కమిషన్ సభ్యులుగా ఆయన శ్లాఘనీయమైన కృషి చేశారు. గౌతమ్ 1962లో శాసనమండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. 1971 లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా నియమితులయ్యారు. 1972 లో భారత ప్రభుత్వం గౌతమ్ సామాజిక సేవలను గుర్తించి ఆయనను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 

గౌతమ్ జీవితం, ఆయన కృషీ దళితులకు ఆదర్శప్రాయమైనది. ఆయన నిర్వహించిన, దాదాపు వందేళ్ళ చరిత్ర కల 'భాగ్య మెమోరియల్ బాలికల పాఠశాల' ను జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలి. ఈ నివాళిని ముగించే ముందు ఒక బాధాకరమైన వాస్తవాన్ని ప్రస్తావించక తప్పదు. శుక్రవారం ఈ వ్యాసం రాస్తున్న సమయానికి మాజీ శాసనసభ్యుడైన గౌతమ్ మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి సంతాప ప్రకటన చేయలేదు. ఇది దళిత జాతిని అవమాన పరిచినట్టే అవుతుంది. అంతేకాదు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టవుతుంది. గౌతమ్ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. కనీసం ఆ సమయంలోనైనా ప్రభుత్వం స్పందించాలి.
-మల్లెపల్లి లక్ష్మయ్య
Andhra Jyothi News Paper Dated : 10/07/2010

No comments:

Post a Comment