Saturday, February 4, 2012

మారనివారు మార్క్సి స్టులు
సుందరయ్య మా నడిగడ్డ బొడ్రాయైండు/మా రావి తావేదీ గాని ఊర్లల్ల / గాని ఉద్దెమాల్ల మన్నుబడ/ గానికీ గీ మన్నుకూ సమ్మందమేంది? శింగం కిష్టయ్య అనేకవి మార్క్సిస్టుపార్టీ అగ్రనాయకుడు ఏచూరి సీతారామ్ శుక్రవారం నాడు తెలంగాణ పైన ప్రవచించిన భుజమూ- తుపాకి సిద్ధాంతం వినక ముందు పదేండ్ల కింద రాసిన కవిత ఇది. ఆ మాటకొస్తే యాభై ఆరేండ్ల నుంచీ మార్క్సిస్టులు ప్రవచిస్తున్న పాత చింతకాయ తొక్కుకన్నా హీనమైన భాషా ప్రయుక్త సిద్ధాంతం కన్నా పచ్చి అవకాశవాద చంద్రబాబు ప్రేరేపిత భుజమూ- తుపాకి సిద్ధాంతం ఆధునికమైందేమీ కాదు. మార్కిస్టులు ఇగ మారరు. తెలంగా ణ పట్ల వారి అవగాహనా మారదు. ఏడువందల మంది బలిదానాల తర్వాత కూడా వారికి తెలంగాణ అస్తిత్వ సమస్య అర్థంకాదు. కారణాలు తెలియని కావు వాళ్లు పట్టిన జెండాలల్ల ‘తీర’రేఖలున్నవి. కృష్ణా గోదావరులను కబళించే కమ్యూనిజం నాల్కల మీద, ప్రాంతాలను ఆక్రమించే లేదా ఆక్రమించినవారికి అన్య సిద్ధాంతాలు బోధించే మార్క్సిజమూ వుంది. కమ్యూనిస్టుల పోరాటాల్లో ఆరాటాల్లో, గన్ను పట్టినా, పెన్నుపట్టినా, నెత్తురోడినా ‘రక్తం తెలంగాణది జెండా వారి ది. చివరికి తెలంగాణ చరిత్ర రచన కూడా వారిదే. విశాలాంధ్ర వలసలు విస్తరించిన ఆక్టోపస్ సిద్ధాంత వేదికలయి తెలంగాణకు ఒక విషాధాంధ్ర అయిన చరిత్ర క్రమాన్నీ మార్క్సిస్టులు కేవలం మూర్ఖంగా చూడ నిరాకరిస్తున్నారనడం కూడా అమాయకత్వమే. వాళ్లు పొత్తులు పెట్టుకున్న, కొమ్ముకాస్తున్న వారి వర్గ స్వభావాలు, మార్క్సిస్టుల సంకర వర్గ స్వభావమూ ఒక్కటి కావడమే తప్ప మరి దేనికీ ఇది నిదర్శనం కాబోదు.

మార్క్సిస్టుల మహాసభలు ఉద్యమ గుమ్మం ఖమ్మంలో అట్టహాసంగా జరిగా యి. కానీ తెలంగాణపైన ఎప్పటి వైఖరినే ఆ పార్టీ అవలంబించింది. హైదరాబాద్ విలీనం అయినప్పటి వాదనలు, 1969 ఉద్యమం నాటి వాదనలు అటూ ఇటుగా ఇప్పటి తెలంగాణపై తీర్మానం కూడా ఇసుమంత మారని ఒక యాంత్రిక జఢత్వంలోకి మార్క్సిస్టు పార్టీ కూరుకుపోయిందని రూఢి అయింది. అసమానతలు పెట్టుబడిదారీ విధానంలో తప్పనిసరిగా వచ్చే అవాంఛనీయ పరిణామాలు పెట్టుబడిదారీ విధానాన్ని తుదముట్టించి, జనతా ప్రజాతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పరచి, సోషలిస్టు సమాజ లక్ష్యానికి సాగిపోనంత కాలం అసమానతలు పెరుగుతూనే ఉంటాయి. ఇదీ వాళ్ల భాష.. అప్పటికి నీరందని వాడు పిడుచగట్టుక పోనీ.. నిలు వు నిలువునా మోసం చేసి గుత్తాధిపత్య అంతర్జాతీయ పెట్టుబడిదారులుగా వలసాంధ్ర సంపన్న వర్గాలు తయారు కానీ.. కాలువల్లో నెత్తురు నిండనీ.. కొలువు లు కొల్లగొట్టుకుని సెక్ర నిండా కొల్లేరు చేపల్లా ఉద్యోగులు నిండనీ.. హైదరాబాద్ పరాయి అయిపోనీ.. భూములు అడ్డికి పావుశేరు అమ్ముకోనీ.. తెలంగాణ వాడు తను జీవించిన నేల మీదనే సంస్కృతి కోల్పోయి రెండవ శ్రేణి పౌరుడు కానీ మార్క్సిస్టులకు మాత్రం ఏ బాధా ఎందువల్ల కలుగదు. తెలంగాణకు జరుగుతున్న జరిగిన మరో విధంగా పూడ్చలేని నష్టాలకు, కష్టాలకు మార్క్సి స్టు జవాబుదారీ మాత్రం కాదు. స్వయంగా అతను అవకాశవాది. ఉద్యమ సౌధాలమీద ఎగరేసిన వెలసిన జెండా. ఆ జెండా తెలుగుదేశానికి తాకట్టు పడుతుంది. కుల రహిత సమాజం కోసం సంఘం పెట్టినవారే కత్తుకలిపిన ‘కమ్మ’నిస్టులు కావడమే యధార్థ జీవన వ్యధార్థ దృశ్యం. తెలంగాణ అసమానతలు తొలగాలం రక్షణలు, సూత్రాలు ఉల్లంఘనలకు న్యాయం జరగాలంటే ‘కుళ్లిపోతూ, మరణోన్ముఖమైన, అభివృద్ధి నిరోధక సామాజిక వ్యవస్థను, భూస్వాముల, పెట్టుబడిదారుల, విదేశీ గుత్తాధిపతుల దోపిడీ, లూటీ వ్యవస్థను అంతం చేయడం’ అని ఎడతెగని జార్గాన్‌లో, డాక్యుమెంట్లల్లో ప్రవచించిన మార్క్సిస్టులకు ఒక సూటి ప్రశ్న. చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్నందువల్ల ఇదెట్లా సాధ్యమో? బెంగాల్‌లో బుద్ధదేవ్‌లు సోషలిజాన్నే శంకించి, ఇంత తతంగం ఎన్నడు జరిగేను. అప్పటికి తెలంగాణ ఏ మరణశయ్యపై అంతరించేను. విదేశీ గుత్తాధిపతుల దోపిడీ వ్యవస్థ కుళ్లిపోతూ మరణోన్ముఖం కావడానికి బదులు, వాళ్లు మూడు దశాబ్దాలు ఏలిన బెంగాల్‌లోనే నందిక్షిగామ్, సింగూరులై.. చివరికి అవే అధికారాంతంబునూ ప్రసాదించినప్పుడు.. ఇక ఆంధ్రవూపదేశ్‌ను, బూర్జువా అసమానతల నుంచి విముక్తి పరి చి సోషలిస్టు సమానతలోకి ఎప్పుడు తెస్తారు? అంతదాకా సోషలిస్టు స్వప్న భ్రాంతుల్లో తెలంగాణ ఏం చేయాలి? తెలంగాణ సాయుధ పోరాటాన్ని కన్నది. నిప్పులు మింగి నిప్పులు ఉమిసింది. తెలంగాణ నక్సల్బరీని కన్నది. అయినా విప్లవం రాలేదు. సోషలిజమూ రాలేదు. తొంభది రెండేళ్ల కమ్యూనిస్టు ఆవిర్భావ చరిత్ర పురిటినొప్పులు పడుతూ ఉన్నది. పిండం బయటపడలేదు. తెలంగాణకు ఈ స్వప్నం చూపి.. నల్లనల్లని రేగళ్ల పొంట నడిచి వచ్చింది వలస. వీరుల త్యాగా ల వెంట, చరిత్ర వెంట, నెత్తురు వెంట కదిలి వచ్చింది వలస. అయినా మార్క్సిస్టులది అదే పరిభాష. యాభై ఆరేళ్ల కిందటి భాష. 

ఇక వీరు మారరు.శ్రీకృష్ణ కమిటీ అనేక అబద్ధాలాడి ఒక నిజం మాత్రం చెప్పింది. అది మన్‌మోహన్ అనే ప్రపంచబ్యాంకు, విదేశీ గుత్తాధిపతుల ఏజెంటు అన్న మాటను కమిటీ యథాతథంగా రిపోర్టు చేసింది. ‘హైదరాబాద్ ఒక ఆర్థిక ఇంజన్’.. చివరగా తెలంగాణ విడిపోవడానికి సీమాంధ్ర పెట్టుబడిదారులు, హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులు పెట్టిన కోస్తాంధ్ర సంపన్న వర్గాలు అంగీకరించవు.. అదీ సమస్య. శ్రీకృష్ణ కమిటీకి మార్క్సిస్టు పార్టీ నేతల్లాగా మార్క్సిస్టు సూత్రాలు తెలియవు. కానీ తెలంగాణను ఏ పెత్తనాలు ఆపుతున్నాయో? అర్థం చేసుకోగలిగారు. మార్క్సిస్టులకే ఇంకా అర్థం కాకపోవడమే విషాదం. నిజానికి ఆంధ్రవూపదేశ్ ఏర్పడిన తర్వాత యాభై ఆరు సంవత్సరాలలో జరిగింది. పెట్టుబడి విస్తరణ. ఒక్కమాటలో చెప్పాలంటే పెట్టుబడి విస్తరణ ఆకాంక్ష వల్లనే విశాలాంధ్ర భావనను కమ్యూనిస్టులు కానివారు ప్రతిపాదించారు. దానికి విషాదకరంగా కమ్యూనిస్టులు కత్తు కలిపా రు. ఇది అలనాడు జవహర్‌లాల్ కూడా కనిపెట్టగలిగిన సత్యం. విశాలాంధ్ర భావ న సామ్రాజ్యవాద విస్తరణ ఆకాంక్ష అన్నాడాయన. విలీనం తర్వాతి పరిణామా ల్లో ఇప్పుడు తెలంగాణను, ఆంధ్రవూపదేశ్‌ను ఏలుతున్నది స్థిరీకృతమైన, వ్యవస్థీకృతమైన సీమాంధ్ర పెట్టుబడిదారుల పాలన. వారికొమ్ముకాసే రాజ్యాంగ యం త్రం. దీన్ని బద్దలు కొట్టడమం ఇవాళ్టి విప్లవం. ఇవ్వాళ్టి వలసదారుడు అడ్డపంచె కట్టుకొని అమాయకంగా నదీతీరం పొంటి, నల్లరేగళ్ల పొంటి వచ్చిన ధనిక రైతు, సాధారణ రైతు, బైతు కాడు. అతను ఎదిగాడు. అతనిప్పుడు అంతర్జాతీయ పెట్టుబడిదారుడు. జై సల్మేర్‌లోనూ సూర్యకాంతినీ వ్యాపారం చేసేందుకు అల్లిబిల్లి కంపెనీలు పెట్టి అల్లుకుపోగల సమర్థుడు. అతడు లగడపాటి కావొచ్చు, రాయపాటి కావొచ్చు, కావూరి కావొచ్చు. సమైక్యాంవూధము, భాషా ప్రయుక్తమూ, సాంస్కృతిక ఐక్యతా, పెద్దరాష్ట్రమూ, ఢిల్లీతో యుద్ధమూ అంతిమ సారాంశంలో ఈ అంతర్జాతీయ పెట్టుబడుల వ్యవస్థీకృత ప్రభుత్వాన్ని కాపాడేవి అనేది సాధారణ స్థితిలో ఆలోచించగలవానికి తడ్తున్న విషయం. కానీ, సిద్ధాంత నిష్టా గరిష్టులై గుత్తాధిపతులను, అంతర్జాతీయ దళారీలను కన్నంలో దొంగను కన్నంలోనే పట్టుకోగలిగి న మార్క్సిస్టులు, కారత్‌లు,ఏచూరిలు రాఘవులుకు మాత్రం ఈ విషయం ఎప్పటికీ అర్థం కాదు. 

ఎందుకు?కోస్తా ఆధిపత్య ప్రాంతీయ సంపన్న వర్గాలకు కొమ్ముకాసే ఈ ధోరణి ఏ మార్క్సిజమో? పాపం శమించుగాక మార్క్స్ బతికుంటే మళ్లీ మరణించే వాడేమొ.ఈ యాభై ఆరు సంవత్సరాల అంతర్గత వలస ఆధిపత్యం కోస్తాంధ్ర ప్రాంతంలో ఆధిపత్యకుల-వర్గాసాధనంగా తెలంగాణ ప్రాంత ప్రజలపైన పడి అణచివేసే శక్తిగా మారిందనేది ఇది గుర్రం ఇది మైదానం అన్నంత స్పష్టంగా కనబడ్తున్నా ఒక మార్క్సిస్టులకు మాత్రం ఎందు వల్ల కనపడడంలేదో అర్థంకాదు. అయినా.. నీరు నాది కానప్పుడు , భూమి నాది కానప్పుడు, సంపద సమన్యాయంలో లేనప్పుడు.. నీరు పల్లమెరుగు నన్న వెక్కిరింతే మాకు శాపమైనప్పుడు త్యాగాలు మావి.. వాటి పునాదుల మీద ద్రోహాలు మీవి ఎట్లా అంగీకరించమంటారు కామ్రేడ్స్. మిగులు పెట్టుబడుల విస్తరణ కోసం ఒక ప్రయోగశాలగా మారిన మా నేల పునాది అంశాలు మాట్లాడ్తున్నది. మీరేమో ఉపరితలాంశాలు మాట్లాడ్తున్నారు. భాష ఒక గునుగుపువ్వు. మాది జీవద్భాష. కానీ నీళ్లు లేవు కామ్రేడ్స్. యాభై ఏళ్లలో నాగార్జునసాగర్, శ్రీశైలం తెలుగుగంగ పేరిట కాలువ పొడవునా వెలుగోడు, బ్రహ్మంగారి మఠం, అలగనూరు, గోరకల్లు, అవు కు గొలుసు ప్రాజెక్టులు, సోమశిల స్థాయి పెంచిన జలదృశ్యం, కేసీ కాలువ కోసం తుంగభవూదను దారిమళ్లించిన సుంకేశుల నుంచీ పోతిడ్డిపాడు నుంచీ దారి మళ్లించిన జల పంపకాల కింద, జల తరంగాల మధ్య మా పాలమూరు బీభత్స, విషాద శిథిలమైన ప్రాజెక్టు కలలు కంటూ, రాజోలిబండలో రక్తం చిందిస్తున్నది. వేల కొడవళ్ల పాలయింది. ఇంకా ఎందుకు? కామ్రేడ్స్.

నెహ్రూ చెప్పింది నిజమే. పెట్టుబడుల విస్తరణ ఫలితంగా తెలంగాణపైన రాజ్యమేలుతున్న పెట్టుబడుల విస్తరణ తత్వాన్ని ప్రశ్నిస్తున్నది తెలంగాణ. తద్వారా బహుళజాతి కంపెనీలను, గుత్తపెట్టుబడినీ, ప్రపంచీకరణనూ, సామ్రాజ్యవాదాన్ని ప్రశ్నిస్తున్నది తెలంగాణ. అంతిమ సారాంశంలో మార్క్సిస్టులు కారు మీరు పిడి, యాంత్రిక సిద్ధాంతాల కాలం చెల్లిన మూర్క్సిస్టులు. క్షమించండి కామ్రేడ్స్. తెలంగాణలో మీకిక కాలం చెల్లింది. సర్దుకుంటే మంచిది. సమస్త తెలంగాణలోని ప్రజ లారా అందరు కమ్యూనిస్టులు మారినా మార్క్సిస్టులు మారరు. ఇక తేల్చుకోవాల్సిందీ మీరే. తేల్చుకుని తెలంగాణ తెచ్చుకోవాల్సిందీ మీరే.. మారని దాన్ని మార్చడమే అంతిమ సారాంశంలో మార్క్సిజం.. మార్క్సిజం వర్ధిల్లుగాక.
-అల్లం నారాయna 
Namasete Telangana News Paper Dated 05/02/2012

No comments:

Post a Comment