Friday, February 3, 2012

మార్క్సిస్టు విధానం ఇదేనా?


ఏ సమయంలో, ఎవరికీ, ఏది బహుకరించాలో తెలుసుకోలేని అయోమయంలో రాష్ట్ర సి.పి.ఐ(యం) నాయకత్వం వుండటం విచారకరం. జన సామాన్యాన్ని గుండెలకు హత్తుకొని, వారి కష్టాలను కన్నీళ్లను తుడిచి, ఆనందమయమైన జీవితాన్ని అందించగల శక్తి మార్క్సిజానికి, సోషలిజానికి మాత్రమే వుంది. అదొక నిత్యాన్వేషణ, ఆచరణాత్మక అనుభవం. హైటెక్ ఆర్భాటాలతో, లోటెక్ ప్రజానీకాన్ని సమీకరించగలమని భావించడం అవివేకం, వ్యక్తిగత అహంభావం మాత్రమే. 

సంబరాలు అంబరాన్ని అంటినై, ఆకాశమంత పందిళ్లు, భూదేవంత కంబళ్లూ ఖమ్మం పట్టణాన్ని కమ్మేశాయి. భూనభోంతరాలు దద్దరిల్లాయి. వంద మేకలు, వేలాది కోళ్ళు, చేపల పలావులతో ప్రతినిధులు పులకించి పోయారు. ఖమ్మం జిల్లా సి.పి.ఐ.యం. నేత కీర్తి కిరీటంలో మరో కలికితురాయి సంధించుకొన్నారు. నభూతో, నభవిష్యత్ అన్న చందాన ఈ మహాసభల ఆర్భాటాలతో రాష్ట్రంలోని సాధారణ ప్రజానీకానికి, ముఖ్యంగా ఖమ్మం జిల్లా ప్రజలకు అందిన సందేశం, అంతు చిక్కడం లేదు. మార్క్సిజం అజేయం, ఏ ఒక్కరి గుత్త సొత్తు కాదు. భారతీయ జీవన విధానంలో గాంధీయిజం, అంబేద్కరిజం, బుద్ధిజం, మరే ఇజమైనా దేని ప్రాశస్థ్యం దానిదే. ఒక విధానం మరొక విధానంపై కత్తులు దూసి ఖతం చేయటం ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. 

ఖమ్మం జిల్లా సి.పి.ఐ.(యం)లో ఒక కొత్తతరం నాయకత్వం ప్రవేశించింది. తనకంట్లో నలుసులను వదిలి ఎదుటి వారి కంట్లో దూలాలు వెతకడం ఒక విపరీత జాఢ్యమైపోయింది. సైకిల్ యాత్రలతోనూ, మహాసభల నిర్వహణతోనూ అసమ్మతి వాదులకు బుద్ధి చెప్పడం, పార్టీ బలం పెరగడం వెంట వెంటనే జరుగుతాయని పార్టీ జాతీయనేత తమ్మినేని వీరభద్రం అంటున్నారు. వీరభద్రం మాటకు సై, సై అంటున్నారు రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు. పార్టీ నాయకులను, కార్యకర్తలను దిద్దుబాటు చేసుకోకుండా, జీవన విధానాన్ని సంస్కరించుకోకుండా ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా, పోరాట పంథాలు మార్చినా ఆచరణలో వ్యతిరేక ఫలాలు వస్తాయి. మార్క్సిస్టు పార్టీ జాతీయ మహాసభలలో కేంద్ర కమిటీ తీర్మానాల్లో పార్టీ ప్రక్షాళణపైన, దిద్దుబాటు ఉద్యమంపైన పుంఖాను, పుంఖాలుగా తీర్మానాలున్నాయి. ఆచరణ శూన్యమైన, క్రియా నిష్క్రియా పరమైన ప్రసంగాల వల్ల వచ్చే ఫలితాలేమిటో బోధపడవు. 

బి.వి.రాఘవులు సింప్లిసిటీ వేషధారణ, తమ్మినేని హైటెక్ విన్యాసాల ప్రదర్శన ద్వారా ఉద్యమాలు ఎలా ఊపందుకొంటాయి. సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు లాంటి నాయకులు వీర తెల ంగాణ పోరాట సృష్టికర్తలు, ఆ పోరాటం, నా టికి నేటికి అజరామరం. రాఘవులు విద్యుత్ పోరాటాన్ని భూ పోరాటాన్ని పదేపదే గుర్తుచేస్తారు. ఈ కాలంలో బలిదానం చేసిన విద్యుత్, ముదిగొండ భూపోరాట అమరవీరుల త్యాగాల ప్రకంపనలు మార్క్సిస్టు పార్టీని మరింత ముందుకు తీసుకొనిపోవాలి. మార్క్సిస్టు పార్టీ నేతృత్వంలో ప్రజా ఉద్యమాల పోరు ఉధృతం కావడానికి బదులు నానాటికి తీసికట్టుగా ఎందుకవుతుందో విశ్లేషించాలి. 

రాఘవులు భూపోరాట కేసులు, నేటికి నాయకుల, కార్యకర్తల కాళ్లకు ఉచ్చులుగా మారి ముందుకు సాగనీయడం లేదు. ముందుచూపు లేకుండా, ప్రజలు, కార్యకర్తలు సన్నద్ధం కాకుండా పోరాట పిలుపులిస్తే ప్రజల్లో ప్రభావం ఉంటుందా! 2009 తర్వాత సి.పి.ఐ.(యం) పార్టీ ఎందుకని ఒక రాష్ట్ర వ్యాపిత పోరాటాన్ని నిర్వహించలేకపోయింది? సి.పి.ఐ.(యం) పార్టీ ఎన్నికల పొత్తులు ఎందుకు బెడిసి కొడుతున్నాయి? సామాన్య ప్రజలు సి.పి.ఐ.(యం) వెనుక ఉరుకులు, పరుగులతో ఎందుకని సమీకరించబడటం లేదు. నింపాదిగా విశ్లేషించుకోవాలి. సంయమనం పాటించుకోవాలి. 

సుందరయ్య గారైనా, బసవపున్నయ్యగారైనా, చండ్ర రాజేశ్వరరావైనా, మోటూరి హనుమంతరావైనా, జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులైన చిర్రావూరి లక్ష్మీ నరసయ్య అయినా, మంచికంటి రామకిషన్‌రావైనా, రావెళ్ళ సత్యం, బొడిపూడి వెంకటేశ్వరరావైనా, ఆమాట కొస్తే అలనాటి కమ్యూనిస్టు నాయకులెవరైనా, కేవలం పార్లమెంటు దృక్పథంతోను, 'ఎన్నికల అవకాశ వాదం'తోను, పనిచేయలేదు. తద్వారా లభించబోయే లాభాలకు ఆకర్షితులవడం గాని జరగలేదు. వాళ్లకున్నదంతా త్యాగం చేశారే కాని, ఆస్తులు కూడగట్టలేదు. ఇపుడది ఒక అలవాటుగా మారిందని సాక్షాత్తు సి.పి.ఐ.(యం) పార్టీ జాతీయ కాంగ్రెస్ అభిప్రాయ పడిందంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. 

ఇల్లందుకు చెందిన గని కార్మికుడు రాజు తన చికాగో పర్యటన సందర్భంగా 'హే' మార్కెట్‌లోని 'మే డే' స్మృతి చిహ్నాన్ని సెల్‌ఫోన్‌లో బంధించాడు. ఆ ఫోటోని తైలవర్ణ చిత్రంగా తయారుచేసి ప్రకాశ్ కరత్‌కు బహుకరించారు. వాస్తవంగా హే మార్కెట్‌లోని చికాగో కాల్పుల స్మృతి చిహ్నం అమరులైన కార్మికులది కాదు. ఆ చిహ్నం ఆనాటి ఇల్లినాయిస్ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పింది. ఎందుకు? ఇన్ మెమోరి ఆఫ్ దోస్ హు డిపెండెడ్ ది స్టేట్ ఆఫ్ ఇల్లినాయిస్. ఇల్లి నాయిస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని (కార్మికుల బారి నుండి) రక్షించడానికి కాల్పులు జరిపిన సైనికుడి బొమ్మ ఆ చిహ్నం. 

ఏ సమయంలో, ఎవరికీ, ఏది బహుకరించాలో తెలుసుకోలేని అయోమయంలో రాష్ట్ర సి.పి.ఐ(యం) నాయకత్వం వుండటం విచారకరం. జన సామాన్యాన్ని గుండెలకు హత్తుకొని, వారి కష్టాలను కన్నీళ్లను తుడిచి, ఆనందమయమైన జీవితాన్ని అందించగల శక్తి మార్క్సిజానికి, సోషలిజానికి మాత్రమే వుంది. అదొక నిత్యాన్వేషణ, ఆచరణాత్మక అనుభవం. హైటెక్ ఆర్భాటాలతో, లోటెక్ ప్రజానీకాన్ని సమీకరించగలమని భావించడం అవివేకం, వ్యక్తిగత అహంభావం మాత్రమే.
- వనం నర్సింగరావు
పాలేరు కో-ఆపరేటివ్ - షుగర్స్ మాజీ చైర్మన్
Andhra Jyothi News Paper Dated 04/2/2012 

No comments:

Post a Comment