Saturday, February 25, 2012

'భావాల ఆవాహన'లో వక్రదృష్టి -మల్లెపల్లి లక్ష్మయ్య


'రాజ్యాంగ ముసాయిదా కమిటి సభ్యులు ప్రదర్శించిన చొరవ, చూపిన ఉత్సాహం మరువలేనిది. ప్రత్యేకించి కమిటి చైర్మన్ డాక్టర్ అంబేద్కర్ తన అనారోగ్యాన్ని లెక్క చేయకండా శ్రమించిన తీరు ఎనలేనిది. ముసాయిదా కమిటీకి అంబేద్కర్‌ను చైర్మన్‌గా నియమించడం ఎంతో సరైన చర్యగా అనిపిస్తున్నది. ఆయన ఈ పని ఎంతో సమర్థంగా నిర్వహించడమే కాకుండా, దానికి శోభ ను చేకూర్చారు' అంటూ రాజ్యాంగ రచనలో అంబేద్కర్ కృషిని రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కొనియాడారు.

అంబేద్కర్ చరిత్రాత్మక కృషిని తక్కువ చేయడానికి, వాస్తవాలను వక్రీకరించడానికి కొంతమంది మేధావులు పనిగట్టుకొని ప్రయత్నిస్తున్నారు. అరుణ్ శౌరి (జర్నలిస్టు, మాజీ కేంద్రమంత్రి) కొన్నే ళ్ళ క్రితం అంబేద్కర్‌ను అవమానపరుస్తూ పుస్తకమే రాశారు. ఇప్పుడు ఆ బాధ్యతను జర్నలిస్టు, రాజకీయ నాయకుడు సుదీంధ్ర కులకర్ణి చేపట్టినట్టు కనిపిస్తోంది. 'భావాల ఆవాహన' (జూలై 2, ఆంధ్రజ్యోతి) శీర్షికన ఆయన రాసిన వ్యాసం అటువంటి ప్రయత్నానికి ఆరంభంగా తోస్తున్నది. 

రాజ్యాంగం అమలులోకి వచ్చి అర వై సంవత్సరాలు అయిన సందర్భంగా 'రాజ్యాంగ సభ చర్చలు'చదవడంపై దృష్టి పెట్టినట్టు, తనను ఆకట్టుకున్న అంశాలపై వ్యాఖ్యానం చేస్తున్నట్టు కులకర్ణి ఆ వ్యాసంలో పేర్కొన్నారు. మన మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కృషిని, ఆయన ఆలోచనల గొప్పదనాన్ని కులకర్ణి తన వ్యాసంలో ప్రశంసించారు. 

అది అభ్యంతరకరం కాదు. అయితే నెహ్రూను అంబేద్కర్‌తో పోల్చడానికి కులకర్ణి ప్రయత్నించారు. 'రాజ్యాంగ పరిషత్ చర్చల్లో అన్నిటా అగ్రగామిగా పాల్గొన్నదెవరో తెలుసా? నెహ్రూ. డాక్టర్ అంబేద్కర్ కాదు. నెహ్రూ ప్రసంగించిన ప్రతిసారి రాజ్యాంగ సభ యావత్తూ ఒక స్పష్టమైన ఆలోచ నా మగ్నతలోకి వెళ్ళేది' అంటూ ఇద్దరినీ ఒకచోట చేర్చారు. 

నెహ్రూ దేశానికి ప్రధాని. రాజ్యాంగ సభకు దిశా నిర్దేశం చేయాల్సిన వ్యక్తి. ఆయన మేధా శక్తి మీద ఎవరికీ తక్కువ అంచనా ఉండడానికి వీలులేదు. రాజ్యాం గ సభ చర్చలను నేను కూడా అధ్యయనం చేస్తున్నాను. అయితే నెహ్రూను గొప్పచేయడం కోసం అంబేద్కర్ మహోన్నత కృషిని తక్కువ చేయవలసిన అవసరం లేదు. చేయడానికి వీలులేదు.

పైగా ప్రజలందరూ ఇంతవరకు తప్పుగా భావిస్తున్నట్టు, అంబేద్కర్ కంటే నెహ్రూ నిర్వహించిన గొప్ప పాత్రను తన పరిశోధన ద్వారా నిరూపించినట్టు కులకర్ణి భావిస్తున్నారు! అయితే నెహ్రూ, అంబేద్కర్‌లు రాజ్యాంగ సభలో వేర్వేరు పాత్రలు పోషించారన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెహ్రూ వ్యవస్థకు నాయకుడైతే, అంబేద్కర్ రాజ్యాంగ రచనా సభకు నేతృత్వం వహించారు. మరి అంబేద్కర్‌ను తక్కువ చేయడానికి పదే పదే ఎందు కు ప్రయత్నిస్తున్నారు? రాజ్యాంగ రచనలో ఆయన కృషి పైన దేశంలో విస్తృతం గా చర్చ జరుగుతున్నది. ఆ మహోన్నత విధి నిర్వహణలో ఆయన చూపిన ప్రజ్ఞ ఎందరినో ఆశ్చర్యచకితులను చేసింది. 

రాజ్యాంగ సభ చర్చల'ను అధ్యయనం చేస్తున్న కులకర్ణికి అంబేద్కర్ కృషి అడుగడుగునా కన్పించివుండాలి. ఆయన సుదీర్ఘమైన ప్రసంగాలు ఎన్నో ఉన్నా యి. ముఖ్యంగా ' రాజ్యాంగ లక్ష్యాలు- ఆశయాలు' అన్న అంశంపై అంబేద్కర్ ప్రసంగం అవిస్మరణీయమైనది. మరే రాజ్యాంగ నిర్మాత ప్రసంగానికి అది గౌణమైనది కాదు. 1949 నవంబర్ 25న రాజ్యాంగ బిల్లుపై జరిగిన చర్చలో భారత ప్రజాస్వామ్య వికాసంలో రాజ్యాంగం నిర్వహించబోయే పాత్రను ఆయన విపులంగా వివరించారు.

ఆ సందర్భంగా జాతి ఎన్నటికీ మరచిపోకూడని హెచ్చరిక లు కూడా చేశారు. 'మనం ఈ రాజ్యాంగం ద్వారా రాజకీయ ప్రజాస్వామ్యాన్ని మాత్రమే అందిస్తున్నాం. రాజకీయ ప్రజాస్వామ్యం సామాజిక ప్రజాస్వామ్యం పునాదుల మీద నిలచి ఉంటుంది. కానీ మన దేశంలో సామాజిక, ఆర్థిక అసమానతలు కొనసాగుతున్నాయి. వాటిని రూపుమాపకుండా రాజకీయ ప్రజాస్వా మ్యం మనజాలదు' అనే సత్యాన్ని అంబేద్కర్ విస్పష్టంగా చెప్పారు.

ఆయన ఇంకా ఇలా అన్నారు: '1950 జనవరి 26 నుంచి మనం (భారతీయులం) వైరుధ్యమయమైన జీవితంలోకి అడుగు బెడుతున్నాం. ఆర్థిక, సామాజిక అసమానతలు కొనసాగుతున్న ఈ సమాజంలో రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదపుటంచులో నిలబెడుతున్నాం. ఎంతకాలం ఇది సాగుతుంది? ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ అసమానతలను నిర్మూలించాలి. లేనట్లయి తే ఎంతో శ్రమ కోర్చి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య సౌధాన్ని, ఎవరైతే బాధలకు గురవుతున్నారో వారు కూల్చి వేస్తారు'.

అంబేద్కర్ హెచ్చరిక ప్రాసంగికత నేటి పరిస్థితులకు ఎంత గా ఉన్నదో మరి చెప్పాలా? 315 అధికరణలు, ఎనిమిది షెడ్యూళ్ళలో రాజ్యాంగ ముసాయిదాను రూపొందించారు. విపుల చర్చల అనంతరం దానిని 395 అధికరణలు, ఎనిమిది షెడ్యూళ్ళ సంవిధానంగా తీర్చిదిద్దారు. మూడు సంవత్సరాల పాటు రాజ్యాంగ రచనకు నిరంతరం మేధో మధనంచేశారు. ఈ మొత్తం ప్రక్రియలో అనేక మంది మహా మహులు పాల్గొన్నారు. అయి తే కేంద్రబిందువుగా అన్నింటా తానై నడిపిన ఒకే ఒక్క వ్యక్తి డాక్టర్ అంబేద్కర్. 

కులకర్ణి ప్రస్తావించిన కె.ఎం.మున్షీతో సహా రాజ్యాంగ సభ సభ్యులు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ కృషిని బహుధా ప్రస్తుతించారు. ఫ్రాంక్ ఆంథోని, పట్టాభి సీతారామయ్య, జగత్ నారాయణ్ లాల్, మహావీర్ త్యాగి, తాజముల్ హుస్సేన్, సురేష్ చంద్ర మజుందార్, పండిట్ బాల క్రిష్ణశర్మ మొదలైన వారు అంబేద్కర్ కృషికి కీర్తిహారతులు పట్టారు.

మహావీర్ త్యాగి మాటలను ప్రత్యేకంగా పేర్కొనా లి. 'ప్రజల కోసం ఒక అందమైన చిత్రాన్ని తానే అన్నీ అయి గీసిన ఒక ప్రధాన చిత్రకారుడు డాక్టర్ అంబేద్కర్. అటువంటి అరుదైన చిత్రమే ఈ మన భారత రాజ్యాంగం' అంటూ అంబేద్కర్‌ను మహావీర్ త్యాగి కవితాత్మకంగా కొనియాడారు. భారత రాజ్యాంగ రచనలో అంబేద్కర్ కృషిని తక్కువ చేయడానికి ప్రయత్నించడం అవివేకమే కాక అహంకారం కూడా అవుతుందేమో!
-మల్లెపల్లి లక్ష్మయ్య
Andra Jyothi News Paper Dated :  16/07/2010

No comments:

Post a Comment