Wednesday, February 1, 2012

బిసిలకు మళ్ళీ అన్యాయం - డాక్టర్ ఇ.వెంకటేశు

భారతదేశ చరిత్ర పొడవున విద్య, ఆస్తి, అధికారం అనే మూడు మానవహక్కుల ఉల్లంఘనకు గురైన అత్యధికులలో వెనుకబడిన కులాల వారు ఒకరు. భారత కుల సమాజంలో బ్రాహ్మణులు, క్షత్రియు లు, వైశ్యుల తర్వాత స్థానంలో వుండే ఉత్పత్తి కులాలే వెనుకబడిన వర్గా లు. తరతరాలుగా కులవృత్తులను అట్టిపెట్టుకొని బతుకుతున్న వీరిని దేశంలోని సామాజిక వ్యవస్థ స్తబ్ధతకు గురిచేసింది. ఫలితంగా దేశంలో రావలసిన 'పారిశ్రామిక విప్లవం', బ్రిటన్‌లో వలే, మనదేశంలో రాలేదు.

వలస పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్, మహాత్మాగాంధీ నాయకత్వంలో జరుగుతున్న జాతీయోద్యమం, భూస్వామ్యం, జమిందారులకు వ్యతిరేకంగా జరుగుతున్న కమ్యూనిస్టు వుద్యమం, ఉన్నత కులాలకు వ్యతిరేకంగా జ్యోతిబాఫూలే, అంబేద్కర్, పెరియార్, శ్రీ నారాయణగురు నాయకత్వంలో జరుగుతున్న దళిత బహుజన వుద్యమంతో ప్రభావితమైన నాయకులు తెలుగు ప్రాంతాల్లో కూడా వెనుకబడిన కులాల వుద్యమాన్ని నిర్మించారు.

స్వాతంత్య్రానంతరం ప్రజాస్వామిక వ్యవస్థలో 'జన బలం' సంఖ్య ప్రాముఖ్యతను గ్రహించిన కుల సంఘాల నాయకులు 'వెనుకబడిన కులాల సమాఖ్య'ను ఏర్పాటు చేశారు. నాటి నుంచి రాజకీయ, ఆర్ధిక, సామాజిక, విద్య, ఉద్యోగాలలో తమకు వాటా కావాలని డిమాండ్ చేశారు. ఇటువంటి కులసంఘాల సమాఖ్యలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాదిని ఇవ్వడమే కాకుండా పటిష్టం చేశాయరని రాజనీతి శాస్త్రవేత్త రజని కొఠారి 'భారతదేశ రాజకీయాలలో కులం' అనే పుస్తకంలో సూత్రీకరించారు.

ఒక పక్క వెనుకబడిన కులాల ఉద్యమం తమ జనాభా ప్రకారం 'అధికారం, అభివృద్ధి'లో తమ వాటా కావాలని అడుగుతుండగా, తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఏమాత్రం పట్టించుకోలేదు. అంతేకాక ఆయన అనుసరించిన అభివృద్ధి విధానాలు వెనుకబడిన కులాల అభ్యున్నతికి అడ్డంకిగా తయారయ్యాయి.

కమ్యూనిస్టుల నాయకత్వంలో సోవియట్ యూనియన్‌లో విజయవంతమైన 'సామ్యవాద విప్లవం' అతి తక్కువ కాలంలో 'ప్రణాళిక యంత్రాంగం' ద్వారా సాధించిన విజయాలను చూసి నెహ్రూ, ఆ దేశం నుంచి 'ప్రణాళిక సంఘం' అనే ఆలోచనా విధానాన్ని అరువుగా తెచ్చి భారతదేశ ప్రజలపై బలవంతంగా రుద్దారు. దేశ ఆర్ధిక వ్యవస్థలో అత్యంత కీలకపాత్ర వహించే వెనుకబడిన కులాల ప్రయోజనాలను ప్రణాళిక సంఘం పట్టించుకోలేదు. అందువల్ల 8వ పంచవర్ష ప్రణాళిక వరకు ఎక్కడా కూడా అభివృద్ధి విధానాలలో అసలు వెనుకబడిన కులాలు అనే పదాన్నే ఉపయోగించలేదు.

మరో పక్క నెహ్రూ కాలంలోనే నియమించిన మొట్టమొదటి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్మన్ కాకా కాలేల్కర్ సమర్పించిన నివేదికపై పార్లమెంట్‌లో చర్చకూడా జరగలేదు. ఈ రకంగా కేంద్రంలో నూ, రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం కొనసాగినంత కా లం వెనుకబడిన కులాలను అధికారానికి, అభివృద్ధికి దూరమయ్యారు.

1970 నాటికి కాంగ్రెస్ పార్టీ తమను దూరం పెడుతుందన్న విషయాన్ని గ్రహించిన వెనుకబడిన కులాలు ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు మొగ్గుచూపారు. ఇదే సమయంలో ఉత్తర భారతదేశంలో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా వంటి వారు కొనసాగిస్తున్న 'సంపూర్ణ క్రాంతి' వుద్యమంలో భాగస్వాములైన వెనుకబడిన కులాలు కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడి, జనతా పార్టీకి బ్రహ్మరథం పట్టారు. ఇందిరాగాంధీ విధించిన 'అత్యవసర పరిస్థితి' అనంతరం కేంద్రంలో ఏర్పడిన జనతా ప్రభుత్వం రెండవ జాతీయ స్థాయి వెనుకబడిన తరగతుల కమిషన్‌ను బిందేశ్వర్ ప్రసాద్ మండల్ చైర్మన్‌గా నియమించింది.

ఈ కమిషన్ నివేదిక వెనుకబడిన తరగతుల ప్రయోజనాల కొరకు అనేక సిఫార్సులు చేయగా, జనతా పార్టీ తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని 'హైజాక్' చేసి ఉన్నత కులాల ప్రయోజనాల కోసం అమలు చేసింది. అందుకు బలమైన ఉదాహరణ జవహర్ నవోదయ పాఠశాలలు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుండగా సుమారు పది సంవత్సరాల పాటు మండల్ నివేదికను తొక్కిపెట్టారు. తిరిగి విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్ నాయకత్వంలో జనతాదళ్ కేంద్రంలో అధికార బాధ్యతలను చేపట్టినప్పుడు మండల్ కమిషన్ సిఫార్సు చేసిన 27 శాతం రిజర్వేషన్లను విద్య, ఉద్యోగాలలో అమలులోకి తెచ్చింది.

కేంద్ర ప్రభుత్వ సంస్థలలో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు అమలులోకి రాగానే అనేక ఇబ్బందులు సృష్టించడం ప్రారంభించారు. ఇందులో మొదటిది 'క్రిమీలేయర్' అని కొంతమంది అభివృద్ధి చెందిన బి.సి.లు అనే పేరుతో రిజర్వేషన్లకు దూరం చేశారు. రెండు, భారతీయ జనతాపార్టీ నాయకత్వంలో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా వున్నప్పుడు, ఏమాత్రం రిజర్వేషన్ల శాతాన్ని పెంచకుండా సుమారు వెయ్యి కులాలను వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్పించింది. మూడు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో ప్రవేశం కొరకు ఉన్న సీట్లలో 27 శాతం రిజర్వేషన్లు కాకుండా, బిసిల కొరకు ప్రత్యేకంగా 27 శాతం సీట్లు, మౌలిక సదుపాయాలు, మానవ వనరులు సమకూర్చి అమలు చేస్తున్నారు.

అయితే ఇందులో జనరల్ కేటగిరీలో సీటు సంపాదించుకున్న వెనుకబడిన తరగతుల విద్యార్థిని కూడా రిజర్వేషన్లో చూపిస్తున్నట్లు దేశవ్యాప్తంగా అనేక ఉదాహరణలు వున్నాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల శాసనసభలకు జరుగుతున్న ఎన్నికలను దృ ష్టిలో వుంచుకొని 27 శాతం బి.సిల రిజర్వేషన్లలో మైనారిటీలకు 4.5 శా తం రిజర్వేషన్లు యిచ్చి కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం మరొకసారి వెనుకబడిన కులాల ప్రయోజనాలను దెబ్బకొట్టింది.

నిజానికి కాంగ్రెస్ పార్టీకి మైనారిటీలపై శ్రద్ధ వుంటే వారి ప్రయోజనాల కోసం 'సచార్' కమిటీ నివేదిక చేసిన సిఫార్సులను అమలు చేయాలి. అయితే ఏ పార్టీ కేంద్రంలో అధికారంలో వుండగా చారిత్రక రామజన్మభూమి - బాబ్రీ మసీదును కూలగొట్టింది మైనారిటీలకు చాలా స్పష్టంగా తెలుసు. అదేవిధంగా మైనార్టీలు వెనుకబడిన కులాల వాటాలో భాగం అడగడం లేదు. మైనార్టీ గుర్తింపుపై జనాభా ప్రాతిపదికన వాటా కావాలని మైనార్టీల ఉద్యమం డిమాండ్ చేస్తుంది.

ఈ రకంగా వెనుకబడిన తరగతుల ప్రయోజనాలకు ఆటంకం కల్పిస్తున్న భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్ పార్టీ ఐదు రాష్ట్రాల్లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో మూడు, నాలుగు స్థానాల కొరకు పోటీపడవలసి వుంటుందే కాని, ఒకటి, రెండవ స్థానాలు వచ్చే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

- డాక్టర్ ఇ.వెంకటేశు రాజనీతిశాస్త్ర విభాగం, కేంద్రీయ విశ్వవిద్యాలయం 
Andhra Jyothi News Paper Dated 1/2/2012 

No comments:

Post a Comment