Saturday, February 25, 2012

మార్క్సిజం ముసుగులో కుల రాజకీయం - ఎమ్. ఎఫ్. గోపీనాథ్


మార్క్స్ అదృష్టవంతుడు. అంబేద్కర్ దురదృష్టవంతుడు. మార్క్స్‌కు ఏంగెల్స్ వంటి మిత్రుడు, లెనిన్, స్టాలిన్, మావో వంటి సైద్ధాంతిక, తాత్విక, రాజకీయ వారసులు ఉన్నారు. ఆయన ప్రతిపాదించిన వర్గ నిర్మూలనా సిద్ధాంతాన్ని వారు అభివృద్ధి చేశారు; మార్క్సిజం అజేయమని నిరూపించారు. అంబేద్కర్ ప్రతిపాదించిన కుల నిర్మూలనా సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడం అటుంచి, అవగాహ న చేసుకొన్నవాళ్ళే కరువయ్యారు. ఏప్రిల్ 14, డిసెంబర్ 6 భజంత్రీలు మాత్రమే ఉన్నా రు. 

అంబేద్కర్‌ని అర్థం చేసుకొన్న వాళ్ళ కన్నా, అపార్థం చేసుకొన్న వాళ్ళే ఎక్కువ. దేశవ్యాప్తంగా రెండు రకాల నేరాలు చట్టబద్ధంగా జరుగుతున్నాయి. ఒకటి-అనాది గా అంటరానికులాలపై జరుగుతున్న ఊరు బహిష్కరణలు, హత్యలు, అత్యాచారాలు; రెండు-జలియన్‌వాలాబాగ్; భగత్ సింగ్, భూమయ్య, కిష్టాగౌడ్‌ల ఉరితీత; ఆదిభట్ల కైలాసం, వెంపటావు సత్యం నుంచి చెరుకూరి రాజ్‌కుమార్ (ఆజాద్) ఎన్‌కౌంటర్ వర కు జరిగిన చట్టబద్ధ (!) హత్యలు.

ఈ నేరాలు ఈ దేశ మూల వాసుల్ని అణచివేసి, వారి ధన, మాన ప్రాణాల్ని దోచుకోవటానికి క్రీ.పూ. 2500 నుంచి పరాయి ఆటవిక ఆర్య తెగలు సాగిస్తున్న దండయాత్ర, దమనకాండలో భాగమే అని కొంచెం లోతుగా పరిశీలిస్తే అర్థమవుతుంది. నాటి సుగ్రీవుడి లాంటి చిదంబరం, హనుమంతుడి లాంటి మహేంద్రకర్మ, అంగదుడులాంటి రమణ్‌సింగ్‌లు వర్తమాన ఆర్యులకు దొరికి నప్పుడు మూలవాసుల (ఆదివాసీ, ఎస్‌సి, బిసి, మైనారిటీల) బతుకులకు భద్రత ఎక్కడ ఉంటుంది? 

భారతదేశంపై ఆర్యుల దండయాత్రలో మూడు దశలు ఉన్నాయి. మొదటి దశలో సింధు నాగరకతను ధ్వంసం చేశారు. ఆ తరువాత తమలో తాము కలహించుకొంటూ నే (కురుక్షేత్ర సమరం ఇందుకొక ఉదాహరణ) నరకుడు, బకుడు, జరాసంధుడు మొదలైన మూల వాసుల రాజులను సంహరించారు. రెండో దశలో రాముడు, శంభూకుడు, వాలి, రావణులను సుగ్రీవుడు, విభీషణుడు లాంటి కోవర్ట్స్ సహాయంతో సంహరించా రు. ఇక మూడవ దశ వర్తమాన కాలానిది.

ఈ దశలో మధ్య భారతం మీద ఆర్య-ద్రావిడ సంయోగ చిహ్నమైన చిదంబరం నాయకత్వంలో అణచివేయబడ్డ జాతులకు అండగా నిలిచిన ఆజాద్ లాంటి వారిని హతమారుస్తున్నారు. ఈ దండయాత్రను తిప్పికొట్టవలసిన శక్తులు ఐక్యంగా కదలవలసిన సమయమిది. తాత్వికరంగంలో రామాయణ, భారత కట్టుకథల్ని మూల వాసుల కోణం నుంచి పరిశీలించవలసి ఉన్న ది.

చరిత్రలో దాచబడ్డ వాస్తవాలను వెదికి తీయవలసి ఉంది. ఈ కోణం నుంచి ఆలోచిస్తేనే కారంచేడు మాదిగల, చుండూరు మాలల, ఖైర్లాంజి మాంగ్‌ల హత్యాకాండను అర్థం చేసుకోగలుగుతాం. అణచివేతకు గురైన కులాల సమస్యల్ని వామపక్షాలు అర్థం చేసుకోవలసివుంది. పెట్టుబడిదారీ వ్యవస్థని, సామ్రాజ్యవాదాన్ని మూలవాసుల నాయకత్వం అర్థం చేసుకోవాలి. కాని జరుగుతోన్న, నడుస్తోన్న ఉద్యమాల చరిత్ర ఇందుకు భిన్నంగా, వ్యతిరేకంగా చోటుచేసుకొంటోంది. 

వర్గం ప్రధానమని, కులం అప్రధానమనేది మన వామపక్ష మేధావుల సునిశ్చిత విశ్వాసంగా ఉంది. 1936లో 'ఇండియన్ లేబర్ ఫ్రంట్'ని ప్రారంభించిన సందర్భంగా అంబేద్కర్ చెప్పిన 'అశేష భారత ప్రజలకు బ్రాహ్మణిజం, పెట్టుబడిదారీ విధానం మధ్య ఉన్న వైరుధ్యాలే ప్రధానమన్న' సూచనను అప్పటి, యిప్పటి వామపక్షీయులు పట్టించుకోడం లేదు.

కంచికచర్ల, కారంచేడు, పదిరికుప్పం, నీరుకొండ, చీమకుర్తి, చుం డూరు, వేంపెంట, తిమ్మ సముద్రం, ప్యాపిలి, కీల్వణ్ మణి, బెల్చి, ఖైర్లాంజి ఘటనలు కేవలం వర్గ వైరుధ్యాల ఫలితమని నమ్మాలా? నా అనుభవంలోని ఒక వింత సంఘటనను పేర్కొంటాను. జస్టిస్ పున్నయ్య కమిషన్ ఖమ్మం వచ్చినప్పుడు జరిగిన ఒక సమావేశంలో కమ్యూనిస్టు పార్టీ వారు నన్ను ప్రాంభోపన్యాసం చేయమన్నారు. 

నా ప్రసంగంలో ఒక వాస్తవాన్ని ప్రస్తావించాను. 'ఆనరబుల్ జస్టిస్, మీరు ఖమ్మం జిల్లాలో కుల వివక్ష గురించి పరిశీలించే క్రమంలో ఆల్ ఈజ్ వెల్ వితిన్ ఖమ్మం అనిపిస్తుంది. రెండు గ్లాసుల పద్ధతి కొరకు వెదికితే నిరాశ మిగులుతుంది. ఖమ్మం కేంద్రంగా 50 కిలో మీటర్ల రేడియస్‌లో భూముల రికార్డులు పరిశీలించండి. యాభై ఏళ్ల క్రితం దళితులపేరు మీద ఉన్న ఇనామ్ భూములు ప్రస్తుతం ఈ కమ్యూనిస్టు పార్టీల నాయకుల ఆధీనంలో ఉన్నాయి.

ఫలానా గ్రామంలో మాదిగలకు చెందిన 140 ఎకరాల భూమి ఇప్పుడు ఆ ఊరి కమ్యూనిస్టు నేత చేతిలో ఉంది! ఇలా చాలా గ్రామాలపేర్లు ప్రస్తావిం చి మాకు ఈరోజు అగ్రకులాల గ్లాసుల్లో నీళ్ళు, చాయ్ త్రాగాలనే కోరిక ఏ మాత్రం లేదు. రాజ్యాంగ విరుద్ధంగా దళితుల ఇనామ్ భూముల్ని, సారా తాపించి, ఆ కుటుంబంలో తల్లీ బిడ్డలకు తెలియకుండా కొనడం నేరం. కమ్యూనిస్టులమనుకునే వాళ్ళు అసలే ఈ పనులు చేయకూడద'ని అన్నాను. ఏ పార్టీ అయితే ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసిందో ఆ పార్టీ నాయకత్వమే ఆ సమావేశాన్ని బాయ్‌కాట్ చేపింది! 

తెలంగాణ సాయుధ పోరాటకాలంలో నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ ప్రాంత దళ కమాండర్ (ఒక అగ్ర కులస్తుడు) భూస్వాముల భూమిని పంచుతూ తన కులస్తుల భూమి పంపకాన్ని వాయిదా వేశాడు. ఆ దళంలోని ఎస్‌సి, బిసి వర్గాలకు చెందిన సభ్యులు భూపంపకంలో కుల సమస్య గురించి పార్టీ ప్రావిన్షియల్ కమిటీకి ఒక లేఖ రాశారు. సర్ ఆర్థర్ కాటన్ 1850ల్లో గోదావరి, కృష్ణాదులపై బ్యారేజీల నిర్మాణాన్ని పూర్తిచేసిన తరువాత ఉభయ గోదావరి, కృష్ణా గుంటూరు జిల్లాల్లో చిన్న, మధ్య తరగతి రైతులుగా ఉన్న ఒక సామాజికవర్గం వారు 1930 నాటికి పీజెంట్ బూర్జువాలుగా అభివృద్ధి చెందారు.

నిడుబ్రోలులో ఎన్‌జి రంగా స్థాపించిన రైతు శిక్షణాలయంలో తెలంగాణలోని నీటి వనరుల గురించి, సారవంతమైన భూముల గురించి సమాచారం తెలుసుకొని తెలంగాణను దోచుకోవడానికి బాటలు వేశారు. ఆంధ్ర వలసల్ని సాఫీగా సాగించడానికి ఈ పీజెంట్ బూర్జువాలకు 'విశాలాంధ్రలో ప్రజారాజ్యం' అనే కుట్రపూరిత నినాదం తోడ్పడింది.

తదనంతర కాలంలో ఈ పీజెంట్ బూర్జువాలే సోవియట్ యూనియన్, తూర్పు యూరోప్ కమ్యూనిస్టు దేశాలకు వరిధాన్యం, పొగాకు ఎగుమతులు ప్రారంభించారు. 1970ల్లో మాదాల నారాయణస్వామి నాయకత్వంలో సిపిఐ (ఎంఎల్) పార్టీ ఒకటి ఉనికిలోకి వచ్చిన తరువాత గుంటూరు పొగాకు కమ్యూనిస్టు చైనాకు ఎగుమతవడం ప్రాంభమయింది.

ఏతా వాతా తెలంగాణప్రాంత శ్రామిక కులా ల శ్రమ పెట్టుబడిని కోస్తా జిల్లాల అగ్రకుల కమ్యూనిస్టు నాయకత్వం బాగా ఉపయోగించుకొంది. ఆ శ్రామిక కులాల వారి త్యాగాలను తమ కులాల నుంచి అభివృద్ధి చెం దిన పీజెంట్ బూర్జువాల ప్రయోజనాలను కాపాడడానికి ఉపయోగించుకున్నారు, ఉపయోగించుకుంటున్నారు. రైతు సంఘాలను, రైతు కూలీల సంఘాలను, ఫ్యాక్టరీ యజమానుల సంఘాలను, ఆ ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మిక సంఘాలను కమ్యూనిస్టు పార్టీ లే నిర్వహిస్తున్నాయి! వామపక్షపార్టీలు చెప్పేవి వర్గ రాజకీయాలు (మార్క్సిజం), చేసే వి కుల రాజకీయాలు (మనువాదం) అనడానికి ఇంతకన్నా ఇంకేమి రుజువు కావాలి? 

మార్క్సిస్ట్ విశ్లేషణకు శ్రమ, ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలు అనేవి ప్రాథమిక అంశాలు. మరి ఈ దేశంలో శ్రమ ఎవరిది? అంటే ఏ కులాలది? ఉత్పత్తి సాధనాలు ఏ కులాల చేతిలో ఉన్నాయి? ఉత్పత్తి ఏ కులాల స్వంతం? భారతీయ సమాజంలో శ్రామి క కులాలు, శ్రమ దోపిడీకులాల విభజనలో సమస్యేమిటి? సమస్యలేదు. నిజానికి స్పష్టత ఉంది.

1919లోనే ప్రాచ్య జాతుల గురించి లెనిన్ ఏమి చెప్పారో చూడండి: 'తూర్పు జాతుల ప్రజల్లో అధిక సంఖ్యాకులు శ్రామిక ప్రజలకు సిసలైన ప్రతినిధులు. వీరు పెట్టుబడిదారీ ఫ్యాక్టరీలు అనే శిక్షణాలయాల్లో శిక్షణ పొందిన కార్మికులు కారు. కానీ మధ్యయుగాలనాటి పీడనకు గురి అవుతూ దోచుకోబడుతున్న శ్రామిక రైతు జన బాహుళ్యానికి సిసలైన ప్రతినిధులు.

జనాభాలో అత్యధిక భాగం రైతులుగా ఉండి, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా కాకుండా, మధ్యయుగాల నాటి అవశేషాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించటం కర్తవ్యంగా ఉన్న పరిస్థితులకు ఆ సార్వత్రక సిద్ధాంతాచరణను వర్తింపచేయాలి. అది కష్టసాధ్యమైన నిర్దిష్ట కర్తవ్యం. అయితే ధన్యవాదాలర్పించవలసిన కర్తవ్యం'.

లెనిన్ పేర్కొన్న రైతు జనబాహుళ్యం మనదేశంలోఎవరు? భూమిలేని, మానవ జీవిత హుందాకు నోచుకోని, ఊరికి దూరంగా ఉండే దళితులు కారా? కమ్యూనిస్టు నాయకులకు, మేధావులకు ఒక విజ్ఞప్తి: మనం కలిసి కదిలిన రోజు, అమాయకంగా ప్రాణాలు కోల్పోతున్న పోలీసు, పారామిలిటరీ దళాలు, దారి తప్పిన సల్వాజుడుం తమ మూల వాసుల మూలాల్లోకి వెళ్ళి ఈ దేశంలో అనాదిగా హతులౌతున్న మూల వాసుల రక్షణకై నిలబడతారు. ఇకనైనా ఎజెండా మార్చండి. 

- ఎమ్. ఎఫ్. గోపీనాథ్
(ఫూలే-అంబేద్కర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఖమ్మం)
Andhra Jyothi News Paper Dated : 8/06/2010 

No comments:

Post a Comment