Wednesday, February 8, 2012

ప్రభుత్వ కపటత్వం
- యస్. జీవన్‌కుమార్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొంటున్న కాకతీయ యూనివర్సిటీకి చెందిన పరిశోధనా విద్యార్థి యాకూబ్ రెడ్డిపై వరంగల్ పోలీసులు అమలుపరిచిన పాశవిక చిత్రహింసపై రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన సి.బి.ఐ విచారణను సుప్రీంకోర్టు నిలిపివేయడం అన్యాయం. హైకోర్టు ఆదేశాలతోనైనా కనీసం విచారణ జరిగి పోలీసుల చిత్రహింసల పర్వం బయటకు వస్తుందని ఆశించిన పౌరుల ఆశలపై అత్యున్నత న్యాయస్థానం నీళ్ళు చల్లింది. 

దేశంలో పోలీసు వ్యవస్థ విచ్చలవిడిగా ప్రవర్తిస్తుందని ప్రజల హక్కులను భంగపరుస్తుందని, ఎన్‌కౌంటర్ల పేరుతో జరిగే హత్యల కట్టు కథల్ని కూడా ఎన్నో మార్లు తప్పుపట్టిన ధర్మాసనం, బాధితుడు యాకూబ్‌రెడ్డి కోరుతున్న కనీస విచారణకు అడ్డు తగలడం గర్హించదగిన విషయం. దేశంలో పోలీసు వ్యవస్థ శిక్షా భయం లేకుండా, విచ్చలవిడిగా నేరాలు చేస్తూ ప్రజలపై చిత్రహింసలు ప్రయోగిస్తూ, ప్రాణాలు హరిస్తుంది అన్న విషయంలో ఎవరికీ అభిప్రాయ భేదాలు లేవు. ఈ శాఖ దుందుడుకు చర్యలు ప్రభుత్వ నిశ్శబ్ద ఆదేశాలతో నే జరుగుతున్నాయన్నది కూడా నిర్వివాద విషయమే. 

ఎమర్జెన్సీ కాలం లో జరిగిన అత్యాచారాలపై భార్గవ కమిషన్ ముందు కన్నభిరాన్ బాధితులతో పోలీసుల అత్యాచారాల కథలు చెప్పిస్తుంటే, పోలీసు నైతిక స్థితికి భంగం వాటిల్లుతుందని ప్రభుత్వం కమిషన్ విచారణను 'ఇన్ కెమెరా'లో జరపమంది. కన్నభిరన్ విచారణ బహిరంగంగా జరగాలని పట్టుపట్టడంతో ప్రభుత్వం విచారణను ఆపివేసిన విషయం తెలిసిందే. పోలీసుశాఖకు శిక్షా భయం లేని నేర ప్రవృత్తిని ఒక విధానంగా అలవాటు చేసింది ప్రభుత్వమే అని హక్కుల సంఘాలు గొంతెత్తి చాటుతూ వస్తున్నాయి. 

మన రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకుంటే, ముఖ్యమంత్రులు, ఎన్‌కౌంటర్ హత్యలు వద్దన్నప్పుడల్లా అవి జరగలేదు. 1978-79లలో ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఎన్‌కౌంటర్లు వద్దంటే జరగలేదు. తరువాత వచ్చిన అంజయ్య, విజయభాస్కరరెడ్డి హయాంలో మూడు నాలుగు జరిగినా ప్రభుత్వ పాలసీగా జరగలేదు. 1984లో యన్.టి.రామారావు ఎన్‌కౌంటర్లు వద్దన్నాడు. ఆ సంవత్సరం ఒక్కటి కూడా జరగలేదు. తరువాత కొనసాగి 1992లో యన్. జనార్ధన్‌రెడ్డి ప్రభుత్వంలో 254కు చేరాయి. 

అనంతరం 1998వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు హయాంలో 275 ఎన్‌కౌంటర్ హత్యలతో పతాకస్థాయికి చేరాయి. అనంతరం రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో పీపుల్స్‌వార్‌తో చర్చలు జరిగిన సందర్భంలో ఎన్‌కౌంటర్లు ఆపుతామని ప్రకటన చేయవలసిందిగా అప్పటి హోం మంత్రి జానారెడ్డిపై పౌరస్పందన వేదిక వత్తిడి తెస్తే ఆ విషయం ముఖ్యమంత్రి గారు చూసుకుంటారని తప్పుకున్నాడు. అంటే ప్రభుత్వ ఆదేశాలతోనే పోలీసులు నిర్భయంగా, స్వేచ్ఛగా అత్యాచారాలకు పాల్పడుతున్నారన్నది కఠోర సత్యం. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సందర్భంగా పోలీసుల అతి ప్రవర్తన, విద్యార్థులపై, ఉద్యమకారులపై దౌర్జన్యం, ప్రజాస్వామిక కార్యకలాపాలపై ఆంక్షలు, అక్రమ కేసులు బనాయించడం, ప్రివెంటివ్ డిటెన్షన్, దేశద్రోహ నేరాలు, చట్టాల ప్రయోగం పూర్తిగా ప్రభుత్వ ఆదేశాలతోనే జరిగింది. ప్రత్యేక తెలంగాణ డిమాండ్ ప్రజాస్వామికమైనదని తెలంగాణ ప్రజల న్యాయమైన ఆకాంక్ష అని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజూ వల్లిస్తూనే నిర్బంధ చర్యలకు పోలీసులకు ఆదేశాలిచ్చింది. ఉద్యమకారులపై అక్రమంగా బనాయించిన కేసులు ఎత్తివేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు ఇచ్చి నిలబెట్టుకోలేదు. 

యాకూబ్‌రెడ్డితో పాటు కాకతీయ యూనివర్సిటీకి చెందిన ఆరుగురు విద్యార్థులపై జరిపిన చిత్రహింసలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతోనే జరిగాయి. ఈ సంఘటనపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో ప్రభుత్వం కపటత్వం పూర్తిగా అర్థమవుతుంది. అభియోగం ఎదుర్కొంటున్న పోలీసు అధికారి హైకోర్టును ఆశ్రయించడాన్ని అర్థం చేసుకోవచ్చు కాని బాధితుడైన పౌరుడు న్యాయం కోసం చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ప్రజాస్వామిక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చా అనే విషయాలు న్యాయకోవిదులు చెప్పవలసిందే. ఇటువంటి ప్రయత్నం చాలా అన్యాయమైనది అనైతికమైనది. ప్రభుత్వ పాలన పట్ల ప్రజలకు అసహ్యం, ఏవగింపు కలిగించే చర్య కూడా. ఒక దుందుడుకు పోలీసు అధికారిని ప్రభుత్వం కాపాడడానికి పూనుకుంటే అటువంటి ప్రభుత్వ పాలనలో పౌరులు తమ హక్కులను కాపాడుకోగలరా అనేది ప్రజాస్వామ్య వాదుల ముందున్న ప్రశ్న. 

అంతర్జాతీయ సంస్థలు, ఐక్యరాజ్యసమితి సంస్థలు, హక్కుల సంఘాలు వత్తిడి చేసిన నేపథ్యంలో 'అంతర్జాతీయ చిత్రహింసల వ్యతిరేక ఒప్పందం - 1975'ను ఆమోదించడం అవసరమని భావించి 'చిత్రహింసల నిరోధక బిల్లు -2010'ను భారత ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. లోక్‌సభ దాన్ని ఆమోదించింది. హక్కుల సంఘాలు ఈ బిల్లులోని అంశాలు నిస్సత్తువగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నాయి. 

కేంద్రంలో పరిపాలిస్తున్న తమ పార్టీ ప్రభుత్వం తెస్తున్న చట్టం విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకపోవడం సిగ్గుపడే అంశం. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని హక్కుల సంఘాలే కాక ప్రజాస్వామిక వాదులు, ప్రతిపక్షాలు ఎండగట్టాలి. శిక్షా భయంలేని పోలీసుల ప్రవృత్తిని ప్రభుత్వం ఎందుకు పోషిస్తుందో అందరం కలిసి నిలదీద్దాం. యాకూబ్‌రెడ్డి విచారణ నిలిపే విషయంలో సుప్రీంకోర్టులో వేసిన కేసును రద్దు చేసుకొని కాస్తంత విజ్ఞత ప్రదర్శంచమని రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి తెద్దాం. 

- యస్. జీవన్‌కుమార్
మానవ హక్కుల కార్యకర్త
Andhra Jyothi News Paper Dated 09/02/2012 

No comments:

Post a Comment