Tuesday, February 28, 2012

ప్రతిష్టంభనలో పెట్టుబడిదారీ వ్యవస్థ---ప్రభాత్‌ పట్నాయక్‌

ప్రతిష్టంభనలో పెట్టుబడిదారీ వ్యవస్థ

గ్రీస్‌లో చోటుచేసు కుంటున్న పరిణామాలు సమకాలీన ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో పేరుకుపోయిన రుగ్మతల్లో ఒక లక్షణం మాత్రమే. పెట్టుబడిదారీ వ్యవస్థలోని రుగ్మతలను సవివరంగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక ఆర్థిక వ్యవస్థగా పెట్టుబడిదారీ వ్యవస్థలో కొన్ని మౌలిక లక్షణాలను లోతుగా అధ్యయనం చేయాలి. పెట్టుబడిదారీ వ్యవస్థలో పెద్దయెత్తున ఒక చోట పోగుపడుతున్న సంపదలో అధిక భాగం ప్రత్యక్షంగా భౌతిక ఆస్తుల రూపంలో ఉండదు. అది పరోక్షంగా భౌతిక ఆస్తుల మీద కెయిమ్స్‌ రూపంలో అనగా డబ్బు, ద్రవ్య ఆస్తుల రూపంలో ఉంటుంది. ఈ పరోక్ష క్లెయిమ్స్‌లో కూడా అనేక దొంతరలు ఉంటాయి. ఒక కర్మాగారం, లేదా భవనం వంటి భౌతిక ఆస్తులపై సంపద కలిగిన వ్యక్తి క్లెయిమ్‌ మీద క్లెయిమ్‌. క్లెయిమ్‌ మీద క్లెయిమ్‌ ఇలా అనేక క్లెయిమ్స్‌ చేస్తుంటాడు. ఈ అన్ని క్లెయిమ్స్‌కు ఒక నిర్దిష్ట విలువ ఉంటుంది. ఈ విలువే అంతిమంగా ప్రాధాన్యత సంతరించు కుంటుంది. అయితే విలువ నిలకడగా ఉండదు, ఎప్పటికప్పుడు మారుతుం టుంది. సరుకుల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. మారేది వాటి విలువలే. అస్థిత్వంలేని బుడగలు (అవి పేలిపోవడాలు) ఈ క్లెయిమ్స్‌ చూపుతుంటాయి. డాట్‌కామ్‌ బబుల్‌, హౌసింగ్‌ బబుల్‌, ఆ తరువాత కుప్పకూలడాలు వంటి పదాల గురించి మనం తరచూ ప్రస్తావిస్తూ ఉంటాం. ఇవి సరకుల ద్రవ్య విలువకు సంబంధించిన అన్ని రకాల క్లెయిమ్స్‌పైనా ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితి పెట్టుబడిదారీ వ్యవస్థలో మరింత అధికంగా ఉంటాయి. అటువంటి పతనాలను ఎలా నిరోధించగలుగుతాం? సరుకులకు సంబంధించి ద్రవ్య విలువను ఎలా నిలకడగా ఉంచగలుగుతాం?
ఏ దేశంలోనైనా వస్తువులకు సంబంధించి ద్రవ్య విలువ ప్రభుత్వ ఆదుపాజ్ఞలకు లోబడి ఉంటుందని భావించడం పొరపాటు. విలువలేని కాగితం ముక్కలు వస్తువులను కొనగలుగుతున్నాయి. దాని మీద ఉన్న ప్రభుత్వ చిహ్నమే ఆ కాగితం ముక్కలకు అంతటి విలువను ఆపాదిస్తోంది. ఈ కాగితాల రూపంలోనే ప్రభుత్వం పన్నులను వసూలు చేస్తోంది. గాడి తప్పిన ద్రవ్యోల్బణం పరిస్థితిని మనం విశ్లేషించాలి. ద్రవ్యోల్బణం కారణంగా ద్రవ్యానికి వస్తు రూపంలో విలువ తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో డబ్బు కలిగి ఉండాలని గానీ, ద్రవ్య ప్రాబల్యం గల ఆస్తులు కలిగి ఉండాలని గానీ ఏ ప్రభుత్వం తన పౌరులను ఆదేశించలేదు. అది మన వ్యవస్థల్లోని అంతర్గత లోపం. నగదు వేతనాలు ఒక నిర్ణీత కాలంలో స్థిరంగా ఉంటాయి. నిదానంగా మాత్రమే పెరుగుతాయి. ఏ ఆర్థికవ్యవస్థలోనైనా ద్రవ్య విలువ ఈ అంశంపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఒక వస్తువు విలువ దానికోసం వినియోగించిన కార్మిక శక్తిపై ఆధారపడి ఉంటుంది.
పెట్టుబడిదారీ వ్యవస్థలో పూర్తి స్థాయి
ఉద్యోగావకాశాలు అసాధ్యం
రిజర్వు కార్మిక సైన్యాన్ని ఏర్పాటుచేసుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ధరలు పెరిగినపుడు వేతనాలు పెంచమని కార్మిక సంఘాలు ఒత్తిడి తీసుకురాకుండా వాటిని బలహీనపరచడం ఈ రిజర్వ్‌ సైన్యం నిర్వహించే పాత్ర. పెట్టుబడిదారీ వ్యవస్థలో పూర్తి స్థాయిలో ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు. పెట్టుబడిదారీ వ్యవస్థలో పూర్తి స్థాయి ఉద్యోగావకాశాలను ద్రవ్య విలువతో పోల్చడం సాధ్యం కాదు.
అయితే, నగదు వేతనాలు అంటే కార్మిక శక్తి విలువ ప్రతి దేశంలో ఒకే విధంగా ఉన్నంతమాత్రాన సరిపోదు. ఒక దేశంలో కార్మిక శక్తి వినియోగం ఆ దేశంలో అమలులో ఉన్న వేతనాల రేటు (మారకపు రేటుకు అనుగుణంగా) డాలరు ధరకు సరుకులను ఉత్పత్తి చేస్తే ఆ డాలరు ప్రాతిపదికపైనే ఆ సరుకులను విక్రయించాల్సి ఉంటుంది. అయితే ఆ సరుకులను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోతే ఆ దేశంలో ఆ ఆస్తుల యాజమాన్య హక్కులు పొందినవారు వ్యాకులత చెందుతారు. వారు ఉత్పత్తి చేసిన వస్తువులపై ఆస్తుల విలువ ఆధారపడి ఉంటుంది. అయితే సరుకులు అమ్ముడుపోకపోతే అంతర్జాతీయంగా ఎటువంటి విలువ ఉండదు. ఇలా అమ్ముడుపోని వస్తువులు, అంటే నగదు రూపంలో మార్చుకోవడానికి వీలులేని వస్తువులు ద్రవ్యంతో సమానం కాలేవు.
ఒక దేశంలో ఫైనాన్షియల్‌ ఆస్తులపై హక్కులు గలవారు ఆ హక్కులు గలిగి ఉండటంపై ప్రతిబంధకాలను ఎదుర్కొంటుంటే (ఇటువంటి సందర్భాల్లో వారికి మిగిలి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం సరుకులను విక్రయించకుండా తమ వద్దే ఉంచుకోవడం), లేదా తమ హక్కులను ఒక దేశం నుండి మరొక దేశానికి బదిలీ చేసుకోగలిగితే, అంటే, పెట్టుబడులను స్వేచ్ఛగా ప్రపంచంలోని దేశాల మధ్య బదిలీ చేసుకోవడానికి అవకాశముంటే, ఏ దేశంలోనైనా నగదు రూపంలో చెల్లించే వేతనాలు స్థిరంగా ఉండటమే కాదు, వాటికి ఒక కచ్చితమైన స్థాయి కూడా ఉండాలి. ఆ స్థాయి మారకపు విలువకు అనుగుణంగా ఉండాలి. ఈ మారకపు రేటు అంతర్జాతీయంగా సరితూగే విధంగా ఉండాలి.
ఇక్కడ ఒక విషయం గమనించాలి. అంతర్జాతీయ పోటీతత్వం అనే పదానికి పెద్దగా విలువ లేదు. ఒక వస్తువును పరిగణనలోకి తీసుకుంటే ఒక దేశం అంతర్జాతీయ పోటీకీ సరి తూగేదిగా ఉండవచ్చు. అయితే ఆ దేశంలో ఉత్పత్తి అయిన సరుకులు అంతర్జాతీయంగా అమ్ముడుపోకపోవచ్చు. అందుకు అనేక కారణాలుంటాయి. ఆ వస్తువు మీద ఇష్టం లేకకావచ్చు లేక ఆ వస్తువు గురించి తెలియకపోవడం వల్ల కావచ్చు. అందువల్ల ఒక దేశంలోని ఆస్తులపై హక్కును ప్రకటించుకునే వ్యక్తులు చెల్లింపుల పరిస్థితిని ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు. వేతన ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ వారు ఇతర దేశాలకు తరలివెళ్లేందుకు ఆసక్తి చూపుతారు.
ఏదైనా ఒక దేశం చెల్లింపుల సమతుల్య పరిస్థితి ఆ దేశం తీసుకునే చర్యలపైనే పూర్తిగా ఆధారపడి ఉండదు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది. మొత్తం డిమాండ్‌ పడిపోయిందంటే, కొన్ని దేశాల ఉత్పత్తులకు డిమాండ్‌ పడిపోయిందని అర్థం చేసుకోవాలి. అంతర్జాతీయ పోటీతత్వానికీ, దీనికీ సంబంధం లేదు. అయితే ఇక్కడ చెల్లింపుల సమతుల్య పరిస్థితి ఎదురవుతుంది. ఉదాహరణకు, అమెరికా ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గిస్తే ఒక వస్తువుకు ప్రపంచ డిమాండ్‌ తగ్గుతుందని భావిద్దాం. ఇందువల్ల అమెరికాలో కొంతమంది అధికారులు తమ ఉద్యోగాలు కోల్పోతారు. లేదా వారి ఆదాయం తగ్గిపోతుంది. వారు తమ సెలవులను గ్రీస్‌ దేశంలో ఉల్లాసంగా గడిపేందుకు వెళితే, వారు పెట్టే ఖర్చు గ్రీస్‌ చెల్లింపుల పరిస్థితిని మరింత జటిలం చేస్తుంది. దీనికీ, గ్రీస్‌ అంతర్జాతీయ పోటీకి సరితూగడానికీ ఎటువంటి సంబంధం ఉండదు. పోటీతత్వమే చెల్లింపుల పరిస్థితిని నిర్ణయిస్తుందనే ప్రధాన స్రవంతి ఆర్థిక సిద్ధాంతం పూర్తిగా తప్పుల తడక అనే చెప్పాలి. గ్రీస్‌లో పెట్టుబడులు విదేశాలకు తరలిపోకుండా చూసేందుకై గ్రీస్‌ ప్రభుత్వం తమ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ తగ్గేందుకు చర్యలు తీసుకోవాలి. తద్వారా దిగుమతులపై ఆధార పడాల్సిన పరిస్థితి ఆ దేశానికి ఉండబోదు. ఫలితంగా, చెల్లింపుల సమస్య తీవ్రత తగ్గుతుంది. గ్రీస్‌లో పెట్టుబడిదారులు దీనినే డిమాండ్‌ చేస్తు న్నారు. అయితే ఇందువల్ల గ్రీస్‌ ప్రజలపై అనివార్యంగా భారాలు పెరుగుతాయి. ఇప్పటికే గ్రీస్‌లో ఉత్పత్తి అయ్యే వస్తువులకు ప్రపంచదేశాల్లో డిమాండ్‌ తగ్గిపోయింది. ఈ చర్య వల్ల నిరుద్యోగం పెరిగి, వినియోగం పడిపోయే అవకాశాలున్నాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభం కూడా తీవ్రమయ్యే అవకాశం ఉంది.
కార్మికుల సంఖ్యను తగ్గించడం
ఈ ఉదాహరణలో గ్రీస్‌ ముందు మరో రెండు ప్రత్యామ్నాయాలున్నాయి. మారకపు రేటుపై ప్రభావం చూపకుండా నగదు వేతనాలను తగ్గించడం ఇందులో ఒకటి. ఇందువల్ల ఇతర దేశాలతో పోలిస్తే గ్రీస్‌లో వస్తువుల ధరలు తక్కువగా ఉంటాయి. చెల్లింపుల పరిస్థితి కూడా మెరుగుపడవచ్చు. అయితే, నగదు వేతనాల్లో తగ్గుదల కంటే సరుకుల ధరలు ఎక్కువగా తగ్గుతాయి. కార్మికుల సంఖ్యను తగ్గించడం వల్ల కూడా ఇదే ఫలితం సంభవిస్తుంది. మారకపు రేటును తగ్గించడం మరో మార్గం. అయితే ప్రస్తుత పరిస్థితిలో గ్రీస్‌లో ఇది సాధ్యం కాదు. గ్రీస్‌ తనకంటూ ప్రత్యేకంగా కరెన్సీ లేని దేశం, యూరోపియన్‌ దేశాల ఉమ్మడి కరెన్సీగా యూరో ఉంది. మారకపు రేటు తగ్గించాలంటే వేతనాలను కూడా తగ్గించాల్సి ఉంటుంది. డిమాండ్‌ పెరగకపోతే గ్రీస్‌ నేడు ఎదుర్కొంటున్న పరిస్థితినే అనేక ఇతర దేశాలు ఎదుర్కొంటాయి. ఏతావాతా, మారకపు రేటును తగ్గించడం వల్ల అదే పరిస్థితిలో ఉన్న ఇతర దేశాలు అందుకు ప్రతీకార చర్యలు తీసుకునే అవకాశం ఉంది. చెల్లింపుల పరిస్థితిలో మిగులు ఉన్న దేశాలు కూడా నిరుద్యోగం, మాంద్యం ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. అవి కూడా తమ మార్కెట్లను కోల్పోవడం ఇష్టం లేక ప్రతీకార చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది. స్థూలంగా, విదేశీ మారక రేటు తగ్గించడం అంటే, పొరుగువాడిని దేబిరించడమే. ప్రపంచం మాంద్యం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఇటువంటి చర్య తీసుకుంటే, అది ఇతర దేశాలతో శత్రుత్వాన్ని కొనితెచ్చుకోవడమే కాగలదు.
పెట్టుబడి, ముఖ్యంగా ఫైనాన్స్‌ స్వేచ్ఛగా ఏ ప్రాంతానికైనా మళ్లే అవకాశం ఉండే ప్రపంచంలో ఆరంభంలో డిమాండ్‌ తగ్గితే, పొదుపు చర్యల ద్వారా దానిని భూతద్దంలో పెట్టి చూపడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రతి ప్రభుత్వం చేసేది పొదుపు చర్యలను ప్రవేశపెట్టడమే. దేశీయ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి. నేడు గ్రీస్‌లో మనం ఇదే పరిస్థితిని చూస్తున్నాం. అక్కడ సంక్షోభం పేరుతో ప్రభుత్వం పొదుపు చర్యలను ప్రవేశపెడుతోంది. ఇందులో రెండు అంశాలను గమనించాలి. ఫైనాన్స్‌ క్యాపిటల్‌ ప్రయోజనాల కోసమే పొదుపు చర్యలను ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వం తీసుకునే పొదుపు చర్య, దిగజారిపోయే కార్మికుల స్థితిగతులు పెట్టుబడిదారీ వ్యవస్థ సామర్ధ్యాన్నే ప్రశ్నిస్తున్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక నిర్దిష్ట ప్రణాళికకు అనుగుణంగా రూపొందిన వ్యవస్థ కాదు. అది దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా స్వచ్ఛందంగా రూపొందిన ఒక వ్యవస్థ. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే, అసలు ప్రపంచ యుద్ధాలు వచ్చి ఉండేవి కావు.
ఇక రెండో అంశం, పూర్తిగా సాంకేతిక పరమైంది. గ్రీస్‌ స్వతంత్రంగా ఒక కేంద్రీయ బ్యాంకు కలిగి ఉంటే ప్రభుత్వం ఆ బ్యాంకు నుండే రుణాలు చేసి ఉండేది. విదేశీ బ్యాంకులకు రుణపడే సమస్య ఉత్పన్నమై ఉండేది కాదు. పొదుపు చర్యలను ప్రకటించాల్సిన పరిస్థితీ తలెత్తేది కాదు. చెల్లింపుల పరిస్థితి కారణంగానే దేశ రుణ సమస్య తలెత్తింది. అనేక దేశాల పరిస్థితి కూడా ఇదే. ప్రభుత్వం విదేశీ బ్యాంకుల నుండి కాకుండా కేంద్ర బ్యాంకు నుండి రుణం స్వీకరించి ఉంటే, గ్రీస్‌ తన చెల్లింపుల పరిస్థితిని ఎదుర్కొనేందుకు విదేశాల నుండి రుణం సేకరించేందుకు అవకాశం ఉండేది. దిగుమతులు తగ్గుతున్నా, ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గించుకోకపోవడం వల్ల చెల్లింపుల పరిస్థితి ఏర్పడి ఉండేది. ప్రభుత్వం చేసే రుణం దీంతో సమానంగా ఉండేది. దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అదనంగా కరెన్సీ ముద్రించడంతో సమస్య పరిష్కారమై ఉండేది..
-ప్రభాత్‌ పట్నాయక్‌
Prajashakti News Paper Dated 29/2/2012

No comments:

Post a Comment