Friday, November 21, 2014

మన కాలం బోధిసత్వుడు - డాక్టర్‌ కదిరె కృష్ణ

కులమత వర్గరహిత వ్యవస్థను సాకారం చేయగలిగేది బౌద్ధం. రాహుల్‌ సాంకృత్యాయన్‌ చెప్పినట్లు మార్క్సిజం బాగా అర్థమైతే బౌద్ధం బాగా అర్థమైనట్లే! కారణం ఈ రెండిటిలో చాలా విషయాలు కామన్‌గా ఉన్న భౌతికవాదం ప్రధానమైనది. ఈ సారాన్ని బాగా ఒంట బట్టించుకున్న వ్యక్తి ‘దొమ్మేటి సత్యనారాయణ బోధి’.
బోధి మొదట సంప్రదాయ హిందూ కుటుంబ ఆచారాలు కలవాడైనా బౌద్ధం పరిచయమైనప్పటి నుంచీ అదే జీవితంగా జీవించిన త్యాగశీలి. నిజానికి బౌద్ధం అంటే త్యాగం. మానవుడు తన భౌతికావసరాలను ప్రకృతి నుంచి పొంది ప్రకృతిలో కలిసిపోవడం,. ఈ మధ్యలో జీవితం నిస్వార్థంగా ఉండడం, ‘స్వంతం’ అనేది లేని సమాజహిత జీవనమే బౌద్ధం. ఇటువంటి జీవితం ఏ కొందరికో సాధ్యమవుతున్న ప్రస్తుత తరుణంలో స్మరించుకోవల్సిన వ్యక్తి సత్యనారాయణ బోధి.
యావద్భారతదేశంలో బౌద్ధ ప్రచాలనకు ఆయన దాదాపు రెండు దశాబ్దాలుగా కృషి చేశారు. అంతకు పూర్వం ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడిగా, మార్క్సిస్టుగా ఆదర్శ జీవితం గడిపారు. 1926లో తూర్పుగోదావరి జిల్లా అమలాపురం తాలూకా వక్కలంక గ్రామంలో దొమ్మేటిసుబ్రహ్మణ్యం, మాచరమ్మ దంపతులకు సత్యనారాయణ జన్మించారు. 1952 నుంచి 1984 వరకు రైల్వే శాఖలో వివిధ ఉద్యోగాలు నిర్వహించారు ఎస్‌.ఇ రైల్వేలో షాప్‌ సూపరింటెండెంట్‌గా ఉద్యోగ విరమణ చేశారు.
స్వాతంత్ర్యానికి పూర్వం బెంగాల్‌-నాగపూర్‌ రైల్వేలో పనిచేస్తున్న కాలంలో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. ట్రేడ్‌యూనియన్‌ రంగంలో కార్మికులను ముఖ్యంగా సూపర్వైజర్‌ క్లాస్‌ని సమకట్టి హక్కుల సాధన పోరాటంలో తిరుగులేని నాయకత్వం వహించారు. ఈ క్రమంలోనే 1974 మేలో దేశవ్యాప్తంగా జరిగిన చరిత్రాత్మక రైల్వే సమ్మెలో బలంగా పనిచేయడంతో ఉద్యోగం కోల్పోయారు. ఆ తరువాత జనతా ప్రభుత్వ హయాంలో తిరిగి ఉద్యోగం పొందగలిగారు. బెంగాల్‌ ప్రాంతంలో పనిచేస్తున్న క్రమంలో హేమాహేమీలైన కమ్యూనిస్టు నాయకులందరితో కలిసిపనిచేశారు. వారి ఉపన్యాసాలు వినడమే కాదు తాను వారితో కలసి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చినట్లు నాతో చెప్పారు. మాజీ కేంద్ర మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ ఈయన సహచరుడు. 1984లో ఉద్యోగ విరమణ చేసిన తరువాత సత్యనారాయణ బౌద్ధం వైపు మళ్లారు. 1992 నుంచి ఆయన పూర్తిగా బౌద్ధం ప్రచారంలో మునిగిపోయారు. కేవలం బౌద్ధ ప్రచాలనకే పరిమితం కాక బౌద్ధ సిద్ధాంతాల వ్యాఖ్యానం, అపార జ్ఞానసంపద ఈయన సొంతం. సత్యనారాయణ బోధి రేడియోలో బౌద్ధాన్ని ప్రబోధిస్తుంటే భగవద్గీతను గానం చేసిన ఘంటసాలను మైమరిపిస్తారు. 1994-95లో దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదికకు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. ఏ పని చేసినా ఆయనలో నిండైన చిత్తశుద్ధి, నిబ్బరం, వినయశీలత తొణికిసలాడేది.
1996 మే20న విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రం ఏర్పాటు చేసిన ‘మత సామరస్యం- జాతీయ సమగ్రత’ అంశంపై బౌద్ధరీతిలో ప్రారంభమైన ఆయన ఉపన్యాసాలు మొన్నటివరకూ కొనసాగాయి. ఎందరో ఔత్సాహిక బౌద్ధ ప్రచారకుల ప్రసంగాలను ఆయన ప్రోత్సాహంతో తెలుగు సమాజం వినగలిగింది. 1996లో కలకత్తాలోని ‘మహాబోధి’ నిర్వహించిన ‘లే బుద్ధిస్ట్‌ లీడర్స్‌ కాన్ఫరెన్స్‌’లో బోఽధి సమర్పించిన సిద్ధాంత వ్యాసం ఎంతో కీలకమైనదిగా బౌద్ధ నిష్ణాతులు కొనియాడారు. 2001లో ఒక అంతర్జాతీయ సదస్పులో ‘బౌద్ధం-మానవాళి భవిష్యత్తు’ అనే అంశంపై ఆయన సమర్పించిన పరిశోధనాత్మక వ్యాసం పలువురి ప్రశంసలు అందుకుంది. 1997లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన ‘లుంబిని ఉత్సవం’లో ప్రపంచంలోని వివిధ దేశాల బౌద్ధ ప్రతినిధులు పాల్గొనగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి పాల్గొన్న ఏకైక ప్రతినిధి సత్యనారాయణ బోధి. 2004లో కాకతీయ విశ్వవిద్యాలయంలో ‘బౌద్ధ దర్శనం పునాదులు’ అనే పరిశోధనాత్మక వ్యాసం బౌద్ధ సంస్కృతిలోని ప్రాధాన్యాలను వివరణాత్మకంగా మనముందుంచింది. బోఽధి సారథ్యంలో సారనాథ్‌లో జరిగిన 2007 వార్షిక సమావేశాలు చరిత్రాత్మకమైనవి. బౌద్ధంలోని పారమితలపై సత్యనారాయణ బోధి వ్యాఖ్యానం నభూతో నభవిష్యతి. ఆంగ్ల మూలంలోని అనేక బౌద్ధ గ్రంథాలను ఆయన ఆంధ్రీకరించారు. బోధి రేడియో ప్రసంగాలు ‘బౌద్ధచింతన’ పేరుతో పుస్తకరూపం ధరించాయి. బౌద్ధ భిక్షువులు ఆయన సేవను గుర్తించి ‘ధర్మ ప్రియ’ బిరుదుతో కలకత్తాలో సన్మానించారు. నిజజీవితంలో బౌద్ధ ఆచారాలకు సంబంధించి జీవితంలో ప్రతి సందర్భాన్ని ఆచ రించే విధంగా వ్యాఖ్యానించారు. పుట్టుక నుంచి ప్రతి సందర్భంలో బౌద్ధం ఎలా ఆచరించాలో చాలా స్పష్టంగా విశదీకరించారు. పాళీ భాషలో ఆయనకు గల విశేష జ్ఞానం అందుకు సహకరించింది.
బౌద్ధ సారస్వతనిధి దొమ్మేటి సత్యనారాయణ బోధి. బౌద్ధ ధర్మం పట్ల ఆయన ఎంతో అంకిత భావంతో ఉండేవారు. కొన్ని వేల కరపత్రాలు, చిన్న బుక్‌లెట్లు ప్రచురించి ఉచితంగా పంపిణీ చేశారు. ఆఽధునిక సమాజాన్ని పీడిస్తున్న ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, అలౌకిక ధోరణులు, అప్రజాస్వామ్య ఆలోచనలను నిర్మూలించడానికి, మానవతా విలువల పరిరక్షణకు బుద్ధుని ప్రబోధాలు మందు వంటివని బోధి విశ్వసించారు. నిష్పక్షపాత బుద్ధితో బౌద్ధాన్ని వ్యాఖ్యానించడం ఆయన ప్రత్యేకత. దేశవ్యాప్తంగా వివిధ బౌద్ధ సంఘాల నాయకులతో, మాంగ్‌లతో ఆయనకు సత్ససంబంధాలు ఉండేవి. బౌద్ధ మాంగ్‌లను బౌద్ధం విషయంలో నిలదీసేంతటి విషయ పరిజ్ఞానం గల మన కాలం బోధిసత్వుడుగా ఆయనను అభివర్ణిస్తారు. బోఽధిసత్వ గుణ సంపన్నుడు. ఆయన మాట, అక్షరం ప్రసన్నంగా, మానవ జీవితంలోని పరిమళాలను వికసింపజేసే విధంగా ఉంటాయి. తాను మాత్రమే గాక తన కుటుంబాన్నీ అదే మార్గంలో నడిపించిన ఆదర్శవంతుడు. స్వచ్ఛమైన మానవ జీవితానికి భాష్యం చెప్పుతూ జీవితాంతం అణగారిన బీద ప్రజానీకానికి అండగా అరమరికలులేని, సమసమాజం కోసం అనునిత్యం తపించిన మంచి మనిషి సత్యనారాయణ బోధి. ఈ నెల 13న కాకినాడలో ఆయన పరినిర్వాణం పొందారు. బోఽధి సేవలు, కృషి, ప్రేమ, కరుణ, దయశీల, ప్రజ్ఞ ఎందరికో ఆదర్శమైంది. అదే ఆయన్ను చిరస్మరణీయున్ని చేస్తుంది. నమో తస్స సమ్మసంబుద్ధస్స.
- డాక్టర్‌ కదిరె కృష్ణ
Andhra Jyothi Telugu News Paper Dated : 20/11/2014 

No comments:

Post a Comment